ప్యారిస్ ‘ఏఐ ఏక్షన్ సమిట్’ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎస్తోనియా దేశాధ్యక్షుడు శ్రీ అలార్ కరిస్ తో భేటీ అయ్యారు, ఇది ఇరువురు నేతల తొలి సమావేశం.

భారత్, ఎస్తోనియా ల మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలు ప్రజాస్వామ్యం, న్యాయపాలన, స్వాతంత్య్రం, సామ్యవాదం వంటి ఆదర్శాల ప్రాతిపదికగా ఏర్పడిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఐటీ, డిజిటల్, సాంస్కృతిక సంబంధాలు, పర్యాటకం, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు సహా ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందడం పట్ల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సైబర్ భద్రత అంశంలో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారాన్ని గురించి నేతలు చర్చించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఎస్తోనియా ప్రభుత్వాన్నీ కంపెనీలనూ శ్రీ మోదీ ఆహ్వానించారు.
భారత్, ఎస్తోనియా ల పరస్పర సంబంధాలు విలువైనవని, ముఖ్యంగా భారత్ – ఈయూ (యూరోపియన్ యూనియన్) భాగస్వామ్యం నేపథ్యంలో ఇరుదేశాల భాగస్వామ్యం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుందని నేతలిద్దరూ అభిప్రాయపడ్డారు. భారత్-నార్డిక్-బాల్టిక్ దేశాల మధ్య మంత్రుల స్థాయి రాకపోకల ప్రారంభం స్వాగతించదగ్గ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించిన నాయకులు, ఐక్య రాజ్య సమితిలో సహకారం అవసరమని అంగీకరించారు.

భారత్, ఎస్తోనియా ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు సహా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతం పట్ల ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్తోనియాలో యోగాకి పెరుగుతున్న ఆదరణ పట్ల ప్రధానమంత్రి సంతోషాన్ని వెలిబుచ్చారు.
Had a very productive meeting with the President of Estonia, Mr. Alar Karis on the sidelines of the AI Action Summit in Paris. India’s ties with Estonia are growing remarkably over the years. We discussed ways to boost ties in areas like trade, technology, culture and more.… pic.twitter.com/F3af01yqA8
— Narendra Modi (@narendramodi) February 11, 2025


