* పాకిస్థాన్లో కూర్చొని మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసిన వారి స్థావరాలను మన ఆర్మీ నాశనం చేసింది: పీఎం
* భారతీయ పుత్రికల సిందూర శక్తిని పాకిస్థాన్‌తోపాటు ప్రపంచమంతా చూసింది!: పీఎం
* మావోయిస్టుల హింస పూర్తిగా అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు... ఎలాంటి అడ్డంకులు లేకుండా శాంతిభద్రతలు, విద్య, అభివృద్ధి ప్రతి గ్రామానికీ చేరుకుంటాయి: పీఎం
* పాట్నా విమానాశ్రయాన్ని ఆధునికీకరించాలని బీహార్ ప్రజలు దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరింది: పీఎం
* మా ప్రభుత్వం బీహార్లో మఖానా రైతులకు ప్రయోజనం కలిగేలా మఖానా బోర్డును ప్రకటించింది..

శ్రమజీవులు... స్వాభిమానులైన బీహార్‌ సోదరీసోదరులారా... మీకందరికీ శుభాకాంక్షలు!

   బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జీతన్ రామ్ మాంఝీ, శ్రీ లల్లన్ సింగ్, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ సతీష్ చంద్ర దూబే, శ్రీ రాజ్‌భూషణ్ చౌదరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరీ, శ్రీ విజయ్ కుమార్ సిన్హా సహా కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నా ప్రియ బీహార్ సోదరీసోదరులారా!

   ఈ పవిత్ర భూమి మీదినుంచి బీహార్ ప్రగతికి నవ్యోత్తేజమిచ్చే అదృష్టం ఈ రోజు నాకు దక్కింది. ఈ మేరకు రూ.50 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులలో కొన్నిటిని ప్రజలకు అంకితం చేయడంతోపాటు మరి కొన్నిటికి పునాది వేశాను. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరంతా పెద్ద సంఖ్యలో వచ్చారు. మీ ఆప్యాయత, బీహార్ ప్రేమాభిమానాలు నాకు సదా గౌరవనీయాలు. తల్లులు, అక్కచెల్లెళ్లు ఇంత భారీ సంఖ్యలో హాజరు కావడాన్ని బట్టి, ఇప్పటిదాకా బీహార్‌లో నేను పాల్గొన్న అన్ని కార్యక్రమాలకూ ఇది తలమానికం. ఇందుకుగాను మిమ్మల్నందరినీ ప్రత్యేక గౌరవంతో చూస్తున్నాను. మీతోపాటు  ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
 

మిత్రులారా!

ఈ ససరామ్‌ పేరులో శ్రీరాముడున్నాడు. ఇక్కడి ప్రజలకు రాముడు, ఆయన వంశ సంప్రదాయం ‘ప్రాణ్‌ నజాయే... పర్‌ వచన్‌ న జాయే’ (ప్రాణం పోయినా, ఇచ్చిన మాట తప్పరాదు) గురించి చక్కగా తెలుసు. శ్రీరాముడు పాటించిన ఈ సంప్రదాయం నేడు నవ భారత్‌ విధానంగా మారింది. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడికి అమాయక పౌరులు అనేకమంది బలయ్యారు. ఈ దారుణ మారణకాండ మరుసటి రోజున నేను బీహార్‌ వచ్చాను... ఈ గడ్డమీది నుంచి ఇక్కడి ప్రజల కళ్లలోకి చూస్తూ, ఉగ్రవాద సూత్రధారులు దాక్కున్న ప్రదేశాలను నేలమట్టం చేస్తానని ప్రపంచమంతటికీ తెలిసేలా ప్రతిజ్ఞ చేశాను. వారు కలలోనైనా ఊహించని రీతిలో మట్టికరిపిస్తామని కూడా దేశానికి మాట ఇచ్చాను. ఈ రోజు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి మరీ, మరోసారి బీహార్‌ గడ్డమీద పాదం మోపాను. పాకిస్థాన్‌లో నక్కి, మన సోదరీమణుల సిందూరం తుడిచేసిన వారిని, వారి రహస్య స్థావరాలను మన సైన్యం రాళ్లగుట్టలుగా మార్చేసింది. ఆ విధంగా ప్రపంచానికి, పాకిస్థాన్‌కు భారతీయ కుమార్తెల సిందూర శక్తి ఎంతటిదో తెలిసివచ్చింది. పాకిస్థాన్‌ సైన్యం రక్షణలో తాము సురక్షితమని భావించిన ముష్కర మూకను మన సైన్యం ఒక్క దెబ్బతో మట్టికరిపించింది. తద్వారా ఉగ్రవాద ప్రాయోజిత దేశం మన ముందు మోకరిల్లేలా చేసింది. పాకిస్థాన్‌ వైమానిక స్థావరాలను, వారి రహస్య సైనిక స్థావరాలను కేవలం కొన్ని నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. ఇదే నవభారత్‌... ఇదే ఈ నవ భారత్‌ సామర్థ్యం!

నా ప్రియ బీహార్‌ సోదరీసోదరులారా!

ఇది వీర కున్వర్ సింగ్ జన్మభూమి... ఈ మట్టిమీద నివసించే ఎన్నో కుటుంబాలు నిస్వార్థంగా తమ ఇంటి యువతను వేలాదిగా సైన్యంలోకి, ‘బిఎస్ఎఫ్‌’లోకి పంపుతూ దేశ భద్రతకు  తమవంతు త్యాగం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా మన ‘బిఎస్ఎఫ్‌’ అద్భుత శౌర్యపరాక్రమాలను ప్రపంచం కళ్లారా చూసింది. సరిహద్దుల్లో మోహరించిన సాహస ‘బిఎస్ఎఫ్‌’ దళాలు భరతమాత రక్షణ కర్తవ్యంలో అభేద్య దుర్గంగా నిలిచారు. మాతృభూమి సేవా పవిత్ర కర్తవ్య నిర్వహణలో ‘బిఎస్ఎఫ్‌’ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంతియాజ్ మే 10న సరిహద్దులో అమరుడయ్యారు. ఈ బీహార్ సాహస పుత్రుడికి సగౌరవ నివాళి అర్పిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ ద్వారా మన శత్రువుకు భారత్‌ శక్తిసామర్థ్యాలేమిటో తెలిసివచ్చాయని ఇవాళ నేనీ గడ్డమీద నుంచి పునరుద్ఘాటిస్తున్నాను. అయితే, ఇది మన అంబులపొదిలోగల ఒక బాణం మాత్రమేనని శత్రువుకు అర్థం కావాలి. ఉగ్రవాదంపై భారత్‌ పోరు ఆగలేదు... ఆగదు కూడా. ఉగ్రవాదం మళ్ల తోక ఝాడిస్తే, భారత్‌ దాన్ని బొరియలో నుంచి బయటకు లాగి తుదముట్టిస్తుంది.

మిత్రులారా!

దేశానికి శత్రువులు మన నేలమీదనే ఉన్నా, సరిహద్దు ఆవల దాగినా అలాంటి ప్రతి శత్రువుపైనా మన పోరాటం కొనసాగుతుంది. ఇంతకుముందు కూడా హింస, అశాంతికి కారకులైన వారిని మనం నిర్మూలించిన తీరుకు బీహార్ ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. కొన్నేళ్ల కిందటిదాకా ససరాం, కైమూర్ సహా పొరుగు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలిసిందే. నక్సలిజం ఎంత తీవ్రంగా ఉండేది! ముసుగులు ధరించిన నక్సలైట్లు తుపాకులు చేతబట్టి, ఎప్పుడు.. ఎక్కడ దాడి చేస్తారోనని అందరూ భయాందోళన చెందేవారు. ప్రభుత్వ పథకాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి.. కానీ, అవి ప్రజలకు చేరలేదు. నక్సల్ ప్రభావిత గ్రామాల్లో ఆస్పత్రి లేదా మొబైల్ టవర్ వంటివి కనిపించవు. కొన్ని సందర్భాల్లో పాఠశాలలను కూడా దహనం చేసేవారు. మరికొన్ని సార్లు రహదారులు నిర్మించే వారిని బలిగొనేవారు. వీళ్లకు బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంపై నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల నడుమన ఇక్కడ అభివృద్ధి లక్ష్యంగా శ్రీ నితీష్ కుమార్‌ తన వంతు కృషి చేశారు. అలాగే 2014 తర్వాత ఈ దిశగా మేం వేగంగా చర్యలు చేపట్టాం. మావోయిస్టుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసి, వారిని శిక్షించడం ప్రారంభించాం. యువతను ప్రధాన ప్రగతి స్రవంతిలోకి తెచ్చాం. ఈ 11 సంవత్సరాలుగా ఆ నిబద్ధత ఫలాలను దేశం అనుభవిస్తోంది. దేశంలో 2014కు ముందు 125కుపైగా జిల్లాల్లో నక్సల్స్ ప్రాబల్యం ఉండేది... ఇప్పుడది 18 జిల్లాలకు పరిమితం. ఆయా జిల్లాల్లో ప్రభుత్వం రహదారులు నిర్మిస్తోంది... యువతకు ఉపాధి కల్పిస్తోంది. మావోయిస్టు హింస సంపూర్ణ నిర్మూలన ఎంతో దూరంలో లేదు. ప్రతి గ్రామానికీ ఇకపై శాంతి, భద్రత, విద్య, అభివృద్ధి ఎలాంటి ఆటంకాలూ లేకుండా సమకూరుతాయి.
 

మిత్రులారా!

శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉంటేనే ప్రగతికి కొత్త బాటలు పడతాయి. బీహార్‌లో శ్రీ నితీష్ నాయకత్వాన ఆటవిక రాజ్యం అంతమైన తర్వాతే ఈ రాష్ట్రం కూడా పురోగమన మార్గంలో ముందంజ వేయడం ప్రారంభించింది. గోతులు నిండిన రహదారులు, అరకొర రైల్వే సౌకర్యాలు, పరిమిత విమాన సంధానం తదితరాలతో కూడిన చీకటి కాలం ఇప్పుడు కాలగర్భంలో కలసిపోయి, క్రమేణా అంతర్ధానం అవుతోంది.

మిత్రులారా!

బీహార్లో ఒకనాటి ఏకైక విమానాశ్రయం పాట్నాలో ఉండేది. నేడు, దర్భంగా విమానాశ్రయం కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాలకు నేరుగా విమాన సదుపాయం లభిస్తుంది. పాట్నా విమానాశ్రయ టెర్మినల్‌ ఆధునికీకరణపై ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ కూడా ఇప్పుడు నెరవేరింది. ఈ మేరకు నిన్న సాయంత్రమే ఆ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. ఈ టెర్మినల్ ద్వారా ఇకపై కోటి మంది ప్రయాణిక కార్యకలాపాలు నిర్వహించవచ్చు. మరోవైపు బిహ్తా విమానాశ్రయం కోసం రూ.1400 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నాం.

మిత్రులారా!

బీహార్‌లో ఇప్పుడు ప్రతి ప్రాంతంలోనూ నాలుగు, ఆరు వరుసల రహదారి నెట్‌వర్క్ సిద్ధమవుతోంది. పాట్నా-బక్సర్, గయాజీ-దోభి, పాట్నా-బోధ్ గయాజీ, పాట్నా-అరా-ససరాం గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ తదితర పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు గంగా, సోన్, గండక్, కోసి సహా అన్ని ప్రధాన నదులపై కొత్త వంతెనల నిర్మాణం కొనసాగుతోంది. వేల కోట్ల విలువైన ఇలాంటి ప్రాజెక్టులు బీహార్‌లో కొత్త మార్గాలు, అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది యువతకు ఉపాధి లభిస్తుండగా, పర్యాటకంతోపాటు వ్యాపార రంగం కూడా ఈ ప్రయోజనాలు పొందుతాయి.

 

మిత్రులారా,

బీహార్ లో రైల్వేల పరిస్థితి కూడా ఇప్పుడు వేగంగా మారుతోంది. నేడు బీహార్ లో ప్రపంచ స్థాయి వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి, రైల్వే లైన్లు రెట్టింపు,  మూడింతలు పెరుగుతున్నాయి. చాప్రా, ముజఫర్ పూర్, కతిహార్ వంటి ప్రాంతాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. సోన్ నగర్ -  ఆండాళ్ మధ్య మల్టీట్రాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఇది రైళ్ల రాకపోకలను వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం 100కు పైగా రైళ్లు ససారంలో ఆగుతున్నాయి. ఆ విధంగా పాత సమస్యలను పరిష్కరిస్తూ రైల్వేలను ఆధునికీకరిస్తున్నాం.

సోదర సోదరీమణులారా,

ఈ పనులు ఇంతకు ముందే జరిగి ఉండొచ్చు. కానీ బిహార్ కు ఆధునిక రైళ్లు అందించాల్సిన వారు, రైల్వేలో నియామకాల పేరుతో మీ భూమిని దోచుకున్నారు. పేదల భూములను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, పేదలను దోచుకోవడం, వారి హక్కులను కొల్లగొట్టడం, వారి నిస్సహాయతను సద్వినియోగం చేసుకోవడం, ఆపై రాచరిక జీవితాన్ని ఆస్వాదించడం - ఇదీ వారి సామాజిక న్యాయ విధానం. గత ఆటవిక పాలకుల అబద్ధాలు, మోసాల పట్ల బీహార్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.

మిత్రులారా,

కరెంటు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. కరెంటు ఉంటేనే పారిశ్రామిక అభివృద్ధి, కరెంటు ఉంటేనే జీవిత సౌలభ్యం సులువవుతుంది. 21వ శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే శతాబ్దం. అందువల్ల అడుగడుగునా కరెంటు అవసరమవుతుంది. గత కొన్నేళ్లుగా బిహార్ లో విద్యుదుత్పత్తికి పెద్దపీట వేశారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే నేడు బీహార్ లో విద్యుత్ వినియోగం 4 రెట్లు పెరిగింది. నబీనగర్ లో భారీ ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టును రూ.30 వేల కోట్ల ఖర్చు తో నిర్మిస్తున్నారు. దీంతో బీహార్ కు 1500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. బక్సర్, పీర్పంచిలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను కూడా ప్రారంభించనున్నారు.

సోదర సోదరీమణులారా,

ఇప్పుడు మా దృష్టంతా భవిష్యత్తుపైనే ఉంది. బీహార్ ను హరిత ఇంధనం దిశగా తీసుకెళ్లాలి. అందుకే కజ్రాలో సోలార్ పార్కును కూడా నిర్మిస్తున్నారు. పీఎం-కుసుమ్ పథకం కింద రైతులకు సౌర ఇంధనం ద్వారా ఆదాయ మార్గాలు కల్పిస్తున్నారు. పునరుత్పాదక వ్యవసాయ ఫీడర్ల నుంచి పొలాలకు విద్యుత్ అందుతోంది. మా కృషి ఫలితంగా ఇక్కడి ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. మహిళలు సురక్షిత భరోసాతో ఉన్నారు.
 

మిత్రులారా,

అధునాతన మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి వస్తే గ్రామాలు, పేదలు, రైతులు, చిన్నతరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే, అవి దేశవిదేశాల్లోని పెద్ద మార్కెట్లకు చేరువ కాగలవు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తే కొత్త అవకాశాలూ ఏర్పడతాయి. గత ఏడాది జరిగిన బీహార్ బిజినెస్ సమ్మిట్ లో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో కంపెనీలు ముందుకొచ్చాయి. పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రజలు కూలీల కోసం వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. రైతులకు కూడా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో వారి ఉత్పత్తులను సుదూర ప్రాంతాలకు కూడా రవాణా చేయవచ్చు.

సోదర సోదరీమణులారా,

బీహార్ రైతుల ఆదాయాన్ని పెంచడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 75 లక్షల మందికి పైగా రైతులకు ఆర్థిక సహాయం అందుతోంది. మా ప్రభుత్వం మఖానా బోర్డును ప్రకటించింది. బీహార్ కు చెందిన మఖానాలకు జీఐ ట్యాగ్ ఇచ్చాం. దీనివల్ల మఖానా రైతులకు ఎంతో మేలు జరిగింది. ఈ ఏడాది బడ్జెట్ లో బిహార్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ను కూడా ప్రకటించాం. ఖరీఫ్ సీజన్లో వరి సహా 14 పంటలకు ఎంఎస్పీని పెంచడానికి రెండు, మూడు రోజుల క్రితమే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర లభించడంతో పాటు వారి ఆదాయం కూడా పెరుగుతుంది.
 

మిత్రులారా,

బీహార్ ను ఎక్కువగా మోసం చేసిన వారు, ఎవరి పాలనలో బీహార్ లోని పేదలు, అణగారిన వర్గాలు బీహార్ ను వీడాల్సి వచ్చిందో, వారే నేడు అధికారం కోసం సామాజిక న్యాయం గురించి అబద్ధాలు చెబుతున్నారు. దశాబ్దాలుగా బీహార్ లోని దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు మరుగుదొడ్లు కూడా లేవు, దశాబ్దాలుగా మన సోదరసోదరీమణులకు బ్యాంకు ఖాతాలు లేవు, బ్యాంకుల్లో వారికి ప్రవేశం కూడా లేకుండా చేశారు. వారిని గుమ్మంలోకి కూడా అనుమతించలేదు. దళిత, వెనుకబడిన తరగతులకు చెందిన చాలా మంది మురికివాడల్లో నివసించేవారు, వారికి సరైన ఇల్లు కూడా లేదు, వారు నిరాశ్రయులయ్యారు, కోట్లాది మందికి ఇళ్ల పైకప్పు కూడా లేదు. ఇదీ బీహార్ ప్రజల దుస్థితి, ఈ బాధ, ఈ కష్టం- కాంగ్రెస్, ఆర్జేడీల సామాజిక న్యాయం ఇదేనా? మిత్రులారా - ఇంతటి నిస్సహాయ స్థితిలో పేదలు బతకాలని బలవంతం చేసే విధానాలను రూపొందించడమంటే ఇంతకంటే పెద్ద అన్యాయం మరొకటి ఉండదు. దళితులు, వెనుకబడినవారి బాధల్ని కాంగ్రెస్, ఆర్జేడీ ఎప్పుడూ పట్టించుకోలేదు. పైగా, బీహార్‌లోని పేదరికాన్ని విదేశీయులకి చూపించేందుకు వారిని ఇక్కడకు తీసుకొచ్చేవారు.  ఇప్పుడు, కాంగ్రెస్ చేసిన పాపాల వల్ల దళితులు, నిర్లక్షితులు, వెనుకబడినవారు వారిని వదిలివేయగా, తమ రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవడానికి వారు మళ్లీ సామాజిక న్యాయం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.

సోదర సోదరీమణులారా,

ఎన్డీయే హయాంలో బీహార్ లోనూ, దేశంలోనూ సామాజిక న్యాయం కొత్త వెలుగు చూసింది. పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాం. ఈ సౌకర్యాలను 100 శాతం లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నాం. నాలుగు కోట్ల కొత్త ఇళ్లు, 3 కోట్ల మంది సోదరీమణులను లఖ్పతి దీదీలుగా తయారు చేసే సంకల్పం, 12 కోట్లకు పైగా ఇళ్లలో కుళాయి కనెక్షన్, 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స, ప్రతి నెలా ఉచిత రేషన్ సదుపాయం తో ప్రతి పేద, నిరుపేద వ్యక్తికి మా ప్రభుత్వం అండగా ఉంటుంది.
 

మిత్రులారా,

ఏ గ్రామాన్నీ అభివృద్ధి చేయకుండా వదిలిపెట్టకూడదని మేం భావిస్తున్నాం. అర్హత కలిగిన ఏ కుటుంబం కూడా ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదు. ఈ ఆలోచనతో బీహార్ ప్రభుత్వం డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ సమగ్ర సేవా అభియాన్ ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రచారంలో ప్రభుత్వం 22 ముఖ్యమైన పథకాలను ఒకచోటకి తీసుకువచ్చి ప్రతి గ్రామం, ప్రతి బస్తీ వరకు చేరుకుంటోంది. ప్రతి దళిత, మహాదళిత, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన పేదల ఇంటికి నేరుగా చేరడం మా లక్ష్యం. ఇప్పటి వరకు 30 వేలకు పైగా శిబిరాలను ఏర్పాటు చేసినట్టు నాకు చెప్పారు. లక్షలాది మంది ఈ ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వమే లబ్ధిదారుల వద్దకు చేరితే ఎలాంటి వివక్ష, అవినీతి ఉండదు. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది.

మిత్రులారా,

బాబా సాహెబ్ అంబేద్కర్, కర్పూరీ ఠాకూర్, బాబూ జగ్జీవన్ రామ్, జేపీల కలల బీహార్ గా మన బీహార్ ను తీర్చిదిద్దాలి. మా లక్ష్యం- అభివృద్ధి చెందిన బీహార్, అభివృద్ధి చెందిన భారతదేశం! ఎందుకంటే, బీహార్ పురోగమించినప్పుడల్లా, భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకుంది. అందరం కలిసి అభివృద్ధి వేగాన్ని మరింత వేగవంతం చేస్తామన్న నమ్మకం నాకుంది. ఈ అభివృద్ధి పనులకు మీ అందరినీ మరోసారి అభినందిస్తున్నాను. రెండు చేతులూ పైకెత్తి పిడికిలి బిగించి నాతో కలసి చెప్పండి.

భారత్ మాతాకీ జై.

ఈ నినాదం దూర దూరాల వరకు వినిపించాలి.

సరిహద్దులోని మన సైనికులు గర్వపడాలి.

భారత్ మాతాకీ జై. భారత్ మాతాకీ జై.

భారత్ మాతాకీ జై.

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Commendable performance of India’s marine exports amid uncertain times

Media Coverage

Commendable performance of India’s marine exports amid uncertain times
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Dr. R. Balasubramaniam Ji and Dr. Joram Aniya Ji on being appointed as Full-time Members of NITI Aayog
May 02, 2026

Prime Minister Shri Narendra Modi has congratulated Dr. R. Balasubramaniam Ji and Dr. Joram Aniya Ji on being appointed as Full-time Members of NITI Aayog.

The Prime Minister noted that their rich experience and deep understanding of various issues will greatly strengthen policymaking. Shri Modi expressed confidence that their contributions will help drive innovation and growth across sectors. He also wished them a very productive and impactful tenure ahead.

The Prime Minister posted on X:

"Congratulations to Dr. R. Balasubramaniam Ji and Dr. Joram Aniya Ji on being appointed as Full-time Members of NITI Aayog. Their rich experience and deep understanding of various issues will greatly strengthen policy making. I am confident their contributions will help drive innovation and growth across sectors. Wishing them a very productive and impactful tenure ahead."