ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తల బృందం ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి సీజన్ ప్రారంభమయ్యే ముందు అన్ని వివరాలతో ఆధునిక వ్యవసాయం గురించిన సమాచారాన్ని రైతులకు అందిస్తారు: ప్రధానమంత్రి
ఈ కార్యక్రమం భారత వ్యవసాయాన్ని వికసిత్ భారత్‌కు ప్రధానాధారం చేయాలన్న సంకల్పంతో పనిచేస్తుంది: ప్రధాని
భారత్‌ తన సొంత అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ప్రపంచ ఆహార సరఫరాదారుగా కూడా ఎదగాలి: ప్రధాని
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ వ్యవసాయంలో ఆధునీకరణకు చోదకశక్తిగా ఉంటూ

జై జగన్నాథ్‌!

దేశంలోని రైతుల కోసం ఈ రోజు జగన్నాథ స్వామి ఆశీస్సులతో ‘వ్యవసాయాభివృద్ధి సంకల్ప కార్యక్రమం’ (వికసిత కృషి సంకల్ప్‌ అభియాన్‌) పేరిట విశిష్ట పథకానికి శ్రీకారం చుడుతున్నాం. రుతుపవనాలు వచ్చేశాయి... ఖరీఫ్ సాగుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 12 నుంచి 15 రోజుల్లో శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రగతిశీల రైతులతో కూడిన 2,000 బృందాలు దేశవ్యాప్తంగా గ్రామ సందర్శనకు బయల్దేరుతాయి. ఈ కార్యక్రమంపై 700కుపైగా జిల్లాల్లోని లక్షలాది రైతులకు ఈ బృందాలు అవగాహన కల్పిస్తాయి. ఈ విశిష్ట కార్యక్రమం, దీనిపై విస్తృత ప్రచారం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత వ్యవసాయ రంగ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ రైతులందరితోపాటు ప్రచార బృందాలకు నా శుభాకాంక్షలు.

మిత్రులారా!

మన దేశంలో వ్యవసాయం సంప్రదాయకంగా రాష్ట్ర పరిధిలోని అంశం. కాబట్టి, ప్రతి రాష్ట్రం తన సొంత వ్యవసాయ విధానాలను రూపొందిస్తూ రైతు ప్రయోజనాల దిశగా చర్యలు చేపడుతుంది. అయితే, వేగంగా మారుతున్న కాలమాన పరిస్థితుల్లో దేశ వ్యవసాయ రంగంలో సమగ్ర సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. మన రైతులు రికార్డు స్థాయిలో దిగుబడి సాధించడం ద్వారా గాదెలు నింపుతున్నారు. అయితే, మార్కెట్లు విస్తరించడమే కాకుండా వినియోగదారు ప్రాధాన్యాలు కూడా మారిపోతున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలతో రైతుల సంయుక్త కృషి ద్వారా వ్యవసాయ వ్యవస్థలో మార్పుల దిశగా ఇదొక వినమ్ర ప్రయత్నం. భారత వ్యవసాయ రంగ ఆధునికీకరణే దీని లక్ష్యం. అందుకే, రైతులతో ప్రత్యక్ష చర్చలను ప్రారంభించాలన్నది ఈ కార్యక్రమ ధ్యేయం. దీనికింద మన శాస్త్రవేత్తల బృందాలు “ప్రయోగశాల నుంచి కమతానికి” అనే భావనను భారీస్థాయిలో ముందుకు తీసుకెళ్తాయి. విస్తృత సమాచారం ప్రాతిపదికన వారు రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ సాగు సమయం మొదలయ్యే ముందు వారికి మద్దతిస్తారు.

మిత్రులారా!

మన వ్యవసాయ శాస్త్రవేత్తలు గత దశాబ్దాలుగా విలువైన పరిశోధనలతో అద్భుత ఫలితాలు సాధించారు. మరోవైపు మన ప్రగతిశీల రైతులు తమ సొంత ప్రయోగాలతో వ్యవసాయంలో గణనీయ మార్పులు తెస్తూ దిగుబడుల పెంపుద్వారా గొప్ప విజయం సాధించారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలు, ప్రగతిశీల రైతుల పద్ధతుల సాఫ్యలాలు మన వ్యవసాయ సమాజానికి మరింత చేరువ కావడం చాలా అవసరం. మీరందరూ ఈ దిశగానే కృషి చేస్తున్నారు... కానీ, ఇప్పుడు దీన్ని సరికొత్త శక్తితో ముందడుగు వేయాల్సి ఉంది. ఇందుకు ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్’ విశిష్ట అవకాశమిస్తుంది.

మిత్రులారా!

‘వికసిత భారత్’ సంకల్ప సాకారం కోసం దేశ వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అందుకే, కేంద్ర ప్రభుత్వం అనేక కీలక రంగాలపై దృష్టి సారిస్తోంది. ఈ మేరకు- రైతు ఉత్పత్తికి గిట్టుబాటు ధర లభించేలా చూడటం ఎలా? వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమెలా? జాతీయ అవసరాల మేరకు పంటల సాగు ఎలా? సొంత ఆహార అవసరాలు తీర్చుకుంటూ ప్రపంచ ఆహార సరఫరాదారుగా భారత్‌ రూపొందడం ఎలా? భారత్ ఆహార భాండంగా మారడం ఎలా? వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కోవడం ఎలా? తక్కువ నీటితో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి ఎలా? హానికర రసాయనాల నుంచి భూమాతకు రక్షణ ఎలా? వ్యవసాయ ఆధునికీకరణకు ఏంచేయాలి? శాస్త్ర-సాంకేతికతల ఫలితాలను పొలాలకు చేర్చడం ఎలా? ఇత్యాది అనేకానేక అంశాలపై గత 10–11 ఏళ్లుగా మా ప్రభుత్వం నిరంతరం విస్తృత స్థాయిలో కృషి చేసింది. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా రైతులలో సాధ్యమైనంత ఎక్కువగా అవగాహన పెంచడం మీ కర్తవ్యం.

మిత్రులారా!

ఈ సందర్భంగా మనం దృష్టి సారించాల్సిన ముఖ్యాంశం- రైతుకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చడం. ఇందులో భాగంగా పొలం గట్లపై సౌర ఫలకాల ఏర్పాటు, దేశంలో విస్తరిస్తున్న మధుర విప్లవం (తేనెటీగల పెంపకం)తో అధికశాతం రైతుల అనుసంధానం, వ్యర్థాలుగా పరిగణించే పంట అవశేషాలతో ఇంధనోత్పత్తి, వ్యర్థం నుంచి అర్థం (సంపద సృష్టి), ఏ తరహా నేల ఎలాంటి చిరుధాన్యం (శ్రీ అన్న) సాగుకు అనుకూలమో గుర్తించడం, వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు మార్గాన్వేషణ వంటి కార్యకలాపాలు చేపట్టాలి. నేడు గోబర్‌’ధన్‌’ యోజన ద్వారా వట్టిపోయిన పశువులు కూడా ఆదాయ వనరుగా మారుతున్నాయి. ఈ అంశాలన్నిటినీ మనం రైతు సోదరీసోదరులతో కూర్చుని చర్చిస్తూ, వారికి వివరణాత్మక సమాచారం అందించాలి.

మిత్రులారా!

భారత వ్యవసాయ రంగాన్ని ‘వికసిత భారత్’ పునాదిగా మార్చడంలో ఇదో మహా సంకల్పం. రైతులంతా వీలైనన్ని ఎక్కువ సందేహాలను గ్రామ సందర్శనకు వచ్చే శాస్త్రవేత్తల ముందుంచాలని నా సూచన. అలాగే శాస్త్రవేత్తలు, అధికారులను కూడా నేను కోరుతున్నదేమిటంటే- ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు... ఇదొక ఒక జాతీయ లక్ష్యం. కాబట్టి, దేశ సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమ లక్ష్యాన్ని సాధించండి. రైతు సంధించే ప్రతి ప్రశ్నకూ బదులివ్వండి... అదే సమయంలో వారి విలువైన సూచనలను కూడా నమోదు చేయండి. ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్’ మన ‘అన్నదాత’లకు సరికొత్త ప్రగతి ద్వారాలు తెరుస్తుంది.  ఈ ఆశాభావనతో అన్ని బృందాలకు, రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s healthcare sector seeing a fundamental digital transformation: Report

Media Coverage

India’s healthcare sector seeing a fundamental digital transformation: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 ఫెబ్రవరి 2026
February 11, 2026

Empowering India: PM Modi's Policies Fueling Innovation, Jobs, and Sustainability