హైదరాబాద్‌లో సుమారు రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితమిచ్చే కార్యక్రమాలు చేయనున్న పీఎం
వరంగల్‌లో పీఎం మిత్ర పార్కు ప్రారంభోత్సవం, సంగారెడ్డిలోని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస‌్థాపన చేయనున్న పీఎం
హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్‌లోని గుడెబెల్లూరు నుంచి మహబూబ్‌నగర్‌ వరకు జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు శంకుస‌్థాపన చేయనున్న పీఎం
హైదరాబాద్‌లోని మల్కాపూర్‌ ఇండియన్ ఆయిల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ టెర్మినల్‌ను జాతికి అంకితమివ్వనున్న పీఎం
హైదరాబాద్‌లో అత్యాధునిక, క్యాన్సర్‌ చికిత్సకు ప్రత్యేకమైన మల్టీ సూపర్ స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్ ఆస్పత్రి అయిన ‘సింధు హాస్పిటల్‌’ను జాతికి అంకితం చేయనున్న పీఎం
బెంగళూరులోని ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొననున్న పీఎం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.

బెంగళూరులో పీఎం

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 1981లో స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్... ప్రస్తుతం 182 దేశాల్లో విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సేవకులచే నడిచే మానవతా, విద్యా సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ 45వ వార్షికోత్సవం, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు.

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అంతర్గత శాంతి, సంపూర్ణ ఆరోగ్యానికి ప్రత్యేక వేదికగా ఈ ధ్యాన మందిరం రూపుదిద్దుకుంది. మానసిక ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక పరివర్తనపై దృష్టి సారిస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా జరిగే జాతీయ స్థాయి సేవా కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభిస్తారు.

హైదారాబాద్‌లో పీఎం

సుమారు రూ.9,400 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన,  ప్రారంభోత్సవం, దేశానికి అంకితమిచ్చే కార్యక్రమాలను చేయనున్నారు. సమష్టి అనుసంధానాన్ని బలోపేతం చేయటం, రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచటం, భద్రతను పెంచటం, ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించటమే ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్‌లో భాగంగా గుడెబెల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లు.గా విస్తరించే పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ.3,175 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సురక్షితమైన, అంతరాయం లేని రాకపోకలు జరుగుతాయి. ప్రయాణ సమయం దాదాపు గంటన్నర వరకు తగ్గటంతో పాటు ఇంధన వినియోగం, వాహన నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ రహదారి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయటమే కాక, రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తుంది.

జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌ (హెచ్‌ఎన్‌ఐసీ) ద్వారా సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 3,245 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,350 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ఎన్‌హెచ్‌-65 వెంబడి వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ప్రధాన నగరాలు, ఓడరేవులు, రైల్వే వ్యవస్థలు, విమానాశ్రయాలకు నిరాటంకమైన వివిధ రవాణా మార్గాల అనుసంధానాన్ని ఇది కల్పిస్తుంది.

స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా రూపుదిద్దుకున్న జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం... అత్యాధునిక, సుస్థిరమైన మౌలిక సదుపాయాలతో భవిష్యత్ తరం పరిశ్రమలకు వేదిక కానుంది. ఆటోమొబైల్, ఆహార శుద్ధి, యంత్రాలు, లోహాలు, విద్యుత్ పరికరాల తయారీ వంటి కీలక రంగాలకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది. దీంతో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కలగటమే కాక, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది.

వరంగల్‌లో పీఎం మిత్ర పథకం ద్వారా అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సుమారు రూ.1,700 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ పార్క్‌... భారతదేశపు మొదటి పూర్తిస్థాయి పీఎం మిత్ర పార్క్. భారత ప్రభుత్వ 5ఎఫ్ దార్శనికత... ‘ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్‌’ను ఇది ఆచరణలోకి తెస్తుంది. ప్రతిపాదిత నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్‌హెచ్‌-163జీ)కి సమీపంలో, ఎన్‌హెచ్‌-163కి ఆనుకుని ఉన్న ఈ పార్క్... ప్రధాన రైల్వే వ్యవస్థలు, సముద్ర ఓడరేవులకు అద్భుతమైన మల్టీమోడల్ అనుసంధానతతో ప్రపంచ వాణిజ్యానికి అవాంతరాలు లేని రవాణా సౌకర్యాలను కల్పిస్తుంది. ప్రపంచ స్థాయి పారిశ్రామిక వ్యవస్థగా రూపొందించిన ఈ పార్క్‌లో విశాలమైన అంతర్గత రహదారులు, ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్, నిరంతర నీటి సరఫరా వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలున్నాయి. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ జీరో లిక్విడ్ డిశ్చార్జ్‌ సాంకేతికతతో కూడిన కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్‌ ప్లాంటును ఇక్కడ ఏర్పాటు చేశారు.

దాదాపు రూ.1,535 కోట్ల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. వీటిలో 118 కిలోమీటర్ల మేర విస్తరించిన కాజీపేట-విజయవాడ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులోని పలు విభాగాలున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్‌లో లైన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల రైళ్ల కార్యకలాపాలు వేగంగా జరగటమే కాక, రద్దీ తగ్గడం, సమయపాలన మెరుగుపడతాయి. ఈ ప్రాంతమంతటా సరుకు రవాణా కూడా పెరుగుతుంది.

కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్‌ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ వ్యూహాత్మక ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కాజీపేట జంక్షన్‌లో రద్దీ తగ్గుతుంది. దీని ద్వారా హైదరాబాద్, బల్లార్షా, విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఒకే సమయంలో రాకపోకలు సాగించేందుకు వీలవుతుంది. ఫలితంగా రైల్వే కార్యాచరణ సామర్థ్యం పెరిగి, రైళ్ల ఆలస్యం తగ్గుతుంది.

హైదరాబాద్‌లో సుమారు రూ.600 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఇండియన్ ఆయిల్ మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితమిస్తారు. పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించటానికి, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చేందుకు మల్కాపూర్ టెర్మినల్‌ను ఏర్పాటు చేశారు. ఈ టెర్మినల్‌కు మొత్తం 1,65,000 కిలోలీటర్ల (కేఎల్‌) నిల్వ సామర్థ్యముంది.

భారతదేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల్లో కీలక ఘట్టంగా, హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిని ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సాంకేతికతతో క్యాన్సర్‌ చికిత్సపై దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్ ఈ ఆస్పత్రి. ఇది లాభాపేక్ష లేని సంస్థ. 18 అంతస్తుల్లో 2.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,500 పడకలు, 150కి పైగా డాక్టర్ కన్సల్టేషన్ గదులు, 29 అధునాతన ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక డయాగ్నోస్టిక్స్, ఆధునిక ప్రయోగశాల, బ్లడ్ సెంటర్ సౌకర్యాలతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, క్యాన్సర్ శస్త్ర చికిత్సలు, బోన్ మారో మార్పిడి, అధునాతన క్రిటికల్ కేర్‌తో పాటు 33కి పైగా సూపర్ స్పెషాలిటీలతో సమగ్ర వైద్య సేవలందిస్తారు.

ఈ ప్రాజెక్టులు... ఆర్థిక వృద్ధిని సాధించటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచటం, వేగవంతమైన అనుసంధానతను పెంపొందించటానికి సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ.. వికసిత్ తెలంగాణ ఫర్ వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి దార్శనికతకు నిదర్శనం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 07 ఆగష్టు 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch