Inaugurates 10 Government Medical Colleges in Maharashtra
Lays foundation stone for upgradation of Dr Babasaheb Ambedkar International Airport, Nagpur
Lays foundation stone for New Integrated Terminal Building at Shirdi Airport
Inaugurates Indian Institute of Skills Mumbai and Vidya Samiksha Kendra, Maharashtra
Launch of projects in Maharashtra will enhance infrastructure, boost connectivity and empower the youth: PM

నమస్కారం!

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...

ముందుగా శివభక్తులైన మహారాష్ట్ర సోదర సోదరీమణులందరికీ నా శుభాభినందనలు.

   మహారాష్ట్రకు ఈ రోజున 10 కొత్త వైద్య కళాశాలల కానుక లభించింది. అలాగే రెండు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు- నాగ్‌పూర్ విమానాశ్రయ ఆధునికీకరణ-విస్తరణసహా షిర్డీ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు గాను రాష్ట్ర ప్రజలకు నా అభినందనలు. గత వారమే థానే, ముంబయి నగరాల్లో నేను పర్యటించాను. ఆ సందర్భంగా మెట్రో లైన్ ప్రాజెక్టుతోపాటు రూ.30,000 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. అంతకుముందు వివిధ జిల్లాల్లో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాను. అనేక నగరాల్లో మెట్రో విస్తరణ కొనసాగుతోంది. కొన్ని విమానాశ్రయాల ఆధునికీకరణ పనులు సాగుతుండగా, రహదారులు, హైవే ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, సౌరశక్తి, జౌళి పార్కుల సంబంధిత ప్రాజెక్టులు ప్రారంభించాం. రైతులు, పశుపోషకుల ప్రయోజనం దిశగా కొత్త కార్యక్రమాలు చేపట్టాం. మహారాష్ట్రలో దేశంలోనే అతిపెద్ద కంటైనర్ రేవు వడవాన్ పోర్టుకు శంకుస్థాపన చేశాం. వివిధ రంగాల్లో ఇంత వేగంతో, ఇంత భారీగా ప్రగతి కార్యక్రమాలు కొనసాగడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు. కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతి రాజ్యమేలిందన్నది వేరే విషయం.

సోదర సోదరీమణులారా!

   కొద్ది రోజుల కిందటే ‘మరాఠీ’కి ప్రాచీన భాష హోదా కల్పించాం. ఒక భాషకు సముచిత గౌరవం లభిస్తే, అది ఆ భాషకు మాత్రమేగాక ఆ తరానికంతటికీ గళమిచ్చినట్లు కాగలదు. ఈ గుర్తింపుతో కోట్లాది మరాఠీ సోదరుల స్వప్నం సాకారమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మరాఠీని ప్రాచీన భాషగా ప్రకటించడంపై అనేక గ్రామాల ప్రజల నుంచి హర్షామోదాలతో నాకు కృతజ్ఞతా సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. అయితే, ఇది కేవలం నా ఒక్కడి ఘనత కాదు... ఇదంతా మీ ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఛత్రపతి శివాజీ మహారాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయుల దీవెనలతోనే మహారాష్ట్రలో ప్రగతి సంకల్పం నెరవేరుతోంది.

మిత్రులారా!

   హర్యానా, జమ్ముకశ్మీర్‌ శాసనసభల ఎన్నికల ఫలితాలు నిన్ననే వెలువడ్డాయి. హర్యానా ఓటర్లు తమ మనోభావన ఏమిటో దేశానికి ప్రస్ఫుటం చేశారు! ఒక ప్రభుత్వం వరుసగా రెండుసార్లు పదవీకాలం పూర్తిచేయడం, మూడోసారి విజయం సాధించడం చరిత్రాత్మకం. కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ విభాగాలు సహా పట్టణ నక్సలైట్ల సమూహం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ, ఆ కుట్రలన్నింటినీ ప్రజలు దీటుగా తిప్పికొట్టారు. దళితుల విషయంలో అసత్యాల వ్యాప్తికి వాళ్లు ఎన్నో కుయుక్తులు పన్నారు. అయినా, వారి ప్రమాదకర ఆలోచనలను దళిత సమాజం పసిగట్టింది. తమ రిజర్వేషన్లను హరించి, ఇతరులకు కేటాయించడం ద్వారా తన ఓటు బ్యాంకును పెంచుకోవాలనే కాంగ్రెస్ కుట్రను వారు గ్రహించారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని దళిత సమాజం బీజేపీ అభ్యర్థులకు రికార్డు స్థాయిలో అండగా నిలిచింది. అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలను గుర్తిస్తూ ‘ఒబిసి’ వర్గం కూడా మా వెంటనే నడిచింది. రైతులను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినా, తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చిందెవరో వారు గుర్తించారు. అలాగే బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై హర్యానా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యువతను తప్పుదారిలోకి మళ్లించాలని కాంగ్రెస్ శతవిధాలా యత్నించింది. కానీ, తమ ఉజ్వల భవిష్యత్తు బీజేపీతోనే సాధ్యమని రాష్ట్ర యువతరం, మహిళలు, కుమార్తెలు,  విశ్వసించారు. మొత్తం మీద ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయినప్పటికీ ఆ వ్యూహాలన్నిటినీ తిప్పికొడుతూ ఇకపై కాంగ్రెస్, అర్బన్ నక్సలైట్ల కుట్రలకు తాము బలి కాబోమని హర్యానా ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు.

 

మిత్రులారా!

   ‘విభజించి పాలించు’ అన్నదే కాంగ్రెస్ సదా అనుసరించే సూత్రం. ఆ పార్టీ తన బాధ్యతారాహిత్యాన్ని పలుమార్లు రుజువు చేసుకుంది. దేశాన్ని చీల్చేందుకు కొత్త కథలు అల్లుతూనే ఉంది. ఓటర్లను తప్పుదోవ పట్టించే కుయుక్తులను ఎన్నడూ మానదు. వారి సిద్ధాంతం చాలా స్పష్టం... ముస్లింలను ఎప్పుడూ భయాందోళనల్లో ఉంచడం, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవడం-బలోపేతం చేసుకోవడమే వారి విధానం. ముస్లింలలో కుల విభేదాల గురించి కాంగ్రెస్‌ నేతలెవరూ నోరెత్తరు. ఆ ప్రస్తావన రాగానే మౌనవ్రతం పూనుతారు. అయితే, హిందూ సమాజంపై చర్చలో మాత్రమే మేమూ ఉన్నామంటూ కులాల ప్రస్తావనతో ముసుగులు తొలగించి బయటకొస్తారు. హిందువుల్లో ఒక కులాన్ని మరో కులానికి పోటీగా నిలపాలన్నది కాంగ్రెస్ వ్యూహం. హిందువులు ఎంతగా చీలిపోతే తమకు అంత ప్రయోజనమని వారు భావిస్తారు. ఏతావాతా రాజకీయ లబ్ధి కోసం హిందూ సమాజాన్ని అయోమయంలో పడేయాలన్నది ఆ పార్టీ వ్యూహం. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఇదే వారి పద్ధతి. తమ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా సమాజంలో విద్వేష వ్యాప్తికి అన్ని మాయోపాయాలనూ ప్రయోగిస్తుంది. కులమత ప్రాతిపదిక రాజకీయాల్లో కాంగ్రెస్ తలమునకలుగా ఉంది. ఎన్నికల్లో విజయం కోసం హిందూ సమాజ విభజనే కాంగ్రెస్ రాజకీయాలకు పునాదిగా మారింది. ‘సర్వజన హితాయ... సర్వజన సుఖాయ’ (అందరి హితం.. అందరి సుఖం) అనే ఆదర్శాన్ని, సనాతన సంప్రదాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతోంది. ఎన్నో ఏళ్లపాటు దేశాన్నేలిన ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలనే తపనతో రోజుకో విద్వేష రాజకీయ కుట్ర చేస్తోంది. సీనియర్ నాయకులు కూడా తమ పార్టీ పరిస్థితి చూసి నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వేషానికి అతిపెద్ద కర్మాగారంలా తయారైంది. ఈ పరిస్థితిని మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే గ్రహించారు. అందుకే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆ పార్టీ రద్దు కాలేదుగానీ, నేడు దేశాన్ని నాశనం చేయడానికి వెనుకడటం లేదు. అందువల్ల మనమంతా  మరింత జాగరూకతతో, అప్రమత్తంగా మెలగాలి.

మిత్రులారా!

   సమాజ విచ్ఛిన్నం దిశగా కాంగ్రెస్ కుయుక్తులను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టగలరని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. దేశ ప్రగతికి అగ్ర ప్రాధాన్యంతో మహారాష్ట్ర ఒక్కతాటిపై నిలిచి బీజేపీకి, మహాయుతి కూటమికి ఓటు వేయాలని పిలుపునిస్తున్నాను. హర్యానాలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలు అంతకన్నా భారీ విజయం ప్రసాదించాలని ప్రజలను అభ్యర్థించారు.

మిత్రులారా!

   దేశాభివృద్ధికి అవిరళ కృషిలో భాగంగా గ‌డచిన పదేళ్లలో ప్ర‌భుత్వం అత్యాధునిక మౌలిక స‌దుపాయాల‌ కల్పన ‘మ‌హా యజ్ఞం’ ప్రారంభించింది. మేమివాళ కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన ఒక్కటే కాదు... ఆరోగ్యకర, సుసంపన్న మహారాష్ట్రకూ పునాది వేస్తున్నాం. నేడు ఒకేసారి 10 వైద్య కళాశాలలను ప్రారంభించడమంటే కేవలం కొత్త విద్యా సంస్థల ఏర్పాటుకు పరిమితం కాదు. లక్షలాది ప్రజల జీవితాలు మెరుగుపరచే మరో ‘మహా యజ్ఞం.’ ఈ మేరకు థానే, అంబర్‌నాథ్, ముంబయి, నాసిక్, జల్నా, బుల్దానా, హింగోలి, వాషిమ్, అమరావతి, భంక్‌దారా, గడ్చిరోలి జిల్లాల్లో ఈ వైద్య కళాశాలలు ఆయా జిల్లాలతోపాటు పరిసర ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు సేవా కేంద్రాలుగా మారుతాయన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు నేడు 6,000 సీట్లు అందుబాటులో ఉండగా ఈ కళాశాలలతో అదనంగా 900 సీట్లు వస్తాయి. వైద్య విద్యలో 75,000 సీట్లను అదనంగా చేర్చాలన్న దేశ సంకల్పం నెరవేరడంలో నేటి కార్యక్రమం ఓ కీలక ముందడుగు.

మిత్రులారా!

   వైద్య విద్యాభ్యాసాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేశాం. మహారాష్ట్ర యువతకు దీంతో కొత్త అవకాశాలు అందివచ్చాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నారులు వీలైనంత ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు కావాలన్నదే ప్రభుత్వ ప్రాథమ్యం. ఆ మేరకు వారి కలలు సాకారం కావాలి. ఇటువంటి విశిష్ట విద్యకు ఒకనాడు మాతృభాషలో పాఠ్య పుస్తకాలు లభ్యం కాకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. రాష్ట్ర యువత ప్రయోజనాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఈ వివక్షకు స్వస్తి పలికింది. ఇక మహారాష్ట్ర యువతరం తమ మాతృభాషలో వైద్య విద్యాభ్యాసం చేయగలదు. తద్వారా వైద్యులు కావాలనే సంకల్పాన్ని వారు సాకారం చేసుకోగలుగుతారు.

మిత్రులారా!

   జనజీవనాన్ని సౌకర్యవంతం చేసేదిశగా ప్రభుత్వ కృషి పేదరిక నిర్మూలనలో గొప్ప ఉపకరణం అవుతుంది. అయితే, మునుపట్లో కాంగ్రెస్ వంటి పార్టీలు పేదరికాన్ని తమ రాజకీయ ఇంధనంగా మార్చుకున్నాయి. అందుకే ప్రజలను పేదరికమనే అంధకారంలో ముంచేశాయి. కానీ, కేవలం ఒక దశాబ్దంలో మా ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలను పేదరిక విముక్తులను చేసింది. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలలో ప్రగతిశీల మార్పు ఇందుకు దోహదం చేసింది. ఈ రోజున ప్రతి నిరుపేదకూ ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ కార్డు చేతిలో ఉంది. దీంతోపాటు 70 ఏళ్లు పైబడిన వృద్ధులకూ ఈ సదుపాయం వర్తింపజేశాం. ఇక జనౌషధి కేంద్రాల్లో అత్యవసర మందులు చాలా తక్కువ ధరకు... హృద్రోగులకు స్టెంట్లు వంటి పరికరాలు కూడా 80-85 శాతం తక్కువకే లభిస్తున్నాయి. అలాగే క్యాన్సర్ చికిత్సలో వాడే అత్యవసర మందుల ధరను కూడా ప్రభుత్వం తగ్గించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల సంఖ్య పెరగడంవల్ల వైద్యం కూడా అందరికీ అందుబాటులోకి వచ్చింది. దేశంలో మోదీ ప్రభుత్వం వల్ల నిరుపేదలందరికీ ఇప్పుడు బలమైన సామాజిక భద్రత లభించింది.

మిత్రులారా!

   యువతరంలో ఉట్టిపడే ఆత్మవిశ్వాసాన్ని బట్టి, ఏ దేశాన్నైనా ప్రపంచం విశ్వసిస్తుంది. ఆ మేరకు నేటి యువభారత్ జాతి భవిష్యత్ ప్రగతి ప్రణాళికను సరికొత్తగా రచిస్తోంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, సాఫ్ట్‌ వేర్ అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం భార‌త్‌ను విస్తృత మానవ వనరుల కూడలిగా పరిగణిస్తోంది. అందుకే, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం యువతను తీర్చిదిద్దుతున్నది. మహారాష్ట్రలో విద్యావ్యవస్థను ముందుకు నడిపే పర్యవేక్షణ కేంద్రంతోపాటు ముంబైలో ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ప్రారంభోత్స‌వం వంటివి ఈ రోజున నిర్వహించాం. ఈ సంస్థలో యువతకు భవిష్యత్ అవకాశాల ప్రాతిపదికన శిక్షణ లభిస్తుంది. మార్కెట్ డిమాండుకు తగినట్లు యువ‌తరం ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్దుతాం. అంతేకాకుండా నెలవారీ భృతితో అనుభవ శిక్షణ (ఇంటర్న్‌షిప్‌) ఇప్పించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఇలాంటిది దేశ చరిత్రలోనే ప్రప్రథమ. దీనికింద వారికి రూ.5,000 దాకా భృతి అందుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యానికి వేలాది కంపెనీలు సంసిద్ధత తెలపడం హర్షణీయం. తద్వారా యువత విలువైన అనుభవ శిక్షణతోపాటు కొత్త అవకాశాలకు గట్టి పునాది పడుతుంది.

 

సోదరసోదరీమణులారా!

   యువతరం కోసం భారత్ చేస్తున్న కృషి నిరంతర ఫలితాలిస్తోంది. మన విద్యా సంస్థలు ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలకు దీటుగా నిలుస్తున్నాయి. నిన్ననే ప్రకటించిన ‘అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌’ ప్రకారం భార‌త్‌లో ఉన్నత విద్య-పరిశోధనల నాణ్యత పెరుగుతున్నదని స్పష్టమైంది.

మిత్రులారా!

   ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచం ఇప్పడు మనవైపు దృష్టి సారించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు నేడు భారత్ ప్రగతితో ముడిపడి ఉంది. ఒకనాడు నిర్లక్ష్యానికి గురైన, వెనుకబడిన అనేక రంగాల్లో ఈ ఆర్థిక పురోగమనం అపార కొత్త అవకాశాలను కల్పించింది. పర్యాటక రంగం ఇందుకు ఒక నిదర్శనం. లోగడ ఈ రంగంలో మహారాష్ట్ర ఎన్నో అవకాశాలను కోల్పోయింది. ఈ రాష్ట్ర అమూల్య వారసత్వానికి నిలయం. అనేక సుందర ప్రదేశాలు, అధ్యాత్మిక కేంద్రాలకు ఆలవాలం. వీటిని సద్వినియోగం చేసుకుని ఉంటే- లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుని ఉండేది. కానీ, వాటికి సముచిత ప్రాధాన్యం లభించక, అటువంటి సువర్ణావకాశం దూరమైంది. మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు అటు ‘ప్రగతి’, ఇటు ‘వారసత్వం’పైనా ఎలాంటి ఆసక్తి లేదు. కానీ, మా ప్రభుత్వ హయాంలో ప్రగతి-వారసత్వాలకు సమ ప్రాధాన్యమిచ్చాం. భారత సుసంపన్న గతం స్ఫూర్తితో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం. షిర్డీ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం, నాగ్‌పూర్ విమానాశ్రయ ఆధునికీకరణ సహా మహారాష్ట్రలో అనేక ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. షిర్డీ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ వల్ల సాయిబాబా భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల దేశవిదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకుల రాకకు వీలుంటుంది. కొద్ది రోజుల కిందటే ఆధునికీకరించిన షోలాపూర్ విమానాశ్రయాన్ని నేను ప్రారంభించాను. సందర్శకులు ఒక ప్రదేశానికి వెళ్లినపుడు, శని షింగనాపూర్, తుల్జా భవానీ ఆలయం, కైలాస్ టెంపుల్ వంటి సమీప అధ్యాత్మిక ప్రదేశాలను కూడా తిలకించాలని వారు ఆశించడం సహజం. తద్వారా మహారాష్ట్ర పర్యాటక ఆర్థిక వ్యవస్థకు ఊపు లభించడమేగాక ప్రజలందరికీ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయి.

మిత్రులారా!

   మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, అనుసరించే ప్రతి విధానం ‘వికసిత భారత్’ లక్ష్యానికే అంకితం! పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పేద గ్రామీణులు, కూలీలు, రైతులకు అంకితం చేస్తున్నాం. దేశవిదేశాలకు వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి నిమిత్తం షిర్డీ విమానాశ్రయంలో నిర్మించే ప్రత్యేక సరకుల ప్రాంగణం ఎంతగానో తోడ్పడుతుంది. షిర్డీ, లాసల్‌గావ్, అహల్యానగర్, నాసిక్ ప్రాంతాల రైతులు ఈ ప్రాంగణం ద్వారా ఉల్లి, ద్రాక్ష, మునగ, జామ, దానిమ్మ వంటి ఉత్పత్తులను సులువుగా రవాణా చేయగలుగుతారు. ఈ విధంగా వారికి మరింత విస్తృత మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

సోదరసోదరీమణులారా!

   రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఈ దిశగా బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధర రద్దు చేశాం. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం తొలగించాం. అంతేగాక ఉప్పుడు బియ్యంపై ఎగుమతి సుంకం సగానికి తగ్గించాం. మహారాష్ట్ర రైతుల ఆదాయం పెంపు దిశగా ఉల్లిపై ఎగుమతి పన్నును కూడా ప్రభుత్వం సగానికి తగ్గించింది. వంటనూనెల దిగుమతిపై 20 శాతం పన్ను విధించాలని మేము నిర్ణయించాం. అలాగే రిఫైన్డ్ సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్‌పై కస్టమ్స్ సుంకం గణనీయంగా పెంచాలని కూడా నిర్ణయించాం. వీటన్నిటివల్ల కలిగే ప్రయోజనాలన్నీ దక్కేదెవరికి... మన రైతులకే కదా! దీంతోపాటు జౌళి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వ మద్దతు వల్ల  మహారాష్ట్రలోని రైతులు కూడా ఎంతో లబ్ధి పొందుతారు.

మిత్రులారా!

   మీరంతా సదా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం: అధికారమే పరమావధిగా చహా-అఘాడి (కూటమి) మహారాష్ట్రను బలహీనపరచాలని ప్రయత్నిస్తుంటే, రాష్ట్రాన్ని మరింత శక్తిమంతం చేయాలని మహాయుతి సంకల్పించింది. ఈ నేపథ్యంలో దేశ ప్రగతికి మరోసారి సారథ్యం వహించడానికి మహారాష్ట్ర సిద్ధం కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అందుకే, నేటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటిపైనా ఈ రాష్ట్ర ప్రజలకు మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Follower to leader: India's AI application shifts reshape tech landscape

Media Coverage

Follower to leader: India's AI application shifts reshape tech landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Mr. Péter Magyar on election victory in Hungary
April 13, 2026

Prime Minister Shri Narendra Modi today extended his heartiest congratulations to Mr. Péter Magyar and the Tisza Party on their resounding election victory.

The Prime Minister remarked that India and Hungary are bound by a deep-rooted friendship, shared values, and enduring mutual respect. Shri Modi stated that he looks forward to working closely with Mr. Magyar to further strengthen bilateral cooperation between the two nations and advancing the vital India-EU Strategic Partnership for the shared prosperity and well-being of the people of both regions.

The Prime Minister wrote on X:

"Heartiest congratulations to Mr. Péter Magyar and the Tisza Party on your resounding election victory. India and Hungary are bound by deep-rooted friendship, shared values and enduring mutual respect. I look forward to working closely with you to further strengthen our bilateral cooperation and to advance the vital India-EU Strategic Partnership for the shared prosperity and well-being of our peoples.

@magyarpeterMP "