· “మానవాళి-కేంద్రక... అవగాహనపూరిత ప్రపంచావరణ వ్యవస్థకు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్దిష్ట రూపమిస్తుంది”
· “వర్ధమాన దేశాలకు ప్రాధాన్యంతో పరిపాలన కేంద్రకంగా అందరికీ ఏఐ అందుబాటులోకి రావాలి”
· “ఏఐ’లో అపార నైతికత అవశ్యం: సంకల్ప సమాంతర సత్ఫలితాలు ఉండాలి”
· “ఏఐ నైతిక వినియోగంలో- విశ్వసనీయ ప్రపంచ సమాచార చట్రం.. గాజుపెట్టె తరహా పారదర్శక భద్రత నిబంధనలు.. మానవ విలువల కూర్పు.. ఈ మూడూ అవశ్యం”
· “మానవాళి సంక్షేమానికి ఏఐ ఒక ఉమ్మడి వనరు”

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారిని మరోసారి స్వాగతిస్తూ- మానవాళి కేంద్రక, అవగాహన పూరిత ఏఐ ప్రపంచావరణ వ్యవస్థకు రూపకల్పనలో ఈ శిఖరాగ్ర సమావేశం కీలక పాత్ర పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక అవరోధాలను అవకాశాలుగా మానవాళి మలచుకున్న తీరును చరిత్ర వివరిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. అదే తరహాలో మానవాళి రూపాంతరీకరణకు నేడు మరో గొప్ప అవకాశాన్ని చేరువ చేసిందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా బుద్ధ భగవానుడు ప్రబోధించిన “సముచిత అగాహనతో సరైన నిర్ణయం సాధ్యం” వాక్యాన్ని శ్రీ మోదీ ఉటంకించారు. సకాలంలో.. సదుద్దేశంతో.. సరైన నిర్ణయాల ద్వారా ఏఐ సానుకూల ప్రభావానికి భరోసానిచ్చే భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించాల్సిన ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచ దేశాలు భుజం కలిపి పదం కదిపితే అసాధ్యం కూడా సుసాధ్యమేనని కోవిడ్‌ ప్రపంచ మహమ్మారి సంక్షోభం రుజువు చేసిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. టీకా తయారీ నుంచి సరఫరా వ్యవస్థల దాకా, సమాచార భాగస్వామ్యం నుంచి ప్రాణ రక్షణ వరకూ విస్తరించిన సహకారం అనేక పరిష్కారాలను మన ముందుంచిందని పేర్కొన్నారు. లక్షలాది ప్రజానీకానికి సకాలంలో టీకాలు వేయడంలో డిజిటల్ టీకా వేదిక సద్వినియోగాన్ని ఉటంకిస్తూ- మానవాళికి సాంకేతికత చేయగల సేవల ఎలాంటిదో భారత్‌ గ్రహించిదని ఆయన చెప్పారు. ఆనాటి క్లిష్ట పరిస్థితుల్లో ‘యూపీఐ’ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు నిరంతరాయంగా సాగాయని  తెలిపారు. అంతేగాక డిజిటల్ అంతరం తగ్గింపులో ఈ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించిందని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో భారత్‌ ఒక శక్తిమంతమైన సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించిందని, ఇప్పుడు ఆ సాంకేతికతను ప్రపంచంతో పంచుకుంటోందని ఆయన గుర్తుచేశారు. భారత్‌ విషయంలో సాంకేతికత అంటే అధికార సాధనకు, ఆధిపత్యం చలాయించడానికి తోడ్పడే మాధ్యమం కాదని- సేవా ప్రదానం, సాధికారతకు అదొక సాధనమని స్పష్టం చేశారు. ఇదే తరహాలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత  కూడా మానవాళి సంక్షేమానికి భరోసా ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

 

సాంకేతిక పరిజ్ఞానం మునుపటి కాలంలో విభజనకు దారితీసినా, నేడు ఏఐ ప్రతి ఒక్కరికీ చేరువై,  అందరికీ అందుబాటులోకి రావాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఏఐ భవిష్యత్తుపై చర్చ నేపథ్యంలో వర్ధమాన దేశాల ఆశలు-ఆకాంక్షలు ప్రాథమ్యాలను పరిపాలన కేంద్రకంగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు.

మానవాళి పురోగమనంలో నైతికతకు సదా అగ్ర ప్రాధాన్యం ఉంటున్నదని, ఇప్పుడు ఏఐతో అనైతికత అవధులు మించే ప్రమాదం ఉందని శ్రీ మోదీ హెచ్చరించారు. అందువల్ల ఏఐ నైతిక నిబంధనల పరిధి అపారంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఏఐ కంపెనీలకు లాభార్జనపై మాత్రమేగాక సంకల్పంపైనా దృష్టి సారించాల్సిన కీలక నైతిక బాధ్యత ఉన్నదని గుర్తుచేశారు. ఆ మేరకు బలమైన నైతిక నిబద్ధత అవసరమని పేర్కొన్నారు. వ్యక్తిగత స్థాయిలో ఏఐ ఇప్పటికే మానవాభ్యాసం, తెలివితేటలు, భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నదని చెప్పారు.

 

ఈ నేపథ్యలో ఏఐ నైతిక వినియోగం దిశగా ప్రధానమంత్రి కింది 3 సూత్రాలను ప్రతిపాదించారు:

·         ఏఐ శిక్షణలో డేటా సార్వభౌమత్వాన్ని గౌరవించాలి.. విశ్వసనీయమైన ప్రపంచ సమాచార చట్రం ప్రాతిపదికగా ఉండాలి. “గార్బేజ్‌ ఇన్‌-గార్బేజ్‌ అవుట్‌’ సూత్రాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమాచార సముదాయం సురక్షితంగా, సమతౌల్యంతో, నమ్మదగినదిగా ఉండాలని, లేనిపక్షంలో ఫలితాలకు విశ్వసనీయత ఉండదని స్పష్టం చేశారు.

·         ఏఐ వేదికలు తమ భద్రత నిబంధనలను విస్పష్ట, పారదర్శక రీతిలో రూపొందించుకోవాలి. అవన్నీ దృగ్గోచరంగా, ధ్రువీకరించదగినవిగా- అంటే... “బ్లాక్ బాక్స్”లా కాకుండా “గ్లాస్ బాక్స్” తరహా విధానంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల జవాబుదారీతనానికి భరోసా లభిస్తుందని, వ్యాపారాల్లో నైతిక వర్తనను బలోపేతం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

·         విస్పష్ట మానవ విలువలు ప్రాతిపదికగా ‘ఏఐ’ మార్గనిర్దేశం చేయాలి. ఈ సందర్భంగా “పేపర్ క్లిప్ సమస్య”ను ఆయన ఉదహరిస్తూ- ఒక యంత్రానికి ఓ లక్ష్యం నిర్దేశిస్తే దాన్ని సాధించడంలో అది ప్రపంచ వనరులన్నిటినీ ఖాళీ చేయగలదు. కాబట్టి, సాంకేతికత శక్తిమంతమైనదే అయినా, దానికి దిశానిర్దేశం చేయాల్సింది మానవులేనని ఆయన స్పష్టం చేశారు.

 

 

కృత్రిమ మేధ ప్రపంచ ప్రస్థానంలో ఆకాంక్షాత్మక భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ మేరకు తన బాధ్యతను గుర్తించి గణనీయ చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా ‘భారత్‌ ఏఐ మిషన్’ కింద ఇప్పటికే 38,000 ‘జీపీయూ’లను సిద్ధం చేసిందని చెప్పారు. మరో ఆరు నెలల్లో అదనంగా 24,000 అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భారత్‌ ఇప్పటికే తన అంకుర సంస్థలకు అత్యంత చౌక ధరతో అంతర్జాతీయ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందిస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. మరోవైపు ‘ఏఐకోష్‌’ (నేషనల్ డేటాసెట్ ప్లాట్‌ఫామ్) వేదికను కూడా రూపొందించిందని తెలిపారు. దీనిద్వారా 7,500కుపైగా సమాచార దొంతరలు, 270 ఏఐ నమూనాలు జాతీయ వనరులుగా సమష్టి వినియోగంలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఏఐ విషయంలో భారత్‌ దశ, దిశ విస్పష్టంగా ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఏఐ అనేది మానవాళి సంక్షేమానికి ఒక ఉమ్మడి వనరు. కాబట్టి, ఆవిష్కరణల పురోగమనానికి, సార్వజనీనత సాధనకు, మానవ విలువల ఏకీకరణకు అనువైన భవిష్యత్‌ కృత్రిమ మేధను రూపొందించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. సాంకేతికత-మానవ విశ్వసనీయత మమేకమైతే ఏఐ వాస్తవ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కాగలదని చెబుతూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s pharma exports cross $28 bn till February, likely to end up with growth in rupee terms in FY26

Media Coverage

India’s pharma exports cross $28 bn till February, likely to end up with growth in rupee terms in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 ఏప్రిల్ 2026
April 05, 2026

From Aatmanirbhar to Viksit Bharat: PM Modi’s Leadership Powers India’s Multi-Sector Triumph