జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి: ప్రధాని మోదీ
నా ప్రియమైన దేశవాసులారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండ, వేడి గాలులు, ఇలాంటి వాతావరణంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం: ప్రధాని మోదీ
బీహార్, జార్ఖండ్ మరియు తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో సత్తు షర్బత్ అద్భుతంగా ఉంటుంది – ఇది కడుపు నింపుతుంది మరియు శక్తిని ఇస్తుంది: ప్రధాని మోదీ
సేవకు విస్తారమైన వనరులు అవసరం లేదు - కావలసింది మంచి సంకల్పం మరియు నిరంతర కృషి: ప్రధాని మోదీ
నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి ఇచ్చారు: ప్రధాని మోదీ
ఖగోళ శాస్త్రం మన దేశంలోని ప్రతి తరంలో ఉత్సుకతను రేకెత్తించింది. ఇది అన్వేషణకు స్ఫూర్తినిచ్చింది; నేటి యువతలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది: ప్రధాని మోదీ
డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్‌ను మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. డాల్ఫిన్‌ను సురక్షితంగా ఉంచడానికి ఏర్పాట్లు ఉన్నాయి: ప్రధాని మోదీ
మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్‌ను కాపాడినప్పుడు, కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడటం లేదు; మనం గంగా జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నాం: ప్రధాని మోదీ
గిరిజా అమ్మగారి దేశభక్తి స్ఫూర్తి ప్రతి భారతీయుడికి ఉత్తేజం కలిగిస్తుంది. 'మన్ కీ బాత్' స్ఫూర్తితో, దేశంలోని ఎందరో సైనికులకు విరాళాలు అందిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు: ప్రధాని మోదీ

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.

మిత్రులారా! దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం రెండు రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయస్థాయిలో పాతరికార్డులను మూడుసార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన ఇద్దరు అథ్లెట్లు గురిందర్‌వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి 'మన్ కీ బాత్'లో ఈ ఇద్దరు అథ్లెట్లతో మాట్లాడాలని అనుకున్నాను.

(ఫోన్ కాల్)

ప్రధానమంత్రి: నమస్కారం అనిమేష్ గారూ... గురిందర్‌వీర్ గారూ.. మీకు కూడా నమస్కారం. సత్ శ్రీ అకాల్.

 

అనిమేష్, గురిందర్‌వీర్: నమస్కారం సార్, నమస్కారం సార్.

 

ప్రధానమంత్రి: సోదరులారా! మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం. కానీ ఇప్పుడు పోటీలలో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాలు విసురుతారు.  మరొకరు దాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. 'మన్ కీ బాత్' శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియాలని నేను కోరుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్పండి.

 

అనిమేష్: నమస్కారం సార్, నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను. మాది ఛత్తీస్‌గఢ్‌. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను. నేను అంబికాపూర్‌లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్‌బాల్ ఆడేవాడిని. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరుగెత్తమని లేదా ఆడుకొమ్మని చెప్తూ మా అమ్మానాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చేవారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడం ప్రారంభమైనప్పుడు నా ఫుట్‌బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు. నేను అక్కడి నుండి జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈ రోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.

 

ప్రధానమంత్రి: మరి గురిందర్‌వీర్ గారూ... మీ గురించి చెప్పండి.

 

గురిందర్‌వీర్: నమస్కారం సార్. నా పేరు గురిందర్‌వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్‌ను. నేను ఇప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను. 10.1 సెకన్ల లోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాక్‌పై, యూనిఫాంలో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, తాతగారు ఇద్దరూ క్రీడలు ఆడేవారు. కాబట్టి దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవడం మా భారతీయ సంస్కృతిలో భాగం. అందుకే నేను మా నాన్నగారి ట్రోఫీలను, పతకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు "మీరు ఈ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పతకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన "నేను పోటీల్లో ఆడటానికి వెళ్ళాను. ఈ జాతీయ పతకాన్ని గెలిచాను. మా జట్టును గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళమని చెప్పడం మొదలుపెట్టాను. దాంతో ఆయన నన్ను తీసుకెళ్ళడం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించడం ప్రారంభించారు. ఆ తర్వాత నాకు ఆసక్తి కలగడం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పడం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా, మా అమ్మ "బాబూ... చదువుకునే సమయం అయింది. నువ్వు చదువుకోవాలి" అని చెప్పి టీవీ ఆపేసింది. అప్పుడు "ఫర్వాలేదు...నన్ను టీవీ చూడనివ్వకు. కానీ ఏదో ఒకరోజు గురిందర్ పరుగెత్తడం చూడడం కోసం నువ్వు టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరుగెత్తడం చూసినప్పుడు నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది.

 

ప్రధానమంత్రి: వావ్… వావ్… వావ్ … సోదరా! ఈ విషయం చాలా గొప్పది.

 

గురిందర్ వీర్: అవును సార్. మేం మధ్యతరగతి కుటుంబానికి చెందినవాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కల నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కలను నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్ఖా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కలను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు ఆయన “కలలు అలా నెరవేరవు.  దాని కోసం చాలా కష్టపడాలి. చాలా కష్టపడాలి”  అని చెప్పేవారు. మిల్ఖా సింగ్ గారు రక్తం కక్కేవారు. ఎండలో పరిగెత్తేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు.  ఆ విషయాలు నాకు స్ఫూర్తినిచ్చేవి. నేను పరుగెత్తితే మన దేశం కోసం పతకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంట్‌ను ఎంచుకున్నప్పుడు అందరూ నాతో  "సోదరా! 100 మీటర్లు చేయకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు, నేను ఎప్పుడూ "గురిందర్..  మనం దీన్ని ఎంచుకున్నాం. దాని నుండి ఇక వెనకడుగు వేయం" అని చెప్పుకునేవాళ్ళం. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి, గెలిచి చూపించాలని మా నాన్న గారు చెప్పేవారు. “నువ్వు చేస్తావు. నీపై నాకు నమ్మకం ఉంది” అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్నే నా ధైర్యంగా మార్చుకుని ముందుకు సాగాను. ఈ రోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.

 

ప్రధానమంత్రి: చూడండి, మీరిద్దరూ గొప్ప పని చేశారు. కేవలం రెండు రోజుల్లోనే మూడుసార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురిందర్‌వీర్ చెప్పినట్లుగా, 100 మీటర్ల పరుగు పందెంలో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు చాలా కష్టపడ్డారు. మీ ఇద్దరి నుండి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. 'మన్ కీ బాత్' శ్రోతలు కూడా మీ అభిరుచి ఏమిటి, మీ పట్టుదల ఏమిటి, మీ ఆలోచనలు ఏమిటి,  మీరంతా దీన్ని ఎలా సాధించారు? ఇది ఎంత కష్టమైనది? అనే విషయాలను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నారు.

 

గురిందర్‌వీర్: సార్. నేను గురిందర్ ని. నేను మొదట్లో చాలా పోరాటం చేశాను.  నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం. కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించనప్పుడు, నాకు గాయమైనప్పుడు, నా కుటుంబసభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ “ఫర్వాలేదు... ఒక రోజు చెడుగా గడిచినా, ఒక సంవత్సరం చెడుగా గడిచినా, అది నీ జీవితాన్ని పాడుచేయదు. కలలు కనడం ఆపవద్దు” అని చెప్పేవారు. “నువ్వు చేయకపోతే ఇంకెవరూ చేయలేర”ని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.

 

ప్రధానమంత్రి: అనిమేష్ గారూ... మీరు చెప్పండి.

 

అనిమేష్: సార్... నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో “చూడు... ఇది కొత్త రంగం... నువ్వు దీన్ని చేయగలవా లేదా?' అని అడిగేవారు. అప్పుడు నేను “ఇప్పుడు నేను ఈ రంగంలోకి అడుగుపెట్టాను. కాబట్టి నేను తప్పకుండా చేస్తాను” అని చెప్పాను. మా నాన్నగారు కూడా నాతో ఎప్పుడూ “నువ్వు ఈ రంగంలోకి అడుగుపెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే నువ్వు ఇది చేయాలి, అది చేయాలి అని అందరూ అనుకుంటారు. కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టావు. కాబట్టి దీనికే కట్టుబడి ఉండు. దీంట్లోనే ముందుకు సాగిపో' అని చెప్పేవారు. “నీకు మేం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం. కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం... అన్నీ చేస్తాం. కేవలం కష్టపడి పనిచేసి, భారతీయులు కూడా పరుగెత్తగలరని భారతదేశానికి చూపించు.” అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకన్ల లోపు లేదా 10.1 సెకన్ల లోపు పరుగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం  నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకు అంత కష్టం కాదు. మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్‌లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరని ఇతర భారతీయులు కూడా చూస్తున్నారు. మేం ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీలో మరింత మెరుగ్గా రాణిస్తాం.

 

ప్రధానమంత్రి: అయితే చూడండి... నాకు కూడా ఒక ఆసక్తి ఉంది. ప్రజలకు కూడా ఉంటుంది. మీరిద్దరూ మంచి స్నేహితులని నేను విన్నాను. మీరు నా రికార్డును బ్రేక్ చేస్తే, నేను మీ రికార్డును బ్రేక్ చేస్తానని మీరిద్దరూ నిర్ణయించుకున్నారా? అనిమేష్… ముందు మీరు చెప్పండి.

 

అనిమేష్: సర్, మొదటి రికార్డు 10.18 సెకన్లు. అది నాదే. ఆ తర్వాత సెమీ-ఫైనల్‌లో గురిందర్‌వీర్ భయ్యా 10.17 సెకన్లతో దాన్ని బద్దలు కొట్టారు. రెండో సెమీ-ఫైనల్‌లో నేను 10.15తో దాన్ని మళ్ళీ బద్దలు కొట్టాను. ఆ సమయంలో నా సెమీ-ఫైనల్ జరిగినప్పుడు “అవును... ఫర్వాలేదు.  ఈరోజు రికార్డు బద్దలైంది.  మేమిద్దరం కలిసి చేశాం” అని మేమిద్దరం సంతోషించాం. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్ లో  ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకు ముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం. అక్కడ మేమిద్దరం రూమ్‌మేట్స్‌గా కూడా ఉండేవాళ్ళం. అందుకే అక్కడ మేమిద్దరం “మనం భారతదేశ స్ప్రింటింగ్‌ను ముందుకు తీసుకెళ్లాలి. ఆ విషయం మన చేతుల్లోనే ఉంది. మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది” అని మాట్లాడుకునేవాళ్ళం.

 

ప్రధానమంత్రి: గురిందర్‌వీర్... మీరేం చెప్పాలనుకుంటున్నారు?

 

గురిందర్‌వీర్: మేమిద్దరం బాగా పరుగెత్తాలని నిర్ణయించుకున్నాం. అందుకే సార్.. మేం ఒకరికొకరం అవసరమైనప్పుడు ఒకరికొకరం అండగా నిలబడతాం. ఇప్పుడే రికార్డింగ్‌కు ముందు చేసినట్టు. ఇపుడు ముందుగా నేను రికార్డ్ చేశాను. ఆ తర్వాత అనిమేష్ చేశాడు. మేం వార్మప్ చేస్తున్నప్పుడు అనిమేష్‌తో "అనిమేష్, ఆ బ్లాక్ సరిగ్గా ఉంది. వెళ్లి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి. మనం ఇక్కడ వార్మప్ చేద్దాం. వార్మప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటే అవతలి వారు కూడా మెరుగుపడతారు. మనం కూడా మెరుగుపడతాం" అని చెప్పాను. కాబట్టి స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట.. పోటీకి బయట ఉన్నపుడు స్నేహితులం. మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికొకరం పోటీదారులం అవుతాం. అప్పుడు “నేను ఇతని కంటే వేగంగా పరుగెడతాను. నేను ఇతని కంటే వేగంగా పరుగెడతాను” అని అనుకుంటూ ఉంటాం.

 

ప్రధానమంత్రి: చూడండి.. మీరందరూ ఈ పోటీ దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేశారు. మీరు దానిని సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడాస్ఫూర్తితో ఒకరినొకరు సవాలు చేసుకుంటూ, ముందుకు సాగడానికి కృషి చేస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మీరు అద్భుతమైన పని చేశారని నేను నమ్ముతున్నాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు, నా శుభాకాంక్షలు. మీరు దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారని నాకు నమ్మకం ఉంది.  మీకు చాలా చాలా శుభాకాంక్షలు.

 

గురిందర్‌వీర్/అనిమేష్: ధన్యవాదాలు సార్… ధన్యవాదాలు.

 

ప్రధాన మంత్రి: చాలా చాలా ధన్యవాదాలు.

#####

       నా ప్రియమైన దేశప్రజలారా! ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను మర్చిపోవద్దు.

మిత్రులారా! వేడిని తట్టుకునే మార్గం తరచుగా వంటగదిలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుందని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగిపొర్లుతుంది. మరికొన్ని చోట్ల పెరుగు గడ్డకడుతుంది. పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ప్రారంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది. మీరు ఉత్తర భారతదేశానికి వెళితే అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుండి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు కనిపిస్తుంది. రాజస్థాన్, గుజరాత్‌లలో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాకుండా బీహార్, ఝార్ఖండ్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌ల సత్తు షర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది కడుపు నింపి, శక్తినిస్తుంది. కొంకణ్, గోవాలలో  కోకుమ్ షర్బత్, సోల్ కఢి దొరుకుతాయి.  దక్షిణ భారతదేశపు పానకం, నీర్ మోర్, సాంబారు; ఒడిశాలో లభించే బేల్ పానా కేవలం పానీయాలు మాత్రమే కాదు. అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగం. అవి 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి. వీటిలో చాలా వరకు మన వంటగదుల నుండి, మన పొలాల నుండి, పశువుల కొట్టాల నుండి వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు. కానీ అవి తరతరాల అనుబంధాన్ని  ప్రతిబింబిస్తాయి. మీరు కూడా వేసవిలో ఈ దేశీయ పానీయాలను ఆస్వాదించాలి.

మిత్రులారా! వేసవి రాకతో ప్రతి ఇంట్లో మరో చర్చ మొదలవుతుంది. అది మామిడి పండ్లపై ఉంటుంది. మామిడిపండ్లు ఒక సాధారణ చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడిపండ్ల ప్రస్తావన రాని ఇల్లు దాదాపుగా ఉండదు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో మామిడి రకం, ఒక్కో రుచి, ఒక్కో సువాసన ఉంటాయి. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుండి హాపుస్, అల్ఫోన్సో రకాలుంటాయి. గుజరాత్ నుండి కేసర్- ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తర ప్రదేశ్ నుండి దశహరి; ఇక కాశీ నుండి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పండ్లకు ఒక ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా వాటి రంగు తరచుగా ఆకుపచ్చగానే ఉంటుంది. బీహార్ నుండి జర్దాలూ సువాసనను దూరం నుంచే గుర్తించవచ్చు. చౌసా, మాల్దా — ఇలా ప్రతి పేరుతో ముడివడిన జ్ఞాపకాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి వెళితే బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలుంటాయి.  బెంగాల్ నుండి హిమసాగర్; ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ల నుండి సువర్ణరేఖ ఉన్నాయి. ప్రదేశం మారేకొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారతాయి. మిత్రులారా! మామిడిపండ్ల  ఈ ప్రయాణం ఇప్పుడు పల్లెటూరి నుండి ప్రపంచ మార్కెట్‌కు చేరుకుంటోంది. ఈ రోజు జరుగుతోన్న 'మన్ కీ బాత్' ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులను నేను ప్రశంసిస్తాను. మీరు కేవలం సాధారణ రైతులు కాదు- దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైనవారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నాను.

మిత్రులారా! పాఠశాలలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలకునే ఒక తరగతి గురించి నేను చెప్తాను. మిత్రులారా... ఒక పరిస్థితిని ఊహించుకోండి: అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా హాజరవుతారు. అక్కడ ఎటువంటి ఫీజులు ఉండవు. పెద్ద భవనాలు ఉండవు. తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి.

మిత్రులారా! ఇది ఒక కథ కాదు. ఇది ఒక నిజమైన ప్రయత్నం. కేరళలోని ఆలువాలో సాజి వలాశేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్బును నడుపుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజి దివ్యాంగ పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక పడవ ప్రమాదంలో చాలా మంది విద్యార్థులు మరణించారు. ఆ సంఘటన సాజిని తీవ్రంగా కలచివేసింది. పిల్లలకు ఈత వచ్చి ఉంటే ఎన్నో ప్రాణాలను కాపాడి ఉండేవాళ్ళమని ఆయన భావించారు. ఆ ఆలోచనతో ఆయన ఈ కృషి ప్రారంభించారు.

మిత్రులారా! సాజి వలాశేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సేవకు గొప్ప వనరులు అవసరం లేదు. కావాల్సింది మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాలను మార్చవచ్చు.

నా ప్రియమైన దేశవాసులారా! ఇటీవల నాకు యూరప్‌లోని నెదర్లాండ్స్‌ను సందర్శించే అవకాశం లభించింది. నేను అక్కడ అనేక సమావేశాలకు హాజరయ్యాను. ఈ సమయంలో ప్రతి భారతీయుడిని గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ ప్రధానమంత్రి కూడా హాజరయ్యారు. ఈ రాగి ఫలకాల గురించి నాకు భారతదేశంతో పాటు విదేశాల నుండి కూడా నిరంతరం సందేశాలు వస్తున్నాయి. ప్రజలు తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వాటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది.

మిత్రులారా! ఈ రాగి ఫలకాల గురించి ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. అందువల్ల ఈ రోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ 21 పెద్ద, మూడు చిన్న రాగి ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంబంధించినవి. ఆనైమంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటున్నాయి. ఈ రాగి ఫలకాలు చోళ రాజవంశం  విజయాలను కూడా వివరిస్తాయి. అవి చోళ సామ్రాజ్యం  బలమైన సముద్ర శక్తిని వెల్లడిస్తాయి. ఆగ్నేయాసియా దేశాలతో వారి సంబంధాల గురించి కూడా అవి సమాచారాన్ని అందిస్తాయి.

చోళ సామ్రాజ్య  గొప్ప చరిత్ర, సంస్కృతి పట్ల మనమందరం చాలా గర్వపడతాం. మిత్రులారా! భారతదేశానికి చెందిన ఇటువంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ విషయంలో 'జ్ఞాన భారతం అభియాన్' కింద ఛత్తీస్‌గఢ్‌లోని మల్హార్‌లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ మూడు అరుదైన రాగి ఫలకాలు లభించాయి. ఇవి పాండువంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు ఆరవ-ఏడవ శతాబ్దానికి చెందినవి. అంటే పద్నాలుగు వందల, పదిహేను వందల సంవత్సరాల పూర్వం నాటివన్నమాట. ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి, పాలి భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి.

మిత్రులారా! మన భారతీయులకు ఖగోళశాస్త్రంపై ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు  ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి. పంచాంగం కానివ్వండి. లేదా మన పండుగలు ఏవైనా సరే...  వాటన్నింటికీ ఆకాశం, నక్షత్రాలతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలోనూ ఖగోళశాస్త్రం కుతూహలాన్ని రేకెత్తించింది. ఇది అన్వేషణకు స్ఫూర్తినిచ్చింది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళశాస్త్ర క్లబ్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయని మీరు గమనించే ఉంటారు. వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుండి పార్కుల వరకు కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఖగోళశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. 'ఖగోళ్  మండల్' అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ప్రారంభించింది.

మిత్రులారా! రాత్రిపూట నక్షత్రాలను చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. ఇక్కడ యువత టెలిస్కోపులను తయారు చేయడం, నక్షత్ర పటాలను ఉపయోగించడం నేర్చుకుంటారు. రాజ్‌కోట్‌లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలను నిర్వహించింది. ‘జ్యోతిర్విద్యా పరిసంస్థ’ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థలలో ఒకటి. ఇది పరిశీలన సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐఎస్ ఏఏసి (ఐజాక్-ISAAC)  గురించి కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇది విద్యార్థులు నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్‌వర్క్. ఇది ఖగోళశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్‌లను అనుసంధానిస్తుంది.

మిత్రులారా! మీ అభిరుచి కోసం సమయం కేటాయించడం, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్‌లో చేరాలని, ఏదైనా ప్లానెటేరియంను సందర్శించాలని నేను కోరుతున్నాను.

మిత్రులారా! టీవీలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియోను చూడాలని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఇటీవల చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్‌ను కాపాడటానికి ఓపికగా, జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి సుమారు 13 గంటల సమయం పట్టిందని, చివరికి ఆ డాల్ఫిన్‌ను కాపాడారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

మిత్రులారా! ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ కీలక పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. 'నమామి గంగే అభియాన్' కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్‌కు ఆశ కల్పించింది. అప్పుడు దాన్ని జాగ్రత్తగా రక్షించారు. దానికి పరీక్షలు చేసి, చికిత్స అందించి, ఆ తర్వాత సురక్షితంగా రాప్తి నదిలోకి విడిచిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తిరిగి వచ్చింది.

మిత్రులారా! ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా ప్రత్యేకమైనది. దీన్ని ఒక మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్‌ను సురక్షితంగా ఉంచడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్‌కు గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుండి వేరుపడినా దానికి తక్షణమే సహాయం అందించవచ్చు.

మిత్రులారా! మనం గంగా డాల్ఫిన్‌ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడటం లేదు. మనం గంగానది జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నాం.  మనం నది  సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి, మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని పరిరక్షిస్తున్నాం.

నా ప్రియమైన దేశప్రజలారా! మీలో చాలా మందికి నది, చెరువు లేదా బావి నీటితో ముడిపడిన జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం గుర్తుండవచ్చు. కొందరికి చెరువు గట్లపై స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండవచ్చు.  మరికొందరికి మట్టి వాసన గుర్తుండవచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసులో నిలిచిపోతాయి.

మిత్రులారా! ఇలాంటి జ్ఞాపకాలను పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా నుండి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో పరిశుభ్రంగా, జీవకళతో నిండిన ఆ నదిలో కాలక్రమేణా ప్లాస్టిక్‌ పేరుకుపోవడం మొదలైంది. ఆ మురికి పెరుగుతూనే ఉంది. దీనిపై ఫిర్యాదు చేయకూడదని, ఒక కొత్త ప్రారంభం చేయాలని ఆకాష్ నిర్ణయించుకున్నారు. "ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే" అనేది ఆయన మంత్రంగా మారింది. ఆయన తన స్నేహితులను సమీకరించారు. వారి దగ్గర కేవలం ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నిటికంటే మిన్నగా  ఏదైనా మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పమనే గొప్ప బలం ఉండేది. ఈ యువకులు నదిలోకి దిగి, నీటి నుండి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్‌ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒక్క రోజులోనే నది నుండి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్ళీ శుభ్రంగా కనిపించడం ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది.

మిత్రులారా! గోవా నుండి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్యగారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలనే ఆయన ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. మడ్డి-తోలాప్ ప్రాంతంలోని నీటి సమస్య ఆయనను తీవ్రంగా కలవరపరిచింది. ఆయన కూడా ఒక పరిష్కారం కోసం కృషి చేయడం ప్రారంభించారు. పైప్‌లైన్లు వేయడంలో బాలకృష్ణగారు కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజూ నీటి కోసం పోరాడవలసి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది.

మిత్రులారా! గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. ఇది కూడా ‘మన్ కీ బాత్’కు సంబంధించినదే. అందుకే ఈ రోజు నేను ఈ విషయం మీతో చర్చించాలనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ఒక ఉపాధ్యాయురాలిని కలిశాను. నేను దాదాపు మూడు దశాబ్దాల కిందట కూడా ఆమెను కలిశాను. నేను మాట్లాడుతున్నది గిరిజా అమ్మగారి గురించి. ఈ సమావేశంలో ఆమెతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా! గిరిజా అమ్మగారు సుమారు 15 పాఠశాలలను నడుపుతున్నారు. వీటిలో చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైనది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి ప్రేరణనిస్తుంది. 'మన్ కీ బాత్' స్ఫూర్తితో ఆమె దేశంలోని ఎందరో సైనికులకు విరాళం ఇవ్వడానికి ప్రతిజ్ఞ చేశారు. ఇది చేయడానికి, ఆమె తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థులను ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజూ ఒక రూపాయి విరాళంగా ఇవ్వమని ఆమె పిల్లలను కోరారు. అంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరి నుండి ఒక సంవత్సరంలో 365 రూపాయలు సేకరించారు. ఈ చిన్న విరాళాలు సుమారు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజా అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆమెకున్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ సమయంలో  నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య, సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించడంలో ఈ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయం. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రశంసలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా! భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఈ ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితోనే ముందుకు సాగుతోందనే మన నమ్మకం మరింత బలపడుతుంది. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలను మీరు తప్పకుండా గమనించాలని నేను కోరుతున్నాను. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి. వారిని అభినందించండి. వారి నుండి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల 'మన్ కీ బాత్'లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
On Puri’s Grand Road, a devotee’s submission

Media Coverage

On Puri’s Grand Road, a devotee’s submission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister speaks with the Amir of Qatar
July 16, 2026
PM conveys heartfelt condolences on the passing of the Father Amir of Qatar
PM recalls the Father Amir’s visionary leadership and his contribution to strengthening India-Qatar relations
The two leaders reaffirm their resolve to carry forward the Father Amir’s legacy

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with the Amir of the State of Qatar, H.H. Sheikh Tamim bin Hamad Al Thani.

Prime Minister conveyed his heartfelt condolences on the passing of H.H. Sheikh Hamad bin Khalifa Al Thani, the Father Amir of Qatar.

Recalling the Father Amir’s significant contributions as the chief architect of modern Qatar, Prime Minister paid tribute to his visionary leadership, and recalled his pivotal role in strengthening India-Qatar relations over the years as well as his deep affection for India and the Indian community in Qatar.

The Amir of Qatar thanked Prime Minister for his call and conveyed his appreciation for the words of support in this difficult hour.

The two leaders reaffirmed their resolve to carry forward the Father Amir’s legacy and further strengthen the India-Qatar Strategic Partnership and people-to-people ties.

They agreed to remain in close touch.