
త్రివర్ణ పతాకాన్ని అందరూ సగర్వంగా ఎగరేస్తూనే ఉండండి..
భారత్ మాతా కీ జై,
భారత్ మాతా కీ జై,
భారత్ మాతా కీ జై,
భారత్ మాతా కీ జై.
గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, గుజరాత్ మంత్రివర్గంలోని నా సహచరులందరూ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర విశిష్ట ప్రముఖులు, దాహోద్ లోని నా ప్రియమైన సోదరులు, సోదరీమణులారా!
అందరూ ఎలా ఉన్నారు? దయచేసి బిగ్గరగా స్పందించండి-దాహోద్ ప్రభావం ఇప్పుడు పెరిగింది!
ఈ రోజు మే 26వ తేదీ. 2014లో ఇదే రోజున నేను మొదటిసారిగా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ సగర్వంగా ఎగరాలని నేను కోరుకుంటున్నా. గుజరాత్ ప్రజలు నన్ను మనసారా ఆశీర్వదించారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరులు నన్ను ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదాలతో అధికారాన్ని పొందిన నేను నా తోటి దేశప్రజలకు రేయింబవళ్ళూ సేవ చేయడానికి నన్ను నేను అంకితం చేసుకున్నాను.
కొన్నేళ్లుగా ఒకప్పుడు ఊహించలేని, అపూర్వమైనవిగా భావించిన నిర్ణయాలను దేశం తీసుకుంది. దశాబ్దాల నాటి సంకెళ్ళను ఛేదించుకొని, ప్రతి రంగంలోనూ పురోగతి సాధించాం. నేడు దేశం నిరాశ నుంచి బయటపడి సరికొత్త ఆత్మవిశ్వాసం, ఆశలతో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తోంది.
మిత్రులారా...
నేడు, మనం -140 కోట్ల మంది భారతీయులం- భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి సంకల్పంతో కృషి చేస్తున్నాం. దేశ ప్రగతికి అవసరమైనవన్నీ భారత్ లోనే ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. మనం చేయాల్సింది ఇదే. తయారీ రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోంది. దేశీయ వినియోగం కోసం నిత్యావసర వస్తువుల ఉత్పత్తి అయినా లేదా ప్రపంచ దేశాలకు భారతీయ ఉత్పత్తులను ఎగుమతి చేయడమైనా మనం నిరంతర వృద్ధిని చూస్తున్నాం. నేడు, భారత్ అనేక దేశాలకు స్మార్ట్ ఫోన్లు, కార్ల నుంచి బొమ్మలు, సైనిక పరికరాలు, ఔషధాల వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అంతేకాకుండా, భారత్ ఇప్పుడు రైల్వేలు, మెట్రో వ్యవస్థలు, వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేస్తోంది. వీటిని కూడా ఎగుమతి చేస్తోంది. ఈ పురోగతికి దాహోద్ సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
కొద్ది సేపటి క్రితం మేమిక్కడ వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభించాం. వీటిలో, దాహోద్ లోని ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ అత్యంత ముఖ్యమైనది. దీనికి శంకుస్థాపన చేయడానికి నేను మూడు సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చాను. కొంతమంది వ్యక్తులకు విమర్శలు చేయడమే అలవాటు. కేవలం ఎన్నికల లాభం కోసం మోదీ శంకుస్థాపన చేశారని దాని వల్ల ఏమీ జరగదని వారు ఎద్దేవా చేశారు. ఏమైంది.. మూడేళ్ళ తర్వాత ఇప్పుడు ఇక్కడ మొదటి విద్యుత్ రైలింజన్ విజయవంతంగా తయారు చేయడాన్ని మనమందరం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితం దాన్ని ప్రారంభించే గౌరవం నాకు లభించింది. ఇది గుజరాత్ కు మాత్రమే కాకుండా మొత్తం దేశానికి గర్వకారణం.
రైల్వేల్లో నూరు శాతం విద్యుద్దీకరణ లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా నేడు గుజరాత్ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ విజయం సాధించినందుకు గుజరాత్ లోని నా సోదరులు, సోదరీమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మిత్రులారా...
నన్ను మరోసారి మీ అందరి మధ్యకు తీసుకువచ్చి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇక్కడి ప్రజలకు మొదట నేను నా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా మంది వయో వృద్ధులను, సుపరిచిత వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది. అలాగే ఇక్కడ నాకున్న ఎన్నో విలువైన జ్ఞాపకాలను నెమరేసుకునే అవకాశం కూడా దక్కింది. దాహోద్ తో నా అనుబంధం నేను రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ప్రారంభం కాలేదు. ఇది దాదాపు 70 సంవత్సరాల క్రితానిది. ఇక్కడ రెండు, మూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఈ రోజు నేను 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత పరేల్ ను సందర్శించాను. ఈ ప్రాంతం మొత్తం మారిపోయింది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడల్లా, సాయంత్రం వేళకు పరేల్ కు సైకిల్ పై వెళ్ళడానికి ప్రయత్నించేవాడ్ని. వర్షం కురిస్తే, పరిసరాలు పచ్చదనంతో నిండిపోతే, నేను చిన్న కొండల మీదుగా ఇరుకైన మార్గాల్లో ఆనందంగా సైకిల్ తొక్కుతాను. అలాంటి సాయంత్రాలు నాకు అపారమైన ఆనందాన్ని తెచ్చిపెట్టాయి. ఆ తరువాత, నేను పరేల్లోని రైల్వేలో పనిచేసే సోదరుల ఇళ్లలో భోజనం చేస్తాను. వారితో నాకున్న అనుబంధం చాలా దగ్గరగా ఉండేది. ఈ రోజు పరేల్ వైభవాన్ని చూడటం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది.
మిత్రులారా...
మేమిక్కడ ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాం. ఎన్నో ముఖ్యమైన చర్యలు తీసుకున్నాం. నేను ఒకప్పుడు దాహోద్ కోసం కన్న కలలు ఇప్పుడు నా కళ్ల ముందే సాకారమవుతున్నాయని గర్వంగా చెప్తున్నా. భారతదేశంలో గిరిజన ప్రాబల్యం కలిగిన జిల్లాను ఎలా అభివృద్ధి చేయవచ్చో ఎవరైనా ఒక నమూనాను చూడాలనుకుంటే, వారు తప్పనిసరిగా దాహోద్ ను సందర్శించాలని నేను పూర్తి విశ్వాసంతో స్పష్టంగా చెబుతున్నా. గిరిజన జిల్లాలో స్మార్ట్ సిటీని నిర్మించాలనే ఆలోచన ఒకప్పుడు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. గత కొన్ని సంవత్సరాలుగా మన రైల్వేలు ఎంత వేగంగా మారాయో మనం చూశాం. రైల్వే అభివృద్ధి దిశ మారింది. దాని వేగం పెరిగింది. మెట్రో సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. గతంలో, సెమీ-హై-స్పీడ్ రైల్వేలు భారత్ పదజాలంలో కూడా భాగం కాలేదు. నేడిది వాస్తవికతగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 70 మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. నేడు సోమనాథ్ దాదా పవిత్ర పాదాల చెంత దాహోద్ నుంచి అహ్మదాబాద్-వెరావల్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. ఇంతకుముందు, దాహోద్ కు చెందిన మన సోదరులు తరచు సమీపంలోని ఉజ్జయిని సందర్శించేవారు. ఇప్పుడు వారికి సోమనాథ్ తలుపులు కూడా తెరుచుకున్నాయి.
మిత్రులారా...
నేడు దేశమంతటా లెక్కలేనన్ని ఆధునిక రైళ్లు నడుస్తున్నాయి. ఈ పరివర్తనకు ప్రధాన కారణం మన దేశ యువత -మన కొత్త తరం- ఇప్పుడు భారతదేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. కోచ్ లు భారత్ లో తయారవుతున్నాయి. ఇక్కడ రైలింజన్లు ఉత్పత్తి అవుతున్నాయి. గతంలో మనం వీటన్నింటినీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చేది. ఇప్పుడు, పెట్టుబడి మనది, ప్రయత్నం మనది, విజయాలు కూడా మనవే. రైల్వే సంబంధిత పరికరాల ఎగుమతుల్లో భారత్ ఇప్పుడు ప్రధాన ప్రపంచ ఎగుమతిదారుగా మారుతోంది. మీరు ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తే, వారి మెట్రో వ్యవస్థలలో ఉపయోగించే కోచ్ లు గుజరాత్ లో తయారయ్యాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్ లను సందర్శించండి.. ఆ దేశాలలో నడుస్తున్న అనేక ఆధునిక రైళ్ల కోచ్ లు భారత్ లో తయారవుతున్న విషయాన్ని తెలుసుకుంటారు. మెక్సికో, స్పెయిన్, జర్మనీ, ఇటలీలలో వివిధ చిన్న, పెద్ద రైల్వే భాగాలు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి.
ఎంఎస్ఎంఈలు, కుటీర పరిశ్రమలను నడుపుతున్న మన చిన్న తరహా పారిశ్రామికవేత్తలు అసాధారణ ప్రతిభ చూపుతున్నారు. వారు క్లిష్టమైన భాగాలను కచ్చితత్వంతో తయారు చేసి ప్రపంచ మార్కెట్ కు ఎగుమతి చేస్తున్నారు. భారతీయ ప్రయాణీకుల కోచ్ లను ఇప్పుడు మొజాంబిక్, శ్రీలంక వంటి దేశాలలో ఉపయోగిస్తున్నారు. భారత్ అనేక దేశాలకు మేడ్ ఇన్ ఇండియా రైలింజన్లను కూడా ఎగుమతి చేస్తోంది. ఈ 'మేడ్ ఇన్ ఇండియా' బ్రాండ్ విస్తరిస్తోంది. ఫలితంగా భారత్ సగర్వంగా ప్రపంచం ముందు తన తల ఎత్తుకోగలుగుతుంది.
దాహోద్ లోని నా సోదర సోదరీమణులారా.. ఇప్పుడు నాకు చెప్పండి-ఇప్పుడు భారత్ లో తయారైన వస్తువులు ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయి. మన ఇళ్లల్లో విదేశీ తయారీ ఉత్పత్తులు ఉండాలా? గట్టిగా సమాధానం ఇవ్వండి- మనకు కావాలా.. వద్దా? త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ చెప్పండి.. మనం భారతీయ తయారీ వస్తువులకు మద్దతు ఇవ్వాలా వద్దా? మిమ్మల్ని మీరు చూసుకోండి-మీరు త్రివర్ణ పతాకం నీడలో కూర్చుని చెబుతున్నారు: మన దేశంలో తయారైన ఉత్పత్తులను మనం ఎందుకు ఉపయోగించకూడదు? గణేష్ చతుర్థి వచ్చినప్పుడు, విదేశీ లక్షణాలు, చిన్న కళ్ళు కలిగిన గణపతి విగ్రహాలను ఇంటికి తీసుకురావాలా? మన దేశం, భారత్ లో తయారు చేసిన విగ్రహాలను ఇంటికి తీసుకురావాలా? హోలీ, దీపావళి సమయంలో, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బాణసంచా, పిచికారీలను ఉపయోగించాలా? దానికి బదులు మన భారతీయ ఉత్పత్తులను ఎంచుకోకూడదా? భారతీయులు భారతీయ ఉత్పత్తుల నుంచి సంపాదించాలా వద్దా? భారత్ పురోగతి సాధించాలంటే, ప్రతి భారతీయుడు దీనిని వ్యక్తిగత తీర్మానంగా తీసుకోకూడదా?
మిత్రులారా...
రైల్వే రంగం బలంగా ఉంటే మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుంది. ఇది పరిశ్రమలు, వ్యవసాయం, విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మన సోదరీమణులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. గత దశాబ్దంలో, రైల్వేలు మొదటిసారిగా అనేక ప్రాంతాలకు చేరుకున్నాయి. గుజరాత్లో కూడా, చిన్న రైళ్లు మాత్రమే నడిచే అనేక ప్రదేశాలు ఉండేవి.. అవి కూడా చాలా నెమ్మదిగా నడిచేవి. ఉదాహరణకు దభోయ్ ప్రాంతాన్ని తీసుకోండి. అక్కడ రైళ్లు ఎంత నెమ్మదిగా నడుస్తాయంటే, అది కదులుతున్నప్పుడు మధ్యలో దిగి మళ్లీ ఎక్కవచ్చు! ఇటువంటి అనేక ఇరుకైన గేజ్ మార్గాలు ఇప్పుడు బ్రాడ్ గేజ్ గా మారాయి. దభోయ్ లోని ఇరుకైన గేజ్ రైల్వే స్థాయి ఇప్పుడు పెరిగింది.
ఈ రోజు ఇక్కడ అనేక రైల్వే మార్గాలు ప్రారంభమయ్యాయి. దాహోద్, వల్సాద్ మధ్య ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభించింది. దాహోద్ కు చెందిన నా సోదరులు గుజరాత్లోని ప్రతి మూలా ఉన్నారు. రాష్ట్రంలోని ఏదైనా చిన్న పట్టణానికి వెళ్ళండి.. అప్పుడు మీకు దాహోద్ కు చెందిన వాళ్ళు ఎవరైనా కచ్చితంగా కనిపిస్తారు. ఇప్పుడు ఈ కొత్త రైల్వే నెట్వర్క్ తో దాహోద్ త్వరలో 100 కిలోమీటర్ల నెట్వర్క్ ద్వారా అనుసంధానితమవుతుంది. ఈ అభివృద్ధి తాలూకు లబ్ధిదారులు మన గిరిజన పిల్లలే అవుతారు.
మిత్రులారా...
ఒక కర్మాగారాన్ని ఎక్కడ నెలకొల్పినా, దాని చుట్టూ మొత్తం పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. విడి భాగాలను ఉత్పత్తి చేయడానికి చిన్న కర్మాగారాలు పుట్టుకొస్తాయి. ఇవి క్రమంగా ఉపాధిని సృష్టిస్తాయి. మన యువతకు తగినంత ఉపాధి అవకాశాలు లభించేలా నేను కృషి చేస్తున్నా. దాహోద్ లోని రైలు కర్మాగారం ప్రపంచంలోని ప్రధాన తయారీ యూనిట్లలో ఒకటిగా మారుతుంది. ఇది దేశానికి ఒక మైలురాయిలా నిలుస్తుంది. మిత్రులారా, ఇది సాధారణ కర్మాగారం కాదు. నేను మీకు గుర్తు చేస్తున్నా ఇంతకుముందు అక్కడ ఉన్నవన్నీ దాదాపు అదృశ్యమయ్యాయి. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేశారు. దాహోద్ పరేల్ నా కళ్ళ ముందు ఎండిపోవడాన్ని చూశాను. ఇప్పుడు, అది మళ్లీ సజీవంగా కళకళలాడుతూ ఉండటం చూస్తున్నాను -అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పరివర్తన మీ ప్రేమ, ఆశీర్వాదాల వల్ల వచ్చిందే. ఈ రోజు భారత్ కు చెందిన 9,000 హార్స్పవర్ రైలింజను ఎక్కడ తయారైందని ఎవరైనా అడిగితే, సమాధానం దాహోద్ అని చెబుతారు. ఇక్కడ తయారవుతున్న రైలింజన్లు సగర్వంగా మేడ్ ఇన్ ఇండియా ను ప్రతిబింబిస్తాయి. ఇవి మన రైల్వేల బలం, సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ఇక్కడ తయారు చేసిన టైర్లు ప్రపంచవ్యాప్తంగా కీర్తిని పొందుతాయి. దాహోద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మోగుతుంది. రాబోయే సంవత్సరాల్లో, వందలాది రైలింజన్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. అతి త్వరలో, ప్రతి రెండు రోజులకో కొత్త లోకోమోటివ్ బయటకొచ్చే సమయం వస్తుంది. ఈ విజయం స్థాయిని ఊహించుకోండి -ప్రతి రెండు రోజులకు ఒక లోకోమోటివ్! ఇంత పెద్ద తయారీ మన స్థానిక సోదరులు, సోదరీమణులకు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఈ కర్మాగారం చుట్టుపక్కల ప్రాంతాలలో విడిభాగాల తయారీ యూనిట్లు, చిన్న తరహా పరిశ్రమలు విస్తృత స్థాయిలో వృద్ధి చెందడానికి కూడా దారి తీస్తుంది.
ఫ్యాక్టరీలో నేరుగా ఉపాధి లభించినప్పటికీ, ఈ అనుబంధ పరిశ్రమలు లెక్కలేనన్ని కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయి. మన రైతు సోదరులు, సోదరీమణులు, మన పశువుల పెంపకందారులు, చిన్న దుకాణదారులు, కార్మికులు -పురుషులు లేదా మహిళలు-సమాజంలోని ప్రతి విభాగం ఈ అభివృద్ధి నుంచి ఎంతో ప్రయోజనం పొందుతారు.
మిత్రులారా,
విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, పర్యాటకం వంటి రంగాలలో గుజరాత్ నేడు గణనీయమైన పురోగతిని సాధించింది. రంగమేదైనా కావొచ్చు.. గుజరాత్ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎగరడం చూస్తారు. వేల కోట్ల విలువైన పెట్టుబడులు గుజరాత్లో సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణానికి దారితీస్తున్నాయి, ఈ ప్రయత్నాల ఫలితంగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.
మిత్రులారా...
వడోదరలో వివిధ చిన్న, పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్న కాలమది. పంచమహల్ జిల్లాను విభజించి, దాహోద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన రోజు నాకు గుర్తుంది. ఈ నిర్ణయం పంచమహల్, దాహోద్ రెండింటి స్వతంత్ర అభివృద్ధికి దారితీస్తుందని నా మనస్సులో స్పష్టంగా ఉండేది. ఈ రోజు, నేను నా కళ్ళ ముందు ఆ అభివృద్ధిని చూసినప్పుడు, ఈ భూమికి నేను రుణం తీర్చుకోవడంలో నాకు కలిగే ఆనందం అపారమైనది. మిత్రులారా, ఈరోజు నాకు చాలా సంతృప్తిగా ఉంది. నేను మీ ఉప్పు తిన్నా. నేను మీ కోసం ఎంత చేసినా అది తక్కువే. చుట్టుపక్కల చూడండి-ఈ రోజు, చిన్న తరహా పరిశ్రమలు సాధారణ స్థాయిలో కాదు అత్యంత అధునాతన, హైటెక్ ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఈ మొత్తం వృద్ధి నా గిరిజన సోదరులు, సోదరీమణుల వల్ల జరిగిందే.
మీరు వడోదర నుంచి దాహోద్ వరకు అలాగే మధ్యప్రదేశ్ వరకు ప్రయాణిస్తే, వడోదరలో విమానాల తయారీ ఇప్పుడు వేగంగా పురోగమిస్తున్న విషయాన్ని మీరు గమనిస్తారు. కొన్ని నెలల క్రితమే అక్కడ ఎయిర్బస్ అసెంబ్లీ లైన్ ప్రారంభమైంది. దేశంలోని మొట్టమొదటి గతి శక్తి విశ్వవిద్యాలయం కూడా వడోదరలో ఏర్పాటైంది. విదేశీ పెట్టుబడులతో నడిచే రైల్వే కోచ్ లు, కార్ల తయారీకి సావ్లీలో ఒక ప్రధాన కర్మాగారం ఏర్పాటైంది. నేడు ఇది అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటోంది. దేశంలోని అత్యంత శక్తిమంతమైన రైలు ఇంజిన్ -9,000 హార్స్పవర్ రైలింజను- ఇక్కడే దాహోద్ లో తయారు అవుతోంది. గోద్రా, కలోల్, హాలోల్ లోని అనేక పరిశ్రమలు, తయారీ యూనిట్లు పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉద్భవిస్తున్నాయి. గుజరాత్ అంతటా పురోగతి అలలు ఎగసిపడుతున్నాయి.
మిత్రులారా...
సైకిళ్ళు, మోటార్ సైకిళ్ల నుంచి రైల్వే ఇంజిన్లు, విమానాల వరకు ప్రతీదీ గుజరాత్ తయారు చేసే రోజు కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇవన్నీ గుజరాత్ యువత గుజరాత్ నేలపై తయారుచేస్తారు. ఇటువంటి హైటెక్ ఇంజినీరింగ్, తయారీ కారిడార్ ప్రపంచంలో అరుదైన దృగ్విషయం. వడోదర నుంచి దాహోద్, హలోల్, కలోల్, గోద్రా వరకు అసాధారణ పారిశ్రామిక నెట్వర్క్ ఏర్పాటు అవుతోంది.
మిత్రులారా...
అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రూపొందించడానికి, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా అంతే కీలకం. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలోని నా గిరిజన సోదరులు, సోదరీమణులకు సేవ చేసే అవకాశం నాకు లభించింది. వారి సంక్షేమానికి నన్ను పూర్తిగా అంకితం చేసుకున్నాను. తరువాత, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు, నేను ఈ ప్రయత్నాలను కొనసాగించాను. గత పదకొండు సంవత్సరాలుగా, గిరిజన వర్గాల అపూర్వ అభివృద్ధికి నన్ను నేను అంకితం చేసుకున్నా. గుజరాత్లోని గిరిజన ప్రాంతాలలో సుదీర్ఘకాలం-దాదాపు ఏడు దశాబ్దాలుగా విస్తృతంగా పనిచేసే అవకాశం నాకు లభించింది. గిరిజన సోదరులు, సోదరీమణులు పంచుకున్న లెక్కలేనన్ని అనుభవాలను నేను విన్నా. ఒకప్పుడు ఉమర్గాం నుంచి అంబాజీ వరకు మొత్తం గిరిజన ప్రాంతంలో 12వ తరగతికి ఒక్క సైన్స్ పాఠశాల కూడా ఉండేది కాదు. ఇలాంటి సందర్భాలను నేను చూశాను. కానీ నేడు, అదే ప్రాంతంలో-ఉమర్గామ్ నుంచి అంబాజీ వరకు-అనేక కళాశాలలు, ఐటీఐలు, వైద్య కళాశాలలు, రెండు గిరిజన విశ్వవిద్యాలయాలు కూడా గిరిజన ప్రాంతాలలో చురుకుగా పనిచేస్తున్నాయి. గత పదకొండు సంవత్సరాలలో, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నెట్వర్క్ కూడా గణనీయంగా విస్తరించింది. దాహోద్ లో కూడా ఇటువంటి అనేక పాఠశాలలు ప్రారంభమయ్యాయి.
మిత్రులారా...
నేడు, గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా విస్తృతమైన, కేంద్రీకృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గిరిజన గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనేక కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. గిరిజన గ్రామ అభివృద్ధి కోసం బిర్సా ముండా ధర్తి ఆబా గా వ్యవహరించే 'ధర్తి ఆబా' కార్యక్రమాన్ని ఇటీవలి బడ్జెట్లో ప్రకటించిన విషయాన్ని మీరు గమనించవచ్చు.
ఈ పేరుతో మేం జనజాతి గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ను ప్రారంభించాం. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఈ కార్యక్రమం గుజరాత్ తో సహా దేశవ్యాప్తంగా 60,000 కి పైగా గ్రామాలలో అభివృద్ధి పనులకు తోడ్పడుతోంది. నా గిరిజన సోదరులు, సోదరీమణులకు అత్యంత ఆధునిక సౌకర్యాలను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి -అది విద్యుత్ అయినా, స్వచ్ఛమైన తాగునీరు అయినా, రోడ్లు అయినా, పాఠశాలలు అయినా లేదా ఆసుపత్రులు అయినా- ఘనమైన, కాంక్రీటు గృహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్మితమవుతున్నాయి.
మిత్రులారా...
ప్రపంచం తరచుగా నిర్లక్ష్యం చేసే వారిని మోదీ గౌరవిస్తారు. గిరిజన జనాభాలో అనేక సంఘాలు చాలా కాలంగా వెనుకబడి ఉన్నాయి-కానీ వాటిని మేం విస్మరించలేదు. వారి కోసం ప్రభుత్వం పీఎం జన్మాన్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, అత్యంత అణగారిన గిరిజన కుటుంబాలకు గృహనిర్మాణం, విద్య, ఉపాధి అవకాశాలు వంటి అవసరమైన సేవలను అందించడానికి మేము కృషి చేస్తున్నాం.
సోదర సోదరీమణులారా..
రక్తహీనత వ్యాధి వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి గుజరాత్లో మనకు చాలా కాలంగా తెలుసు. నేను గుజరాత్లో ఉన్నప్పటి నుంచి ఈ అనారోగ్యాన్ని ఎదుర్కోవటానికి కృషి చేస్తున్నా. ఈ రోజు మనం దీన్ని దేశవ్యాప్త స్థాయిలో పరిష్కరిస్తున్నాం. రక్తహీనత వ్యాధి కబంధ హస్తాల నుంచి నా గిరిజన సోదరులు, సోదరీమణులను విడిపించడానికి మిషన్ మోడ్లో పని చేస్తున్నాం. ఈ మిషన్లో భాగంగా ప్రస్తుతం లక్షలాది మంది గిరిజనులను పరీక్షిస్తున్నారు.
చారిత్రాత్మకంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. దురదృష్టవశాత్తు, దేశంలోని 100 అత్యంత వెనుకబడిన జిల్లాలను గతంలో వారి తలరాతకే విడిచిపెట్టారు. ఈ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు-సమర్థులైన అధికారులు ఎవరూ అక్కడ పనిచేయడానికి ఇష్టపడలేదు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో లేరు, ఇళ్లు లేవు, రోడ్లు లేవు. ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది, బాధిత ప్రాంతాల్లో అనేక గిరిజన జిల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు దాహోద్ జిల్లాను కూడా వాటిలో లెక్కించేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ సిటీ చొరవలో భాగంగా దాహోద్ జిల్లా, దాహోద్ నగరం మారుతున్నాయి. దాహోద్ భవిష్యత్తు దృష్టితో ముందుకు సాగుతోంది. ఇది ఆశాజనక జిల్లాల విభాగంలో కూడా గుర్తింపును సంపాదించింది. దాహోద్ నగరం పునరుజ్జీవితమవుతోంది. ఇక్కడ ఆధునిక స్మార్ట్ సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయి.
మిత్రులారా...
దాహోద్ తో సహా దక్షిణ గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత సమస్య తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. నేడు, నీటి సరఫరా కోసం వందల కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు వేయడానికి విస్తృతమైన పని జరుగుతోంది. ప్రతి ఇంటికి నర్మదా నీరు చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏడాదిలోనే ఉమర్గాం నుంచి అంబాజీ వరకు 11 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించగలిగాం. ఇది మన రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చింది. తద్వారా వారు సంవత్సరానికి మూడు పంటలను పండించడానికి వీలు కల్పించింది.
సోదర సోదరీమణులారా..
ఇక్కడికి రాకముందు నేను వడోదరలో ఉన్నాను. అక్కడ వేలాది మంది తల్లులు, సోదరీమణులతో సమావేశమయ్యా. మన సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి వారంతా కలిసి వచ్చారు. వారు ఆ గౌరవాన్ని నాకు కల్పించారు. తల్లి బలం యొక్క గొప్పతనానికి నేను గౌరవంగా నమస్కరిస్తున్నా. ఇక్కడ దాహోద్ లో కూడా, మీరంతా -మా తల్లులు, సోదరీమణులు- మీ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఆపరేషన్ సిందూర్ కోసం మీ ఆశీర్వాదాలను అందించారు. ఈ దాహోద్ భూమి తపస్సు, త్యాగనిరతి గల భూమి. దుధిమతి నది ఒడ్డున మహర్షి దధిచి విశ్వ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగం చేసినట్లు చెబుతారు.
ఈ నేల ఒకప్పుడు విప్లవకారుడు తాత్యా తోపేకు అవసరమైన సమయంలో మద్దతుగా నిలిచింది. ఇక్కడ నుంచి చాలా దూరంలో మంగర్ ధామ్ ఉంది -గోవింద్ గురు నేతృత్వంలోని వందలాది మంది గిరిజన యోధుల శౌర్యం, త్యాగాన్ని సూచించే పవిత్ర ప్రదేశమది. అందువల్ల, ఈ ప్రాంతం, భారత మాత, మానవత్వ సేవలో మన నిస్వార్థ త్యాగ పురాతన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. నాకు చెప్పండి... అటువంటి విలువలు భారతీయుల హృదయాల్లో ఉన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన పనికి భారత్ మౌనంగా ఉండగలదా? మోదీ మౌనంగా ఉండగలడా?
ఎవరైనా మన సోదరీమణుల నుదిటి సింధూరాన్ని (వెర్మిలియన్) తుడిచివేయడానికి ధైర్యం చేసినప్పుడు, వారి సొంత వినాశనం అనివార్యం అవుతుంది. అందువల్ల, ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య కాదు-ఇది భారతీయ విలువలు, భావోద్వేగాల ప్రతిబింబం. మోదీని ఎదుర్కోవడం ఎంత భయంకరంగా ఉంటుందో ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేకపోయారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఉండండి. అది ఏ గౌరవాన్ని సూచిస్తుందో ఆలోచించండి. ఒక తండ్రిని తన పిల్లల ముందు కాల్చి చంపేశారు-నేటికీ నేను ఆ చిత్రాలను చూసినప్పుడు, నా రక్తం మరిగిపోతుంది. ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులను సవాలు చేశారు. మీరందరూ నాకు అప్పగించిన పదవితో ఒక ప్రధాన సేవకుడిగా నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. నేను మన మూడు సాయుధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చా. మన సైనికుల ధైర్యాన్ని అనేక దశాబ్దాలుగా ప్రపంచం చూడలేదు. సరిహద్దు వెంబడి పనిచేస్తున్న తొమ్మిది ప్రధాన ఉగ్రవాద స్థావరాలను మేము గుర్తించాం. వాటి కచ్చితమైన స్థానాలను ధ్రువీకరించాం. 6వ తేదీ రాత్రి, కేవలం 22 నిమిషాల్లో 22వ తేదీనాటి దుర్మార్గాలకు ప్రతీకారంగా వారందరినీ నిర్మూలించాం.
భారత్ ప్రతిస్పందనతో ఉలిక్కిపడిన పాకిస్తాన్ సైన్యం, నిరాశతో దాడికి ప్రయత్నించినప్పుడు, మన దళాలు వారిని కూడా ఓడించాయి. మన రిటైర్డ్ సైనిక సిబ్బంది చాలా మంది ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారని నాకు సమాచారం అందింది. నేను వారికి కూడా ప్రణమిల్లుతున్నా. ఈ పవిత్రమైన దాహోద్ భూమి నుంచి మన దేశ సాయుధ దళాల శౌర్యానికి నేను మరోసారి నివాళులర్పిస్తున్నా.
మిత్రులారా...
విభజన తరువాత ఉద్భవించిన ఆ దేశానికి ఒకే ఒక లక్ష్యం ఉంది... భారతదేశం పట్ల శత్రుత్వం, భారతదేశం పట్ల ద్వేషం, భారతదేశానికి హాని కలిగించాలనే అవిశ్రాంత కోరిక. మరోవైపు, పేదరికాన్ని నిర్మూలించడం, దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అభివృద్ధి చెందిన దేశంగా స్థిరపడటం భారతదేశం లక్ష్యం. మన సాయుధ దళాలు బలంగా ఉన్నప్పుడు, మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన భారత్ సాకారం అవుతుంది. ఈ దిశగా నిరంతరం దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నాం.
మిత్రులారా...
దాహోద్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేటి కార్యక్రమం భవిష్యత్తుకి ఒక సంగ్రహావలోకనం మాత్రమే. కష్టపడి పనిచేసే నా స్నేహితులందరిపై, ఈ దేశ ప్రజలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ కొత్త సౌకర్యాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, దాహోద్ ను దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాలలో ఒకటిగా మార్చాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ నమ్మకంతో, నేను మరోసారి మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు, ఆపరేషన్ సిందూర్ గౌరవార్థం ప్రతి ఒక్కరూ లేచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నేను ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి నిలబడి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, నేను అన్నట్లు అనండి:
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
'భారత్ మాతా కీ జై' అన్న నినాదం బిగ్గరగా ప్రతిధ్వనిస్తూనే ఉండాలి.