శ్రీ నారాయణ గురు చెప్పిన విషయాలు మనుషులందరికీ గొప్ప నిధి: ప్రధానమంత్రి
సమాజంలో భారీ మార్పులను తీసుకొచ్చిన గొప్ప సాధువులు, ఋషులు, సామాజిక సంస్కర్తలు భారతదేశంలో ఉన్నారు: ప్రధానమంత్రి
శ్రీ నారాయణ గురు ఎలాంటి వివక్షత లేని సమాజం గురించి కలలు కన్నారు. నేడు పూర్తి సంతృప్త విధానాన్ని అనుసరిస్తూ వివక్షకు గురిచేసే ప్రతిదానిని తొలగించేందుకు దేశం కృషి చేస్తోంది: ప్రధానమంత్రి
నైపుణ్య భారత్ వంటి కార్యక్రమాలు యువతకు సాధికారత కల్పిస్తున్నాయి. వారిని స్వావలంబన చేస్తున్నాయి: ప్రధానమంత్రి
భారత్‌ను సాధికారపరిచేందుకు మనం ఆర్థిక, సామాజిక, సైనిక.. ఇలా ప్రతి రంగంలోనూనాయకత్వం వహించాలి. నేడు దేశం ఇది సాధించే మార్గంలోనే ముందుకు సాగుతోంది: ప్రధాని

బ్రహ్మర్షి స్వామి సచ్చిదానంద గారు, శ్రీమఠం స్వామి శుభాంగ నందా గారు, స్వామి శారదానంద గారు, గౌరవనీయులైన సాధువులందరూ, ప్రభుత్వంలో నా సహచరులు శ్రీ జార్జ్ కురియన్ గారు, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ అదూర్ ప్రకాష్ గారు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు, గౌరవనీయులైన పెద్దలందరూ,

‘నా ప్రియమైన మలయాళీ మిత్రులారా, సోదరసోదరీణులారా అందరికీ నా వినమ్రపూర్వక నమస్కారం”

ఇవాళ ఈ వేదిక దేశ చరిత్రలో అపూర్వమైన సంఘటనకు సాక్షిగా నిలుస్తోంది. మన స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వాతంత్ర్య లక్ష్యానికీ, స్వతంత్ర భారతదేశం స్వప్నానికీ ఖచ్చితమైన అర్థాన్ని కూడా అందించిన ఒక చారిత్రాక సంఘటన ఇది. 100 సంవత్సరాల కిందట జరిగిన శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ సమావేశం ఇప్పటికీ సందర్భోచితంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. నేటికీ సామాజిక సామరస్యం, అభివృద్ధి చెందిన భారత్ ఉమ్మడి లక్ష్యాల కోసం గొప్ప ఉత్తేజాన్నిచ్చే శక్తిగా 100 సంవత్సరాల నాటి ఈ భేటీ కనిపిస్తోంది. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా నేను శ్రీ నారాయణ గురు పాదాలకు నమస్కరిస్తున్నాను.. గాంధీజీకి కూడా నా నివాళులు అర్పిస్తున్నాను.

 

సోదర సోదరీమణులారా,

శ్రీ నారాయణ గురు గారి ఆలోచనలు మానవాళి మొత్తానికి ఒక గొప్ప ఆస్తి. దేశానికీ, సమాజానికీ సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసే వారికి శ్రీ నారాయణ గురు గారి ఒక వెలుగు రేఖ. సమాజంలోని దోపిడీకీ, అణిచివేతకూ గురైన వారితో పాటు అణగారిన వర్గాలతో నాకు ఎలాంటి సంబంధం ఉందో మీ అందరికీ తెలుసు. అందుకే ఇప్పటికీ కూడా సమాజంలోని అణచివేత గురైన అణగారిన వర్గాలకు సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా నేను గురుదేవ్‌ను ఖచ్చితంగా గుర్తుతెచ్చుకుంటాను. 100 సంవత్సరాల కిందట సామాజిక పరిస్థితులు, శతాబ్దాల బానిసత్వం కారణంగా ఏర్పడిన వక్రీకరణల వల్ల ఆ సమయంలో దురాచారాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రజలు భయపడ్డారు. కానీ శ్రీ నారాయణ గురు గారు వ్యతిరేకతను పట్టించుకోలేదు.. ఇబ్బందులకు భయపడలేదు. ఎందుకంటే ఆయన సామరస్యాన్నీ, సమానత్వాన్నీ విశ్వసించారు. ఆయన సత్యం, సేవ సామరస్యాన్ని నమ్మారు. ఈ ప్రేరణ మనకు 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' మార్గాన్ని చూపుతోంది. ఈ నమ్మకమే చిట్ట చివరన ఉన్న వ్యక్తి మొదటిగా ప్రాధాన్యత ఉన్న భారత్‌ను నిర్మించేందుకు కావాల్సిన బలాన్ని ఇస్తోంది. 

మిత్రులారా, 

శివగిరి మఠంతో సంబంధం ఉన్న వారు, సాధువులకు.. శ్రీ నారాయణ గురు గారు, శివగిరి మఠం పట్ల నాకు ఎంత నమ్మకం ఉందో తెలుసు. నాకు భాష అర్థం కాలేదు కానీ పూజ్య సచ్చిదానంద గారు చెప్పిన విషయాలను చూస్తే ఆయన పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు చాలా భావోద్వేగానికి గురవటాన్ని, ఆ విషయాలన్నింటిపైన ఆయనతో పాటు మీరు ప్రయాణిస్తున్నట్లు నేను గమనిస్తూ ఉన్నాను. మఠంలోని గౌరవ సాధువులు ఎల్లప్పుడూ నాకు తమ ఆప్యాయతను అందించడం నా అదృష్టం. 2013లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేదార్‌నాథ్‌లో ప్రకృతి వైపరీత్యం సంభవించింది. అప్పుడు శివగిరి మఠానికి చెందిన చాలా మంది గౌరవ సాధువులు, కొందరు భక్తులు అక్కడ చిక్కుకొని ఉండటం నాకు గుర్తుంది. అక్కడ చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా తరలించడానికి శివగిరి మఠం భారత ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. ప్రకాష్ జీ.. క్షమించాలి. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్పుడు. ఒక సేవకుడిగా ఈ పని చేయమని శివగిరి మఠం నన్ను ఆదేశించింది. దేవుడి దయ వల్ల నేను సాధువులందరినీ, భక్తులనీ సురక్షితంగా తీసుకురాగలిగాను.

మిత్రులారా, 

ఏదేమైనా కష్ట సమయాల్లో మన మొదటి దృష్టి మన సొంతమని భావించే వారిపైకి, మనకు హక్కు ఉంది అని భావించే వాటిపైకి పోతుంది. మీరు నన్ను మీ సొంత మనిషిలా భావించటం నాకు సంతోషంగా ఉంది. శివగిరి మఠంలోని సాధువులతో ఈ సాన్నిహిత్యం కంటే నాకు ఆధ్యాత్మికంగా ఏది ఎక్కువ ఆనందాన్నిస్తుంది?

మిత్రులారా, 

కాశీ ద్వారా మీ అందరితో నాకు సంబంధం ఉంది. వర్కాలను శతాబ్దాలుగా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఉత్తరాది అయినా, దక్షిణాది అయినా.. నాకు ప్రతి కాశీ నా కాశీనే. 

 

మిత్రులారా, 

భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని.. దాని రుషులు, సాధువుల వారసత్వాన్ని తెలుసుకుని, దగ్గరగా జీవించే అదృష్టం నాకు లభించింది. మన దేశం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడల్లా దేశంలోని ఏదో ఒక మూలలో ఒక గొప్ప వ్యక్తి జన్మించి సమాజానికి కొత్త వెలుతురును చూపించటం అనేది భారత్ ప్రత్యేకత. కొందరు సమాజ ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం పనిచేస్తారు. కొందరు సమాజంలో సామాజిక సంస్కరణలకు ప్రేరణనిస్తారు. శ్రీ నారాయణ్ గురు గారు అలాంటి గొప్ప సాధువుల్లో ఒకరు. ఆయన రచనలైన 'నివృత్తి పంచకం', 'ఆత్మోపదేశ్ శతకం' వంటివి అద్వైతం, ఆధ్యాత్మికతను అభ్యసించే ఏ విద్యార్థికైనా మార్గదర్శకం లాంటివి.

మిత్రులారా, 

యోగ, వేదాంతం, సాధన, ముక్తి శ్రీ నారాయణగురు గారికి సంబంధించి ప్రధాన అంశాలు. కానీ దురాచారాలలో చిక్కుకున్న సమాజం ఆధ్యాత్మికోద్ధరణ దాని సామాజిక మార్పు ద్వారానే సాధ్యమవుతుందని ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన ఆధ్యాత్మికతను సామాజిక సంస్కరణ, సామాజిక సంక్షేమానికి ఒక మాధ్యమంగా మార్చారు. గాంధీజీ కూడా శ్రీ నారాయణగురు చేసిన ఈ పనుల నుంచి ప్రేరణ పొంది ఆయన నుంచి మార్గదర్శకత్వం తీసుకున్నారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్పవారు కూడా శ్రీ నారాయణగురుతో నిర్వహించిన చర్చల నుంచి ప్రయోజనం పొందారు. 

మిత్రులారా,

ఒకసారి ఎవరో శ్రీ నారాయణగురు గారి ఆత్మోపదేశ శతకం రమణ మహర్షికి వినిపించారు. దానిని విన్న తర్వాత, రమణ మహర్షి ఇలా అన్నారు - "అవర్ ఎల్లం తేరియన్‌జ్వర్". ఆయనకు అన్నీ తెలుసు దీని అర్థం. విదేశీ ఆలోచనల ప్రభావంతో భారతీయ నాగరికత, సంస్కృతి, తత్వశాస్త్రాన్ని తక్కువ చేసేందుకు కుట్రలు పన్నుతోన్న సమయంలో.. తప్పు మన సంప్రదాయంలో లేదని మనకు అర్థమయ్యేలా శ్రీ నారాయణ గురు గారు చెప్పారు. మనం మన ఆధ్యాత్మికతను నిజమైన అర్థంలో గ్రహించాలి. మనం మనుషుల్లో శ్రీనారాయణుడినీ, జీవుల్లో ఈశ్వరుడినీ చూసే వాళ్లం. ద్వంద్వత్వంలో ద్వంద్వం లేనితనాన్ని చూస్తాం. భేదంలో కూడా భేదం లేనితనాన్ని చూస్తాం. భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని చూస్తాం.

 

మిత్రులారా, 

శ్రీ నారాయణ గురు గారి మంత్రం మీ అందరికీ తెలుసు. అది  “ఒకే జాతి, ఒకే మతం, ఒకే దైవం, ఒకే మనిషి.”. దీని అర్థం ఏంటంటే మొత్తం మానవాళి ఐక్యత, అన్ని జీవుల ఐక్యత!. ఈ ఆలోచన భారత్‌ జీవన సంస్కృతికీ, దాని పునాదికీ మూలం. నేడు భారతదేశం ప్రపంచ సంక్షేమ స్ఫూర్తితో ఆ ఆలోచనను వ్యాప్తి చేస్తోంది. ఇటీవలే మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఈసారి యోగా దినోత్సవ ఇతివృత్తం- ‘ఒకే ధరిత్రి, ఒకే ఆరోగ్యం కోసం యోగా’ . దీని అర్థం ఏంటంటే ఒకే భూమి, ఒకే ఆరోగ్యం.  దీనికి ముందు కూడా ‘ప్రపంచ సంక్షేమం కోసం ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం’ వంటి కార్యక్రమాలను చేపట్టింది. నేడు సుస్థిరాభివృద్ధి దిశగా ‘ఒకే సూర్యుడు, ఒకే భూమి, ఒకే గ్రిడ్’ వంటి ప్రపంచ ఉద్యమాలకు భారత్ నాయకత్వం వహిస్తోంది. 2023లో జీ20 సమావేశాలన్ని భారత్ నిర్వహించినప్పుడు మేం దాని ఇతివృత్తాన్ని "ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు"గా పెట్టామని మీకు గుర్తుండే ఉంటుంది. 'వసుధైక కుటుంబం' అనే స్ఫూర్తి మనం చేస్తోన్న ఈ కార్యక్రమాల్లో కనపిస్తోంది. శ్రీ నారాయణ గురు గారు వంటి సాధువుల ప్రేరణ దీనితో ముడిపడి ఉంది.

మిత్రులారా,

వివక్ష లేని సమాజాన్ని శ్రీ నారాయణ గురు కాంక్షించారు. దేశం నేడు సంతృప్త విధానాన్ని అవలంబిస్తూ, వివక్షకు తావివ్వకపోవడం సంతోషాన్నిచ్చే విషయం. కానీ, 10-11 ఏళ్ల కిందటి విషయాలను ఓసారి గుర్తు చేసుకోండి.. స్వాతంత్ర్యానంతరం ఇన్ని దశాబ్దాల అనంతరం కూడా కోట్లాది దేశ ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడపాల్సి వచ్చిందో కదా? తలదాచుకునేందుకూ కోట్లాది కుటుంబాలకు కనీస సదుపాయం లేదు! లక్షలాది గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు దొరికేది కాదు. చిన్న అనారోగ్యానికీ చికిత్స లభించేది కాదు. ఏదయినా పెద్ద వ్యాధి సోకితే ప్రాణాలు నిలుపుకొనే మార్గముండేది కాదు. కోట్లాది పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు కనీస మానవ గౌరవాన్నీ పొందలేకపోయారు! కోట్లాదిగా భారతీయులు తరతరాలుగా ఎన్ని కష్టాల్లో జీవనం సాగించారంటే, మెరుగైన జీవితం గురించి కనీస ఆశలు కూడా వారిలో అడుగంటాయి. ఇంతటి బాధలో, నిరాశలో కోట్లాది మంది దేశ ప్రజలు కూరుకుపోయి ఉంటే దేశం ఎలా పురోగమిస్తుంది? అందుకే, ముందుగా ప్రభుత్వ ఆలోచనా దృక్పథంలో సునిశితత్వాన్ని నింపాం! సేవనే సంకల్పంగా చేసుకున్నాం! ఫలితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది పేద-దళిత-బాధిత-పీడిత కుటుంబాలకు పక్కా ఇళ్లను మేం అందించగలిగాం. ప్రతి పేదవాడికీ సొంతింటిని అందించడమే మా లక్ష్యం. ఈ ఇల్లు ఇటుకలూ సిమెంటుతో చేసిన నిర్మాణం మాత్రమే కాదు.. అవసరమైన అన్ని సదుపాయాలతో నివాసయోగ్యమైన ఓ మంచి ఇల్లు తమకుందన్న భావనను ఇది పేద ప్రజల్లో నింపుతుంది. అది కేవలం ఓ నాలుగు గోడలున్న నిర్మాణం మాత్రమే కాదు.. ప్రజల కలలను సాకారం చేసే ఇంటిని మేమందిస్తున్నాం. అందుకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లలో గ్యాస్, విద్యుత్, టాయిలెట్ వంటి ప్రతి సదుపాయాన్నీ అందిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్నడూ చేరుకోలేకపోయిన గిరిజన ప్రాంతాల్లోనూ నేడు అభివృద్ధికి భరోసా లభిస్తోంది. గిరిజనులు, అందునా అత్యంత వెనుకబడిన గిరిజనుల కోసం ప్రధానమంత్రి జన్‌మాన్ యోజనను మేం ప్రారంభించాం. దీంతో నేడు అనేక ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయి. దీంతో సమాజంలో చివరి మెట్టున ఉన్న వ్యక్తుల్లోనూ కొత్త ఆశలు చిగురించాయి. వారు తమ జీవితాలను మార్చుకోవడమే కాదు.. దేశ వికాసంలోనూ బలమైన పాత్ర పోషిస్తున్నారు.

మిత్రులారా,

శ్రీ నారాయణ గురు ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. మా ప్రభుత్వం కూడా ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’ని మంత్రప్రదంగా భావించి ముందుకు సాగుతోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా, మహిళల ప్రవేశాన్ని దాదాపు నిషిద్ధంగా పరిగణించే రంగాలు దేశంలో అనేకం ఉండేవి. మేమీ ఆంక్షలను తొలగించాం. అనేక రంగాల్లో మహిళలకు హక్కులు లభించాయి. నేడు క్రీడల నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలోనూ మన ఆడపిల్లలు దేశానికి కీర్తిని తెస్తున్నారు. నేడు సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి తరగతి ‘అభివృద్ధి చెందిన భారత్’ కల సాకారమయ్యేలా ఆత్మవిశ్వాసంతో కృషిచేస్తున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్, పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు, అమృత సరోవర్ నిర్మాణం, చిరు ధాన్యాలపై అవగాహన కార్యక్రమాలతో.. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో మేం ముందుకు సాగుతున్నాం. 140 కోట్ల మంది దేశ ప్రజల బలంతో మేం ముందుకు సాగుతున్నాం.

 

మిత్రులారా,

శ్రీ నారాయణ గురు ఇలా చెప్పేవారు- ‘‘విద్యా కోండ్ ప్రబుద్ధర ఆవుక సంఘటనా కోండ్ శక్తర్ ఆవుకా, ప్రయత్నం కోండ్ సంపన్నార్ ఆవుకా’’ అంటే- ‘‘విద్యతో జ్ఞానం, సంఘటనతో బలం, కృషితో సంపద’’. దీన్ని సాకారం చేసుకోవడానికి స్వయంగా ఆయనే కొన్ని ముఖ్య సంస్థలకు పునాది వేశారు. గురూజీ శివగిరిలోనే శారదా మఠాన్ని నెలకొల్పారు. ఇది సరస్వతీ మాత మఠం. అణగారిన వర్గాల అభ్యున్నతికీ, విముక్తికీ విద్యే సాధనమన్న సందేశాన్నిస్తుంది. గురుదేవుల ఆ కృషి నేటికీ నిరంతరం కొనసాగుతుండడం సంతోషదాయకం. దేశంలోని అనేక నగరాల్లో గురుదేవ్ కేంద్రాలు, శ్రీ నారాయణ సాంస్కృతిక మిషన్ మానవాళి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి.

మిత్రులారా,

విద్య, నిర్వహణ, పారిశ్రామిక పురోగతిని బట్టి దేశంలో విధానాలు, నిర్ణయాల్లో ఈ సామాజిక దృక్పథం బలమైన ముద్ర వేసిందని స్పష్టంగా చెప్పొచ్చు. చాలా దశాబ్దాల తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని మేం అమలు చేశాం. ఇది విద్యారంగాన్ని ఆధునికంగా, సమ్మిళితంగా తీర్చిదిద్దడమే కాకుండా, మాతృభాషలో విద్యాభ్యాసాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. వెనుకబడిన, అణగారిన వర్గాలకు దీనివల్ల విశేష ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా,

స్వాతంత్ర్యానంతరం గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో.. దేశంలో ఎన్నో కొత్త ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌లను గత దశాబ్ద కాలంలో మేం ప్రారంభించాం. దీంతో పేదలు, అణగారిన వర్గాల యువతకు ఉన్నత విద్యలో కొత్త అవకాశాలు లభించాయి. గత పదేళ్లలో గిరిజన ప్రాంతాల్లో 400కు పైగా ఏకలవ్య ఆవాస పాఠశాలలను ప్రారంభించాం. అనేక తరాలుగా విద్యకు దూరమైన గిరిజన బాలలు నేడు పురోగతి దిశగా సాగుతున్నారు.

సోదరీ సోదరులారా,

మేం విద్యను నేరుగా నైపుణ్యాలూ అవకాశాలతో అనుసంధానించాం. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ యువతను స్వావలంబన దిశగా నడిపిస్తున్నాయి. దేశ పారిశ్రామిక పురోగతి, ప్రైవేట్ రంగంలో ప్రధాన సంస్కరణలు, ముద్ర యోజన, స్టాండప్ యోజన... ఇవన్నీ ఎక్కువగా దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి.

 

మిత్రులారా,

శ్రీ నారాయణ గురు బలమైన భారతదేశాన్ని కాంక్షించారు. భారత్ సాధికారత సాధించాలంటే- ఆర్థికంగా, సామాజికంగా, రక్షణపరంగా ప్రతి అంశంలోనూ మనం ముందుండాలి. నేడు దేశం ఆ మార్గంలోనే పయనిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ శరవేగంగా అడుగులేస్తోంది. ఇటీవలే భారత్ సామర్థ్యం ప్రపంచమంతటికీ తెలిసింది. ఉగ్రవాదంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలన్న భారత విధానం ఆపరేషన్ సిందూర్ ద్వారా తేటతెల్లమైంది. భారతీయుల రక్తాన్ని పారించిన ఉగ్రవాదులకు ఏ ప్రదేశమూ సురక్షితంగా ఉండబోదని మనం నిరూపించాం.

మిత్రులారా,

నేటి భారత్ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుంది. ఆ దిశగా అవకాశమున్న, సరైన చర్యలన్నింటినీ తీసుకుంటుంది. నేడు భారత్ సైనిక అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం కూడా క్రమంగా తగ్గుతోంది. రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా మనం దాని ప్రభావాన్ని చూశాం. భారత్‌లోనే తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించి మన దళాలు శత్రువును 22 నిమిషాల్లోనే లొంగిపోయేలా చేశాయి. మున్ముందు భారత్‌లో తయారయ్యే ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు లభిస్తాయన్న నమ్మకం నాకుంది.

 

మిత్రులారా,

దేశ సంకల్పాలు నెరవేరాలంటే- శ్రీ నారాయణ గురు బోధనలను మనం ప్రజల్లో ప్రాచుర్యంలోకి తేవాలి. మా ప్రభుత్వం కూడా ఈ దిశలో చురుగ్గా పనిచేస్తోంది. శివగిరి సర్క్యూట్‌ ఏర్పాటుతో శ్రీ నారాయణ గురు జీవితంతో ముడిపడి ఉన్న యాత్రా స్థలాలను మేం అనుసంధానిస్తున్నాం. అమృతకాలం దిశగా పయనంలో ఆయన ఆశీస్సులు, బోధనలు దేశానికి ఎన్నటికీ మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. మనందరం కలిసి ‘అభివృద్ధి చెందిన భారత్’ స్వప్నాన్ని సాకారం చేసుకుందాం. శ్రీ నారాయణ గురు ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ.. శివగిరి మఠంలోని సాధువులందరికీ నేను మరోసారి నమస్కరిస్తున్నాను.

మీ అందరికీ ధన్యవాదాలు! నమస్కారం! 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
E-Samudra: India’s digital push to reshape maritime governance

Media Coverage

E-Samudra: India’s digital push to reshape maritime governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting the power of winning hearts through vision, thoughts, words, and actions
August 12, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the power of winning hearts through vision, thoughts, words, and actions.

The Prime Minister wrote on X;

"हमारे युवा साथी देश का भविष्य ही नहीं, वर्तमान की सबसे बड़ी शक्ति भी हैं। उन्होंने अपनी संवेदनशीलता, सेवाभाव और सामर्थ्य से दुनियाभर में अलग पहचान बनाई है।

चक्षुषा मनसा वाचा कर्मणा च चतुर्विधम्।

प्रसादयति यो लोकं तं लोकोऽनुप्रसीदति।।"

A person who wins people's hearts through his vision, thoughts, words and actions earns, in return, their trust, respect and goodwill.