‘‘ప్రపంచం ఆందోళనలో మునిగితే భారత్ ఆశల ఊపిరి పోస్తుంది’’
‘‘భారత్ నేడు ప్రతి రంగంలో... ప్రతి అంశంలో అనూహ్య వేగంతో పురోగమిస్తోంది’’
‘‘భారత్ వర్ధమాన దేశం మాత్రమే కాదు... ప్రపంచ శక్తిగానూ ఎదుగుతోంది’’
‘‘ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరే సామర్థ్యంగల అత్యంత యువ దేశాలలో భారత్ ఒకటి’’
‘‘భారత్ ఇప్పుడు దూరదృష్టిగల ఆలోచన విధానాలతో ముందడుగేస్తోంది’’
‘‘వికసిత భారత్ సంకల్పంలో భాగస్వాములైన 140 కోట్ల మంది ప్రజలే దాని సాకారానికి సారథులు’’
‘‘భార‌త్‌కు రెండు రకాల ‘ఎఐ’ సానుకూలత ఉంది... అందులో ఒకటి కృత్రిమ మేధ కాగా- మరొకటి ఆకాంక్షాత్మక భారతం’’
‘‘నామమాత్రపు బంధాలను భారత్ విశ్వసించదు... మా సంబంధ బాంధవ్యాలకు నమ్మకం.. విశ్వసనీయతలే పునాదులు’’
‘‘సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ ద్వారా ప్రపంచం కోసం సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలకు భారత్ కొత్త బాటలు వేసింది’’
‘‘డిజిటల్ ఆవిష్కరణలు... ప్రజాస్వామ్య విలువల జమిలి మనుగడ సాధ్యమేనని భారత్ రుజువు చేసింది’’

ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.


మిత్రులారా,


గత 4-5 సంవత్సరాలను పరిశీలిస్తే, చాలా చర్చల్లో ఒక సాధారణ అంశం ఉంది: అది ఆందోళన... భవిష్యత్తు గురించి ఆందోళన. కరోనా సమయంలో ప్రపంచ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలోనన్న ఆందోళన నెలకొంది. కొవిడ్ వ్యాప్తి చెందడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరిగాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వాతావరణ మార్పుల గురించి మహమ్మారి ఆందోళనలను పెంచింది. ఆ తర్వాత మొదలైన యుద్ధాలు చర్చలను, ఆందోళనలను తీవ్రతరం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ లో అంతరాయాలు, అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించింది. ఈ ఉద్రిక్తతలు, సంఘర్షణలు, ఒత్తిళ్లు ప్రపంచ శిఖరాగ్ర సదస్సులు, సదస్సులలో చర్చనీయ అంశాలుగా మారాయి. ఇప్పుడు చర్చల దృష్టి ఎక్కువగా ఆందోళనల మీదే కేంద్రీకృతమైనప్పుడు, భారత్ లో ఎలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి? ఇది పూర్తి పరస్పర విరుద్ధం. ఇక్కడ మనం ' భారత శతాబ్దం' గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కల్లోలం నెలకొన్న నేపథ్యంలో భారత్ ఆశాదీపంగా మారింది. ప్రపంచ పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయవని కాదు-అవి చేస్తాయి. భారత్ కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది, కానీ ఇక్కడ సానుకూల భావన ఉంది, ఇది మనమందరం అనుభూతి చెందవచ్చు. అందుకే 'భారత శతాబ్దం' అనే మాట వినిపిస్తోంది.
 

మిత్రులారా,


నేడు ప్రతి రంగంలోనూ భారత్ పురోగమిస్తున్న వేగం, స్థాయి అమోఘం. ఈ విషయంలో భారత్ కు పోటీ లేదు. మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 125 రోజులు పూర్తయింది. ఈ 125 రోజుల అనుభవాలను మీతో పంచుకుంటాను. 125 రోజుల్లో 3 కోట్ల కొత్త పక్కా ఇళ్లు పేదలకు మంజూరయ్యాయి. 125 రోజుల్లో రూ.9 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించాం. 125 రోజుల్లో 15 కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాం. 8 కొత్త విమానాశ్రయాల పనులు ప్రారంభించాం. అలాగే ఈ 125 రోజుల్లో యువతకు రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీ అందించాం. రూ.21 వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం ఏర్పాటు చేశాం. భారత్ లో జరుగుతున్న పనుల పరిధిని చూడండి-125 రోజుల్లోనే 5 లక్షల ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను అమర్చారు. 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక చెట్టు) కార్యక్రమం కింద 90 కోట్లకు పైగా చెట్లను నాటారు. అంతే కాదు 125 రోజుల్లో 12 కొత్త పారిశ్రామిక కేంద్రాలకు ఆమోదం తెలిపాం. ఈ 125 రోజుల్లో మన సెన్సెక్స్, నిఫ్టీ 6 నుంచి 7 శాతం పెరిగాయి. మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 650 బిలియన్ డాలర్ల నుంచి 700 బిలియన్ డాలర్లు దాటాయి. భారత్ సాధించిన విజయాల జాబితా చాలా పెద్దది, నేను గత 125 రోజుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ 125 రోజుల్లో భారత్ లో జరిగిన అంతర్జాతీయ చర్చలను కూడా మీరు గమనించాలి. 125 రోజుల్లో భారత్ లో ఎలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి? టెలికాం, డిజిటల్ ఫ్యూచర్ పై అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి, గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ జరిగింది, గ్లోబల్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ పై చర్చలు భారత్ లో జరిగాయి, పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయాన భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సులు భారత్ లో జరిగాయి.


మిత్రులారా,


ఇది కేవలం కార్యక్రమాల జాబితా మాత్రమే కాదు. ఇది భారత్ తో ముడిపడి ఉన్న ఆశల జాబితా కూడా. ఇది భారతదేశ దిశ, ప్రపంచం ఆశలు రెండింటినీ వివరిస్తుంది. ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించే అంశాలు ఇవే. వీటిపై చర్చల కోసం ప్రపంచం నేడు భారత్ వైపు చూస్తోంది.


మిత్రులారా,


ఈరోజు భారత్ లో చాలా కార్యకలాపాలు జరుగుతున్నందున, మా మూడో  పదవీకాలంలో మేము సాధించిన పురోగతి వేగం అనేక రేటింగ్ ఏజెన్సీలు భారత్ వృద్ధి అంచనాలను పెంచడానికి దారితీసింది. ఇక్కడ ఉండి, భారత్ వృద్ధిలో అధిక పెట్టుబడులు పెట్టిన మార్క్ మోబియస్ వంటి నిపుణులు భారత్ లో పెట్టుబడుల అవకాశాల పట్ల ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్లోబల్ ఫండ్స్ తమ మూలధనంలో కనీసం 50 శాతాన్ని భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆయన సలహా ఇవ్వడం బలమైన సందేశాన్ని పంపింది.


మిత్రులారా,


భారత్ నేడు అభివృద్ధి చెందుతున్న దేశం,  అభివృద్ధి చెందుతున్న శక్తి కూడా. పేదరికం సవాళ్లను మేము అర్థం చేసుకున్నాం. ప్రగతి మార్గాన్ని ఎలా రూపొందించాలో మాకు తెలుసు. మా ప్రభుత్వం వేగంగా విధానాలను రూపొందిస్తోంది. నిర్ణయాలు తీసుకుంటోంది.  కొత్త సంస్కరణలను ప్రవేశపెడుతోంది. ప్రజాజీవితంలో నేను చాలా మందిని కలిశాను. 'మోదీజీ, మీరు వరుసగా మూడు పర్యాయాలు గెలిచారు. ఎంతో సాధించారు. భారత్ ను ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. ఎన్నో మైలురాళ్లను దాటించారు. ఎన్నో అపరిష్కృత అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో సంస్కరణలు అమలు చేశారు. మరి మీరు ఇంకా ఎందుకు నిర్విరామంగా పనిచేస్తున్నారు? ఆ అవసరం ఏమిటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ మేము కలలతో, సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి విశ్రాంతికి తావుండదు.
 

గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. అది సరిపోతుందా?గత పదేళ్లలో దాదాపు 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం.16 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. అది చాలా...? గత పదేళ్లలో 350కి పైగా కొత్త మెడికల్ కాలేజీలు,15కు పైగా ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటయ్యాయి. సరిపోతుందా? గడచిన పదేళ్లలో భారత్ లో 1,50,000కు పైగా స్టార్టప్ లను ఏర్పాటు చేశాం. 8 కోట్ల మంది యువత తమ వెంచర్లను ప్రారంభించడానికి ముద్రా రుణాలు తీసుకున్నారు. దీనితో అభివృద్ధి ఆకలి తీరిపోతుందా? నా సమాధానం: లేదు, ఇది సరిపోదు. నేడు, యుక్త వయసుతో  ఉరకలేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి.  ఈ యువ భారత్ సామర్థ్యం మనల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. అందుకోసం మనం చేయాల్సింది చాలా ఉంది. దానిని వేగంగా చేయాలి.


మిత్రులారా,


భారత్ ఆలోచనల్లో, వైఖరిలో వచ్చిన మార్పును మీరు గమనించి ఉంటారు. సాంప్రదాయకంగా, అర్థం చేసుకోదగిన విధంగా, ప్రభుత్వాలు తమ పనిని గత ప్రభుత్వాలతో పోలుస్తాయి. అందులో నాకు తప్పేమీ కనిపించడం లేదు. "ఇంతకు ముందు ఏమి ఉంది, ఇప్పుడు మనకు ఏమి ఉంది?" అని అడగడం ద్వారా వారు తమ పురోగతిని పోల్చుకుంటారు. ఎందుకంటే వారు గత ప్రభుత్వాల కంటే తాము మెరుగ్గా చేశామని సంతృప్తి చెందుతారు. చాలా ప్రభుత్వాలు గత 10-15 సంవత్సరాలతో తమను తాము పోల్చుకున్నాయి. దీనిని వారి విజయానికి కొలమానంగా ఉపయోగించాయి. మేం చేస్తున్నది కూడా అదే.  ఇది చాలా సహజం. కానీ ఇప్పుడు ఈ మార్గం మమ్మల్ని సంతృప్తి పరచడం లేదు. నిన్నటిని ఈ రోజుతో పోల్చి సంతోషించడం చాలదు. మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాం, ఎంత దూరం వెళ్లాలి, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఎప్పటికి అక్కడికి చేరుకుంటాం అనే విషయాలపైనే ఇప్పుడు మా దృష్టి. ఈ కొత్త దృక్పథం మొత్తం ప్రభుత్వ యంత్రాంగంతో నా పనిని నడిపిస్తుంది.


ఇప్పుడు భారత్ ముందుచూపుతో  సాగుతోంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) సంకల్పం ఈ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. 'వికసిత్ భారత్' సంకల్పాన్ని సాధించే దిశగా మనం ఎంతవరకు వచ్చామో, ఇంకా ఎంత చేయాల్సి ఉందో, ఎంత వేగంతో, ఏ స్థాయిలో పనిచేయాలో అంచనా వేయాలి. ఇది నిర్దేశిత లక్ష్యాలతో కూడిన ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు. నేడు, 140 కోట్ల మంది భారత ప్రజలు 'వికసిత్ భారత్' కోసం ఈ సంకల్పంలో భాగమయ్యారు. వారు దానిని నడిపిస్తున్నారు. ఇది కేవలం ప్రజల భాగస్వామ్య ఉద్యమం మాత్రమే కాదు, భారత్ ఆత్మవిశ్వాస ఉద్యమం కూడా. 'వికసిత్ భారత్' కోసం ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ పై పనిచేయడం ప్రారంభించినప్పుడు, లక్షలాది మంది తమ సూచనలను పంపారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రభుత్వం, సామాజిక సంస్థలు చర్చలు,వాదనలు నిర్వహించాయి. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా భారత్ వచ్చే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకుంది. వికసిత్ భారత్ పై చర్చలు ఇప్పుడు మన అవగాహనలో భాగమయ్యాయి. 'జన్ శక్తి' (ప్రజల శక్తి) ద్వారా 'రాష్ట్ర శక్తి' (జాతీయ బలం) నిర్మాణానికి ఇది గొప్ప ఉదాహరణ అని నేను నమ్ముతున్నాను.
 

మిత్రులారా,


నేడు, భారతదేశానికి మరో ప్రయోజనం ఉంది, ఇది ఈ శతాబ్దాన్ని భారత్ శతాబ్దంగా చేయడంలో కీలకమైనది. ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)  యుగం అని మీ అందరికీ తెలుసు. ప్రపంచం వర్తమానం,  భవిష్యత్తు కృత్రిమ మేధతో ముడిపడి ఉన్నాయి. కానీ భారత్ కు డబుల్ ఎఐ శక్తి ఉంది.

ఇప్పుడు, "ప్రపంచానికి ఒకే ఒక ఎఐ ఉంది, మరి మోదీకి ఈ డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుండి వచ్చింది?" అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రపంచ దృష్టిలో ఎఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మరో ఎఐ అంటే ఆస్పిరేషనల్ భారత్ (ఆకాంక్షాత్మక భారత్) కూడా ఉంది. కృత్రిమ మేధ తో ఆకాంక్షాత్మక భారత్ శక్తి కలిసినప్పుడు, అభివృద్ధి సహజంగానే వేగవంతం అవుతుంది.


మిత్రులారా,


మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు. ఇది దేశ యువతకు అవకాశాలను అందించే కొత్త ద్వారం. ఈ ఏడాది భారత్ ఎఐ మిషన్ ను ప్రారంభించింది. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్టార్టప్స్ ఇలా ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని భారత్ పెంచుతోంది. ప్రపంచానికి మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందించేందుకు కృషి చేస్తున్నాం. క్వాడ్ స్థాయిలో భారత్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ- ఆకాంక్షాత్మక భారత్) విషయంలోనూ భారత్ అంతే నిబద్ధతతో ఉంది. మధ్యతరగతి అయినా, సామాన్య ప్రజలు అయినా, వారి జీవన సౌలభ్యం, వారి జీవన ప్రమాణాలు, చిన్న పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఇలు, యువత లేదా భారతదేశంలోని మహిళలు అయినా- ప్రతి ఒక్కరి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని మేము విధానాలను రూపొందిస్తున్నాం. నిర్ణయాలు తీసుకుంటున్నాం.


మిత్రులారా,


అనుసంధానం (కనెక్టివిటీ)  పరంగా జరుగుతున్న అద్భుతమైన కృషి ఆకాంక్షాత్మక భారత్ కు ఒక ఉదాహరణ. వేగవంతమైన ఫిజికల్ కనెక్టివిటీ, సమ్మిళిత కనెక్టివిటీపై ఎక్కువగా దృష్టి సారించాం. అభివృద్ధిపై ఆకాంక్షలు ఉన్న సమాజానికి ఇది చాలా అవసరం. భారత్ కు ఇది మరింత కీలకం. ఇంతటి వైవిధ్యభరితమైన భౌగోళిక స్వరూపం కలిగిన ఇంత పెద్ద దేశం, దాని సామర్థ్యాన్ని నిజంగా గ్రహించడానికి వేగంగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. అందుకే విమాన ప్రయాణాలపై కూడా దృష్టి పెట్టాం. చెప్పులు  ధరించే వారికి సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నేను మొదట చెప్పినప్పుడు, "భారతదేశంలో ఇది ఎలా సాధ్యమవుతుంది?" అని ప్రతిస్పందన వచ్చింది. కానీ మేం ముందుకు వెళ్లి ఉడాన్ పథకాన్ని ప్రారంభించాం. నేటితో ఉడాన్ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఉడాన్ కింద రెండు స్తంభాలపై పనిచేశాం. మొదట టైర్-2, టైర్-3 నగరాల్లో విమానాశ్రయాల కొత్త నెట్వర్క్ ను నిర్మించాం. రెండోది మేము విమాన ప్రయాణాన్ని చౌకగా,అందరికీ అందుబాటులో ఉంచాం. ఉడాన్ కింద ఇప్పటివరకు 3,00,000 విమానాలు నడవగా, 1.5 కోట్ల మంది సాధారణ పౌరులు ప్రయాణించారు. నేడు, ఉడాన్ కింద 600 కి పైగా మార్గాల్లో విమానాలు  నడుస్తున్నాయి, వీటిలో ఎక్కువ భాగం చిన్న నగరాలను కలుపుతాయి. 2014లో భారత్ లో 70 విమానాశ్రయాలు ఉన్నాయి. నేడు విమానాశ్రయాల సంఖ్య 150 దాటింది. సామాజిక ఆకాంక్ష అభివృద్ధికి ఎలా ఊతమిస్తుందో ఉడాన్ పథకం చూపించింది.
 

మిత్రులారా,


దేశంలోని యువతకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చెబుతాను. భారత యువతను ప్రపంచ వృద్ధికి దోహదపడే శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అందుకే విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఉపాధికి పెద్దపీట వేశాం. గత పదేళ్లుగా ఈ రంగాల్లో మనం చేసిన కృషి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యా ర్యాంకుల్లో  భారత్ పరిశోధన నాణ్యతలో అత్యధిక మెరుగుదల సాధించిన దేశంగా  నిలిచింది. గత 8-9 సంవత్సరాలలో, భారతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం 30 నుంచి  100 కి పెరిగింది. గత పదేళ్లలో క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో భారత్ ఉనికి 300 శాతానికి పైగా పెరిగింది. నేడు, పేటెంట్లు,  ట్రేడ్ మార్క్ ల సంఖ్య ఎన్నడూ లేనంత గరిష్ఠ  స్థాయిలో ఉంది. పరిశోధన-అభివృద్ధిలో ప్రపంచానికి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. భారత్ లో సుమారు 2,500 కంపెనీలు తమ పరిశోధనా కేంద్రాలను కలిగి ఉన్నాయి. భారత్ స్టార్టప్ వ్యవస్థ కూడా అనూహ్యమైన వృద్ధిని సాధించింది.


మిత్రులారా,


భారత్ లో ఈ విస్తృత మార్పులు ప్రపంచ నమ్మకానికి పునాదిగా మారుతున్నాయి. నేడు, భారతదేశం అనేక రంగాలలో ప్రపంచ భవిష్యత్తును రూపొందించడంలో ముందంజలో ఉంది. సంక్షోభ సమయాల్లో ప్రపంచం భారత్ ను విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోంది. కోవిడ్ రోజులను గుర్తు తెచ్చుకోండి- అవసరమైన మందులు, వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల మన సామర్థ్యం మనకు బిలియన్ల డాలర్లను సంపాదించేది, ఇది భారతదేశానికి ప్రయోజనం చేకూరుస్తుంది, కానీ మానవత్వం కోల్పోయేది. అది మన నైతికత కాదు. అవసరమైన సమయంలో వందలాది దేశాలకు మందులు, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లను అందించాం. కష్టకాలంలో భారత్ ప్రపంచానికి తోడ్పడడం సంతృప్తి కలిగిస్తోంది.


మిత్రులారా,


తేలిగ్గా తీసుకునే సంబంధాలను భారత్ ఏర్పరచుకోదు. మన సంబంధాలు నమ్మకం, విశ్వసనీయతపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచం దీనిని అర్థం చేసుకుంది. భారత్ తన ప్రగతితో ప్రపంచానికి ఆనందాన్నిచ్చే దేశం. భారత్ విజయం సాధిస్తే ప్రపంచం బాగుంటుంది. ఉదాహరణకు ఇటీవలి చంద్రయాన్ మిషన్ ను తీసుకుందాం. యావత్ ప్రపంచం దీన్ని పండుగలా జరుపుకొంది. భారతదేశం పురోగమించినప్పుడు, అది అసూయ లేదా ద్వేష భావాలను రేకెత్తించదు. బదులుగా, భారతదేశం పురోగతి మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది కాబట్టి ప్రపంచం సంతోషంగా ఉంటుంది. గతంలో ప్రపంచ వృద్ధిని నడిపించే సానుకూల శక్తిగా భారత్ ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. భారతదేశం ఆలోచనలు, ఆవిష్కరణలు ఉత్పత్తులు శతాబ్దాల పాటు ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. కానీ ఆ తర్వాత కాలం మారింది, భారత్ చాలా కాలం వలసవాదాన్ని భరించింది. దీనివల్ల మనం వెనుకబడిపోయాం. పారిశ్రామిక విప్లవం సమయంలో, భారతదేశం కూడా వలసరాజ్యంగా మారి పారిశ్రామిక విప్లవాల నుంచి ప్రయోజనం పొందలేక పోయింది. ఆ సమయం భారత్ చేతుల్లోంచి జారిపోయింది, కానీ నేడు, ఇది భారత్ సమయం. ఇది ఇండస్ట్రీ 4.0 శకం. భారత్ ఇక బానిస కాదు. మనం 75 సంవత్సరాలుగా స్వేచ్ఛగా ఉన్నాం. అందువల్ల, ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం.
 

మిత్రులారా,


పరిశ్రమ 4.0కు అవసరమైన నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలను భారత్ శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. గత దశాబ్దంలో, అనేక ప్రపంచ వేదికలలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన జీ-20, జీ-7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్నాను. పది రోజుల క్రితం ఆసియాన్ సదస్సు కోసం లావోస్ వెళ్లాను. భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) గురించి దాదాపు ప్రతి శిఖరాగ్ర సమావేశంలో తరచుగా చర్చిస్తారని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. నేడు ప్రపంచం భారత్ డిపిఐని నిశితంగా గమనిస్తోంది. మన ప్రియ మిత్రుడు, భారత్ అభిమాని పాల్ రోమర్ ఇక్కడ మనతో ఉన్నారు. అమెరికాతో పాటు పలు చోట్ల ఆయనతో సంభాషణల్లో అనేక ఆలోచనలను ఆయనతో వివరంగా చర్చించే అవకాశం నాకు లభించింది, మా సంభాషణల్లో, పాల్ భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆధార్, డిజిలాకర్ వంటి కొత్త ఆవిష్కరణలను ప్రశంసించారు. భారత్ ఇంత అద్భుతమైన డీపీఐని ఎలా అభివృద్ధి చేసిందని ప్రధాన శిఖరాగ్ర సమావేశాల్లో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.


మిత్రులారా,


ఇంటర్నెట్ యుగంలో భారత్ మొదటి ప్రయోజనం అందుకోలేక పోయింది. ఈ ప్రయోజనం ఉన్న దేశాలలో, ప్రైవేట్ ప్లాట్ ఫామ్లు  ఆవిష్కరణలు డిజిటల్ స్పేస్ కు నాయకత్వం వహించాయి, ప్రపంచానికి ఒక విప్లవాన్ని తీసుకువచ్చాయి.అయినా, ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయి. అందుకు భిన్నంగా భారత్ ఓ కొత్త నమూనాను ప్రపంచానికి పరిచయం చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా భారత్ కొత్త మార్గాన్ని చూపించింది. ఈ రోజు భారతదేశంలో, ప్రభుత్వం ఒక ప్లాట్‌ఫామ్‌ను నిర్మించింది. దానిపై లక్షలాది కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మన జామ్ కనెక్టివిటీ- జన్ ధన్, ఆధార్, మొబైల్- వేగవంతమైన,లీకేజీ రహిత సేవలను అందించడానికి అద్భుతమైన వ్యవస్థగా మారింది. ఉదాహరణకు మన యూపీఐనే తీసుకుందాం. యుపిఐ కారణంగా భారత్ లో ఫిన్ టెక్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ప్రతిరోజూ, 500 మిలియన్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి, ఇది కార్పొరేషన్ల ద్వారా కాదు, మన చిన్న దుకాణదారులు వీధి వ్యాపారులతో నడుస్తున్నాయి. మన పిఎం గతి శక్తి వేదిక మరో ఉదాహరణ. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమయంలో తలెత్తిన అడ్డంకులను అధిగమించడానికి మేము పిఎం గతి శక్తిని సృష్టించాం. ఈ రోజు, ఇది మన  రవాణా వ్యవస్థను మార్చడానికి సహాయ పడుతోంది. అదేవిధంగా, మన ఒఎన్ డిసి ప్లాట్‌ఫారమ్ ఆన్‌లైన్ రిటైల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి పారదర్శకతను తీసుకువచ్చే ఆవిష్కరణగా నిలుస్తోంది. డిజిటల్ ఇన్నోవేషన్, ప్రజాస్వామ్య విలువలు సహజీవనం చేయగలవని భారత్ నిరూపించింది. సాంకేతిక పరిజ్ఞానం నియంత్రణ, విభజన కోసం కాకుండా సమ్మిళితం, పారదర్శకత, సాధికారతకు ఒక సాధనమని భారత్ నిరూపించింది.


మిత్రులారా,


21వ శతాబ్దపు ఈ శకం మానవ చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలం. ఇటువంటి సమయాల్లో, స్థిరత్వం, సుస్థిరత, పరిష్కారాలు ప్రధాన అవసరాలు. ఇవి మానవాళి మెరుగైన భవిష్యత్తుకు అవసరం. నేడు భారత ప్రజల అచంచల మద్దతుతో భారత్ ఈ రంగాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారిగా దేశ ప్రజలు వరుసగా మూడోసారి ఒకే ప్రభుత్వానికి తమ తీర్పును ఇచ్చారు. ఇది స్థిరత్వ సందేశాన్ని పంపింది. ఇటీవల హరియాణాలో ఎన్నికలు జరగ్గా, ఈ ఎన్నికల్లోనూ భారత ప్రజలు ఈ సుస్థిరతను బలపరిచారు.
 

మిత్రులారా,


వాతావరణ మార్పుల సంక్షోభం సమస్త మానవాళికి సంక్షోభంగా మారింది. దీని పరిష్కారంలో కూడా భారత్ నాయకత్వం వహించే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ వాతావరణ మార్పులలో మన వంతు చాలా తక్కువ. అయినప్పటికీ, మేము హరిత మార్పును మా అభివృద్ధికి ఇంధనంగా మార్చుకున్నాం.  నేడు, సుస్థిరత అనేది మా అభివృద్ధి ప్రణాళికలో ప్రధానమైనది. పొలాల్లో సోలార్ పంపులను ఏర్పాటు చేసే మా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను చూడండి. మా ఈవీ విప్లవం లేదా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ - ఇది పెద్ద పవన విద్యుత్ శక్తి క్షేత్రాలు, ఎల్ఇడి దీపాల ఉద్యమం, సౌర శక్తితో నడిచే విమానాశ్రయాలు లేదా బయోగ్యాస్ ప్లాంట్లపై దృష్టి. మీరు మా కార్యక్రమాలు లేదా పథకాలను వేటినైనా పరిశీలిస్తే, ప్రతి కార్యక్రమం, పథకంలో హరిత భవిష్యత్, హరిత ఉద్యోగాల కోసం బలమైన నిబద్ధత మీకు కనిపిస్తుంది.


మిత్రులారా,


సుస్థిరత, స్థిరత్వంతో పాటు భారత్ ఇప్పుడు పరిష్కారాలపై దృష్టి సారించింది. గత దశాబ్దకాలంగా, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన అనేక పరిష్కారాలపై భారత్ పనిచేసింది. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తులకు తట్టుకోగల మౌలిక సదుపాయాల కూటమి, ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, యోగా, ఆయుర్వేదం, మిషన్ ఎల్ఐఎఫ్ఇ లేదా మిషన్ మిల్లెట్స్ - ఇలా భారతదేశం తీసుకున్న ప్రతి కార్యక్రమం ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తోంది.


మిత్రులారా,


పెరుగుతున్న భారత్ సామర్థ్యాలు ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. భారత్ ఎంత పురోగతి సాధిస్తే ప్రపంచానికి అంత మేలు జరుగుతుంది. భారత్ శతకం కేవలం భారత్ విజయం మాత్రమే కాదు. సమస్త మానవాళి విజయం కావాలన్నదే మా లక్ష్యం. ప్రతి ఒక్కరి ప్రతిభతో పురోగమించే శతాబ్దం, ప్రతి ఒక్కరి ఆవిష్కరణలతో సుసంపన్నమైన శతాబ్దం, పేదరికం లేని శతాబ్దం, ప్రతి ఒక్కరూ పురోగతి సాధించే అవకాశాలు ఉన్న శతాబ్దం, భారత్ ప్రయత్నాలు ప్రపంచానికి సుస్థిరత, శాంతిని తీసుకువచ్చే శతాబ్దం. ఇదే స్ఫూర్తితో నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ అవకాశం కల్పించిన ఎన్డీటీవీకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Apple to invest Rs 100 crore in India renewable energy expansion

Media Coverage

Apple to invest Rs 100 crore in India renewable energy expansion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the valour and duty of the Indian Armed Forces
May 08, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that the courage and valour of the Indian Armed Forces in protecting the honour and dignity of the nation make every citizen proud. He noted that their spirit of sacrificing everything for Mother India is a source of inspiration for all.

The Prime Minister shared a Sanskrit verse-

“स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि |
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ||”

The verse conveys that When one becomes aware of one’s duty, there should be no hesitation or fear of any kind in the mind, because the struggle undertaken to protect religion and honour on the altar of justice is the most excellent and most glorious path to self-welfare for a warrior.