మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం: ప్రధాన మంత్రి
మరాఠీతో పాటు బెంగాలీ, పాలీ, ప్రాకృత, అస్సామీ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా కల్పించాం
ఈ భాషలతో సంబంధం ఉన్న ప్రజలకు అభినందనలు: ప్రధాన మంత్రి
మరాఠీ భాషా చరిత్ర చాలా గొప్పది: ప్రధాన మంత్రి
మహారాష్ట్రకు చెందిన అనేక మంది విప్లవ నాయకులు, ఆలోచనాపరులు మరాఠీ భాషను ఒక మాధ్యమంగా ఉపయోగించి ప్రజలను చైతన్యవంతులను చేశారు: ప్రధానమంత్రి

మరాఠీ భాషకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రాచీన భాష హోదా కల్పించిందని ప్రధానమంత్రి అన్నారు. మరాఠీ భాష మాట్లాడే ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించి, మహారాష్ట్ర కలను సాకారం చేసినందుకు మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముంబయిలో ఇవాళ జరిగిన ‘‘మేటి మరాఠీ భాష’’ కార్యక్రమంలో ప్రధాని మట్లాడుతూ మరాఠీ భాషా చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో భాగమైనందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. మరాఠీతో పాటు బెంగాలీ, పాలీ, ప్రాకృత, అస్సామీ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా కల్పించినట్లు తెలిపిన ప్రధాని... ఆయా భాషలతో సంబంధం ఉన్న ప్రజలకు అభినందనలు తెలిపారు.
 

మరాఠీ భాషా చరిత్ర చాలా గొప్పదని, ఈ భాష నుంచి ఉద్భవించిన జ్ఞాన ప్రవాహం అనేక తరాలకు మార్గనిర్దేశనం చేశాయని ప్రధాని అన్నారు. అవి నేటికీ మనకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయన్నారు. మరాఠీ భాషను ఉపయోగించి వేదాంత చర్చతో- సంత్ జ్ఞానేశ్వర్ ప్రజలను అనుసంధానం చేశారని, అదేవిధంగా జ్ఞానేశ్వరి గీత జ్ఞానంతో భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పునరుజ్జీవింపజేశారని అన్నారు. సంత్ నామ్‌దేవ్ మరాఠీ భాష ద్వారా భక్తి మార్గ చైతన్యాన్ని బలోపేతం చేశారని, సంత్ తుకారమ్ మరాఠీ భాషలో మతపరమైన అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించారని ప్రధాని తెలిపారు. సంత్ చొఖమేలా సామాజిక మార్పు కోసం ఉద్యమాలను శక్తిమంతం చేశారని తెలిపారు. "మహారాష్ట్ర, మరాఠీ భాషకు చెందిన గొప్ప సాధువులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను" అని ప్రధాని అన్నారు. మరాఠీ భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వడం అంటే- ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం ఆయనను గౌరవించడమేనని ప్రధానమంత్రి అన్నారు.

సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, మరాఠీ భాష భారత స్వాతంత్ర్య పోరాటంలో అందించిన అమూల్యమైన తోడ్పాటును ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికీ, వారిని సంఘటితం చేయడానికి మహారాష్ట్రకు చెందిన అనేక మంది విప్లవ వీరులు, ఆలోచనాపరులూ భాషను ఒక మాధ్యమంగా ఎలా ఉపయోగించిందీ ప్రస్తావించారు. లోకమాన్య తిలక్ తన మరాఠీ వార్తాపత్రిక 'కేసరి' ద్వారా విదేశీ పాలన పునాదులను పెకిలించారని, మరాఠీలో ఆయన చేసిన ప్రసంగాలు ప్రతి భారతీయుడి హృదయాల్లో స్వరాజ్య కాంక్షను రగిలించాయని ప్రధాని అన్నారు. న్యాయం, సమానత్వం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరాఠీ భాష కీలక పాత్ర పోషించిందని, గోపాల్ గణేష్ అగార్కర్ వంటి ఇతర ప్రముఖుల కృషిని ఆయన గుర్తు చేశారు. ఆయన తన మరాఠీ వార్తాపత్రిక సుధారక్ ద్వారా సామాజిక సంస్కరణల ప్రచారాన్ని ప్రతి ఇంటికి చేరవేశారు. స్వాతంత్ర్య పోరాటాన్ని తన లక్ష్యం వైపు నడిపించడానికి మరాఠీపై ఆధారపడిన మరొక దిగ్గజ వ్యక్తి గోపాల కృష్ణ గోఖలే అని ప్రధాని పేర్కొన్నారు.
 

మరాఠీ సాహిత్యం దేశ అమూల్య వారసత్వమని, మన నాగరికత ఎదుగుదల, సాంస్కృతిక పురోగతిని పరిరక్షిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. స్వరాజ్యం, స్వదేశీ, మాతృభాష, సాంస్కృతిక అభిమానం వంటి ఆదర్శాలను వ్యాప్తి చేయడంలో మరాఠీ సాహిత్యం కీలక పాత్ర పోషించిందన్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గణేష్ ఉత్సవాలు, శివాజీ జయంతి వేడుకలు, వీర్ సావర్కర్ విప్లవాత్మక ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలోని సామాజిక సమానత్వ ఉద్యమం, మహర్షి కార్వే మహిళా సాధికారత ఉద్యమం, మహారాష్ట్రలో పారిశ్రామికీకరణ, వ్యవసాయ సంస్కరణల వంటి కార్యక్రమాలన్నీ మరాఠీ భాషలోనే బలపడ్డాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరాఠీ భాషతో అనుసంధానం కావడం ద్వారా మన దేశ సాంస్కృతిక వైవిధ్యం మరింత సుసంపన్నమవుతుందని ఆయన అన్నారు.

"భాష అనేది కేవలం సందేశ మాధ్యమం మాత్రమే కాదు, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం సాహిత్యంతో గాఢంగా ముడిపడి ఉంది" అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. పోవాడా అనే జానపద గేయం గురించి ప్రస్తావిస్తూ, ఛత్రపతి శివాజీ మహరాజ్, ఇతర గొప్ప నాయకుల ధైర్యసాహసాల కథలు అనేక శతాబ్దాల తరువాత కూడా మనకు చేరాయని ప్రధాని వ్యాఖ్యానించారు. నేటి తరానికి మరాఠీ భాష అందించిన అద్భుతమైన బహుమతి పొవాడా అని ఆయన అన్నారు. నేడు మనం వినాయకుడిని ఆరాధిస్తున్నప్పుడు 'గణపతి బప్పా మోరియా' అనే పదాలు సహజంగానే మన మనస్సులో ప్రతిధ్వనిస్తాయని, ఇది కేవలం కొన్ని పదాల కలయిక కాదని, అంతులేని భక్తి ప్రవాహం అని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ భక్తి... దేశం మొత్తాన్ని మరాఠీ భాషతో కలుపుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా శ్రీ విఠల్ అభాంగ్ వినే వారు కూడా స్వతసిద్ధంగా మరాఠీతో అనుసంధానం అవుతారని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
 

మరాఠీ భాషకు ఇక్కడి సాహితీవేత్తలు, రచయితలు, కవులు, అసంఖ్యాకమైన మరాఠీ ప్రేమికులు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ భాషకు ప్రాచీన హోదా లభించడం ఎంతో మంది ప్రతిభావంతులైన సాహితీవేత్తల సేవ, కృషి ఫలితమని వ్యాఖ్యానించారు. బాలశాస్త్రి జంభేకర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, కృష్ణాజీ ప్రభాకర్ ఖడిల్కర్, కేశవసూత్, శ్రీపాద్ మహదేవ్ మాఠే, ఆచార్య ఆత్రే, అన్నా భావు సాఠే, శాంతాబాయి షెల్కే, గజానన్ దిగంబర్ మద్గుల్కర్, కుసుమరాజ్ వంటి ప్రముఖుల సేవలను ప్రధాని కొనియాడారు. మరాఠీ సాహిత్య సంప్రదాయం పురాతనమైనదే కాకుండా బహుముఖమైనదని ప్రధాన మంత్రి ఈ సమావేశంలో పేర్కొన్నారు. వినోబా భావే, శ్రీపాద్ అమృత్ డాంగే, దుర్గాబాయి భగవత్, బాబా ఆమ్టే, దళిత సాహితీవేత్త దయా పవార్, బాబాసాహెబ్ పురందరే వంటి ఎందరో ప్రముఖులు మరాఠీ సాహిత్యానికి విశేష కృషి చేశారన్నారు. పురుషోత్తం లక్ష్మణ్ దేశ్ పాండే, డాక్టర్ అరుణా ధేరే, డాక్టర్ సదానంద్ మోరే, మహేష్ ఎల్కుంచ్వార్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నామ్ దేవ్ కాంబ్లే సహా మరాఠీ భాషకు కృషి చేసిన సాహితీవేత్తల సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆశా బాగే, విజయ రాజధ్యాక్ష, డాక్టర్ శరణ్ కుమార్ లింబాలే, రంగస్థల దర్శకుడు చంద్రకాంత్ కులకర్ణి వంటి ఎందరో దిగ్గజాలు మరాఠీకి ప్రాచీన భాష హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నారని పేర్కొన్నారు.

మరాఠీ సినిమా, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో సేవలందించిన వారిని ప్రధాన మంత్రి కొనియాడారు. భారతీయ సినిమాకు పునాది వేసిన దిగ్గజాలు వి.శాంతారాం, దాదాసాహెబ్ ఫాల్కే అందించిన సేవలను ప్రధాని పేర్కొన్నారు. మరాఠీ నాటకరంగం అణచివేతకు గురైన వారికి/బడుగులకు స్వరాన్ని అందించిదని, మరాఠీ సంగీతాన్ని వేడుక చేసిందని పేర్కొన్నారు. బాల గంధర్వ, భీమ్ సేన్ జోషి, లతా మంగేష్కర్ వంటి దిగ్గజాల కృషిని ప్రధాని ప్రశంసించారు.

అహ్మదాబాద్‌కు చెందిన ఒక మరాఠీ కుటుంబం తనకు భాష నేర్చుకోవడంలో సహాయపడిన జ్ఞాపకాన్ని ప్రధాని ఈ సందర్భంగా పంచుకున్నారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించడం వల్ల దేశమంతా అన్ని విశ్వవిద్యాలయాల్లో భాషా పరిశోధనను ప్రోత్సహించడంతో పాటు సాహిత్య సేకరణను కూడా ప్రోత్సహిస్తుందని ప్రధాన మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. మరాఠీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులు, విద్యార్థులకు ఈ నిర్ణయం గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. ఈ నిర్ణయం విద్య, పరిశోధనల్లో కొత్త మార్గాలను అన్వేషిస్తుందని, ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో విద్యకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం దేశంలో ఉందని ప్రధాని అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం కింద మరాఠీ భాషలో వైద్య, ఇంజినీరింగ్ కోర్సులను అభ్యసించే అవకాశాలను ప్రధాని వివరించారు. సైన్స్, ఆర్థిక శాస్త్రం, కళలు వంటి వివిధ సబ్జెక్టుల్లో మరాఠీలో పుస్తకాల లభ్యత పెరుగుతోందని, మరాఠీని ఆలోచనల వాహకంగా మార్చాలని, తద్వారా అది చైతన్యవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరాఠీ సాహిత్యాన్ని ప్రపంచ అభిమానులకు చేరువ చేసే ప్రయత్నాలను ఆయన అభినందించారు. భాషా అడ్డంకులను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే 'భాషిని'- అనువాద అనువర్తనాన్ని కూడా ప్రధాని సమావేశంలో ప్రస్తావించారు.

ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకోవడం బాధ్యతను పెంచుతుందని ప్రధాని ప్రతి ఒక్కరికీ గుర్తు చేశారు. మరాఠీ మాట్లాడే ప్రతి వ్యక్తి ఈ భాష ఎదుగుదలకు సహకరించాలని ఆయన ఉద్ఘాటించారు. భవిష్యత్ తరాలకు గర్వకారణంగా నిలిచేలా మరాఠీ పరిధిని విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. మరాఠీకి ప్రాచీన భాష హోదా లభించిన సందర్భంగా మరొక్కసారి అందరికీ అభినందనలు తెలుపుతూ ముగించారు.

 

Click here to read full text speech

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Political stability helped India seal major trade deals: PM Narendra Modi

Media Coverage

Political stability helped India seal major trade deals: PM Narendra Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets the former President of India
February 16, 2026

Prime Minister Shri Narendra Modi met the former President Shri Ram Nath Kovind Ji today.

In a post on X, Shri Modi wrote:

“Wonderful meeting former President Shri Ram Nath Kovind Ji. His insights on various subjects are always thoughtful and enriching.”