నమస్కారం!

   భారతదేశంలోని 140 కోట్ల మంది తరఫున మీకందరికీ నా శుభాభినందనలు.

   నాయకులను ఎన్నుకోవడమనే యోచన రీత్యా ప్రపంచ దేశాలకన్నా ప్రాచీన భారతం చాలా ముందంజలో ఉంది. తమ నాయకుడిని ఎన్నుకోవడం పౌరుల ప్రథమ కర్తవ్యమని మా ఇతిహాసం ‘మహాభారతం’ ప్రబోధిస్తుంది.

   విస్తృతస్థాయి సంప్రదింపు సంఘాల ద్వారా రాజకీయాధికార వినియోగం గురించి మా పవిత్ర వేదాలు ఏనాడో ప్రవచించాయి. రాజ్యాధికారం వంశపారంపర్యం కాదని స్పష్టం చేసే గణతంత్ర రాజ్యాలెన్నో ప్రాచీన భారతంలో ఉండేవనడానికి అనేక చారిత్రక నిదర్శనాలున్నాయి. కాబట్టి నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి భారతదేశాన్ని తల్లిగా పరిగణించవచ్చు.

మాననీయులారా!

   ప్రజాస్వామ్యం అంటే- ఓ నిర్మాణం.. ఆత్మ! ప్రతి మానవుడి అవసరాలు, ఆకాంక్షలకు సమాన ప్రాధాన్యం ఉంటుందన్న విశ్వాసమే దీనికి పునాది. అందుకే “సమష్టి కృషితో సార్వజనీన వికాసం” (సబ్‌ కా ప్రయాస్‌.. సబ్‌కా వికాస్‌) అన్నది భారతదేశంలో మా తారకమంత్రం.

   జీవనశైలిలో మార్పులతో వాతావరణ మార్పు సమస్యపై పోరాటం, ఎక్కడికక్కడ నిల్వ ద్వారా జల సంరక్షణ లేదా ప్రతి ఇంటికీ పరిశుభ్ర వంట ఇంధనం సరఫరా... వంటి మా కార్యక్రమాల్లో ప్రతిదానికీ భారత పౌరుల సమష్టి కృషి శక్తి వనరుగా ఉంటుంది.

   కోవిడ్‌-19 సమయంలో భారత ప్రతిస్పందన ప్రజా సారథ్యం ఫలితమే. భారత తయారీ టీకాల కార్యక్రమంలో 200 కోట్ల డోసుల టీకాలు వేయడమనే బృహత్‌ కార్యక్రమ విజయాన్ని సుసాధ్యం చేసింది పౌరులే. అంతేకాదు.. మా ‘వ్యాక్సిన్‌ మైత్రి'’కార్యక్రమం ద్వారా ప్రపంచంలో లక్షలాది ప్రజలకు టీకాలు సరఫరా చేయబడ్డాయి.

   ఇందుకు దోహదం చేసింది కూడా ‘వసుధైవ కుటుంబకం’ లేదా ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ అనే ప్రజాస్వామ్య సూత్రమే.

మాననీయులారా!

   ప్రజాస్వామ్య విలువల గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి.. కానీ, నేను ఒక్క విషయం  చెప్పాలని భావిస్తున్నాను: అంతర్జాతీయ సవాళ్లు అనేకం ఉన్నప్పటికీ భారతదేశం నేడు శరవేగంగా పురోగమిస్తున్ని కీలక ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా అత్యుత్తమ ప్రకటన మరొకటి ఉండదు. ప్రజాస్వామ్యం ఎంతటి విజయాన్నైనా సాధించగలదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్‌ యూన్‌కు కృతజ్ఞతలు.

అలాగే ఈ భేటీలో పాల్గొన్న విశిష్ట నాయకులందరికీ కృతజ్ఞతలు.

అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతాభివందనాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India to add 100 merchant ships to its fleet in 5 years: Sarbananda Sonowal

Media Coverage

India to add 100 merchant ships to its fleet in 5 years: Sarbananda Sonowal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.