· జైన సంస్కృతీ సంప్రదాయాలను, కాలాతీతమైన దాని మానవీయ విలువలను చాటేలా సామ్రాట్ సంప్రతి మ్యూజియం
· కోబా తీర్థం నుంచి మహావీరుడి చరణాలకు నమస్సులర్పిస్తున్నాను.. దేశ ప్రజలందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు
· సామ్రాట్ సంప్రతి మ్యూజియం లక్షలాది దేశ ప్రజల వారసత్వ సంపద.. దేశ గత వైభవానికి ప్రతీక
· సింహాసనాధిష్టాన అనంతరం అహింసను అవలంబించిన చక్రవర్తి.. సత్యం, అస్తేయం, అపరిగ్రహాలను బోధించిన సంప్రతి
· భారత్‌లో జ్ఞానం స్వేచ్ఛావాహిని వంటిది
· ప్రతి యుగంలోనూ తీర్థంకరులు, రుషులు, చింతనాపరుల అవతరణ

భగవాన్ మహావీర్ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని గాంధీనగర్, కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ జైన వారసత్వ మ్యూజియాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కోబా తీర్థం ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంది. ఎందరో జైన మునులు, సాధువుల తపస్సు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. సృజన, సేవ ఇక్కడ సహజంగానే వికసిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

కోబా తీర్థంలోని సుదీర్ఘ సంప్రదాయాలను వివరిస్తూ.. ఎన్నో ఏళ్లుగా అధ్యయనం, సాధన, క్రమశిక్షణ వంటి విలువలు ఈ పవిత్ర క్షేత్రంలో వర్ధిల్లుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. విలువల పరిరక్షణ, సంస్కారాలను పెంపొందించడం, జ్ఞాన సముపార్జన కలిసి త్రివేణీ సంగమంగా ఇక్కడ విలసిల్లుతున్నాయని కొనియాడారు. ఇదే భారతీయ నాగరికతకు పునాదిగా నిలుస్తోందని పునరుద్ఘాటించారు. ‘‘ఈ త్రివేణీ ప్రవాహం నిరంతరం కొనసాగేలా చూడటం మనందరి సమష్టి బాధ్యత’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

జైన వారసత్వ మ్యూజియం ద్వారా ఆ ధర్మపు కాలాతీతమైన జ్ఞానాన్ని, భారతీయ సుసంపన్నమైన వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం భద్రపరుస్తుండడంపై ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నూతన, ఆధునిక రూపాల్లో పురాతన జ్ఞానాన్ని భవిష్యత్తు తరానికి అందించాలన్న సాధువుల సంకల్పంతో ఈ జైన వారసత్వ మ్యూజియం రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు. ‘‘జైన తాత్వికత, భారతీయ సంస్కృతి, మన ప్రాచీన వారసత్వాలకు పవిత్ర కేంద్రమైన సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ రూపంలో ఆ మహోన్నత ఆశయం నేడు సాకారమైంది’’ అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు.

ఈ ప్రయత్నానికి ఎనలేని సహకారాన్నందించిన జైన మునులు, సాధువులు, అంకితభావం కలిగిన వేలాది మంది భక్తులకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. వారసత్వ సంరక్షణలో ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. ప్రాచీన జ్ఞానాన్ని కొత్త పద్ధతుల్లో అందిస్తే, వారసత్వం సుసంపన్నమవుతుందని, భవిష్యత్తు తరాలు నూతన స్ఫూర్తిని పొందుతాయని ఆయన పేర్కొన్నారు. ‘‘సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ దేశంలోని కోట్లాది ప్రజలకు చెందినది. ఘనమైన మన గత వైభవానికి నిదర్శనం’’ అని ప్రధానమంత్రి అన్నారు.

సామ్రాట్ సంప్రతి చారిత్రక ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. అనేక నాగరికతలు గొప్ప ఆలోచనాపరులను, తత్వవేత్తలను అందించినప్పటికీ.. అధికారం విషయానికొచ్చేటప్పటికి చాలామంది పాలకులు ఆదర్శాలను వదిలిపెట్టారని, దీంతో ఆదర్శాలకూ, పాలనకూ నడుమ పెద్ద వ్యత్యాసం ఏర్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయితే, సామ్రాట్ సంప్రతి కేవలం ఒక చారిత్రక రాజు మాత్రమే కాదని, భారతీయ తాత్వికతకు, కార్యాచరణకు నడుమ వారధిగా నిలిచారని కొనియాడారు. ‘‘మన దేశంలో సామ్రాట్ సంప్రతి వంటి పాలకులు అధికారాన్ని సేవగా, సాధనగా భావించారు. తమ సింహాసనమే వేదికగా అహింసా భావాలను విస్తరింపజేశారు. అత్యంత నిస్వార్థంతో, వైరాగ్యంతో సత్యం, అస్తేయం, అపరిగ్రహం వంటి విలువలను ప్రచారం చేశారు’’ అని శ్రీ మోదీ చెప్పారు.

 

ఏడు గ్యాలరీలతో రూపొందించిన ఈ మ్యూజియాన్ని అడుగడుగునా దేశ వైభవాన్ని, వైవిధ్యాన్ని, సాంస్కృతిక సుసంపన్నతను చాటిచెప్పేలా అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రధానమంత్రి అభినందించారు. మొదటి గ్యాలరీలో నవపాద్, అరిహంత్, సిద్ధ, ఆచార్య, ఉపాధ్యాయ, సాధులతోపాటు.. సమ్యక్ దర్శన, సమ్యక్ జ్ఞాన, సమ్యక్ చరిత్ర, సమ్యక్ తప అనే నాలుగు సూత్రాలను ప్రదర్శించారని.. మూడో గ్యాలరీలో తీర్థంకరుల జీవిత గాథలను, వారి బోధనలను కళాత్ముకంగా సజీవంగా కళ్ళకు కట్టారని ఆయన వివరించారు. ‘‘జ్ఞానం సరైనది, ధర్మబద్ధమైనది అయితే.. సమచిత్తానికీ, సేవకూ అది పునాది అవుతుంది’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

జైన వారసత్వాన్నే కాకుండా.. వైదిక, బౌద్ధ, ఇతర భారతీయ మత సంప్రదాయాలను కూడా ఈ మ్యూజియం అత్యంత వైభవంగా ప్రదర్శిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వైవిధ్యం, దానితోపాటు భిన్నత్వంలో ఏకత్వమే మన దేశానికి గొప్ప బలమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మతమూ శాఖల పేరుతో ఘర్షణలు జరిగాయన్న ఆయన.. ఈ మ్యూజియం వేదాలు, పురాణాలు, ఆయుర్వేదం, యోగా, దర్శనాల వంటి అన్ని సంప్రదాయాలనూ సమన్వయంతో ఒకేచోట చేర్చి హరివిల్లులా నిలుస్తోందన్నారు. ‘‘భారత్‌లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత అస్థిరతను, అలజడులను ప్రస్తావిస్తూ... ఒక్క భారతదేశానికే కాక, సమస్త మానవాళి సంక్షేమం దిశగా ఈ మ్యూజియంలో నిక్షిప్తమై ఉన్న వారసత్వ సందేశాలకు అత్యంత ప్రాధాన్యముందన్నారు. ఈ మ్యూజియం సందర్శనార్థం వచ్చే ప్రపంచవ్యాప్త జిజ్ఞాసువులు, విద్యార్థులు, పరిశోధకుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్కరూ మన దేశపు, జైన ధర్మ బోధనలను ప్రపంచంలోని నలుమూలల్లో వ్యాప్తిచేయాలి’’ అని శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు.

 

తక్షశిల, నలంద వంటి భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు లక్షలాది రాతప్రతులకు నిలయాలుగా ఉండేవని, అయితే మతపరమైన సంకుచిత భావంతో విదేశీ దురాక్రమణదారులు వాటిని ధ్వంసం చేశారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాంటి క్లిష్ట సమయాల్లో సామాన్య ప్రజలు మిగిలిన రాతప్రతులను తరతరాలుగా ఎలా కాపాడుకుంటూ వచ్చారో ఆయన వివరించారు. ముఖ్యంగా ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్ అంకితభావాన్ని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా అరవై ఏళ్ల పాటు గ్రామాలూ, నగరాలూ తిరుగుతూ రాతప్రతుల కోసం ఆయన అన్వేషణ అసమానమైనదని కొనియాడారు. ‘‘తాళపత్రాలు, భూర్జ పత్రాలపై లిఖించిన వందల ఏళ్ల నాటి ప్రాచీన రాతప్రతులు మూడు లక్షలకు పైగా నేడు కోబా తీర్థంలో సురక్షితంగా సంకలితమయ్యాయి. మన దేశపు గతం, వర్తమానం, భవిష్యత్తుకు చేసిన ఒక మహోన్నతమైన సేవ ఇది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

రాతప్రతుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సరిదిద్దడం కోసం జ్ఞాన భారతం మిషన్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ మిషన్ ద్వారా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రాచీన రాతప్రతుల డిజిటలీకరణ, శాస్త్రీయంగా వాటి పరిరక్షణ, స్కానింగ్, రసాయనిక శుద్ధి, డిజిటల్ రూపంలో భద్రపరచడం వంటి పనులను చేపడుతున్నట్టు వివరించారు. తన ఇటీవలి మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా దీని గురించి ప్రస్తావించినట్టు గుర్తు చేశారు. పౌరుల వద్ద ఉన్న రాతప్రతులను అప్‌లోడ్ చేయడానికి వీలుగా దేశవ్యాప్త సర్వేను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘‘దేశంలోని నలుమూలల్లో చెల్లాచెదురుగా ఉన్న రాతప్రతుల సేకరణలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది’’ అని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు.

ప్రభుత్వ స్థాయిలో కొనసాగుతున్న జ్ఞాన భారతం మిషన్, కోబా తీర్థ అసాధారణ సహకారం.. ఇవి రెండూ భారత నూతన సాంస్కృతిక పునరుజ్జీవన ప్రతీకలుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, పుణ్యక్షేత్రాల అభివృద్ధి నుంచి ఆయుర్వేదం, యోగాల ప్రాచుర్యం కల్పించడం వరకు... ప్రతి స్థాయిలోనూ దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, దానిపై అవగాహనతోపాటు.. వాటిని ప్రపంచానికి చాటేందుకు కృషి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

 

లోథాల్‌లో సముద్రయాన మ్యూజియం, వాద్‌నగర్‌లోని మ్యూజియం, ఢిల్లీలో త్వరలో ప్రారంభం కానున్న యుగే యుగే భారత్ మ్యూజియం వంటి కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎలాంటి రాజకీయ పక్షపాతమూ లేకుండా భారత స్వాతంత్య్ర పోరాట వాస్తవ చరిత్రను వెలికితీసేందుకు మొదటిసారిగా అర్థవంతమైన, సమగ్రమైన కృషి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ‘‘వారసత్వాన్ని రాజకీయ దృష్టితో చూసే మనస్తత్వానికి మేం స్వప్తి పలికాం. వికసిత భారత్ సంకల్పానికి ఆత్మ వంటిదైన సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మంత్రప్రదంగా ముందుకెళ్తున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు.

 

భారత వారసత్వాన్ని కాపాడడంలో జైన సాధువుల అవిశ్రాంత కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. నాలుగు జైన సంప్రదాయాలూ ఏకతాటిపైకి వచ్చి.. ఢిల్లీలో నిర్వహించిన చరిత్రాత్మక నవకార్ మహామంత్ర దివస్ కార్యక్రమాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో తాను సూచించిన పది సంకల్పాలను ఆయన మరోసారి ఉద్ఘాటించారు. అవి: నీటిని పొదుపు చేయడం, ఏక్ పేడ్ మా కే నామ్, స్వచ్ఛతా మిషన్, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం, దేశ దర్శన్, సేంద్రియ వ్యవసాయం, ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా - క్రీడలు, పేదలకు చేయూత, భారతీయ వారసత్వ సంపద పరిరక్షణ (దీనిని జైన సమాజమే పదో సంకల్పంగా జోడించింది). ‘‘నేటి ఈ కార్యక్రమం ఆ సంకల్పాలకు సజీవ తార్కాణం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

శ్రీ మోదీ భవిష్యత్తుపై అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ ఉన్నత లక్ష్యాలను సాధించడంలో భారత ఏకత్వం, సాంస్కృతిక బలమే చోదకశక్తిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతంగా.. సమాజ, దేశ లక్ష్యాల కోసం ప్రజలు పనిచేస్తేనే అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సామ్రాట్ సంప్రతి మ్యూజియం జ్ఞానానికి, సాధనకు, సంస్కృతికి కీలక కేంద్రంగా ఆవిర్భవిస్తుందని.. నవతరానికి స్ఫూర్తినిస్తూ సమాజంలో కొత్త శక్తిని నింపుతుందని నేను బలంగా నమ్ముతున్నాను’’ అంటూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.  

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch

Media Coverage

‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 ఆగష్టు 2026
August 13, 2026

Aatmanirbhar in Motion: Solar Homes, Made-in-India Containers, Record Exports & a Rising Global Footprint Under the Leadership of PM Modi