* సమాజ సంక్షేమం కోసం గొప్ప ఉద్దేశాలు, పవిత్రతతో ప్రయత్నాలు చేపట్టినప్పడు దైవం తోడ్పాటు లభిస్తుంది - సమాజమే దైవిక శక్తిగా మారుతుంది: పీఎం
* నైపుణ్యాభివృద్ధికి నూతన జాతీయ విద్యావిధానం అధిక ప్రాధాన్యమిస్తుంది: పీఎం
* దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి రికార్డు వేగంతో కొనసాగుతోంది: పీఎం
* ప్రస్తుత ప్రపంచం భారత శ్రమ, ప్రతిభ విలువను గుర్తించి, గౌరవిస్తోంది. ఫలితంగా వివిధ దేశాల్లో అనేక అవకాశాలు లభిస్తున్నాయి: పీఎం
* భారత్ స్వయం సమృద్ధమవ్వాలి, స్వదేశీ ఉత్పత్తులను సమాజం నమ్మకంతో స్వీకరించాలి: పీఎం
* స్వదేశీ ఉద్యమం శతాబ్దాల నాటి స్మారకం కాదు.. ఇది భవిష్యత్తును బలోపేతం చేస్తుంది.. ఆ నాయకత్వం సమాజం నుంచే ముఖ్యంగా యువత నుంచే రావాలి: పీఎం

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్- II శంకుస్థాపన సందర్శంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల సేవ, విద్యకు అంకితమైన ఈ వసతి గృహం స్థాపన గురించి వివరిస్తూ.. సర్దార్ ధామ్ పేరు లాగే అది చేసే కృషి కూడా పవిత్రమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఈ హాస్టల్లో వసతి పొందే బాలికలు...అనేక ఆకాంక్షల్నీ, ఆశయాలనీ కలిగి ఉంటారని, వాటిని నెరవేర్చుకొనేందుకు అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ అమ్మాయిలు స్వావలంబన, శక్తి సాధించినప్పుడు.. దేశ నిర్మాణంలో వారు సహజంగానే కీలకపాత్ర పోషిస్తారని, వారి కుటుంబాలు సాధికారత సాధిస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ వసతి గృహంలో ఉండే అవకాశం లభించిన బాలికలకు, వారి కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆకాంక్షిస్తూ.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

బాలికల వసతి గృహం ఫేజ్ 2కు శంకుస్థాపన చేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞత వ్యక్తం చేస్తూ.. సమాజం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాల ద్వారా 3,000 మంది అమ్మాయిలకు అద్భుతమైన ఏర్పాట్లతో నిండిన మంచి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అలాగే 2,000 మంది విద్యార్థుల కోసం వడోదరాలో చేపడుతున్న నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయని ఆయన తెలిపారు. విద్య, అభ్యాసం, శిక్షణ కోసం ఇదే తరహా కేంద్రాలను సూరత్, రాజ్‌కోట్, మెహ్సానాలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. సామాజిక బలంతోనే దేశం పురోగతి సాధిస్తుందని చెబుతూ.. ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన వారందరికీ ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను పని చేసిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. భారత పురోగతికి, గుజరాత్ అభివృద్ధి అవసరమని తాను ఎల్లప్పుడూ విశ్వసిస్తానని ప్రధానమంత్రి అన్నారు. గుజరాత్ నుంచి నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. 25-30 ఏళ్ల క్రితం సంబంధిత సూచికలకు సంబంధించి సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో.. వాటిని ఎదుర్కోవడానికి గుజరాత్ తన శక్తినంతా ఉపయోగించిన విధానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అమ్మాయిలు చదువులో వెనకబడి ఉన్నారని, చాలా కుటుంబాలు బాలికలను పాఠశాలకు పంపించడం లేదని, బడిలో చేర్పించినా వారు మధ్యలోనే చదువు మానేస్తున్నారని తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని బాధపడ్డానని శ్రీ మోదీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావడానికి 25 ఏళ్ల క్రితం ప్రజలు అందించిన మద్దతును ప్రశంసించారు. జూన్ నెలలో 40-42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని సందర్శించి బాలికలను స్కూలుకు తీసుకెళ్లిన ‘‘కన్యా శిక్ష రథ యాత్ర’’ గురించి సభలో ఉన్నవారికి ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ యాత్ర కారణంగా బడిలో చేరిన వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. ఆ కృషికి ఇప్పుడు ఫలితం దక్కుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల పాఠశాల మౌలిక వసతులు అభివృద్ధి చెందాయని, ఆధునిక సౌకర్యాలను క్పలించామని, వ్యవస్థలు బలోపేతమయ్యాయని, ఉపాధ్యాయులను నియమించామని ప్రధాని పేర్కొన్నారు. సమాజం కూడా చురుగ్గా పాల్గొని తన బాధ్యతలను నెరవేర్చింది. ఆ సమయంలో పాఠశాలల్లో చేరిన చిన్నారులు ఇప్పుడు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని, బడిమానేసే వారి సంఖ్య తగ్గిందని, నేర్చుకోవాలన్న తపన గుజరాత్ అంతా వ్యాపించిందని అన్నారు.

 

మరో ప్రధాన సమస్య అయిన స్త్రీ శిశు- భ్రూణహత్యలను ఖండిస్తూ.. వాటిని తీవ్ర కళంకమైన చర్యలుగా వర్ణించారు. ఈ సమస్య చుట్టూ అల్లుకున్న సామాజిక ఆందోళనకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమానికి తనకు లభించిన మద్దతును గుర్తు చేసుకున్నారు. స్త్రీపురుష సమానత్వాన్ని పెంపొందించేందుకు సహకరించిన సూరత్ నుంచి ఉమియా మాత వరకు జరిగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమియా మాత, ఖొడియార్ మాత, కాళీ మాత, అంబా బాత, బహుచార్ మాత ఇలా స్త్రీ శక్తిని పూజించే భూమి గుజరాత్‌లో - ఆడ భ్రూణహత్య అనే కళంకాన్ని మోయకూడదని అన్నారు. ఈ భావన మేల్కొని, విస్తృతమైన మద్దతు లభించిన తర్వాత స్త్రీ-పురుష నిష్పత్తిలో అంతరాన్ని గుజరాత్ విజయవంతంగా తగ్గించిందని అన్నారు.

‘‘సమాజ సంక్షేమం కోసం ఉన్నతమైన ఉద్దేశాలు, పవిత్రతతో ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు సమాజం, దైవం తోడ్పాటు అందిస్తాయి. సమాజమే దైవిక శక్తిగా మారతుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు కచ్చితంగా మంచి ఫలితాలను తీసుకొస్తాయని, ప్రస్తుతం సమాజంలో కొత్త జాగృతి ఉద్భవించిందని.. ఇప్పుడు తమ కుమార్తెలకు చదువును అందించేందుకు, వారి గౌరవాన్ని పెంచేందుకు, వారికి హాస్టళ్లతో సహా అవసరమైన వసతులను నిర్మించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని అన్నారు. గుజరాత్‌లో నాటిన విత్తనాలు ఇప్పుడు జాతీయ ఉద్యమంగా మారాయని - ‘‘బేటీ బేటియాన్, బేటి పఢావో’’ - ప్రజా ఉద్యమంగా మారిందని అన్నారు. దేశవ్యాప్తంగా మహిళల భద్రత, సాధికారతకు దేశవ్యాప్తంగా చారిత్రక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

 

ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ.. మహిళల వాణి బలంగా వినిపించిందని, వారి సామర్థ్యాలకు గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి అన్నారు. గ్రామాల్లో ‘‘లఖ్‌పతీ దీదీ’’లను ఉదాహరణగా చూపిస్తూ.. 3 కోట్ల మందిని తయారు చేయాలన్న లక్ష్యంలో ఇప్పటికే 2 కోట్లను సాధించామని అన్నారు. గ్రామాల్లో మహిళల పట్ల సామాజిక భావనలను ‘‘డ్రోన్ దీదీ’’ తరహా కార్యక్రమాలు మార్చాయని అన్నారు. ‘‘బ్యాంకు సఖి’’, ‘‘బీమా సఖి’’ లాంటి పథకాల గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలు దేశంలోని మాతృశక్తి ద్వారా గ్రామీణ ఆర్థిక వృద్ధిని చురుకుగా ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు.


 

సానుకూల వైఖరితో సమాజానికి తోడ్పాటును అందిస్తూనే తమ సామర్థ్యాలను పెంపొందించుకొనేలా వ్యక్తుల్ని ప్రోత్సహించాలన్నది విద్య అతి ప్రధాన ప్రయోజనం కావాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రతి రోజూ ఉరుకులు పరుగులు తీస్తున్న ఈనాటి లోకంలో, ఈ లక్ష్యం మరింత ఆవశ్యకమని ఆయన తెలిపారు. నైపుణ్యాలలో, ప్రతిభను చాటుకోవడంలో పోటీపడుతుండాలని పిలుపునిచ్చారు. సమాజపు వాస్తవ శక్తిని దానికున్న నైపుణ్యం సూచిస్తుందన్నారు. భారత్‌లోని నైపుణ్యభరిత శ్రమశక్తికి ప్రపంచ దేశాల్లో మంచి డిమాండు ఉన్న సంగతిని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఇదివరకటి ప్రభుత్వాలు కొన్ని ఏళ్ల తరబడి కాలంచెల్లిన విద్యావ్యవస్థనే చలామణీలో ఉంచాయని విమర్శించారు. తన ప్రభుత్వం ప్రధాన సంస్కరణల్ని తీసుకువచ్చిందనీ, పురాతన పద్ధతుల్ని తోసిరాజని విద్యాబోధన ముఖచిత్రాన్ని మార్చిందనీ ఆయన వివరించారు.   

కొత్త జాతీయ విద్యావిధానం నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యాన్ని కట్టబెడుతోందని ప్రధానమంత్రి గుర్తుచేస్తూ, ‘స్కిల్ ఇండియా మిషన్‌’లో భాగంగా ప్రభుత్వం లక్షల మంది యువతీయువకులను వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు పాటుపడుతోందన్నారు. ప్రపంచ దేశాలు వృద్ధుల సమస్యను ఎదుర్కొంటున్నాయనీ, వాటికి యువ ప్రతిభావంతుల అవసరం ఉందనీ చెబుతూ, భారత్‌కు ఈ విషయంలో నాయకత్వం వహించగల సామర్థ్యం ఉందన్నారు. ‘‘యువతకు నైపుణ్యం జతపడితే ఉద్యోగావకాశాలకు లోటు ఉండదు.. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. ఆత్మనిర్భరతకు ప్రోత్సాహం లభిస్తుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. యువతకు అవసరమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నదని ఆయన ఆయన తెలిపారు.

పదకొండేళ్ల  కిందట, భారత్‌లో అంకుర సంస్థలు ఏవో కొన్ని మాత్రమే ఉండేవని శ్రీ  మోదీ గుర్తు చేస్తూ ప్రస్తుతం వీటి సంఖ్య 2 లక్షలకు చేరుకొంటోందన్నారు. ఇప్పుడివి రెండో అంచె, మూడో అంచె నగరాల్లోనూ ఏర్పాటు అవుతున్నాయని ఆయన తెలిపారు. ముద్రా యోజనను ప్రవేశపెట్టడంతో, యువత పూచీకత్తు లేకుండానే బ్యాంకు రుణాలను అందుకొనే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. యువత స్వయంఉపాధి కల్పన కోసం రూ.33 లక్షల కోట్లను అందించినట్లు తెలిపారు. లక్షలాది మంది యువత సొంత కాళ్ల మీద నిలబడటంతోపాటు వారు ఇతరులకు కూడా ఉద్యోగాలను ఇస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి గుర్తుచేస్తూ... 1 లక్ష కోట్ల రూపాయలతో ‘ప్రధాన్ మంత్రీ వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ను ప్రకటించి, దానిని వెంటనే అమల్లోకి తీసుకువచ్చామన్నారు. ఎవరినైనా ప్రయివేటు రంగంలో నియమించుకొంటే, ఈ కార్యక్రమంలో భాగంగా వారి ప్రారంభ వేతనంలో రూ.15 వేలను ప్రభుత్వం అందజేస్తుంది.

 

‘‘దేశం నలుమూలల మౌలిక సదుపాయాల అభివృద్ధి అపూర్వ స్థాయిలో చోటుచేసుకొంటోంది’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ‘పీఎం సూర్య ఘర్ యోజన’లో భాగంగా సౌర శక్తి ఉత్పాదక వ్యవస్థల్ని ఏర్పాటు చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆయన తెలిపారు. డ్రోన్, రక్షణ పరిశ్రమల్లో నిరంతర వృద్ది కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. యంత్రాధారిత తయారీ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ గుజరాత్‌లో కొత్త ఉపాధి అవకాశాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాయని ఆయన వివరించారు.

‘‘ప్రస్తుతం భారతదేశ శ్రమ శక్తి, ప్రతిభ విలువను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. గౌరవిస్తున్నాయి. ఫలితంగా, వేర్వేరు దేశాల్లో అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, అంతరిక్షం వంటి రంగాల్లో భారతీయ యువత ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చుకొంటోంది. వీళ్లు తమ శక్తియుక్తులతోను, విజయాలతోను ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఎర్ర కోట నుంచి తాను చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించిన స్వావలంబన, దేశీయంగా ఉత్పత్తి అంశాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. భారత్ స్వయంసమృద్ధంగా మారి తీరాలని కోరుతూ, స్వదేశీ ఉత్పాదనలను నమ్మకంతో స్వీకరించాల్సిందిగా సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.

ఆహూతులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ... ప్రజల తోడ్పాటును ప్రశంసించారు. గత కాలంలో తాను ఏవైనా పనుల్ని అప్పగించి మార్కులను సంపాదిస్తే సంపాదించి ఉండవచ్చు కాని, ఆయా పనులను పూర్తి చేసి ఫలితాలను అందించింది ప్రజలేనన్నారు. ఇప్పటి వరకు తాను చూసిన ప్రజాజీవనం అంతటిలో తన అంచనాలు పూర్తి కాని సందర్భమంటూ లేదని ఆయన చెప్తూ, ఈ  నమ్మకమే కొత్త కొత్త బాధ్యతల్ని అప్పజెప్పాలన్న తన కోరికను బలపరుస్తోందన్నారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నెలకొని ఉన్న అస్థిర పరిస్థితుల్లో స్వావలంబనను సాధించడమే భారత్ ముందున్న అత్యుత్తమ మార్గమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. స్వావలంబన అంటే మన దేశంలో తయారైన వస్తువులకు పెద్ద పీట వేయడం, భారత్‌లో తయారీ (మేక్ ఇన్ ఇండియా) కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకుపోతుండడమే అని ఆయన వివరించారు. ‘‘స్వదేశీ ఉద్యమం శతాబ్దాల నాటి స్మారకం కాదు.... అది భవిష్యత్తుకు బలాన్నందించే ఒక ఉద్యమం .. మరి ఈ ఉద్యమానికి సారథ్యం సమాజం నుంచే, అది కూడా యువత నుంచే రావాలి’’ అని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఏ విదేశీ వస్తువూ తమ ఇళ్లలోకి రాకూడదని కుటుంబాలు సంకల్పం చెప్పుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ అంటూ తాను ఇచ్చిన పిలుపును విన్న తరువాత, విదేశాల్లో పెళ్లిళ్లు పెట్టుకున్న వాళ్లు ఆ కార్యక్రమాల్ని రద్దు చేసుకొని భారత్‌లోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారంటూ ప్రధానమంత్రి కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. ఈ రకం ఆలోచనలు సహజంగానే దేశభక్తి భావనను మేల్కొలుపుతాయని ఆయన అన్నారు.

 ‘‘భారత్‌లో తయారీ (మేక్ ఇన్ ఇండియా)తో పాటు స్వయంసమృద్ధి సహిత భారత్ (ఆత్మనిర్భర్ భారత్).. వీటిలో దక్కిన సాఫల్యం అందరిదీ, అంతేకాదు.. ఇది అందరి బలాన్నీ సూచిస్తోంది. ఇది భావి తరాల వారి కోసం వేసిన పునాది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. ప్రజలు భారతీయ ఉత్పాదనలను ఎంపిక చేసుకోవడం మొదలుపెడితే మార్కెట్లో పోటీ, మెరుగైన ప్యాకేజింగు, తక్కువ ఖర్చు.. ఈ కారణాలతో నాణ్యత దానంతట అదే మెరుగుపడుతుందని ఆయన అన్నారు. మన దేశ కరెన్సీని దేశం సరిహద్దులు దాటి బయటకు పోనివ్వడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.

తాను అప్పగించిన చిన్న పనిని సమాజం అవగాహనతో పూర్తి చేయడంతో పాటు దేశానికి కొత్త శక్తిని అందిస్తుందన్న నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాజం వ్యవసాయ ప్రధానమైందే కాక, కొత్తగా పరిశ్రమలను నెలకొల్పాలన్న ఆసక్తితో కూడా ఉందని, దీనిని గమనించాల్సిందిగా వాణిజ్య రంగ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ఇక్కడ స్వదేశీ ఉత్పాదనలు మాత్రమే అమ్ముతాం’’ అనే ప్రకటనలను ప్రదర్శించాల్సిందిగా వాణిజ్య ప్రముఖులకు ఆయన సూచించారు. మన దేశంలో తయారైన వస్తువులనే కొనాలని వినియోగదారులను ప్రోత్సహించాల్సిందిగాను, స్వదేశీ వస్తువులను మాత్రమే విక్రయిస్తామంటూ వాణిజ్య ప్రముఖులు తమకు తాము ఒక కట్టుబాటును విధించుకోవాల్సిందిగాను వారికి శ్రీ మోదీ సలహా ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ మాత్రమే దేశభక్తి కాదు, ఇది  కూడా దేశభక్తిని చాటే పనే.. స్వదేశీని అక్కున చేర్చుకోవడమంటే అది ఒక రకంగా దేశానికి చేస్తున్న సేవేనని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ సెంటిమెంటును ప్రజల చెంతకు చేరుస్తూ వారి నిబద్ధతను, తోడ్పాటును చాటిచెప్పాల్సిందిగా ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించే ముందు, ప్రజల మధ్యకు వచ్చేందుకు తనకు అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రగాఢ కృతజ్ఞతలను వ్యక్తం చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపడుచులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ  అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.‌

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
NTA terminates 47 officials amid major exam reform drive, more action ahead

Media Coverage

NTA terminates 47 officials amid major exam reform drive, more action ahead
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets everyone on the occasion of Ashadhi Ekadashi
July 25, 2026

Prime Minister Shri Narendra Modi today conveyed his greetings on the sacred occasion of Ashadhi Ekadashi. He noted that this auspicious day is about the eternal message of devotion and compassion.

Shri Modi prayed that Bhagwan Vitthal’s blessings bring joy, harmony and prosperity, and guide everyone towards a better society. The Prime Minister also wished that He may strengthen our resolve to serve and work tirelessly for the welfare and dignity of every person.

In a series of posts on X, the Prime Minister shared: 

"Greetings on the sacred occasion of Ashadhi Ekadashi. This auspicious day is about the eternal message of devotion and compassion. May Bhagwan Vitthal’s blessings bring joy, harmony and prosperity and guide us towards a better society. May He strengthen our resolve to serve and work tirelessly for the welfare and dignity of every person."

"आषाढी एकादशीच्या पवित्र पर्वानिमित्त हार्दिक शुभेच्छा. हा मंगलमय दिवस भक्ती, करुणा आणि सामाजिक सलोख्याचा चिरंतन संदेश देणारा आहे. भगवान विठ्ठलाचे आशीर्वाद आपल्या सर्वांच्या आयुष्यात आनंद, सलोखा आणि समृद्धी घेऊन येवो, हीच कामना. समाजातील प्रत्येक व्यक्तीच्या कल्याणासाठी आणि सन्मानासाठी अविरत कार्य करण्याचा आपला संकल्प अधिक दृढ होवो, हीच विठ्ठल चरणी प्रार्थना."