మన గొప్ప బోడో సంప్రదాయాలను గౌరవిస్తున్న ‘బగురుంబా ధహోవ్’: ప్రధానమంత్రి
ఏళ్ల నాటి ఘర్షణలకు ముగింపు పలికిన 2020 నాటి బోడో శాంతి ఒప్పందం: ప్రధానమంత్రి
దీని తర్వాత మళ్లీ నమ్మకం ఏర్పడి హింసను వీడి ప్రధాన స్రవంతిలో చేరిన వేలాది మంది యువకులు: ప్రధానమంత్రి
నేడు అస్సాం సాంస్కృతిక రాయబారులుగా ఎదుగుతున్న ప్రతిభావంతులైన బోడో యువత: ప్రధానమంత్రి

గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో నిర్వహించిన బోడో చారిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమం 'బగురుంబా ధహోవ్ 2026'ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అస్సాం సంస్కృతి చూడటం, బోడో సామాజిక వర్గ సంప్రదాయాలను నిశితంగా గమనించడం తన అదృష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. మరే ఇతర ప్రధానమంత్రి అస్సాంను తాను సందర్శించినంత తరచుగా సందర్శించలేదన్న ఆయన.. అస్సాం కళలు - సంస్కృతికి పెద్ద వేదిక లభించాలని, భారీ వేడుకల ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నట్లు ప్రధానంగా చెప్పారు. ఈ దిశగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపిన ఆయన.. భారీ స్థాయిలో జరిగిన బిహు వేడుకలు, ఝుమోయిర్ వినోందిని ప్రదర్శన, ఏడాదిన్నర కిందట ఢిల్లీలో జరిగిన భారీ బోడో మహోత్సవ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఉదహరించారు. అస్సాం కళలు, సంస్కృతి అందించే అనన్యమైన ఆనందాన్ని అనుభవించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోనని అన్నారు. బగురుంబా పండుగను నిర్వహించడంపై మరోసారి సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. దీనిని బోడో అస్తిత్వానికి నిదర్శనంగా, అస్సాం వారసత్వ ప్రతీకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అందరికీ ముఖ్యంగా కళాకారులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

బగురుంబా దహోవ్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదన్న ప్రధానమంత్రి.. ఇది బోడో సంప్రదాయాన్ని గౌరవించడానికి, బోడో సమాజంలోని ప్రముఖులను స్మరించుకోవడానికి ఒక మాధ్యమమని పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలు, సాంస్కృతిక పునరుజ్జీవనం, రాజకీయ చైతన్యానికి కృషి చేసిన బోడోఫా ఉపేంద్ర నాథ్ బ్రహ్మ, గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ, రూపనాథ్ బ్రహ్మ, సతీష్ చంద్ర బసుమతారి, మోరాడమ్ బ్రహ్మ, కనకేశ్వర్ నర్జారీ వంటి మహనీయులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బోడో సమాజంలోని గొప్ప వ్యక్తులందరికీ ప్రధానమంత్రి గౌరవపూర్వక నివాళులర్పించారు. అస్సాం సంస్కృతిని తమ పార్టీ దేశం మొత్తానికి గర్వకారణంగా భావిస్తుందన్న ఆయన.. అస్సాం చరిత్ర - వారసత్వం లేకుండా దేశ చరిత్ర అసంపూర్ణమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే బగురుంబా ధ్వౌ వంటి భారీ పండుగలను నిర్వహిస్తున్నామని.. బిహుకు జాతీయ గుర్తింపు లభించిందని.. ‘చరాయిడియో మొయిదామ్’ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి కృషి జరిగిందని ప్రధానంగా చెప్పారు. అస్సామీ భాషకు ప్రాచీన హోదా లభించిందనీ, బోడో భాషను అస్సాం సహ-అధికారిక భాషగా గుర్తించడంతో పాటు బోడో విద్యను బలోపేతం చేయడానికి ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమ నిబద్ధత కారణంగా బధౌ ధర్మానికి పూర్తి గౌరవం, గుర్తింపు లభించాయన్న ఆయన.. బాథౌ పూజను రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలోనే వీర యోధుడు లచిత్ బోర్ఫుకాన్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించటంతో పాటు బోడోఫా ఉపేంద్ర నాథ్ బ్రహ్మ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఆయన గుర్తుచేశారు. శ్రీమంత శంకరదేవ ఇచ్చిన భక్తి, సామాజిక సామరస్య సంప్రదాయాలను అలాగే జ్యోతి ప్రసాద్ అగర్వాలా కళలు, చైతన్యాన్ని అస్సాం వారసత్వంలో భాగంగా గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు జ్యోతి ప్రసాద్ అగర్వాలా వర్ధంతి అని గుర్తు చేసిన ప్రధాని.. ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు తెలియజేశారు. 

 

అస్సాం పర్యటన గురించి మాట్లాడిన ఆయన రాష్ట్రం ఇంతటి పురోగతిని సాధించడం చూసి తాను ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నట్లు చెప్పారు. ఒకప్పుడు అస్సాంలో నిత్యం రక్తపాతం జరిగేదని కానీ నేడు సాంస్కృతి వెల్లివిరుస్తోందని, ఒకప్పుడు తుపాకుల మోత వినిపించేదని కానీ ఇప్పుడు 'ఖామ్', 'సిఫుంగ్' వంటి వాయిద్యాల మధుర ధ్వనులు వినిపిస్తున్నాయని.. ఒకప్పుడు కర్ఫ్యూ కారణంగా నిశ్శబ్దం రాజ్యమేలేదని కానీ ఇప్పుడు సంగీతం ప్రతిధ్వనిస్తోందని.. ఒకప్పుడు అశాంతి, అస్థిరత ఉండేవని కానీ నేడు బగురుంబాకు సంబంధించిన మనోహరమైన ప్రదర్శనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంతటి భారీ వేడుక కేవలం అస్సాం సాధించిన విజయం మాత్రమే కాదని ఇది భారత్ సాధించిన విజయమని అన్నారు. అస్సాం సాధించిన ఈ పరివర్తన పట్ల దేశంలోని ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారని ప్రధాని ప్రముఖంగా చెప్పారు. 

అస్సాం ప్రజలు, బోడో సోదరీసోదరులు తనపై ఉంచిన నమ్మకం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాంతి, అభివృద్ధి బాధ్యతను అప్పగించారని.. ప్రజల దీవెనలతో ఆ బాధ్యత నెరవేరిందని ఆయన వ్యాఖ్యానించారు. 2020 బోడో శాంతి ఒప్పందం దశాబ్దాల తరబడి కొనసాగిన ఘర్షణలకు ముగింపు పలికిందని, నమ్మకాన్ని పునరుద్ధరించిందని  ఆయన అన్నారు. వేలాది మంది యువకులు హింసను వీడి ప్రధాన స్రవంతిలో చేరేలా ఇది చేసిందని ప్రధానంగా పేర్కొన్నారు. ఒప్పందం తర్వాత బోడో ప్రాంతంలో విద్య, అభివృద్ధి రంగాలలో కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయన్న ఆయన.. ప్రజల కృషి అత్యంత కీలక పాత్ర పోషించడంతో శాంతి రోజువారీ జీవితంలో భాగమైందని అన్నారు. 

అస్సాం శాంతి, అభివృద్ధి, గర్వం అనేవి శాంతి మార్గాన్ని ఎంచుకున్న స్థానిక యువత చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీనిని ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. శాంతి ఒప్పందం జరిగినప్పటి నుంచి ప్రభుత్వం బోడోలాండ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయటంతో పాటు పునరావాస ప్రక్రియను వేగవంతం చేసిందని అన్నారు. దీనితో పాటు వేలాది మంది యువకులు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కోట్లాది రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

తమ ప్రభుత్వ ప్రయత్నాల ఫలితాలు నేడు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రతిభావంతులైన బోడో యువత అస్సాం సాంస్కృతిక రాయబారులుగా మారుతున్నారని, క్రీడల్లో రాణిస్తున్నారని.. కొత్త ఆత్మవిశ్వాసంతో కలలు కనటంతో పాటు ఆ కలలను నెరవేర్చుకుంటూ రాష్ట్ర పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

అస్సాం కళలు, సంస్కృతి, అస్తిత్వానికి గౌరవం లభించినప్పుడల్లా కొంతమంది ఇబ్బంది పడుతున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ‘అస్సాంకు దక్కే గౌరవాన్ని అభినందించని వారు ఎవరు?’ అని అడిగిన ఆయన.. భూపెన్ హజారికాకు 'భారతరత్న' ఇవ్వడాన్ని వ్యతిరేకించింది ప్రతిపక్ష పార్టీయమేనని, అలాగే అస్సాంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటును వ్యతిరేకించింది కూడా వారేనని అన్నారు. నేడు కూడా తాను అస్సాం సంస్కృతికి సంబంధించిన దుస్తులు, వస్తువులను ధరించినప్పుడు ఎగతాళి చేసేది ప్రతిపక్షమేనని ప్రధాని వ్యాఖ్యానించారు. 

కేవలం ప్రతిపక్షాల వల్లే అస్సాం, బోడోలాండ్ దశాబ్దాల పాటు ప్రధాన స్రవంతికి దూరంగా ఉండిపోయాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా చెప్పారు. వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అస్సాంలో అస్థిరతను సృష్టించారని.. రాష్ట్రాన్ని హింస అనే మంటల్లోకి నెట్టేశారని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అస్సాం అనేక సవాళ్లను ఎదుర్కొందన్న ఆయన.. అయితే అప్పటి పాలకులు సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి బదులు ఆ సమస్యలనే రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీని విమర్శించిన ఆయన.. నమ్మకం అవసరమైనప్పుడు వారు విభజన బీజాలు నాటారని, చర్చలు జరపాల్సిన సమయంలో వాటిని నిర్లక్ష్యం చేసి సంప్రదింపుల తలుపులు మూసివేశారని ప్రముఖంగా చెప్పారు. బోడోలాండ్ స్వరం ఎప్పుడూ సరైన రీతిలో వినబడలేదని ఆయన పేర్కొన్నారు. అస్సాంకు సాంత్వన, సేవ అవసరమైనప్పుడు దానికి బదులుగా చొరబాటుదారుల కోసం ద్వారాలు తెరిచి వారిని స్వాగతించడంపైనే దృష్టి సారించారని ఆయన అన్నారు. 

 

ప్రతిపక్ష పార్టీ అస్సాం ప్రజలను తమ సొంతవారిగా భావించదని.. తమకు విధేయంగా ఉంటూ ఓటు బ్యాంకుగా మారే విదేశీ చొరబాటుదారులకే ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతిపక్షాల పాలనలో చొరబాటుదారులు వస్తూనే ఉన్నారన్న ప్రధాని.. వారు లక్షలాది బిగాల భూమిని ఆక్రమించుకున్నారని.. వారికి అప్పటి ప్రభుత్వాలు సహాయం చేశాయని అన్నారు. నేడు శ్రీ హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో ప్రభుత్వం లక్షలాది బిగాల భూమిని చొరబాటుదారుల నుంచి విడిపించి అస్సాం అసలైన వారసులకు తిరిగి అప్పగిస్తున్నందుకు ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎల్లప్పుడూ అస్సాం, మొత్తం ఈశాన్య భారత్‌ను నిర్లక్ష్యంతో చూశాయన్న ఆయన.. అవి ఇక్కడి అభివృద్ధిని ఎన్నడూ ముఖ్యమైనదిగా భావించలేదని, ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాన్ని కష్టాల్లోకి నెట్టాయని ఆయన ప్రముఖంగా చెప్పారు. 

ప్రతిపక్షాలు చేసిన పాపాలను కడిగివేసే పనిని కేంద్ర, రాష్ట్రాల్లోని తమ ప్రభుత్వాలు చేస్తున్నాయని.. నేడు కనిపిస్తున్న అభివృద్ధి వేగమే దానికి నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. బోడో-కచారి సంక్షేమ స్వయం ప్రతిపత్తి మండలి ఏర్పాటు, బోడోలాండ్ కోసం రూ. 1500 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కేటాయింపు, కోక్రాఝర్‌లో మెడికల్ కాలేజ్ - హాస్పిటల్ ఏర్పాటు, అలాగే తాముల్పూర్‌లో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నర్సింగ్ కాలేజీలు, పారామెడికల్ సంస్థలు యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయన్న ఆయన.. గోబర్ధన, పర్బత్‌ఝోరా, హరిసింగా ప్రాంతాలలో పాలిటెక్నిక్, శిక్షణ సంస్థలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 

 

బోడో సామాజిక వర్గ సంక్షేమం కోసం మెరుగైన విధాన రూపకల్పనకు వీలు కల్పించేలా ప్రత్యేక సంక్షేమ శాఖ, 'బోడోలాండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ'ని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రధాని చెప్పారు. మెరుగైన మౌలిక సదుపాయాల ద్వారా తమ ప్రభుత్వం ప్రజల మనసుల మధ్య, అస్సాం - ఢిల్లీ మధ్య, అలాగే అస్సాం లోపల ఉన్న దూరాలను తగ్గించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాలకు ఇప్పుడు రహదారులు వచ్చాయన్న ఆయన.. కొత్త రోడ్లు మరిన్ని అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. కోక్రాఝర్‌ను భూటాన్ సరిహద్దుతో కలిపే బిష్మురి-సరల్‌పరా రహదారి ప్రాజెక్టు, దీని కోసం కేటాయించిన కోట్లాది రూపాయలతో పాటు ప్రతిపాదిత కోక్రాఝర్-గెలెఫు రైలు ప్రాజెక్టును ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఈ రైలు ప్రాజెక్టును 'ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు'గా ప్రకటించి 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో భాగం చేయడం వల్ల వాణిజ్యం, పర్యాటకం గణనీయంగా పెరుగుతాయని ఆయన తెలిపారు.

సమాజం మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడు, చర్చలు - నమ్మకం బలంగా ఉన్నప్పుడు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించినప్పుడు సానుకూల మార్పు కనిపిస్తుందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. అస్సాం, బోడోలాండ్ ఈ దిశగానే పురోగమిస్తున్నాయన్న ఆయన.. అస్సాం ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, పురోగతి భారతదేశ వృద్ధి కథనానికి కొత్త బలాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో అస్సాం ఒకటిగా నిలుస్తోందన్న ఆయన.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోందని, ఈ పరివర్తనలో బోడోలాండ్‌- స్థానిక ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నేటి ఈ భారీ వేడుకను పురస్కరించుకొని ప్రధానమంత్రి మరోసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ.. కేంద్ర మంత్రులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పవిత్ర మార్గరీటా.. ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో బోడో సామాజిక వర్గ గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే చారిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమం 'బగురుంబా ధహోవ్ 2026'లో ప్రధానమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోడో సామాజిక వర్గానికి చెందిన 10,000 మందికి పైగా కళాకారులు ఒకే వేదికపైన సమన్వయంతో 'బగురుంబా' నృత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కళాకారులు ఈ వేడుకలో భాగస్వాములయ్యారు.

ప్రకృతి నుంచి గాఢ ప్రేరణ పొందిన బగురుంబా.. బోడో సామాజిక వర్గానికి చెందిన జానపద నృత్యాలలో ఒకటి. వికసించే పువ్వుల మాదిరిగా ఉండే ఈ నృత్యం మానవ జీవితం, ప్రకృతికి మధ్య ఉన్న సామరస్యాన్ని తెలియజేస్తోంది. సంప్రదాయ యువ బోడో మహిళలు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పురుషులు సంగీతకారులుగా ఉంటారు. సీతాకోకచిలుకలు, పక్షులు, ఆకులు, పువ్వుల కదలికలను అనుకరించే మృదువైన కదలికలే ఈ నృత్యానికి ఉన్న ప్రత్యేకత. సాధారణంగా సమూహాలుగా వలయాకారంలో లేదా వరుసలలో నిర్వహించే ఈ ప్రదర్శనలు చూసేందుకు అత్యంత అందంగా ఉంటాయి. 

బోడో ప్రజల విషయంలో బగురుంబా నృత్యానికి లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. శాంతి, సంతానోత్పత్తి, ఆనందం, సామూహిక సామరస్యాన్ని సూచించే ఈ నృత్యం బోడో కొత్త సంవత్సరం 'బైసాగు', 'డొమాసి' వంటి పండుగలతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data

Media Coverage

Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds India’s 7.8% GDP growth
August 31, 2026

The Prime Minister, Shri Narendra Modi has termed India’s 7.8% GDP growth in first quarter of FY 2026-27 a “herculean feat”. Shri Modi said that the achievement reflects the collective strength and resilience of the people of India, despite oil price shocks, supply chain disruptions and global uncertainties.

Shri Modi posted on X:

India’s exemplary GDP growth of 7.8% during Q1 of FY 2026-27 is a herculean feat.

The collective strength of our people ensured India delivered such growth despite oil price shocks and supply chain issues in the midst of global uncertainties.

Doomsayers were doomed and India bloomed…yet again!