భారతదేశ అభివృద్ధి ప్రస్థానం, వాలీబాల్ క్రీడకు మధ్య అనేక పోలికలు: ప్రధాని
ఏ విజయాన్ని కూడా ఒంటరిగా సాధించలేమన్న విషయాన్ని నేర్పుతున్న వాలీబాల్: ప్రధాని
సమన్వయం, నమ్మకం, జట్టు సంసిద్ధతపై ఆధారపడి ఉన్న విజయం: ప్రధాని
ప్రతి ఒక్కరికీ తమదైన పాత్ర, బాధ్యత ఉంటుంది: ప్రధాని

 

హర హర మహాదేవ్!

ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, యూపీ ప్రభుత్వ మంత్రులు - సోదరులు రవీంద్ర జైస్వాల్, దయాశంకర్, గిరీష్ యాదవ్, బనారస్ మేయర్ -  సోదరుడు అశోక్ తివారీ, ఇతర ప్రజాప్రతినిధులు, వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, దేశం నలుమూలల నుంచి నుండి విచ్చేసిన క్రీడాకారులు,  కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులకు  నమస్కారం.

వారణాసి పార్లమెంటు సభ్యునిగా క్రీడాకారులందరినీ స్వాగతించి, అభినందించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ రోజు కాశీలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమవుతోంది. మీలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ జాతీయ టోర్నమెంట్‌కు చేరుకున్నారు. రాబోయే రోజుల్లో, కాశీ మైదానంలో మీ ప్రయత్నాలకు పరీక్ష ఎదురుకానుంది. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని నాకు తెలియజేశారు. ఇది ఏక భారత్, శ్రేష్ఠ భారత్ భావనకు అందమైన ప్రతిబింబంగా నిలుస్తోంది. ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

మిత్రులారా, 

ఇక్కడ బనారస్‌లో ఒక మాట తరచూ ఇలా చెబుతారు. బనారస్‌ను నిజంగా తెలుసుకోవాలంటే బనారస్‌కు రావాల్సిందే అని. మీరు అందరూ ఇక్కడికి వచ్చారు... ఇప్పుడు మీరు కూడా బనారస్‌ను తెలుసుకోబోతున్నారు. మా బనారస్ క్రీడలను ప్రేమించే నగరం. ఇక్కడ మల్ల యుద్ధం, కుస్తీ మైదానాలు, బాక్సింగ్, పడవ పోటీలు, కబడ్డీ వంటి అనేక క్రీడలు ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. బనారస్ అనేక జాతీయ స్థాయి క్రీడాకారులను దేశానికి అందించింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, యూపీ కాలేజ్, కాశీ విద్యాపీఠానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో కూడా తమ ప్రతిభను చాటారు. వేలాది సంవత్సరాలుగా, ఇక్కడకు విజ్ఞానం, కళలను అన్వేషించడానికి వచ్చే వారందరినీ కాశీ నగరం స్వాగతించింది. ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ జరుగుతున్న సమయంలో కూడా బనారస్‌లో ఉత్సాహం అధికంగా ఉంటుందని నా నమ్మకం. మీకు ఉత్సాహంతో ప్రోత్సాహాన్నిచ్చే ప్రేక్షకులను మీరు చూస్తారు, కాశీ ఆతిథ్య సంప్రదాయాలను కూడా మీరు తెలుసుకుంటారు.

మిత్రులారా, 

వాలీబాల్ ఒక సాధారణ క్రీడ మాత్రమే కాదు. నెట్‌కు ఇరువైపులా సమతుల్యతకు ప్రతీకగా నిలిచే ఆట. సహకారంతో సాగే ఆట. దృఢ సంకల్పాన్ని ప్రతిబింబించే ఆట. వాలీబాల్ అసలైన భావం ఏమిటంటే -  ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంతిని ఎప్పుడూ పైన ఉంచాల్సిందేవాలీబాల్ మనలను సమష్టి భావనతో అనుసంధానిస్తుంది. ప్రతి వాలీబాల్ క్రీడాకారుడి మంత్రం “జట్టు ముందుగా” అన్నదే. ప్రతి ఆటగాడికి తనదైన నైపుణ్యం ఉండవచ్చు, కానీ అందరూ తమ జట్టు విజయం కోసమే ఆడతారు. భారతదేశ అభివృద్ధి గాథకు, వాలీబాల్ ఆటకు మధ్య నాకు అనేక పోలికలు కనిపిస్తాయి. వాలీబాల్ మనకు ఏ విజయమూ కూడా ఒంటరిగా సాధ్యం కాదని నేర్పుతుంది. మన విజయానికి సమన్వయం, పరస్పర విశ్వాసం, జట్టు సిద్ధత ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికీ తనదైన పాత్ర ఉంటుంది, తనదైన బాధ్యత ఉంటుంది. ప్రతి వ్యక్తి తన బాధ్యతను నిజాయితీగా, కష్టపడి నిర్వర్తించినప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం.

మన దేశం కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతోంది. పరిశుభ్రత నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు, తల్లి పేరుతో మొక్క నాటడం నుంచి అభివృద్ధి చెందిన భారత్ కోసం చేపట్టిన ఉద్యమం వరకు ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి రాష్ట్రం “దేశమే ముందు” అనే భావనతో, సామూహిక చైతన్యంతో కలిసి పనిచేస్తున్నందువల్లనే మనం పురోగమిస్తున్నాం. 

మిత్రులారా, 

ఈ రోజు భారతదేశ వృద్ధి, మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. అయితే ఒక దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆ పురోగతి కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాదు. ఆ విశ్వాసం క్రీడా మైదానాల్లో కూడా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి క్రీడలోనూ మనం ఇదే దృశ్యాన్ని చూస్తున్నాం. 2014 తర్వాత వివిధ క్రీడా విభాగాల్లో భారతదేశ ప్రదర్శన క్రమంగా మెరుగుపడింది. క్రీడామైదానాల్లో నేటి తరం క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంటే మనందరికీ మనసు ఉప్పొంగుతుంది.

 

మిత్రులారా, 

ఒకప్పుడు ప్రభుత్వం, సమాజం కూడా క్రీడల పట్ల పెద్దగా శ్రద్ధ చూపని పరిస్థితి ఉండేది. అందువల్ల క్రీడాకారులు తమ భవిష్యత్తు గురించి అనిశ్చితిలో ఉండేవారు. క్రీడలను వృత్తిగా ఎంచుకునే యువత సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ గత పదేళ్లలో ప్రభుత్వం, సమాజం రెండింటి ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు వచ్చింది. ప్రభుత్వం క్రీడల కోసం కేటాయించే బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. ఈ రోజు భారతదేశ క్రీడా నమూనా పూర్తిగా క్రీడాకారుల కేంద్రంగా మారింది. ప్రతిభను గుర్తించడం, శాస్త్రీయ శిక్షణ, పోషకాహారం నుంచి పారదర్శక ఎంపిక వరకు ప్రతి స్థాయిలో, క్రీడాకారుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

మిత్రులారా, 

ఈ రోజు దేశం మొత్తం సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణిస్తోంది. ప్రతి రంగం, ప్రతి అభివృద్ధి లక్ష్యం ఈ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌తో అనుసంధానమై ఉంది. క్రీడా రంగం కూడా అందులో ఒకటి. క్రీడల రంగంలో కూడా కీలకమైన సంస్కరణలు అమలులో ఉన్నాయి. జాతీయ క్రీడల నిర్వహణ చట్టం, ఖేలో భారత్ పాలసీ–2025 వంటి విధానాలు నిజమైన ప్రతిభకు అవకాశాలు లభించేలా చేస్తాయి. క్రీడా సంస్థల్లో పారదర్శకతను పెంచుతాయి. అదే సమయంలో దేశ యువత క్రీడలు, విద్య రెండింటిలోనూ ఏకకాలంలో ముందుకు సాగేలా చూస్తాయి.

మిత్రులారా, 

టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీఓపీఎస్) వంటి కార్యక్రమాల ద్వారా, భారత క్రీడల వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయి. ఒక వైపు, శక్తిమంతమైన మౌలిక సదుపాయాలు, నిధుల వ్యవస్థను ఏర్పరుస్తున్నాం. మరోవైపు యువతకు ప్రపంచ స్థాయి అనుభవాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాం. గత పదేళ్లలో భారత్ 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చిందని మీకు తెలుసు. ఉదాహరణకు, ఫిఫా అండర్-17 వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్, ప్రధాన చెస్ టోర్నమెంట్లు మొదలైనవి. 2030 కామన్‌వెల్త్ గేమ్స్ కూడా భారతదేశంలోనే జరగనున్నాయి. 2036 ఒలింపిక్స్‌ కు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశం పూర్తి శక్తితో సిద్ధంగా ఉంది. మరింతమంది క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ఈ ప్రయత్నాల ఉద్దేశం. 

 

మిత్రులారా, 

పాఠశాల స్థాయి క్రీడాకారులకు కూడా ఒలింపిక్ క్రీడలలో అనుభవాన్ని అందించడానికి మేము కృషి చేస్తున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం వల్ల వందలాది మంది యువత జాతీయ స్థాయికి ఎదగడానికి అవకాశం లభించింది. కొద్ది రోజుల క్రితం, దాదాపు కోటి మంది యువకులు తమ ప్రతిభను ప్రదర్శించిన సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగిసింది. ఈ మహోత్సవంలో నా కాశీ నుంచి  దాదాపు మూడు లక్షలమంది యువకులు తమ శక్తిని, నైపుణ్యాలను మైదానంలో ప్రదర్శించారని వారణాసి పార్లమెంటు సభ్యుడిగా, నేను సగర్వంగా చెప్పదలచుకున్నాను.

మిత్రులారా, 

క్రీడా మౌలిక సదుపాయాలలో వచ్చిన మార్పులు కాశీకి కూడా ప్రయోజనం కలిగిస్తున్నాయి. ఇక్కడ ఆధునిక క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వివిధ క్రీడల కోసం స్టేడియాలు వస్తున్నాయి. కొత్త క్రీడా సముదాయాలు చుట్టుపక్కల జిల్లాల క్రీడాకారులకు శిక్షణ అవకాశాలను అందిస్తున్నాయి. మీరు ఈ రోజు నిలబడి ఉన్న సిగ్రా స్టేడియం కూడా ఇప్పుడు అనేక ఆధునిక సౌకర్యాలతో నిండి ఉంది. 

మిత్రులారా, 

కాశీ ప్రధాన కార్యక్రమాల కోసం సిద్ధమవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ద్వారా భారతదేశ క్రీడా పటంలో ఒక స్థానాన్ని పొందడం కాశీకి చాలా ముఖ్యమైనది. దీనికి ముందు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిగాయి. స్థానిక ప్రజలకు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు గొప్ప అవకాశాలను ఇచ్చాయి. ఉదాహరణకు, బనారస్ ముఖ్యమైన జి-20 సమావేశాలు, కాశీ తమిళ సంగమం, కాశీ తెలుగు సంగమం వంటి సాంస్కృతిక ఉత్సవాలు, భారతీయ ప్రవాసుల సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది. షాంఘై సహకార సంస్థ సాంస్కృతిక రాజధానిగా కూడా కాశీ గుర్తింపు పొందింది. ఈ రోజు, ఈ ఛాంపియన్‌షిప్ ఈ విజయాలకు మరో ఆభరణంగా చేరుతోంది. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా, ఇటువంటి గొప్ప వేదికలకు ఒక ప్రధాన గమ్యస్థానంగా కాశీ ఆవిర్భవిస్తోంది.

మిత్రులారా, 

ఈ సమయంలో బనారస్ లో ఆహ్లాదకరమైన చలికాల వాతావరణాన్ని మీరు చూడొచ్చు. ఈ సీజన్‌లో కొన్ని అత్యుత్తమ వంటకాలను మీరు ఆస్వాదించగలుగుతారు. సమయం ఉంటే, మలైయోను తప్పక ఆస్వాదించండి. బాబా విశ్వనాథుడి ఆశీస్సులు తీసుకోండి. గంగా నదిపై పడవ ప్రయాణం చేయండి. ఈ అనుభవాలను మీతో పాటు తీసుకువెళ్లండి. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ టోర్నమెంట్‌లో మీ అత్యుత్తమ ఆటను ప్రదర్శించండి. ఈ కాశీ నేల నుంచి మీ ప్రతి స్పైక్, ప్రతి బ్లాక్, ప్రతి పాయింట్ భారతదేశ క్రీడా ఆకాంక్షలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను.  ఈ ఆకాంక్షతో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.  

ధన్యవాదాలు. వందే మాతరం! 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Kamal Haasan Backs PM Modi's Call To Save Energy Amid US-Iran War: 'India Will Emerge Stronger'

Media Coverage

Kamal Haasan Backs PM Modi's Call To Save Energy Amid US-Iran War: 'India Will Emerge Stronger'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in China mining accident
May 23, 2026

Prime Minister Shri Narendra Modi today expressed deep sadness over the tragic loss of lives resulting from a mining accident in the Shanxi Province of China.

On behalf of the people of India, the Prime Minister extended his heartfelt condolences to President Xi Jinping and the people of China. Shri Modi prayed that the bereaved families find strength in this tragic hour, while also wishing for the early and safe recovery of all remaining missing persons.

The Prime Minister posted on X:

"Saddened by the loss of lives in a mining accident in Shanxi Province in China. On behalf of the people of India, my condolences to President Xi Jinping and the people of China. May the bereaved families find strength in this tragic hour. Praying for the early and safe recovery of all remaining missing persons."