బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ను సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి బీహార్ వ్యాప్తంగా 75 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాలలోకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 7,500 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు.
ఈ పథకం మహిళలను ఆత్మనిర్భర్ గా మార్చడం, స్వయం ఉపాధి, జీవనోపాధి అవకాశాల ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వారు తమకు నచ్చిన ఉపాధి లేదా జీవనోపాధి కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక సాధికారతను ప్రోత్సహిస్తుంది.
ఈ పథకం కింద, ప్రతి లబ్ధిదారునికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రారంభ గ్రాంట్ రూ. 10,000, తదుపరి దశలలో రూ. 2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. వ్యవసాయం, పశుపోషణ, హస్తకళలు, టైలరింగ్, నేత, ఇతర చిన్న తరహా సంస్థలతో సహా తమకు నచ్చిన రంగాలలో లబ్దిదారులు ఈ సహాయాన్ని ఉపయోగించవచ్చు.
ఈ పథకం సామాజిక ఆధారితంగా అమలవుతుంది. ఆర్థిక సహాయంతో పాటు, స్వయం సహాయ సంఘాలకు అనుబంధంగా ఉన్న కమ్యూనిటీ రిసోర్స్ సిబ్బంది వారికి శిక్షణ అందించి వారి ప్రయత్నానికి తోడ్పడతారు. వారి ఉత్పత్తుల విక్రయానికి మద్దతు ఇవ్వడానికి రాష్ట్రంలో గ్రామీణ హట్ బజార్లను మరింత అభివృద్ధి చేస్తారు.
ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన ప్రారంభోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా, మండల, క్లస్టర్, గ్రామ స్థాయుల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని కోటి మందికి పైగా మహిళలు వీక్షిస్తారు.


