2,450 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు - శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
సుమారు రూ. 1950 కోట్ల విలువైన పి.ఎం.ఏ.వై. (గ్రామీణ మరియు పట్టణ) ప్రాజెక్టులకు - శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
దాదాపు 19,000 ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అందజేసిన - ప్రధానమంత్రి
గృహ నిర్మాణ రంగ రూపురేఖలను మార్చి, ముఖ్యంగా పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చిన - పీ.ఎం-ఆవాస్ యోజన
రెట్టింపు వేగంతో పని చేస్తున్న - గుజరాత్ డబుల్ ఇంజన్ ప్రభుత్వం
దేశ అభివృద్ధి అనేది ఒక నమ్మకం, ఒక నిబద్ధత అని పేర్కొన్న - నరేంద్ర మోదీ
"వివక్ష లేకపోవడమే - లౌకికవాదానికి నిజమైన అర్థం"
"పేదరికంపై యుద్ధానికి మేము ఇంటిని ఒక బలమైన పునాదిగా చేసాము, అదే పేదల సాధికారత, గౌరవానికి సాధనం"
"పి.ఎం.ఏ.వై. ఇళ్ళు - అనేక పథకాల సమాహారం"
"ఈ రోజు, మేము పట్టణ ప్రణాళికలో జీవన సౌలభ్యం, జీవన నాణ్యతలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నాము"

గుజరాత్‌ లోని గాంధీనగర్‌లో దాదాపు 4,400 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు, ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో పట్టణాభివృద్ధి శాఖ, నీటి సరఫరా శాఖ, రోడ్డు, రవాణా శాఖ, గనులు, ఖనిజాల శాఖలకు చెందిన 2,450 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు 1,950 కోట్ల రూపాయల విలువైన పి.ఎం.ఏ.వై. (గ్రామీణ మరియు పట్టణ) ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పథకం కింద నిర్మించిన సుమారు 19,000 ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమంలో కూడా పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అందజేశారు. వీడియో లింక్ ద్వారా లబ్ధిదారులతో కూడా ప్రధానమంత్రి మాట్లాడారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభనుద్దేశించి ప్రసంగిస్తూ లబ్ధిదారులను అభినందించారు. తనకు దేశ నిర్మాణం అనేది కొనసాగుతున్న ఒక ‘మహా యజ్ఞం’ అని ఆయన అభివర్ణించారు. ఇటీవలి ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ద్వారా గుజరాత్‌లో జరుగుతున్న అభివృద్ధిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల పేదల అనుకూలంగా ప్రకటించిన మూడు లక్షల కోట్ల గుజరాత్ బడ్జెట్ ను ఆయన ప్రస్తావిస్తూ, ‘బలహీనమైన వారికి ప్రాధాన్యత’ అనే స్ఫూర్తితో రాష్ట్రం ముందు వరుసలో ఉందని ప్రశంసించారు.

రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన 25 లక్షల ఆయుష్మాన్ కార్డుల పంపిణీ, ప్రధానమంత్రి మాతృ వందన పథకం ద్వారా 2 లక్షల మంది తల్లులకు సహాయం, 4 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఆధునిక మౌలిక సదుపాయాల కోసం వేల కోట్ల రూపాయల విలువైన పనులు వంటి కార్యక్రమాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గుజరాత్‌లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తోందన్న విషయాన్ని ఇది తెలియజేస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

గత 9 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు అభివృద్ధిని అనుభవిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అప్పట్లో, పౌరులకు కనీస సౌకర్యాలు కూడా అరుదుగా ఉండేవని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ నిస్పృహ నుంచి దేశం ఇప్పుడు క్రమంగా బయట పడుతోందని ఆయన తెలియజేశారు.

ప్రభుత్వం అందరికీ చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందనీ, పథకాల ప్రయోజనాలు 100 శాతం సంతృప్తినిచ్చే విధంగా కృషి జరుగుతుందనీ, ఆయన చెప్పారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌మ‌ృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ, "మాకు, దేశ అభివృద్ధి అనేది ఒక నమ్మకం, ఒక నిబద్ధత", అని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం అవినీతి, వివక్షకు అంతం పలికిందని ప్రధానమంత్రి తెలియజేశారు. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రి ప్ర‌యోజ‌నం కోసం ప్ర‌భుత్వం ప‌నిచేసిన‌ప్పుడే సామాజిక న్యాయం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొంటూ, "వివక్ష పూర్తిగా లేకపోవడమే, లౌకికవాదానికి నిజమైన అర్థం" అని వ్యాఖ్యానించారు. పేద‌లు జీవితంలోని ప్రాథమిక అవ‌స‌రాల గురించి క‌నీసం ఆందోళ‌న ప‌డ‌న‌ప్పుడు వారి ఆత్మ‌విశ్వాసం పెంపొందుతుంద‌ని ప్ర‌ధానమంత్రి పేర్కొంటూ, గత సంవత్సరంలో దాదాపు 32,000 గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్లు తెలియజేశారు.

ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వాల పని సంస్కృతికి మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రధానమంత్రి ఎత్తి చూపుతూ, "విఫలమైన విధానాల మార్గంలో ముందుకు సాగడం ద్వారా దేశం తన విధిని మార్చుకోలేక పోగా, అభివృద్ధి చెందిన దేశంగా మారలేదు", అని వ్యాఖ్యానించారు. గత దశాబ్దపు గణాంకాలను ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొంటూ, విధానాలు అప్పటికే అమలులో ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 75 శాతం ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని చెప్పారు. 2014 తర్వాత, ప్రస్తుత ప్రభుత్వం పేదలకు కేవలం ఏదో ఒక నివాసాన్ని అందించడానికి మాత్రమే పరిమితం కాలేదు, పేదరికాన్ని పరిష్కరించడానికి, వారి గౌరవాన్ని బలోపేతం చేయడానికి, ఒక మాధ్యమంగా గృహాలను నిర్మించి ఇచ్చిందని, ప్రధానమంత్రి వివరించారు. "పి.ఎం.ఏ.వై. పథకం కింద, గృహాలు నిర్మించుకోడానికి, ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని బదిలీ చేసింది." అని చెబుతూ, ఆ గృహాలకు జియోట్యాగింగ్‌ చేసినట్లు కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు.

 

పీ.ఎం.ఏ.వై. కింద నిర్మిస్తున్న ఇళ్లు అనేక పథకాల సమాహారమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ గృహాల్లో, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్డి ఉంది. ఇంకా, సౌభాగ్య పథకం కింద విద్యుత్ కనెక్షన్, ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్.పి.జి. కనెక్షన్ తో పాటు, జె.జె.ఎం. కింద పైపు కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని, ఆయన చెప్పారు. వీటితో పాటు, ఉచిత వైద్యం, ఉచిత రేషన్ కూడా పేదలకు రక్షణ కవచంగా పనిచేస్తున్నాయని, ప్రధానమంత్రి వివరించారు.

పి.ఎం.ఏ.వై. కింద మహిళా సాధికారత గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. గత 9 ఏళ్లలో దాదాపు 4 కోట్ల ఇళ్లను పేద కుటుంబాలకు అందజేశామని ఆయన తెలిపారు. ఇందులో 70 శాతం మహిళల పేరిట నమోదయ్యాయి. పీ.ఎం.ఏ.వై. కింద ఇళ్ల నిర్మాణ వ్యయం అనేక లక్షల కోట్ల రూపాయలతో కూడుకున్నదని ప్రధానమంత్రి పేర్కొంటూ, దీని ద్వారా కోట్లాది మంది మహిళా లబ్ధిదారులు ఇప్పుడు లక్షాధికారులుగా మారారని తెలియజేశారు. ఈ విధంగా, కోట్లాది మంది మహిళలు ఒక ఆస్తిని తొలిసారిగా సొంతం చేసుకున్నారని చెబుతూ, ‘లఖపతి దీదీ’ లను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

 

భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను, దేశంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాజ్‌కోట్‌లో వెయ్యికి పైగా ఇళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించబడ్డాయని, తద్వారా తక్కువ సమయం, తక్కువ వ్యయంతో, సురక్షితంగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. లైట్ హౌస్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా దేశంలోని 6 నగరాల్లో చౌకైన, ఆధునిక గృహాలను నిర్మించడంలో ఈ సాంకేతికత సహాయపడిందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ఇలాంటి ఇళ్లు పేదలకు అందుబాటులోకి వస్తాయని కూడా ఆయన భరోసా ఇచ్చారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలను అనేక కష్టనష్టాలకు గురిచేసిన రియల్ ఎస్టేట్ రంగంలోని చెడు పద్ధతులు, మోసాలను తొలగించే చర్యలను కూడా ప్రధానమంత్రి వివరించారు. రెరా చట్టం మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు వాగ్దానం చేసిన సౌకర్యాలను పొందడానికి చట్టపరమైన భద్రతను కల్పించింది. మధ్యతరగతి కుటుంబాలు తీసుకునే గృహ రుణాలకు అందిస్తున్న అపూర్వమైన బడ్జెట్ సబ్సిడీ గురించి కూడా ఆయన తెలియజేశారు. గుజరాత్‌ లో 5 లక్షల కుటుంబాలకు 11 వేల కోట్ల రూపాయల మేర సాయం అందింది.

  1. ఏళ్ల అమృత్‌ కాల్‌ సమయంలో, ముఖ్యంగా 2, 3 దశలు ఆర్థిక వ్యవస్థకు వేగాన్ని అందజేస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. గుజరాత్‌ లోని అనేక నగరాల్లోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలియజేశారు. అమృత్ మిషన్ కింద 500 నగరాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. అదేవిధంగా , 100 నగరాలు స్మార్ట్ సౌకర్యాలు పొందుతున్నాయని చెప్పారు.

"ఈ రోజు, మనం పట్టణ ప్రణాళికలో జీవన సౌలభ్యం, జీవన నాణ్యతకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నాము. " అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజలు ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండకూడనే ఆలోచనతో దేశంలో మెట్రో నెట్‌-వర్క్‌ ను విస్తరిస్తున్నామని ఆయన నొక్కి చెప్పారు. దేశంలో 20 నగరాల్లో మెట్రో రైళ్ళు నడుస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొంటూ, 2014కి ముందు 250 కిలోమీటర్లుగా ఉన్న దేశంలోని మెట్రో నెట్‌-వర్క్ గత 9 ఏళ్లలో 600 కిలోమీటర్ల మేర పెరిగిందని తెలియజేశారు. “అహ్మదాబాద్-గాంధీనగర్ వంటి జంట నగరాలు కూడా నేడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లతో అనుసంధానించబడుతున్నాయి. గుజరాత్‌ లోని అనేక నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య కూడా పెరుగుతోంది." అని, శ్రీ మోదీ చెప్పారు.

 

దేశంలో టన్నుల కొద్దీ మునిసిపల్‌ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్న విషయంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశంలో వ్యర్థాల నిర్వహణ 2014 సంవత్సరంలో 14 నుంచి 15 శాతం మేర ఉండగా, ఈ రోజున, అది 75 శాతానికి పెరిగిందని ప్రధానమంత్రి తెలియజేశారు. మన నగరాల్లో చెత్త కుప్పలను తొలగించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని శ్రీ మోదీ పేర్కొంటూ, "ఇది ఇంతకు ముందే జరిగి ఉంటే, ఈ రోజు మన నగరాల్లో చెత్త పర్వతాల స్థాయిలో పేరుకుపోయి ఉండేవి కావు", అని వ్యాఖ్యానించారు. “మనకు స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి లభించినప్పుడే, మన నగరాల్లో నాణ్యమైన జీవనం సాధ్యమవుతుంది” అని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.

గుజరాత్ నీటి నిర్వహణ, నీటి సరఫరా నమూనాను ప్రధానమంత్రి ప్రశంసించారు. 3 వేల కిలోమీటర్ల పొడవైన వాటర్ మెయిన్ లైన్లను ఆయన ప్రస్తావిస్తూ, 1.25 లక్షల కిలోమీటర్ల పొడవున ఉన్న పంపిణీ లైన్లు 15 వేల గ్రామాలతో పాటు, 250 పట్టణ ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నాయని వివరించారు. గుజరాత్‌ లో అమృత్‌ సరోవర్‌ పట్ల ఉన్న ఉత్సుకతను ఆయన కొనియాడారు.

 

చివరిగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ అభివృద్ధి వేగాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. "అమృత్ కాల్ యొక్క మా తీర్మానాలు సబ్-కా-ప్రయాస్‌ తో నెరవేరుతాయి" అని శ్రీ మోదీ తమ ప్రసంగాన్ని ముగించారు

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ సి. ఆర్. పాటిల్, గుజరాత్ రాష్ట్ర మంత్రి, తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న ప్రాజెక్టులలో బనస్కాంత జిల్లాలో పలు గ్రామాల తాగునీటి సరఫరా పథకాల అభివృద్ధి, అహ్మదాబాద్‌లోని ఒక నది మీద వంతెన, జి.ఐ.డి.సి., నరోడా వద్ద మురుగునీటి సేకరణ వ్యవస్థ, మెహ్ శానా, అహ్మదాబాద్‌ లలో మురుగునీటి శుద్ధి కర్మాగారాలతో పాటు, దహెగామ్‌ లో ఒక ఆడిటోరియం కూడా ఉంది. ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులలో జునాగఢ్ జిల్లాలో బల్క్ పైప్‌ లైన్ ప్రాజెక్టులు, గాంధీనగర్ జిల్లా లో నీటి సరఫరా పథకాల అభివృద్ధి, ఫ్లైఓవర్ వంతెనల నిర్మాణం, కొత్తగా నీటి పంపిణీ కేంద్రంతో పాటు, వివిధ పట్టణ ప్రణాళిక రహదారులు ఉన్నాయి.

ప్రధాన మంత్రి పి.ఎం.ఏ.వై. (గ్రామీణ మరియు పట్టణ) ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో పాటు, ఈ పథకం కింద నిర్మించిన సుమారు 19,000 ఇళ్ళ గృహ ప్రవేశం లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకం లబ్ధిదారులకు ఆయన ఇంటి తాళం చెవులు అందజేశారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం 1950 కోట్ల రూపాయలు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Govt sets up six sector groups to fast-track ‘Make in India 2.0’ push

Media Coverage

Govt sets up six sector groups to fast-track ‘Make in India 2.0’ push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
June 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, June 28th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.