“అందరి సహకారంతో అందరి ప్రగతి (సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్) మనందరి సమష్టి బాధ్యత”
“మా అభివృద్ధి విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుని.. పరీక్షించి... మద్దతిస్తున్నారు”
“ఊరట నుంచి సంతృప్తి దాకా.. 2014 తర్వాత దేశం ఓ కొత్త విధానాన్ని చూసింది... ఇది బుజ్జగింపులకు కాకుండా ప్రజానీకం సంతృప్తికి ప్రాధాన్యమిచ్చే నమూనా”
“సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్.. మా పాలనకు తారక మంత్రం”
“నారీశక్తి సారథ్యంలో భారత పురోగమనం”
“పేద.. అణగారిన వర్గాల సంక్షేమమే మా ప్రాథమ్యం”
“పిఎం-జన్మన్’ అమలుతో గిరిజన వర్గాలకు సాధికారత కల్పిస్తున్నాం”
“దేశ జనాభాలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులై నవ్య మధ్యతరగతిలో భాగమయ్యారు... వారి ఆకాంక్షలే దేశ ప్రగతికి నేడు బలమైన పునాది”
“ఆత్మవిశ్వాసం.. దృఢ సంకల్పంతో భారత ప్రగతి పయనానికి సారథ్యం వహించేందుకు మధ్య తరగతి ప్రజలు సిద్ధంగా ఉన్నారు”
“దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల బలోపేతంపై మేం దృష్టి సారించాం”
“భారత్‌ ఆర్థిక సామర్థ్యాన్ని నేడు యావత్‌ ప్రపంచం గుర్తిస్తోంది”

గౌరవనీయ చైర్మన్ గారూ,


భారత్ సాధించిన విజయాలను, భారత్ పట్ల ప్రపంచ అంచనాలను, 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణం కోసం దేశంలోని సామాన్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంకల్పాన్ని గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎంతో చక్కగా వివరించారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా సాగిన వారి ప్రసంగం మనందరికీ భవిష్యత్ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఈ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రసంగానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!

70 మందికి పైగా గౌరవ పార్లమెంటు సభ్యులు తమ విలువైన ఆలోచనలతో ఈ కృతజ్ఞతా తీర్మానాన్ని సుసంపన్నం చేశారు. పాలక, ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ చర్చల ద్వారా రాష్ట్రపతి ప్రసంగం పట్ల తమ అవగాహనను పంచుకుంటూ, తమదైన రీతిలో వారు 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' గురించి మాట్లాడారు, అయితే ఇది మనందరి సమష్టి బాధ్యత, దీనికోసమే ప్రజలు ఇక్కడ కూర్చునే అవకాశం మనకు ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ మాత్రం ఈ సూత్రాన్ని అనుసరిస్తుందని ఆశించలేం, ఎందుకంటే ఒకే కుటుంబ వికాసానికి అంకితమైన ఆ పార్టీ ఆలోచనా విధానానికి, సిద్ధాంతాలకు ఇది తగినది కాదు, వారి వల్ల 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' ఎన్నటికీ సాధ్యం కాదు. అబద్ధాలు, మోసం, అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు అన్నీ కలిసిన రాజకీయ నమూనాను కాంగ్రెస్ సృష్టించింది. ఈ విషయాలన్నీ కలిసిన చోట 'సబ్ కా సాథ్' ఎప్పటికీ ఉండదు.

కాంగ్రెస్ నమూనాలో, అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశం 'కుటుంబమే ముందు', అందువల్ల, వారి విధానాలు, సూత్రాలు, ప్రసంగం, ప్రవర్తన అన్నీ ఆ ఒక విషయాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి సారించాయి. 2014 తర్వాత, దేశం మాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చింది, అందుకు ఈ దేశ ప్రజలకు నేను చాలా కృతజ్ఞుడను. శక్తిమంతమైన ప్రజాస్వామ్యం, మీడియా, అన్ని రకాల అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ గల విశాల భారతం వరుసగా మూడోసారి దేశానికి సేవ చేసే బాధ్యత మాకు అప్పగించింది. దేశ ప్రజలు మా అభివృద్ధి నమూనాను విశ్లేషించారు, అర్థం చేసుకున్నారు, దానికి మద్దతు తెలిపారు. ఈ నమూనా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నేను 'దేశం ముందు' అనే ఒకే మాట చెబుతాను. ఈ గొప్ప భావన, అంకితభావంతో కూడిన మా విధానం గురించి మేం అనేక  కార్యక్రమాలు, ప్రసంగాలతో పాటు, మా ప్రవర్తనలో కూడా ప్రజలకు తెలియజేప్పాం. ఐదారు దశాబ్దాల పాటు ప్రత్యామ్నాయం తెలియని స్థితిలో ఉన్న దేశం, 2014 తర్వాత, ఒక కొత్త నమూనాను చూసింది, ఈ కొత్త నమూనా 'సంతుష్టి' కంటే 'సంతృప్తి'ని నమ్ముతుంది. మునుపటి నమూనాలో, ముఖ్యంగా కాంగ్రెస్ కాలంలో, సంతుష్టి ప్రతిచోటా ఉంది; అది వారి రాజకీయ ఔషధంగా మారింది. వారు స్వార్థపూరిత విధానాన్ని అనుసరించారు, అవినీతి ద్వారా రాజకీయాలను, జాతీయ ప్రయోజనాలను, ప్రతిదానినీ దోపిడీ చేశారు. అణగారిన వర్గాలకు చెప్పిన దానిలో ఎంతోకొంత విదిల్చి, మిగిలిన దానిని తరువాతి ఎన్నికల సమయంలో తిరిగి హామీగా ఆశచూపడం వారి విధానం. వారు తప్పుడు వాగ్దానాలను అందిస్తూ, ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికల సమయంలో ఓట్లు పొందే లక్ష్యంతోనే తమ రాజకీయాలు కొనసాగించారు.

భారత్ తన వనరులను సముచితంగా ఉపయోగించుకునేలా చేయడం మా ప్రయత్నం. దేశానికి అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం, వృధాను నివారించడం, ప్రతి క్షణాన్ని దేశ పురోగతి, సాధారణ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించడం మా లక్ష్యం. అందుకే మేం 'సంతృప్తి' విధానాన్ని అవలంబించాం. ప్రజలను అనిశ్చితిలో ఉంచి, వారిని నిరంతరం నిరాశపరచడం వంటి విధానం నుంచి మేం దూరంగా ఉన్నాం. బదులుగా, ప్రతి వ్యక్తి వారి కోసం రూపొందించిన ప్రణాళికల పూర్తి ప్రయోజనాన్ని పొందే 'సంతృప్తి విధానాన్ని' మేం అవలంబించాం. గత దశాబ్దంలో, మేం మా పాలన ప్రధాన మంత్రమైన 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' స్ఫూర్తికి ప్రతి స్థాయిలోనూ జీవం పోశాం, దాని ఫలితంగా దేశంలో జరుగుతున్న సానుకూల మార్పులను నేడు మనం చూస్తున్నాం. ఎస్‌సీ/ఎస్‌టీ చట్టాన్ని బలోపేతం చేయడం ద్వారా దళితులు, ఆదివాసీల గౌరవం, భద్రత పట్ల మా ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పాం.

నేడు, కులతత్వ విషాన్ని వ్యాప్తి చేయడానికి సంఘటిత ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ మూడు దశాబ్దాలుగా, ఉభయ సభల్లో అన్ని పార్టీల నుంచి ఓబీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని ఓబీసీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వారి డిమాండ్లను ఆనాడు పదేపదే తిరస్కరించారు, ఎందుకంటే బహుశా ఆ సమయంలో అది వారి రాజకీయ ఎజెండాకు సరిపోలేదు. బుజ్జగింపులు, 'కుటుంబం ముందు' ప్రధాన ఎజెండాగా ఉండే వారి రాజకీయాల్లో, అటువంటి చర్య వారి ప్రయోజనాలకు తగినది కాదు, అది వారి రాజకీయ లక్ష్యాలను నెరవేర్చేదీ కాదు.

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఓబీసీ సమాజం ఆశలు, డిమాండ్లను మనం కలిసికట్టుగా నేడు నెరవేర్చుకోడం నేను గౌరవంగా భావిస్తున్నాను. నాడు పదే పదే విస్మరించి, తిరస్కరించిన ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా డిమాండ్‌ను నేడు మేం పరిష్కరించాం, అయితే కేవలం డిమాండ్‌ను నెరవేర్చడం కాదు, వారి గౌరవ, మర్యాదలు కాపాడడం కూడా మాకు అంతే ముఖ్యం. ఈ దేశంలోని 140 కోట్ల మంది పౌరులను 'జనతా జనార్దన్'గా గౌరవిస్తూ, ఆ స్ఫూర్తితో మేం పని చేస్తున్నాం.

మన దేశంలో రిజర్వేషన్ల గురించి చర్చ ఎన్నడూ ఆరోగ్యకరంగా, పరిష్కారం లక్ష్యంగా, సత్యాన్ని అంగీకరించే విధానంతో జరగలేదు. బదులుగా, దేశంలో విభజనవాదాన్ని, ఉద్రిక్తతలను సృష్టించడానికి అలాగే వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచీ ఇదే విధానం కొనసాగింది. మొదటిసారిగా, మా ప్రభుత్వం 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అనే మంత్రంతో ప్రేరణ పొంది, జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఒక సరికొత్త నమూనాను ప్రదర్శించింది. ఇది ఎటువంటి ఉద్రిక్తతలను సృష్టించకుండా, ఎవరికీ అన్యాయం కలిగించకుండా అమలైంది. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, దీనిని ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ వర్గాలు కూడా స్వాగతించాయి. ఈ విధంగా, దేశమంతా శాంతియుతంగా ఈ నిర్ణయాన్ని ప్రశాంతంగా, ఆరోగ్యకరమైన రీతిలో అంగీకరించింది.

మన దేశంలో, 'దివ్యాంగుల' (వికలాంగుల) సమస్యలను నాడు ఎవరూ పట్టించుకోలేదు. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' మంత్రాన్ని అనుసరిస్తూ, 'దివ్యాంగులు' కూడా 'అందరిలో' భాగమే అనే భావనతో వారి కోసం మేం రిజర్వేషన్లను విస్తరించాం. వారికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మిషన్ మోడ్‌లో పనిచేస్తూ, అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం, అలాగే ఈ పథకాలు పక్కాగా అమలు చేశాం. అంతేగాకుండా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కుల విషయంలో చట్టపరమైన, ప్రామాణికమైన చర్యలు కూడా చేపట్టాం. వారి హక్కులకు అధికారికంగా గుర్తింపు, రక్షణ కల్పించేందుకు మేం ఎంతగానో కృషిచేశాం. సమాజంలోని అణగారిన వర్గాల పట్ల గొప్ప సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి మేం కృషి చేశాం.

దేశాభివృద్ధి ప్రయాణంలో 'నారీ శక్తి' (మహిళా శక్తి) సహకారం మరింత ముఖ్యమైనది. అయితే, వారికి తగిన అవకాశాలు కల్పించి వారిని నిర్ణయాలు తీసుకోవడంలో భాగం చేస్తే, అది దేశ పురోగతినీ వేగవంతం చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సభలో మనం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఈ దేశ పౌరులుగా మనం ఈ నిర్ణయం పట్ల గర్వపడవచ్చు. ఈ కొత్త సభలో మొదటి నిర్ణయంగా 'నారీ శక్తి వందన అధినియం' ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 'మాతృ శక్తి' (మాతృత్వం) బలాన్ని గౌరవించుకోవడం ద్వారా ఈ సభను ప్రారంభించాలని ఎంచుకుని నూతన సభ ప్రారంభానికి మనం ప్రత్యేకతను జోడించుకున్నాం. 'మాతృ శక్తి' ఆశీర్వాదంతో, ఈ సభ తన కార్యకలాపాలను ప్రారంభించింది.

 

గౌరవనీయ చైర్మన్ గారూ,
మనం వెనక్కి తిరిగి చరిత్రను చూస్తే.. బాబాసాహెబ్ అంబేద్కర్  పట్ల కాంగ్రెస్‌కు విపరీతమైన ద్వేషం ఉంది. నేను ఇది ఏదో చెప్పాలి కాబట్టి చెప్పటం లేదు. వాళ్లు ఆయనపై తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఏది ఏమైనా బాబాసాహెబ్ చేసిన ప్రతి పనికి, ప్రకటనకు కాంగ్రెస్ ఎప్పుడూ ప్రతికూలంగా స్పందించింది. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ అందుబాటులో ఉన్నాయి. నిజానికి రెండు సార్లు అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆయన గొప్ప కృషి చేసినప్పటికీ భారతరత్నకు అంబేడ్కర్‌ అర్హుడని వారు ఎన్నడూ భావించలేదు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ఈ దేశ ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వారు ఆయన సిద్ధాంతాలను, మనోభావాలను గౌరవిస్తున్నారు. ఫలితంగా నేడు కాంగ్రెస్ అయిష్టంగానే 'జై భీమ్' అనక తప్పడం లేదు. ఇలా చేసినప్పుడు వాళ్ల గొంతులో వెలక్కాయ పడినట్టు ఉంటుంది. అధ్యక్షా.. ఈ కాంగ్రెస్ తన రంగులను మార్చుకోవడంలో చాలా నైపుణ్యం సాధించినట్లుంది. వారు తమ మాస్కును చాలా త్వరగా మారుస్తున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

గౌరవనీయ చైర్మన్ గారూ,
 

మా ప్రధాన సూత్రం ఎల్లప్పుడూ 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్'. అయితే కాంగ్రెస్‌ను సరిగ్గా గమనిస్తే..’నిరంతరం ఇతరుల విజయాలను తక్కువ చేయటం’ అనేది వాళ్ల సూత్రం అని అర్థమౌతుంది. ఫలితంగా ప్రభుత్వాలను అస్థిరపరిచారు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా దాన్ని అస్థిరపరచడంపైనే దృష్టి సారించేవారు. ఇతరుల విజయాలను చిన్నవిగా చేసేందుకు వారు ఎంచుకున్న మార్గం ఇదే. లోక్‌సభ ఎన్నికల తర్వాత వాళ్లతో ఉన్నవారు కూడా అదే విధంగా అంతరించి పోతారని గ్రహించి ఇప్పుడు దూరం అవుతున్నారు. వారి విధానాల ఫలితమే నేడు కాంగ్రెస్‌ ఈ స్థితికి కారణం. స్వాతంత్య్రోద్యమంలో భాగమైన దేశంలోనే అతిపురాతన పార్టీ ఇప్పుడు ఇంత దయనీయ స్థితిలో ఉంది. ఇతరుల విజయాలను తగ్గించే ప్రయత్నంలో శక్తిని వృధా చేశారు, కానీ సొంత అభివృద్ధిపై దృష్టి పెట్టి ఉంటే, ఈ దుస్థితి వచ్చేది కాదు. నేను ఒక ఉచిత సలహా ఇస్తున్నాను, బహుశా ఇది నచ్చకపోవచ్చు. మీ సొంత పురోగతిపై దృష్టి పెట్టండి. అలా చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఈ దేశం మీకు అవకాశం ఇస్తుంది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న మౌలికమైన సవాళ్లను అంబేద్కర్  చాలా వివరంగా, లోతుగా అర్థం చేసుకున్నారు. వారి కష్టాలను స్వయంగా అనుభవించారు. అందువల్ల  బాధ, విచారం ఆయనకు ఉంది.. సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలనే బలమైన కోరిక ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక పురోగతికి స్పష్టమైన మార్గాన్ని బాబాసాహెబ్ తెలియజేశారు. ఈ లోతైన అవగాహనను ఆయన మాటలు ప్రతిబింబించేవి. అంబేద్కర్ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. దాన్ని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. "భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, కానీ దళితులకు అది ఎప్పటికీ ప్రాథమిక జీవనోపాధి కాదు" అని అంబేద్కర్  అన్నారు. దీనికి గల కారణాలను వివరిస్తూ.. భూమి కొనుగోలు వారి ఆర్థిక స్థోమతకు మించి ఉండటమే మొదటి సమస్య అని పేర్కొన్నారు. వారి దగ్గర డబ్బులున్నా భూములు కొనే అవకాశాలు లేవు. ఈ పరిస్థితిని క్షుణ్ణంగా విశ్లేషించి ఆయన ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించారు. దేశంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం ద్వారా దళితులు, ఆదివాసీ సోదరసోదరీమణులు, అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని, వారు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించాలని ఆయన కోరారు. అంబేద్కర్  పారిశ్రామికీకరణను సమర్థించారు. ఎందుకంటే దళిత, ఆదివాసీ, అణగారిన వర్గాలకు నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు, ఆర్థిక స్వావలంబన కోసం వ్యవస్థాపక అవకాశాలను అందించడానికి దీనిని ఒక మార్గంగా ఆయన చూశారు. వారి అభ్యున్నతికి పారిశ్రామికీకరణ అత్యంత ముఖ్యమైన సాధనమని ఆయన విశ్వసించారు. స్వాతంత్య్రం వచ్చి అనేక దశాబ్దాలు గడిచినా, కాంగ్రెస్ అధికారంలో ఉండి పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ వారు అంబేద్కర్  ఆలోచనలను ఏనాడూ పట్టించుకోలేదు. వారు ఆయన దార్శనికతను పూర్తిగా తిరస్కరించారు. ఆయన చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఆర్థికపరమైన పేదరికాన్ని పరిష్కరించడానికి బదులుగా కాంగ్రెస్ పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ వర్గాల్లో సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

2014లో మా ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చి నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళితం, పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. ఎవరు లేకుండా సమాజ నిర్మాణం అనేది సాధ్యం కాదో ఆ వర్గాలపై దృష్టి సారించేందుకు మేం పీఎం విశ్వకర్మ యోజనను తీసుకొచ్చాం. కమ్మరి, కుమ్మరులు, స్వర్ణకారులు, ఇతర సారూప్య సంప్రదాయ హస్తకళలలో నిమగ్నమైన వీళ్లంతా గ్రామాలలో విస్తరించి చిన్న చిన్న వర్గాలుగా ఉన్నారు. శిక్షణ, సాంకేతికంగా ఆధునికీకరించటం, కొత్త సాధనాలు, డిజైనింగ్‌లో సహాయం, ఆర్థిక మద్దతు, వివిధ మార్కెట్లను వారికి అందుబాటులోకి తీసుకురావటం ద్వారా మొదటిసారిగా దేశం వారిపై దృష్టి సారించింది. ఈ అన్ని అంశాల్లో వారందరికి సహాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇంతకాలం ఈ వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కానీ వీళ్లు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విశ్వకర్మ సామాజికవర్గానికి సంబంధించిన సంక్షేమంపై మేం దృష్టి సారించాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

తొలిసారిగా వ్యవస్థాపకతలోకి అడుగుపెడుతోన్న వారిని ఆహ్వానిస్తూ, ప్రోత్సహించేలా ముద్ర యోజనను ప్రారంభించాం. సమాజంలోని విస్తారంగా ఉన్న ఈ వర్గాలు స్వావలంబన కలలను సాకారం చేసుకునేందుకు తనాఖా లేకుండా రుణాలు అందించడానికి మేం పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది భారీ విజయాన్ని సాధించింది. ఎస్సీ, ఎస్టీ సోదరసోదరీమణులు.. ఏ సామాజిక వర్గానికి చెందిన మహిళలైనా తమ వ్యాపారాలను ప్రారంభించడానికి బ్యాంకు నుంచి కోటి రూపాయల వరకు అన్‌సెక్యూర్డ్ లోన్ అందించేందుకు స్టాండప్ ఇండియా అనే మరో పథకాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులను రెట్టింపు చేశాం. అణగారిన వర్గాలకు చెందిన లక్షలాది మంది యువకులు, అలాగే లెక్కలేనంత మంది మహిళలు ముద్ర యోజన ద్వారా తమ వ్యాపారాలను ప్రారంభించడం నేను గమనించాను. తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా వాళ్లు ఒకరిద్దరికి ఉపాధి కూడా కల్పించారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ముద్ర యోజన ద్వారా ప్రతి కళాకారుడికి, ప్రతి వర్గానికి సాధికారత కల్పించడానికి బాబాసాహెబ్ కలలను సాకారం చేయడానికి మేం కృషి చేశాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ఎప్పుడూ పట్టించుకోని, పరిగణనలోకి తీసుకోని వారిని మోదీ చూసుకుంటున్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యం. ఈ ఏడాది బడ్జెట్‌లో తోలు పరిశ్రమ, పాదరక్షల పరిశ్రమ వంటి పలు చిన్న రంగాలను పొందుపరిచాం. ఇవి పేదలు, అణగారిన వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయి. బొమ్మలకు సంబంధించిన ఉదాహరణ తీసుకోండి. ఈ వర్గాలకు చెందిన చెందిన వ్యక్తులు బొమ్మల తయారీలో నిమగ్నమై ఉన్నారు. మేం ఈ రంగంపై దృష్టి సారించాం. అనేక పేద కుటుంబాలకు వివిధ రకాల సహాయాన్ని అందించాం. దీని ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా సంవత్సరాలుగా మనం బొమ్మలను దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. కానీ నేడు మనం మునుపటి కంటే మూడు రెట్లు ఎక్కువగా బొమ్మలను ఎగుమతి చేస్తున్నాం. దీని ప్రయోజనం సమాజంలో అట్టడుగున ఉన్నవారికి, కష్టాల్లో ఉన్న వారికి చేరుతోంది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

మన దేశంలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మన మత్స్యకార సమాజం కోసం మేం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటమే కాకుండా.. రైతులు పొందే కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించిన అన్ని ప్రయోజనాలను మత్స్యకార సోదర సోదరీమణులకు కూడా వర్తింపజేశాం. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం కోసం సుమారు 40,000 కోట్ల రూపాయలను కేటాయించాం.  మత్స్య రంగంపై దృష్టి పెట్టాం. ఈ చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన చేపల ఉత్పత్తి రెట్టింపు అయింది, ఎగుమతులు కూడా రెట్టింపు అయ్యాయి. ఇది మన మత్స్యకార సోదర సోదరీమణులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తోంది. వీళ్లు మన సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్లే. వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, మేం వారి సంక్షేమం కోసం కృషి చేశాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

కులతత్వం అనే విషాన్ని వ్యాప్తి చేయాలనే తపనను ఇటీవల పెంచుకున్న వారు కూడా ఉన్నారు. మన దేశంలోని గిరిజన సమాజంలో వివిధ రకాల పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సమూహాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అవి దేశంలో సుమారు 200-300 ప్రదేశాలలో చెల్లాచెదురుగా ఉన్నాయి. వాటి మొత్తం జనాభా చాలా పరిమితం. ఈ సమూహాలు చాలా అణచివేతకు గురయ్యాయి. వారి పరిస్థితులను పరిశీలిస్తే హృదయ విదారకంగా ఉంటుంది. ఈ సమాజం గురించి బాగా తెలిసిన గౌరవనీయ రాష్ట్రపతి నుంచి ఈ అంశంపై మార్గదర్శకత్వం పొందడం నా అదృష్టం. గిరిజన సమాజంలో కొన్ని వర్గాలు అత్యంత వెనుకబడిన పరిస్థితుల్లో ఉన్నాయి. వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు మేం కృషి చేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని 24,000 కోట్ల రూపాయల కేటాయింపులతో పీఎం జన్మన్ యోజనను ప్రారంభించాం. దీని ద్వారా ఈ వర్గాలకు అవసరమైన సౌకర్యాలు, సంక్షేమం లభిస్తోంది. వారు మొదట ఇతర గిరిజన సమాజాలతో సమాన స్థాయికి చేరుకోవటం, తర్వాత వారి పూర్తి సమాజం మొత్తం పురోగతికి వారిని సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం నడుస్తోంది. ఈ దిశగానే మేం పనిచేస్తున్నాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

సమాజంలోని వివిధ వర్గాల ఆందోళనలను మేం పరిగణనలోకి తీసుకున్నాం.  కానీ వెనుకబాటుతనం కారణంగా పట్టించుకోనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో సరిహద్దు గ్రామాల గురించి చెప్పుకోవచ్చు. ఈ గ్రామాలను 'వెనుకబడిన గ్రామాలు' లేదా 'చివరి గ్రామాలు'గా వదిలేశారు. ఈ విషయంలో ఆలోచనలో మార్పును  తీసుకువచ్చిన మొదటి వాళ్లం మేమే. ఈ సుదూర ప్రాంతాలను క్రమంగా విడిచిపెట్టాలను భావనను మార్చాం. బదులుగా సూర్యుని మొదటి, చివరి కిరణాలు పడే ఈ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు మొదటి వరుసలోకి తీసుకురావాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ 'చివరి గ్రామాల' కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాం. వాటికి 'మొదటి గ్రామాలు' అనే హోదా ఇచ్చాం. ఈ గ్రామాలకు అభివృద్ధి పరంగా ప్రాధాన్యతను ఇచ్చి, నిర్దేశిత ప్రణాళికలు, సహాయ సహకారాలు అందజేశాం. ఈ నిబద్ధతను చాటి చెప్పేందుకు, నేను నా మంత్రివర్గ సహచరులను కొన్నిసార్లు మైనస్ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ఈ మారుమూల గ్రామాలకు పంపాను. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిజంగా అర్థం చేసుకోవటానికి, పరిష్కరించటానికి 24 గంటలు వారు అక్కడే ఉన్నారు. అంతేకాకుండా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాల్లో సరిహద్దు గ్రామాల పెద్దలను అతిథులుగా ఆహ్వానిస్తున్నాం. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' మా దార్శనికత కాబట్టి రాష్ట్రపతి 'ఎట్ హోమ్' కార్యక్రమాల్లో వారిని సత్కరిస్తున్నాం. ఇంకా సహాయం అవసరమైన వారిని వెతుకుతూనే ఉన్నాం. వారిని త్వరగా చేరుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కూడా దేశ భద్రతకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని నిరూపితమౌతోంది. దీనిపై కూడా మేం ఎక్కువ దృష్టి పెడుతున్నాం.

 

గౌరవనీయ చైర్మన్ గారూ,
భారత రిపబ్లిక్ 75వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాతల నుంచి స్ఫూర్తి పొందాలని కోరారు.  మన రాజ్యాంగ నిర్మాతల పట్ల గౌరవంతో, వారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని నేను ఎంతో సంతృప్తితో చెప్పగలను. యూసీసీ  (యూనిఫాం సివిల్ కోడ్) అంటే ఏమిటని కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. కానీ రాజ్యాంగ సభలో జరిగిన చర్చలను చదివిన వారు మేము ఆ స్ఫూర్తిని ఇక్కడ ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అర్థం చేసుకుంటారు. కొంతమందికి రాజకీయ అడ్డంకులు ఎదురుకావచ్చు, కానీ మనం మన రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు సాగుతున్నందున దానిని అమలు చేసే ధైర్యాన్ని,  నిబద్ధతను కూడగట్టకోగలుగుతున్నాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

మనం రాజ్యాంగ నిర్మాతలను గౌరవించి, వారి ప్రతి మాటను స్ఫూర్తిగా తీసుకోవాలి. అయితే, స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాజ్యాంగ నిర్మాతల మనోభావాలను ఛిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని నేను చాలా విచారంతో చెబుతున్నా. దేశంలో ఎన్నుకున్న ప్రభుత్వం లేని సమయంలో, ఎన్నికలు జరిగేంత వరకు ఒక తాత్కాలిక ఏర్పాటు ఉంటుందని మీకు తెలుసు. ఆ తాత్కాలిక ఏర్పాటులో, బాధ్యత వహించిన వ్యక్తి వెంటనే రాజ్యాంగంలో సవరణలు చేశారు. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే దానికి అభ్యంతరం ఉండదు. కానీ, వారు దాని కోసం కూడా వేచి చూడలేదు. వారు ఏం చేశారు? భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేశారు. మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. వార్తా పత్రికలపై ఆంక్షలు విధించారు. ఒక వైపు దేశ ప్రజాస్వామ్యానికి ముఖ్య మూలస్తంభమైన పత్రికా స్వాతంత్రాన్ని హరించి మరోవైపు ప్రజాస్వామ్యవాదులమనే ముద్రతో ప్రపంచం చుట్టూ తిరిగారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి అగౌరవం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో దేశంలో తొలి ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన హయాంలో ముంబైలో కార్మిక సమ్మె జరిగింది. ఆ సమయంలో ప్రముఖ గేయరచయిత మజ్రూహ్ సుల్తాన్ పురి 'కామన్ వెల్త్ కా దాస్ హై' అనే కవిత రాశారు. కేవలం ఈ పద్యం పాడినందుకు నెహ్రూ దేశంలోని గొప్ప కవుల్లో ఒకరిని జైలుకు పంపారు. నిరసనకారుల ర్యాలీలో పాల్గొన్నందుకు ప్రముఖ నటుడు బలరాజ్ సాహ్ని కూడా జైలు పాలయ్యారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

లతా మంగేష్కర్  సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ వీర్ సావర్కర్ పై ఒక కవితను రచించి ఆలిండియా రేడియోలో ప్రదర్శించాలని అనుకున్నారు. కేవలం ఈ కారణంగానే హృదయనాథ్ మంగేష్కర్ ను ఆలిండియా రేడియో నుంచి శాశ్వతంగా నిషేధించారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ఆ తర్వాత దేశం ఎమర్జెన్సీ కాలాన్ని కూడా చూసింది. అధికారం కోసం రాజ్యాంగాన్ని,   రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కారు. ఈ విషయం దేశానికి తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో ప్రముఖ సినీ నటుడు దేవ్ ఆనంద్ ను ఎమర్జెన్సీకి బహిరంగంగా మద్దతివ్వాలని ఒత్తిడి చేశారు. అయితే ఎమర్జెన్సీకి మద్దతిచ్చేందుకు దేవ్ ఆనంద్ ఎంతో ధైర్యంతో నిరాకరించారు. ఫలితంగా,  దూరదర్శన్ లో దేవానంద్ నటించిన అన్ని సినిమాల ప్రసారాన్ని నిషేధించారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడేవారు దశాబ్దాల పాటు దాన్ని తమ జేబులో పెట్టుకున్నారు. దాని ఫలితమే ఇది. వారు ఎన్నడూ రాజ్యాంగాన్ని గౌరవించలేదు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

కిశోర్ కుమార్ కాంగ్రెస్ తరఫున పాడటానికి నిరాకరించారు, ఆ ఒక్క తప్పు కారణంగా, కిశోర్ కుమార్ పాటలన్నింటిని ఆలిండియా రేడియోలో నిషేధించారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ఎమర్జెన్సీ రోజుల ఆ దృశ్యాలు ఇప్పటికీ మన ముందున్నాయనిపిస్తుంది. ప్రజాస్వామ్యం, మనుషుల పట్ల గౌరవం గురించి మాటలు చెప్పేవారు, గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఇష్టపడేవారు... ఎమర్జెన్సీ సమయంలో జార్జి ఫెర్నాండెజ్ తో సహా దేశంలోని గొప్ప నాయకులను సంకెళ్లు వేసి జైలుకు పంపారు. పార్లమెంటు సభ్యులను, దేశంలోని ప్రజానాయకుల ను కూడా సంకెళ్లు, గొలుసులతో బంధించారు. రాజ్యాంగం అనే పదం వారి నోటికి సరిపోలేదు. .

గౌరవనీయ చైర్మన్ గారూ,

అధికార హంగులకు, రాజవంశపు అహంకారానికి కోట్లాది కుటుంబాలను నాశనం చేశారు, దేశాన్ని ఒక కారాగారంగా మార్చేశారు. దీని వల్ల దేశవ్యాప్తంగా ఒక దీర్ఘకాల పోరాటం కొనసాగింది. చివరికి తమకు తిరుగే లేదని భావించిన వారు ప్రజాశక్తికి తలవంచక తప్పలేదు. ప్రజల బలంతో ఎమర్జెన్సీ రద్దయింది.. ఇది భారతీయుల నరనరాల్లో ప్రవహించే ప్రజాస్వామ్య భావన ఫలితం. మన గౌరవ ఖర్గే గొప్ప శ్లోకాలను చెప్పడానికి చాలా ఇష్టపడతారు, గౌరవ ఛైర్మన్, మీరు కూడా దాన్ని ఆస్వాదిస్తున్నట్లున్నారు. నేను ఎక్కడో ఒక శ్లోకం చదివాను: ఆటగాడికేం తెలుసు- దీపాన్ని వెలిగించడానికి మనం ఎన్ని తుఫానులను అధిగమించామో.

గౌరవనీయ చైర్మన్ గారూ,

సీనియర్ నాయకుడైన మా గౌరవ ఖర్గే  పట్ల నాకు చాలా గౌరవం ఉంది, నేను ఎల్లప్పుడూ ఆయనను గౌరవిస్తాను. ప్రజాజీవితంలో ఇంత సుదీర్ఘకాలం కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. ఈ దేశంలో శరద్ పవార్ అయినా, ఖర్గే అయినా, ఇక్కడ కూర్చున్న మన దేవెగౌడ అయినా అందరూ తమ జీవితంలో అసాధారణ విజయాలు సాధించారు. ఖర్గే జీ, ఈ విషయాలు మీ ఇంట్లో వినిపించవు, అందుకే నేను చెప్పాలి. ఈసారి ఖర్గే కవితలు చదవడం చూశాను, అయితే, ఆయన పంచుకున్న విషయాలను మీరు చక్కగా పట్టుకున్నారు.  “ఈ కవిత ఎక్కడిదో చెప్పండి” అని మీరు అడిగారు. ఆ కవితలు ఎప్పుడు రాశారో ఆయనకు తెలుసు. కానీ లోపల కాంగ్రెస్ లో పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది, వారు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి ఇది మంచి వేదిక అని భావించి ఇక్కడ వ్యక్తీకరించాలని నిర్ణయించుకున్నారు. అందుకే నీరజ్ కవిత్వం ద్వారా ఇక్కడి పరిస్థితిని వివరించారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

కవి నీరజ్ నుంచి కొన్ని పంక్తులు ఈ రోజు ఖర్గేతో పంచుకోవాలనుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీరజ్ రాసిన వాక్యాలు ఇవి. “ఇప్పుడెక్కడ చూసినా చీకటే ఉంది, సూర్యుడు ఉదయించాలి, ఏ విధంగానైనా కావచ్చు, కాలం మారాలి” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో నీరజ్ ఈ కవిత రాశారు. 1970లో కాంగ్రెస్ అన్ని చోట్లా అధికారంలో ఉన్నప్పుడు నీరజ్ రాసిన మరో కవితా సంకలనం 'ఫిర్ దీప్ జలేగా' పేరుతో ప్రచురితమైంది. హరి ఓం కు ఈ విషయం తెలుసు. అప్పట్లో ఆయన సంకలనం బాగా ప్రాచుర్యం పొందింది. 'ఫిర్ దీప్ జలేగా'లో ఆయన చాలా ముఖ్యమైన విషయం చెప్పారు, ‘నా దేశం విచారంగా ఉండకూడదు, నా దేశం నిరాశగా ఉండకూడదు, దీపం వెలుగుతుంది, చీకటి తొలగిపోతుంది.‘ మన అదృష్టాన్ని చూడండి, మన స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్ పేయి కూడా 40 సంవత్సరాల క్రితం (సూర్యుడు ఉదయిస్తాడు, చీకటి పోతుంది , కమలం వికసిస్తుంది) అన్నారు. నీరజ్  చెప్పినట్టు, కాంగ్రెస్ హయాంలో వారికి సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, కానీ దేశం అనేక దశాబ్దాల పాటు అంధకారంలో ఉంది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

పేదల సాధికారత కోసం మా హయాంలో, మా ప్రభుత్వం ద్వారా చేసిన పనులు గతంలో ఎన్నడూ జరగలేదు. పేదలకు సాధికారత కల్పించడం, పేదరికాన్ని అధిగమించడమే లక్ష్యంగా విధానాలను రూపొందించాం. నా దేశంలోని పేదల సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అవకాశం ఇస్తే ఎలాంటి సవాళ్లనైనా అధిగమిస్తారు. పేదలు ఈ విషయాన్ని రుజువు చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొంది, అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించడంలో విజయం సాధించారు. ఇది మాకు గర్వకారణం, ఎందుకంటే ఇది ఒక గొప్ప సాధన. పేదరికం నుంచి బయటపడిన వారు తమ కృషితో, ప్రభుత్వంపై నమ్మకంతో, అలాగే పథకాలను ఆధారం  చేసుకుని ముందుకు సాగారు. ఈ రోజు, వారిలో చాలామంది పేదరికాన్ని దాటి కొత్త మధ్య తరగతిగా మారారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

మా ప్రభుత్వం  కొత్త మధ్యతరగతి,  మధ్యతరగతి కి గట్టి అండగా నిలుస్తోంది.. వారి కోసం ఎంతో నిబద్ధతను కొనసాగిస్తున్నాం. మధ్య తరగతి, కొత్త మధ్య తరగతి ఆకాంక్షలు ఈ రోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రేరణగా, దేశానికి కొత్త శక్తిగా, అభివృద్ధికి ప్రధాన పునాదిగా మారాయి. మధ్య తరగతి, కొత్త మధ్య తరగతి సామర్థ్యాలను మరింత పెంచాలని భావిస్తున్నాం. ఈ బడ్జెట్‌లో, మధ్య తరగతిపై ప్రధానమైన పన్ను భారం శూన్యానికి సమీపంగా తగ్గించే చర్యలు తీసుకున్నాం. 2013లో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండేది. ఈ రోజు పన్ను మినహాయింపును రూ.12 లక్షల వరకు పొడిగించాం. 70 ఏళ్లు పైబడిన వారు, ఏ సామాజికవర్గానికి చెందిన వారైనా, ఏ నేపథ్యం ఉన్న వారైనా ఇప్పుడు ఆయుష్మాన్ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు. దీని వల్ల అత్యధికంగా లబ్దిపొందుతున్నది మధ్యతరగతిలోని వృద్ధులే.  

గౌరవనీయ చైర్మన్ గారూ,

దేశంలో నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించి పౌరులకు అందించాం. వీటిలో కోటికి పైగా ఇళ్లను నగరాల్లో నిర్మించారు. ఇల్లు కొనుగోలు చేసే వారికి గతంలో భారీ మోసాలు ఎదురయ్యేవి, అందువల్ల వారికి భద్రతను కల్పించడం అత్యవసరం అయింది. మధ్యతరగతి వారి సొంతింటి కలలకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి ముఖ్యమైన సాధనంగా దోహదపడే రెరా చట్టాన్ని ఈ సభలో ఆమోదించాం. గృహనిర్మాణ ప్రాజెక్టుల ఆలస్యం, మధ్యతరగతి ప్రజల సొమ్ము నిలిచిపోవడం, వాటి ప్రయోజనాలు పెండింగ్ లో ఉండటం వంటి అంశాలపై దృష్టి సారించే స్వమిహ్ (తక్కువ, మధ్య ఆదాయ ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక విండో) చొరవను ఈసారి బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేసేందుకు ఈ బడ్జెట్ లో రూ.15 వేల కోట్లు కేటాయించాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

నేడు ప్రపంచం చూసిన, గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న స్టార్టప్ విప్లవానికి ఎక్కువగా మధ్యతరగతికి చెందిన యువ పారిశ్రామికవేత్తలే నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా జీ20 సదస్సు సందర్భంగా దేశవ్యాప్తంగా 50-60 చోట్ల జరిగిన సమావేశాల అనంతరం యావత్ ప్రపంచం భారత్ వైపు ఆసక్తిగా చూస్తోంది. ఒకప్పుడు భారత్ ను ఢిల్లీ, ముంబై, బెంగళూరులకే పరిమితం చేసిన ప్రజలు ఇప్పుడు దేశ విస్తృతతను పూర్తిగా గుర్తిస్తున్నారు. ఈరోజు, భారత పర్యాటక రంగం పట్ల ప్రపంచ ఆకర్షణ పెరిగింది. పర్యాటకం అభివృద్ధి చెందితే, అనేక వ్యాపార అవకాశాలు వస్తాయి, ఇది మధ్య తరగతికి ఎంతో ప్రయోజనం చేకూర్చి, కొత్త ఆదాయ వనరులను అందిస్తుంది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

నేడు మన మధ్యతరగతి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది, ఇది అపూర్వం. ఇది దేశానికి అపారమైన బలాన్ని సృష్టిస్తుంది, భారత మధ్యతరగతి ఇప్పుడు 'వికసిత్ భారత్' సంకల్పాన్ని సాకారం చేయడానికి సన్నద్ధమైందని నాకు తెలుసు. ఈ లక్ష్యసాధన దిశగా వారు మనతో పాటు నడుస్తున్నారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

'వికసిత్ భారత్' సాధనలో దేశంలోని యువత అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. జనాభాపరమైన పాత్ర పైనే దృష్టి పెడుతున్నాం. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులే ‘వికసిత్ భారత్’ అతిపెద్ద ప్రయోజనదారులుగా మారతారు. వారు పెద్దవారయ్యే కొద్దీ, దేశ అభివృద్ధి ప్రయాణం కూడా వారితో పాటు ముందుకు సాగుతుంది. మన పాఠశాలలు, కళాశాలల్లోని యువతే ఈ ప్రగతికి పునాది. గత 10 సంవత్సరాలుగా, మేము ఈ పునాదిని బలోపేతం చేయడానికి సుస్పష్టమైన వ్యూహంతో పనిచేశాం. 21వ శతాబ్దపు విద్యావిధానం ఎలా ఉండాలనే దానిపై ఇంతకు ముందెన్నడూ ఆలోచించకపోవడంతో మూడు దశాబ్దాల తర్వాత కొత్త జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చాం. ఈ విధానం కింద అనేక కార్యక్రమాలు ఉన్నాయి, వాటిలో ఒకటి పి ఎమ్ శ్రీ పాఠశాలలు. ఇప్పటికే 10,000 నుంచి 12,000 పి ఎమ్ శ్రీస్కూళ్లను ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళ్తున్నాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

మేము తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం విద్యా విధానంలో మార్పు. మాతృభాషలోనే బోధనకు, పరీక్షలకు ప్రాధాన్యం ఇచ్చాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన సమాజంలోని కొన్ని ప్రాంతాలపై పట్టు ఉన్న వలసవాద మనస్తత్వం అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి, వాటిలో ఒకటి మన భాష. మన మాతృభాష తీవ్ర అన్యాయానికి గురైంది. పేద, దళిత, గిరిజన, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు భాష మాట్లాడలేక తరచూ అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఇది వారికి తీరని అన్యాయం. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అనే మంత్రం నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వదు, అందుకే దేశంలో మాతృభాషలో విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పాను. పిల్లలు తమ మాతృభాషలోనే డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని కోరుకుంటున్నాను. ఇంగ్లిష్ నేర్చుకునే అవకాశం లేని వారికి వారి సామర్థ్యాన్ని పరిమితం చేయలేం. దీని కోసం ఒక గొప్ప మార్పు తీసుకువచ్చాం. అందువల్ల ఈరోజు పేద కుటుంబాల పిల్లలు, వితంతువుల పిల్లలు కూడా వైద్యులు, ఇంజినీర్లు కావాలని కలలు కంటున్నారు. గిరిజన యువత కోసం ఏకలవ్య మోడల్ స్కూళ్లను విస్తరించాం. పదేళ్ల క్రితం సుమారు 150 ఏకలవ్య పాఠశాలలు ఉండేవి. ప్రస్తుతం 470 ఏకలవ్య పాఠశాలలు ఉండగా, మరో 200 ఏకలవ్య పాఠశాలలను ప్రారంభించే ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం.


 

గౌరవనీయ చైర్మన్ గారూ,

మిలిటరీ స్కూళ్లలోనూ మేం గణనీయమైన సంస్కరణలు తెచ్చాం. ఆడపిల్లలకు కూడా ఈ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించాం. మిలిటరీ స్కూల్ లో విద్యార్థిగా ఉన్న వ్యక్తిగా మీకు తెలుసు.. గతంలో మిలిటరీ స్కూళ్లలో ఆడపిల్లలకు ప్రవేశం ఉండేది కాదు. మిలిటరీ స్కూళ్ల ప్రాధాన్యం, వాటి సమర్థత మీకు తెలిసిందే. మీలాంటి వ్యక్తులను అవి తీర్చిదిద్దాయి. ఇప్పుడు మన దేశ ఆడపిల్లలకు కూడా ఆ అవకాశం లభిస్తుంది. వారికీ మిలిటరీ స్కూళ్ల ద్వారాలను తెరిచాం. నేడు వందలాది మంది మన ఆడబిడ్డలు దేశభక్తి నిండిన వాతావరణంలో చదువుకుంటున్నారు. దేశం కోసం బతకాలన్న స్ఫూర్తి వారిలో సహజంగానే పెరుగుతోంది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

యువతను తీర్చిదిద్దడంలో ఎన్ సీసీ (నేషనల్ క్యాడెట్ కోర్) కీలక పాత్ర పోషిస్తుంది. మనలో ఎన్ సీసీతో సంబంధమున్న వారికి తెలుసు.. ఆ వయస్సులో, జీవితంలోని ఆ దశలో వ్యక్తిత్వ వికాసానికి, సంపూర్ణాభివృద్ధికి అదొక సువర్ణావకాశం. ప్రాపంచిక అవగాహనను కూడా అందిస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా గత కొన్నేళ్లలో ఎన్ సీసీ విస్తరించింది. ఒకప్పుడు దానిని వదిలిపెట్టేశాం. 2014 కన్నా ముందు దాదాపు 14 లక్షలుగా ఉన్న ఎన్ సీసీ క్యాడెట్ల సంఖ్య నేడు 20 లక్షలకు చేరింది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ఏదైనా కొత్తగా చేయాలన్న, అసాధారణంగా నిలవాలన్న ఉత్సాహం, శక్తి, తపన దేశ యువతలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ అభియాన్ ను నేను ప్రారంభించినప్పుడు.. చాలా నగరాల్లో అనేక యువజన సంఘాలు స్వతంత్రంగా, స్వచ్ఛందంగా స్వచ్ఛతా ప్రచారాన్ని నేటికీ తమదైన రీతిలో ముందుకు తీసుకెళ్తుండడాన్ని నేను చూశాను. మురికివాడల్లో విద్యను ప్రోత్సహించడం కోసం కొందరు పనిచేస్తుండగా.. మరికొందరు వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఇవన్నీ చూసి దేశ యువతకు కావలసింది ఓ అవకాశమన్న విషయాన్ని మేం గ్రహించాం. సమష్టి కృషి కావాలి. ఇందుకోసం ఉద్యమ స్థాయిలో మై భారత్ ను ప్రారంభించాం. మై భారత్, మై భారత్! నేడు 1.5 కోట్ల మందికి పైగా యువత దీనిలో నమోదు చేసుకుని ప్రస్తుత జాతీయ అంశాలపై చర్చల్లో భాగస్వాములవుతున్నారు. చర్చిస్తూ, అవగాహనను పెంచుకుంటూ క్రియాశీలకంగా ఇందులో పాల్గొంటున్నారు. వారికి పూసగుచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. తమదైన శైలిలో, సొంత శక్తియుక్తులతో వారు ముందుకుపోతూ గొప్ప విజయాలు సాధిస్తున్నారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

క్రీడారంగం... క్రీడాస్ఫూర్తిని పురిగొల్పుతోంది. క్రీడలకు విస్తృత వ్యాప్తి ఉన్న దేశంలో ఆ స్ఫూర్తి సహజంగానే పెరుగుతుంది. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం మేం వివిధ కోణాల్లో పనిచేయడం మొదలుపెట్టాం. మన దేశ యువత రాణించే అవకాశం కల్పించడానికి మౌలిక సదుపాయాలు, ఆర్థిక సాయం పరంగా అపూర్వమైన సహకారాన్ని అందించాం. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టీవోపీఎస్), ఖేలో ఇండియా వంటివి మన క్రీడా వ్యవస్థలో సంపూర్ణమైన పరివర్తన తీసుకురాగల సమర్థత కలిగిన కార్యక్రమాలు. వాటి ఫలితాలను మనం ఇప్పటికే చూస్తున్నాం. గత దశాబ్ద కాలంగా అన్ని అంతర్జాతీయ క్రీడల్లోనూ భారత్ తనదైన ముద్ర వేస్తూ తన సత్తా చాటుతోంది. దేశ యువత తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. మన ఆడపిల్లలు కూడా అదే శక్తితో భారత్ శక్తిని ప్రపంచానికి చాటుతున్నారు.

గౌరవనీయ చైర్మన్ గారూ,

అభివృద్ధి చెందుతున్న స్థాయి నుంచి అభివృద్ధి చెందినదిగా ఎదిగే దిశగా ఒక దేశ ప్రస్థానంలో సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అయితే, మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. మౌలిక సదుపాయాలు గొప్ప బలాన్నిస్తాయి. అభివృద్ధి చెందుతున్న స్థాయి నుంచి అభివృద్ధి చెందినదిగా ఒక దేశ ప్రయాణం మౌలిక సదుపాయాల మీదుగానే సాగుతుంది. మేం వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మౌలిక సదుపాయాల గురించి చెప్పాలంటే.. సకాలంలో వాటిని పూర్తిచేయడం అత్యావశ్యకం. జాప్యం జరిగితే.. మనం దానికోసం ఎన్ని ప్రణాళికలు వేసినా, దాని ఆవశ్యకతను గుర్తించినా దేశానికి ప్రయోజనం ఉండదు. అది పన్ను చెల్లింపుదారుల ధనాన్నీ వృథా చేస్తుంది. దేశం ఆ ప్రయోజనాన్ని కోల్పోతుంది. ఏళ్ల తరబడి జాప్యం వల్ల మాటల్లో చెప్పలేని భారీ నష్టాలు వాటిల్లుతాయి. కాంగ్రెస్ హయాంలో జాప్యాలు, అవరోధాలు సంప్రదాయంగా మారాయి. ఏ ప్రాజెక్టులను అనుమతించాలో, వేటికి అవరోధాలు కల్పించాలో నిర్ణయించడం వారి రాజకీయాల్లో భాగమైపోయింది. ప్రతీదీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే చూసేవారు. మంత్రప్రదమైన ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ను వారు అనుసరించలేదు. ఈ రకమైన కాంగ్రెస్ సంస్కృతి నుంచి దేశానికి విముక్తి కలిగించడం కోసం ప్రగతి అనే వ్యవస్థను మేం ప్రవేశపెట్టాం. ఈ వేదిక ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు వివరణాత్మకంగా సమీక్షిస్తున్నాను. ఒక్కోసారి డ్రోన్లను కూడా ఉపయోగించి వీడియో రికార్డులు చేయడం, సంబంధిత విభాగాలన్నింటితో ప్రత్యక్షంగా చర్చిస్తూ ఈ ప్రాజెక్టుల పురోగతిని చురుగ్గా సమీక్షిస్తున్నాను. రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, ఒక శాఖ మరో శాఖతో సమన్వయం చేసుకోవడంలో విఫలం కావడం వంటి వివిధ కారణాలతో దాదాపు 19 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. ఈ సమస్యలన్నింటిపైనా నేను సమీక్షించాను. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం మన ప్రగతి కార్యక్రమాన్ని అధ్యయనం చేసి చాలా సానుకూలంగా నివేదిక ఇచ్చింది. ప్రగతి నుంచి స్ఫూర్తిని పొందడం ద్వారా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తేవచ్చని వారు సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ ఈ సూచన చేశారు. ఈ జాప్యాల వల్ల దేశం ఎంతలా నష్టపోయిందో చెప్పడానికి గణాంకాలతో సహా కొన్ని ఉదాహరణలు చెప్పదలచుకున్నాను. ఏ ఒక్కరో ఉద్దేశపూర్వకంగా దీనికి కారణమయ్యారని నేను చెప్పడం లేదు. కానీ, ఆ సంస్కృతి పెరిగి విస్తృతంగా ప్రభావం చూపింది. ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ ను చూడండి.. వ్యవసాయం గురించి, రైతుల గురించి మనం మంచి ప్రసంగాలు చేస్తాం. అవి వినడానికి చాలా బాగుంటాయి. ప్రజలను ఊరికే మభ్యపెట్టడం వల్ల కలిగే నష్టమేమిటి? పెట్టుబడులు శూన్యం.. మాటలు చెప్పడమే తప్ప నిజంగా పనులేమీ జరగవు. ఉత్తర ప్రదేశ్ లో వ్యవసాయం కోసం సరయూ కాల్వ ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు 1972లో ఆమోదం లభించింది. ఒక్కసారి ఆలోచించండి! ఇది 1972లో ఆమోదం పొందింది. అయిదు దశాబ్దాలుగా ఇది అసంపూర్తిగానే ఉండిపోయింది. 1972లో తలపెట్టి, ప్రణాళిక రూపొందించి కాగితాలపై ఆమోదం పొందినప్పటికీ.. మేమొచ్చిన తర్వాతే 2021లో అది పూర్తయ్యింది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైలు మార్గానికి 1994లో ఆమోదం లభించింది. కానీ, ఇది ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉంది. మూడు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు 2025లో పూర్తి చేశాం.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ఒడిశాలోని హరిదాస్ పూర్ - పరదీప్ రైలు మార్గానికి 1996లో ఆమోదం లభించింది. ఇది కూడా ఏళ్ల తరబడి నిలిచిపోయింది. మా హయాంలో 2019లో పూర్తయింది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

అస్సాంలోని బోగీబీల్ బ్రిడ్జికి 1998లో ఆమోదం లభించింది. దీన్ని 2018లో మా ప్రభుత్వం పూర్తి చేసింది. పనులు స్తంభించిపోవడం, జాప్యం, తప్పుదోవ పట్టించడం... ఈ సంస్కృతి దేశానికి ఎంతటి నష్టాన్ని కలిగించిందో చెప్పేందుకు ఇలాంటి వందలాది ఉదాహరణలు ఇవ్వగలను. తన పాలనలో దేశం సాధించాల్సిన పురోగతిని కొనసాగించకపోవడం ద్వారా కాంగ్రెస్ ఎంత నష్టం చేసిందో మీరు ఊహించవచ్చు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో సరైన ప్రణాళికలు, వాటిని సకాలంలో అమలు చేయడం కీలకం. ఇందుకోసం ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ను రూపొందించాం. డిజిటల్ ప్రపంచంపై ఆసక్తి ఉన్న వారికి ప్రధానమంత్రి గతి శక్తి గురించిన అవగాహన చాలా ముఖ్యం. రాష్ట్రాలు కూడా దీనిని ఉపయోగించుకోవాలని నేను సూచిస్తున్నాను. ప్రధానమంత్రి గతిశక్తి వేదికలో దేశంలోని వివిధ రంగాలకు సంబంధించి 1600 సమాచార కేంద్రాలు (డేటా లేయర్లు) ఉన్నాయి. వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఆ ప్రక్రియను సులభరతం చేయడానికి ఇది దోహదపడుతుంది. దీనిని సత్వరం అమలు చేయవచ్చు. నేడు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో గతిశక్తి వేదిక ఒక మౌలిక సాధనంగా మారింది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

తమ తల్లిదండ్రులు ఇన్ని కష్టాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో, దేశం ఎందుకు అలాంటి స్థితికి చేరాల్సి వచ్చిందో నేటి యువత అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారు దీన్ని అర్థం చేసుకోవాలి. గత దశాబ్ద కాలంగా డిజిటల్ ఇండియా విషయంలో మనం క్రియాశీలకంగా వ్యవహరించకపోయి ఉంటే, చర్యలు తీసుకోకపోయి ఉంటే, నేడు మనకున్న సౌకర్యాలను పొందడానికి అనేక సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చేది. మన క్రియాశీల నిర్ణయాలు, చర్యల వల్లే.. నేడు మనం కాలానుగుణంగా, కొన్ని విషయాల్లో కాలాతీతంగా కూడా ముందుకు సాగుతున్నాం. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా 5జీ సాంకేతికత మన దేశంలో విస్తరిస్తోంది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

నేను గత అనుభవాలతో మాట్లాడుతున్నాను. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఏటీఎంలు లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానాలేవైనా.. మనకన్నా చాలా ముందుగానే అవి అనేక దేశాలకు చేరాయి. కానీ, అవి భారత్ కు రావడానికి దశాబ్దాలు పట్టింది. ఆరోగ్యం, వ్యాధులు లేదా మశూచీ, బీసీజీ వంటి టీకాల విషయాన్ని పరిశీలిస్తే.. మనం వలస పాలనలో ఉన్నప్పుడే ప్రపంచం వాటిని అమలు చేసింది. కొన్ని దేశాలు అప్పటికే వాటిని అందిపుచ్చుకున్నా భారత్ లోకి మాత్రం దశాబ్దాల తర్వాత వచ్చాయి. పోలియో టీకా కోసం దశాబ్దాల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రపంచం అప్పటికే ముందుకు సాగింది.. మనం వెనుకబడిపోయాం. దేశ వ్యవస్థపై కాంగ్రెస్ పట్టు బిగించడమే ఇందుకు కారణం. ప్రభుత్వంలో ఉన్నవారికే అన్నీ తెలుసని, అన్నింటినీ తామే నిర్వహించగలమని భావించారు. ఇది లైసెన్స్ పర్మిట్ రాజ్ కు కారణమైంది. లైసెన్స్ పర్మిట్ రాజ్ ఎంతగా అణచివేతకు కారణమైందో దేశ యువతకు చెప్పదలచుకున్నాను – ఇది దేశం పురోగతి సాధించకుండా అడ్డుకుంది. లైసెన్స్ పర్మిట్ రాజ్ కాంగ్రెస్ అస్తిత్వంగా మారింది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

కంప్యూటర్లు వచ్చిన తొలినాళ్లలో ఎవరైనా కంప్యూటర్ ను దిగుమతి చేసుకోవాలనుకుంటే అందుకోసం లైసెన్స్ పొందాల్సి ఉండేది. కంప్యూటర్ ను తేవడం కోసం లైసెన్స్ పొందడానికి కూడా సంవత్సరాలు పట్టేది.

గౌరవనీయ చైర్మన్ గారూ,

ఇల్లు కట్టుకోవాలంటే సిమెంటు కావాలి. అయితే, సిమెంటు కోసం కూడా అనుమతులు తీసుకోవాల్సి వచ్చే రోజులవి. అంతే కాదు చైర్మన్ గారూ.. ఎవరికైనా పెళ్లికో, వేడుకకో చక్కెర కావాలంటే దానికీ లైసెన్స్ కావాల్సి ఉండేది! దేశ యువత ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నేను మాట్లాడుతున్నది బ్రిటిష్ కాలం గురించి కాదు.. స్వతంత్ర భారత్ గురించే... కానీ అది కాంగ్రెస్ శకం. ఆ సమయంలో, తనను తాను ఎంతో జ్ఞానవంతుడిననుకునే కాంగ్రెస్ మాజీ ఆర్థిక మంత్రి.. లైసెన్స్ పర్మిట్ లేకుండా ఏ పనీ చేయలేమని తేల్చేశారు. లైసెన్స్ పర్మిట్ వ్యవస్థ ద్వారానే అన్ని పనులూ జరుగుతాయి. లంచం లేకుండా లైసెన్స్ పర్మిట్లు పొందలేమని కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ సొంత ఆర్థిక మంత్రినే నేనిక్కడ ప్రస్తావిస్తున్నాను. లంచం లేకుండా ఏదీ జరగదని ఆయన అన్నారు. అప్పటికి లంచం అంటే.. దానికి బాధ్యులెవరో, దాని వెనుక ఉన్నదెవరో ఎవరైనా సులభంగానే అర్థం చేసుకోగలరు. ఆ డబ్బు ఎక్కడికి పోయింది? దేశ యువత దీన్ని బాగా అర్థం చేసుకోగలరు. ఈ సభలో కాంగ్రెస్ కు చెందిన గౌరవ సభ్యుడు ఒకరు ఉన్నారు. ఆయన తండ్రి తన సొంత డబ్బుతో.. ‘సొంత డబ్బుతో’ ఓ కారు కొనుక్కోవాలనుకున్నారు. అయితే, కాంగ్రెస్ హయాంలో ఆ కారు కొనేందుకు ఆయన 15 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 

గౌరవనీయులైన అధ్యక్షా,
ఒక స్కూటరును కొనాలంటే, దాని కోసం బుక్ చేసుకొని, డబ్బును చెల్లించాలి. ఎనిమిది ఏళ్లు మొదలు పదేళ్ల వరకు పట్టేదనేది మనకందరికీ తెలిసిన విషయమే. కొన్ని సందర్భాల్లో, వేరే దారి లేక స్కూటరును అమ్మాల్సివస్తే, ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకోవాల్సివచ్చేది... అంటే వారు దేశాన్ని ఎలా నడిపారో! ఇదొక్కటే కాదు, గ్యాస్ సిలిండర్ల విషయానికి వస్తే ఎంపీలకు కూపన్లు ఇచ్చేవారు. మీరు మీ ప్రాంతంలో 25 మందికి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వవచ్చని ఎంపీలకు చెబుతూ, ఆ కూపన్లను ఇచ్చే వాళ్లు. ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరాల్సివచ్చేది. టెలిఫోన్ కనెక్షన్‌ను పొందడానికి కూడా చాలా పెద్దదైన, తల ప్రాణం తోకకు వచ్చేటంత ప్రక్రియ ఉండేది. దేశ యువత ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఈ రోజు పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తున్న వారు.. దేశం కోసం వారు నిజంగా ఏం చేశారు అనేది యువతీయువకులకు తెలియాలి.

గౌరవనీయులైన అధ్యక్షా,
ఈ ఆంక్షలు, లైసెన్స్ రాజ్ విధానాలు ప్రపంచంలో ఆర్థిక వృద్ధి వేగాన్ని బాగా మందగమనం పాలైన స్థితికి భారత్‌ను నెట్టాయి. అయితే ఈ బలహీన వృద్ధి రేటును, వైఫల్యాన్ని ప్రపంచం ఏమని పిలిచేదో మీకు తెలుసా? దీనిని ‘హిందూ వృద్ధి రేటు’ అని ప్రస్తావించే వారు. ఇది యావత్తు సమాజానికి పూర్తి అవమానకరం. వైఫల్యమేమో ప్రభుత్వంలో భాగం పంచుకొన్న వారిదీ... పని చేసే సామర్థ్యం లోపించిన, అవగాహన లేమితో కూడిన, రాత్రింబగళ్లు అవినీతిలో మునిగిపోయిన వారిదీ. మరో వైపు, ‘హిందూ వృద్ధి రేటు’ అనే పరిభాషతో ఒక భారీ సమాజాన్ని అగౌరవం పాల్జేశారు.
 
గౌరవనీయులైన అధ్యక్షా,
ఆర్థిక వ్యవస్థను రాచ కుటుంబం సరిగా నిర్వహించకపోవడంతోనూ, తప్పు విధానాలను అలంబించడంతోనూ యావత్తు సమాజం ప్రపంచ వ్యాప్తంగా నిందకు లోనై, అపఖ్యాతి పాలైంది. ఏమైనప్పటికీ, మనం చరిత్రను పరిశీలిస్తే, భారత్ ప్రజలు అనుసరించిన మార్గం, విధానాలు ఏనాడూ లైసెన్స్ రాజ్ పైన గాని, లేదా అనుమతిపత్రాల పైన గాని ఆధారపడి లేవని తెలుసుకొంటాం. భారతీయులు సదా దాపరికం లేనితనాన్ని నమ్ముతూ వచ్చారు. వేల సంవత్సరాల పాటు, ప్రపంచంలో మనం స్వేచ్ఛాయుత వ్యాపారాన్ని నిర్వహిస్తూ, దానిని విస్తరించడానికి శ్రమించిన తొలి సముదాయాల్లో ఒక సముదాయంగా మనం నిలుస్తూ వచ్చాం.

వందల ఏళ్ల కిందట, భారతదేశ వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి- ఎలాంటి ఆంక్షలు, అడ్డంకులనేవే ఎరుగకుండా- దూర దేశాలకు వెళ్లే వారు. ఇది మన సహజ సంస్కృతిగా ఉండింది. దీనికి మనం ప్రస్తుతం భరత వాక్యం పలికాం. ప్రస్తుతం, పూర్తి ప్రపంచం భారత్ ఆర్థిక సత్తాను గుర్తిస్తున్న క్రమంలో, ప్రపంచ దేశాలు మన దేశాన్ని చాలా వేగవంతంగా ముందుకు పోతున్న దేశంగా భావిస్తున్నాయి. ఇవాళ, ప్రపంచం భారత్ వృద్ధి రేటును గమనిస్తోంది.  మనం మన ఆర్థిక వ్యవస్థను విస్తరించుకొంటూ పోతున్న స్థితిని చూసి దేశంలో అంతా గర్వపడుతున్నారు.

గౌరవనీయులైన అధ్యక్షా,
దేశం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పంజా నుంచి విడివడి, ఉపశమనాన్ని ఇచ్చే నిట్టూర్పును తీసుకొని కొత్త ఎత్తులకు ఎగురుకుంటూ పోతోంది. కాంగ్రెస్ కాలం నాటి లైసెన్స్ రాజ్‌కు, దాని లోపభూయిష్ఠ విధానాలకు స్వస్తి పలికి, మేం ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ)ని ప్రోత్సహిస్తున్నాం. దేశంలో తయారీకి ఊతాన్నివ్వడానికి, మేం పీఎల్ఐ (ఉత్పాదనతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల) పథకాన్ని ప్రవేశపెట్టాం. ఎఫ్‌డీఐకి (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) సంబంధించిన సంస్కరణల్ని అమలుచేశాం. ప్రస్తుతం, మన దేశం ప్రపంచంలో రెండో అతి పెద్ద మొబైల్ తయారీ దేశంగా ఎదిగింది. ఇది వరకు, మనం మన ఫోన్లలో చాలా వరకు ఫోన్లను దిగుమతి చేసుకొంటూ వచ్చాం. కానీ ఇప్పుడు, మనం మన దేశాన్ని మొబైళ్ల ఎగుమతిదారు దేశంగా తీర్చిదిద్దాం.

గౌరవనీయులైన అధ్యక్షా,
ప్రస్తుతం, భారత్ రక్షణ సామగ్రి తయారీకి మారుపేరుగా నిలిచింది. గడచిన పది సంవత్సరాల్లో, మన రక్షణ ఉత్పాదనల ఎగుమతులు పదింతలు పెరిగాయి. అవి పదేళ్లలో పది రెట్లు వృద్ధి చెందాయి.

గౌరవనీయులైన అధ్యక్షా,
సోలార్ మాడ్యూల్ తయారీ సైతం భారత్‌లో పది రెట్ల మేర పెరిగింది. ప్రస్తుతం, మన దేశం ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండో అతి పెద్ద దేశంగా ఉంది. గత పది సంవత్సరాల్లో మన యంత్రాల ఎగుమతులు, మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు శరవేగంగా వృద్ధి చెందాయి. గత పదేళ్లలో, భారత్ ఆటవస్తువుల ఎగుమతులు మూడు రెట్లకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈ పదేళ్లలో, వ్యవసాయ-రసాయనిక ఎగుమతులు కూడా హెచ్చాయి. కరోనా మహమ్మారి కాలంలో, మనం భారత్‌లో టీకామందులను, మందులను తయారు చేసి,150కి పైగా దేశాలకు సరఫరా చేశాం. మన ఆయుర్వేదిక ఉత్పత్తులు, మూలికా ప్రధాన ఉత్పత్తులు కూడా అమాంతం పెరిగాయి, అవి ఇప్పటికీ జోరుమీదున్నాయి.

గౌరవనీయులైన అధ్యక్షా,
కాంగ్రెస్ ఖాదీ విషయంలో ఏదైనా సార్థకమైన పనిని చేసి ఉన్నట్లయితే, వారు స్వాతంత్ర్య సమరం నుంచి కొంత ప్రేరణను పొంది ముందడుగును వేస్తున్నారని నేను భావించేవాడిని. కానీ వారు ఆ పని కూడా చేయలేదు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ మొట్టమొదటిసారి ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల స్థాయిని మించిపోయింది. గత పది సంవత్సరాల్లో, దీని ఉత్పత్తి నాలుగింతలైంది. ఈ తయారీ ముఖ్య ప్రయోజనమంతా మన ఎంఎస్ఎంఈ రంగానికి దక్కింది. ఇది దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాకాశాలు ఏర్పడడానికి దారితీసింది.  

గౌరవనీయులైన అధ్యక్షా,
మనం ప్రజలకు ప్రతినిధులం. ప్రజలకు సేవ చేస్తున్న వాళ్లం. ఒక ప్రజాప్రతినిధికి దేశం పెట్టుకున్న, సంఘం పెట్టుకున్న లక్ష్యమే సర్వస్వంగా ఉండాలి. మరి సేవలనందిస్తామని చేసిన ప్రమాణాన్ని తలదాల్చి పాటుపడడమే ప్రజా ప్రతినిధులందరి కర్తవ్యం.

గౌరవనీయులైన అధ్యక్షా,
‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించే క‌ృషిలో మనకు చేతనైనంత వరకు ప్రయత్నాలను చేయాలని యావత్తు దేశం ఆశపడుతోంది. ఇది మనందరి ఉమ్మడి బాధ్యత. ఇది దేశ ప్రజల సంకల్పం. ఇది ఏ ఒక్క ప్రభుత్వానిదో లేదా వ్యక్తిదో కాక, భారత్‌లోని 140 కోట్ల మంది పౌరుల బాధ్యత. సభాపతి గారూ, నేను చెబుతున్న మాటల్ని బాగా గుర్తుపెట్టుకోగలరు.. ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని పట్టించుకోని వారిని ఈ దేశ ప్రజలు కూడా పట్టించుకోబోరు. ప్రతి ఒక్కరు కలసి ప్రయాణించాల్సిందే, దేశంలో మధ్యతరగతి వర్గాలు, యువతీయువకులు వారందరి శక్తిసామర్థ్యాల్ని ఉపయోగించి భారత్‌ను ముందుకు నడపడానికి పూర్తి నిష్ఠతో పనిచేయాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి ఎవరూ దీనిలో భాగం కాకుండా ఉండజాలరు.    

గౌరవనీయులైన అధ్యక్షా,
దేశం పురోగతి మార్గంలో సాగుతూ అభివృద్ధి పరంగా కొత్త విజయాల్ని సాధిస్తున్న క్రమంలో, మనం పోషించాల్సిన పాత్రకు ప్రాముఖ్యం పెరిగింది. ప్రభుత్వంలో వ్యతిరేకతలు అనేవి ప్రజాస్వామ్యంలో స్వాభావికం. ప్రజాస్వామ్యంలో  విధానాలపై విమర్శలు చేయడానికి కూడా దాని వంతు బాధ్యతంటూ ఉంది. ఏమైనా, తీవ్ర విమర్శనాత్మక వైఖరి, తీవ్ర నిరాశావాదం, సొంత ప్రయోజనాల సాధన మీదే దృష్టి పెడుతూ  ఇతరుల ప్రయత్నాల్ని అడ్డుకొంటూ ఉండడం ‘వికసిత్ భారత్’ బాటలో ఆటంకాల్ని నిలపొచ్చు. ఈ ధోరణుల నుంచి మనం బయటపడితీరాలి. మనం ఎలాంటి పనులను చేశామో పదే పదే పునఃపరిశీలించుకుంటూ ఉండాలి. ఈ రోజు సభలో చేసిన చర్చల్లో వ్యక్తమైన ఉత్తమ ఆలోచనలు మనకు ముందున్న దోవలో ఎలా ప్రయాణించాలో చెబుతుంటాయని, మనం మన తీరును సమీక్షించుకొంటామని నేను నమ్ముతున్నాను. రాష్ట్రపతి ప్రసంగాన్నుంచి స్ఫూర్తిని అందుకుందాం. రాష్ట్రపతికి, పార్లమెంటులోని గౌరవనీయులైన సభ్యులకు కూడా మరోసారి నేను నా హృదయపూర్వక కృతజ్ఞత‌లు తెలియజేస్తున్నాను.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
GIFT City scales new heights as India's 1st international finance and IT hub

Media Coverage

GIFT City scales new heights as India's 1st international finance and IT hub
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi’s interaction with BJP booth Karyakartas from Assam ahead of Assembly Elections
March 30, 2026
‘Seva, Sangathan, and Samarpan’, PM Modi says Assam’s BJP karyakartas embody the true spirit of the organisation
When every booth becomes strong, victory becomes certain, and Assam’s future becomes brighter: PM Modi lauding the efforts of BJP karyakartas
The importance of protecting Assam’s identity and tackling issues like illegal infiltration is not just a political issue but one of security, culture and justice: PM Modi
Over a dozen key peace agreements have brought lasting stability, especially in regions like Bodoland: PM Modi

PM Modi interacted with BJP booth karyakartas across Assam as a part of the ‘Mera Booth, Sabse Mazboot’ programme via NaMo App. He energised booth-level members and reaffirmed that every booth remains the foundation of the party’s strength and electoral success. He hailed the true spirit of Assam, calling it a powerful force driving BJP’s growth in the Northeast.

Opening the interaction, PM Modi described himself as a karyakarta first, expressing pride in working alongside the grassroots cadre. He lauded booth karyakartas for their tireless dedication, emphasising that their connect with every household is the BJP’s greatest strength. “Booth jeetoge toh chunav jeetoge,” he reiterated.

Highlighting Assam’s transformation over the past decade, PM Modi underlined the shift from instability and violence to peace, progress, and prosperity under the double engine government. He noted that over a dozen key peace agreements have brought lasting stability, especially in regions like Bodoland.

He stressed the importance of educating first-time voters about Assam’s past challenges, urging karyakartas to actively communicate the contrast between earlier regimes marked by unrest and the current era of stability. He encouraged innovative booth-level engagements to emotionally connect with voters while showcasing developmental achievements.

PM Modi also called for focused outreach to beneficiaries of key welfare schemes such as PM Awas Yojana, PM-Kisan, Ujjwala, and others, urging workers to compile beneficiary lists and strengthen direct engagement. He emphasised turning polling day into a Jan Utsav, with collective participation ensuring maximum voter turnout.
Encouraging youth and women’s participation, PM Modi praised Assam’s Nari Shakti and highlighted initiatives empowering women economically and socially. He urged workers to leverage platforms like the NaMo App and social media to share real-life stories.

Addressing key regional concerns, PM Modi underscored the importance of protecting Assam’s identity and tackling issues like illegal infiltration, calling it not just a political issue but one of security, culture, and justice. He urged karyakartas to raise awareness at the grassroots and support efforts ensuring the rights and dignity of indigenous communities.

He also highlighted the empowerment of tea garden workers through land rights and welfare schemes, calling it a historic step towards dignity and long-term security for lakhs of families.

Reaffirming the guiding principles of ‘Seva, Sangathan, and Samarpan’, PM Modi said that Assam’s BJP karyakartas embody the true spirit of the organisation.

He concluded with a powerful call to action:“When every booth becomes strong, victory becomes certain, and Assam’s future becomes brighter.”