రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధాని
నేడు ఉత్తరాఖండ్ అధిరోహించిన పురోగతి శిఖరాలను చూస్తుంటే
అప్పట్లో ఈ అందమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు పోరాడిన ప్రతి వ్యక్తీ సంతోషించడం ఖాయం: ప్రధాని
ఇది నిజంగా ఉత్తరాఖండ్ ఉన్నతి, పురోగతిని నిర్వచించే యుగం: ప్రధాని
దేవభూమి ఉత్తరాఖండ్ భారతదేశ ఆధ్యాత్మిక జీవనానికి గుండె చప్పుడు: ప్రధాని

దేవభూమి ఉత్తరాఖండ్‌లోని పెద్దలు, మిత్రులు, సోదరీసోదరులందరికీ అభివందనాలు...

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూ, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టా, రాష్ట్ర మంత్రులు, వేదికను అలంకరించిన ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

మిత్రులారా!

ఈ రోజు... అంటే- నవంబరు 9వ తేదీ ఒక సుదీర్ఘ తపో ఫలితం... మనందరి హృదయాలు గర్వంతో ఉప్పొంగేలా చేసే దినమిది. ఉత్తరాఖండ్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ చాలాకాలం పాటు కన్న కలలు 25 ఏళ్ల కిందట శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో సాకారమైన క్షణమిది. నాటినుంచీ సాగిన ప్రగతి పయనంలో పాతికేళ్ల తర్వాత రాష్ట్రం ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించడం చూసి, ఈ సుందర రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన ప్రతి వ్యక్తిలో ఆనందోత్సాహాలు పెల్లుబకడం సహజం. సమున్నత పర్వతాలు.. సంస్కృతి, ప్రకృతి సౌందర్యంతో అలరారే దేవభూమి ఉత్తరాఖండ్. ఇక్కడి ప్రజానీకం మనసులలో నిండిన ఉల్లాసం, ఉత్సాహం  ఇప్పుడు నా కళ్లకు కడుతున్నాయి.

 

మిత్రులారా!

ఉత్తరాఖండ్ సామర్థ్యాన్ని సమున్నత స్థాయికి చేర్చడంలో ఈ రెండు ఇంజిన్ల బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అవిరళ కృషి నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ రజతోత్సవం నిర్వహించుకుంటున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిన అమరులకు నివాళి అర్పిస్తూ, అందులో పాలుపంచుకున్న వారందరికీ నమస్కారం చేస్తున్నాను.

మిత్రులారా!

ఈ రాష్ట్రంతో నా బంధం ఎంత గాఢమైనదో మీకందరికీ తెలుసు. నా ఆధ్యాత్మిక పయనంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ... ఈ పర్వత సానువులలో నివసించే నా సోదరీసోదరుల పోరాటం, కృషి, పట్టుదల సహా ప్రతి కష్టాన్నీ అధిగమించాలనే వారి దృఢ సంకల్పం సదా నాకెంతో స్ఫూర్తినిచ్చాయి.

మిత్రులారా!

నేనిక్కడ గడిపిన రోజుల్లో ఉత్తరాఖండ్ అపార సామర్థ్యం నాకు ప్రత్యక్షంగా తెలిసివచ్చింది. అందుకే, ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌కు చెందినదని కేదారనాథుని దర్శనం తర్వాత నేను చెప్పాను. అయితే, అది కేవలం ఓ ప్రకటన కాదు... నాతో అలా చెప్పించింది మీ అందరిపై నాలోని సంపూర్ణ విశ్వాసమే. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఆవిర్భవించి నేడు 25 ఏళ్లు పూర్తయినందున ఈ కాలం నిజంగా రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక, ఉజ్వల శకం అనే విశ్వాసం నాలో మరింత బలపడింది.

మిత్రులారా!

ఉత్తరాఖండ్‌ అవతరణ సమయాన రాష్ట్ర వనరులు పరిమితం కాగా, సవాళ్లు అపారం. ఆదాయ వనరులు స్వల్పం కావడం వల్ల వార్షిక బడ్జెట్ కూడా తక్కువగా ఉండేది. అనేక అవసరాలను కేంద్ర ప్రభుత్వమే తీర్చాల్సి వచ్చింది. అయితే, ఇవాళ ఆ పరిస్థితి ఆమూలాగ్రం మారిపోయింది. ఈ వేదికపైకి వచ్చేముందు, ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అద్భుత ప్రదర్శనను నేను తిలకించాను. ఈ ప్రదర్శనను మీరంతా... ఉత్తరాఖండ్ పౌరులందరూ కూడా సందర్శించాలని నా మనవి. గడచిన 25 ఏళ్లలో ఉత్తరాఖండ్‌ ప్రగతి పయనాన్ని ఈ ప్రదర్శన సంగ్రహంగా మన కళ్లముందు ఉంచుతుంది. మౌలిక సదుపాయాలు, విద్య, పరిశ్రమలు, పర్యాటకం, ఆరోగ్యం, విద్యుత్, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విజయానికి సంబంధించిన స్ఫూర్తిదాయక గాథలు నిజంగా ప్రశంసనీయం. ఉత్తరాఖండ్‌ బడ్జెట్‌ 25 ఏళ్ల కిందట కేవలం రూ.4,000 కోట్లు మాత్రమే. ఇప్పటి పాతికేళ్ల యువతరానికి ఆ రోజులు ఎలాంటివో ఎంతమాత్రం తెలియదు. అలాంటి స్థితి నుంచి నేడు రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.లక్ష కోట్లు దాటింది. ఈ 25 ఏళ్లలో విద్యుదుత్పాదన 4 రెట్లు, రహదారుల పొడవు 2 రెట్లు పెరిగాయి. ఇంతకుముందు 6 నెలల్లో 4,000 మంది మాత్రమే విమానాల్లో ఇక్కడికి వచ్చేవారు... కానీ, ఇవాళ రోజుకు 4,000 మందికిపైగా వస్తున్నారు.

మిత్రులారా!

ఈ పాతికేళ్లలో ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య 10 రెట్లు పెరిగింది. లోగడ రాష్ట్రంలో ఒకేఒక వైద్య కళాశాల ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 10కి చేరింది. అలాగే 25 ఏళ్ల కిందట టీకాల కార్యక్రమంలో 25 శాతం కూడా ప్రజలకు చేరువ కాలేదు. అంటే- 75 శాతానికిపైగా ప్రజలకు టీకా అన్నదే తెలియదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు ప్రతి గ్రామానికి పూర్తిస్థాయిలో టీకాల కార్యక్రమం విస్తరించింది. అంటే- మానవ జీవనంలోని ప్రతి అంశంలో ఉత్తరాఖండ్‌ గణనీయ ప్రగతి సాధించిందని అర్థం. ఈ పురోగమనం అసాధారణం... ఇది సమ్మిళిత విధానాలతోపాటు ప్రతి పౌరుడి దృఢ సంకల్పం ఫలితం. ఒకనాడు ఏటవాలు పర్వత సానువులు ప్రగతి మార్గానికి అవరోధాలనే భావన ఉండేది. కానీ, ఇప్పుడు అవే అభివృద్ధికి కొత్త బాటలు వేస్తున్నాయి.

 

మిత్రులారా!

ఇంతకుముందే నేను ఉత్తరాఖండ్ యువతరంతో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముచ్చటించాను. రాష్ట్రం సాధించిన వృద్ధిపై వారందరూ ఆనందోత్సాహాలు ప్రదర్శించారు. నేను కొన్ని తప్పులు చేయవచ్చుగాక... అయిన్పటికీ 2047కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచినపుడు నా ఉత్తరాఖండ్.. నా దేవభూమి.. అందుకు పూర్తి సన్నద్ధతతో ఉంటుందన్న రాష్ట్ర ప్రజల మనోభావాన్ని గఢ్వాలీలో నేను ప్రకటించాలని భావిస్తున్నాను.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ పురోగమనాన్ని మరింత వేగవంతం చేయడానికి వీలుగా అనేక కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. విద్య, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడా తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. జమ్రానీ, సాంగ్ నీటిపారుదల ప్రాజెక్టులు డెహ్రాడూన్, హల్ద్వానీ ప్రాంతాల తాగునీటి సమస్య పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ పథకాలను రూ.8,000 కోట్లకు పైగా వ్యయంతో పూర్తిచేస్తారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి రానుండటంపై రాష్ట్ర ప్రజలకు నా అభినందనలు.

మిత్రులారా!

ఆపిల్, కివి సాగుచేసే రైతులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ రూపంలో రాయితీల బదిలీని ప్రారంభించింది. తద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసలైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సహాయం చేరేలా పారదర్శక పర్యవేక్షణ ఇకపై సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ‘ఆర్‌బీఐ’ సహా ఇతర భాగస్వామ్య సంస్థలకు అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం భారత ఆధ్యాత్మిక జీవనాడి. ‘గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్, జగేశ్వర్‌, ఆది కైలాస్‌’ వంటివి మన భక్తివిశ్వాసాలకు ప్రతీకలైన పవిత్ర తీర్థయాత్రా ప్రదేశాలు. ఏటా లక్షలాదిగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాలకు యాత్రగా వస్తుంటారు. ఇవి భక్తి మార్గానికి బాటలు వేయడమేగాక ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థలో నవ్యోత్తేజం నింపుతాయి.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ అభివృద్ధి మెరుగైన అనుసంధాన సదుపాయాలతో ఎంతగానో ముడిపడి ఉంది. ఈ దిశగా రాష్ట్రంలో ప్రస్తుతం రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయి. రిషీకేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గం పనులు సాగుతుండగా, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌ వే దాదాపు పూర్తికావస్తోంది. అలాగే,  గౌరీకుండ్-కేదార్‌నాథ్, గోవింద్‌ఘాట్-హేమకుండ్ సాహిబ్ రోప్‌వే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్‌లో ప్రగతి మరింత వేగం పుంజుకుంటుంది.

 

మిత్రులారా!

గడచిన పాతికేళ్లలో ఉత్తరాఖండ్ సుదీర్ఘ ప్రగతి ప్రయాణం చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే 25 ఏళ్లలో ఎంత ఎత్తులో ఉండాలో ఎలా అంచనా వేయాలన్నదే మన ముందున్న ప్రశ్న. “మనసుంటే మార్గం ఉంటుంది” అనే నానుడిని మీరంతా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. కాబట్టి, మన లక్ష్యాలేమిటో మొదట గ్రహిస్తే, వాటిని సాధించే ప్రణాళిక సత్వరం రూపొందించగలం. మరి, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆలోచించడానికి నవంబరు 9ని మించిన మంచి రోజు మరొకటి ఉంటుందా?

మిత్రులారా, 

ఉత్తరాఖండ్ నిజమైన గుర్తింపు దాని ఆధ్యాత్మిక బలంలోనే ఉంది. ఉత్తరాఖండ్ గనుక సంకల్పిస్తే, కేవలం కొన్ని సంవత్సరాలలోనే అది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఆవిర్భవించగలదు. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన, యోగా కేంద్రాలను ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయవచ్చు.

మిత్రులారా, 

దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల మూలల నుంచి ప్రజలు ఇక్కడికి ఆరోగ్యం కోసం వస్తారు. ఉత్తరాఖండ్ లోని మూలికలకు, ఆయుర్వేద ఔషధాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత 25 సంవత్సరాలలో, సుగంధ మొక్కలు, ఆయుర్వేద మూలికలు, యోగా,  ఆరోగ్య సంరక్షణ పర్యాటకంలో ఉత్తరాఖండ్ అద్భుతమైన పురోగతి సాధించింది. ఉత్తరాఖండ్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ యోగా కేంద్రాలు, ఆయుర్వేద కేంద్రాలు, ప్రకృతి చికిత్సా సంస్థలు,  హోమ్‌స్టేలతో ఒక సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇది మన అంతర్జాతీయ పర్యాటకులకు ప్రత్యేక  ఆకర్షణగా ఉంటుంది.

మిత్రులారా, 

భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో మీ అందరికీ తెలుసు. ఉత్తరాఖండ్‌లోని అభివృద్ధి చెందిన ప్రతి గ్రామం కూడా స్వయంగా ఒక చిన్న పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా. అక్కడ హోమ్‌స్టేలు ఉండాలి. అక్కడ స్థానిక వంటకాలు,  స్థానిక సంస్కృతిని ప్రోత్సహించాలి. ఇతర ప్రాంతాల నుంచి, లేదా విదేశాల నుంచి వచ్చే సందర్శకులు వెచ్చని, ఇంటిలాంటి వాతావరణాన్ని అనుభూతి చెంది, డబ్కే, చుడ్కానీ, రోట్-ఆర్సా, రాస్-భాత్, ఝంగోరే కీ ఖీర్ వంటి సాంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తే ఎంత సంతోషిస్తారో ఒక్కసారి ఊహించుకోండి! ఆ ఆనందం వారిని ఉత్తరాఖండ్‌కు ఒక్కసారి కాదు, పదేపదే తిరిగి వచ్చేలా చేస్తుంది.

మిత్రులారా, 

ఉత్తరాఖండ్ లో మరుగునపడి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడంపై ఇప్పుడు మనం దృష్టి పెట్టాలి. హరేలా, ఫూల్దేయి, భితౌలి వంటి స్థానిక పండుగలలో పాల్గొనే పర్యాటకులు ఆ అనుభవాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇక్కడి జాతరలు కూడా అంతే ఉత్సాహంగా ఉంటాయి. నందా దేవి మేళా, జౌల్జివి మేళా, బాగేశ్వర్ ఉత్తరాయణి మేళా, దేవీధురా మేళా, శ్రావణి మేళా, బటర్ ఫెస్టివల్ ఉత్తరాఖండ్ ప్రత్యేకతను చెబుతాయి. ఈ స్థానిక జాతరలు, పండుగలను ప్రపంచ పటంలో ప్రదర్శించడానికి మనం "ఒక జిల్లా, ఒక పండుగ"  వంటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు.

 

మిత్రులారా, 

ఉత్తరాఖండ్‌లోని అన్ని పర్వత ప్రాంత జిల్లాలు పండ్ల సాగుకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మనం ఈ కొండ జిల్లాలను ఉద్యాన పంటల  కేంద్రాలుగా మార్చడంపై దృష్టి పెట్టాలి. బ్లూబెర్రీలు, కివి, మూలికలు, ఔషధ మొక్కలు వంటి పంటలు భవిష్యత్ వ్యవసాయంలో ప్రాముఖ్యం వహిస్తాయి. ఆహార శుద్ధి, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తుల వంటి రంగాలను అభివృద్ధి చేయడానికి ఉత్తరాఖండ్ తన ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలి.

మిత్రులారా, 

ఉత్తరాఖండ్‌కు సంవత్సరం పొడవునా పర్యాటకానికి అపారమైన సామర్థ్యం ఉంది. ఇప్పుడు కనెక్టివిటీ మెరుగుపడుతున్నందున, మనం అన్ని సీజన్ల పర్యాటకం వైపు అడుగులు వేయాలని నేను గతంలో సూచించాను. శీతాకాల పర్యాటకానికి ఉత్తరాఖండ్ ఒక కొత్త అవకాశాల్ని అందిస్తున్నందుకు సంతోషం. నాకు లభించిన తాజా గణాంకాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. శీతాకాల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పిథోర్‌ఘర్‌లో, 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హై-ఆల్టిట్యూడ్ మారథాన్ ను నిర్వహించడం విశేషం. ఆది కైలాస్ పరిక్రమ రన్ కూడా దేశం మొత్తానికి స్ఫూర్తిగా మారింది. మూడు సంవత్సరాల కిందట, 2,000 మంది భక్తులు కైలాస్ యాత్ర చేసేవారు. ఈ రోజు, ఆ సంఖ్య 30,000 దాటింది. ఈ సంవత్సరం 17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కొద్ది రోజుల కిందట కేదార్ నాథ్ ఆలయాన్ని మూసివేశారు. యాత్రా స్థలాలు, ఏడాది పొడవునా కొనసాగే పర్యాటక కార్యకలాపాలే ఉత్తరాఖండ్‌ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాయి. ఇక్కడ పర్యావరణ, సాహస టూరిజం రంగాల్లో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ దేశం లోని మొత్తం యువతను ఆకర్షించే ప్రధాన గమ్యస్థానంగా మారగలదు.

మిత్రులారా, 

ఉత్తరాఖండ్ నిర్మాణ కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర కొత్త చలనచిత్ర విధానం షూటింగ్‌లను మరింత సులభతరం చేసింది. అలాగే, ఉత్తరాఖండ్ వివాహ గమ్యస్థానంగా కూడా ప్రాచుర్యం పొందుతోంది. మీకు తెలిసినట్లుగా, నేను "భారతదేశంలో వివాహం చేసుకోండి" అనే ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నాను. వెడ్ ఇన్ ఇండియా కోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వివాహ సౌకర్యాలను అభివృద్ధి చేయాలి. దీనిని సాధించడానికి, 5 నుండి 7 ప్రధాన ప్రదేశాలను గుర్తించి, వాటిని ప్రముఖ వివాహ వేదికలుగా అభివృద్ధి చేయాలి.

మిత్రులారా, 

దేశం ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వావలంబన భారత్ దిశగా వెళుతున్నది. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ద్వారానే ఈ లక్ష్యాన్ని చేరడం సాధ్యమవుతుంది. ఉత్తరాఖండ్ ఎల్లప్పుడూ ఈ దృష్టితోనే ఉంది. స్థానిక ఉత్పత్తుల పట్ల ప్రేమ, వాటి వినియోగం, వాటిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ఈ రాష్ట్ర సంప్రదాయాలలో విడదీయరాని భాగం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారాన్ని వేగవంతం చేయడం సంతోషంగా ఉంది. ఈ కృషి ఫలితంగా, ఉత్తరాఖండ్ నుంచి  15 వ్యవసాయ ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపును పొందాయి. బేడు పండు, బద్రీ ఆవు నెయ్యి ఇటీవల జీఐ గుర్తింపు పొందడం గొప్ప గర్వకారణం. బద్రీ ఆవు నెయ్యి ప్రతి పర్వత ప్రాంత గృహానికి గర్వకారణం. ఇప్పుడు, బేడు పండు పర్వత ప్రాంత గ్రామాల నుంచి రాష్ట్రం వెలుపలి మార్కెట్లకు చేరుతోంది. దాని నుంచి  తయారుచేసిన ఉత్పత్తులు జీఐ  ట్యాగ్‌ను కలిగి ఉంటాయి. ఈ ఉత్పత్తులు ఎక్కడికి వెళ్లినా, అవి తమతో పాటు ఉత్తరాఖండ్  గుర్తింపును కూడా తీసుకువెళ్తాయి. మనం ఇలాంటి జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు దేశంలోని ప్రతి ఇంటికి చేరేలా చూడాలి.

 

మిత్రులారా, 

"హౌస్ ఆఫ్ హిమాలయాస్" ఉత్తరాఖండ్‌కు ఒక బలమైన బ్రాండ్‌గా మారడం సంతోషంగా ఉంది. ఇది స్థానిక గుర్తింపులన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఈ బ్రాండ్ కింద, రాష్ట్రంలోని విభిన్న ఉత్పత్తులకు ఒక ఏకీకృత గుర్తింపు ఇచ్చారు. తద్వారా అవి ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడగలవు. రాష్ట్రంలోని అనేక ఉత్పత్తులు ఇప్పుడు డిజిటల్ వేదికలపై కూడా అందుబాటులో ఉన్నాయి. తద్వారా అవి వినియోగదారులకు నేరుగా అందుతాయి. రైతులు, కళాకారులు, చిన్న పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటున్నాయి. మనం ఇప్పుడు "హౌస్ ఆఫ్ హిమాలయాస్" బ్రాండింగ్‌లో కొత్త శక్తిని నింపాలి. దాని డెలివరీ విధానాలను కూడా మెరుగుపరుస్తూ ముందుకు సాగాలి. 

మిత్రులారా, 

ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రయాణం సంవత్సరాలుగా అనేక సవాళ్లను ఎదుర్కొందని మీకు తెలుసు. కానీ బలమైన బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ అడ్డంకులను అధిగమించి, పురోగతి వేగం ఎప్పుడూ తగ్గకుండా చూసింది. ఉత్తరాఖండ్ లోని ధామి ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని చిత్తశుద్ధితో అమలు చేసి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. మత మార్పిడి వ్యతిరేక చట్టం, అల్లర్ల నియంత్రణ చట్టం వంటి జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు తీసుకుంది. భూకబ్జా నిరోధం, జనాభా మార్పులు వంటి సున్నితమైన అంశాలపై బీజేపీ ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకుంది. విపత్తు నిర్వహణ రంగంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం త్వరగా, సున్నితంగా స్పందించి తన ప్రజలకు సహాయం చేయడానికి సాధ్యమయ్యే ప్రతి చర్యా తీసుకుంది. 

 

మిత్రులారా, 

ఉత్తరాఖండ్ రజతోత్సవ సందర్భంలో, రాబోయే సంవత్సరాలలో, మన ఉత్తరాఖండ్ తన గొప్ప సంస్కృతిని, ప్రత్యేక గుర్తింపును గొప్పగా ముందుకు తీసుకువెళుతూ, కొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ రజతోత్సవ వేడుక సందర్భంగా ఉత్తరాఖండ్‌ ప్రజలందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. మన దేశ స్వాతంత్ర్యం 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే మరో 25 సంవత్సరాల నాటికి  ముందు చూపుతో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా.  మనం ఈరోజే సరైన మార్గాన్ని ఎంచుకుని, ఆలస్యం చేయకుండా ముందుకు సాగాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రతి అడుగులోనూ అండగా నిలబడటానికి భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని నేను మీకు హామీ ఇస్తున్నా. ఉత్తరాఖండ్‌లోని ప్రతి కుటుంబానికి,  ప్రతి పౌరుడికి సంతోషం, శ్రేయస్సు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ ధన్యవాదాలు.

 

మిత్రులారా, 

ఉత్తరాఖండ్ రజతోత్సవ సందర్భంలో, రాబోయే సంవత్సరాలలో, మన ఉత్తరాఖండ్ తన గొప్ప సంస్కృతిని, ప్రత్యేక గుర్తింపును గొప్పగా ముందుకు తీసుకువెళుతూ, కొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ రజతోత్సవ వేడుక సందర్భంగా ఉత్తరాఖండ్‌ ప్రజలందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. మన దేశ స్వాతంత్ర్యం 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే మరో 25 సంవత్సరాల నాటికి  ముందు చూపుతో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా.  మనం ఈరోజే సరైన మార్గాన్ని ఎంచుకుని, ఆలస్యం చేయకుండా ముందుకు సాగాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రతి అడుగులోనూ అండగా నిలబడటానికి భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని నేను మీకు హామీ ఇస్తున్నా. ఉత్తరాఖండ్‌లోని ప్రతి కుటుంబానికి,  ప్రతి పౌరుడికి సంతోషం, శ్రేయస్సు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ ధన్యవాదాలు.

భారత మాతా కీ జై!

భారత మాతా కీ జై!

ఈ సంవత్సరం "వందేమాతరం" 150వ వార్షికోత్సవం. కాబట్టి, మనమంతా కలిసి చెబుదాం -

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh

Media Coverage

Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
UK Foreign Secretary meets Prime Minister
June 04, 2026

UK Foreign Secretary Yvette Cooper today met Prime Minister Shri Narendra Modi.

The Prime Minister expressed his pleasure upon the meeting and appreciated the deepening of the India-UK partnership in recent times which has unlocked unprecedented growth opportunities for both countries.

The Prime Minister affirmed that the India-UK Vision 2035 will continue to guide the partnership and strengthen joint efforts for the global good.

The Prime Minister posted on X:

"Pleased to meet UK Foreign Secretary Yvette Cooper. Appreciated the deepening of the India-UK partnership in recent times that has unlocked unprecedented growth opportunities for both our countries.

India-UK Vision 2035 will continue to guide our partnership and strengthen our joint efforts for global good.@YvetteCooperMP"