· అందరికీ అవకాశాలను అందించే సార్వత్రిక వేదికలను రూపొందించిన భారత్..
అందరికీ అవకాశాలు, అందరికీ పురోగతి
· ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, అనిశ్చితి ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో భారత్ వృద్ధి
· భారత్ స్వావలంబనను సాధించాలి.. భారత్‌లో తయారు చేయగలిగే ప్రతి ఉత్పత్తీ.. భారత్‌లోనే
· దేశంలో శక్తిమంతంగా రక్షణ రంగ అభివృద్ధి.. ప్రతీ భాగంపై ‘మేడిన్ ఇండియా’ ముద్ర పడేలా వ్యవస్థాగత ఏర్పాట్లు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,

 

ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువ మిత్రులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. 2200 మందికి పైగా ఇక్కడ తమ ఉత్పత్తులు, సేవలను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఈసారి వాణిజ్య ప్రదర్శనకు దేశ భాగస్వామి రష్యా. అంటే ఈ వాణిజ్య ప్రదర్శన ద్వారా మనం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి యోగి గారిని, ఇతర ప్రభుత్వ సహచరులు, సంబంధిత వ్యక్తులందరినీ నేను అభినందిస్తున్నాను.

 

మిత్రులారా,

ఈ రోజు మన మార్గదర్శి పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి. దీన్‌దయాళ్ గారు మనకు అంత్యోదయ మార్గాన్ని చూపించారు. అంత్యోదయ అంటే అట్టడుగు వర్గాల అభివృద్ధి.. నిరుపేదలనూ అభివృద్ధి చేరుకోవాలి.. అన్ని వివక్షలూ అంతం కావాలి. సామాజిక న్యాయ బలం అంత్యోదయలోనే ఉంది. భారత్ ప్రస్తుతం ఈ అభివృద్ధి నమూనానే ప్రపంచానికి అందిస్తోంది.

 

మిత్రులారా,

 

నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మన ఫిన్‌టెక్ రంగం గురించి ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ఈ ఫిన్‌టెక్ రంగం గురించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది సమ్మిళిత అభివృద్ధిని గణనీయంగా శక్తిమంతం చేసింది.. ప్రోత్సహించింది. ప్రతి ఒక్కరినీ ముందుకు తీసుకెళ్ల గల చక్కని వేదికలను భారత్ సృష్టించింది. యూపీఐ, ఆధార్, డిజీ లాకర్, ఓఎన్‌డీసీ వంటి వేదికలు అందరికీ అవకాశాన్ని అందిస్తున్నాయి. అంటే అందరికీ వేదిక.. అందరికీ పురోగతి. నేడు దీని ప్రభావం దేశంలో ప్రతిచోటా కనిపిస్తుంది. మాల్‌లో షాపింగ్ చేసే వ్యక్తి కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు.. రోడ్డుపై టీ అమ్మే వ్యక్తి కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు.. ఒకప్పుడు పెద్ద కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉన్న అధికారిక క్రెడిట్.. ఇప్పుడు పీఎమ్ స్వనిధి ద్వారా వీధి వ్యాపారులకూ అందుతోంది.

 

మిత్రులారా,

 

అలాంటి వాటిలో ఒకటి ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్, అంటే జీఈఎమ్. ఒకప్పుడు ప్రభుత్వం ఏవైనా వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటే అదంతా కొన్ని పెద్ద కంపెనీలకు చెందిన వ్యవహారంలా సాగిపోయేది. ఒక విధంగా అదంతా వారి నియంత్రణలోనే సాగేది. ప్రస్తుతం దాదాపు 25 లక్షల మంది విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు జీఈఎమ్ పోర్టల్‌తో అనుసంధానమై ప్రభుత్వానికి వస్తువులను సరఫరా చేస్తున్నారు. వీరంతా చిరు వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, దుకాణదారులే. భారత ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా వీరు వస్తువులను నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు.. భారత ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తోంది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం జీఈఎమ్ ద్వారా రూ. 15 లక్షల కోట్ల విలువైన వస్తువులు, సేవలను కొనుగోలు చేసిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పోర్టల్‌ ద్వారా మన ఎంఎస్ఎంఈలకు చెందిన చిన్న పరిశ్రమల నుంచి సుమారు రూ. 7 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశాం. గత ప్రభుత్వాల కాలంలో ఇది ఊహించడం కూడా అసాధ్యమే. ప్రస్తుతం దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని చిన్న దుకాణదారులూ తమ వస్తువులను జీఈఎమ్ పోర్టల్‌లో విక్రయిస్తున్నారు. ఇదే నిజమైన అంత్యోదయ.. ఇదే అభివృద్ధికి పునాది.

 

మిత్రులారా,

 

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా భారత్ పురోగమిస్తోంది. ప్రపంచంలో పలు ఆటంకాలు, అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ వృద్ధి అద్భుతంగా ఉంది. ఈ ఆటంకాలు మన దృష్టిని మరల్చలేవు.. అటువంటి పరిస్థితుల నుంచే మనం కొత్త దిశలనూ కనుగొంటున్నాం.. ఈ కొత్త దిశల్లో కొత్త అవకాశాలనూ అందిపుచ్చుకుంటున్నాం. అందుకే ఈ అవాంతరాల మధ్య కూడా నేడు భారత్ రాబోయే దశాబ్దాల కోసం బలమైన పునాదిని నిర్మిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన సంకల్పం.. మన మంత్రం.. స్వయం-సమృద్ధ భారత్. ఇతరులపై ఆధారపడటం కంటే గొప్ప నిస్సహాయత మరొకటి ఉండదు. ఈ మారుతున్న ప్రపంచంలో ఒక దేశం ఇతరులపై ఎంత ఎక్కువగా ఆధారపడి ఉంటే, దాని వృద్ధి అంతగా వెనకబడిపోతుంది. అందుకే భారత్ ఎవరిపైనా ఆధారపడటం ఇకమీదట ఆమోదయోగ్యం కాదు.. మన దేశం స్వయం-సమృద్ధి సాధించాలి.. దేశంలో మనం తయారు చేయగల ప్రతీ ఉత్పత్తిని మన దేశంలోనే తయారు చేయాలి. ప్రస్తుతం నా ముందు అనేక మంది పెట్టుబడిదారులు, వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూర్చుని ఉన్నారు. మీరు ఈ స్వయం-సమృద్ధ భారత్ ప్రచారంలో కీలక భాగస్వాములు. స్వయం-సమృద్ధ భారత్ బలోపేతానికి అనుగుణంగా మీ వ్యాపార నమూనాను అభివృద్ధి చేసుకోవాలని నేను ఈ రోజు మిమ్మల్ని కోరుతున్నాను.

 

మిత్రులారా,

 

మేక్ ఇన్ ఇండియా, తయారీ రంగాలకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తుందో మీ అందరికీ తెలుసు. చిప్స్ నుంచి షిప్స్ వరకు ప్రతిదీ భారత్‌లోనే తయారు చేయాలనుకుంటున్నాం. అందుకే మీ వ్యాపార నిర్వహణ సౌలభ్యం కోసం మేం నిరంతరం కృషి చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం 40 వేలకు పైగా కాలం చెల్లిన నిబంధనలను తొలగించింది. వ్యాపారంలో చిన్న తప్పులకు కూడా మీపై కేసుల నమోదుకు అవకాశం కల్పించే వందలాది నిబంధనలనూ మా ప్రభుత్వం నేరరహితం చేసింది. ప్రభుత్వం మీతో భుజం కలిపి నడుస్తోంది.

 

మిత్రులారా,

 

నాకు కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి.. వాటిని నేను కచ్చితంగా మీతో పంచుకుంటాను. మీరు ఏది తయారు చేసినా.. అది ఉత్తమ నాణ్యతతో, ఉత్తమమైన వాటిలో అత్యుత్తమమైనదిగా ఉండాలి. స్వదేశీ ఉత్పత్తుల నాణ్యత నిరంతరం మెరుగుపడాలి.. అవి వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి.. ఎక్కువ కాలం ఉపయోగకరంగా ఉండాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకే నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. దేశంలోని ప్రతి పౌరుడు ప్రస్తుతం స్వదేశీతో అనుసంధానమవుతూ.. స్వదేశీనే కొనాలని కోరుకుంటూ.. "ఇది స్వదేశీ" అని గర్వంగా చెబుతున్నారు. ఈ భావనను మనం నేడు ప్రతిచోటా పాదుకుంటున్నది. మన వ్యాపారులు కూడా ఈ మంత్రాన్ని స్వీకరించాలి. దేశంలో తయారైన వాటికి మనం ప్రాధాన్యమివ్వాలి.

 

మిత్రులారా,

 

పరిశోధన ఒక కీలకమైన అంశం. మనం పరిశోధనలో పెట్టుబడులను పెంచాలి.. మనం దానిని చాలా రెట్లు పెంచాలి. ఆవిష్కరణలు లేకుంటే ప్రపంచమూ.. వ్యాపారం.. జీవితం స్తంభించిపోతాయి. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. ఇప్పుడు పరిశోధనలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఇది తక్షణావసరం. స్వదేశీ పరిశోధన, రూపకల్పన, అభివృద్ధిలతో కూడిన పరిపూర్ణ దేశీయ వ్యవస్థను మనం సృష్టించాలి.

 

మిత్రులారా,

 

మన ఉత్తరప్రదేశ్ కూడా పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలతో నిండి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కనెక్టివిటీ విప్లవం సరుకుల రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గించింది. దేశంలో అత్యధిక సంఖ్యలో ఎక్స్‌ప్రెస్‌వేలు కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. దేశంలో అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రం.. ఉత్తరప్రదేశ్. దేశంలోని రెండు ప్రధాన ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లకు కేంద్రంగానూ ఉంది. వారసత్వ పర్యాటకంలో కూడా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. నమామి గంగే వంటి ప్రచారాలు ఉత్తరప్రదేశ్‌కు క్రూయిజ్ టూరిజం మ్యాప్‌లో చోటు కల్పించాయి. "ఒక జిల్లా, ఒక ఉత్పత్తి" కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకువచ్చింది. నేను విదేశీ అతిథులను కలిసే సందర్భాల్లో వారికి ఏమి ఇవ్వాలనే దాని గురించి ఈ రోజుల్లో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా బృందం "ఒక జిల్లా, ఒక ఉత్పత్తి" కేటలాగ్‌ను చూసి ఉత్పత్తులను ఎంపిక చేస్తుంది.. నేను వాటిని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇస్తున్నాను.

 

మిత్రులారా,

 

తయారీ రంగంలో కూడా యూపీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ రంగంలో భారత్ గత దశాబ్దంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించింది. ఇందులో ఉత్తరప్రదేశ్ పాత్ర కీలకం. దేశంలో ప్రస్తుతం తయారయ్యే అన్ని మొబైల్ ఫోన్లలో దాదాపు 55 శాతం ఉత్తరప్రదేశ్‌లోనే తయారవుతున్నాయి. సెమీ కండక్టర్ల రంగంలోనూ భారత స్వయం-సమృద్ధిని ఉత్తరప్రదేశ్ బలోపేతం చేస్తోంది. ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఒక పెద్ద సెమీ కండక్టర్ల తయారీ కేంద్రం పనులు త్వరలో ప్రారంభమవుతాయి.

 

మిత్రులారా, 

రక్షణ రంగాన్ని మరో ఉదాహరణగా తీసుకోవచ్చు. మన భద్రతా దళాలు స్వదేశీ కావాలంటున్నాయి.. ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి. అందుకే మేం దేశీయంగానే శక్తిమంతమైన రక్షణ రంగాన్ని తయారు చేస్తున్నాం. ప్రతి విడిభాగంపై "భారత్‌లో తయారీ" అని రాసి ఉండే వ్యవస్థను మేం సృష్టిస్తున్నాం. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. రష్యా సహకారంతో ఏర్పాటు చేసిన కర్మాగారంలో త్వరలో ఏకే 203 తుపాకుల ఉత్పత్తి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో రక్షణ కారిడార్ అభివృద్ధి కొనసాగుతోంది. ఇందులో బ్రహ్మోస్ క్షిపణులు సహా అనేక ఆయుధాల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. ‘ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండి- ఉత్తరప్రదేశ్‌లో తయారు చేయండి’ అని మీ అందరినీ నేను కోరుతున్నాను. ఇక్కడ లక్షలాది ఎంఎస్ఎంఈల ధృడమైన వ్యవస్థ ఉంది. ఇది నిరంతం అభివృద్ధి చెందుతోంది. వీటి సామర్థ్యాన్ని ఉపయోగించుకోండి.. ఇక్కడ తుది ఉత్పత్తిని తయారు చేయండి. ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు మీతోనే ఉన్నాయి.. ఈ విషయంలో మీకు అన్ని రకాల మద్దతును అందిస్తున్నాయి.

మిత్రులారా, 

సంస్కరణ, పనితీరు, పరివర్తనకు కట్టుబడి ఉన్న నేటి భారతదేశం.. పరిశ్రమ, వ్యాపారులు, ప్రజలతో కలిసి నిలబడుతోంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు మూడు రోజుల కిందటే అమల్లోకి వచ్చాయి. భారత వృద్ధికి కొత్త రెక్కలు ఇచ్చే నిర్మాణాత్మక సంస్కరణలు ఇవి. ఈ సంస్కరణలు జీఎస్టీ నమోదును సులభతరం చేయటంతో పాటు పన్ను వివాదాలను తగ్గిస్తాయి. అంతేకాకుండా.. ఎంఎస్ఎంఈలకు రీఫండ్‌లను వేగవంతం చేస్తాయి. ప్రతి రంగం దీని నుండి ప్రయోజనం పొందుతుంది. జీఎస్టీకి ముందు,  జీఎస్టీకి తర్వాత, ఇప్పుడు మూడో దశ అయిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు.. ఇలా మూడు దశలను మీరందరూ చూశారు. కొన్ని ఉదాహరణలను ఉపయోగించి ఎంత పెద్ద మార్పు వచ్చిందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 2014కి ముందు అంటే మీరు నాకు బాధ్యత ఇచ్చే ముందు గురించి నేను మాట్లాడుతున్నాను. 2014కి ముందు అంటే మీరు నాకు బాధ్యత ఇచ్చే ముందు.. చాలా పన్నులతో ఒక రకమైన పన్నుల చిక్కుముడి ఉండేది. దీనివల్ల వ్యాపార ఖర్చులు, గృహ బడ్జెట్‌లు ఎక్కువగా ఉండి.. ఖర్చులను నియంత్రించటం కష్టంగా ఉండేది. 2014 కి ముందు రూ. 1000 విలువైన చొక్కా గురించి నేను చెబుతున్నాను. మీ దగ్గర పాత బిల్లు ఉంటే తీసి చూడండి. 2014కి ముందు రూ. 1000 విలువైన చొక్కాపై రూ. 170 పన్ను ఉండేది. 2017లో మేం జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్ను రేటు రూ. 170 నుంచి రూ. 50కి తగ్గింది. అంటే గతంలో రూ. 1000 విలువైన చొక్కాపై పన్ను రూ. 170 ఉండేది.. 2017లో మేం జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు అది రూ. 50 అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన రేట్ల తర్వాత రూ. 1000 విలువైన అదే చొక్కాపై పన్ను కేవలం రూ. 35కి వచ్చింది.

మిత్రులారా, 

2014లో ఎవరైనా టూత్‌పేస్ట్, షాంపూ, తల నూనె, షేవింగ్ క్రీమ్ మొదలైన వాటిపై రూ. 100 ఖర్చు చేస్తే.. రూ. 31 పన్ను చెల్లించాల్సి ఉండేది. ప్రతి 100 రూపాయలకు రూ. 31. పన్ను అంటే.. రూ. 100 బిల్లు రూ. 131 అయ్యేది. 2014 కి ముందు సంగతి నేను చెబుతున్నాను. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు… రూ. 100 విలువైన అదే వస్తువు ధర రూ. 131 నుంచి రూ. 118కి తగ్గింది. దీని అర్థం రూ. 100 బిల్లుపై రూ. 13 ప్రత్యక్షంగా ఆదా అయింది. తదుపరి తరం జీఎస్టీ.. అంటే ఈసారి చేపట్టిన జీఎస్టీ సంస్కరణలతో 100 రూపాయల వస్తువుపై పన్ను 5 రూపాయలకు తగ్గింది. అంటే వస్తువుపై మొత్తం ఖర్చు రూ. 105కు చేరుకుంది. వస్తువు ధర 131 రూపాయల నుంచి 105 రూపాయలకు చేరుకుంది. దీన్ని బట్టి 2014కి ముందు ఉన్న ధరతో పోలిస్తే సాధారణ ప్రజలకు 100 రూపాయలపై 26 రూపాయలు ప్రత్యక్షంగా ఆదా అయ్యాయి. 100 రూపాయలకు 26 రూపాయల పొదుపు అన్నమాట. సగటు కుటుంబం ప్రతి నెలా ఎంత ఆదా చేస్తుందో దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబ అవసరాలకు అనుగుణంగా వార్షిక ఖర్చులను లెక్కిద్దాం. వాళ్లు రూ. లక్ష విలువైన వస్తువులను కొనుగోలు చేశారని అనుకుందాం. వారు 2014కి ముందు దాదాపు రూ. లక్ష విలువైన కొనుగోళ్లు చేసి ఉంటే.. వాళ్లు దాదాపు రూ. 25,000 పన్నులు చెల్లించాల్సి ఉండేది. నేను వచ్చేముందు అంటే 2014కి ముందు.. ఒకరు ఒక సంవత్సరంలో రూ. లక్ష విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే దానిపై పన్ను రూ. 25,000గా ఉండేది. ఈ రోజుల్లో ప్రకటనలు చేస్తున్న ధైర్యవంతులకు చెప్పండి. ఇప్పుడు తదుపరి తరం జీఎస్టీ తర్వాత.. ఒక కుటుంబంపై వార్షిక పన్ను కేవలం రూ. 25,000 నుంచి రూ. 5,000 వరకు తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అన్ని ముఖ్యమైన వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ మాత్రమే ఉంది.

 

మిత్రులారా, 

మన గ్రామ ఆర్థిక వ్యవస్థలో ట్రాక్టర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 2014 కంటే ముందు ఒక ట్రాక్టర్ కొనాలంటే 70వేల రూపాయలకు పైగా పన్ను చెల్లించాల్సి వచ్చేది. 2014కి ముందు 70 వేల రూపాయలు పన్ను ఉన్న అదే ట్రాక్టర్‌పై ఇప్పుడు 30 వేల రూపాయల పన్ను మాత్రమే ఉంది. అంటే రైతు ఒక ట్రాక్టర్‌పై ప్రత్యక్షంగా నలభై వేల రూపాయలకు పైగా ఆదా అవుతున్నాయి. అదేవిధంగా త్రిచక్ర వాహనాలు పేదలకు ప్రధాన ఉపాధి వనరుగా ఉంటాయి. 2014 కంటే ముందు త్రిచక్రవాహనాలపై దాదాపు 55 వేల రూపాయల పన్ను ఉండేది. త్రిచక్ర వాహనాలపై రూ. 55వేల పన్ను ఉండేది. ఇప్పుడు అదే త్రిచక్ర వాహనంపై జీఎస్టీ దాదాపు 35 వేల రూపాయలకు తగ్గింది… అంటే 20 వేల రూపాయలు ప్రత్యక్షంగా ఆదా అవుతున్నాయి. అదేవిధంగా తక్కువ జీఎస్టీ కారణంగా 2014తో పోలిస్తే స్కూటర్లు దాదాపు 8,000 రూపాయలు, మోటార్ సైకిళ్లు దాదాపు 9,000 రూపాయల తక్కువకే లభిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పేదలు, నవ-మధ్యతరగతి నుంచి మధ్యతరగతి వరకు అందరికీ ఆదా అయ్యాయి. 

మిత్రులారా, 

ఇవన్నీ జరిగినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు దేశ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. 2014‌ కంటే ముందు ఉన్న వాళ్ల ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాయి. వాస్తవం ఏంటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో పన్ను ఎగవేత విపరీతంగా ఉండేది.. దోచుకున్న మొత్తాన్ని కూడా దోచుకున్నారు. దేశంలోని సాధారణ ప్రజలు పన్నుల భారంతో నలిగిపోయారు. పెద్ద ఎత్తున పన్నులను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని తగ్గించింది మా ప్రభుత్వమే. మేం దేశ ప్రజల ఆదాయాన్ని పెంచాం.. వారి పొదుపులను కూడా పెంచాం. 2014లో వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు.. రూ. 2 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉండేది… కేవలం రూ. 2 లక్షలు మాత్రమే. నేడు రూ. 12 లక్షల ఆదాయాన్ని పన్ను రహితంగా చేయడంతో పాటు కొత్త జీఎస్టీ సంస్కరణ వల్ల దేశ ప్రజలు ఈ సంవత్సరం రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేయబోతున్నారు. దేశ ప్రజల జేబుల్లో రూ. 2.5 లక్షల కోట్లు ఎక్కువగా ఆదా అవుతాయి. అందుకే దేశం నేడు జీఎస్టీ ఉత్సవాన్ని గర్వంగా చేసుకుంటోంది. 

 

మిత్రులారా, 

నేటి భారతదేశానికి సంస్కరణల పట్ల బలమైన సంకల్పం ఉంది. మనకు ప్రజాస్వామ్య, రాజకీయ స్థిరత్వం ఉంది.. విధానపరంగా కూడా అంచనా వేసే పరిస్థితి ఉంది. దేశానికి ముఖ్యంగా నైపుణ్యంతో కూడిన భారీ యువ శ్రామిక శక్తి, ఎప్పటికప్పుడు అభిరుచులు మారే యువ వినియోగదారుల సామర్థ్యం ఉంది. ఇవన్నీ ప్రపంచంలోని ఏ దేశానికి లేవు. భారత్‌ ప్రతి ఒక్కటి కలిగి ఉంది. వృద్ధి సాధించాలనుకుంటున్న ప్రపంచంలోని ఏ పెట్టుబడిదారుడు లేదా కంపెనీ అయినా.. దేశంలో పెట్టుబడి పెట్టడం అత్యంత ఆకర్షణీయమైన అంశం. అందుకే భారత్‌లో, ఉత్తర‌ప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడం అనేది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మనందరి కృషి..  అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన ఉత్తర ప్రదేశ్‌ను తయారుచేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన విషయంలో మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

చాలా ధన్యవాదాలు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IRCTC disables 3cr user IDs, flags 6cr; scales up AI-based kitchen monitoring

Media Coverage

IRCTC disables 3cr user IDs, flags 6cr; scales up AI-based kitchen monitoring
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds designation of Jai Prakash Narayan Bird Sanctuary as India's 100th Ramsar site
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today expressed great happiness over India achieving a century of Ramsar sites, following the designation of the Jai Prakash Narayan Bird Sanctuary (Surha Tal) in Ballia, Uttar Pradesh, as the nation's 100th Ramsar site.

The Prime Minister noted that this wetland is exceptionally rich in avifaunal biodiversity, attracting numerous migratory and resident birds.
Shri Modi emphasized that this remarkable milestone clearly reflects India’s unwavering commitment to protecting its natural surroundings, particularly its vital wetlands.

The Prime Minister observed that over the years, efforts to conserve and rejuvenate wetlands have been significantly strengthened through greater community participation, science, innovation, and active awareness initiatives. He affirmed that these collective endeavours are instrumental in preserving biodiversity, securing ecological balance, and creating a greener future for coming generations.

The Prime Minister posted on X:

"A century as far as Ramsar sites are concerned!

Glad that the Jai Prakash Narayan Bird Sanctuary (Surha Tal) in Ballia, Uttar Pradesh has been designated as India’s 100th Ramsar site. This wetland is rich in avifaunal biodiversity, attracting several migratory and resident birds.

India’s unwavering commitment to protecting our natural surroundings and wetlands in particular is clearly reflected in this feat.

Over the years, efforts to conserve and rejuvenate wetlands have been strengthened through greater community participation, science, innovation and awareness initiatives. These endeavours are helping preserve biodiversity, secure ecological balance and create a greener future for coming generations."