గుజరాత్లోని రాజ్కోట్లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మోదీ మాట్లాడుతూ, 2026 ప్రారంభం తర్వాత తాను మొదటిసారి గుజరాత్కు వచ్చానని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తాను సోమనాథుని దివ్య దర్శనం చేసుకున్నానని, ఇప్పుడు రాజ్కోట్లో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. “వికాస్ భీ, విరాసత్ భీ” (అభివృద్ధి - వారసత్వం) మంత్రం ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు దేశం నలుమూలల నుంచి, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల వచ్చిన అందరికీ ప్రధానమంత్రి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపారు.
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు వేదిక ఎప్పుడు సిద్ధమైనా, తాను దానిని కేవలం ఒక సదస్సుగా చూడడం లేదని, 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశ ప్రయాణంగా చూస్తున్నానని శ్రీ మోదీ అన్నారు. ఇది ఒక కలగా మొదలై, ఇప్పుడు చెక్కుచెదరని విశ్వాసానికి చేరుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దశాబ్దాలలో, వైబ్రెంట్ గుజరాత్ ప్రయాణం ప్రపంచ ప్రమాణంగా మారిందని, ఇప్పటి వరకు పది సదస్సులు జరిగాయని, ప్రతి ఒక్కటి సదస్సు గుర్తింపును, పాత్రను బలోపేతం చేసిందని ఆయన చెప్పారు.
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు దార్శనికతతో తనకు మొదటిరోజు నుంచే అనుబంధం ఏర్పడిందని, ప్రారంభ దశలో గుజరాత్లో ఉన్న సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం, ప్రజలను ఆహ్వానించడం, పెట్టుబడులు పెట్టేలా చేసి భారత్కే కాకుండా ప్రపంచ పెట్టుబడిదారులకు కూడా లాభం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన గుర్తు చేశారు. నేడు ఈ సదస్సు పెట్టుబడులకే పరిమితం కాకుండా, ప్రపంచ వృద్ధి, అంతర్జాతీయ సహకారం భాగస్వామ్యానికి ఒక వేదికగా మారిందని ఆయన స్పష్టం చేశారు. సంవత్సరాలుగా ప్రపంచ భాగస్వాముల సంఖ్య నిరంతరం పెరుగుతోందని, ఈ సదస్సు సమ్మిళితానికి ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి తెలిపారు. కార్పొరేట్ సమూహాలు, సహకార సంఘాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు), స్టార్టప్లు, బహుళపాక్షిక, ద్వైపాక్షిక సంస్థలు, అలాగే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇక్కడ ఒక వేదికపై చేరి చర్చలు, సంభాషణలలో పాల్గొని గుజరాత్ అభివృద్ధిలో భుజం భుజం కలిపి నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

గత రెండు దశాబ్దాలుగా, వైబ్రెంట్ గుజరాత్ సదస్సు స్థిరంగా ఏదో ఒక కొత్త, ప్రత్యేకమైన అంశాన్ని పరిచయం చేస్తోందని, ఈ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు కూడా ఈ సంప్రదాయానికి మరో ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. గుజరాత్లోని వివిధ ప్రాంతాలలో వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని నిర్వహణగా మార్చడం ఈ ప్రాంతీయ సదస్సు ప్రధాన లక్ష్యమని ఆయన ప్రముఖంగా తెలిపారు. కొన్ని ప్రాంతాలలో తీరప్రాంత బలం ఉందని, మరికొన్ని ప్రాంతాలలో పెద్ద గిరిజన ప్రాంతం ఉందని, కొన్నింటిలో పారిశ్రామిక సముదాయాల పెద్ద వ్యవస్థ ఉందని, ఇంకొన్ని ప్రాంతాలలో వ్యవసాయం, పశుపోషణకు సంబంధించిన గొప్ప సంప్రదాయం ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని ప్రతి ప్రాంతానికీ తనదైన బలం ఉందని, ఈ ప్రాంతీయ సదస్సు ఆ ప్రాంతీయ అవకాశాలపై దృష్టి సారించి ముందుకు సాగుతోందని ఆయన ఉద్ఘాటించారు.
21వ శతాబ్దంలో పావు వంతు కాలం గడిచిపోయిందని, ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం వేగవంతమైన పురోగతిని సాధించిందని, ఇందులో గుజరాత్, దాని ప్రజలూ ప్రధాన పాత్ర పోషించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ పయనిస్తోందని, భారతదేశంపై ప్రపంచ అంచనాలు నిరంతరం పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని, వ్యవసాయ ఉత్పత్తి కొత్త రికార్డులను సాధిస్తోందని, పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని, జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో నంబర్ వన్గా ఉందని, ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలను ఉత్పత్తి చేసే దేశంగా ఉందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
భారతదేశ వృద్ధికి సంబంధించిన వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) 'సంస్కరణ, నిర్వహణ, మార్పు మంత్రం విజయ గాథ" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. గత 11 సంవత్సరాలలో మొబైల్ డేటా లో ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద వినియోగదారుగా మారిందని, యూపీఐ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కాల నంబర్ వన్ -టైమ్ డిజిటల్ లావాదేవీల వేదికగా ఉద్భవించిందని ఆయన తెలిపారు. గతంలో పది మొబైల్ ఫోన్లలో తొమ్మిది దిగుమతి అవుతుండేవని, కానీ నేడు భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థను కలిగి ఉందని, సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడు అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉందని, మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఉందని, ప్రపంచవ్యాప్తంగా మూడు అగ్రగామి మెట్రో నెట్వర్క్లలో ఒకదాన్ని కలిగి ఉందని ప్రధానమంత్రి వివరించారు.

ఈరోజు ప్రపంచంలోని ప్రతి నిపుణుడు, సంస్థలు భారత్ పై విశ్వాసంతో ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఐఎంఎఫ్ భారత్ ను ప్రపంచ వృద్ధి చోదకంగా అభివర్ణించిందని, ఎస్ అండ్ పీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత భారతదేశ రేటింగ్ను పెంచిందని, ఫిచ్ రేటింగ్స్ భారత స్థూల స్థిరత్వం, ఆర్థిక విశ్వసనీయతను ప్రశంసించాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తీవ్రమైన ప్రపంచ అనిశ్చితి మధ్య కూడా అసాధారణమైన సుస్థిరత్వాన్ని కలిగి ఉన్నందునే ప్రపంచవ్యాప్తంగా భారత్ పై నమ్మకం పెరుగుతోందని ఆయన అన్నారు. భారతదేశంలో రాజకీయ స్థిరత్వం, విధానాల కొనసాగింపు, పెరుగుతున్న కొనుగోలు శక్తితో కొత్త మధ్యతరగతి విస్తరణ కారణంగా భారత్ అపరిమిత అవకాశాలు కలిగిన దేశంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. "ఇదే సమయం. ఇదే సరైన సమయం" అని ఎర్రకోట నుంచి తాను చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, దేశంలోని, ప్రపంచంలోని ప్రతి పెట్టుబడిదారుడికి భారతదేశ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇదే నిజంగా సరైన సమయమని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు కూడా పెట్టుబడిదారులందరికీ “సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి, ఇదే సమయం, ఇదే సరైన సమయం” అనే సందేశాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు సవాళ్లు ఎంత పెద్దవైనా, నిజాయితీగా కష్టపడి కృషి చేస్తే విజయం ఖాయమని నేర్పే ప్రాంతాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దం ప్రారంభంలో తీవ్రమైన భూకంపంతో అతలాకుతలమైన కచ్ ఇదేనని, సంవత్సరాల తరబడి కరవుతో బాధపడిన సౌరాష్ట్ర ఇదేనని, అక్కడ తల్లులు, అక్కాచెల్లెళ్ళు తాగునీటి కోసం చాలా కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదని, విద్యుత్ అనిశ్చితంగా ఉండేదని, ఇబ్బందులు ప్రతిచోటా ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ కాలం నాటి కథలను నేటి 20-25 సంవత్సరాల యువత కేవలం విన్నారని, ఆ రోజుల్లో కచ్ లేదా సౌరాష్ట్రలో ఎక్కువ కాలం ఉండడానికి ప్రజలు ఇష్టపడేవారు కాదని, ఆ పరిస్థితులు ఎప్పటికీ మారవనిపించేదని ఆయన అన్నారు. అయితే, కాలం మారుతుందనడానికి చరిత్రే సాక్ష్యం అని, నిజంగానే మారుతుందని, సౌరాష్ట్ర, కచ్ ప్రజలు తమ కృషి ద్వారా తమ రాతను తామే మార్చుకున్నారని ఆయన ఉద్ఘాటించారు.

సౌరాష్ట్ర కచ్ నేడు కేవలం అవకాశాల ప్రాంతాలు మాత్రమే కాదు, భారతదేశ వృద్ధికి ప్రాధాన్య ప్రాంతాలుగా మారాయని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు ఆత్మనిర్భర్ భారత్ ప్రచారాన్ని నడిపిస్తున్న ప్రధాన కేంద్రాలుగా భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, ఈ పాత్ర మార్కెట్ ఆధారితంగా ఉండటంతో, పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూడా పెంచుతోందని అన్నారు.
ఒక్క రాజ్కోట్లోనే 2.5 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, వాటిలోని వివిధ పారిశ్రామిక క్లస్టర్లలో స్క్రూడ్రైవర్ల నుంచి ఆటో విడిభాగాలు, యంత్ర పరికరాలు లగ్జరీ కార్ లైనర్లు, విమానాలు, యుద్ధ విమానాలు, రాకెట్ భాగాల వరకు అన్నీ తయారవుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతం తక్కువ వ్యయంతో తయారీ నుంచి అధిక కచ్చితత్వం, అధిక సాంకేతికత కలిగిన తయారీ వరకు మొత్తం విలువ శ్రేణికి మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. ఇక్కడి నగల పరిశ్రమ స్థాయిలోనూ, ,నైపుణ్యం లోనూ, అనుసంధానం లోనూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఓడలను విడగొట్టే స్థలం అలంగ్లో ఉందని, ఇక్కడ ప్రపంచంలోని ఓడలలో మూడింట ఒక వంతు పునరుపయోగం అవుతోందని, ఇది చక్రభ్రమణ ఆర్థిక వ్యవస్థలో భారత నాయకత్వానికి నిదర్శనమని ప్రధానమంత్రి తెలిపారు. భారత్ అతిపెద్ద టైల్స్ తయారీదారులలో ఒకటిగా ఉందని, ఇందులో మోర్బీ జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ తయారయ్యే టైల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో తక్కువ ధరకే లభిస్తాయని చెప్పారు. మోర్బీ, జామ్నగర్, రాజ్కోట్ కలిసి ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని, అది "మినీ జపాన్" అవుతుందని ఒకప్పుడు తాను ఊహించానని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన ప్రకటనను చాలా ఎగతాళి చేశారని, అయితే నేడు ఆ దార్శనికత వాస్తవరూపం దాల్చడం స్వయంగా చూస్తున్నానని ఆయన అన్నారు.

ఆధునిక తయారీకి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం పట్ల గర్వం వ్యక్తం చేస్తూ, భారత మొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం ధోలేరాలో ఏర్పాటు అవుతోందని, ఇది భవిష్యత్తు సాంకేతికతలలో ఈ ప్రాంతానికి ముందస్తు ప్రయోజనాన్ని ఇస్తుందని శ్రీ మోదీ తెలిపారు. అనువైన మౌలిక సదుపాయాలు, అవసరమైన విధానం, దీర్ఘకాల ప్రణాళికతో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ప్రాంతం పూర్తి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు భారత హరిత వృద్ధి, హరిత చలనశీలత, ఇంధన భద్రతకు ప్రధాన కేంద్రాలుగా ఎదుగుతున్నాయని శ్రీ మోదీ అన్నారు. కచ్లో 30 గిగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన పార్కును అభివృద్ధి చేస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ ఇంధన పార్కు అవుతుందని, పారిస్ నగరం లోని పార్కు కంటే ఐదు రెట్లు పెద్దదని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో స్వచ్ఛ ఇంధనం, కేవలం నిబద్ధత మాత్రమే కాదని, ఒక వాణిజ్య స్థాయి వాస్తవం అని ఆయన ఉద్ఘాటించారు. కచ్, జామ్నగర్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు అవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనంతో పాటు గ్రిడ్ స్థిరత్వం, విశ్వసనీయత కోసం కచ్లో ఒక భారీ బ్యాటరీ ఇంధన శక్తి నిల్వ వ్యవస్థ కూడా సిద్ధమవుతోందని తెలిపారు.
సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల మరో గొప్ప శక్తి వాటి ప్రపంచ స్థాయి ఓడరేవుల పై ఉందని, వీటి ద్వారా భారత్ నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పిపావావ్, ముంద్రా ఓడరేవులు ఆటోమొబైల్ ఎగుమతులకు ప్రధాన కేంద్రాలుగా మారాయని, గత సంవత్సరం గుజరాత్ ఓడరేవుల నుంచి దాదాపు 1.75 లక్షల వాహనాలు ఎగుమతి అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రవాణా కు మించి, ఓడరేవు ఆధారిత అభివృద్ధి లోని ప్రతి అంశంలోనూ అంతులేని పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడిదారులకు బలమైన మద్దతు వ్యవస్థతో మత్స్య రంగానికి గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని శ్రీ మోదీ తెలిపారు.

“మౌలిక సదుపాయాలతో పాటు, పరిశ్రమకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తి నేడు అతిపెద్ద అవసరం" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గుజరాత్ రాష్ట్రం పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు. విద్య, నైపుణ్యాభివృద్ధికి గుజరాత్లో ఒక అంతర్జాతీయ సానుకూల వ్యవస్థ ఉందని ఆయన చెప్పారు. కౌశల్య స్కిల్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా, సింగపూర్లకు చెందిన విశ్వవిద్యాలయాల సహకారంతో భవిష్యత్తుకు అవసరమయ్యే నైపుణ్యాలతో యువతను సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ భారత మొట్టమొదటి జాతీయ స్థాయి రక్షణ విశ్వవిద్యాలయం అని ఆయన పేర్కొన్నారు. గతిశక్తి విశ్వవిద్యాలయం రహదారి, రైల్వే, వాయు, జలమార్గాలు, రవాణా రంగాల కోసం నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని సిద్ధం చేస్తుందని తెలిపారు. గుజరాత్లో పెట్టుబడులకు హామీతో కూడిన ప్రతిభావంతుల లభ్యత కూడా ఉంటుందని ఉద్ఘాటించారు. భారతదేశంలో అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు అవకాశాల కోసం చూస్తున్నాయని, వాటికి గుజరాత్ ప్రాధాన్య గమ్యస్థానంగా మారుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే రెండు ప్రధాన ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్లను ప్రారంభించాయని, భవిష్యత్తులో మరిన్ని రానున్నాయని ఆయన తెలిపారు.
గుజరాత్ ప్రకృతి, సాహసం, సంస్కృతి, వారసత్వంతో ఒక సంపూర్ణ పర్యాటక అనుభూతిని కలిగిస్తుందని ప్రధాన మంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు. భారతదేశ 4,500 సంవత్సరాల పురాతన సముద్రయాన వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్న లోథాల్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మానవ నిర్మిత డాక్యార్డ్కు నిలయంగా ఉందని, ఇక్కడ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కచ్లో రణ్ ఉత్సవ్ జరుపుకుంటున్నారని, అక్కడి టెంట్ సిటీ ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని ఆయన అన్నారు. ఆసియా సింహాలను చూసే అసమానమైన అనుభవం కోసం వన్యప్రాణి ప్రియులు గిర్ అడవిని సందర్శించవచ్చని, ఇది ఏటా తొమ్మిది లక్షల మందికి పైగా పర్యాటకులను ఆకర్షిస్తుందని ఆయన తెలిపారు. సముద్రాన్ని ప్రేమించే వారు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన శివరాజ్పూర్ బీచ్తో పాటు, బీచ్ పర్యాటకానికి అపారమైన అవకాశాలను కల్పించే మాండవి, సోమనాథ్, ద్వారకలను ఆస్వాదించవచ్చని ఆయన అన్నారు. సమీపంలోని డయ్యూ వాటర్ స్పోర్ట్స్ బీచ్ గేమ్లకు ప్రధాన గమ్యస్థానంగా మారుతోందని కూడా ఆయన తెలియచేశారు.
సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు శక్తి, అవకాశాలతో నిండి ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పెట్టుబడిదారులను శ్రీ మోదీ కోరారు. సౌరాష్ట్ర, కచ్లో పెట్టే ప్రతీ పెట్టుబడి గుజరాత్ అభివృద్ధికి, దేశ ప్రగతికి ఊతమిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

నేటి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా వేగంగా పనిచేస్తోందని, ఈ ప్రయాణంలో సంస్కరణల ప్రక్రియ (రిఫార్మ్ ఎక్స్ప్రెస్) ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ రిఫార్మ్ ఎక్స్ప్రెస్ ప్రతి రంగంలోనూ తదుపరి తరం సంస్కరణలకు సంకేతమని ఆయన వివరించారు. ఇటీవల అమలు చేసిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగాలపై సానుకూల ప్రభావం చూపాయని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చాయని ఆయన ఉదహరించారు. భీమా రంగంలో 100 శాతం ఎఫ్డిఐని అనుమతించడం ద్వారా భారత్ ఒక పెద్ద సంస్కరణను చేపట్టిందని, ఇది పౌరులకు సార్వత్రిక బీమా కవరేజీని అందించే ప్రచారాన్ని వేగవంతం చేస్తుందని ఆయన తెలిపారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత, ఆధునికీకరించిన ఆదాయ పన్ను చట్టం వల్ల లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. భారతదేశం చారిత్రాత్మక కార్మిక సంస్కరణలను కూడా అమలు చేసిందని, వేతనాలు, సామాజిక భద్రత, పరిశ్రమకు ఏకీకృత వ్యవస్థను అందించిందని, తద్వారా కార్మికులు,పరిశ్రమలు రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
డేటా ఆధారిత ఆవిష్కరణలు, ఏఐ పరిశోధన, సెమీకండక్టర్ల తయారీకి భారత్ ప్రపంచ కేంద్రంగా మారుతోందని, భారతదేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు హామీతో కూడిన విద్యుత్ చాలా కీలకమని, దీనిని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమం అని ప్రధానమంత్రి ఉద్ఘాట్టించారు. అణు విద్యుత్ రంగంలో కూడా తదుపరి తరం సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు శ్రీ మోదీ తెలిపారు. ‘శాంతి‘ చట్టం ద్వారా పౌర అణు ఇంధన రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరవడం పెట్టుబడిదారులకు గణనీయమైన అవకాశాలను సృష్టిస్తుందని ఆయన తెలిపారు.
భారత సంస్కరణల ఎక్స్ప్రెస్ ఆగదని, దేశ సంస్కరణల ప్రయాణం సంస్థాగత మార్పు దిశగా ముందుకు సాగుతుందని సదస్సుకు హాజరైన పెట్టుబడిదారులందరికీ శ్రీ మోదీ హామీ ఇచ్చారు. పాల్గొనేవారు కేవలం ఒక అవగాహన ఒప్పందం కోసం ఇక్కడకు రాలేదని, సౌరాష్ట్ర-కచ్ అభివృద్ధి, వారసత్వంతో అనుసంధానమయ్యేందుకు వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ పెట్టుబడిగా పెట్టిన ప్రతి రూపాయికి అద్భుతమైన రాబడి వస్తుందని హామీ ఇస్తూ, అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలతో ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
రాజ్కోట్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పరాక్రమసింహ జి జడేజా ఈ కార్యక్రమంలో తన ఆలోచనలను పంచుకుంటూ, వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమం ద్వారా గుజరాత్ను భారతదేశ వృద్ధి చోదకశక్తిగా మార్చడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసాధారణ దార్శనికత, నాయకత్వ పటిమను ప్రముఖంగా ప్రస్తావించారు.ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత వాతావరణాన్ని దృష్టి, అవగాహన, స్పష్టత, సౌలభ్యంగా పునర్నిర్వచించి అల్లకల్లోలమైన ప్రపంచ పరిస్థితుల్లో కూడా స్థిరత్వాన్ని భరోసా ఇచ్చిందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో, జ్యోతి సిఎన్సి తయారీ, పరిశోధన-అభివృద్ధి, నైపుణ్యాల కోసం 10,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతుందని ఆయన తెలిపారు. ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధితో భారత తయారీ రంగం అగ్రగామిగా నిలవడం ప్రధానమంత్రి నాయకత్వ పటిమతోనే సాధ్యమయిందని ఆయన అన్నారు. శ్రీ మోదీ ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేసే బాధ్యత ప్రభుత్వం, పరిశ్రమలు, సంస్థలు, సమాజంపై సమష్టిగా ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. మోదీ విధానాలు, సంస్కరణలు భారీ పెట్టుబడులకు, సాంకేతిక పురోగతికి, ప్రపంచ పోటీతత్వానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని ఆయన ప్రసంగం పునరుద్ఘాటించింది. భారత తయారీ రంగం బలపడి, జాతీయ ప్రగతికి గణనీయంగా దోహదపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

అదానీ పోర్ట్స్, సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కరణ్ అదానీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభ్యుదయ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఇది భారతదేశ స్థాయిని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని తెలిపారు. శ్రీ మోదీ దేశానికి దూరదృష్టితో ఆలోచించడం, సంస్థలను నిర్మించడం, దార్శనికతకు తగ్గట్టుగా అమలు జరిగేలా అభివృద్ధిని ఒక నాగరికతా లక్ష్యంగా చూడటం నేర్పారని ఆయన పేర్కొన్నారు. శ్రీ మోదీ నాయకత్వంలో, గుజరాత్ భారతదేశంలో అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, ప్రపంచవ్యాప్తంగా అనుసంధానమైన రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిందని, ఇది జీడీపీ, పారిశ్రామిక ఉత్పత్తి, కార్గో నిర్వహణ, పునరుత్పాదక ఇంధన రంగాలలో గణనీయమైన వాటాను అందిస్తోందని ఆయన అన్నారు. సులభ వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనే భావన దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందకముందే, ముఖ్యమంత్రిగా శ్రీ మోదీ సుపరిపాలన, వేగవంతమైన అమలు ఒక రాష్ట్రాన్ని ఎలా మార్చగలవో నిరూపించారని శ్రీ అదానీ గుర్తు చేశారు. ప్రధానమంత్రిగా, ఆయన ఈ సిద్ధాంతాన్ని భారతదేశమంతటా వర్తింపచేశారని, సహకార, పోటీతత్వ సమాఖ్యవాదం ద్వారా రాష్ట్రాలను వృద్ధి చోదకాలుగా మార్చడం, సుస్థిర విధానాల అమలు, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి చేశారని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ విచ్ఛిన్నమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన కేంద్రంగా ఉద్భవించిందని, దాదాపు 8% వృద్ధిని నమోదు చేసిందని, తన తయారీ రంగాన్ని విస్తరిస్తూ, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోందని ఆయన చెప్పారు. 37 గిగావాట్ల ఖవ్దా పునరుత్పాదక ఇంధన పార్కు వంటి ప్రాజెక్టులతో కచ్, ముంద్రా శక్తివంతమైన ఉదాహరణలుగా నిలిచాయని శ్రీ అదానీ పేర్కొన్నారు. ఉపాధి కల్పన, పారిశ్రామిక పోటీతత్వం, స్థిరత్వం, సుస్థిరత వంటి జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా, రాబోయే ఐదేళ్లలో కచ్లో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు, ఇది వికసిత భారత్ 2047 దిశగా భారత్ ప్రయాణంలో గుజరాత్ కీలక పాత్రను మరింత బలపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
వెల్స్పన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ బి.కె. గోయెంకా తన ఆలోచనలను పంచుకుంటూ, గుజరాత్ను, ముఖ్యంగా కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలను మార్చడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. ఒకప్పుడు కరువు, విపత్తులకు గుర్తింపు పొందిన ఈ ప్రాంతాలు, నేడు ప్రపంచ స్థాయి రిఫైనరీలు, ఓడరేవులు, వస్త్రాలు, పునరుత్పాదక ఇంధనాలకు చిహ్నంగా నిలుస్తున్నాయని. ఈ మార్పు పూర్తిగా ప్రధానమంత్రి శ్రీ మోదీ దూరదృష్టి, సంకల్పం వల్లే సాధ్యమైందని, ఇది గుజరాత్కు కొత్త గుర్తింపును ఇచ్చిందని ఆయన కొనియాడారు. 2003లో, మొదటి వైబ్రెంట్ గుజరాత్ సదస్సు సందర్భంగా, భూకంపంతో దెబ్బతిన్న కచ్లో తమ విస్తరణ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని శ్రీ మోదీ వెల్స్పన్ను కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు, పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి అనేక రెట్ల రాబడిని ఇస్తుందని హామీ ఇచ్చారని, ఆ దూరదృష్టి వెల్స్పన్ గుజరాత్ ప్లాంట్ను ప్రపంచంలోని ప్రముఖ హోమ్ టెక్స్టైల్ కంపెనీగా మార్చిందని, ఇది లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తూ, అమెరికా, బ్రిటన్ లలో 25% పైగా మార్కెట్ వాటాను కలిగి ఉందని, దీని ఉత్పత్తులు వింబుల్డన్కు కూడా చేరుకున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీదారుగా అవతరించేందుకు రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్న వెల్స్పన్ పైప్లైన్ వ్యాపారాన్ని శ్రీ గోయెంకా ప్రముఖంగా ప్రస్తావిస్తూ, "మీ కల ఎంత పెద్దదో, నా నిబద్ధత కూడా అంతే పెద్దది" అనే శ్రీ మోదీ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. కొత్త కలలు, కొత్త సంకల్పాలు, నిరంతర విజయాల కోసం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటిస్తూ, మన ముందున్న సవాలు కేవలం భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడమే కాకుండా, 2047 నాటికి దానిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమేనని స్పష్టం చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీ ముఖేష్ అంబానీ తన ఆలోచనలను పంచుకుంటూ, వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, దార్శనికతను ఘనంగా కీర్తిస్తోందని వ్యాఖ్యానించారు. భారతదేశానికి నాగరికతా స్వాభిమానాన్ని పునరుద్ధరించి, అపూర్వమైన ఆత్మవిశ్వాసం, చైతన్యంతో కూడిన కొత్త యుగానికి శ్రీకారం చుట్టిన ఘనత ప్రధానమంత్రి శ్రీ మోదీదేనని ఆయన ప్రశంసించారు. మోడీ యుగాన్ని భారత్ ను సామర్థ్యం ఉన్న దేశం స్థాయి నుంచి పనితీరు కనబరిచే దేశంగా, ఆశయాల నుంచి ఆచరణలోకి, అనుచరుని స్థాయి నుంచి ప్రపంచ శక్తిగా మారిన సమయంగా చరిత్ర గుర్తుంచుకుంటుందని శ్రీ అంబానీ ఉద్ఘాటించారు. రిలయన్స్కు గుజరాత్ ఒక ప్రత్యేక స్థానమని, అది తమ కంపెనీకి శరీరం, హృదయం, ఆత్మ వంటిదని ఆయన అభివర్ణించారు. మోదీ దార్శనికతకు అనుగుణంగా ఐదు దృఢమైన కట్టుబాట్లను ఆయన ప్రకటించారు.

మొదటిది - రిలయన్స్ రాబోయే ఐదు సంవత్సరాల్లో గుజరాత్లో తన పెట్టుబడులను రెట్టింపు చేసి రూ. 7 లక్షల కోట్లకు పెంచనుంది. దీనివల్ల విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడి, సంపద మరింత పెరుగుతుంది. రెండోది - జామ్నగర్లో, కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత స్వచ్ఛ ఇంధన వ్యవస్థను నిర్మిస్తోంది. ఇందులో సౌరశక్తి, బ్యాటరీ నిల్వ, గ్రీన్ హైడ్రోజన్, ఎరువులు, సుస్థిర ఇంధనాలు, అధునాతన పదార్థాలు ఉన్నాయి. మూడోది - ప్రతి పౌరుడికి అందుబాటు ధరలలో కృత్రిమ మేధ సేవలను అందించడానికి, గుజరాత్ నుంచి ప్రారంభించి, భారతదేశంలోనే అతిపెద్ద ఏ ఐ ఆధారిత డేటా సెంటర్ను రిలయన్స్ అభివృద్ధి చేస్తోంది. నాల్గోది - గుజరాత్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, వీర్ సావర్కర్ మల్టీ-స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్వహించడం, భవిష్యత్ ఛాంపియన్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా భారతదేశ ఒలింపిక్ ఆకాంక్షలకు రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుంది. ఐదోది - జామ్నగర్లో ప్రపంచ స్థాయి ఆసుపత్రితో సహా ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలను రిలయన్స్ విస్తరిస్తుంది.
ప్రపంచ అల్లకల్లోలం ఉన్నప్పటికీ, శ్రీ మోదీ నాయకత్వంలో భారత్ సురక్షితంగా ఉందని అంటూ ఆయనను దేశానికి "అభేద్యమైన రక్షణ గోడ"గా శ్రీ అంబానీ అభివర్ణించారు. ఇది భారతదేశ నిర్ణయాత్మక దశాబ్దమని, శ్రీ మోదీ దేశాన్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేయడమే కాకుండా, చురుకుగా తీర్చిదిద్దుతున్నారని ఆయన అన్నారు. గుజరాత్ అభివృద్ధి పట్ల, వికసిత్ భారత్ 2047 లక్ష్యం పట్ల రిలయన్స్ నిబద్ధతను శ్రీ అంబానీ పునరుద్ఘాటించారు.
భారతదేశంలోని రువాండా హైకమీషనర్ శ్రీమతి జాక్వెలిన్ ముకాంగిరా ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో రువాండాను దేశ భాగస్వామిగా ఆహ్వానించినందుకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు గుజరాత్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఆమె గుజరాత్ ప్రభుత్వాన్ని అభినందించారు. రువాండా భారతదేశం మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావించారు. 2018లో ప్రధానమంత్రి శ్రీ మోదీ రువాండాలో జరిపిన చారిత్రక పర్యటనను ఆమె గుర్తుచేసుకున్నారు, ఆ సమయంలో ఆరు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని అన్నారు. అప్పుడు శ్రీ మోదీ నిరుపేద కుటుంబాలకు 200 ఆవులను దానం చేశారని, ఇది ఆయన ఔదార్యానికి నాయకత్వానికి ఉదాహరణగా ఆమె ప్రశంసించారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగామే 2017లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సదస్సులో పాల్గొనడంతో సహా ఐదుసార్లు భారతదేశాన్ని సందర్శించారని, ఇరువురు నాయకులు రువాండా-భారత్ సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లారని ఆమె పేర్కొన్నారు.
రువాండాను వేగంగా అభివృద్ధి చెందుతున్న, సుస్థిరమైన దేశంగా శ్రీమతి ముకాంగిరా అభివర్ణించారు, అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోందని, పాలన పారదర్శకత మరియు వ్యాపార సౌలభ్య

రువాండాను వేగంగా అభివృద్ధి చెందుతున్న, సుస్థిరమైన దేశంగా శ్రీమతి ముకాంగిరా అభివర్ణించారు, అవినీతిపై రువాండా జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోందని, పారదర్శక పాలన, వ్యాపార సౌలభ్యంలో ఆఫ్రికాలో మొదటి స్థానంలో ఉందని, 2025 సంవత్సరం మూడవ త్రైమాసికంలో 11.8% ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని ఆమె తెలిపారు. భారతదేశం రువాండాకు రెండవ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా, వాణిజ్య భాగస్వామిగా ఉందని ఆమె తెలిపారు. తయారీ, మౌలిక సదుపాయాలు, ఐసీటీ, వ్యవసాయం, మైనింగ్, పర్యాటకం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో బలమైన ప్రోత్సాహకాల మద్దతుతో మరిన్ని భారతీయ పెట్టుబడులను ఆమె ఆహ్వానించారు. ప్రసిద్ధ పర్వత గొరిల్లాలు, బిగ్ ఫైవ్ జంతువులకు నిలయమైన రువాండాను సందర్శించాలని ప్రతినిధులను ఆహ్వానిస్తూ, ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో భారతదేశంతో బలమైన సంబంధాలకు రువాండా కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు.
భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ పాలిష్చుక్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఒక ప్రాంతీయ నాయకుడి నుంచి జాతీయ నాయకుడిగా, ఆపై ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా శ్రీ మోదీ ఆయన ఎదిగిన తీరును, శాంతి స్థాపన ప్రయత్నాలలో ఆయన పోషిస్తున్న పాత్రను ప్రత్యేకంగా పేర్కొన్నారు. శ్రీ మోదీ దార్శనికతతో, గుజరాత్ అభివృద్ధి నమూనాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఈ నమూనా ఇప్పుడు భారతదేశమంతటా విస్తరించి, దేశాన్ని ప్రపంచ నాయకుడిగా తీర్చిదిద్దడంతో పాటు, 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపిస్తోందని ఆయన చెప్పారు.
గుజరాత్ ప్రభుత్వ సహకారానికి గానూ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్య, సంస్థాగత భాగస్వామ్యాలు, నైపుణ్యాభివృద్ధి వంటి సహకార రంగాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవి ప్రజల మధ్య, విజ్ఞాన ఆధారిత సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ఒక వ్యూహాత్మక అవకాశంగా భావిస్తూ, 2023 వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో గర్వించే భాగస్వామ్య దేశంగా ఉక్రెయిన్ పనిచేసిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పటికే 4 బిలియన్ డాలర్లకు చేరుకున్న ద్వైపాక్షిక వాణిజ్యంతో వ్యవసాయం, ఇంజనీరింగ్, ఐటీ, ఇంధనం, రవాణా వంటి రంగాలలో ఉక్రెయిన్ పరిశ్రమలు భారతదేశంతో క్రియాశీల భాగస్వామ్యం కలిగి ఉన్నాయని తెలిపారు.
పోలండ్లో జరగబోయే ఉక్రెయిన్ పునరుద్ధరణ సదస్సులో పాల్గొనవలసిందిగా డాక్టర్ పాలిష్చుక్ భారత కంపెనీలను ఆహ్వానించారు. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికలో భాగంగా రక్షణ రంగంతో సహా, విస్తరించిన పారిశ్రామిక, సాంకేతిక సహకారానికి ఉన్న అవకాశాలను ఆయన ప్రస్తావించారు. యుద్ధ పరిస్థితుల మధ్య 2024లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఉక్రెయిన్ లో జరిపిన చారిత్రక పర్యటన, అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని పునరుద్ఘాటించిందని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్లో సుస్థిర శాంతి స్థాపన గుజరాత్తో సహా భారత్-ఉక్రెయిన్ సంబంధాలను మరింతగా పెంచుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలవంతమైన చర్చలు, బలమైన కొత్త భాగస్వామ్యాలను పెంపొందించడంలో వైబ్రంట్ గుజరాత్ సదస్సు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యం
ఈ సందర్భంగా, ప్రధానమంత్రి 14 గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఐడిసి) ఎస్టేట్ల అభివృద్ధిని కూడా ప్రకటించారు. రాజ్కోట్లో జీఐడిసి వైద్య పరికరాల తయారీ పార్కును ప్రారంభించారు.
కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలలోని 12 జిల్లాల అభివృద్ధి కోసం, వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ను 11-12 జనవరి 2026 తేదీలలో నిర్వహించారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతాల కోసం ఉద్దేశించిన ఈ సదస్సు, పశ్చిమ గుజరాత్లో పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధికి కొత్త ఊపును తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. సిరమిక్స్, ఇంజనీరింగ్, రేవులు, రవాణా, మత్స్య పరిశ్రమ, పెట్రోకెమికల్స్, వ్యవసాయ, ఆహార శుద్ధి, ఖనిజాలు, హరిత ఇంధనం, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు పర్యాటకం, సంస్కృతి వంటి రంగాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది. జపాన్, దక్షిణ కొరియా, రువాండా, ఉక్రెయిన్ ఈ సదస్సుకు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.
వైబ్రంట్ గుజరాత్ విజయవంతమైన నమూనా పరిధిని, ప్రభావాన్ని మరింత విస్తరించడానికి, రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తున్నారు. ఉత్తర గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన మొదటి ప్రాంతీయ సదస్సు 2023 అక్టోబర్ 9,10 తేదీల్లో మెహసానాలో జరిగింది. ప్రస్తుత సదస్సు ను కచ్, సౌరాష్ట్ర ప్రాంతం కోసం ఉద్దేశించారు. దక్షిణ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈఏడాది ఏప్రిల్ 9-10 తేదీల్లో సూరత్ లోనూ, మధ్య గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈ ఏడాది జూన్ 10-11 తేదీల్లో వడోదర లోనూ జరుగుతాయి.
ప్రధానమంత్రి వికసిత భారత్ @2047 దార్శనికతకు అనుగుణంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ విజయం, వారసత్వంపై ఆధారపడి, ఈ ప్రాంతీయ సదస్సులు ప్రాంత-నిర్దిష్ట పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం, వివిధ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచ భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. వైబ్రంట్ గుజరాత్ వేదికను ప్లాట్ఫారమ్ను ప్రాంతాలకు చేరువ చేయడం ద్వారా, ఈ చొరవ వికేంద్రీకృత అభివృద్ధి, వ్యాపార సౌలభ్యం, ఆవిష్కరణ-ఆధారిత వృద్ధి, స్థిరమైన ఉపాధి అవకాశాల కల్పనపై ప్రధానమంత్రి ప్రాధాన్యతను కూడా ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రాంతీయ సదస్సులు ప్రాంతీయ విజయాలను ప్రదర్శించడానికి, కొత్త కార్యక్రమాలను ప్రకటించడానికి ఒక వేదికగా ఉపయోగపడటమే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, రాష్ట్రంలోని ప్రతి భాగంలో వ్యూహాత్మక పెట్టుబడులను సులభతరం చేయడం ద్వారా గుజరాత్ వృద్ధి గాథను సంయుక్తంగా రూపుదిద్దే కీలక సాధనాలుగా కూడా పనిచేస్తాయి. ప్రాంతీయ సదస్సుల విజయాలను జనవరి 2027లో జరగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ తదుపరి ఎడిషన్లో ప్రదర్శిస్తారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
India is the world's fastest-growing large economy. pic.twitter.com/HlhiPzjkNx
— PMO India (@PMOIndia) January 11, 2026
The fact sheet on India's growth is a success story of the Reform-Perform-Transform mantra. pic.twitter.com/NVqWs8UqW7
— PMO India (@PMOIndia) January 11, 2026
At a time of great global uncertainty, India is moving ahead with remarkable certainty. pic.twitter.com/bbvyoIlFmz
— PMO India (@PMOIndia) January 11, 2026
Along with infrastructure, an industry-ready workforce is today's biggest need. pic.twitter.com/dNnMFn6lr8
— PMO India (@PMOIndia) January 11, 2026
Today's India is moving rapidly towards becoming a developed nation. The Reform Express is playing a crucial role in achieving this objective. pic.twitter.com/nKpNTNtR6E
— PMO India (@PMOIndia) January 11, 2026


