The Constitution is our guiding light: PM Modi
A special website named constitution75.com has been created to connect the citizens of the country with the legacy of the Constitution: PM
Mahakumbh Ka Sandesh, Ek Ho Poora Desh: PM Modi in Mann Ki Baat
Our film and entertainment industry has strengthened the sentiment of 'Ek Bharat - Shreshtha Bharat': PM
Raj Kapoor ji introduced the world to the soft power of India through films: PM Modi
Rafi Sahab’s voice had that magic which touched every heart: PM Modi remembers the legendary singer during Mann Ki Baat
There is only one mantra to fight cancer - Awareness, Action and Assurance: PM Modi
The Ayushman Bharat Yojana has reduced the financial problems in cancer treatment to a great extent: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 2025 సంవత్సరం దాదాపు వచ్చేసింది. తలుపు తడుతోంది. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 2025 జనవరి 26 నాటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అందజేసిన రాజ్యాంగం కాలపరీక్షలో నిలిచిపోయింది. రాజ్యాంగం మనకు దిక్సూచి. మనకు మార్గదర్శకం. భారత రాజ్యాంగం వల్లనే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. మీతో మాట్లాడగలుగుతున్నాను. ఈ సంవత్సరం నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవం నుండి ఒక ఏడాది పాటు కొనసాగే అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేశ పౌరులను రాజ్యాంగ వారసత్వంతో అనుసంధానం చేసేందుకు constitution75.com పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. దీనిలో మీరు రాజ్యాంగ ప్రవేశికను చదివిన తర్వాత మీ వీడియోను అప్‌లోడ్ చేయవచ్చు. మీరు వివిధ భాషలలో రాజ్యాంగాన్ని చదవవచ్చు. రాజ్యాంగంపై ప్రశ్నలు కూడా అడగవచ్చు. ‘మన్ కీ బాత్’ శ్రోతలు, పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు, కళాశాలకు వెళ్లే యువత ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఇందులో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను.

మిత్రులారా! వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కూడా జరగబోతోంది. ప్రస్తుతం త్రివేణీ సంగమ తీరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాకు గుర్తుంది- కొద్ది రోజుల క్రితం నేను ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళినప్పుడు హెలికాప్టర్‌లో నుండి యావత్ కుంభమేళా క్షేత్రాన్ని చూసి చాలా సంతోషించాను. చాలా విశాలంగా ఉంది.! చాలా సుందరంగా ఉంది! ఎంతో భవ్యంగా ఉంది.!

మిత్రులారా! మహాకుంభమేళా ప్రత్యేకత దాని విశాలత్వంలోనే కాదు- కుంభమేళా ప్రత్యేకత దాని వైవిధ్యంలో కూడా ఉంది. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ప్రజలు తరలివస్తారు. లక్షలాది మంది సాధువులకు, వేల పరంపరలకు, వందలాది సంప్రదాయాలకు, అనేక వైవిధ్యాలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుంది. ఎక్కడా భేద భావాలుండవు. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనే తారతమ్యాలుండవు. ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వ దృశ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అందుకే మన కుంభమేళా ఐక్యతా మహాకుంభమేళా కూడా. ఈసారి మహాకుంభమేళా ఐక్యతా మహాకుంభ మంత్రానికి బలం చేకూరుస్తుంది. కుంభమేళాకు హాజరైనప్పుడు ఈ ఐక్యతా సంకల్పంతో తిరిగి రమ్మని నేను మీ అందరికీ చెప్తాను. సమాజంలో విభజన భావాలను, విద్వేషాన్ని పోగొట్టేందుకు ప్రతిజ్ఞ కూడా చేయాలి. తక్కువ పదాలతో చెప్పవలసి వస్తే నేను ఇలా చెప్తాను ...

మహాకుంభ సందేశం- ఐక్యంగా ఉండాలి యావద్దేశం.

మహాకుంభ సందేశం- ఐక్యంగా ఉండాలి యావద్దేశం

మరో రకంగా చెప్పాల్సి వస్తే ఇలా చెప్తాను...

నిరంతర గంగా ప్రవాహం- విచ్ఛిన్నం కావద్దు మన సమాజం.

నిరంతర గంగా ప్రవాహం- విచ్ఛిన్నం కావద్దు మన సమాజం.

మిత్రులారా! ఈసారి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో జరిగే డిజిటల్ మహాకుంభమేళాను దర్శిస్తారు. డిజిటల్ నావిగేషన్ సహాయంతో వివిధ ఘాట్‌లు, దేవాలయాలు, సాధువుల నివాసాలకు చేరుకోవడానికి దారి తెలుస్తుంది. ఈ నావిగేషన్ వ్యవస్థ పార్కింగ్ స్థలాన్ని చేరుకోవడానికి కూడా సహాయపడుతుంది. మొదటిసారిగా కుంభమేళాలో కృత్రిమ మెధ చాట్‌బాట్ ఉపయోగాన్ని చూడవచ్చు. ఈ చాట్‌బాట్ ద్వారా కుంభమేళాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని 11 భారతీయ భాషల్లో పొందవచ్చు. టెక్స్ట్ టైప్ చేయడం ద్వారా, మాట్లాడటం ద్వారా ఎవరైనా ఈ చాట్‌బాట్ నుండి ఎలాంటి సహాయం అయినా అడగవచ్చు. ఈ క్షేత్రం యావత్తూ కృత్రిమ మేధతో తీర్చిదిద్దిన కెమెరాలతో ఉంటుంది. కుంభమేళా సమయంలో ఎవరైనా పరిచయస్తుల నుండి విడిపోతే వారిని కనుగొనడంలో కూడా ఈ కెమెరాలు సహాయపడతాయి. భక్తులు డిజిటల్ లాస్ట్ & ఫౌండ్ కేంద్ర సౌకర్యం కూడా పొందుతారు. ప్రభుత్వం ఆమోదించిన టూర్ ప్యాకేజీలు, వసతి, హోమ్‌స్టేల గురించి కూడా భక్తులకు మొబైల్‌లో సమాచారం లభిస్తుంది. మీరు కూడా మహాకుంభమేళాకు వెళ్తే ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి. అవును… ఖచ్చితంగా #EktaKaMahaKumbh అనే ట్యాగ్ తో మీ సెల్ఫీని అప్‌లోడ్ చేయండి.

మిత్రులారా! ‘మన్ కీ బాత్’లో అంటే MKBలో ఇప్పుడు మనం KTB గురించి మాట్లాదుకుందాం. పెద్దవారికి చాలా మందికి KTB గురించి తెలియదు. కానీ పిల్లలను అడగండి- వారి విషయంలో KTB చాలా సూపర్‌హిట్. KTB అంటే క్రిష్, త్రిష్, బాల్టీబాయ్. పిల్లలకు ఇష్టమైన యానిమేషన్ సిరీస్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు. దాని పేరు KTB – భారత్ హై హమ్. ఇప్పుడు దాని రెండవ సీజన్ కూడా వచ్చింది. ఈ మూడు యానిమేషన్ పాత్రలు భారత స్వాతంత్ర్య పోరాటంలో పెద్దగా చర్చించబడని నాయకులు,నాయకురాళ్ల గురించి చెప్తాయి. ఇటీవలే దాని రెండో సీజన్ గోవాలోని భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చాలా ప్రత్యేకమైన శైలిలో ప్రారంభమైంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సిరీస్ అనేక భారతీయ భాషలలోనే కాకుండా విదేశీ భాషలలో కూడా ప్రసారమవుతోంది. దీన్ని దూరదర్శన్‌తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా చూడవచ్చు.

మిత్రులారా! మన యానిమేషన్ చిత్రాలు, చలన చిత్రాలు, టీవీ సీరియళ్లకు లభిస్తున్న ఆదరణ భారతదేశ సృజనాత్మక పరిశ్రమకు ఎంత సామర్థ్యం ఉందో నిరూపిస్తుంది. ఈ పరిశ్రమ దేశ ప్రగతికి దోహదపడడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళుతోంది. మన సినిమా, వినోద పరిశ్రమ చాలా పెద్దవి. దేశంలోని అనేక భాషల్లో సినిమాల నిర్మాణం జరుగుతోంది. సృజనాత్మక అంశాల సృష్టి జరుగుతోంది. ‘ఏక్ భారత్ –శ్రేష్ఠ భారత్’ భావనను మరింత బలపరిచినందుకు నేను మన సినిమా, వినోద పరిశ్రమను అభినందిస్తున్నాను.

మిత్రులారా! 2024లో సినీ పరిశ్రమలోని ఎందరో మహానుభావుల శత జయంతి వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ సుప్రసిద్ధ వ్యక్తులు భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. రాజ్ కపూర్ గారు సినిమాల ద్వారా భారతదేశ శక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. రఫీ సాహెబ్ స్వరంలో ప్రతి హృదయాన్ని కదిలించే ఇంద్రజాలం ఉంది. ఆయన స్వరం అద్భుతం. భక్తిగీతాలైనా, రొమాంటిక్ పాటలైనా, బాధాకరమైన పాటలైనా ప్రతి భావాన్ని తన గాత్రంతో సజీవంగా పలికించారు. నేటికీ యువతరం ఆయన పాటలను అదే తన్మయత్వంతో వింటున్నారంటే కళాకారుడిగా ఆయన గొప్పతనాన్ని అంచనా వేయవచ్చు. ఇది కాలాతీత కళకు గుర్తింపు. అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు చేర్చారు. ఆయన సినిమాలు భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా అందించాయి. తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త దృక్కోణాన్ని ఇచ్చాయి. ఆయన సినిమాలు సామాజిక స్పృహ, జాతీయ సమైక్యత సందేశంతో ఉంటాయి. ఈ సుప్రసిద్ధుల జీవితాలు మన సినిమా పరిశ్రమకు స్ఫూర్తిగా నిలుస్తాయి.

మిత్రులారా! నేను మీకు మరో శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశం రాబోతోంది. ప్రపంచ దృశ్య శ్రవణ వినోద శిఖరాగ్ర సమావేశం అంటే వేవ్స్ సమ్మిట్ వచ్చే ఏడాది మన దేశంలో తొలిసారి జరుగుతోంది. ప్రపంచ వాణిజ్య ప్రముఖులు సమావేశమయ్యే దావోస్ గురించి మీరందరూ తప్పక వినే ఉంటారు. అదేవిధంగా వేవ్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రపంచ మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సృజనాత్మక ప్రపంచానికి చెందినవారు భారతదేశానికి వస్తారు. ప్రపంచ కంటెంట్ సృష్టికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చే దిశగా ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన అడుగు. ఈ శిఖరాగ్ర సమావేశ సన్నాహాల్లో మన దేశంలోని యువ సృష్టికర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పడానికి గర్వపడుతున్నాను. మనం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పురోగమిస్తున్నప్పుడు మన క్రియేటర్ ఏకానమీ కొత్త శక్తిని తీసుకువస్తోంది. మీరు యువ క్రియేటర్ కావచ్చు. స్థిరపడ్డ ఆర్టిస్ట్ కావచ్చు. బాలీవుడ్ లేదా ప్రాంతీయ సినిమాలతో అనుబంధం ఉండవచ్చు. టీవీ పరిశ్రమలో ప్రొఫెషనల్ కావచ్చు. యానిమేషన్, గేమింగ్ లేదా వినోద సాంకేతికతలో నిపుణులు కావచ్చు. మీరందరూ వేవ్స్ సమ్మిట్‌లో భాగం కావాలని భారతదేశంలోని వినోద, సృజనాత్మక పరిశ్రమతో సంబంధం ఉన్న అందరినీ కోరుతున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! భారతీయ సంస్కృతి ప్రకాశం నేడు ప్రపంచంలోని ప్రతి మూలలో ఎలా వ్యాపిస్తోందో మీ అందరికీ తెలుసు. మన సాంస్కృతిక వారసత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందనేందుకు నిదర్శనంగా ఉన్న మూడు ఖండాల నుండి అలాంటి ప్రయత్నాల గురించి ఈ రోజు నేను మీకు చెప్తాను. అవన్నీ ఒకదానికొకటి ఎన్నో మైళ్ల దూరంలో ఉన్నాయి. కానీ భారతదేశం గురించి తెలుసుకోవాలని, మన సంస్కృతి నుండి నేర్చుకోవాలన్న వారి తపన ఒక్కటే.

మిత్రులారా! పెయింటింగ్స్ ప్రపంచం రంగులతో ఎంత నిండిపోతే అంత అందంగా ఉంటుంది. టీవీ ద్వారా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం చూస్తున్నవారు ఇప్పుడు టీవీలో కొన్ని పెయింటింగ్‌లను చూడవచ్చు. ఈ పెయింటింగులలో మన దేవతలు, నృత్య కళలు, గొప్ప వ్యక్తులను చూస్తే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. వీటిలో మీరు భారతదేశంలో కనిపించే జంతువులతో పాటు మరెన్నో చూడవచ్చు. వీటిలో అద్భుతమైన తాజ్ మహల్ పెయింటింగ్ కూడా ఉంది. దీన్ని పదమూడేళ్ల బాలిక రూపొందించింది. ఈ దివ్యాంగ బాలిక తన నోటితోనే ఈ పెయింటింగు సిద్ధం చేసిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పెయింటింగులను రూపొందించిన వారు భారత్‌కు చెందిన వారు కాదు.. ఈజిప్ట్‌కు చెందిన వారు. కొద్ది వారాల క్రితమే ఈజిప్టు నుంచి సుమారు 23 వేల మంది విద్యార్థులు పెయింటింగ్ పోటీలో పాల్గొన్నారు. అక్కడ భారతదేశ సంస్కృతిని, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను తెలిపే చిత్రాలను సిద్ధం చేశారు. ఈ పోటీలో పాల్గొన్న యువకులందరినీ అభినందిస్తున్నాను. వారి సృజనాత్మకతను ఎంత ప్రశంసించినా తక్కువే.

మిత్రులారా! దక్షిణ అమెరికాలోని ఒక దేశం పరాగ్వే. అక్కడ నివసించే భారతీయుల సంఖ్య వెయ్యికి మించదు. పరాగ్వేలో అద్భుతమైన ప్రయత్నం జరుగుతోంది. అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఎరీకా హ్యుబర్ ఉచిత ఆయుర్వేద సంప్రదింపులను అందిస్తున్నారు. నేడు అక్కడి ప్రజలు కూడా ఆయుర్వేద సలహాల కోసం పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారు. ఎరీకా హ్యుబర్ ఇంజనీరింగ్ చదివి ఉండవచ్చు. కానీ ఆమె మనస్సు ఆయుర్వేదంపై ఉంది. ఆయుర్వేదానికి సంబంధించిన కోర్సులు చేసిన ఆమె కాలక్రమేణా అందులో ప్రావీణ్యం సంపాదించింది.

మిత్రులారా! తమిళం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష కావడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మనకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఈ భాషను నేర్చుకునే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గత నెలాఖర్లో ఫిజీలో భారత ప్రభుత్వ సహాయంతో తమిళ బోధన కార్యక్రమం ప్రారంభమైంది. తమిళంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఫిజీలో ఈ భాషను బోధించడం గత 80 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ రోజు ఫిజీ విద్యార్థులు తమిళ భాషా సంస్కృతులను నేర్చుకోవడంలో చాలా ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిసి నేను సంతోషించాను.

మిత్రులారా! ఈ విషయాలు, ఈ సంఘటనలు కేవలం విజయగాథలు మాత్రమే కాదు. ఇవి కూడా మన సాంస్కృతిక వారసత్వ కథలే. ఈ ఉదాహరణలు మనలో గర్వాన్ని నింపుతాయి. కళ నుండి ఆయుర్వేదం వరకు, భాష నుండి సంగీతం వరకు చాలా విషయాలు భారతదేశంలో ఉన్నాయి. అవి ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్నాయి.

మిత్రులారా, ఈ శీతాకాలంలో దేశవ్యాప్తంగా క్రీడలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజలు ఫిట్‌నెస్‌ను తమ దినచర్యలో భాగంగా చేసుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. కాశ్మీర్‌లో స్కీయింగ్‌ నుంచి గుజరాత్‌లో గాలిపటాలు ఎగరేయడం వరకు ఎక్కడ చూసినా క్రీడల పట్ల ఉత్సాహం కనిపిస్తోంది. #SundayOnCycle, #CyclingTuesday వంటి ప్రచారాల ద్వారా సైక్లింగ్ ప్రచారం జరుగుతోంది.

మిత్రులారా! మన దేశంలో వస్తున్న మార్పులను, యువ స్నేహితుల ఉత్సాహాన్ని, అభిరుచిని ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన విషయం ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మన బస్తర్‌లో అద్వితీయమైన ఒలింపిక్స్‌ ప్రారంభమైన సంగతి మీకు తెలుసా! అవును... తొలిసారి జరిగిన బస్తర్ ఒలింపిక్స్‌తో బస్తర్‌లో కొత్త విప్లవం పుడుతోంది. బస్తర్ ఒలింపిక్స్ కల నెరవేరడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఒకప్పుడు మావోయిస్టుల హింసాకాండకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతంలో ఒలింపిక్స్ జరగడం మీకు కూడా సంతోషాన్నిస్తుంది. బస్తర్ ఒలింపిక్స్ చిహ్నాలు 'అటవీ గేదె’, 'కొండ మైనా'. ఇది బస్తర్ గొప్ప సంస్కృతిని సంగ్రహావలోకనం చేయిస్తుంది. ఈ బస్తర్ క్రీడా మహాకుంభమేళా ప్రాథమిక మంత్రం -‘కర్సాయ్ తా బస్తర్ బర్సాయ్ తా బస్తర్’. అంటే ‘ఆడుతుంది బస్తర్ – గెలుస్తుంది బస్తర్’.

బస్తర్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా 7 జిల్లాల నుంచి లక్షా 65 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇది కేవలం గణాంకం కాదు - ఇది మన యువత సంకల్పం గురించి గర్వించదగ్గ గాథ. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, కరాటే, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్- ఇలా ప్రతి క్రీడలోనూ మన యువత తమ ప్రతిభను కనబరిచింది. కారీ కశ్యప్ గారి కథ నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన కారీ గారు ఆర్చరీలో రజత పతకం సాధించారు. బస్తర్ ఒలింపిక్స్ తమకు కేవలం ఆట స్థలం మాత్రమే కాకుండా జీవితంలో ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చిందని చెప్పారు ఆమె. సుక్మాకు చెందిన పాయల్ కవాసీ గారు మాటలు కూడా స్ఫూర్తిదాయకమైనవి. "క్రమశిక్షణతో కష్టపడితే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదు" అంటారు జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకున్న పాయల్ గారు. సుక్మాలోని దోర్నపాల్‌కి చెందిన పూనెం సన్నా గారి కథ నవీన భారతదేశానికి స్ఫూర్తిదాయకమైన కథ. ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావానికి లోనైన పూనెం గారు నేడు వీల్ చైర్ పై పరుగెత్తుతూ పతకాలు సాధిస్తున్నారు. ఆ సాహసం, ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకం. కోడాగావ్‌కు చెందిన ఆర్చర్ రంజు సోరీ గారు 'బస్తర్ యూత్ ఐకాన్'గా ఎంపికయ్యారు. బస్తర్ ఒలింపిక్స్ మారుమూల ప్రాంతాల యువతకు జాతీయ స్థాయికి చేరుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయని రంజు సోరీ అభిప్రాయపడ్డారు.

మిత్రులారా! బస్తర్ ఒలంపిక్స్ కేవలం ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కాదు… ఇది వికాసం, క్రీడలు విలీనమయ్యే వేదిక. ఇక్కడ మన యువత తమ ప్రతిభకు పదును పెట్టుకుని నవ భారతాన్ని నిర్మిస్తోంది. మీరు కొన్ని పనులు చేయవలసిందిగా నేను కోరుతున్నాను.

- మీ ప్రాంతంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించండి.

- #ఖేలేగా భారత్ – జీతేగా భారత్‌ హ్యాష్ ట్యాగ్ తో మీ ప్రాంతంలోని క్రీడా ప్రతిభ కథనాలను పంచుకోండి

- స్థానిక క్రీడా ప్రతిభను ఎదగడానికి అవకాశం ఇవ్వండి

గుర్తుంచుకోండి... క్రీడలు శారీరక అభివృద్ధికి దారితీయడమే కాకుండా, క్రీడా స్ఫూర్తితో సమాజాన్ని అనుసంధానించడానికి ఒక శక్తిమంతమైన మాధ్యమంగా కూడా ఉపకరిస్తాయి.

 

నా ప్రియమైన దేశప్రజలారా! భారతదేశం సాధించిన రెండు పెద్ద విజయాలు ఈరోజు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిని విని మీరు కూడా గర్వపడతారు. ఈ రెండు విజయాలనూ ఆరోగ్య రంగంలో సాధించాం. మొదటి గెలుపు మలేరియాకు వ్యతిరేకంగా పోరాటంలో పొందాం. మలేరియా నాలుగు వేల సంవత్సరాలుగా మానవాళికి పెద్ద సవాలుగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఆరోగ్య రంగంలో పెద్ద సవాళ్లలో ఒకటిగా ఉంది. ఒక నెల నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లల ప్రాణాలను తీసే అంటు వ్యాధులలో మలేరియాది మూడో స్థానం. ఈ రోజు దేశప్రజలు సామూహికంగా ఈ సవాలును బలంగా ఎదుర్కొన్నారని నేను సంతృప్తితో చెప్పగలను. భారతదేశంలో మలేరియా కేసులు, మరణాలు 2015-2023 మధ్య కాలంలో 80 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక తెలియజేస్తోంది. ఇది చిన్న విషయం కాదు. దేశంలోని ప్రతి ఒక్కరు ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం వల్లే ఈ విజయం లభించింది. అసోంలోని జోర్హాట్‌ తేయాకు తోటల్లో మలేరియా నాలుగు సంవత్సరాల క్రితం వరకు ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కానీ టీ తోటల్లో నివసించే ప్రజలు మలేరియా నిర్మూలన కోసం ఏకమయ్యారు. వారు ఈ ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించడం ప్రారంభించారు. వారు సాంకేతికతతో పాటు సామాజిక మాధ్యమాలను పూర్తిగా ఉపయోగించుకున్నారు. అదేవిధంగా హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా మలేరియాను నియంత్రించడంలో చాలా మంచి నమూనాను అందించింది. ఇక్కడ మలేరియా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం విజయవంతమైంది. దోమల పెంపకాన్ని తగ్గించడంలో సహాయపడేలా వీధి నాటకాలు రూపొందించారు. రేడియోల ద్వారా ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రయత్నాల ద్వారా మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లగలిగాం.

మిత్రులారా! మన అవగాహన, దృఢ సంకల్పంతో మనం పొందగలిగే విజయాలకు మరో ఉదాహరణ క్యాన్సర్‌ తో పోరాటం. ప్రపంచంలో ప్రసిద్ధ జర్నల్ లాన్సెట్ అధ్యయనం ఈ విషయంలో చాలా ఆశాజనకంగా ఉంది. ఈ అధ్యయనం ప్రకారం ఇప్పుడు భారతదేశంలో క్యాన్సర్‌కు సకాలంలో నివారణ ఉంటుంది. చికిత్సను సకాలంలో ప్రారంభించే అవకాశం గణనీయంగా పెరిగింది. అంటే 30 రోజుల్లోపు క్యాన్సర్ రోగికి చికిత్స ప్రారంభించాలి. 'ఆయుష్మాన్ భారత్ యోజన' ఈ విషయంలో పెద్ద పాత్ర పోషించింది. ఈ పథకం వల్ల 90 శాతం మంది కేన్సర్ పేషెంట్లు సకాలంలో చికిత్స ప్రారంభించగలిగారు. ఇంతకుముందు పేద రోగులు డబ్బులు లేకపోవడం వల్ల క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు 'ఆయుష్మాన్ భారత్' పథకం వారికి చాలా గొప్ప సహకారం అందిస్తోంది. ఈ పథకం క్యాన్సర్ చికిత్సలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చాలా వరకు తగ్గించింది. ఈ రోజు క్యాన్సర్ చికిత్స గురించి మరింత అవగాహన కలిగింది. అవును... ఇందులో మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కృషి; డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బంది కృషి ఎంత ఉందో నా సోదర సోదరీమణులైన మీ అందరి కృషి కూడా అంతే ఉంది. అందరి సహకారంతో క్యాన్సర్‌ను ఓడించాలనే సంకల్పం మరింత బలంగా మారింది. అవగాహనను వ్యాప్తి చేయడంలో ముఖ్యమైన సహకారం అందించిన వారందరి వల్లే ఈ విజయం సాధ్యమైంది.

క్యాన్సర్‌తో పోరాటానికి ఒకే ఒక మంత్రం ఉంది. అది అవగాహన, చర్య, భరోసా. అవగాహన అంటే క్యాన్సర్, దాని లక్షణాల గురించి జాగరూకత. చర్య అంటే సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స. భరోసా అంటే రోగులకు ప్రతి సహాయం అందుబాటులో ఉందని నమ్మకం. రండి... మనమందరం కలిసి క్యాన్సర్‌పై ఈ పోరాటాన్ని వేగంగా ముందుకు తీసుకువెళదాం. మరింత ఎక్కువమంది రోగులకు సహాయం చేద్దాం.

నా ప్రియమైన దేశవాసులారా! ఒడిషాలోని కలహండి నుండి ఒక ప్రయత్నం గురించి ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది తక్కువ నీరు, తక్కువ వనరులు ఉన్నప్పటికీ విజయవంతమైన కొత్త గాథను లిఖిస్తోంది. ఇది కలహండి ‘కూరగాయల విప్లవం’. ఒకప్పుడు రైతులు వలస వెళ్ళే పరిస్థితులు ఉన్నచోట, నేడు కలహండిలోని గోలముండా బ్లాక్ కూరగాయల కేంద్రంగా మారింది. ఈ మార్పు ఎలా వచ్చింది? ఇది కేవలం 10 మంది రైతులతో కూడిన చిన్న సమూహంతో ప్రారంభమైంది. ఈ బృందం సామూహికంగా ‘కిసాన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్’ అనే పేరుతో రైతు ఉత్పత్తి సంస్థను స్థాపించింది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ప్రారంభించింది. నేడు వారి రైతు ఉత్పత్తి సంస్థ కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని చేస్తోంది. నేడు 45 మంది మహిళా రైతులతో సహా 200 మందికి పైగా రైతులకు ఈ రైతు ఉత్పత్తి సంస్థతో అనుబంధం ఉంది. వీరంతా కలిసి 200 ఎకరాల్లో టమాట, 150 ఎకరాల్లో కాకర సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రైతు ఉత్పత్తి సంస్థ వార్షిక టర్నోవర్ పెరిగి, ఒకటిన్నర కోట్ల రూపాయలకు పైగా ఉంది. నేడు కలహండి కూరగాయలు ఒడిషాలోని వివిధ జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా చేరుతున్నాయి. అక్కడి రైతులు ఇప్పుడు బంగాళాదుంప, ఉల్లి సాగులో కొత్త పద్ధతులను నేర్చుకుంటున్నారు.

మిత్రులారా! కలహండి సాధించిన ఈ విజయం సంకల్ప శక్తి, సామూహిక కృషితో ఏం చేయగలమో నేర్పుతుంది. నేను మీ అందరినీ కోరుతున్నాను.:

• మీ ప్రాంతంలో రైతు ఉత్పత్తి సంస్థ- ఎఫ్.పి.ఓ. లను ప్రోత్సహించండి

• రైతు ఉత్పత్తి సంస్థలలో చేరండి. వాటిని బలోపేతం చేయండి.

గుర్తుంచుకోండి. చిన్న ప్రారంభం నుండి కూడా పెద్ద మార్పులు సాధ్యమే. మనకు కావలసింది దృఢ సంకల్పం, జట్టు స్ఫూర్తి.

మిత్రులారా! నేటి 'మన్ కీ బాత్'లో భిన్నత్వంలో ఏకత్వంతో మన భారతదేశం ఎలా ముందుకు సాగుతుందో విన్నాం. క్రీడా రంగమైనా, సైన్స్, ఆరోగ్యం లేదా విద్యా రంగమైనా- భారతదేశం ప్రతి రంగంలోనూ కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. మనమంతా సామూహికంగా ఒకే కుటుంబభావనతో ప్రతి సవాలునూ ఎదుర్కొని కొత్త విజయాలు సాధించాం. 2014లో మొదలైన ‘మన్ కీ బాత్’ 116 ఎపిసోడ్లలో ‘మన్ కీ బాత్’ దేశ సామూహిక శక్తికి సజీవ పత్రంగా మారడం చూశాను. మీరందరూ ఈ కార్యక్రమాన్ని స్వీకరించి, మీ స్వంతం చేసుకున్నారు. ప్రతి నెలా మీరు మీ ఆలోచనలు, ప్రయత్నాలను పంచుకుంటున్నారు. కొన్నిసార్లు యువ ఆవిష్కర్తల ఆలోచనలు నన్ను ఆకట్టుకున్నాయి. కొన్నిసార్లు ఆడపిల్లలు సాధించిన విజయాలు నన్ను గర్వించేలా చేశాయి. మీ అందరి భాగస్వామ్యమే దేశం నలుమూలల నుండి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. 'మన్ కీ బాత్' ఈ సానుకూల శక్తిని పెంపొందించే వేదికగా మారింది. ఇప్పుడు 2025 తలుపు తడుతోంది. వచ్చే సంవత్సరంలో 'మన్ కీ బాత్' ద్వారా మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను మనం పంచుకుందాం. దేశప్రజల సానుకూల ఆలోచన, ఆవిష్కరణల స్ఫూర్తితో భారతదేశం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను. మీ చుట్టూ ఉన్న ప్రత్యేకమైన ప్రయత్నాలను #మన్ కీ బాత్‌ అనే హ్యాష్ ట్యాగ్ తో పంచుకుంటూ ఉండండి. వచ్చే ఏడాది జరిగే ప్రతి ‘మన్ కీ బాత్’లో మనం పరస్పరం పంచుకోవలసినవి చాలా ఉంటాయని నాకు తెలుసు. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. ఫిట్ ఇండియా ఉద్యమంలో చేరండి. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోండి. జీవితంలో పురోగతిని కొనసాగించండి. చాలా చాలా ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets

Media Coverage

PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister hold talks with Myanmar President U Min Aung Hlaing
June 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, today held productive talks with the President of Myanmar, U Min Aung Hlaing.

The Prime Minister noted that India is honoured that President U Min Aung Hlaing chose India for his first foreign visit as President. He also expressed happiness that the President began his programme in India from Bodh Gaya with the blessings of Lord Buddha.

During the talks, the two leaders reviewed the full range of India-Myanmar relations and discussed ways to further strengthen bilateral cooperation.

The discussions covered avenues to deepen cooperation in trade, rare earths, healthcare, connectivity, heritage restoration and capacity building. The two sides also agreed to work closely in areas such as maritime security, cyber security and other sectors of mutual interest.

The Prime Minister underlined that Myanmar is vital to India’s ‘Neighbourhood First’, ‘Act East’ and Indo-Pacific policies, reaffirming the importance India attaches to its relations with Myanmar.

The Prime Minister wrote on X;

“Had a productive meeting with President U Min Aung Hlaing of Myanmar. We in India are honoured that he has chosen India for his first foreign visit as President. Equally gladdening is the fact that he began the visit from Bodh Gaya, with the blessings of Lord Buddha. We reviewed the full range of India-Myanmar relations. Myanmar is vital to India’s policies of ‘Neighbourhood First’, ‘Act East’ and Indo-Pacific.”

“Our talks covered ways to deepen cooperation in trade, rare earths, healthcare, connectivity, heritage restoration and capacity building. We also agreed to work closely in areas such as maritime security, cyber security and more.”