ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే ఛత్తీస్‌గఢ్‌ రజత్ మహోత్సవ్‌లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి
రోడ్లు, పరిశ్రమ, ఆరోగ్యసంరక్షణ, ఇంధనం వంటి ముఖ్య రంగాల్లో రూ.14,260 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు
ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక, గిరిజన స్వాతంత్ర్య యోధుల మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
దిల్ కీ బాత్: పుట్టుకతోనే గుండె జబ్బు బారిన పడి చికిత్స పూర్తయిన చిన్నారులతో మాట్లాడనున్న ప్రధానమంత్రి
ఛత్తీస్‌గఢ్‌ విధానసభ నూతన భవనాన్ని ప్రారంభించడంతో పాటు భారత్ రత్న, పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నవంబరు 1న ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తారు.

ఉదయం సుమారు 10 గంటల వేళకు, ఆయన ‘దిల్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా 2500 మంది చిన్నారులతో భేటీ అవుతారు. వారందరికీ పుట్టుకతో వచ్చిన గుండె జబ్బును చికిత్స చేసిన నేపథ్యంలో, నవా రాయ్‌పూర్ అటల్ నగర్‌లోని శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో ‘జీవన దానం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

బ్రహ్మకుమారీల ‘‘శాంతి శిఖర్’’ను ప్రధానమంత్రి  ఉదయం దాదాపు 10 గంటల 45 నిమిషాలకు ప్రారంభిస్తారు. బ్రహ్మ కుమారీలకు ఆధ్యాత్మిక శిక్షణ, శాంతి, ధ్యాన సాధనల కోసం  ఓ ఆధునిక కేంద్రంగా ఈ ‘‘శాంతి శిఖర్’’ను నిర్మించారు..


ఉదయం సుమారు 11 గంటల 45 నిమిషాలకు, నవా రాయ్‌పూర్ అటల్ నగర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ విధానసభ నూతన భవనంలో భారత్ రత్న, పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. పర్యావరణ అనుకూల భావన నుంచి స్ఫూర్తిని పొంది నిర్మించిన ఛత్తీస్‌గఢ్‌ విధానసభ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి సందర్శించి, భవనాన్ని ప్రారంభిస్తారు. భవనానికి అవసరమైన కరెంటును సౌర ఇంధనంతో సమకూర్చుకొనేందుకు కావలసిన ఏర్పాట్లను చేశారు. వాన నీటి ఇంకుడు గుంతల వ్యవస్థను కూడా సమకూర్చారు.. ఈ కార్యక్రమంలో ఆహ్వానితులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.


మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటల వేళ, షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక, గిరిజన స్వాతంత్ర్య యోధుల మ్యూజియానికి ప్రధానమంత్రి వెళ్లి, మ్యూజియాన్ని ప్రారంభిస్తారు.  రాష్ట్ర గిరిజనుల ధైర్య సాహసాలు, వారు చేసిన త్యాగాలు, వారి దేశభక్తిని ఈ మ్యూజియం కళ్లకు కడుతుంది. మ్యూజియం పోర్టల్‌నూ, స్వాతంత్ర్య యోధుల గౌరవార్థం ‘‘ఆది శౌర్య’’ పేరుతో సిద్ధం చేసిన ఒక ఎలక్ట్రానిక్ పుస్తకం (ఈ-బుక్)నూ ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ గుర్రం మీద స్వారీ చేస్తున్న భంగిమలో స్మారక స్థలంలో నెలకొల్పిన విగ్రహాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు.


ఛత్తీస్‌గఢ్‌ రజత్ మహోత్సవ్‌లో మధ్యాహ్నం దాదాపు 2 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి పాల్గొంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోడ్లు, పరిశ్రమ, ఆరోగ్యసంరక్షణ, ఇంధనం వంటి ముఖ్య రంగాల్లో రూ.14,260 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవంతో పాటు, శంకుస్థాపనలు కూడా చేస్తారు.


గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని బలోపేతం చేసే లక్ష్యంతో ఛత్తీస్‌గఢ్‌‌లోని 9 జిల్లాల్లో నిర్మించిన 12 స్టార్ట‌ప్ విలేజ్ ఆంత్రప్రన్యోర్‌షిప్ ప్రోగ్రాం (ఎస్‌వీఈపీ) బ్లాకులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. నిర్మాణం పూర్తయిన 3 లక్షల 51 వేల ఇళ్ల గ‌‌ృహ ప్రవేశాలకు సంబంధించిన కార్యక్రమంలోనూ ఆయన పాలుపంచుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రాంతాల కుటుంబాలు ఆత్మగౌరవంతో, సురక్షితంగా జీవించడానికి పూచీపడేలా ప్రధాన్‌మంత్రీ ఆవాస్ యోజన (గ్రామీణ్) కింద లబ్ధిదారులు 3 లక్షల మందికి రూ.1200 కోట్ల కిస్తును శ్రీ మోదీ అందజేస్తారు.  

సంధానాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో, భారత్‌మాలా పరియోజనలో భాగంగా భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) దాదాపు రూ.3,150 కోట్ల ఖర్చుతో చేపట్టే నాలుగు దోవల గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పాతాళ్‌గావ్-కుంకురీ నుంచి ఛత్తీస్‌గఢ్‌‌-ఝార్ఖండ్ సరిహద్దు వరకు ఈ హైవేను అభివృద్ధిపరుస్తారు. ఈ వ్యూహాత్మక కారిడర్ కోర్బా, రాయ్‌గఢ్, జశ్పూర్, రాంచీ, జంషెద్‌పుర్‌ లోని కీలక బొగ్గు గనులనూ, పారిశ్రామిక మండలాలనూ, ఉక్కు కర్మాగారాలనూ కలుపుతుంది. ఈ కారిడర్ ఒక ప్రధాన ఆర్థిక వాహినిలా పనిచేస్తూ, ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను పటిష్ఠపరచడంతో పాటుగా మధ్య భారతాన్ని దేశంలోని తూర్పు ప్రాంతాలతో ఏకీకరిస్తుంది.


బస్తర్, నారాయణ్‌పుర్ జిల్లాల్లో అనేక చోట్ల మీదుగా విస్తరించిన 130డీ జాతీయ రహదారి (నారాయణ్‌పుర్-కస్తూర్‌మేటా-నీలాంగుర్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో) నిర్మాణం, ఉన్నతీకరణల ప్రాజెక్టు పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.  ఎన్‌హెచ్-130సీ జాతీయ రహదారిని (మదంగాముడా-దేభోగ్-ఒడిశా సరిహద్దులోనిది) రెండు దోవలు కలిగిన పక్కా హైవేగా ఉన్నతీకరించే  ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటితో గిరిజన ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో రహదారి సంధానం చెప్పుకోదగిన రీతిన మెరుగపడి, ఆరోగ్యసంరక్షణ, విద్యా సంబంధిత సేవలు, మార్కెట్ల వరకు చేరుకోవడం సులభతరమవడమే కాకుండా మారుమూల ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పురోగతికి కూడా దన్ను లభిస్తుంది.


విద్యుత్తు  రంగంలోని ప్రాంతీయ ఈఆర్-డబ్ల్యూఆర్ ఇంటర్‌కనెక్షన్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీంతో తూర్పు, పశ్చిమ గ్రిడ్ల మధ్య అంతర ప్రాంతీయ విద్యుత్తు బదలాయింపు సామర్థ్యం 1600 మెగావాట్ల మేరకు వృద్ధి చెందుతుంది. గ్రిడ్ విశ్వసనీయత మెరుగై పూర్తి ప్రాంతంలో కరెంటు సరఫరా స్థిరత్వాన్ని సంతరించుకొంటుంది.

ఛత్తీస్‌గఢ్‌‌లో విద్యుత్తు రంగ మౌలిక సదుపాయాల స్వరూపాన్ని పటిష్ఠపరిచి, సరఫరాలో విశ్వసనీయతను మెరుగుపరిచే, ట్రాన్స్‌మిషన్ సామర్థ్యాన్ని పెంచే ధ్యేయంతో రూ.3,750 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో అమలుపరచనున్న అనేక ఇంధన రంగ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, జాతికి అంకితమివ్వడం, శంకుస్థాపనలు చేయనున్నారు.

పునర్వ్యవస్థీకరించిన పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్ఎస్)లో భాగంగా, రమారమి రూ.1,860 కోట్ల విలువైన పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కొత్త విద్యుత్తు లైన్ల నిర్మాణం, ఫీడర్ విభజన, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, కండక్టర్ల రూపాంతరణ, గ్రామీణ వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో మెరుగుదలకు ఉద్దేశించిన లో-టెన్షన్ నెట్‌వర్కును పటిష్ఠపరచడం ఈ పనుల్లో  భాగంగా ఉన్నాయి.  తొమ్మిది విద్యుత్తు సబ్‌స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సబ్‌స్టేషన్లను సుమారు రూ.480 కోట్ల ఖర్చుతో రాయ్‌పుర్, బిలాస్‌పుర్, దుర్గ్, బేమేతరా, గరియాబంద్, బస్తర్ వంటి జిల్లాల్లో నిర్మించారు. వీటితో 15 లక్షల మందికి పైగా ప్రజలకు వోల్టేజీ హెచ్చుతగ్గులకు లోనుకాకుండానూ, కరెంటు కోతలు తగ్గిపోయి, గిరిజన ప్రాంతాలూ, సుదూర ప్రాంతాలకు కూడా విద్యుత్తు సౌకర్యం పక్కాగా అందుబాటులోకి వస్తుంది. కాంకేర్, బలౌదాబజార్-భాటాపారాలలో ప్రధాన సౌకర్యాలు సహా రూ.1,415 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.


పెట్రోలియం, సహజవాయు రంగం విషయానికి వస్తే, రాయ్‌పుర్‌లో  హెచ్‌పీసీఎల్ నిర్మించిన అత్యాధునిక పెట్రోలియం ఆయిల్ డిపోను  ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. రూ.460 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ డిపోలో 54,000 కిలోలీటర్ల పెట్రోలు, డీజిల్, ఇథెనాల్‌ నిల్వ చేయొచ్చు. ఈ కేంద్రం ఒక ప్రధాన ఇంధన కూడలిగా తన సేవల్ని అందించనుంది.  దీంతో ఛత్తీస్‌గఢ్, చుట్టుపక్కల రాష్ట్రాకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు వీలు ఉంటుంది. 10,000 కేఎల్ ఇథెనాల్ నిల్వ సామర్థ్యం కలిగి ఉండే ఈ డిపో.. ఇథెనాల్ మిశ్రణ కార్యక్రమానికీ సాయపడుతుంది. ఫలితంగా శిలాజ జనిత ఇంధనంపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి స్వచ్ఛ ఇంధన వినియోగం పెరుగుతుంది.

దాదాపు రూ.1,950 కోట్ల ఖర్చుతో నిర్మించిన 489 కిలోమీటర్ల పొడవైన నాగ్‌పూర్-ఝార్సుగూడ సహజవాయు గొట్టపుమార్గాన్ని కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు దేశానికి అవసరమయ్యే ఇంధనంలో సహజవాయు వాటాను 15 శాతానికి పెంచడంలోనూ, ‘‘ఒకే దేశం, ఒకే గ్యాస్ గ్రిడ్’’ దృష్టికోణాన్ని సాకారం చేయడంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తుంది. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని 11 జిల్లాలను జాతీయ గ్యాస్ గ్రిడ్‌కు కలిపి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించడంతో పాటు స్వచ్ఛ ఇంధనాన్ని తక్కువ ఖర్చులో అందించనుంది.  

 


పారిశ్రామిక అభివృద్ధినీ, ఉద్యోగకల్పననూ ప్రోత్సహించడానికి రెండు స్మార్ట్ ఇండస్ట్రియల్ ఏరియాల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో జాంజ్‌గీర్-చాంపా జిల్లాలోని సిలాదేహీ-గత్వా-బీరా లో ఒకటీ, రాజ్‌నంద్‌గాఁవ్ జిల్లాలోని బిజ్లేతాలాలో రెండోదీ ఏర్పాటు కానున్నాయి. ప్రధానమంత్రి నవా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో ఒక ఫార్మాస్యుటికల్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ పార్కును ఔషధ నిర్మాణ సంస్థలూ, ఆరోగ్య సంరక్షణ ప్రధాన తయారీ సంస్థల స్థాపన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.

కొత్తగా అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ వైద్య కళాశాలలను మనేంద్రగఢ్, కబీర్‌ధామ్, జాంజ్‌గీర్-చాంపా, గీదమ్ (దంతేవాడా)లతోపాటు బిలాస్‌పుర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి పరిసరాల్లో నిర్మిస్తారు. దీంతో ఆరోగ్యసంరక్షణ రంగానికి నూతనోత్తేజం అందుతుంది. ఈ ప్రాజెక్టులు ఛత్తీస్‌గఢ్‌ నలుమూలలా వైద్య విద్య సదుపాయాలను బలపరచడమే కాక ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యతను విస్తరించడంతో పాటు సాంప్రదాయక వైద్యం పట్ల ప్రజలు మొగ్గు చూపేటట్లు తోడ్పడతాయి.
 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM announces exam reform task force, Infosys co-founder Nandan Nilekani to lead

Media Coverage

PM announces exam reform task force, Infosys co-founder Nandan Nilekani to lead
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlights noble character as the foundation of respect, trust, and effective leadership
July 27, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting how a person of noble character earns respect in society and is regarded as worthy of every responsibility.

The Prime Minister wrote on X;

"शीलवान् पूजितो लोके शीलवान् साधुसम्मतः।

शीलवान् सर्वकर्मार्हः शीलवान् प्रियदर्शनः॥"

A person of noble character earns respect in society and the esteem of the virtuous. Through integrity, humility and disciplined conduct, such an individual is regarded as worthy of every responsibility. Their personality is admirable, inspiring and worthy of emulation. In truth, noble character is the true foundation of lasting success, effective leadership, and enduring trust.