8న ఆంధ్రప్రదేశ్ లో రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని
విశాఖపట్నం సమీపంలోని పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని - నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఇదే మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు
9న ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ ను కూడా ప్రారంభించనున్న ప్రధాని

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా జ‌న‌వ‌రి 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పర్యటించనున్నారు. సుస్థిరాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం.. దాదాపు రూ. 2 లక్షల కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 9న ఉదయం 10 గంటలకు భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ)ను కూడా ఆయన ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి

విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. హరిత ఇంధనం, సుస్థిర భవిష్యత్తు దిశగా అంకితభావంతో ఆయన వేసిన మరో ముందడుగిది. జాతీయ గ్రీన్ హడ్రోజన్ మిషన్ లో భాగంగా ఇదే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఈ ప్రాజెక్టు పెట్టుబడి దాదాపు రూ. 1,85,000 కోట్లు. 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాల్లో పెట్టుబడి ఇందులో భాగం. తద్వారా, రోజుకు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది దేశంలోని అతిపెద్ద సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా మారింది. దానితోపాటు హరిత మిథనాల్, హరిత యూరియా, పర్యావరణ హిత వైమానిక ఇంధనం సహా రోజుకు 7500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను అందించగల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ప్రధానంగా ఎగుమతి మార్కెట్ ను లక్ష్యంగా పని చేస్తుంది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యం దిశగా భారత్ కు ఈ ప్రాజెక్టు విశేషంగా సహాయపడుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో రూ. 19,500 కోట్ల విలువైన వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా పలు ఇతర ప్రాజెక్టులతోపాటు విశాఖపట్నంలో దక్షిణ తీర రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించి, అనుసంధానాన్ని పెంచుతాయి. దానితోపాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక వృద్ధినీ మెరుగుపరుస్తాయి.

ఆరోగ్య రక్షణ సదుపాయాల కల్పనతోపాటు చౌక ధరల్లో వైద్యాన్ని అందించాలన్న ప్రధాని దార్శనికతలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఔషధ పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, రసాయన, పెట్రోకెమికల్ పెట్టుబడి ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహదపడుతుంది.

చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి (కేఆర్ఐఎస్ సిటీ) కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. పర్యావరణ హిత అధునాతన పారిశ్రామిక నగరంగా ఇది రూపొందనుంది. తయారీ రంగంలో దాదాపు రూ. 10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని అంచనా. జీవనోపాధిని గణనీయంగా పెంపొందించడంతోపాటు ప్రాంతీయ పురోగతికి ఈ ప్రాజెక్టు చోదకంగా నిలుస్తుంది.

ఒడిశాలో ప్రధానమంత్రి

ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రవాస భారతీయులతో అనుసంధానానికీ, వారితో భాగస్వామ్యానికీ, వారి మధ్య పరస్పర మైత్రిని పెంపొందించడానికీ ప్రవాసీ భారతీయ దివస్ వేదికవుతుంది. ఒడిశా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ నెల 8 నుంచి 10 వరకు భువనేశ్వర్ లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘వికసిత భారతానికి భారతీయ ప్రవాసుల తోడ్పాటు’’. 50కిపైగా దేశాల నుంచి భారత సంతతికి చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో ప్రవాసీ భారతీయ దివస్ లో పాల్గొనడం కోసం నమోదు చేసుకున్నారు.

భారతీయ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్యాటక రైలు అయిన ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ తొలి ప్రయాణాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మూడు వారాల పాటు దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలనూ, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలనూ చుట్టివస్తుంది. ప్రవాసీ తీర్థ దర్శన యోజన కింద ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ ను నిర్వహిస్తారు.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence

Media Coverage

India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జూన్ 2026
June 27, 2026

Appreciation for PM Modi's Development-Focused and People-Centric Governance