· వేల ఏళ్లుగా వర్ధిల్లుతున్న వైభవోపేతమైన నాగరికత మనది
· సంప్రదాయాలు చెక్కుచెదరకుండా సుదీర్ఘ కాలం కొనసాగిన ఉదాహరణలు ప్రపంచంలో చాలా అరుదు
· ఆధ్యాత్మిక నిర్దేశానికే పరిమితం కాని మహనీయులెందరో నిరంతరం ప్రభవిస్తున్న సమాజం భారత్
· ప్రజల మధ్యనే జీవించి, కష్టసుఖాలను తెలుసుకుని, వారి వేదనతో సహానుభూతిని చెంది.. దుఃఖం, బాధలు, కష్టాల నుంచి సమాజానికి విముక్తి మార్గం చూపిన మహాత్ములెందరో
· నీటిని పొదుపు చేసి, జాగ్రత్తగా ఉపయోగించుకునేలా మనమంతా సంకల్పిద్దాం: ఇదే నా మొదటి విజ్ఞప్తి
· వృక్షాలు, ప్రకృతి రక్షణ కోసం నా రెండో విజ్ఞప్తి: ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద లక్షలాది మంది తమ తల్లి పేరు మీద మొక్కలు నాటారు... ఆ స్ఫూర్తిని మనమంతా పుణికిపుచ్చుకొందాం, భూమాత రక్షణకు సంకల్పిద్దాం
· ‘స్వచ్ఛత’ నా మూడో విజ్ఞప్తి: ఆధ్యాత్మిక ప్రదేశమైనా, బహిరంగ ప్రదేశమైనా, పల్లెగానీ నగరంగానీ... అంతటా స్వచ్ఛత మన బాధ్యత
· స్వదేశీ, స్వావలంబన... ఇది నా నాలుగో వినతి: భారతీయ ఉత్పత్తులను ఆదరిద్దాం, మన దేశ తయారీదారులను, పరిశ్రమలను బలోపేతం చేద్దాం
· మన దేశ సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం... నా అయిదో విజ్ఞప్తి: భారత్‌ను తెలుసుకుందాం, దేశంలో పర్యటిద్దాం, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిద్దాం
· దేశ రైతులకు నా ఆరో విజ్ఞప్తి: సేంద్రియ వ్యవసాయం దిశగా మళ్లండి
· ఆరోగ్యకరమైన ఆహారం నా ఏడో విజ్ఞప్తి... దేశంలో సవాలుగా మారుతున్న ఊబకాయం: దీన్ని పరిష్కరించే దిశగా, మీ ఆహారంలో నూనె పరిమాణాన్ని 10% తగ్గించండి
· యోగా, క్రీడలు, దేహదారుఢ్యాలు నా ఎనిమిదో అభ్యర్థన... మనమంతా వీటిని జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి
· సేవాస్ఫూర్తిని చాటడమే నా తొమ్మిదో విజ్ఞప్తి
· ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ గారు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారు, పరమ పూజ్య జగద్గురు స్వామి పరమాత్మానంద సరస్వతిజీ, కేంద్ర మంత్రులు హెచ్ డీ. కుమారస్వామి గారు, శోభా కరంద్లాజే గారు, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గారు, రాష్ట్ర మంత్రి ఎన్. చెలువరాయస్వామి గారు, సకల సాధువులందరికీ, ఇతర ప్రముఖులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన సోదర సోదరీలందరికీ నమస్కారాలు.

మిత్రులారా,

నేడు మాటల్లో వర్ణించలేని భావోద్వేగాలతో నా మనసు నిండిపోయింది. శ్రీ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకోవడం, పూజలు చేసుకోవడం, శ్రీ గురు భైరవైక్య దేవాలయ గొప్ప ప్రారంభోత్సవాన్ని వీక్షించడం, చారిత్రాత్మక జ్వాలా పీఠంలో సమయాన్ని గడపడం, ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన సాధువుల సాంగత్యాన్ని పొందడం, ఇక్కడకు విచ్చేసిన జనసమూహాన్ని చూడటం.. ఈ అనుభవాలన్నీ నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. మీ మధ్యకు వచ్చే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.

మిత్రులారా,

కర్ణాటకకు రావడం నాకు ఎప్పుడూ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ కొత్త స్ఫూర్తిని పొందుతాను. అయితే మాండ్య జిల్లాలోని సక్కరె నగరకు (చక్కెర నగరం) రావడం చాలా ప్రత్యేకమైనది. ఈ నేల చెరకు తీపికి ప్రసిద్ధి చెందింది. అదే తీపి ఇక్కడి ప్రజల మాటల్లో కూడా కనిపిస్తుంది. వారి ఆప్యాయత, ఆహ్వానం నా హృదయాన్ని హత్తుకుంటాయి. తత్వశాస్త్రం, సాంకేతికత రెండింటిలోనూ కర్ణాటక సుసుంపన్నమైనదని నేను తరచుగా చెబుతుంటాను. ఇక్కడ తత్వశాస్త్రంలోని లోతు, సాంకేతిక శక్తి రెండూ ప్రతిబింబిస్తాయి. శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ నేల మనకు ఇచ్చిన గొప్ప కానుకలు. తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక, నైతిక విలువల ద్వారా సమాజానికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తోంది.

 

మిత్రులారా,

వేల సంవత్సరాల కాలంగా కొనసాగుతున్న సజీవ నాగరికతకు భారత్ ఒక గొప్ప సాక్ష్యం. ఇంత సుదీర్ఘ కాలం పాటు సంప్రదాయాలు కొనసాగుతున్న ఉదాహరణలు ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటాయి. శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని చూసినప్పుడు.. ఈ నిరంతర సంప్రదాయానికి సజీవ రూపం మనకు కనిపిస్తుంది. ఈ పవిత్ర మఠం చరిత్ర దాదాపు రెండు వేల సంవత్సరాల పురాతనమైనది. దీని గురు సంప్రదాయం, ఆధ్యాత్మిక తత్వం, సేవా ధోరణి తరతరాలుగా ఈ పుణ్యభూమిని సుసంపన్నం చేస్తున్నాయి. ఈ పరంపరలోనే జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామీజీ వంటి గొప్ప సాధువులు ఆవిర్భవించి, ఈ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. నేడు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ అదే బాటలో కొత్త శక్తితో, వేగంతో, అంకితభావంతో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు.

మిత్రులారా,

మన సమాజంలో కాలక్రమేణా ఎందరో గొప్ప వ్యక్తులు ఉద్భవించారు. వారు కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికే పరిమితం కాకుండా.. ప్రజల మధ్యే నివసించారు. వారి కష్టసుఖాలను అర్థం చేసుకొని.. ప్రజల బాధలను స్వయంగా అనుభవించారు. ఇబ్బందులు, కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని సమాజానికి చూపించారు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామీజీ అటువంటి దివ్య వ్యక్తిత్వం కలిగిన వారు. భౌతికంగా ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా.. ఆయన ఉనికి ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన దగ్గర అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పటికీ, తన జీవితం కేవలం ధ్యానానికే పరిమితం కాలేదు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. గ్రామీణ యువత ఆశయాలను, సామాన్య ప్రజల సమస్యలను బాగా అర్థం చేసుకున్నారు. అందుకే మహాస్వామిజీ దృష్టిలో భక్తి అంటే సమాజం నుంచి దూరంగా వెళ్లడం కాదు.. సమాజం పట్ల బాధ్యతను స్వీకరించి ముందుకు సాగడం.

మిత్రులారా,

విద్యా రంగంలో మహాస్వామిజీ వందలాది సంస్థలను స్థాపించారు. అక్కడ ప్రాథమిక స్థాయి నుంచి మెడికల్, ఇంజినీరింగ్ వంటి వృత్తిపరమైన కోర్సుల వరకు విద్య అందుతోంది. దీనివల్ల పేద, గ్రామీణ కుటుంబాలకు చెందిన పిల్లలకు గొప్ప ప్రయోజనం చేకూరింది. ఆరోగ్య రంగంలో కూడా ఆయన ఆలోచనా దృక్పథం విప్లవాత్మకమైనది. ఆయన స్థాపించిన ఆరోగ్య సంస్థల్లో నేటికీ సేవా భావంతోనే కార్యకలపాలు సాగుతున్నాయి. నాణ్యమైన వైద్య సేవలు కొందరికే పరిమితమైన ప్రత్యేక హక్కు కాకూడదని, అది ప్రతి పౌరుడికీ ఉండాలని ఆయన బలంగా నమ్మారు.

 

మిత్రులారా,

నేడు మన ప్రభుత్వం కూడా అదే దృక్పథంతో పని చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద కోట్ల మంది పేద ప్రజలు ఉచితంగా వైద్య సౌకర్యం పొందుతున్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఈ పథకాన్ని విస్తరించాం. దీని ద్వారా వారు కూడా మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను పొందవచ్చు.

మిత్రులారా,

నేడు ఈ శ్రీ గురు భైరవైక్య ఆలయంలో గడపడం, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామీజీ ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహాస్వామీజీ కరుణకు ప్రతిరూపమని మనందరికీ తెలుసు. ఆయన కరుణ కేవలం మానవులకే పరిమితం కాలేదు. అది సమస్త జీవరాశులకూ వర్తించింది. నెమళ్ల సంరక్షణ కోసం ఆయన ప్రారంభించిన సామాజిక ఉద్యమమే ఇందుకు నిదర్శనం. ఈ రోజు స్వామీజీ నాకు ఇచ్చిన జ్ఞాపికలో కూడా నెమలి ఉంది. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, మన సాంస్కృతిక చైతన్యంతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే నెమలి మన జాతీయ పక్షి మాత్రమే కాదు, సుబ్రహ్మణ్య స్వామి వాహనం కూడా. ఢిల్లీలో ప్రజల ఆశీస్సులతో భారత ప్రభుత్వం నాకు కేటాయించిన అధికారిక నివాసంలో కూడా చాలా నెమళ్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటితో నాకు మంచి స్నేహం కూడా కుదిరింది. నెమలి ఎంత ప్రశాంతంగా, అందంగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను.

మిత్రురాలా,

నేడు సద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామిజీ తన గురువుగారి సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. గురువు చూపిన బాటలో నడుస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తున్నారు. గురువు గౌరవార్థం శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని నిర్మించడం కేవలం ఒక భవనాన్ని నిర్మించడం మాత్రమే కాదు.. గొప్ప భావనను సాకారం చేసుకోవడం. రాబోయే కాలంలో ఈ ప్రదేశం ఖచ్చితంగా సేవ, ధ్యానం, స్ఫూర్తికి కేంద్రంగా మారుతుంది.

మిత్రులారా,

శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠం తొమ్మిది సూత్రాలపై పనిచేస్తుంది. అవి అన్నం, అక్షరం, ఆరోగ్యం, అధ్యాత్మికత, ఆశ్రయం, అరణ్యం, ఆకలు (గోవు), అనుకంప (కరుణ), అనుబంధం. మనమందరం అదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేయాల్సిన తొమ్మిది అంశాలను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇవి నా తొమ్మిది విన్నపాలు.

 

మిత్రులారా,

నీటి ప్రాముఖ్యత ఈ మాండ్యకు బాగా తెలుసు. ఈ ప్రాంతమంతా కావేరి మాత ఆశీస్సులతోనే వృద్ధి చెందింది. అందుకే నా మొదటి విన్నపం-నీటిని పొదుపు చేయడానికి, నీటిని మెరుగ్గా వినియోగించడానికి మనమందరం సంకల్పం తీసుకోవాలి. చెట్లు, ప్రకృతికి సంబంధించి నా రెండో విన్నపం- ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) ప్రచారం ద్వారా కోట్ల మంది ప్రజలు తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటారు. మనం కూడా మన తల్లుల పేరుతో మొక్కలు నాటి, భూమాతను రక్షించుకుందాం. పరిశుభ్రతకు సంబంధించి నా మూడో విన్నపం-అది మతపరమైన ప్రదేశమైనా, బహిరంగ ప్రదేశమైనా లేదా గ్రామం, నగరం కావచ్చు.. ప్రతిచోటా పరిశుభ్రతను పాటించడం మనందరి సమష్టి బాధ్యత, కర్తవ్యం. స్వదేశీ, స్వయం సమృద్ధికి సంబంధించి నా నాలుగో విన్నపం-మనం భారతీయ ఉత్పత్తులను వాడటం అలవర్చుకోవాలి. భారతీయ తయారీదారులను, పరిశ్రమలను బలోపేతం చేయాలి. ఓకల్ ఫర్ లోకల్ (స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత) మంత్రంతో జీవించాలి. దేశ సౌందర్యాన్ని చూడటానికి సంబంధించి నా అయిదో విన్నపం-మన దేశాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాలి. స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలి.

మిత్రులారా,

మాండ్య కష్టపడి పనిచేసే రైతుల భూమి. రైతుల కోసం నా ఆరో విన్నపం-వారు రసాయన రహిత సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. నా ఏడో విన్నపం ఆరోగ్యకరమైన ఆహారానికి సంబంధించినది-ఈ ప్రాంతానికి రాగి ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు. రాగి ముద్దనును ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన శ్రీ దేవెగౌడ ప్రస్తుతం మన మధ్యే ఉన్నారు. చిరుధాన్యాలను కూడా యువత తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. మన దేశంలో స్థూలకాయం పెద్ద సవాలుగా మారింది. దీనిని ఎదుర్కోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించడానికి ప్రయత్నించండి. యోగా, క్రీడలు, శారీరక దారుఢ్యం సంబంధించి నా ఎనిమిదవ విన్నపం-మనమందరం వీటిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. నా తొమ్మిదో విన్నపం సేవా భావానికి సంబంధించినది-దీనిని మీరు మీ పనుల ద్వారా నిరంతరం నిరూపిస్తూనే ఉన్నారు.


 

మిత్రులారా,

అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం సమాజాన్ని బలపరుస్తుంది. అది మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని అందిస్తుంది. ఈ తొమ్మిది విన్నపాల విషయాల్లో మనమందరం నిజాయితీగా, సంకల్పంతో ముందుకు సాగితే అభివృద్ధి చెందిన కర్ణాటక, అభివృద్ధి చెందిన భారత్ దిశగా మనం వేగంగా అడుగులు వేయగలం. ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. ఈ పవిత్ర సందర్భంగా ఈ పుణ్యభూమిలో, ఈ తపోభూమిలో మీతో కొంత సమయం గడిపేందుకు నన్ను ఆహ్వానించినందుకు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీకి, శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం సమాజాన్ని బలపరుస్తుంది. అది మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని అందిస్తుంది. ఈ తొమ్మిది విన్నపాల విషయాల్లో మనమందరం నిజాయితీగా, సంకల్పంతో ముందుకు సాగితే అభివృద్ధి చెందిన కర్ణాటక, అభివృద్ధి చెందిన భారత్ దిశగా మనం వేగంగా అడుగులు వేయగలం. ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. ఈ పవిత్ర సందర్భంగా ఈ పుణ్యభూమిలో, ఈ తపోభూమిలో మీతో కొంత సమయం గడిపేందుకు నన్ను ఆహ్వానించినందుకు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీకి, శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు,

అభినందనలు. ధన్యవాదాలు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India bought nearly 60 vehicles per min’ in FY26! Check top states

Media Coverage

India bought nearly 60 vehicles per min’ in FY26! Check top states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting the sacred legacy of our motherland and praying for universal prosperity
May 21, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam, noting that our motherland has been the sacred land of spiritual practice and worship, as well as courage, strength, and universal welfare. Shri Modi expressed his earnest wish that this holy land of great heritage and ancient culture may always keep everyone replete with happiness and prosperity.

The Prime Minister posted on X:

"हमारी मातृभूमि साधना और उपासना के साथ-साथ साहस, शक्ति और सर्व-कल्याण की पुण्यभूमि रही है। महान विरासत और प्राचीन संस्कृति की यह पावन धरती हर किसी को सदैव सुख-समृद्धि से परिपूर्ण रखे, यही कामना है।

यस्यां पूर्वे पूर्वजना विचक्रिरे यस्यां देवा असुरानभ्यवर्तयन् ।
गवामश्वानां वयसश्च विष्ठा भगं वर्चः पृथिवी नो दधातु ।।"

May the land where our ancestors performed great and benevolent deeds, and where the gods defeated the unjust forces, that motherland, full of livestock and power, grant us vast space and prosperity.