ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్లోని సూరత్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూరత్, నవసారి ప్రజాప్రతినిధులు అనేకమందిని అభినందిస్తూ- సేవా స్ఫూర్తికి గుజరాత్ ప్రజల ఆమోదం లభించిందని గుర్తుచేశారు. ఈ భారీ విజయాన్ని సేవా తత్పరత మరింత విస్తరించే దిశగా ప్రజలిచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఎన్నికైన ప్రతినిధులందరూ మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ దార్శనికతను సాకారం చేయడంలో వారంతా పోషించాల్సిన కీలక పాత్రను ఆయన ఉద్ఘాటించారు. “సఫల గుజరాత్, సఫల భారత్ రూపుకల్పనే మా సంకల్పం. దేశంలోని ప్రతి గ్రామాన్ని, జిల్లాను, నగరాన్ని అభివృద్ధి చేయడం ద్వారానే ఇది సాకారం కాగలదు” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

నేడు పర్యావరణ దినోత్సవం కావడం ఒక శుభపరిణామమని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో ఒకటైన సూరత్లో ఈ రోజున తానుండటం ఆనందాన్నిస్తోందని, ఎంతో గర్వంగా కూడా ఉందని ప్రకటించారు. ఒకప్పుడు ప్లేగు మహమ్మారి బారినపడి అష్టకష్టాలూ పడిన సూరత్ నగరం పరిశుభ్రతకు ప్రతీకగా గుర్తింపు పొందడాన్ని గుర్తుచేశారు. పౌరులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సహా రెండున్నర దశాబ్దాలుగా సంబంధిత వర్గాలన్నీ చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఈ ఘనత సొంతమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. “ఆనాడు ప్లేగు మహమ్మారి అతలాకుతలం చేసిన ఈ నగరం, ఈనాడు పరిశుభ్రతకు మారుపేరుగా నిలవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

కాలుష్య రహిత భవిష్యత్తు వైపు ప్రపంచ ప్రస్థానంలో గుజరాత్ మార్గదర్శక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. చారిత్రక చరంకా సోలార్ పార్కు సహా 2009లో భారత తొలి వాతావరణ మార్పుల విభాగం ఏర్పాటులో రాష్ట్రం దూరదృష్టిని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రకృతి-ప్రగతి మధ్య సమతౌల్యంపై జాతీయ సూత్రానుగుణంగా సూరత్ ఎంతో చక్కని ఉదాహరణగా నిలుస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. వినూత్న ‘వర్తుల ఆర్థిక వ్యవస్థ’ దిశగా పారిశ్రామిక అవసరాల కోసం మురుగునీటి శుద్ధి సహా పన్నెండేళ్లుగా దేశవ్యాప్తంగా సాగుతున్న ‘వ్యర్థం నుంచి అర్థం’ ఉద్యమం ద్వారా ఈ నగరం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్ తాగునీటి, మురుగుశుద్ధి భద్రతకు భరోసా ఇస్తూ తాపి బ్యారేజ్ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర పడటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థ వైపు సూరత్ వేగంగా సాగుతుండటం, పెరుగుతున్న మెట్రో నెట్వర్క్, హజీరా పారిశ్రామిక ప్రాంతంలో పూర్తి పునరుత్పాదక శక్తితో నడిచే గ్రీన్ స్టీల్ ఉత్పత్తి వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. “మన బస్సులు విద్యుత్తుతో నడిచేవిగా చూడటం నుంచి కాలుష్య రహిత ఇంధనంతో ఉక్కు ఉత్పత్తి దాకా వాస్తవ కాలుష్య రహిత నగరంగా సూరత్ ప్రత్యేక గుర్తింపును మరింత బలోపేతం చేస్తాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రస్తుతం నడుస్తున్నది కరోనా మహమ్మారి, ప్రపంచ సంఘర్షణలు, ఇంధన సరఫరా వ్యవస్థల్లో అస్థిరతతతో కూడిన ‘విపత్తుల దశాబ్దం’ అని ఆయన అభివర్ణించారు. ఈ అసాధారణ సవాళ్లను ప్రస్తావిస్తూ- ఈ భారీ ప్రపంచ సంక్షోభాలను దృఢంగా తట్టుకున్న 140 కోట్ల మంది భారతీయులను ప్రధానమంత్రి ప్రశంసించారు. భారత ఇంధన స్వయంసమృద్ధి దిశగా గుజరాత్ అవిరళ కృషిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. దేశంలోని 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో 5వ వంతు (50 గిగావాట్లు) ఈ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. తద్వారా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి ఆధునిక రంగాల్లో అగ్రస్థానం ఆక్రమించడానికి సిద్ధంగా ఉందన్నారు. గత పన్నెండేళ్లుగా రూపుదిద్దిన ఇంధన సామర్థ్యాల కీలక ప్రాధాన్యాన్ని వివరిస్తూ సౌర శక్తి, ఇథనాల్ మిశ్రమం, రైల్వే విద్యుదీకరణ, అణుశక్తి, ఆధునిక విద్యుత్ ప్రసార నెట్వర్క్లు, గ్యాస్ పైప్లైన్లు, రేవుల్లో నిల్వ సామర్థ్యాల భారీ విస్తరణలో చారిత్రక పెట్టుబడుల గురించి ఆయన విశదీకరించారు. “ఇంధన వనరుల విషయంలో స్వావలంబన ఎంత ఆవశ్యకమో ప్రస్తుత ప్రపంచ సంక్షోభం స్పష్టం చేస్తోంది. పన్నెండేళ్లలో దేశం సంతరించుకున్న అపార సామర్థ్యం నేడెంతో కీలకం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు తాను హజీరాను సందర్శించడాన్ని గుర్తుచేస్తూ- ఆ ప్రాంతాన్ని కేవలం పారిశ్రామిక మండలిగా మాత్రమేగాక ఇంధనం, ఉక్కు, రక్షణ ఉత్పత్తులు, ప్రపంచ సముద్ర వాణిజ్యం సహా సమగ్ర, వర్ధమాన వ్యవస్థగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ సముద్రవాణిజ్య-పారిశ్రామిక కేంద్రాన్ని స్వయంసమృద్ధ భారత్ కార్యక్రమానికి సజీవ నిదర్శనంగా పేర్కొన్నారు. స్వయంసమృద్ధ భారత్ ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ, చారిత్రకంగా దేశాన్ని విదేశీ సంస్థలపై ఆధారపడేలా చేసిన దేశంలోని నిరాశావాద వర్గాల వైఖరిని ఆయన ఖండించారు. “పరాధీన దేశమేదైనా తాను నిష్పాక్షికంగా చేరాల్సిన సమున్నత ప్రగతి శిఖరాలను అందుకోలేదన్నది వాస్తవం. దేశ సంకల్పాన్ని నిరంతరం కించపరిచే వారు దీన్ని విస్మరిస్తారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు

స్వయం సమృద్ధి సాధనలో కీలకమైన ఆధునిక అనుసంధానంపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ దిశగా ప్రత్యేక రవాణా కారిడార్, బుల్లెట్ రైలు, కొత్తగా ప్రారంభించిన వడోదర-ముంబై ఎక్స్ప్రెస్వే విభాగం వంటి భారీ ప్రాజెక్టులన్నీ పారిశ్రామిక-వాణిజ్య వృద్ధికి కీలక ఉత్ప్రేరకాలని ఆయన పేర్కొన్నారు. లోగడ తగినంతగా సేవలందని గిరిజన, మారుమూల ప్రాంతాలకు చేరువయ్యే మౌలిక సదుపాయాల కల్పన చేపట్టామని వివరించారు. ఇందులో దాహోద్-బోడెలి-వాపి కారిడార్ వంటి అభివృద్ధి కార్యక్రమం సహజంగానే సార్వజనీనమైనదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఛోటా ఉదయ్పూర్, నర్మద, భరూచ్, తాపి గిరిజన ప్రాంతాలకు 4 వరుసల రహదారి సదుపాయం కల్పించడం ప్రయాణ సమయాన్ని, రవాణా వ్యయాన్ని ప్రభుత్వం ఆదా చేస్తున్నదని పేర్కొన్నారు. అదే సమయంలో ఐక్యతా విగ్రహం, సపుతారా వంటి సందర్శనీయ ప్రదేశాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటక రంగాలకు అసాధారణ సంధానం కల్పిస్తోందని తెలిపారు. “మన గిరిజన, గ్రామీణ ప్రాంతాల ఆధునిక అనుసంధానం ద్వారా అక్కడి ప్రజలకు విద్య, వైద్యం తదితర అద్భుత సౌకర్యాలు, మెరుగైన ఆర్జన అవకాశాలు అందేవిధంగా చూస్తున్నాం” అని శ్రీ మోదీ వివరించారు.

సూరత్లోని కార్మిక వర్గాలకు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ దిశగా నగరంలో ఒక ఆధునిక ‘ఈఎస్ఐసీ’ ఆస్పత్రిని ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రగతి ప్రస్థానంలో ఈ కీలక మలుపులను ప్రభుత్వంపై దేశం నిరంతరం ప్రదర్శిస్తున్న అపార ఎన్నికల విశ్వాసానికి నిదర్శనాలుగా ఆయన అభివర్ణించారు. భారత పౌరుల అపరిమిత ఆశావాదాన్ని కొనియాడుతూ, మరింత దీక్షతో కార్యాచరణకు ఆయన పిలుపునిచ్చారు. సంపూర్ణ ప్రగతిశీల దేశానికి రూపునివ్వగల ప్రజల సమష్టి శక్తిపై తనకు ప్రగాఢ విశ్వాసం ఉందని చెబుతూ- “ఉన్నత ఆకాంక్షలు, అపరిమిత ఆశావాదం నిండిన దేశం భారత్. మన మానవ వనరుల సంపూర్ణ సమీకరణ, సద్వినియోగం ద్వారా మనం సాధించలేని లక్ష్యమంటూ ఏదీ ఉండదు” అని పునరుద్ఘాటిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Economy भी, Ecology भी। pic.twitter.com/XapW1PkrUV
— PMO India (@PMOIndia) June 5, 2026
बीते 12 वर्षों से देश में waste to wealth का एक बहुत बड़ा जन-आंदोलन चला है। pic.twitter.com/ME2KMiPcDu
— PMO India (@PMOIndia) June 5, 2026
Today, the world is facing an unprecedented set of challenges. But with the collective efforts of 140 crore Indians, the country continues to move ahead with confidence and optimism. pic.twitter.com/GUc3cj4UXA
— PMO India (@PMOIndia) June 5, 2026


