· “వికసిత భారత్‌ దిశగా దేశం నేడు శరవేగంగా పయనిస్తున్న నేపథ్యంలో బెంగాల్ భాగస్వామ్యం వాంఛనీయం... అత్యావశ్యకం”
· “ఈ సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు... ఆవిష్కరణలు... పెట్టుబడులకు నవ్యోత్తేజమిస్తోంది”
· “భారతదేశ భవిష్యత్తుకు బెంగాల్‌ పురోగమనమే పునాది”
· “ఈ నగర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు ఒక పైప్‌లైన్కు పరిమితం కాదు... ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చే నిబద్ధతకు నిదర్శనం”
· “చౌక.. కాలుష్యరహిత... ఇంధన సౌలభ్యాన్ని సుసాధ్యం చేసే భారత్‌ వైపు మనమిప్పుడు అడుగులు వేస్తున్నాం”

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్‌లో నగర గ్యాస్ సరఫరా (సిజిడి) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నగర గ్యాస్ సరఫరా (సిజిడి) నెట్‌వర్క్‌ విస్తరణలో ఇదొక కీలక ముందడుగు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో- చారిత్రక అలీపూర్‌దౌర్‌ గడ్డమీదినుంచి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత సుసంపన్న సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దీని సరిహద్దులే కాకుండా ఇక్కడి ప్రాచీన సంప్రదాయాలు, సంబంధాలు కూడా ఈ అంశాన్ని స్పష్టంగా నిర్వచిస్తాయని చెప్పారు. మన పొరుగు దేశం భూటాన్‌తో అలీపూర్‌దౌర్‌ సరిహద్దును పంచుకుంటుండగా, దీనికి సరసనేగల అస్సాం ఈ ప్రాంతాన్ని అక్కున చేర్చుకుంటుందన్నారు. మరోవైపు జల్పాయ్‌గురి ప్రకృతి సౌందర్యం, కూచ్బెహార్ ప్రతిష్ఠ ఈ ప్రాంతంలో అంతర్భాగాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాల్ వారసత్వం, ఐక్యతలోనూ విశిష్ట పాత్రగల ఈ సుసంపన్న అలీపూర్‌దౌర్‌ నేలను సందర్శించడం తనకు దక్కిన గౌరవమని ఆయన హర్షం ప్రకటించారు.

“వికసిత భారత్‌ దిశగా దేశం నేడు శరవేగంగా పయనిస్తున్న నేపథ్యంలో బెంగాల్ భాగస్వామ్యం వాంఛనీయం మాత్రమేగాక అత్యావశ్యకం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు నవ్యోత్తేజం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ మేరకు “భారత్‌ భవిష్యత్తుకు బెంగాల్ ప్రగతి ఒక మూలస్తంభం” అంటూ- ఈ ప్రయాణంలో నేడు మరో కీలక ఘట్టాన్ని చేరుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా అలీపూర్‌దౌర్‌, కూచ్ బెహార్‌లలో నగర గ్యాస్ సరఫరా (సిజిడి) ప్రాజెక్టును ప్రారంభించామని ఆయన ప్రకటించారు. దీనిద్వారా 2.5 లక్షలకుపైగా ఇళ్లకు పైప్‌లైన్‌ ద్వారా సురక్షిత, కాలుష్యరహిత, గ్యాస్‌ సరఫరా సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల సురక్షిత గ్యాస్‌ సరఫరాకు భరోసా లభిస్తుంది కాబట్టి, వంటగ్యాస్‌ సిలిండర్ల వల్ల వాటిల్లే ముప్పుపై ఆందోళన తొలగిపోతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా ‘సిఎన్‌జి’ స్టేషన్ల విస్తరణతో కాలుష్యరహిత ఇంధనం లభ్యత పెరిగి, ఖర్చు తగ్గడంతోపాటు సమయ సద్వినియోగం, పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉంటాయన్నారు. ఈ కొత్త ప్రాజెక్టు ప్రారంభంపై అలీపూర్‌దౌర్‌, కూచ్ బెహార్ పౌరులకు ఆయన అభినందనలు తెలిపారు. “ఈ నగర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు ఒక పైప్‌లైన్‌కు పరిమితం కాదు... ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం” అని స్పష్టం చేశారు.

 

ఇంధన రంగంలో భారత్‌ సాధించిన అద్భుత ప్రగతిని వివరిస్తూ- గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు దేశం వేగంగా పయనిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో 2014 నాటికి సిటీ గ్యాస్ సేవలు కేవలం 66 జిల్లాలకు పరిమితం కాగా, నేడు ‘సిజిడి’ నెట్‌వర్క్ 550 జిల్లాలకు విస్తరించిందని వెల్లడించారు. ఇప్పుడిది చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా చేరువ అవుతోందని లక్షలాది ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక ‘సిఎన్‌జి’ వాడకం విస్తృతితో ప్రజా రవాణా రంగంలో పెనుమార్పు కనిపిస్తున్నదని, ముఖ్యంగా కాలుష్య స్థాయి గణనీయంగా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజారోగ్యం మెరుగుపడటమే కాకుండా ఆర్థిక భారం కూడా తగ్గుతుందని చెప్పారు.

గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు భారత్‌ పయనాన్ని ప్రధానమంత్రి ఉజ్వల యోజన వేగవంతం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు 2016లో ప్రారంభించిన ఈ పథకం వంటింటి పొగ నుంచి లక్షలాది పేద మహిళలను విముక్తం చేసిందని చెప్పారు. దీంతో వారి ఆరోగ్యం చక్కబడటమే కాకుండా వంటింటి గౌరవం ఇనుమడించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశంలో 2014 నాటికి వంట గ్యాస్‌ కనెక్షన్లు 14 కోట్లకన్నా తక్కువగా ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 31 కోట్లు దాటిందని వివరించారు. తద్వారా సార్వత్రిక గ్యాస్ సౌలభ్యం సంకల్పాన్ని సాకారం చేసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం బలోపేతం చేయడంతో వంటగ్యాస్‌ పంపిణీదారుల సంఖ్య రెట్టింపు అయిందని, దేశంలో నేడు ప్రతి మూలకూ గ్యాస్‌ సరఫరా చేరువైందని ఆయన చెప్పారు. ఈ మేరకు 2014 నాటికి దేశంలో వంటగ్యాస్‌ సరఫరాదారుల సంఖ్య 14,000కన్నా తక్కువ కాగా, ఇప్పుడు 25,000కు పెరిగిందని వివరించారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్యాస్ సిలిండర్లు సులభంగా దొరుకుతుందని, దేశవ్యాప్తంగా ఇళ్లకు పరిశుభ్ర వంట ఇంధనం అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు.

 

ఊర్జా గంగా ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ- గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు ఇదొక విప్లవాత్మక ముందడుగని ప్రధానమంత్రి అభివర్ణించారు. దీనికింద దేశంలోని తూర్పు రాష్ట్రాలను అనుసంధానిస్తూ గ్యాస్ పైప్‌లైన్‌లను విస్తరించామని చెప్పారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్, ఇతర ప్రాంతాలలో గ్యాస్ లభ్యత గణనీయంగా పెంచామని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఇలా నిరంతరం కృషి చేసినందువల్ల ఇంధన లభ్యత విస్తరణతో పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు అందివచ్చాయని ప్రధాని వ్యాఖ్యానించారు. పైప్‌లైన్ నిర్మాణం నుంచి గ్యాస్ సరఫరా దాకా వివిధ స్థాయులలో ఉపాధి కల్పన ఇనుమడించి, గ్యాస్ ఆధారిత పరిశ్రమలపై ఆధారపడిన పారిశ్రామికావరణ వ్యవస్థను బలోపేతం చేసిందని వ్యాఖ్యానించారు. “భారత్‌ ఇప్పుడు చౌక, కాలుష్యరహిత, ఇంధన సౌలభ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

భారత్‌ సంస్కృతి, జ్ఞానం, శాస్త్ర పురోగమనానికి పశ్చిమ బెంగాల్ ప్రధాన కూడలిగా ఉందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. కాబట్టి బెంగాల్ అభివృద్ధి చెందనిదే, వికసిత భారత్‌ సంకల్ప సాకారం సాధ్యంకాదని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం గత దశాబ్దంలో వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. ఆ మేరకు బెంగాల్ పురోగమన వేగం పెంచడం లక్ష్యంగా పూర్వా ఎక్స్‌ ప్రెస్‌వే, దుర్గాపూర్ ఎక్స్‌ ప్రెస్‌వే, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు ఆధునికీకరణ, కోల్‌కతా మెట్రో విస్తరణ, న్యూ జల్పాయ్‌గురి స్టేషన్ నవీకరణ, దువార్స్‌ మార్గంలో కొత్త రైళ్లు నడపడం, అనేక కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల జాబితాను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “ఇవాళ కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్ కేవలం ఒక పైప్‌లైన్ కాదు... దేశ పురోగమనానికి జీవనాడి” అని శ్రీ మోదీ అన్నారు. జన జీవన సౌలభ్యం కల్పనకు, బెంగాల్‌కు ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంపై ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన పునరుద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రగతి పథంలో సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్, రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత శ్రీ సువేందు అధికారి, అలీపూర్‌దౌర్‌ లోక్‌సభ సభ్యుడు శ్రీ మనోజ్ టిగ్గా తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ సిటీగ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు రూ.1010 కోట్లకుపైగా నిధులతో చేపడుతుండగా, 2.5 లక్షలకుపైగా గృహాలకు, 100కుపైగా వాణిజ్య సంస్థలతోపాటు పరిశ్రమలకు పైప్‌లైన్‌ ద్వారా సహజ వాయువు (పిఎన్‌జి) సరఫరా చేయడం అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశించిన కనీస పని కార్యక్రమం (ఎండబ్ల్యుపి)కి అనుగుణంగా సుమారు 19 ‘సిఎన్‌జి’ స్టేషన్ల ఏర్పాటు ద్వారా వాహనాలకు ‘సిఎన్‌జి’ సరఫరా చేస్తుంది. ఈ ప్రాజెక్టుతో విశ్వసనీయ, పర్యావరణ హిత, చౌక ఇంధన సరఫరా సౌలభ్యం కలగడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల సృష్టికీ వీలుంటుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Conferred With Uzbekistan's Highest Honour For Foreign Leaders

Media Coverage

PM Modi Conferred With Uzbekistan's Highest Honour For Foreign Leaders
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఆగష్టు 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour