గౌరవ ప్రధానమంత్రి స్టార్మర్,

ఇరు దేశాల ప్రతినిధులు,

పాత్రికేయ మిత్రులకు
నమస్కారం!

భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని కీర్ స్టార్మర్‌కు ముంబయిలో ఈ రోజు స్వాగతం చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను.

స్నేహితులరా,

ప్రధాని స్టార్మర్ నాయకత్వంలో భారత్ - యూకే సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. ఈ ఏడాది జులైలో యూకేలో పర్యటించిన సమయంలో.. చరిత్రాత్మకమైన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)ను పూర్తి చేశాం. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య దిగుమతి వ్యయాన్ని తగ్గిస్తుంది. యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుంది. వాణిజ్యాన్ని పెంపొందించి రెండు దేశాల పరిశ్రమలకు, వినియోగదారులకు లబ్ధి చేకూర్చుతుంది.

ఈ ఒప్పందం చేసుకున్న కొన్ని నెలల అనంతరం.. అతి పెద్ద వ్యాపార ప్రతినిధి బృందంతో భారత్‌లో మీ పర్యటన.. భారత్-యూకే భాగస్వామ్యాన్ని నడిపించే కొత్త శక్తిని, విస్తరించిన దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి.
స్నేహితులారా,
భారత్, యూకే మధ్య అతి పెద్ద వ్యాపార సదస్సు నిన్న జరిగింది. ఈ రోజు ఇండియా-యూకే సీఈవో ఫోరం, గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవంలో మేం ప్రసంగించబోతున్నాం. ఇవి విలువైన ఆలోచనలను వెలికి తీసి, భారత్-యూకే సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త అవకాశాలను అందిస్తాయి.

 

స్నేహితులారా,

భారత్, యూకేలు సహజ భాగస్వాములు. ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం, చట్టమనే విలువలపై మన సంబంధం నిర్మితమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో.. అంతర్జాతీయ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి ముఖ్యమైన ఆధారంగా వృద్ధి చెందుతున్న మన భాగస్వామ్యం నిలుస్తోంది.

ఇండో-పసిఫిక్, పశ్చిమాసియాలో శాంతి-సుస్థిరత, ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణపై ఆలోచనలను మేం పంచుకున్నాం. ఉక్రెయిన్ వివాదం, గాజా సమస్యల విషయానికి వస్తే.. చర్చలు, దౌత్యం ద్వారా శాంతి పునరుద్ధరణకు చేపట్టే అన్ని చర్యలకు భారత్ మద్దతిస్తుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహకారాన్ని విస్తరించేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం.
స్నేహితులారా,

భారత్, యూకే మధ్య సాంకేతిక సహకారంలో అనేక అవకాశాలున్నాయి. యూకే పారిశ్రామిక నైపుణ్యమూ, ఆర్ అండ్ డీతో భారత్ ప్రతిభను, స్థాయిని అనుసంధానించేందుకు మేం పనిచేస్తున్నాం.
భారత్-యూకే సాంకేతిక భద్రతా కార్యక్రమాన్ని గతేడాది మేం ప్రారంభించాం. దీని ద్వారా కీలకమైన, నూతనంగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో ఉమ్మడి పరిశోధనకు బలమైన వేదికను మేం తయారు చేశాం. ఆవిష్కరణలే వారధిగా రెండు దేశాల మధ్య యువతను అనుసంధానించేందుకు ‘కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్’, ‘జాయింట్ ఏఐ రీసెర్చి సెంటర్’ ఏర్పాటు చేయడంతో సహా అనేక చర్యలు తీసుకున్నాం.
కీలక ఖనిజాలపై సహకారానికి ఇండస్ట్రీ గిల్డ్, సప్లై చెయిన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీని శాటిలైట్ క్యాంపస్ ఐఎస్ఎం ధన్‌బాద్‌లో ఏర్పాటు చేస్తాం.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా ఉమ్మడి అంకితభావాన్ని కలిగి ఉన్నాం. ఈ దిశలో.. ఇండియా-యూకే ఆఫ్‌షోర్ విండ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటును మేం స్వాగతిస్తున్నాం.
వాతావరణ సాంకేతిక అంకుర సంస్థల నిధిని మేం ఏర్పాటు చేశాం. ఇది వాతావరణం, సాంకేతికత, ఏఐ రంగాల్లో రెండు దేశాలకు చెందిన ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటును అందిస్తుంది.
స్నేహితులారా,
భద్రత, రక్షణ నుంచి విద్య, ఆవిష్కరణల వరకు.. భారత్, యూకే సంబంధాల్లో కొత్త కోణాలను మేం ఆవిష్కరిస్తున్నాం.
ఈ రోజు, విద్యారంగంలోనే అతి పెద్ద, అత్యంత ప్రభావవంతమైన ప్రతినిధి బృందం ప్రధాని స్టార్మర్ వెంట ఉంది. యూకేకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడం ఆనందదాయకం. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం గురుగ్రామ్ క్యాంపస్‌ను ఇటీవలే ప్రారంభించాం. దీనిలో ఇప్పటికే మొదటి బ్యాచ్ విద్యార్థులు చేరారు. అదనంగా గిఫ్ట్ సిటీలో మరో మూడు ఇతర యూకే విశ్వవిద్యాలయాల ప్రాంగణాల నిర్మాణం కొనసాగుతోంది.

 

మన రక్షణ భాగస్వామ్యం కూడా బలంగా ఉంది. రక్షణ సహ ఉత్పత్తి, రెండు దేశాల్లోని రక్షణ సంస్థలను అనుసంధానించే దిశగా ముందుకు వెళుతున్నాం. మా రక్షణ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక ఒప్పందంపై సంతకం చేశాం. దీని ద్వారా.. భారత వాయుసేనకు చెందిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు.. యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు శిక్షకులుగా పనిచేస్తారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో.. ఈ సమావేశం జరుగుతుంటే.. మా యుద్ద నౌకలు ఉమ్మడి సైనిక విన్యాసం ‘‘కొంకణ్ 2025’’లో పాల్గొంటున్నాయి.
స్నేహితులారా,

యునైటెడ్ కింగ్డమ్‌లో నివసిస్తున్న 1.8 మిలియన్ల మంది భారతీయులు మా భాగస్వామ్యానికి జీవన వారధిగా పనిచేస్తున్నారు. బ్రిటిష్ సమాజం, ఆర్థిక రంగానికి వారు అందిస్తున్న విలువైన సహకారం ద్వారా.. రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం, ప్రగతి సంబంధాలను వారు మెరుగుపరుస్తున్నారు.

 

స్నేహితులారా,

భారత్‌- వేగం, యునైటెడ్ కింగ్డమ్‌- అనుభవం రెండూ కలసి ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తాయి. మన భాగస్వామ్యం నమ్మకమైనది.. ప్రతిభ, సాంకేతికతలతో ముందుకు నడుస్తోంది. ప్రధాని స్టార్మర్, నేను కలసి నిలబడిన ఈ వేదిక.. మా రెండు దేశాల పౌరుల కోసం ఉజ్వల భవిష్యత్తును నిర్మించేందుకు కలిసి పనిచేయాలన్న మా ఉమ్మడి నిబద్దతను తెలియజేస్తుంది.
మరోసారి భారత్‌లో పర్యటిస్తున్న ప్రధాని స్టార్మర్, ఆయన ప్రతినిధి బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూలై 2026
July 21, 2026

Self-Reliance Is No Longer a Slogan — It’s Happening Across Engines, UPI, Vaccines & FDI Under the Leadership of PM Modi