వెయ్యేళ్లు దాటినా సోమనాథ్ ఆలయ జెండా ఎగురుతూనే ఉంది
ఇది ప్రపంచానికి భారత్ బలాన్ని, స్ఫూర్తిని గుర్తు చేస్తుంది
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఈ ఆలయ వెయ్యేళ్ల ప్రయాణానికి గుర్తు
ఇది భారత్ ఉనికి, ఆత్మగౌరవాల వేడుక సోమనాథ్... చరిత్ర విధ్వంసం, ఓటమికి సంబంధించినది కాదు
ఇది విజయం, పునరుద్ధరణల చరిత్ర సోమనాథ్‌ను నాశనం చేయాలనుకున్నవారు చరిత్రకే పరిమితమయ్యారు

గుజరాత్‌లోని సోమనాథ్‌లో ఈ రోజు నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమయం అసాధారణమైనది... ఈ వాతావరణం అసాధారణమైనది... ఈ వేడుక అసాధారణమైనది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒక వైపు స్వయంగా మహాదేవుడు... మరోవైపు సూర్యకిరణాలు, మంత్రాల ప్రతిధ్వని, ఉప్పొంగుతున్న భక్తితో కూడిన సముద్రపు అలలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో సోమనాథ్... భక్తులందరి ఉనికితో ఈ సందర్భాన్ని మరింత దివ్యమైనదిగా, గొప్పగా మారుస్తోందని ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా తనకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో చురుగ్గా సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 72 గంటల పాటు నిరంతరాయంగా ఓంకారం జపించడం... 72 గంటల పాటు మంత్ర పఠనం చేయడం అద్భుతమని ఆయన పేర్కొన్నారు. నిన్న సాయంత్రం వెయ్యి డ్రోన్లతో... వేద గురుకులాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు నిర్వహించిన అద్భుత ప్రదర్శన సోమనాథుని వెయ్యి సంవత్సరాల గాథను ఎంతో చక్కగా వివరించిందన్నారు. 108 అశ్వాలతో సాగిన 'శౌర్య యాత్ర' ఈ రోజు ఆలయానికి చేరుకుందని ఆయన తెలిపారు. మంత్రాలు, భజనలతో భక్తులందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ ప్రదర్శన మాటలకు అతీతమని... కాలం మాత్రమే ఈ అనుభవాన్ని సంగ్రహించగలదని ఆయన వివరించారు. ఈ వేడుక దర్పం, గౌరవం, హుందాతనం, జ్ఞానం, గొప్పతనం, వారసత్వం, ఆధ్యాత్మికత, సాక్షాత్కారం, అనుభవం, ఆనందం, సాన్నిహిత్యాల కలయికగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అన్నింటికీ మించి ఇది భగవాన్ మహాదేవుని ఆశీర్వాదాలను కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ రోజు తాను మాట్లాడుతున్న సమయంలో... ప్రజలు ఇప్పుడు కూర్చున్న ఈ ప్రదేశంలో సరిగ్గా వెయ్యి సంవత్సరాల కిందట వాతావరణం ఎలా ఉండేదనే ఆలోచన తన మనసులో పదే పదే తలెత్తుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్న మన పూర్వీకుల పూర్వీకులు తమ విశ్వాసం కోసం, తమ నమ్మకం కోసం, భవగవంతుడైన మహాదేవుడి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి, తమ సర్వస్వమూ త్యాగం చేశారని ఆయన వివరించారు. వెయ్యేళ్ల కిందట తాము గెలిచామని ఆక్రమణదారులు భ్రమపడ్డారు... కానీ ఈ రోజు ఒక సహస్రాబ్ది తర్వాత కూడా సోమనాథ్ మహాదేవ్ ఆలయంపై ఉన్న జెండా యావత్ ప్రపంచానికి మన హిందూస్థాన్ బలం, సామర్థ్యాన్ని చాటిటెబుతూ సగర్వంగా ఎగురుతూ ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ పటాన్ నేలలోని ప్రతి కణం... శౌర్యం, ధైర్యం, వీరత్వానికి సాక్షిగా నిలుస్తుందన్నారు. సోమనాథ్ ఆలయ పరిరక్షణ కోసం లెక్కలేనంతమంది శివ భక్తులు తమ ప్రాణాలను త్యాగం చేశారని శ్రీ మోదీ తెలిపారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా... సోమనాథ్ రక్షణ, పునర్నిర్మాణం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ధైర్యవంతులందరికీ తలవంచి నమస్కరిస్తున్నాననీ... వారు భగవాన్ మహాదేవుని కోసం సర్వస్వం అర్పించారని శ్రీ మోదీ వివరించారు.

ప్రభాస్ పటాన్ కేవలం శివుడికే కాదు... శ్రీ కృష్ణుడితోనూ పవిత్రమయ్యిందని చెబుతూ... మహాభారత కాలంలో పాండవులు ఈ పవిత్ర స్థలంలోనే తపస్సు చేశారని శ్రీ మోదీ అన్నారు. అందుకే ఈ సందర్భం దేశంలో చోటుచేసుకున్న అనేక అద్భుత ఘటనలను స్మరించుకునే అవకాశంగా ఆయన వ్యాఖ్యానించారు. సోమనాథ్ స్వాభిమాన్ ప్రయాణం వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలోనే... 1951లో ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతుండటం అదృష్టకరమైన యాదృచ్చికంగా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పండుగ కేవలం వెయ్యి సంవత్సరాల కిందట జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేసుకునేది కాదు... ఇది వెయ్యి సంవత్సరాల అద్భుత ప్రయాణంతో పాటు భారత్ ఉనికికి, గర్వానికి గుర్తుగా నిలుస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి అడుగు, మైలురాయి వద్ద సోమనాథ్, భారత్ మధ్య స్పష్టమైన సారూప్యతలు కనిపిస్తాయని ఆయన వివరించారు. సోమనాథ్‌ను నాశనం చేయడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు జరిగినట్లే, విదేశీయులు దండయాత్రలతో శతాబ్దాలుగా భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అయినప్పటికీ సోమనాథ్ గానీ, భారత్ గానీ నాశనం కాలేదు... ఎందుకంటే భారత్,  దాని ఆధ్యాత్మిక కేంద్రాలు విడదీయలేని విధంగా ఐక్యంగా ఉన్నాయి అని శ్రీ మోదీ వివరించారు.

 

వెయ్యి సంవత్సరాల కిందట అంటే క్రీ.శ. 1026లో గజినీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి ఆలయాన్ని నాశనం చేసినప్పుడు... ఆలయాన్ని పూర్తిగా తుడిచిపెట్టినట్లుగా ఆయన భావించాడని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని సంవత్సరాల్లోనే సోమనాథ్ పునర్నిర్మాణం జరిగిందన్నారు. పన్నెండో శతాబ్దంలో రాజు కుమారపాల ఈ ఆలయాన్ని గొప్పగా పునరుద్ధరించారని ఆయన తెలిపారు. పదమూడో శతాబ్దం చివరిలో అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ సోమనాథ్‌పై దాడి చేయడానికి ధైర్యం చేసినా... జాలోర్ పాలకుడు ఖిల్జీ సైన్యాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడినట్లు ఆయన పేర్కొన్నారు. పద్నాలుగో శతాబ్దం ప్రారంభంలో జునాగఢ్ రాజు మరోసారి ఆలయ ప్రతిష్టను పునరుద్ధరించగా... అదే శతాబ్దంలో ముజఫర్ ఖాన్ సోమనాథ్‌పై మరోసారి దాడికి ప్రయత్నించాడన్నారు. అయితే అతని ప్రయత్నమూ విఫలమైందని ప్రధానమంత్రి తెలిపారు. పదిహేనో శతాబ్దంలో సుల్తాన్ అహ్మద్ షా ఆలయాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తే... అతని మనవడు సుల్తాన్ మహమ్మద్ బెగడ దానిని మసీదుగా మార్చేందుకు ప్రయత్నించాడని శ్రీ మోదీ తెలిపారు. అయితే మహాదేవ్ భక్తులు ధృడమైన ప్రయత్నాలతో ఆలయాన్ని మరోసారి పునరుద్ధరించారని గుర్తు చేశారు. పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాల్లో ఔరంగజేబు సోమనాథ్‌ను అపవిత్రం చేసి మసీదుగా మార్చడానికి మళ్ళీ ప్రయత్నించినప్పటికీ... అహల్యాబాయి హోల్కర్ ఒక కొత్త ఆలయాన్ని నిర్మించి సోమనాథ్‌కు తిరిగి జీవం పోశారని ఆయన తెలిపారు. "సోమనాథ్ చరిత్ర విధ్వంసాలకు, ఓటమికీ కాదు... విజయం, పునర్నిర్మాణాలకు ప్రతీక" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆక్రమణదారులు వస్తూనే ఉన్నారని... మతోన్మాద ఉగ్రవాదుల దాడులూ కొనసాగాయాని... అయితే ప్రతి యుగంలోనూ సోమనాథ్ ఆలయం మళ్లీ మళ్లీ పునర్నిర్మితమైందని ఆయన తెలిపారు. శతాబ్దాల పాటు జరిగిన పోరాటం... ఇంత సుదీర్ఘమైన ప్రతిఘటన... ఇంతటి అపారమైన ఓర్పు... పునర్నిర్మాణంలో సృజనాత్మకత, సమర్థత... సంస్కృతి, నమ్మకాల పట్ల ఇంతటి అచంచల విశ్వాసం ప్రపంచ చరిత్రలో సాటిలేనివని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

మన పూర్వీకుల పరాక్రమాన్ని మనం గుర్తుంచుకోవాలా వద్దా…. వారు ప్రదర్శించిన ధైర్యసాహసాల నుంచి మనం స్ఫూర్తి పొందాలా వద్దా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఏ కొడుకు, ఏ వారసుడూ తమ పూర్వీకుల వీరోచిత కార్యాలను మరచిపోకూడదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి జ్ఞాపకం ఒక బాధ్యత మాత్రమే కాదు... బలానికి మూలం కూడా అని ఆయన తెలిపారు. మన పూర్వీకుల త్యాగాలు, ధైర్యం మన స్పృహలో సజీవంగా ఉండేలా చూసుకోవాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు.

గజినీ నుంచి ఔరంగజేబు దాకా సోమనాథ్‌పై దాడి చేసినవారంతా వారి కత్తులు శాశ్వతమైన సోమనాథ్‌ను జయిస్తున్నాయని నమ్మారు... కానీ ఆ మతోన్మాదులు 'సోమ' అనే పేరులోనే అమృతం ఉందనీ, విషం తాగినా అమరుడిగానే నిలుస్తుందనే ఆలోచనను అది కలిగి ఉందని వారు అర్థం చేసుకోలేకపోయారని శ్రీ మోదీ తెలిపారు. సోమనాథ్ లోపల సదాశివుడైన మహాదేవుని చైతన్యపు శక్తి కొలువై ఉందని... ఆయన దయగలవాడు అయినా అవసరం వచ్చినప్పుడు ఉగ్రరూపం దాల్చే "ప్రచండ తాండవ శివుడు" కూడా అవుతారని శ్రీ మోదీ అన్నారు.

 

సోమనాథ్‌లో ప్రతిష్టించిన భగవాన్ మహాదేవుడి పేర్లలో ఒకటి మృత్యుంజయుడని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆయన మృత్యుంజయుడు... ఆయనే కాల స్వరూపం... సృష్టి ఆయన నుంచే ఉద్భవించి, తిరిగి ఆయనలోనే కలిసిపోతుందని శ్రీ మోదీ వివరించారు. శివుడు విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడనే నమ్మకాన్ని, ప్రతి కణంలో శంకరుడు ఉన్నాడనే నమ్మకాన్ని శ్రీ మోదీ వివరించారు. శంకరుడి లెక్కలేనన్ని రూపాలను ఎవరూ నాశనం చేయలేరనీ, జీవులందరిలోనూ మనం శివుడిని చూస్తామని, అందుకే ఏ శక్తీ మన విశ్వాసాన్ని కదిలించలేదని ఆయన స్పష్టం చేశారు. సోమనాథ్‌ను నాశనం చేయడానికి ప్రయత్నించిన ఆ మతోన్మాద ఆక్రమణదారులను కాల చక్రం కేవలం చరిత్రకే పరిమితం చేసిందనీ... ఈ పవిత్ర ఆలయం ఇప్పటికీ విశాలమైన సముద్ర తీరంలో మహోన్నత ధర్మ-ధ్వజంతో నిలిచి ఉందని ప్రధానమంత్రి వివరించారు. సోమనాథ్ ఆలయ శిఖరమూ నేడు... "నేను చంద్రశేఖరుడైన శివుడిపై ఆధారపడి ఉన్నాను, కాలం కూడా నన్ను ఏమి చేయగలదు?" అని సగర్వంగా ప్రకటిస్తోందని ఆయన పేర్కొన్నారు.

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ మన చారిత్రక గర్వానికి నిలయమైన పండుగ మాత్రమే కాదు... భవిష్యత్తు కోసం శాశ్వత ప్రయాణాన్ని సజీవంగా మార్చుకునే మాధ్యమం అని శ్రీ మోదీ తెలిపారు. ఈ సందర్భాన్ని మన ఉనికినీ, గుర్తింపునీ బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని శ్రీ మోదీ కోరారు. కొన్ని దేశాలు శతాబ్దాల నాటి వారసత్వాన్నీ ప్రపంచం ముందు తమ గుర్తింపుగా ప్రదర్శిస్తున్నప్పటికీ... భారత్ వేల సంవత్సరాల పురాతనమైన సోమనాథ్ వంటి ఎన్నో పవిత్ర స్థలాలను కలిగి ఉందన్నారు. ఇవి మన బలం, ప్రతిఘటనా శక్తి, సంప్రదాయానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రానంతరం వలసవాద మనస్తత్వం ఉన్నవారు అటువంటి వారసత్వం నుంచి తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, ఈ చరిత్రను తుడిచిపెట్టడానికి దురుద్దేశంతో కూడిన ప్రయత్నాలూ జరిగాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. సోమనాథ్ రక్షణ కోసం చేసిన త్యాగాలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. రావల్ కన్హార్దేవ్ వంటి పాలకుల ప్రయత్నాలు, వీర్ హమీర్జీ గోహిల్ పరాక్రమం, వేగ్దా భిల్ ధైర్యసాహసాలనూ శ్రీ మోదీ ప్రస్తావించారు. అలాంటి చాలా మంది వీరులు ఆలయ చరిత్రతో అనుసంధానమై ఉన్నారనీ... అయితే వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. కొంతమంది చరిత్రకారులు, రాజకీయ నాయకులు ఈ దండయాత్రల చరిత్రను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేశారనీ... మతోన్మాదాన్ని కేవలం ఆర్థికపరమైన దోపిడీగా చూపుతూ సత్యాన్ని మరుగున పరిచే పుస్తకాలు రాసేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. సోమనాథ్‌పై దాడి ఒక్కసారి కాదు... పదే పదే జరిగిందన్నారు. ఆర్థిక దోపిడీ కోసమే దాడులు జరిగి ఉంటే వెయ్యి సంవత్సరాల కిందట జరిగిన మొదటి అతిపెద్ద దోపిడీ తర్వాతే అవి ఆగిపోయేవని శ్రీ మోదీ వివరించారు. అయితే అలా జరగలేదు... సోమనాథ్ ఆలయంలోని పవిత్ర విగ్రహాలను ధ్వంసం చేశారు, ఆలయ రూపాన్ని పదే పదే మార్చారు. అయినప్పటికీ ద్వేషం, అణచివేత, భీభత్సాలతో కూడిన క్రూరమైన చరిత్రను మన నుంచి దాచి ఉంచి... సోమనాథ్ ఆలయాన్ని కేవలం దోపిడీ కోసమే నాశనం చేశారని ప్రజలకు బోధించారని ఆయన ఎత్తి చూపారు.

తమ విశ్వాసం పట్ల నిజాయితీగా ఉన్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి తీవ్రవాద ఆలోచనలకు మద్దతునివ్వరనీ, అయితే బుజ్జగింపుల ద్వారా ముందుకు నడిచే వారు ఎల్లప్పుడూ దాని ముందు తలవంచుతూనే ఉన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత్ బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి పొందినప్పుడు... సోమనాథ్‌ను పునర్నిర్మించడానికి సర్దార్ పటేల్ ప్రతిజ్ఞ చేసినప్పుడు... దానిని ఆపడానికీ ప్రయత్నాలు జరిగాయన్నారు. 1951లో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ వచ్చినప్పుడు కూడా అభ్యంతరాలు తలెత్తాయని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో సౌరాష్ట్ర పాలకుడిగా జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జీ జాతీయ గౌరవానికే అన్నింటికంటే అధిక ప్రాధాన్యమిచ్చారనీ, సోమనాథ్ ఆలయానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారని, ట్రస్ట్‌కు మొదటి ఛైర్మన్‌గా గొప్ప బాధ్యతతో పనిచేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

 

దురదృష్టవశాత్తూ సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించే శక్తులు నేటికీ దేశంలో చురుగ్గానే ఉన్నాయని శ్రీ మోదీ తెలిపారు. ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు... కత్తులకు బదులుగా ఇతర దురుద్దేశపూర్వక మార్గాల ద్వారా జరుగుతున్నాయన్నారు. అప్రమత్తత, బలం, ఐక్యతతో మనల్ని విభజించడానికి ప్రయత్నించే ప్రతి శక్తినీ ఓడించాలని ఆయన కోరారు.

మన విశ్వాసంతో, మన మూలాలతో అనుసంధానమై మనం మన వారసత్వాన్ని పూర్తి గర్వంతో కాపాడుకున్నప్పుడే మన నాగరికత పునాదులు మరింత బలపడతాయని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ వెయ్యేళ్ల ప్రయాణం మనం రాబోయే వెయ్యేళ్ల కోసం సిద్ధం కావడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

రామమందిర ప్రాణ ప్రతిష్ఠ చరిత్రాత్మక సందర్భంలో "దేవ్ సే దేశ్" దార్శనికతతో ముందుకు సాగడం గురించి ప్రస్తావిస్తూ తాను భారత్ కోసం వెయ్యి సంవత్సరాల గొప్ప దార్శనికతను వివరించినట్లు గుర్తుచేసుకున్నారు. భారత సాంస్కృతిక పునరుజ్జీవనం ఈ రోజు కోట్లాది మంది పౌరుల్లో కొత్త విశ్వాసాన్ని నింపుతోందన్నారు. ప్రతి భారతీయుడు అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతకు కట్టుబడి ఉన్నారనీ, 140 కోట్ల మంది ప్రజలు భవిష్యత్ లక్ష్యాల సాకారం పట్ల దృఢ సంకల్పంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం, ఈ తీర్మానాలను ఆశీర్వదించే సోమనాథ్ ఆలయం అందించే శక్తి మద్దతుతో భారత్ తన కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తుందనీ... పేదరికంపై పోరాటంలో విజయం సాధిస్తుందనీ... అభివృద్ధిలో కొత్త స్థాయిలను సాధిస్తుందని శ్రీ మోదీ ధ్రువీకరించారు. నేటి భారత్ వారసత్వం నుంచి అభివృద్ధికి అనే స్ఫూర్తితో ముందుకు సాగుతోందని... సోమనాథ్ ఈ రెండింటినీ కలిగి ఉందని ప్రధానమంత్రి వివరించారు. ఆలయ సాంస్కృతిక విస్తరణ, సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు, మాధవ్‌పూర్ జాతరకు పెరుగుతున్న ప్రజాదరణ, గిర్ సింహాల పరిరక్షణ మన వారసత్వాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రభాస్ పటాన్ అభివృద్ధిలో కొత్త పోకడలతో ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. దేశవిదేశాల నుంచి యాత్రికులకు ప్రత్యక్ష ప్రవేశం కల్పించే కేశోడ్ విమానాశ్రయ విస్తరణ, ప్రయాణ సమయాన్ని తగ్గించే అహ్మదాబాద్-వేరావల్ వందే భారత్ రైలు ప్రారంభం, ఈ ప్రాంతంలో తీర్థయాత్ర సర్క్యూట్ అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. భారత్ తన విశ్వాసాన్ని గుర్తుంచుకుంటుందనీ... మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, సాంకేతికతల ద్వారా భవిష్యత్తు కోసం దానిని శక్తిమంతం చేస్తుందని శ్రీ మోదీ తెలిపారు.

 

భారత నాగరికత సందేశం ఎప్పుడూ ఇతరులను ఓడించడం గురించి కాదు... జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం గురించినది అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. విశ్వాసం మనల్ని ద్వేషానికి దూరంగా ఉంచుతుంది... బలం మనల్ని విధ్వంసం అనే అహంకారాన్ని పొందకుండా చేస్తుందని ఆయన అన్నారు. సృష్టి మార్గం సుదీర్ఘమైనదే అయినప్పటికీ అది శాశ్వతమైనదన్నారు. కత్తితో హృదయాలను గెలవలేమన్న ప్రధానమంత్రి... ఇతరులను తుడిచిపెట్టాలని ప్రయత్నించే నాగరికతలు కాలక్రమేణా కనుమరుగవుతాయని సోమనాథ్ బోధిస్తున్నారని ప్రధాననంత్రి తెలిపారు. ఇతరులను ఓడించడం ద్వారా గెలవడం కాదు... హృదయాలను గెలుచుకోవడం ద్వారా ఎలా జీవించాలో భారత్ యావత్ ప్రపంచానికి నేర్పిందనీ, ఇది నేటి ప్రపంచానికి అవసరమైన ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు.

సోమనాథ్ వెయ్యి సంవత్సరాల గాథ మానవాళికి ఈ పాఠాన్ని అందిస్తుందని చెబుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. మన గతం, వారసత్వంతో అనుసంధానమై ఉంటూనే అభివృద్ధి, భవిష్యత్తుల దిశగా ముందుకు సాగడం కోసం మనమంతా ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైతన్యాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను స్వీకరించాలని... ప్రతి సవాలును అధిగమించి పురోగతి మార్గంలో వేగంగా ముందుకు సాగడానికి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నుంచి స్ఫూర్తి పొందాలని శ్రీ మోదీ సూచించారు. పౌరులందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

2026 జనవరి 8 నుంచి 11 వరకు సోమనాథ్ స్వాభిమాన్ పండగను సోమనాథ్‌లో నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని రక్షించడానికి త్యాగం చేసిన ఎందరో భారతీయ పౌరులను స్మరించుకోవడం, భవిష్యత్ తరాల సాంస్కృతిక చైతన్యానికి స్పూర్తినివ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

 

1026లో సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేసి 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా ఆలయ విధ్వంసం కోసం అనేకసార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ, సమష్టి సంకల్పం, దాని పురాతన వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల కారణంగా సోమనాథ్ ఆలయం సమర్థతకు, విశ్వాసానికి, జాతీయ గర్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలుస్తోంది.

 

స్వాతంత్య్రానంతరం ఆలయ పునరుద్ధరణకు సర్దార్ పటేల్ కృషి చేశారు. ఈ పునరుద్ధరణ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటి... 1951లో పునరుద్ధరించిన సోమనాథ్ ఆలయాన్ని అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో భక్తుల సందర్శన కోసం అధికారికంగా ప్రారంభించడం. 2026లో ఈ చరిత్రాత్మక పునరుద్ధరణ 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండడం సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌కు ప్రత్యేక ప్రాముఖ్యతను జోడిస్తుంది.

ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది సాధువులు పాల్గొని... ఆలయ ప్రాంగణంలో 72 గంటల పాటు నిరంతరాయంగా 'ఓంకారం' జపించారు.

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధానమంత్రి పాల్గొనడం భారత నాగరికత శాశ్వత స్ఫూర్తిని స్పష్టం చేస్తుంది. భారత్ సొంతమైన గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణ పట్ల ఆయన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From the lens of FM Nirmala Sitharaman: Weaving a fabric of enterprise on the loom of traditional skills

Media Coverage

From the lens of FM Nirmala Sitharaman: Weaving a fabric of enterprise on the loom of traditional skills
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to the great revolutionary Mangal Pandey ji
July 19, 2026

Prime Minister Shri Narendra Modi today, paid tributes to the great revolutionary Mangal Pandey ji on his birth anniversary. Shri Modi remarked that his courageous life continues to fill every Indian with pride even today, and his saga of valor will keep inspiring every generation of the nation.

Shri Modi posted on X;

महान क्रांतिकारी मंगल पांडे जी को उनकी जयंती पर शत-शत नमन। मातृभूमि के स्वाभिमान और सम्मान की रक्षा के लिए उन्होंने अपना सर्वस्व न्योछावर कर दिया। उनका साहसिक जीवन आज भी हर भारतीय को गर्व से भर देता है। राष्ट्रभक्ति से ओतप्रोत उनकी शौर्यगाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।