న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన, చరిత్రాత్మకమైన ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ ఆతిథ్యమిస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా కలిగిన, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో ఉన్న, సాంకేతిక ఆధారిత వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ను వర్ణించారు. నూతన సాంకేతికతలను రూపొందించడం మాత్రమే కాకుండా.. వాటిని అపూర్వమైన వేగంతో భారత్ స్వీకరిస్తోందన్నారు. కొత్త సాంకేతికతలను అనుసరించడానికి 140 కోట్ల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వారి తరఫున ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రభుత్వాధినేతలు, ప్రపంచ ఏఐ వ్యవస్థ నాయకులు, ఆవిష్కర్తలకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. ఈ సదస్సుకు హాజరైన వారికి ధన్యావాదాలు తెలియజేస్తూ.. ఈ కార్యక్రమానికి ఆతిథ్యమివ్వడం భారత్కు మాత్రమే కాకుండా.. మొత్తం గ్లోబల్ సౌత్కే గర్వకారణమన్నారు.
ఏఐ ప్రపంచానికి చెందిన ప్రముఖులందరినీ ఒకే వేదిక మీదకు ఈ సదస్సు తీసుకువచ్చిందని శ్రీ మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా దేశాల నుంచి విశిష్ట అతిథులు హాజరై ఈ సదస్సు విజయాన్ని నూతన శిఖరాలకు చేర్చారని పేర్కొన్నారు. అలాగే ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం నూతన విశ్వాసాన్ని నింపుతోందన్నారు. నూతన సాంకేతికతలపై ఆరంభంలో అపనమ్మకం వ్యక్తమవుతుందని ప్రధాని గమనించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఏఐను వేగంగా, నమ్మకంగా స్వీకరిస్తున్న విధానం, తనదిగా భావిస్తున్న తీరు, ఉపయోగించుకుంటున్న పద్ధతి అపూర్వమన్నారు. పెద్ద సంఖ్యలో యువ ప్రతిభావంతులు పాల్గొంటున్న ఏఐ సదస్సు ఎగ్జిబిషన్పై ఉన్న ఆసక్తి గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు. వ్యవసాయం, భద్రత, దివ్యాంగులకు సహాయం, బహుభాషల ప్రజల అవసరాలను తీర్చడం తదితర అంశాలపై సమర్పించిన పరిష్కారాలు ‘మేడ్ ఇన్ ఇండియా’ సామర్థ్యాన్ని, ఏఐ రంగంలో భారత్కున్న ఆవిష్కరణాత్మక సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయన్నారు.

ప్రతి కొన్ని శతాబ్దాలకు మానవ చరిత్ర మలుపు తీసుకుంటుందని, అది నాగరికత గమనాన్ని మారుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి వేగాన్ని ఇలాంటి సంఘటనలే మారుస్తాయని, ఆలోచనలు, అర్థం చేసుకొనే తీరు, పని విధానంలో మార్పులు తీసుకొస్తాయని వెల్లడించారు. ఇలాంటి పరివర్తన దశల ప్రభావం వెనువెంటనే అర్థం చేసుకోలేమని తెలియజేశారు. రాళ్ల నుంచి పుట్టిన నిప్పు రవ్వలు, ఒక నాగరికతకు పునాదిగా మారతాయని ఎవరూ ఊహించి ఉండరు. మాట్లాడుతున్న భాషను లిపిగా మార్చినప్పుడు అది భవిష్యత్తులో వ్యవస్థలకు ఆధారంగా మారుతుందని ఎవరూ భావించి ఉండరు. వైర్లెస్ సంకేతాలను మొదటిసారి ప్రసారం చేసినప్పుడు ఏదో ఒక రోజు ఈ ప్రపంచమంతా అనుసంధానమవుతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘‘మానవ నాగరికతలో చారిత్రక మలుపుల మాదిరిగానే కృత్రిమ మేధ కూడా అంతే స్థాయిలో మార్పును తీసుకువస్తుంది’’ అని శ్రీ మోదీ తెలిపారు. అలాగే ఈ రోజు మనం చూస్తున్నవి, అంచనా వేస్తున్నవి ఈ ప్రభావానికి ఆరంభ సూచికలన్నారు. యంత్రాలను తెలివైనవాటిగా ఏఐ మారుస్తోందని, అది మానవ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతోందని చెప్పారు. అయితే మునుపెన్నడూ లేని వేగంతో, ఊహించని స్థాయిలో ఈ సారి మార్పు ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గతంలో సాంకేతిక ప్రభావం కనిపించడానికి దశాబ్దాల తరబడి సమయం పట్టేదని, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ నుంచి స్వయంగా నేర్చుకొనే యంత్రాల వరకు ప్రయాణం వేగంగా, లోతుగా, విస్తృత స్థాయిలో ఉందని వివరించారు.

దీనికి విశాల దృక్పథంతో పాటు, అంతే స్థాయిలో బాధ్యత అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుత తరంతో పాటు, భవిష్యత్ తరాలకు అందించే ఏఐ విధానం గురించి కూడా కచ్చితంగా ఆలోచించాలని సూచించారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదని కాకుండా.. ఏఐతో మానవాళి ఏం చేస్తుందన్నదే అసలైన ప్రశ్నగా మారిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. దీనిని అణుశక్తితో ప్రధాని పోల్చారు. అణుశక్తికున్న విధ్వంసక సామర్థ్యం, సానుకూల సహకారం రెండింటినీ ఈ ప్రపంచం చూసిందన్నారు. ఏఐను పరివర్తనాత్మక శక్తిగా చెబుతూనే.. దానికి సరైన దిశ లేకపోతే అది విధ్వంసానికి దారి తీస్తుందని, సరైన మార్గనిర్దేశం ఉంటే అది పరిష్కారంగా మారుతుందని వివరించారు. ఏఐను యంత్ర కేంద్రితంగా కాకుండా మానవ కేంద్రంగా, సున్నితంగా, బాధ్యతాయుతంగా ఎలా మలచాలనే దానిపై చర్చించడమే ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రధాన లక్ష్యమని శ్రీ మోదీ తెలియజేశారు.
‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ – అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం అనే ఈ సదస్సు ఇతివృత్తంలో భారత దేశ ఏఐ దార్శనికత స్పష్టంగా ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇదే భారత్కు ప్రామాణికమని స్పష్టం చేశారు. అయితే ఏఐకు డేటా పాయింట్లుగా, ముడి సరుకుగా మానవులు మారకూడదని హెచ్చరించారు. కాబట్టి ఏఐను అందరికీ అందుబాటులో ఉంచాలని, ప్రధానంగా గ్లోబల్ సౌత్లో సమగ్రతకు, సాధికారతకు మాధ్యమంగా ఏఐ మారాలన్నారు.
ఏఐ విస్తృతంగా ఉండాలి, కానీ దాని నియంత్రణ మనిషి చేతుల్లోనే ఉండాలని ప్రధానమంత్రి తెలియజేశారు. దీనిని జీపీఎస్తో పోలుస్తూ.. మార్గాన్ని సూచించినప్పటికీ తుది నిర్ణయం వినియోగదారునిదే అన్నారు. ఈ రోజు మనం ఏఐను ఏ దిశగా తీసుకెళుతున్నామన్నదే భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు.
ఏఐ కోసం భారత ప్రణాళిక ‘ఎంఏఎన్ఏవీ’ (మానవ్)ను న్యూఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధానమంత్రి సమర్పించారు. ఎంఏఎన్ఏవీ గురించి వివరిస్తూ..
· ఎం – నైతికమైన, విలువలతో కూడిన వ్యవస్థలు: నైతికమైన మార్గనిర్దేశాల ఆధారంగా ఏఐ ఉండాలి.
· ఏ – నిర్వహణలో జవాబుదారీతనం: పారదర్శక నియమాలు, విస్తృత పర్యవేక్షణ.
· ఎన్ – జాతీయ సార్వభౌమత్వం: అసలు యజమానికే సమాచారం చెందుతుంది.
· ఏ – అందుబాటులో ఉండటం, సమ్మిళిత్వం: ఏఐలో గుత్తాధిపత్యం ఉండకూడదు. అది బహు కేంద్రిత విధానంలో ఉండాలి.
· వీ – ధ్రువీకరణ, చట్టబద్ధత: ఏఐ న్యాయబద్ధంగా, ధ్రువీకరించినదై ఉండాలి.
ఏఐ ఆధారిత 21వ శతాబ్దపు ప్రపంచంలో మానవాళి సంక్షేమానికి భారత్ అందిస్తున్న ‘ఎంఏఎన్ఏవీ’ దార్శనికత కీలకమైన అనుసంధానం కానుందని ఆయన పేర్కొన్నారు.
దశాబ్దాల క్రితం, ఇంటర్నెట్ ప్రారంభమైనప్పుడు, అది ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందో ఎవరూ ఊహించలేదని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు పుట్టుకొస్తాయో అంచనా వేయడం కష్టమని, ఏఐ విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ రంగం భవిష్యత్తు ముందే నిర్ణయించింది కాదని, అది సమష్టి నిర్ణయాలు, చర్యలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో లభించే ఉద్యోగాలు ఓ కొత్త అవకాశమని, ఇది మానవులు, మేథో వ్యవస్థలు కలసి రూపొందించే, కలసి పనిచేసే, కలసి అభివృద్ధి చెందే యుగాన్ని సూచిస్తుందన్నారు. ఏఐ మన పనిని వేగవంతంగా, మరింత సమర్థంగా, ప్రభావవంతంగా మారుస్తుందని, మెరుగైన నమూనా, వేగవంతమైన నిర్మాణం, పటిష్టమైన నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని వివరించారు.

అనేక మందికి అధిక విలువ కలిగిన, సృజనాత్మకతమైన, అర్థవంతమైన పాత్రలను ఏఐ అందిస్తుందని, ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగం, కొత్త పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. నైపుణ్యాలను సాధించడం, వాటికి పదును పెట్టుకోవడం, నిరంతర అభ్యాసాన్ని సామూహిక ఉద్యమంగా మార్చాల్సిన అవసరాన్ని వివరించారు.
పని భవిష్యత్తు సమ్మిళితంగా, విశ్వసనీయంగా, మానవ కేంద్రీకృతంగా ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మానవాళి సమష్టిగా ముందకు నడిస్తే, కృత్రిమ మేధస్సు మానవ సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు.
"సూర్యరశ్మి అత్యుత్తమ క్రిమినాశిని" అనే లోకోక్తిని గుర్తుచేస్తూ, పారదర్శకతే అత్యుత్తమ రక్షణ కవచమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఏఐని రహస్యంగా అభివృద్ధి చేయాల్సిన వ్యూహాత్మక ఆస్తిగా కొన్ని దేశాలు, సంస్థలు భావిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం అందరితోనూ ఏఐని పంచుకున్నప్పుడే ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని నమ్ముతుందని తెలియజేశారు. ఓపెన్ కోడ్, సహకారపూరిత అభివృద్ధి ద్వారా యువత ఏఐను మెరుగైనదిగా, సురక్షితమైనదిగా తీర్చిదిద్దగలదన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఏఐని అభివృద్ధి చేయడానికి ఉమ్మడి సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

డీప్ఫేక్లు, అవాస్తవాలతో కూడిన కథనాలు స్వేచ్ఛాయుత సమాజాలను అస్థిరపరుస్తున్నాయని, ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించాల్సిన తక్షణావసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆహారంపై పోషకాహార లేబుల్ ఉంచినట్టే డిజిటల్ కంటెంట్ కూడా ప్రామాణికతా లేబుల్ను జోడించాలని, తద్వారా ప్రజలు వాస్తవిక, ఏఐ సమాచారం మధ్య తేడాను గుర్తించగలరని ఆయన అన్నారు. సమాచారం, చిత్రాలు, వీడియోలను ఏఐ ద్వారా ఎక్కువగా తయారు చేస్తున్నందున వాటర్ మార్కింగ్, స్పష్టమైన ప్రమాణాలకు పెరుగుతున్న ఆవశ్యకతను శ్రీ మోదీ వివరించారు. ఆరంభం నుంచే సాంకేతికతపై నమ్మకం ఏర్పాటు చేయాలన్నారు.
బాలల భద్రత ప్రాధాన్యతను ఉటంకిస్తూ.. పాఠశాలల్లో పాఠ్యప్రణాళికను ఎలా రూపొందిస్తామో, ఏఐపై కూడా చిన్నారులకు సురక్షితమైనదిగా, కుటుంబ పర్యవేక్షణలో ఉండాలని ప్రధానమంత్రి సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో ఏఐని చూసి భయపడే, దానిని అవకాశంగా భావించే రెండు వర్గాలున్నాయని చెప్పారు. ఏఐలో అవకాశాన్ని, భవిష్యత్తును భారత్ చూస్తోందని చెప్పారు. ప్రతిభ, ఉత్సాహం, సామర్థ్యం, విధాన స్పష్టత దీనికి అండగా ఉన్నాయన్నారు. ఈ సదస్సులో మూడు భారతీయ కంపెనీలు తమ ఏఐ మోడళ్లు, యాప్లను లాంఛనంగా ప్రారంభించడం పట్ల శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇవి భారత యువ ప్రతిభకు నిదర్శనమని, ప్రపంచ ఏఐ రంగంలో భారత్ అందిస్తున్న పరిష్కారాల లోతును, వైవిధ్యాన్ని ఇవి చాటిచెబుతున్నాయన్నారు.

సెమీకండక్టర్లు, చిప్ తయారీ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు స్థిరమైన వ్యవస్థను భారత్ నిర్మిస్తోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. సురక్షితమైన డేటా సెంటర్లు, పటిష్టమైన ఐటీ వసతులు, అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థల వ్యవస్థ భారత్ను సరసమైన, ఆచరణాత్మకమైన, సురక్షితమైన ఏఐ పరిష్కారాలకు కేంద్రంగా మారుస్తున్నాయని వివరించారు. వైవిధ్యం, జనాభా, ప్రజాస్వామ్యం అనే బలాలు భారత్ సొంతమన్నారు. భారత్లో విజయవంతమైన ఏఐ విధానాలను ప్రపంచమంతా అమలు చేయవచ్చన్నారు. ‘భారత్లో రూపొందించి, అభివృద్ధి చేయండి. ప్రపంచానికి, మానవాళికి అందించండి’ అని ప్రపంచాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ ఎమ్మాన్యుయేల్ మాక్రోన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వాధినేతలు, మంత్రులు, బహుపాక్షిక సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు, టెక్, ఏఐ పరిశ్రమలో ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే ఇతివృత్తంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 జరుగుతుంది. అంటే అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం అని అర్థం. ఏఐ రంగంలో భారత్ను అగ్రస్థానానికి చేర్చడం, మానవత్వాన్ని, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే, మన గ్రహాన్ని రక్షించే ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రజలు, పృథ్వి, ప్రగతి అనే మూడు ప్రధానాంశాలకు అనుగుణంగా ఏడు వర్కింగు గ్రూపులు ఈ సదస్సును ముందుకు నడిపిస్తాయి. వివిధ రంగాల్లో ఏఐ ప్రభావాన్ని తెలియజేసేలా నిర్ధిష్ట ఫలితాలను అందించడంపై ఈ బృందాలు పనిచేస్తాయి. ఏడు అంశాలు: ఆర్థిక ప్రగతి-సామాజిక ప్రయోజనం కోసం ఏఐ, ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ, సామాజిక సాధికారతకు సమ్మిళిత్వం, సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐ, మానవ మూలధనం, సైన్సు, స్థిరత్వం, ఆవిష్కరణ, సామర్థ్యం.
ఈ సదస్సులో సీఈవోలు/సీఎక్స్వోలతో సహా 500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ నిపుణులు, సుమారుగా 100 మంది సీఈవోలు, వ్యవస్థాపకులు, 150 మంది విద్యావేత్తలు, పరిశోధకులు, 400 మంది సీటీవోలు, వీపీలు, దాతలు పాల్గొంటారు. అలాగే 20కి పైగా దేశాల, ప్రభుత్వాల అధినేతలు, 60 మంది మంత్రులు, ఉప మంత్రులతో సహా 100 మందికి పైగా ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Artificial Intelligence marks a transformative chapter in human history. pic.twitter.com/Cf11ffKYQx
— PMO India (@PMOIndia) February 19, 2026
We must democratise AI.
— PMO India (@PMOIndia) February 19, 2026
It must become a tool for inclusion and empowerment, particularly for the Global South. pic.twitter.com/IzH67U2uRR
The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6
— PMO India (@PMOIndia) February 19, 2026
We are entering an era where humans and intelligent systems co-create, co-work and co-evolve.
— PMO India (@PMOIndia) February 19, 2026
AI will make our work smarter, more efficient and more impactful. pic.twitter.com/loDFaQt0Wm
AI for Global Common Good. pic.twitter.com/CaRhFeuyiK
— PMO India (@PMOIndia) February 19, 2026
In AI, India sees opportunity and the blueprint of tomorrow. pic.twitter.com/40HzjCROXz
— PMO India (@PMOIndia) February 19, 2026


