గౌరవనీయులు, అధ్యక్షుడు ప్రబోవో,

ఇరుదేశాల విశిష్ట ప్రతినిధులు,

మీడియా మిత్రులకు,

నమస్కారం!

శుభ మధ్యాహ్నం!

నాకు ఎంతో ఆత్మీయమైన, గౌరవప్రదమైన స్వాగతం పలికిన నా మిత్రుడు, అధ్యక్షుడు ప్రబోవోకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

గతేడాది భారత్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధ్యక్షుడు ప్రబోవోను ముఖ్య అతిథిగా స్వాగతించే గౌరవం దక్కింది. ఇవాళ ఆయన అందించిన ఆత్మీయ, సాదర స్వాగతం మేరకు నేను ఇండోనేషియాలో పర్యటించటం నాకు ఎంతో సంతోషంగా ఉంది.

ఇవాళ ఉదయం ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని ఎంతో ఆత్మీయతతో, గౌరవంతో అందుకోవటం నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తున్నాను. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు చెందుతుంది. ఇండోనేషియా ప్రజల సద్భావాన్ని ప్రతిబింబిస్తూ.. భారత్, ఇండోనేషియా మధ్య చరిత్రాత్మక, శాశ్వతమైన స్నేహ బంధాలకు గుర్తుగా ఇది నిలుస్తుంది. ఈ విశిష్టమైన గౌరవానికి గానూ అధ్యక్షుడు ప్రబోవోకి, ఇండోనేషియా ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

ఇటీవల సంవత్సరాల్లో భారత్, ఇండోనేషియా మధ్య సంబంధాలు నూతనోత్తేజాన్ని, మరింత ఆత్మవిశ్వాసాన్ని, వ్యూహాత్మక విస్తృతిని సంతరించుకున్నాయి.

 మన మధ్య 2018లో  ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.

 

భారత్-ఇండోనేషియా భాగస్వామ్యంలో నేడు సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఈ నూతన అధ్యాయం 21వ శతాబ్దపు ప్రపంచం, మానవాళిపై అపారమైన, సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

మిత్రులారా,

రెండు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర నమ్మకం.. రక్షణ, భద్రత, సముద్రయాన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తోంది. రక్షణ రంగంలో పరస్పర వినిమయం, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారంలో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇవాళ మేం నిర్ణయించాం.

హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రత, రక్షణను మెరుగుపరిచేందుకు ఇరుదేశాల తీర రక్షక దళాలు ఇకపై కలిసి పనిచేస్తాయి. రెండు సన్నిహిత సముద్ర తీర దేశాలుగా, బ్లూ ఎకానమీ, ఓడరేవుల అభివృద్ధి, సముద్ర వాణిజ్యంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం.

మిత్రులారా,

పేదరిక నిర్మూలన, ప్రతి పౌరునికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను సమర్థవంతంగా అందించటం భారత్, ఇండోనేషియాకు అత్యంత ప్రాధాన్యతా అంశాలుగా ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి మాకున్న అనుభవాలను, పరిష్కారాలను మేం ఇప్పటికే ఇండోనేషియాతో పంచుకున్నాం. ఈ సహకారాన్ని మేం తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నాం.

ఆరోగ్య రంగంలో మా పరస్పర సహకారం ఇరుదేశాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటంలో గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ కుదిరిన ఒప్పందం వల్ల భారతదేశంలో నాణ్యతతో, సరసమైన ధరల్లో లభించే మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.

ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య నిపుణుల నైపుణ్యాభివృద్ధికి కూడా మా వంతు సహకారాన్ని అందిస్తాం. భారతదేశంలో అభివృద్ధి చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. వీటితో పాటు స్థిరమైన వ్యవసాయం, వ్యవసాయ-సాంకేతికత రంగాల్లో అత్యుత్తమ విధానాలను మేం పరస్పరం పంచుకుంటాం.

మిత్రులారా,

ఇరవై ఒకటో శతాబ్దం... సాంకేతికత ఆధారంగా నడుస్తోంది. భారత్, ఇండోనేషియా../ యువత శక్తితో నడుస్తున్న దేశాలు. మన యువతకు సాంకేతికత పట్ల సహజమైన ఆసక్తి ఉంది.

కృత్రిమ మేధ, టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో మన యువత మధ్య సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇవాళ ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. రెండు దేశాల అంకుర సంస్థల వ్యవస్థ మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మేం నిర్ణయించాం.

 

ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బెంగళూరుకు సంబంధించిన విదేశీ క్యాంపస్‌ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయనున్నాం. ఇది ఆసియాన్ ప్రాంతంలోని యువతకు ఎంతో మేలు చేస్తుంది.

అంతరిక్ష రంగంలో మన సహకారం దశాబ్దాల నమ్మకం, భాగస్వామ్యంపై ఏర్పాటైంది. దీని ఆధారంగా అంతరిక్ష రంగంలో ఉమ్మడి పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవటం, సామర్థ్య పెంపుదలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం.

మిత్రులారా,

నేటి ప్రపంచంలో సాంకేతికతలో "సరఫరా వ్యవస్థ స్థిరత్వం" కీలకంగా మారింది. కీలక ఖనిజాలు, ఉక్కు రంగాల్లో సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఇరుదేశాల కంపెనీలు స్టెయిన్‌లెస్ స్టీల్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రంగాల్లోని భాగస్వామ్యాల్లో నూతన దశను ప్రారంభిస్తున్నాయి.

మిత్రులారా,

ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలే మనకు అతిపెద్ద బలం. భారత్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో అనుసంధానం కానుండటం సంతోషకరం. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య నిర్వహణను, ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.

మిత్రులారా,

రేపు ప్రంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి పాల్గొనే గొప్ప అవకాశం నాకు లభించింది. వెయ్యేళ్లకు పైగా పురాతనమైన ప్రంబనన్ ఆలయం.. భారత్, ఇండోనేషియాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది.

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియా చరిత్రాత్మక పర్యటన శతాబ్ది ఉత్సవాలను ఇరుదేశాలు ఎంతో ఉత్సాహంతో జరుపుకోనున్నాయి. ఇండోనేషియా దేశ నిర్మాణంలో ఆ దేశ మొదటి విద్యాశాఖ మంత్రి, దూరదృష్టి గల విద్యావేత్త కి హజార్ దేవంతరా కీలక పాత్ర పోషించారు. ఆయన విద్యా విధానంపై గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనల ప్రభావం ఎంతో ఉంది. ఈ ఉమ్మడి మేధ, సాంస్కృతిక వారసత్వానికి గుర్తింపుగా ఈ శతాబ్ది ఉత్సవాలను "ఠాగూర్-దేవంతరా సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరం"గా భారత్, ఇండోనేషియా జరుపుకుంటాయి.

మిత్రులారా,

ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంలో ఏకత్వం.. భారత్, ఇండోనేషియాకు ఉమ్మడి బలాలు. ఈ రోజు ఇరుదేశాల ఎన్నికల సంఘాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రజాస్వామ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

అంతర్జాతీయ సమస్యలపై కూడా భారత్, ఇండోనేషియా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటూనే ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై పరస్పర దృక్పథాల్లో బలమైన సమన్వయం ఉంది. ఆసియాన్ కూటమికి భారతదేశం ఎల్లప్పుడూ ప్రాధాన్యతను ఇస్తూనే ఉంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో చర్చలు, దౌత్యాల పాత్ర మునుపెన్నడూ లేనంతగా కీలకమైనవని భారతదేశం విశ్వసిస్తోంది. పాలస్తీనా సమస్యపై రెండు దేశాల పరిష్కారానికి, శాశ్వత శాంతి సాధనకు మేం మద్దతును కొనసాగిస్తున్నాం.

 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో చర్చలు, దౌత్యాల పాత్ర మునుపెన్నడూ లేనంతగా కీలకమైనవని భారతదేశం విశ్వసిస్తోంది. పాలస్తీనా సమస్యపై రెండు దేశాల పరిష్కారానికి, శాశ్వత శాంతి సాధనకు మేం మద్దతును కొనసాగిస్తున్నాం.

మిత్రులారా,

ఇరుదేశాలకు సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది.

మన చరిత్ర ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉంది.

పరస్పర నమ్మకంతో వర్తమానం పెనవేసుకుంది.

ఉమ్మడి అభివృద్ధిలోనే మన భవిష్యత్ ఉంది.

ఇండోనేషియా "ఎమాస్”, భారతదేశ "వికసిత్ భారత్" కలలను మనం ఉమ్మడిగా సాకారం చేసుకుంటామనే విశ్వాసం నాకుంది.

ధన్యవాదాలు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy

Media Coverage

New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 ఆగష్టు 2026
August 21, 2026

Ease of Living Meets Strategic Strength: How India Is Building the Future in Real Time Under the Leadership of PM Modi