From 22nd September, the first day of Navratri, the new GST rates are going to be implemented, They will serve as a double dose of support and growth for our country: PM
This will not only increase savings for every family but will also give new strength to our economy: PM
Let’s work towards building an Aatmanirbhar Bharat! And, to inspire the young generation towards this goal, the role of our teachers is very important: PM
We care about the well-being of our youth. That’s why, we have taken a big step to stop online money games: PM
India's young generation should not lack opportunities to become scientists and innovators; the participation of our teachers is also important in this: PM
Proudly say, this is Swadesh,Today this sentiment should inspire every child of the country: PM

మన సంప్రదాయంలో ఉపాధ్యాయులపై సహజమైన గౌరవం ఉంది. వారు సమాజానికి గొప్ప బలం కూడా. ఉపాధ్యాయులను ఆశీర్వాదాల కోసం నిలబడేలా చేయడం తప్పు. నేను అలాంటి పాపం చేయాలనుకోను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరినీ కలవడం నాకు అద్భుతమైన అనుభవం. మీలో ప్రతి ఒక్కరికి మీ సొంత కథ ఉండి ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మీరు ఈ స్థాయికి చేరుకునేవారు కాదు. ఆ కథలన్నింటినీ తెలుసుకోవడానికి తగినంత సమయం దొరకడం కష్టం. కానీ మీ నుంచి నేను నేర్చుకోగలిగినది నిజంగా స్ఫూర్తిదాయకం.. దాని కోసం నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ జాతీయ పురస్కారం అందుకోవడం ముగింపు కాదు. ఈ పురస్కారం అందుకున్న తర్వాత అందరి దృష్టి మీపైనే ఉంటుంది. దీని అర్థం మీ పరిధి గణనీయంగా విస్తరించింది. గతంలో మీ ప్రభావం, ఆదేశం పరిధి పరిమితమే. ఇప్పుడు ఈ గుర్తింపు తర్వాత అది చాలా విస్తృతంగా పెరుగుతుంది. ఇది ప్రారంభం అని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు వీలైనంత వరకు అందరితో పంచుకోవాలి. మీరు అలా చేస్తే మీలో సంతృప్తి పెరుగుతుంది. మీరు ఆ దిశలో కృషి చేస్తూనే ఉండాలి. ఈ పురస్కారానికి మీరు ఎంపిక కావడం మీ కృషికి, నిరంతర అంకితభావానికి నిదర్శనం. అందుకే ఇది సాధ్యమైంది. ఒక ఉపాధ్యాయుడు వర్తమానానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు తరాలను కూడా రూపొందిస్తాడు.. భవిష్యత్తును మెరుగుపరుస్తాడు. ఇది దేశానికి చేసే సేవ కంటే తక్కువ కాదని నేను నమ్ముతున్నాను. నేడు మీవంటి కోట్లాది మంది ఉపాధ్యాయులు అదే దేశభక్తి, నిజాయితీ, అంకితభావంతో దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం లభించకపోవచ్చు. బహుశా చాలామంది ప్రయత్నించి ఉండకపోవచ్చు.. కొందరు గమనించి ఉండకపోవచ్చు. అలాంటి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులు అనేకమంది ఉన్నారు. వారందరి సమిష్టి కృషి వల్లే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.. భావి తరాలూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. దేశం కోసం జీవించే అందరి సహకారం దీనిలో ఉంటుంది.

మిత్రులారా,

మన దేశం ఎల్లప్పుడూ గురు-శిష్య సంప్రదాయాన్ని గౌరవిస్తుంది. భారతదేశంలో గురువును జ్ఞానాన్ని అందించే వ్యక్తిగా మాత్రమే కాకుండా జీవితానికి మార్గదర్శిగా గౌరవిస్తారు. నేను తరచుగా చెబుతుంటాను.. తల్లి జన్మనిస్తుంది, కానీ గురువు జీవితాన్ని ఇస్తాడు అని. మనం వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రస్తుత సమయంలో ఈ గురుశిష్య సంప్రదాయం మనకు తోడుగా ఉండే గొప్ప బలాల్లో ఒకటి. మీలాంటి ఉపాధ్యాయులు ఈ గొప్ప సంప్రదాయానికి చిహ్నాలు. మీరు యువతరానికి అక్షరాస్యతను అందించడమే కాకుండా, దేశం కోసం జీవించడం కూడా నేర్పుతున్నారు. మీరు మీ సమయాన్ని వెచ్చిస్తున్న బిడ్డ ఒక రోజు ఈ దేశానికి సేవ చేయగలడనే ఆలోచన మీ మనసులో ఉంటుంది. అంకితభావంతో మీరు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

బలమైన దేశానికి, సాధికారత కలిగిన సమాజానికి ఉపాధ్యాయులే పునాది. కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళికను స్వీకరించాల్సిన ప్రాముఖ్యాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుంటారు. వారు పాత పద్ధతుల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటారు. దేశం కోసం అమలు చేస్తున్న సంస్కరణల్లో కూడా ఇదే స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది. ఇప్పుడే ధర్మేంద్ర జీ ప్రస్తావించిన ఈ విషయాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. సంస్కరణలు నిరంతరం కొనసాగాలి. అవి ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండాలి.. దీర్ఘకాలిక దృష్టి కూడా ఉండాలి. అవి అర్థం చేసుకునేవిగా, అంగీకరించేవిగా, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉంది. సకాలంలో సంస్కరణలు చేపట్టకపోతే భారత్ నేటి ప్రపంచంలో చేరుకోవాల్సిన స్థానాన్ని చేరుకోలేదన్నది మా నమ్మిక.

 

మిత్రులారా,

భారత్ స్వయం-సమృద్ధి సాధించడం కోసం తదుపరి తరం సంస్కరణలు తప్పనిసరని ఆగస్టు 15న ఎర్రకోట నుంచి నేను చెప్పాను. దీపావళి, ఛఠ్ పూజకు ముందే పండుగలను రెట్టింపు ఆనందంతో నిర్వహించుకుంటామని నేను దేశ ప్రజలకు హామీ ఇచ్చాను. ఇప్పుడు మీరంతా రెండు రోజులుగా ఇక్కడే తీరిక లేకుండా ఉన్నారు. బహుశా మీకు వార్తాపత్రికలను చూసేందుకు, టెలివిజన్ చూసేందుకు అవకాశం లభించి ఉండకపోవచ్చు. ఇంట్లో ఎవరైనా మీతో, “ఓయ్, మీ ఫోటో పేపర్లో వచ్చింది!” అని చెప్పి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనం ముందుకు సాగుతున్న స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిన్న భారత ప్రభుత్వం చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. జీఎస్టీ ఇప్పుడు మరింత సరళంగా, సులభంగా మారింది. ఇప్పుడు జీఎస్టీలో రెండు ప్రధాన స్లాబులు మాత్రమే ఉన్నాయి. అవి 5 శాతం, 18 శాతం. సెప్టెంబర్ 22.. సోమవారం.. నవరాత్రి మొదటి రోజు. నవరాత్రి మాతృత్వపు శక్తితో లోతుగా ముడిపడి ఉంది. సంస్కరించిన జీఎస్టీ విధానం.. ఈ తదుపరి తరం సంస్కరణ ఈ పవిత్రమైన రోజునుంచే అమలులోకి వస్తుంది. నవరాత్రి నుంచే దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు అవసరమైన వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ సంవత్సరం ధంతేరాస్ పండుగ సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే డజన్ల కొద్దీ వస్తువులపై పన్నులు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి.

మిత్రులారా,

ఎనిమిదేళ్ల కిందట జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు దశాబ్దాల నాటి కల నెరవేరింది. ఇది మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రారంభమైన విషయం కాదు. అంతకు చాలాకాలం ముందు నుంచే దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. సమస్య ఏమిటంటే.. కేవలం చర్చలు మాత్రమే ఉన్నాయి, చర్యలు లేవు. స్వతంత్ర భారతదేశంలో జీఎస్టీ అతిపెద్ద ఆర్థిక సంస్కరణల్లో ఒకటి. ఆ సమయంలో దేశం బహుళ పన్నుల వల నుంచి విముక్తి పొందింది. ఇదే ఒక పెద్ద విజయం. ఇప్పుడు 21వ శతాబ్దంలో భారత్ పురోగమిస్తున్న కొద్దీ.. జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణల అవసరం ఏర్పడింది.. అది సాకారమైంది. మీడియాలోని కొంతమంది మిత్రులు దీనిని జీఎస్టీ 2.0 అంటున్నారు. వాస్తవానికి ఇది దేశం కోసం మద్దతు, వృద్ధి... డబుల్ డోస్. డబుల్ డోస్ అంటే ఒక వైపు సాధారణ కుటుంబాలకు పొదుపు.. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు. ఈ కొత్త జీఎస్టీ సంస్కరణలతో దేశంలోని ప్రతి కుటుంబం ఎంతో ప్రయోజనం పొందుతుంది. పేదలు, నవ-మధ్యతరగతి, మధ్యతరగతి, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత సహా ప్రతి ఒక్కరూ పన్ను తగ్గింపు నుంచి ప్రయోజనం పొందుతారు. పనీర్ నుంచి షాంపూ, సబ్బుల వరకు ప్రతిదీ ఇప్పుడు మునుపటి కంటే చౌకగా లభిస్తాయి. ఇది మీ నెలవారీ ఇంటి ఖర్చులు, వంటగది ఖర్చులను బాగా తగ్గిస్తుంది. స్కూటర్లు, కార్లపై కూడా పన్నులు తగ్గించాం. ఇది ముఖ్యంగా తమ కెరీర్‌లను ప్రారంభించే యువతకు సహాయపడుతుంది. జీఎస్టీ తగ్గించడం ద్వారా ఇంటి బడ్జెట్‌ నిర్వహణను, జీవనశైలినీ మెరుగుపరచడం కూడా సులభం అవుతుంది.

మిత్రులారా,

నిన్న తీసుకున్న నిర్ణయం నిజంగా సంతోషకరమైనది. జీఎస్టీకి ముందు పన్ను రేట్లను గుర్తుచేసుకుంటేనే దాని నిజమైన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితులు ఎంత మారిపోయాయో మనకు తెలియదు. ఉదాహరణకు, మీ కుటుంబంలో ఒక పిల్లవాడు 70 మార్కులు సాధించి, ఆపై 71, 72, 75కి మెరుగుపడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ అదే పిల్లవాడు 99 మార్కులు సాధిస్తే అకస్మాత్తుగా అందరూ గమనిస్తారు. అదే నేను చెప్పాలనుకుంటున్నది.

 

మిత్రులారా,

2014కి ముందు గత ప్రభుత్వ హాయాంలో దాదాపు ప్రతి వస్తువుపై భారీగా పన్నుల భారం ఉండేది. గృహోపకరణాలు, వ్యవసాయ సామాగ్రి, మందులు, జీవితబీమా ఇలా అన్నింటిపైనా ధరల బాదుడు ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై ప్రత్యేక పన్నులు విధించింది. ఆ వ్యవస్థ కొనసాగి ఉంటే.. నేటికీ మనం 2014 నాటి పన్ను విధానంలోనే ఉంటే.. ప్రతి 100 రూపాయల కొనుగోలు కోసం మీరు 20–25 రూపాయల పన్ను చెల్లించేవారు. మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించడంతో.. బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం పొదుపును పెంచడం.. కుటుంబ ఖర్చులను తగ్గించడంపైనే దృష్టి సారించింది. అందుకే ఇప్పుడు జీఎస్టీలో చాలా తగ్గింపులు జరిగాయి. నేను ఏ ప్రభుత్వాన్నీ విమర్శించడానికి ఇక్కడ లేను.. మీరు ఉపాధ్యాయులు కాబట్టి మీరు సులభంగా పోల్చి చూడగలరు.. మీరు మీ విద్యార్థులకు కూడా దీనిని గురించి వివరించవచ్చు.

మిత్రులారా,

కాంగ్రెస్ ప్రభుత్వం మీ నెలవారీ ఇంటి బడ్జెట్‌ను ఎలా పెంచిందో ఎవరూ మర్చిపోలేరు. టూత్‌పేస్టు, సబ్బు, తలకు రాసుకునే నూనెలు, అన్నింటిపైనా 27 శాతం పన్ను వేశారు. ఈ రోజు మీకు గుర్తుండకపోవచ్చు.. కానీ మీరు దానికి చెల్లించేవారు. ప్లేట్లు, కప్పులు, స్పూన్లు వంటి రోజువారీ వస్తువులన్నింటికీ 18 నుంచి 28 శాతం వరకు పన్నులు ఉండేవి. పళ్లపొడి మీద 17 శాతం పన్ను విధించారు. కాంగ్రెస్ కాలంలో రోజువారీ ఉపయోగించే దాదాపు ప్రతి ముఖ్యమైన వస్తువుపై భారీగా పన్ను విధించారు. ఆఖరికి, పిల్లలు తినే చాక్లెట్లపై కూడా కాంగ్రెస్ 21 శాతం పన్ను విధించింది. బహుశా మీరు అప్పట్లో వార్తాపత్రికల్లో గమనించి ఉండవచ్చు లేదా గమనించకపోవచ్చు. మోదీ అలా చేసి ఉంటే.. ప్రజల ఆగ్రహం కట్టలుతెంచుకునేది. ఈ దేశంలో కోట్లాది మందికి రోజువారీ అవసరమైన సైకిళ్లపై కూడా 17 శాతం పన్ను వారు విధించారు. లక్షలాది మంది తల్లులు, సోదరీమణుల గౌరవం.. స్వయం ఉపాధికి మూలమైన కుట్టు యంత్రాలపైనా 16 శాతం పన్ను విధించారు. మధ్యతరగతికి విశ్రాంతి, ప్రయాణం కూడా భారమయ్యాయి. కాంగ్రెస్ పాలనలో హోటల్ గదుల బుకింగ్‌పై 14 శాతం పన్ను విధించేవారు. దానికి తోడు అనేక రాష్ట్రాలు లగ్జరీ పన్ను కూడా విధించాయి. ఇప్పుడు అటువంటి వస్తువులు, సేవలపై కేవలం 5 శాతం పన్ను మాత్రమే. కొంతమంది విమర్శకులు "మోదీ ఇప్పటికీ 5 శాతం వసూలు చేస్తున్నారు" అని రాస్తారు. కానీ మార్పును మీరే గమనించండి. ఇక నుంచీ 7,500 రూపాయల ఖరీదు చేసే హోటల్ గదులపై కూడా 5 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. మీరు సేవలందించే ప్రభుత్వాన్ని ఎంచుకున్నందునే ఇది సాధ్యమైంది.. అదే బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం.

మిత్రులారా,

గతంలో మన దేశంలో వైద్యం చాలా ఖరీదనే ఫిర్యాదు ఉండేది. పేదలు, మధ్యతరగతి వారికి సాధారణ పరీక్షలు కూడా అందుబాటులో లేవు. కారణం కాంగ్రెస్ ప్రభుత్వం రోగనిర్ధారణ కిట్లపై 16 శాతం పన్ను విధించింది. మా ప్రభుత్వం అటువంటి వస్తువులపై పన్నును ఏకంగా 5 శాతానికి తగ్గించింది.

మిత్రులారా,

కాంగ్రెస్ పాలనలో ఇల్లు కట్టుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిమెంటుపై 29 శాతం పన్ను విధించింది. ఏదోవిధంగా ఇల్లు కట్టుకున్నా.. ఏసీ, టీవీ, ఫ్యాన్ వంటి ప్రాథమిక గృహోపకరణాలు కొనడం చాలా ఖరీదైనది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి వస్తువులపై 31 శాతం పన్ను విధించింది. 31 శాతం! ఇప్పుడు మన ప్రభుత్వం అలాంటి వస్తువులపై పన్నును 18 శాతానికి తగ్గించింది.. అంటే దాదాపు సగానికి తగ్గించింది.

మిత్రులారా,

కాంగ్రెస్ పాలనలో రైతులూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2014కి ముందు సాగు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటే.. లాభాలు చాలా తక్కువ. కారణం వ్యవసాయ పరికరాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించింది. ట్రాక్టర్లు, నీటిపారుదల పరికరాలు, చేతి పనిముట్లు, పంపుసెట్ల వంటి వస్తువులపై 12 నుంచి 14 శాతం వరకు పన్ను వేశారు. ఇప్పుడు అలాంటి అనేక వస్తువులపై జీఎస్టీ సున్నా. మరికొన్ని వ్యవసాయ సంబంధిత వస్తువులపై పన్ను కేవలం నేడు అయిదు శాతం మాత్రమే.

 

మిత్రులారా,

'వికసిత్ భారత్' మరో మూలస్తంభం 'యువ శక్తి'. మన యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.. చిరు వ్యాపారుల ఇబ్బందులు తొలగిపోయాయి. అత్యధికంగా సిబ్బందిని నియమించుకునే రంగాలు తక్కువ జీఎస్టీ రేట్ల ద్వారా భారీ ఉపశమనం పొందుతున్నాయి. వస్త్రాలు, హస్తకళలు, తోలు వంటి రంగాల్లోని కార్మికులు, వ్యాపార యజమానులూ బాగా ప్రయోజనం పొందారు. దీంతో పాటు దుస్తులు, పాదరక్షల ధరలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. మన అంకురసంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలు, చిరు వ్యాపారుల కోసం పన్నులు తగ్గడమే కాకుండా.. కొన్ని విధానాలు కూడా సరళంగా మారాయి. ఇది వారి వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతుంది.

మిత్రులారా,

యువతకు మరొక రంగంలో కూడా లాభం కలుగుతుంది. అది ఫిట్నెస్ రంగం. జిమ్‌లు, సెలూన్లు, యోగా వంటి సేవలపై పన్నుల్ని తగ్గించారు. అంటే మన యువత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా విజయాలు సాధిస్తారు. ప్రభుత్వం మీ ఆరోగ్యానికి ఇంత చేస్తున్న సందర్భంలో, నేను పదే పదే చెప్పే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా.  మీరు రోజూ సుమారు 200 మందిని కలుస్తారు కాబట్టి, దయచేసి నా సందేశాన్ని వాళ్లకు చేరవేయండి.  ఊబకాయం మన దేశానికి ఒక పెద్ద సమస్య. అందుకే నేను చెబుతున్నా. తక్షణం మీ నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించండి. మహమ్మద్‌జీ, మీరు దీని కోసం నా రాయబారిగా మారండి. ఊబకాయంపై పోరాటం ఎప్పటికీ బలహీనపడకూడదు.

మిత్రులారా,

జీఎస్టీలో చేసిన సంస్కరణలను సంక్షిప్తంగా చెప్పాలంటే, అవి భారత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థకు అయిదు ఆభరణాలను జోడించాయని నేను చెప్పగలను. మొదటిది, పన్ను వ్యవస్థ చాలా సరళంగా మారింది. రెండోది భారత ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. మూడోది... వినియోగం, అభివృద్ధి, రెండింటికీ మరింత ప్రోత్సాహం. నాలుగోది- వ్యాపారం సులభతరం కావడం వల్ల  పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగాలు పెరుగుతాయి. అయిదు- సహకార సమాఖ్య విధానం అంటే రాష్ట్రాలు, కేంద్రం మధ్య భాగస్వామ్యం. “వికసిత భారత్” కోసం మరింత బలపడుతుంది.

మిత్రులారా,

‘ప్రజలు దైవంతో సమానం’ అన్నది మన మంత్రం. ఈ సంవత్సరం జీఎస్టీని మాత్రమే కాకుండా ఆదాయపు పన్నును కూడా గణనీయంగా తగ్గించారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఇప్పుడు పూర్తిగా పన్ను రహితం. ఇందువల్ల ఇప్పుడు మీరు మీ ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేస్తున్నప్పుడు మరింత ఆనందం లభిస్తోంది కదా? అంటే ఆదాయంలోనూ, ఖర్చులోనూ పొదుపు. ఇది “డబుల్  బొనాంజా” కాక మరేం అవుతుంది!

మిత్రులారా,

ఈ మధ్య ద్రవ్యోల్బణం రేటు కూడా చాలా తక్కువ స్థాయిలో, అదుపులో ఉంది. దీనినే ప్రజానుకూల పాలన అని మనం అంటాం. ప్రజా ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నప్పుడు  దేశం ముందుకు సాగుతుంది. అందుకే ఈ రోజు భారతదేశ వృద్ధి దాదాపు 8 శాతంగా ఉంది. మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాం.  ఇది 140 కోట్లమంది భారతీయుల బలం. 140 కోట్లమంది భారతీయుల సంకల్పం. నా దేశ ప్రజలకు నేను మళ్ళీ చెబుతున్నా. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా మార్చేందుకు సంస్కరణల  ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అదిఎంతమాత్రం ఆగదు. 

 

మిత్రులారా,

స్వావలంబన... భారతదేశానికి కేవలం ఒక నినాదం కాదు. ఈ దిశగా స్థిరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరందరూ, దేశంలోని ఉపాధ్యాయులందరూ 'ఆత్మనిర్భర్ భారత్' గురించిన ఆలోచనా బీజాలను ప్రతి విద్యార్థిలోనూ నాటాలని, దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని నేను ఆశిస్తున్నా. భారతదేశానికి స్వావలంబన ఎందుకు అంత ముఖ్యమో పిల్లలకు వారి సొంత సులభమైన భాషలో, మాండలికంలో మీరే వివరించగలరు. వారు మిమ్మల్ని నమ్ముతారు. ఇతరులపై ఆధారపడే ఒక దేశం, తన నిజమైన సామర్థ్యానికి తగ్గట్టుగా అంత వేగంగా ఎప్పటికీ అభివృద్ధి చెందలేదని మీరు వారికి చెప్పవచ్చు.

మిత్రులారా,

ఈ రోజు విద్యార్థులలోనూ, రాబోయే తరాలలోనూ ఒక ప్రశ్నను నిరంతరం ప్రోత్సహించాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలి. అది మన కర్తవ్యం. ఈ ప్రశ్న పాఠశాల అసెంబ్లీలో కూడా చర్చకు రావాలని కోరుకుంటున్నా. అప్పుడప్పుడు, ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎన్ని విదేశీ వస్తువులు వచ్చి చేరాయో మీరు గుర్తించలేరు. మీరు కావాలని విదేశీ వస్తువులను కొనుగోలు చేయకపోయినా, అవి తెలియకుండానే మీ ఇంటిలో ఉంటాయి. పిల్లలు, వారి కుటుంబాలతో కలిసి కూర్చుని, ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు... ఉపయోగించిన అన్ని వస్తువుల జాబితాను తయారు చేయాలి. ఒక హెయిర్ పిన్ కూడా విదేశీదే, ఒక దువ్వెన కూడా విదేశీదే అని తెలిసినప్పుడు వారు ఆశ్చర్యపోతారు! పిల్లలకు అది అర్థం కాదు. ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత, ఆ పిల్లవాడు "అయ్యో, దీనివల్ల నా దేశానికి ఏం లాభం?"  అంటాడు. అందుకే, మీరు ఈ మొత్తం కొత్త తరానికి స్ఫూర్తినివ్వగలరని నేను నమ్ముతున్నా. మహాత్మాగాంధీ ఒకప్పుడు మన కోసం వదిలిపెట్టిన పనిని పూర్తి చేసే భాగ్యం నేడు మనకు లభించింది. మనమంతా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నేను కోరుకుంటున్నా. పిల్లలను ప్రోత్సహిస్తూ నేను వారికి ఎప్పుడూ ఇలా ఆలోచించమని చెబుతాను. ’’నా దేశానికి చెందిన ఒక్క అవసరాన్ని అయినా నేను ఎలా తీర్చగలను? ఒకవేళ ఏదైనా నా దేశంలో అందుబాటులో లేకపోతే, నేను దాన్ని తయారు చేస్తాను. అందుకోసం నేను ప్రయత్నిస్తాను. నేను దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను’’ అన్న ఆలోచనను వారికి ఇవ్వండి.

ఒక్కసారి ఊహించండి. మన దేశం నేటికీ లక్ష కోట్ల రూపాయల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వంట నూనె! మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఇది మన జీవనశైలి, అవసరాలు లేదా పరిస్థితులు కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ దేశం ఈ విషయంలో స్వావలంబన సాధించాలి. ఇప్పుడు, లక్ష కోట్ల రూపాయలు బయటికి వెళ్లిపోతున్నాయి. ఆ డబ్బు ఇక్కడే ఉంటే, ఎన్ని పాఠశాలలు వచ్చేవి - ఎంతమంది పిల్లల జీవితాలు మెరుగయ్యేవి. అందుకే మనం ఆత్మనిర్భర్ భారత్‌ను మన జీవన మంత్రంగా చేసుకోవాలి. దీని కోసం మనం కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలి.  దేశ అవసరాలతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మనం ఉన్న చోటు నుంచి మనం వెళ్లగలిగిన చోటుకు తీసుకెళ్లేది దేశమే. మనకు ఎంతో ఇచ్చేది దేశమే. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఇలా ఆలోచించాలి - మనం దేశానికి ఏమి ఇవ్వగలం, దేశం అవసరాలలో వేటిని మనం తీర్చగలం? ఇది ప్రతి విద్యార్థి, ప్రతి కొత్త తరం వారి ఆలోచనల్లో ఉండాలి.

మిత్రులారా,

దేశంలోని విద్యార్థులలో నేడు నూతన ఆవిష్కరణలు, సైన్స్, సాంకేతికత పట్ల ఒక కొత్త అభిరుచి మేల్కొంది. చంద్రయాన్ విజయం దీనిలో చాలా పెద్ద పాత్ర పోషించింది. చంద్రయాన్ దేశంలోని ప్రతి బిడ్డలోనూ శాస్త్రవేత్త కావాలని, ఆవిష్కరణలు చేయాలని కలలు కనేలా స్ఫూర్తినిచ్చింది. ఈ మధ్య మనం చూశాం, అంతరిక్ష యానం నుంచి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తాను చదువుకున్న పాఠశాలకు వెళ్ళినప్పుడు, అక్కడి వాతావరణమంతా పూర్తిగా మారిపోయింది. శుభాంశు సాధించిన విజయం వెనుక కచ్చితంగా అతని ఉపాధ్యాయుల పాత్ర ఉంది. లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. దీని ద్వారా ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాదు, వారు యువతను తీర్చిదిద్దుతారని, వారికి సరైన మార్గాన్ని చూపిస్తారని తెలుస్తుంది.

మిత్రులారా,

మీ ప్రయత్నాలకు ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కూడా తోడవుతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటయ్యాయి. మరో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని కూడా  దేశం నిర్ణయించుకుంది. వీటి  పనులు వేగంగా సాగుతున్నాయి. మీలాంటి ఉపాధ్యాయుల కృషి ద్వారా  ఈ ల్యాబ్‌లలో భారతదేశ యువతకు ఆవిష్కరణలు చేసే అవకాశాలను ఇవ్వడం సాద్యమే. 

మిత్రులారా,

మా ప్రభుత్వం ఒకవైపు ఆవిష్కరణలపైన, యువతను డిజిటల్‌గా శక్తిమంతం చేయడంపైన దృష్టి పెడుతోంది. మరోవైపు, మనం మన కొత్త తరాన్ని, మన పాఠశాల విద్యార్థులను, మన విద్యార్థులను,  ఇంట్లోని మన పిల్లలను డిజిటల్ ప్రపంచ ప్రతికూల ప్రభావాల నుంచి కూడా రక్షించుకోవాలి. దీనితోపాటు వారి ఆరోగ్యం, ఉత్పాదక సామర్ధ్యంపై దృష్టి పెట్టడం కూడా మనందరి సమష్టి బాధ్యత. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు, ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన ఒక చట్టాన్ని ఆమోదించడం గురించి మీకు తెలుసు. ఉపాధ్యాయులు దీని గురించి తెలుసుకోవాలి. ఇది గేమింగ్,  జూదం గురించి. దురదృష్టవశాత్తు, ఆటగా మొదలయ్యేది తరచుగా జూదంగా మారుతోంది. అందుకే ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే చట్టం రాకూడదని కోరుకునే బలమైన శక్తులు ఉన్నాయి. కానీ నేడు మన దేశానికి, తన పిల్లల ఉజ్వల భవిష్యత్తుపై శ్రద్ధ వహించే రాజకీయ సంకల్పం ఉన్న ప్రభుత్వం ఉంది. అందుకే, ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా, విమర్శల గురించి పట్టించుకోకుండా, ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి ఒక చట్టాన్ని మేం తీసుకు వచ్చాం. మన విద్యార్థులను ప్రభావితం చేస్తున్న అలాంటి ఆన్‌లైన్ గేమ్‌లు చాలా ఉన్నాయి. ఇది డబ్బుతో  ముడిపడి ఉంది. మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ప్రజలు ఇందులో పెట్టుబడి పెడుతున్నారు. కుటుంబాలలో మహిళలతో సహా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పగటిపూట కుటుంబ సభ్యులు పనికి వెళ్ళిన తర్వాత ఈ ఆటలు ఆడుతున్నట్లు నాకు కొన్ని నివేదికలు అందాయి. అలాగే కొన్ని ఆత్మహత్య కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజలు అప్పుల పాలయ్యారు. కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయి. ఒక వ్యసనంలా, ఈ సమస్య మాదకద్రవ్యాల సమస్యను  మించిపోయింది. ఈ ఆటలు ఆకర్షణీయమైన కంటెంట్‌తో మిమ్మల్ని ఉచ్చులోకి లాగుతాయి. ఎవరైనా సులభంగా చిక్కుకుపోవచ్చు. ఇది కుటుంబాలకు ఆందోళన కలిగించే అంశం. అందుకే నేను చెబుతున్నా. చట్టం తెచ్చినప్పటికీ, పిల్లల్లో అవగాహన కల్పించడం ముఖ్యం. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు.. కానీ ఇంట్లో అది ఉద్రిక్తతకు దారితీసే వాతావరణాన్ని సృష్టిస్తుంది కాబట్టి వారు పరిస్థితిని మార్చలేరు. అయితే ఉపాధ్యాయులు మాత్రం ఈ విషయంలో చాలా పెద్ద పాత్ర పోషించగలరు. మేం చట్టాన్ని ఆమోదించాం. ఇంకా మొదటిసారిగా, అలాంటి హానికరమైన కంటెంట్ పిల్లలకు చేరకుండా చూసుకున్నాం. మీ ఉపాధ్యాయులు అందరూ దీని గురించి మీ విద్యార్థులలో అవగాహన పెంచాలని నేను కోరుతున్నా. కానీ ఇక్కడ రెండు అంశాలు: గేమింగ్ స్వతహాగా చెడ్డది కాదు. జూదం చెడ్డది. డబ్బు ప్రమేయం లేనప్పుడు, అది వేరే విషయం. మీకు తెలుసు. ఒలింపిక్స్ కూడా కొన్ని రకాల గేమింగ్‌లను ఒక క్రీడగా గుర్తించాయి. అది ప్రతిభను, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, రాణించిన వారికి శిక్షణ ఇవ్వడం గురించి. అది పూర్తిగా వేరే  విషయం. కానీ అది వ్యసనంగా మారినప్పుడు, పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నపుడు, అది దేశానికి తీవ్రమైన ఆందోళన కలిగించే పరిస్థితి.

మిత్రులారా,

మన యువత గేమింగ్ రంగంలో ప్రపంచ స్థాయిలో తమ ఉనికిని విస్తరించుకునేందుకు మా ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోంది. భారత్ లో కూడా, సృజనాత్మక కార్యకలాపాల్లో నిమగ్నమైన వారు మన కథలు, ఇతివృత్తాలు, సంప్రదాయాల ద్వారా కొత్త గేమ్‌లను ఎంతో అభివృద్ధి చేయవచ్చు. మనం అంతర్జాతీయ గేమింగ్ మార్కెట్‌ను ఆకర్షించవచ్చు. భారతదేశంలో కూడా చాలా ప్రాచీన ఆటలు, గొప్ప సాంస్కృతిక ఇతివృత్తాలు ఉన్నాయి. అవి ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తాయి. నిజానికి, వాటిలో కొన్ని ఇప్పటికే అలా చేస్తున్నాయి, ఇంకా మనం చాలా ఎక్కువ సాధించగలం. ఈ రంగంలో అనేక అంకుర సంస్థలు అసాధారణమైన కృషి చేస్తున్నాయి. పాఠశాలలు,  కళాశాలలు కూడా విద్యార్థులకు ఈ అవకాశాల గురించి సమాచారాన్ని అందిస్తే, అది వారికి మంచి కెరీర్ అవకాశాలను అందించగలదని నాకు నమ్మకం ఉంది.

మిత్రులారా,

మీలో చాలామంది అడిగిన ఒక అంశాన్ని నేను ఎర్రకోట నుంచి ప్రస్తావించాను. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత (వోకల్ ఫర్ లోకల్) ఇవ్వాలని, స్వదేశీ ఉత్పత్తులను స్వీకరించాలని నేను బలంగా పిలుపునిచ్చాను. స్వదేశీ అంటే మన దేశంలో ఉత్పత్తి అయినవి. ఇక్కడే తయారైనవి. మన దేశప్రజల శ్రమతో కూడినవి. మన మట్టి సువాసన కలిగిన వస్తువులు. అదే నాకు స్వదేశీ. దాని గురించి మనం గర్వపడాలి. మనం "హర్ ఘర్ తిరంగా" అని అంటున్నట్లే, "హర్ ఘర్ స్వదేశీ"  అని కూడా ప్రతి ఇంట్లోనూ ఒక బోర్డు పెట్టమని పిల్లలకు చెప్పాలి. ప్రతి దుకాణదారుడు కూడా గర్వంగా, 'ఇది స్వదేశీ' అని చెప్పే ఒక బోర్డును పెట్టాలి. 'ఇది నా దేశానికి చెందింది, ఇది నా దేశంలో తయారైంది' అని చెప్పడంలో మనం గర్వపడాలి. మనం అలాంటి వాతావరణాన్ని సృష్టించాలి. 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారంలో ఉపాధ్యాయులు చాలా పెద్ద పాత్ర పోషించగలరు. 

పాఠశాలల్లో ప్రాజెక్టులు, కార్యకలాపాల ద్వారా "మేక్ ఇన్ ఇండియా" ఉత్పత్తులను గుర్తించడం పిల్లలకు నేర్పవచ్చు. మీరు దీన్ని సరదాగా నేర్పవచ్చు. ఉదాహరణకు, ఒక అసైన్‌మెంట్‌గా, పిల్లల చేత వారి ఇంట్లో ఎన్ని వస్తువులు స్వదేశీవో ఒక జాబితాను తయారు చేయవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, వారు దాన్ని మరుసటి రోజు తరగతిలో సమర్పించవచ్చు. ఆ తర్వాత కుటుంబాలు ఈ నెలలో స్వదేశీ కాని వస్తువులను ఇంతవరకు తగ్గిస్తాం... వచ్చే నెలలో అంతవరకు తగ్గిస్తాం అని నిర్ణయించుకోవచ్చు. అలా క్రమంగా, మొత్తం కుటుంబం స్వదేశీ వస్తువుల వైపు మళ్లుతుంది. ఒక పాఠశాలలో పది తరగతులు ఉంటే, ఒక్కో తరగతి  విద్యార్థులు వంతుల వారీగా గ్రామంలో ఉదయం పూట స్వదేశీని ప్రోత్సహిస్తూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించవచ్చని కూడా నేను సూచిస్తాను. ఒకరోజు 1వ తరగతి, మరుసటి రోజు 2వ తరగతి, మూడో రోజు 3వ తరగతి, ఇలా వంతుల వారీగా చేయవచ్చు. ఈ విధంగా, స్వదేశీ, స్వదేశీ, స్వదేశీ అనే వాతావరణం గ్రామంలో నిరంతరం సజీవంగా ఉంటుంది. ఇది దేశ ఆర్థిక శక్తిని చాలా బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రతి వ్యక్తి కొద్దిగా సహకరించినా, మనం ఊహించిన కల, అంటే 2047 నాటికి దేశాన్ని 'వికసిత భారత్' గా మార్చడం సాధ్యమవుతుంది. మరి చెప్పండి, దేశం అభివృద్ధి చెందాలని ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ దాని కోసం, మనం ఎక్కడో ఒక చోట ప్రారంభించాలి. ఆ దిశగా మనం కృషి చేయాలి.

మిత్రులారా,

పాఠశాలల్లో మనం వివిధ రకాల పండుగలు, కార్యక్రమాలను నిర్వహించుకుంటాం. ఈ వేడుకల్లోకి మనం స్వదేశీ సందేశాన్ని కూడా తీసుకురావచ్చు. భారతీయ ఉత్పత్తులను అలంకరణకు ఎలా ఉపయోగించవచ్చో, లేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తరగతులలో స్వదేశీ వస్తువులను ఎలా వాడవచ్చో మనం చూడాలి. ఇటువంటి పద్ధతులు చిన్నతనం నుంచే పిల్లలలో స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించే వాతావరణాన్ని సృష్టిస్తాయి.

మిత్రులారా,

పాఠశాలల్లో మనం ఎన్నో ప్రత్యేక దినోత్సవాలను నిర్వహించుకుంటాం. అలాంటప్పుడు, ఒక "స్వదేశీ దినోత్సవం", "స్వదేశీ వారం" లేదా "స్థానిక ఉత్పత్తుల దినోత్సవం" ఎందుకు జరుపుకోకూడదు? మీలాంటి ఉపాధ్యాయులు దీనిని ఒక ఉద్యమంలా నడిపిస్తే మీరు సమాజానికి కొత్త గుర్తింపు, దిశను అందించగలరు. పిల్లలు తమ ఇళ్ల నుంచి ఒక స్థానిక వస్తువును తీసుకొచ్చి, దాని కథను, అది ఎక్కడ తయారైంది, ఎవరు తయారు చేశారు, దేశానికి దాని ప్రాముఖ్యత ఏమిటో పంచుకునే వాతావరణాన్ని సృష్టించవచ్చు. స్థానిక తయారీదారులను, చేతివృత్తుల వారిని, తరతరాలుగా హస్తకళలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను కూడా పిల్లలు కలవవచ్చు. పాఠశాలలు అలాంటి వారిని విద్యార్థులతో మాట్లాడటానికీ, అనుభవాలను పంచుకోవడానికి ఆహ్వానించవచ్చు. పుట్టినరోజు వేడుకల సందర్భాలలో బహుమతులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కూడా పిల్లలు'మేడ్ ఇన్ ఇండియా వస్తువులను ఇస్తూ, గర్వంగా “చూడు, ఇది మేడ్ ఇన్ ఇండియా, నేను ప్రత్యేకంగా నీ కోసం తీసుకువచ్చాను'”అని చెప్పేలా ప్రోత్సహించవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే, మనం 'మేడ్ ఇన్ ఇండియా'ను మన జీవితాలకు ఆధారంగా చేసుకోవాలి. దీనిని మనం మన బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలి. అలా చేయడం ద్వారా, దేశభక్తి, ఆత్మవిశ్వాసం, శ్రమ గౌరవం వంటి విలువలు సహజంగానే మన సామాజిక జీవితంలో ఒక భాగంగా మారతాయి. ఇది మన యువతను తమ వ్యక్తిగత విజయాన్ని దేశ ప్రగతితో అనుసంధానం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. 'వికసిత భారత్' సాధనకు ఇది అతి గొప్ప సూత్రం అని నా నమ్మకం. మీరందరూ, ఉపాధ్యాయులుగా, ఈ గొప్ప దేశ నిర్మాణ ఉద్యమంలో కర్తవ్యంలో భాగమవుతారని నేను నమ్ముతున్నాను. ఇంకా మీరు మన దేశాన్ని మరింత బలోపేతం చేసే ఈ బాధ్యతను భుజాలపై వేసుకున్నప్పుడు, మనం ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా సాధిస్తాం. ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం అందుకున్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా ఈ రోజు, మీరు సాధారణంగా చేసే పనిని నేను చేశాను. అది నేను మీకు హోంవర్క్ ఇచ్చాను! మీరు దాన్ని పూర్తి చేస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. చాలా ధన్యవాదాలు! 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IRCTC disables 3cr user IDs, flags 6cr; scales up AI-based kitchen monitoring

Media Coverage

IRCTC disables 3cr user IDs, flags 6cr; scales up AI-based kitchen monitoring
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds designation of Jai Prakash Narayan Bird Sanctuary as India's 100th Ramsar site
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today expressed great happiness over India achieving a century of Ramsar sites, following the designation of the Jai Prakash Narayan Bird Sanctuary (Surha Tal) in Ballia, Uttar Pradesh, as the nation's 100th Ramsar site.

The Prime Minister noted that this wetland is exceptionally rich in avifaunal biodiversity, attracting numerous migratory and resident birds.
Shri Modi emphasized that this remarkable milestone clearly reflects India’s unwavering commitment to protecting its natural surroundings, particularly its vital wetlands.

The Prime Minister observed that over the years, efforts to conserve and rejuvenate wetlands have been significantly strengthened through greater community participation, science, innovation, and active awareness initiatives. He affirmed that these collective endeavours are instrumental in preserving biodiversity, securing ecological balance, and creating a greener future for coming generations.

The Prime Minister posted on X:

"A century as far as Ramsar sites are concerned!

Glad that the Jai Prakash Narayan Bird Sanctuary (Surha Tal) in Ballia, Uttar Pradesh has been designated as India’s 100th Ramsar site. This wetland is rich in avifaunal biodiversity, attracting several migratory and resident birds.

India’s unwavering commitment to protecting our natural surroundings and wetlands in particular is clearly reflected in this feat.

Over the years, efforts to conserve and rejuvenate wetlands have been strengthened through greater community participation, science, innovation and awareness initiatives. These endeavours are helping preserve biodiversity, secure ecological balance and create a greener future for coming generations."