ప్రపంచ వేదికపై దేశ సృజనాత్మక సామర్థ్యాన్ని చాటి చెబుతున్న వేవ్స్: పీఎం
వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు సంక్షిప్త రూపంయ మాత్రమే కాదు.. సంస్కృతి, స‌ృజనాత్మకత, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం: పీఎం
బిలియన్‌కి పైగా జనాభా ఉన్న భారత్‌లో బిలియన్‌కి పైగా కథలున్నాయి: పీఎం
క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్‌కు ఇదే సరైన సమయం: పీఎం
ప్రస్తుత ప్రపంచం కొత్త కథల కోసం అన్వేషిస్తుంటే.. భారత్‌లో వేల ఏళ్ల నాటి కథల నిధి ఉంది, ఈ నిధి కాలాతీతమైనది, ఆలోచనలు రేకెత్తించేది, విశ్వవ్యాప్తమైనది: పీఎం
నూతన ఆర్థిక వ్యవస్థ ఆరెంజ్ ఎకానమీకి కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి మూలాధారాలు: పీఎం
తెర పరిమాణం తగ్గుతున్నప్పటికీ.. ఈ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి. స్క్రీన్ మైక్రోగా మారుతుంటే.. సందేశం మెగాగా మారుతోంది: పీఎం
చిత్ర నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీతం, సంగీత కచేరీలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది: పీఎం
ప్రపంచంలోని క్రియేటర్లందరికీ - పెద్ద కలలు కనండి, మీ కథలు చెప్పండి, పెట్టుబడిదారులకు - ప్రజలపై కూడా పెట్టుబడి పెట్టండి, భారతీయ యువతకు - మీ దగ్గర ఉన్న బిలియన్ కథలను ప్రపంచానికి చెప్పండి: పీఎం

ఈ రోజు మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ లేదా ఈ గడ్డపై జన్మించిన సోదరీసోదరులందరికీ నా శుభాకాంక్షలు!

అంతేకాదు... ఇవాళ గుజరాత్‌ రాష్ట్రావతరణ దినోత్సవం కూడా... ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త  గుజరాతీ సోదరీసోదరులందరికీ అనేకానేక అభినందనలు.

వేవ్స్‌ సమ్మిట్‌ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్‌, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!

మిత్రులారా!

నేడు ఈ ముంబయి నగరంలో 100కుపైగా దేశాల నుంచి హాజరైన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి చేరుకున్నారు. మరోమాటలో- అంతర్జాతీయ ప్రతిభా, సృజనాత్మకత సహిత ప్రపంచావరణ వ్యవస్థ ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టుకుంటోంది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్- అంటే.. ‘వేవ్స్’ అన్నది ఓ సంక్షిప్త పదరూపం కాదు. ఇది సంస్కృతి, సృజనాత్మకత, సార్వత్రిక అనుసంధాన సమ్మేళన కెరటం. ఈ తరంగంలో సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథ చెప్పడం, సృజనాత్మకత సంబంధిత విస్తృత ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ‘వేవ్స్‌’ ప్రతి కళాకారుడికి, మీలాంటి ప్రతి సృష్టికర్తకూ సంబంధించిన ప్రపంచ వేదిక. ఇక్కడ ప్రతి కళాకారుడు, యువతరంలోని ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచన ద్వారా సృజనాత్మక ప్రపంచంతో సంధానితులవుతారు. ఈ చారిత్రక, అద్భుత సమారంభానికి దేశవిదేశాల నుంచి తరలివచ్చిన ప్రముఖులందరికీ నా అభినందనలు.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా!

ఈ రోజు మే 1వ తేదీ... భారత్‌లో 112 ఏళ్లకిందట... అంటే- 1913 మే 3వ తేదీన  తొలి  చలనచిత్రం “రాజా హరిశ్చంద్ర” విడుదలైంది. దీని నిర్మాత శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే... ఇక నిన్న ఆయన జన్మదినం కావడం ఒక విశేషం. గడచిన శతాబ్దంలో మన దేశాన్ని ప్రపంచం నలుమూలలకూ చేర్చడంలో భారతీయ సినిమా అద్వితీయ విజయం సాధించింది. రష్యాలో రాజ్ కపూర్ గారికిగల ప్రేక్షకాదరణ, ‘కేన్స్’లో సత్యజిత్ రే గారికి లభించిన విశేషాదరణ, ‘ఆస్కార్’లో “ఆర్‌ఆర్‌ఆర్‌”కు దక్కిన అనూహ్య ప్రాచుర్యం తదితరాల్లో ఈ విజయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది గురుదత్ సినిమా కవిత్వం కావచ్చు లేదా రిత్విక్ ఘటక్ ప్రతిఫలింపజేసిన సామాజిక ప్రతిబింబం కావచ్చు... ఎ.ఆర్‌.రెహమాన్ బాణీ లేదా రాజమౌళి ఐతిహాసిక సృజన కావచ్చు... ప్రతి కథ భారతీయ సంస్కృతిని గళమెత్తి వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో నేడిక్కడ వేవ్స్ వేదికపై మనం తపాలా బిళ్లల ద్వారా భారతీయ సినిమా రంగంలోని అనేక మంది దిగ్గజాలను స్మరించుకుంటున్నాం.

 

మిత్రులారా!

నేను కొన్నేళ్లుగా గేమింగ్, సంగీత ప్రపంచ ప్రముఖులను, చిత్రనిర్మాతలను, తెరపై మెరిసే నటీనటులను ఎందరినో కలిశాను. ఈ సందర్భంగా వారితో సాగిన చర్చలలో భారతీయ సృజనాత్మకత, సృజనాత్మక సామర్థ్యం, ఆయా రంగాల్లో ప్రపంచంతో భాగస్వామ్యం వంటి వివిధ అంశాలు తరచూ ప్రస్తావనకు వస్తూండేవి. సృజనాత్మక లోక ప్రసిద్ధులైన మీ అందరినీ కలిసిన ప్రతిసారి, మీ ఆలోచనలను స్వీకరించిన ప్రతి సందర్భంలోనూ ఈ అంశపై లోతుగా ఆలోచించే అవకాశం నాకూ లభించింది. తదనుగుణంగా నేను కూడా ఓ ప్రయోగం చేశాను. ఆ మేరకు 6-7 ఏళ్ల కిందట మహాత్మా గాంధీ 150వ జయంతి నేపథ్యంలో ఆయనకెంతో ఇష్టమైన “వైష్ణవ్ వజన్ కో తేనే కహియే” గీతాన్ని ఆలపించాల్సిందిగా 150 దేశాల గాయనీగాయకులను ప్రేరేపించాను. శ్రీ నర్సీ మెహతా జీ స్వరపరిచిన ఈ గీతం 500-600 ఏళ్లనాటిది. అయితే, ‘గాంధీ-150’ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి సంగీత కళాకారులు దీన్ని భక్తిపురస్సరంగా ఆలపించారు. అదెంతటి ప్రభావం చూపిందంటే- యావత్‌ ప్రపంచం దానితో గళం కలిపింది. అలాగే ఇక్కడ హాజరైనవారిలో చాలామంది గాంధీజీ ప్రబోధాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తూ 2-3 నిమిషాల వీడియోలు రూపొందించారు. ఏతావాతా భారత్‌సహా ప్రపంచంలోని సృజనాత్మక లోక సమష్టి శక్తి ఎంతటి అద్భుతాలనైనా ఆవిష్కరించగలదని చెప్పడానికి అప్పుడు మనమంతా సాక్షులం. నాటి ఊహలు నేడు వాస్తవరూపు దాల్చి పోటెత్తిన కెరటాల్లా నేడు ఈ తీరానికి చేరాయి.

మిత్రులారా!

ఉషోదయాన సూర్యకిరణాలు ఆకాశాన్ని సప్తవర్ణ శోభితం చేసే రీతిలో ‘వేవ్స్‌’ సమ్మిట్‌ ఆరంభ క్షణం నుంచే కాంతులు వెదలజల్లడం ప్రారంభించింది. “తొలి క్షణం నుంచే సుస్పష్ట లక్ష్యంతో ఈ కెరటం శిఖరస్థాయిలో గర్జించడం మొదలుపెట్టింది.” ‘వేవ్స్’ తన తొలి ఎడిషన్‌లోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మా సలహా బోర్డుతో సంధానితులైన సహచరులందరి సమష్టి కృషి ఫలితం నేడిక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో మీరు ‘క్రియేటర్స్ ఛాలెంజ్’, ‘క్రియేటోస్ఫియర్’ పేరిట భారీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రపంచంలోని దాదాపు 60 దేశాల నుంచి లక్ష మందికిపైగా సృజనాత్మక వ్యక్తులు పాల్గొన్నారు. ఈ విధంగా నిర్వహించిన 32 రకాల పోటీల నుంచి 800 మంది విజేతలను తుదిదశ పోటీకి ఎంపికయ్యారు. ఈ ఫైనలిస్టులందరికీ నా శుభాకాంక్షలు... ప్రపంచంపై మీదైన ముద్ర వేయడానికి, ఏదైనా ఘనత సాధించడానికి తగిన అవకాశం మీకు అత్యంత చేరువలో ఉంది.

మిత్రులారా!

మీరంతా ‘భారత్‌ పెవిలియన్‌’లో సరికొత్త ఆలోచనలతో అనేక అద్భుతాలు సృష్టించారని నాకు సమాచారం అందింది. వాటన్నిటినీ తిలకించేందుకు నేనెంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను... కచ్చితంగా అన్నిటినీ చూస్తాను. ఇక ‘వేవ్స్ బజార్’ కార్యక్రమం కూడా చాలా వినూత్నమైనది... ఇది నవ్య సృష్టికర్తలను ప్రోత్సహిస్తూ, వారిని కొత్త మార్కెట్లకు పరిచయం చేస్తుంది. కళా రంగంలో కొనుగోలుదారులు-విక్రేతలను అనుసంధానించే ఈ ఆలోచన నిజంగా ఎంతో గొప్పది.

మిత్రులారా!

ఓ శిశువు ఊపిరి పోసుకున్న తర్వాత, జన్మించిన మరుక్షణం నుంచీ తల్లితో సంబంధం ఒక లాలిపాటతో ప్రారంభమవుతుందని మనందరికీ తెలిసిందే. ఆ బిడ్డ వినే తొలి స్వరం తన తల్లిదే... ఆ జోలపాటతోనే సంగీతంపై అవగాహన మొదలవుతుంది. తన బిడ్డ కలలకు ఒక రూపమిచ్చే తల్లిలాగా సృజనాత్మక లోకంలోని కళాకారులు, నిపుణులు ఒక యుగకాలపు స్వప్నాలకు రూపమిస్తారు. అలాంటి వారందర్నీ ఒకే వేదికపైకి చేర్చడమే ‘వేవ్స్‌” లక్ష్యం.

 

మిత్రులారా!

ఎర్రకోట పైనుంచి నేను ‘సమష్టి కృషి’ గురించి చాలాసార్లు ప్రస్తావించాను. ఆ మేరకు మీ అందరి సమష్టి కృషితో ‘వేవ్స్‌’ సంరంభం భవిష్యత్తులో భారత్‌ను సమున్నత శిఖరాలకు చేర్చగలదనే నా నమ్మకం ఇవాళ మరింత దృఢంగా మారింది. ఈ తొలి సమ్మిట్‌లో చేదోడువాదోడుగా నిలిచిన తరహాలోనే ఈ సహకారాన్ని కొనసాగించాలని పరిశ్రమలోని నా సహచరులను అభ్యర్థిస్తున్నాను. ‘వేవ్స్‌’లో మరెంతో సుందర కెరటాలు ఎగయనున్నాయి. ‘వేవ్స్‌’ అవార్డుల ప్రదానం కూడా భవిష్యత్తులో ప్రారంభమవుతుంది. ఇవి కళా, సృజనాత్మకత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకం కావడం ఖాయం. మనమంతా ఐక్యంగా ప్రపంచ ప్రజానీకం హృదయాలను చూరగొనాలి... ప్రతి వ్యక్తినీ మనతో మమేకం చేసుకోవాలి.

మిత్రులారా!

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో భారత్‌ శరవేగంగా ముందడుగు వేస్తోంది. ఇక అంతర్జాతీయంగా ‘ఫిన్‌టెక్’ అనుసరణ క్రమంలో అగ్ర స్థానానికి చేరింది. అంతేకాదు... మన దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు. అలాగే ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకురావరణ వ్యవస్థ మనదే. వికసిత భారత్‌ దిశగా మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. భారత్‌ నుంచి ప్రపంచం పొందగలిగింది మరెంతో ఉంది. ఎందుకంటే- 100 కోట్లకుపైగా జనాభాతోపాటు... 100 కోట్లకు మించిన కథలుగల దేశమిది. రెండు వేల ఏళ్లకిందట భరతముని నాట్యశాస్త్రాన్ని రచించినప్పుడు- “నాట్యం భావయతి లోకం” అన్నది దాని సందేశం. అంటే- కళ ప్రపంచానికి భావోద్వేగాలను, అనుభూతులను కలిగిస్తుందని అర్థం. శతాబ్దాల కిందట కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’, ‘శాకుంతలం’  రచించిన నాడే ప్రాచీన నాటక రంగానికి భారత్‌ సరికొత్త దిశానిర్దేశం చేసింది. దేశంలోని ప్రతి వీధికీ ఓ కథ ఉంటుంది.. ప్రతి పర్వతం ఓ గీతమాలపిస్తుంది... ప్రతి నది ఏదో ఒక స్వరం వినిపిస్తుంది. మీరు ఈ దేశంలోని 6 లక్షలకుపైగాగల గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా ఆయా గ్రామాలకు తమవైన జానపద గాథలు, వాటిని వినిపించే విశిష్ట శైలి కనిపిస్తాయి. ఇక్కడ వివిధ సమాజాలు జానపద కథల రూపంలో తమ చరిత్రను భవిష్యత్తరాలకు అందిస్తూ వచ్చాయి. సంగీతం కూడా మనకొక సాధనే... అది భక్తిగీతమైనా, గజల్‌ అయినా, శాస్త్రీయం లేదా సమకాలీనమైనా... ప్రతి రాగానిదీ ఓ కథ.. ప్రతి లయకూ ఒక ఆత్మ ఉంటాయి.

మిత్రులారా!

మనకు ‘నాద బ్రహ్మం’... అంటే ‘దివ్య స్వరం’ అనే భావన ఉంది. మన దేవుళ్ళు సంగీత-నృత్యాల ద్వారా కూడా తమనుతాము వ్యక్తీకరిస్తారు. శివుని డమరుకం సృష్టికి తొలి శబ్దం. సరస్వతీ మాత వీణ జ్ఞానం, జ్ఞాన లయ సమన్వితం. శ్రీకృష్ణుని వేణువు ప్రేమ, సౌందర్యాలకు శాశ్వత సందేశం. విష్ణువు శంఖం, దాని ధ్వని సానుకూల శక్తికి సంకేతాలు... ఇలాంటివెన్నో మనకున్నాయి. ఇటీవల ఇక్కడ నిర్వహించిన ఆకర్షణీయ సాంస్కృతిక ప్రదర్శనలో వీటన్నిటి సంగ్రహ రూపాన్ని మనం చూశాం. అందుకే నేనేమంటున్నానంటే- ఇదే సమయం... సరైన తరుణం.. ‘భారత్‌లో సృష్టి-ప్రపంచం కోసం సృష్టి’ సముచిత కాలం. కథ చెప్పడంలో కొత్త మార్గాల కోసం ప్రపంచం నేడు అన్వేషిస్తున్న వేళ, భారత్‌కు వేల ఏళ్లనాటి అపార కథానిధి ఉంది. అంతేకాదు... ఈ సంపద కాలాతీతం... ఆలోచనా ప్రేరకం... విశ్వవాప్తం. అది కేవలం సంస్కృతి సంబంధిత అంశాలకు పరిమితం కాదు... సైన్స్ ప్రపంచం, క్రీడలు, ధైర్యసాహసాల కథలు, త్యాగం, తపస్సు కథలెన్నో ఉన్నాయి. మన కథల్లో సైన్స్, ఫిక్షన్, ధైర్యం, సాహసం ఉన్నాయి. భారత కథా భాండాగారం అత్యంత విశాలం.. విస్తీర్ణం గలది. ఈ నిధిని ప్రపంచం నలుమూలలకూ చేర్చడం, ఆసక్తికర రీతిలో భవిష్యత్తరాలకు అందించడం ఈ ‘వేవ్స్‌’ వేదిక బృహత్తర కర్తవ్యం.

మిత్రులారా!

స్వాతంత్ర్యం సిద్ధించిన కొన్నేళ్లకే మన దేశంలో పద్మ పురస్కార ప్రదానం ప్రారంభమైందని మీలో చాలా మందికి తెలిసిందే. నాటినుంచీ అనేక ఏళ్లుగా ఈ అవార్డుల ప్రదానం కొనసాగుతున్నా, మేమీ పురస్కారాన్ని ‘ప్రజా పద్మం’గా మార్చాం. దేశంలో ఎక్కడో మారుమూల మాతృభూమి కోసమే జీవిస్తూ సామాజిక సేవకు అంకితమైన వ్యక్తులకు మేం జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చాం. వారిని ఈ పురస్కారంతో సత్కరించడంతో పద్మ సంప్రదాయం స్వరూపస్వభావాలే మారిపోయాయి. ఇప్పుడు యావద్దదేశం ఈ విధానాన్ని హృదయపూర్వకంగా ఆమోదించింది. కేవలం ఏడాదికోసారి నిర్వహించే కార్యక్రమంలా కాకుండా జాతీయ వేడుకగా మారింది... ‘వేవ్స్’ కూడా ఇంతే! దేశం నలుమూలలాగల సృజనాత్మక ప్రపంచంలో, సినిమాల్లో, సంగీతంలో, యానిమేషన్‌లో, గేమింగ్‌లో ప్రతిభకు ఒక వేదికనిచ్చి, ప్రపంచమంతా అభినందించేలా చేస్తుంది.

 

మిత్రులారా!

భారత్‌లోని మరొక విశిష్టత కంటెంట్ సృష్టిలో మీకెంతో సాయపడుతుంది. “ఆ నో భద్ర: క్రత్వో యంతు విశ్వతః” అనే ప్రబోధాన్ని మేం అనుసరిస్తాం. “నాలుగు దిక్కుల నుంచీ మనకు సదాలోచనలు అందాలి” అని దీనికి అర్థం. ఇది మన నాగరికత సార్వత్రిక స్వభావానికి నిదర్శనం. ఈ భావనతోనే ఇక్కడికి వచ్చిన పార్సీలు నేటికీ భారత్‌లో సగర్వంగా వృద్ధి పథంలో పయనిస్తున్నారు. అలాగే ఇక్కడికొచ్చి స్థిరపడిన యూదులు భారతీయులుగా మారారు. ప్రపంచంలోని ప్రతి సమాజానికి, ప్రతి దేశానికీ తమవైన విజయాలుంటాయి. ఆ మేరకు ప్రస్తుత కార్యక్రమంలో పాల్గొంటున్న అనేక దేశాల మంత్రులు, ప్రతినిధులకూ వారి సొంత విజయాలు తప్పక ఉంటాయి. ఇక ప్రపంచవ్యాప్త ఆలోచనలను, కళలను స్వాగతించి, గౌరవించడం మన సంస్కృతి బలం. కాబట్టి, మనమంతా సమష్టిగా వివిధ దేశాలు, ఆయా సంస్కృతులు సాధించిన విజయాలపై అద్భుత సారాంశం సృష్టికి శ్రీకారం చుట్టవచ్చు. ప్రపంచ అనుసంధానంపై మన దృక్పథాన్ని కూడా ఇది బలోపేతం చేస్తుంది.

మిత్రులారా!

నేనివాళ ప్రపంచ ప్రజానీకంతోపాటు భారత్‌కు ఆవలగల సృజనాత్మక లోకానికి ఒక హామీ ఇవ్వాలని భావిస్తున్నాను. మీరు మా దేశంతో సంధానితులై, ఈ నేలమీది కథల గురించి తెలుసుకుంటే, ఇలాంటిది నా దేశంలోనూ సాధ్యమేనని భావిస్తారు. ఇక్కడ అటువంటి కథలున్నాయి. వాటిద్వారా భారత్‌లో మీ అనుబంధం అత్యంత సహజమైనదిగా అనిపిస్తుంది. అప్పుడు ‘క్రియేట్ ఇన్ ఇండియా’ అనే మా తారకమంత్రం మీకు మరింత సహజమైనదిగా కనిపిస్తుంది.

మిత్రులారా!

భారత్‌లో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ (ఆరంజ్‌ ఎకానమీ) వృద్ధిపథంలో ఉంది. కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి- ఇవి మూడూ ఈ వ్యవస్థకు ఇరుసులు. భారతీయ సినిమాల పరిధి నేడు ప్రపంచం నలుమూలలకూ విస్తరిస్తోంది. వందకుపైగా దేశాల్లో భారతీయ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇకపై భారతీయ చిత్రాలను కేవలం వినోదం కోసం చూడటంతో సరిపెట్టకుండా వాటిని అర్థం చేసుకోవడానికి కూడా విదేశీ ప్రేక్షకులు కూడా ప్రయత్నిస్తారు. ఆ క్రమంలోనే ఇవాళ పెద్ద సంఖ్యలో విదేశీ వీక్షకులు భారతీయ కంటెంట్‌ను ఉపశీర్షికలతో చూస్తున్నారు. మన దేశంలో ఓటీటీ పరిశ్రమ కొన్నేళ్లుగా 10 రెట్ల వృద్ధిని సాధించింది. స్క్రీన్ పరిమాణం చిన్నదిగా మారుతున్నప్పటికీ, దీని పరిధి అనంతం. అంటే- తెర సూక్ష్మరూపంలో ఉన్నప్పటికీ దాని సందేశం విస్తృతమవుతోంది. భారతీయ ఆహారం ఇప్పుడు ప్రపంచానికి ఇష్టమైనదిగా మారుతోంది. అలాగే రాబోయే రోజుల్లో భారతీయ గీతాలు ప్రపంచానికే గుర్తింపు కాగలవనే నమ్మకం ఉంది.

మిత్రులారా!

దేశీయ స్థూలోత్పత్తి (జిడిపి)లో భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వాటా రాబోయే సంవత్సరాల్లో మరింత పెరుగుతుంది. చలనచిత్ర నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీతానికి భారత్‌ ఇప్పుడు ప్రపంచ కూడలిగా మారుతోంది. ప్రత్యక్ష సంగీత విభావరుల సంబంధిత పరిశ్రమకు అనేక అవకాశాలున్నాయి. ప్రపంచ యానిమేషన్ మార్కెట్ పరిమాణం నేడు 430 బిలియన్ డాలర్ల పైస్థాయిలో ఉంది. మరో 10 సంవత్సరాల్లో ఇది రెట్టింపు కావచ్చని అంచనా. కాబట్టి, భారత యానిమేషన్, గ్రాఫిక్స్ పరిశ్రమకు ఇదో గొప్ప అవకాశం.

 

మిత్రులారా!

ఈ ఆరెంజ్ ఎకానమీ వికాసం నేపథ్యంలో ‘వేవ్స్’ వేదిక నుంచి దేశంలోని ప్రతి యువ సృష్టికర్తకూ నేనొక విషయం చెప్పాలని భావిస్తున్నాను. మీరు గువహటిలోని సంగీతకారులైనా, కొచ్చిలో నివసించే పాడ్‌కాస్టర్ అయినా, బెంగళూరులో గేమ్‌ డిజైన్ చేస్తున్నా లేదా పంజాబ్‌లో సినిమా నిర్మిస్తున్నా... మీరంతా భారత ఆర్థిక వ్యవస్థలో ఓ కొత్త కెరటానికి రూపమిస్తున్నారు. అది సృజనాత్మకతా కెరటం.. మీ కృషి, మీ అభిరుచికి ప్రతిరూపంగా సాకారమవుతున్న కెరటం. మీ ప్రతి ప్రయత్నంలోనూ మా ప్రభుత్వం మీకు అండదండగా నిలుస్తుంది. ‘స్కిల్ ఇండియా’ నుంచి ‘స్టార్టప్ సపోర్ట్’ దాకా... ‘ఎవిజిసి’ పరిశ్రమ విధానాల నుంచి ‘వేవ్స్’ వంటి వేదికల వరకూ... అడుగడుగునా మీ కలల సాకారానికి మేం సదా నిబద్ధతతో ఉన్నాం. మీ ఆలోచనలు, ఊహలకు విలువనిచ్చే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ఇది కొత్త కలలకు రూపమివ్వడగమేగాక వాటి సాకారానికి తగిన శక్తినీ ఇస్తుంది. ‘వేవ్స్’ సమ్మిట్ ద్వారా మీకొక విస్తృత వేదిక కూడా అందుబాటులోకి వస్తుంది. ఇది ‘సృజనాత్మకత ప్లస్‌ కోడింగ్’ వేదిక, ‘సాఫ్ట్‌ వేర్ ప్లస్‌ స్టోరీటెల్లింగ్’ వేదిక, ‘ఆర్ట్‌ ప్లస్‌ ఆగ్మెంటెడ్ రియాలిటీ వేదిక. దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మీ కలలు భారీగా ఉండాలి... వాటి సాకారానికి మీరు శక్తివంచన లేకుండా కృషిచేయాలి.

మిత్రులారా!

కంటెంట్ సృష్టికర్తలైన మీమీద నాకు సంపూర్ణ విశ్వాసముంది. అందుకు ఓ కారణం కూడా ఉంది... అదేమిటంటే- యువతరం స్ఫూర్తి, పనిశైలికి సంబంధించి ఆటంకాలు, అవరోధాల వంటి హద్దులేవీ లేకపోవడమే! కాబట్టి, మీలోని సృజనాత్మకత సంపూర్ణ స్వేచ్ఛతో ప్రవహిస్తుంది. ఎటువంటి సంకోచం, సందిగ్ధం ఉండవు.. ఇటీవల అనేకమంది యువ సృష్టికర్తలు, గేమర్స్ వంటి నిపుణులతో నేను స్వయంగా సంభాషించాను. సామాజిక మాధ్యమాల్లోనూ మీ సృజనాత్మకత ప్రతిభను గమనిస్తూనే ఉన్నాను.. మీ శక్తిసామర్థ్యాలు నాకు స్పష్టంగా అవగతం అవుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక యువ జనాభాగల భారత్‌లో నేటి ఈ పరిణామం యాదృచ్చికమేమీ కాదు. అంతేకాకుండా మన సృజనాత్మకతకు కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. రీల్స్, పాడ్‌కాస్ట్‌, గేమ్‌, యానిమేషన్, స్టార్టప్, ‘ఎఆర్‌-విఆర్‌’ వంటి ప్రతి రూపంలోనూ మన యువ మేధ ఎంతో గొప్పగా ప్రతిబింబిస్తోంది. నిజం చెప్పాలంటే- ‘వేవ్స్’ మీ తరానికి సంబంధించింది కాబట్టి, మీ శక్తిసామర్థ్యాలతో ఈ మొత్తం సృజనాత్మక విప్లవాన్ని మీరొకసారి మీ శైలిలో ఊహించుకుంటూ పునర్నిర్వచించవచ్చు.

మిత్రులారా!

సృజనాత్మక ప్రపంచ దిగ్గజాలైన మీ సమక్షంలో నేను మరొక అంశం చర్చించాలని భావిస్తున్నాను... అదే ‘సృజనాత్మక బాధ్యత’. ఈ 21వ శతాబ్దం సాంకేతికత చోదక శతాబ్దమని మనందరికీ తెలిసిందే. ప్రతి వ్యక్తి జీవితంలో సాంకేతికత పాత్ర నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో మానవ సున్నితత్వ పరిరక్షణకు అదనపు కృషి అవసరం. ఇది సృజనాత్మక లోకం ద్వారా మాత్రమే సాధ్యం. మానవులు రోబోలుగా మారే పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలి. ఆ మేరకు వారిని మరింత సున్నితంగా మార్చి, వారిని మరింత సౌభాగ్యవంతులుగా రూపొందించాలి. పోగుపడే సమాచారం గుట్టల నుంచి ఆ మానవ శ్రేయస్సు రాదు. అలాగే సాంకేతికత వేగం, సౌలభ్యం నుంచి కూడా లభించదు. దీనికోసం మనం పాటలు, సంగీతం, కళ, నృత్యం వంటి కళారూపాలకు ప్రాధాన్యమివ్వాలి. వేల ఏళ్లగా మానవేంద్రియాలను సజీవ చైతన్యంతో నిలుపుతున్నది ఇవే. కాబట్టి, వాటిని మనం మరింత బలోపేతం చేయాలి. ఇంకొక కీలకాంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే- మానవాళి వ్యతిరేక భావజాలం బారినుంచి మన యువతరాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. మనం ఈ బాధ్యతను నిర్వర్తించడానికి తగిన వేదిక ‘వేవ్స్‌’. మనమీ కర్తవ్యం నుంచి వెనక్కు తగ్గితే, అది యువతరానికి ఎంతో ప్రమాదకరం.

మిత్రులారా!

సాంకేతికత నేడు సృజనాత్మక ప్రపంచానికి బాటలు పరచింది కాబట్టి, ప్రపంచ సమన్వయం కూడా ఎంతో ముఖ్యం. ఈ వేదిక మన సృష్టికర్తలను అంతర్జాతీయ కథకులతో, మన యానిమేటర్లను ప్రపంచ దార్శనికులతో అనుసంధానిస్తుందని నా విశ్వాసం. అలాగే మన గేమర్‌లను అంతర్జాతీయ అగ్రశ్రేణి నిపుణులుగా మారుస్తుందని కూడా నా నమ్మకం. దేశాన్ని మీ కంటెంట్కు మైదానంగా మార్చుకోవాల్సిందిగా ప్రపంచంలోని అందరు పెట్టుబడిదారులను, ప్రపంచ సృష్టికర్తలను ఆహ్వానిస్తున్నాను. ప్రపంచ సృష్టికర్తలకు ఇదే నా పిలుపు- భారీ కలలు కనండి... మీ కథలు చెప్పండి. ఇక పెట్టుబడిదారులకు నా అభ్యర్థన- వేదికలపై మాత్రమే కాదు... ప్రజల విషయంలోనూ పెట్టుబడులు పెట్టండి. చివరగా భారతీయ యువతకు నా సలహా- ప్రపంచం వినని.. మనవైన 100 కోట్ల కథలను గొప్పగా వినిపించండి!

 

మిత్రులారా!

సాంకేతికత నేడు సృజనాత్మక ప్రపంచానికి బాటలు పరచింది కాబట్టి, ప్రపంచ సమన్వయం కూడా ఎంతో ముఖ్యం. ఈ వేదిక మన సృష్టికర్తలను అంతర్జాతీయ కథకులతో, మన యానిమేటర్లను ప్రపంచ దార్శనికులతో అనుసంధానిస్తుందని నా విశ్వాసం. అలాగే మన గేమర్‌లను అంతర్జాతీయ అగ్రశ్రేణి నిపుణులుగా మారుస్తుందని కూడా నా నమ్మకం. దేశాన్ని మీ కంటెంట్కు మైదానంగా మార్చుకోవాల్సిందిగా ప్రపంచంలోని అందరు పెట్టుబడిదారులను, ప్రపంచ సృష్టికర్తలను ఆహ్వానిస్తున్నాను. ప్రపంచ సృష్టికర్తలకు ఇదే నా పిలుపు- భారీ కలలు కనండి... మీ కథలు చెప్పండి. ఇక పెట్టుబడిదారులకు నా అభ్యర్థన- వేదికలపై మాత్రమే కాదు... ప్రజల విషయంలోనూ పెట్టుబడులు పెట్టండి. చివరగా భారతీయ యువతకు నా సలహా- ప్రపంచం వినని.. మనవైన 100 కోట్ల కథలను గొప్పగా వినిపించండి!

తొలి ‘వేవ్స్’ సమ్మిట్ నేపథ్యంలో మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు... అనేకానేక ధన్యవాదాలు.

నమస్కారం!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Housing ministry raises EWS housing target under PMAY 2.0 by 350%

Media Coverage

Housing ministry raises EWS housing target under PMAY 2.0 by 350%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Invites everyone to Join #ParikshaPeCharcha26
February 05, 2026

Prime Minister Shri Narendra Modi invited everyone to join #ParikshaPeCharcha26 to be held tomorrow, 6th February at 10 AM. He highlighted that this year’s edition will feature very interesting topics relating to examinations, notably the importance of remaining stress free and focusing on learning. The Prime Minister emphasized that this platform has always been one he enjoys, as it provides him with the opportunity to interact with bright minds from across the country.

In a post on X, Shri Modi said:

"Do watch #ParikshaPeCharcha26 tomorrow, 6th February at 10 AM. This year’s PPC features very interesting topics relating to examinations, notably the need to remain stress free, focus on learning and more. This is a platform I’ve always enjoyed, as it gives me an opportunity to interact with bright minds from across the country. "