పవిత్ర గురు పురబ్ , కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ పునఃప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు
"ఈ రోజు నేను మీకు , మొత్తం దేశానికి చెప్పడానికి వచ్చాను. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో, ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తాం"
‘‘2014 లో దేశానికి ప్రధానమంత్రిగా సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినప్పుడు వ్యవసాయ అభివృద్ధి , రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాము"
"మేము కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) ను పెంచడమే కాకుండా, రికార్డు సంఖ్యలో ప్రభుత్వ సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం చేసిన ఉత్పత్తుల సేకరణ గత అనేక దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టింది"
‘మూడు వ్యవసాయ చట్టాల లక్ష్యం ఏమిటంటే, దేశ రైతులు, ముఖ్యంగా చిన్న రైతులను బలోపేతం చేయాలి, వారు తమ ఉత్పత్తులకు సరైన ధరను పొందాలి. అలాగే వారు తమ పంటలను అమ్ముకునే అవకాశాలు పెరగాలి.‘‘
"రైతుల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా చిన్న రైతుల ప్రయోజనం కోసం, వ్యవసాయ రంగం ప్రయోజనాల కోసం, గ్రామీణ పేదల ఉజ్వల భవిష్యత్తు కోసం- పూర్తి సమగ్రత, స్పష్టమైన మనస్సాక్షి , రైతుల పట్ల అంకితభావంతో ఈ చట్టాలను తీసుకువచ్చాము "
‘‘అటువంటి పవిత్రమైన విషయం, పూర్తిగా స్వచ్ఛమైనది, రైతుల ఆసక్తికి సంబంధించిన విషయం, మేము ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది రైతులకు వివరించలేకపోయాము. వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు కూడా వ్యవసాయ చట్టాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు".
జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, దేశం లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా పంట సరళిని మార్చడానికి ,ఎమ్ ఎస్ పిని మరింత సమర్థవంతంగా , పారదర్శకంగా చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తల ప్రతినిధులు ఉంటారు.

ప్రియమైన నా దేశ వాసులారా, నమస్కారం !

 

ఈరోజు దేవ్-దీపావళి పవిత్ర పండుగ. ఈరోజు గురునానక్ దేవ్ జీ ప్రకాష్ పురబ్ పవిత్ర పండుగ కూడా. ఈ పవిత్ర పండుగ సందర్భంగా నేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ పునఃప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయం.

 

మిత్రులారా,

 

గురునానక్ ఈ విధంగా చెప్పారు

 

'विच्‍च दुनिया सेव कमाइए ता दरगाह बैसन पाइए'

 

అంటే సేవా మార్గాన్ని అవలంబించడం ద్వారానే జీవితం సార్థకమవుతుంది. ఈ సేవా స్ఫూర్తితో దేశప్రజల జీవితాన్ని సులభతరం చేయడంలో మా ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఎన్నో తరాల కలలు సాకారం కావాలని భారతదేశం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

 

మిత్రులారా,

ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో రైతుల సమస్యలను చాలా దగ్గరగా చూశాను, అనుభవించాను. అందుకే, 2014లో దేశం నాకు ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినప్పుడు మేము వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాము.

మిత్రులారా,

దేశంలో 100 మంది రైతుల్లో 80 మంది చిన్నకారు రైతులే అన్న విషయం చాలా మందికి తెలియదు. వీరికి రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. ఈ చిన్న రైతుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉంటుందని  ఊహించగలరా? ఈ చిన్న భూమి వారి జీవితానికి మూలం. ఇది వారి జీవితం, వారు ఈ చిన్న భూమి సహాయంతో తమ వారి కుటుంబాన్ని పోషిస్తున్నారు. తరతరాలుగా కుటుంబాల విభజన ఈ భూమిని చిన్నదిగా చేస్తోంది.

అందువల్ల, దేశంలోని చిన్న రైతుల సవాళ్లను అధిగమించడానికి విత్తనాలు, బీమా, మార్కెట్లు మరియు పొదుపులను అందించడంలో మేము అన్ని రంగాలలో కృషి చేసాము. నాణ్యమైన విత్తనాలతో పాటు వేప పూతతో కూడిన యూరియా, సాయిల్ హెల్త్ కార్డులు, మైక్రో ఇరిగేషన్ తదితర సౌకర్యాలను కూడా ప్రభుత్వం రైతులకు కల్పించింది. రైతులకు 22 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాం. దీంతో ఈ శాస్త్రీయ ప్రచారం వల్ల వ్యవసాయోత్పత్తి కూడా పెరిగింది.

 

మిత్రులారా,

ఫసల్ బీమా పథకాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాం. మరింత మంది రైతులను ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. విపత్తు సమయంలో ఎక్కువ మంది రైతులు సులభంగా పరిహారం పొందేలా పాత నిబంధనలను కూడా మార్చారు. ఫలితంగా మన రైతు సోదర సోదరీమణులకు నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు పైగా పరిహారం అందింది. చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాం. చిన్న రైతుల అవసరాలను తీర్చేందుకు 1.62 లక్షల కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం జరిగింది.

 

మిత్రులారా,

రైతుల కష్టానికి ప్రతిఫలంగా పండించిన పంటకు సరైన ధర లభించేలా అనేక చర్యలు తీసుకున్నారు. దేశం తన గ్రామీణ మార్కెట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది. మేము ఎంఎస్పీ ని పెంచడమే కాకుండా, రికార్డు స్థాయిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను కూడా సృష్టించాము. మన ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తుల సేకరణ గత కొన్ని దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టింది. దేశంలోని 1,000 కంటే ఎక్కువ మండీలను e-NAM పథకంతో అనుసంధానం చేయడం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడికైనా విక్రయించుకునే వేదికను మేము కల్పించాము. దీనితో పాటు దేశవ్యాప్తంగా వ్యవసాయ మండీల ఆధునీకరణకు కూడా కోట్లాది రూపాయలు వెచ్చించాం.

 

మిత్రులారా,

గతంతో పోలిస్తే నేడు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ ఐదు రెట్లు పెరిగింది. ఏటా రూ.1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి ఖర్చు చేస్తున్నారు. లక్ష కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద గ్రామాలు, పొలాల దగ్గర ఉత్పత్తులను నిల్వ ఉంచడం, వ్యవసాయ పరికరాలను వేగంగా అందుబాటులో ఉంచడం వంటి అనేక సౌకర్యాల విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

చిన్న రైతులకు సాధికారత కల్పించేందుకు 10,000 ఎఫ్‌పిఓలను (ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్) సృష్టించే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి కూడా దాదాపు 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మైక్రో ఇరిగేషన్ నిధుల కేటాయింపు కూడా రెట్టింపు చేసి 10,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. పంట రుణాన్ని కూడా రెట్టింపు చేశాం, ఈ ఏడాది రూ.16 లక్షల కోట్లు. ఇప్పుడు చేపల పెంపకంతో సంబంధం ఉన్న మన రైతులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రయోజనాన్ని పొందడం ప్రారంభించారు. అంటే రైతుల ప్రయోజనాల కోసం మన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి మరియు వారి సామాజిక స్థితిని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.

 

మిత్రులారా,

రైతుల స్థితిగతులను మెరుగుపరచడానికి ఈ గొప్ప ప్రచారంలో భాగంగా మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టారు. దేశంలోని రైతులు, ముఖ్యంగా చిన్న రైతులు సాధికారత సాధించాలని, వారి ఉత్పత్తులకు సరైన ధర లభించాలని, తమ ఉత్పత్తులను విక్రయించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా ఈ డిమాండ్‌ను దేశంలోని రైతులు, వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు మరియు రైతు సంఘాలు నిరంతరంగా చేస్తున్నాయి. గతంలో కూడా చాలా ప్రభుత్వాలు ఈ అంశంపై మేధోమథనం చేశాయి. ఈసారి కూడా ఈ చట్టాలను ప్రవేశపెట్టడంపై పార్లమెంటులో చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులతో పాటు అనేక రైతు సంఘాలు దీనిని స్వాగతించి మద్దతు తెలిపాయి. వారందరికీ నేను చాలా కృతజ్ఞుడను, వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.

 

మిత్రులారా,

రైతుల సంక్షేమం కోసం, ముఖ్యంగా చిన్న రైతుల కోసం, వ్యవసాయం, దేశ ప్రయోజనాల కోసం, గ్రామాల్లోని పేదల ఉజ్వల భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో, పూర్తి చిత్తశుద్ధితో, పూర్తి అంకితభావంతో కొత్త చట్టాలను తీసుకువచ్చింది. కానీ మేము ఎంత ప్రయత్నించినా రైతులకు మేలు చేసే, పరమ పవిత్రమైన అలాంటి పవిత్రమైన విషయాన్ని కొంతమంది రైతులకు వివరించలేకపోయాము.

 

ఒక వర్గం రైతులు మాత్రమే నిరసన వ్యక్తం చేసినప్పటికీ, మాకు ఇప్పటికీ ఇది ముఖ్యమైనది. వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు కూడా వ్యవసాయ చట్టాల ప్రాముఖ్యతను వారికి అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మేము చాలా వినయంతో, ఓపెన్ మైండ్‌తో వారికి వివరిస్తూనే ఉన్నాము. వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తిగత, సమూహ పరస్పర చర్యలు కూడా కొనసాగాయి. రైతుల వాదనలను అర్థం చేసుకోవడానికి మేము ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు.

 

తమకు అభ్యంతరాలు ఉన్న చట్టాల నిబంధనలను కూడా మార్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ చట్టాలను రెండేళ్లపాటు నిలిపివేయాలని కూడా మేము ప్రతిపాదించాము. ఈలోగా ఈ వ్యవహారం గౌరవనీయ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఈ విషయాలన్నీ దేశం ముందు ఉన్నాయి, కాబట్టి నేను తదుపరి వివరాలలోకి వెళ్లను.

 

మిత్రులారా,

దేశప్రజలకు క్షమాపణలు చెబుతూనే, ఈరోజు నేను మనస్పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను, రైతు సోదరులకు దీపపు వెలుగులాంటి సత్యాన్ని వివరించలేకపోయిన మన తపస్సులో బహుశా ఏదో లోపం ఉండి ఉంటుందని.

 

ఈరోజు గురునానక్ దేవ్ జీ ప్రకాష్ పురబ్ పవిత్ర పండుగ. ఇది ఎవరినీ నిందించాల్సిన సమయం కాదు. ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మొత్తం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తాం.

 

మిత్రులారా,

ఈ రోజు గురు పురబ్ పవిత్రమైన రోజు కాబట్టి మీరు మీ ఇళ్లకు, పొలాలకు, మీ కుటుంబాలకు తిరిగి వెళ్లాలని ఆందోళన చేస్తున్న నా రైతు సహచరులందరినీ నేను కోరుతున్నాను. కొత్తగా ప్రారంభిద్దాం. సరికొత్త ప్రారంభంతో ముందుకు సాగుదాం.

 

మిత్రులారా,

వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీరో బడ్జెట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంటే సహజ వ్యవసాయం, మారుతున్న దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటల విధానాన్ని శాస్త్రీయంగా మార్చడం మరియు MSP మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా ఉండేలా చేయడం వంటి విషయాలపై నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారు.

 

మిత్రులారా,

మా ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, అలాగే కొనసాగుతుంది. గురుగోవింద్ సింగ్ జీ స్ఫూర్తితో నా ప్రసంగాన్ని ముగిస్తాను.

‘देह सिवा बरु मोहि इहै सुभ करमन ते कबहूं न टरों।‘

 

ఓ దేవీ, నేను సత్కార్యాలు చేయడానికి ఎన్నటికీ వెనుకంజ వేయకూడని ఈ వరం నాకు ప్రసాదించు.

నేనేం చేసినా రైతుల కోసమే చేశాను, ఏం చేసినా దేశం కోసమే చేస్తున్నాను. మీ ఆశీస్సులతో ఇంతకు ముందు కూడా నా కష్టానికి లోటు లేదు. మీ కలలు సాకారం కావడానికి, దేశం కలలు సాకారం కావడానికి నేను ఇప్పుడు మరింత కష్టపడి పని చేస్తానని ఈ రోజు నేను మీకు హామీ ఇస్తున్నాను.

మీకు చాలా ధన్యవాదాలు! నమస్కారం!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi becomes first world leader to cross 100 million Instagram followers

Media Coverage

PM Modi becomes first world leader to cross 100 million Instagram followers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Condoles the Passing of Shri Maroof Raza Ji
February 26, 2026

Prime Minister Narendra Modi has expressed grief over the passing of Shri Maroof Raza Ji, honoring his legacy in the fields of journalism.

The Prime Minister stated that Shri Maroof Raza Ji made a rich contribution to the world of journalism. He noted that Shri Raza enriched public discourse through his nuanced understanding of defence, national security, and strategic affairs.

Expressing his sorrow, the Prime Minister said he is pained by his passing and extended his condolences to his family and friends.
The Prime Minister shared on X:

“Shri Maroof Raza Ji made a rich contribution to the world of journalism. He enriched public discourse with his nuanced understanding of defence, national security as well as strategic affairs. Pained by his passing. Condolences to his family and friends”