· “ఈ మౌలిక సదుపాయాలతో అనుసంధానం మెరుగుపడి, తమిళనాడు ప్రజలందరికీ గణనీయ ప్రయోజనం చేకూరుతుంది”
· “అధిక-నాణ్యత మౌలిక సదుపాయాల కల్పించడమంటే ప్రజలకు సాధికారత ఇవ్వడమే”
· “కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లుగా తమిళనాడు రహదారుల నిర్మాణానికి భారీ పెట్టుబడులు పెట్టినందువల్ల యాత్రికులకు ప్రయాణ సౌలభ్యం సహా వ్యవసాయ.. సముద్ర ఉత్పత్తుల నిరంతర రవాణాకు భరోసా లభిస్తుంది”
· “గత దశాబ్దంలో రైల్వే రంగంలో చారిత్రక మార్పులు వచ్చాయి... తమిళనాడులో ఈ పరిణామం స్పష్టమవుతోంది... తద్వారా ఆధునిక.. సమర్థ.. ప్రజా కేంద్రక రవాణా వ్యవస్థగా ఇది రూపొందుతోంది”
· “మా ‘మేక్ ఇన్ ఇండియా’ దృక్కోణంతో స్వావలంబన ఇనుమడిస్తూ మన యువతకు ఉద్యోగావకాశాలు లభించడం ఎంతో గర్వకారణం”
· “కేంద్ర బడ్జెట్ తమిళనాడును అరుదైన ఖనిజాల కారిడార్‌లో అగ్రభాగాన నిలిపింది.. తద్వారా అధునాతన తయారీ.. పరిశోధన-సాంకేతిక ప్రగతికి ఉత్తేజం లభిస్తుంది”

తమిళనాడులోని పవిత్ర నగరం మదురైలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రూ.4,400 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిండంతోపాటు కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- తమిళనాడు ప్రగతి ప్రస్థానంలో నేటి కార్యక్రమం ఒక గర్వించదగిన అధ్యాయమని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో అనుసంధానం మెరుగుదల, ఆర్థిక వ్యవస్థ వృద్ధి, యువతకు గణనీయ ఉద్యోగావకాశాల కల్పన, లక్షలాది జనజీవన సౌలభ్య కల్పనే ఈ ప్రాజెక్టుల లక్ష్యమన్నారు. అధిక నాణ్యతగల మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన ధ్యేయం ప్రజలకు సాధికారత నివ్వడమేనని ప్రధానమంత్రి వివరించారు. “రైతులకు మార్కెట్లను చేరువ చేయడం, రహదారుల మెరుగుదల, యాత్రిక-పర్యాటకులకు ప్రయాణ సౌలభ్యం, వ్యాపారాలకు వేగవంతమైన రవాణా” వంటి ప్రయోజనాలు సమకూరుతాయని అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

“గడచిన పన్నెండేళ్లుగా తమిళనాడు హైవే నెట్‌వర్క్‌లో కేంద్ర ప్రభుత్వం గణనీయ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో 2014 నుంచి 4 వేల కిలోమీటర్లకు పైగా హైవేలు నిర్మితమయ్యాయి” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మరక్కణం-పుదుచ్చేరి సెక్షన్ 4 వరుసల రహదారితోపాటు తీరప్రాంత పర్యాటకం, వాణిజ్యల బలోపేతానికి రూ.2,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, పరమకుడి-రామనాథపురం మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించేందుకు రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడి పెడతారని పేర్కొన్నారు. ఈ రెండో ప్రాజెక్ట్ వల్ల రామేశ్వరం, ధనుష్కోటి  వంటి ప్రదేశాలకు ప్రయాణ సౌలభ్యం గణనీయంగా మెరుగవుతుందని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల నిరంతర రవాణాకు భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు.

 

గత దశాబ్దంలో రైల్వే రంగంలో చారిత్రక మార్పులు వచ్చాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు “తమిళనాడులో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. మేం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రైల్వేలకు బడ్జెట్ కేటాయింపులు దాదాపు 9 రెట్లు పెరిగాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంటే- 2009-2014 మధ్య సగటు వార్షిక కేటాయింపు రూ.880 కోట్లు కాగా, 2026–27లో రూ.7,600 కోట్లకు పెరిగిందని ప్రధానమంత్రి గణాంకాలను ఉటంకించారు. రాష్ట్రంలో 1,300 కిలోమీటర్లకు పైగా కొత్త రైలు మార్గాలు వేయగా, విద్యుదీకరణ పనులు 97 శాతం పూర్తయిందని, వందలాది ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంతో భద్రత, సామర్థ్యం ఇనుమడించాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఓ కీలక ఘట్టాన్ని ప్రస్తావిస్తూ- నిరుడు దేశంలో తొలి నిట్టనిలువుగా తెరచుకునే ‘పంబన్’ కొత్త వంతెనను ప్రారంభించడం తనకు లభించిన అదృష్టమని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.

తమిళనాడు ప్రజలకు ప్రస్తుతం 9 వందే భారత్, మరో 9 అమృత భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతుండటాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ దృక్కోణం మనకు గర్వకారణమంటూ- “దీని ద్వారా స్వావలంబన ఇనుమడిస్తోంది... యువతకు ఉద్యోగావకాశాలు అందివస్తున్నాయి” అని చెప్పారు. అమృత భారత్ స్టేషన్ పథకం కింద సౌకర్యం, సౌలభ్యం, స్థానిక గుర్తింపు సమ్మేళనంగా రాష్ట్రంలోని 77 స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుందరంగా రూపుదిద్దుకున్న 8 స్టేషన్లను ఇవాళ ప్రారంభించామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇక చెన్నై బీచ్-చెన్నై ఎగ్మూర్‌ నాలుగో లైన్‌ను జాతికి అంకితం చేసినందున వేలాది రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కుంభకోణం, ఏర్కాడు, వెల్లూరులలో ఆకాశవాణి కొత్త ‘ఎఫ్‌ఎం’ రిలే ట్రాన్స్‌మిటర్లను ప్రధానమంత్రి ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు.

 

గత దశాబ్దంతో పోలిస్తే తమిళనాడులో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు 3 రెట్లు పెరగడమే కాకుండా 2026 కేంద్ర బడ్జెట్ కూడా ఈ రాష్ట్రంపై దృష్టి నిలిపిందని ప్రధానమంత్రి వివరించారు. బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్నాయని చెప్పారు. “ఈ బడ్జెట్ తమిళనాడును అరుదైన ఖనిజాల రంగంలో అగ్రభాగాన నిలిపింది. అధునాతన తయారీ, పరిశోధన-సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం” అని ప్రధానమంత్రి విశదీకరించారు.

 

తమిళనాడుకు సుసంపన్న చరిత్ర, వారసత్వం ఉన్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆదిచనల్లూర్ వంటి చారిత్రక ప్రదేశాలను ప్రపంచ వారసత్వ గమ్యాలుగా రూపొందిస్తామని ప్రకటించారు. పులికాట్ సరస్సుతోపాటు పోదిగై మలై చుట్టూ చేపడుతున్న పర్యావరణ పర్యాటక కార్యక్రమాలు సహజావరణ వ్యవస్థలను సంరక్షించడమే కాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అలాగే, తయారీ రంగానికి నవ్యోత్తేజం ఇచ్చే దిశగా దేశంలోని సుమారు 200 పారిశ్రామిక సముదాయాలను గుర్తించి చేయూతనిస్తామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు అనేక పరిశ్రమలకు నిలయం కావడం వల్ల ఈ పథకం కింద స్థానిక యువతకు గణనీయ ప్రయోజనం సమకూరుతుందని ప్రధానమంత్రి తెలిపారు.

 

దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దే సంకల్ప స్ఫూర్తితో ప్రతి భారతీయుడు ముందడుగు వేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ స్వప్న సాకారంలో తమిళనాడు నిర్ణయాత్మక పాత్ర పోషించగలదని తెలిపారు. సమగ్రాభివృద్ధి, రాష్ట్ర పురోగమనం విషయంలో కేంద్రం పూర్తి నిబద్ధతతో ఉందని పునరుద్ఘాటిస్తూ- “వికసిత భారత్‌ కోసం వికసిత తమిళనాడు మన సమష్టి లక్ష్యం” అని వ్యాఖ్యానిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI

Media Coverage

India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 మే 2026
May 30, 2026

Viksit Bharat in Motion: How PM Modi is Building a Self-Reliant Global India”