స్వీడన్లోని గోథెన్బర్గ్లో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో స్వీడన్ యువరాణి విక్టోరియా కూడా పాల్గొన్నారు. స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్టాఫ్, రాణి సిల్వియాల తరఫున ఆమె ప్రధానమంత్రి మోదీకి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజు కార్ల్ XVI గుస్టాఫ్ 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
ఇరు దేశాల నాయకులు భారత్-స్వీడన్ సంబంధాల్లోని అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించారు. వాణిజ్యం - పెట్టుబడులు, ఆవిష్కరణలు, హరిత పరివర్తన, కొత్త సాంకేతికతలు, రక్షణ - భద్రత, డిజిటలైజేషన్, ఎంఎస్ఎమ్ఈలు, అంతరిక్షం, పరిశోధన, విద్య, సంస్కృతి, ప్రజా సంబంధాల మార్పిడి వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయినట్లు వారు పేర్కొన్నారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఆవిష్కరణలు, సుస్థిరత, పరిశోధన - అభివృద్ధి అనుసంధానాల ఆధారంగా ముందుకు సాగుతున్న ఈ సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. విస్తరిస్తున్న ఈ భాగస్వామ్యానికి దిశానిర్దేశం చేయడానికి క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి రాజకీయ సంప్రదింపులు, సంస్థాగత సంభాషణలను కొనసాగించడమే కీలకమని వారు ప్రధానంగా చెప్పారు.

భారత్-స్వీడన్ సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. స్థిరత్వం- భద్రత కోసం వ్యూహాత్మక చర్చలు.. నవతరం ఆర్థిక భాగస్వామ్యం.. కొత్త సాంకేతికతలు- నమ్మకమైన అనుసంధానం.. ‘కలిసి రేపటిని తయారు చేయటం- ప్రజలు, గ్రహం, ఆరోగ్యం, దృఢత్వం’ అనే నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ముందుకు సాగుతుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఇరు దేశాల నాయకులు 'భారత్-స్వీడన్ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక 2026-2030'ను ఆమోదించారు. ఇది రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, భద్రత, పర్యావరణం, ప్రజా సంబంధాల రంగాలలో పరస్పర సహకారానికి ఒక సమగ్రమైన రోడ్మ్యాప్ను అందిస్తుంది.
ఇటీవల కుదిరిన 'భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' ఆర్థిక, వాణిజ్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచిందని ఇరు దేశాల నాయకులు ప్రధానంగా చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక అనుసంధానాలను మరింత బలోపేతం చేయడానికి వీలుగా ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు తమ ప్రయత్నాలను కొనసాగించాలని వారు అంగీకరించారు.
ఆవిష్కరణలు, స్వచ్ఛ సాంకేతికతలు, అధునాతన తయారీ, సుస్థిర చలనశీలత, డిజిటల్ పరివర్తన వంటి వ్యూహాత్మక రంగాలలో భారత్తో స్వీడన్ కొనసాగిస్తున్న నిరంతర భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి మోదీ అభినందించారు. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధ రంగాల్లో భారత్ సాధిస్తున్న అద్భుతమైన పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి క్రిస్టెర్సన్ ప్రశంసించారు. స్వీడన్ ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల వ్యవస్థకు అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం అందిస్తున్న సానుకూల సహకారాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత వృద్ధి పథంలో స్వీడన్ కంపెనీలు మరింత విస్తృతంగా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించారు.

ఇరు దేశాల నాయకులు పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు. ఐక్యరాజ్యసమితి, ఇతర బహుపాక్షిక సంస్థల సంస్కరణల అత్యవసర అవసరాన్ని వారు ప్రముఖంగా పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్కు స్వీడన్ అందిస్తోన్న బలమైన మద్దతుకు ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, దృఢమైన సరఫరా గొలుసులు, సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో తమకున్న నిబద్ధతను ఇరు దేశాల నాయకులు మరోసారి పునరుద్ఘాటించారు.
Held wonderful discussions with PM Ulf Kristersson. It was great to have HRH Crown Princess Victoria also join the meeting. She also conveyed the wishes of Their Majesties the King and Queen of Sweden. My gratitude to them.
— Narendra Modi (@narendramodi) May 17, 2026
India-Sweden relations are built on the strong… pic.twitter.com/Z8IsQJxvh6
Hade fantastiska samtal med statsminister Ulf Kristersson. Det var fantastiskt att H.K.H Kronprinsessan Victoria också deltog i mötet. Hon framförde också lyckönskningar från Deras Majestäter Kungen och Drottningen av Sverige. Min tacksamhet till dem.
— Narendra Modi (@narendramodi) May 17, 2026
Relationerna mellan Indien… pic.twitter.com/vSWiYtei2H


