· ఉత్తేజకరమైన బోడో సంస్కృతితో కోక్రాఝర్‌కు అవినాభావ సంబంధం
· ఈ ప్రాంత వికాసానికి ఊతమిచ్చే లక్ష్యంతో అభివృద్ది ప్రాజెక్టులు
· నేడు శాంతి, అభివృద్ధి పథంలో బోడోలాండ్... శాంతి, సౌభాగ్యాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న అస్సాం
· బోడో విశ్వాసాలు, సంప్రదాయాలు జాతీయ స్థాయి గౌరవాన్ని పొందేలా చూడడం మా ప్రభుత్వ బాధ్యత... బోడోల సాంప్రదాయక విశ్వాసమైన ‘బథౌ’కు ఉన్నతమైన గౌరవ స్థానం
· అస్సాం పురోగతిని మరింత వేగంగా కొనసాగించి తీరుతాం... అస్సాం ప్రజల ఆశిస్సులతో ‘వికసిత అస్సాం’ సంకల్పం సాకారమవడం తథ్యం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

అస్సాంలోని కోక్రాఝర్‌లో వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తాను స్వయంగా కోక్రాఝర్‌కు రాలేకపోయానన్న ఆయన.. పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన ప్రజలు పెద్దమనసుతో తనను మన్నించాలని కోరారు. గువహటి నుంచి తాను ప్రసంగిస్తున్నానని ప్రధానమంత్రి చెప్పారు. ఇక్కడి భూమి పుత్రులైన బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ, రూపనాథ్ బ్రహ్మ వంటి మహనీయులను స్మరిస్తూ, వారికి నివాళి అర్పించారు. ఇక్కడికి తరలివచ్చిన అశేష జనవాహిని తన బాధ్యతను మరింత పెంచిందని.. అంకితభావంతో కూడిన సేవ, ఈ ప్రాంత అభివృద్ధి ద్వారా ఆ రుణం తీర్చుకుంటానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘మీకే సేవలందించడం ద్వారా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకునేందుకు నేనెప్పుడూ కృషి చేస్తాను’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

కిందటిసారి గువహటి సందర్శించిన సమయంలో ‘బగురుంబ దహో’ ఉత్సవంలో ఉత్తేజకరమైన బోడో సంస్కృతిని ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశం తనకు లభించిందని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. తమ భాషనూ, వారసత్వాన్నీ, సంప్రదాయాలనూ ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటున్న బోడో సమాజాన్ని ప్రశంసించారు. ‘బథౌ’ వంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలూ, ‘బైసాగు’ వంటి పండుగలూ దేశ సాంస్కృతిక శక్తిని ఇనుమడింపజేస్తాయన్నారు. ‘‘ఈ సంప్రదాయాలు దేశ సాంస్కృతిక వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

అస్సాం వారసత్వాన్ని కాపాడటంతోపాటు రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత కార్యక్రమంలోనే రూ. 4,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినట్టు శ్రీ మోదీ వెల్లడించారు. ముఖ్యంగా బోడోలాండ్‌లో రోడ్డు వ్యవస్థను బలోపేతం చేయడం కోసం రూ. 1,100 కోట్లకు పైగా నిధులను కేటాయించినట్టు తెలిపారు. మూడో దశ అసోం మాల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ కార్యక్రమాల ద్వారా అస్సాంలో రోడ్డు రవాణా సదుపాయాలు మరింత శక్తిమంతం కాబోతున్నాయి’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

ఈ ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కామాఖ్య - చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌, గువహటి- న్యూ జల్పైగురి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇటీవల తాను ప్రారంభించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఈ రవాణా ప్రాజెక్టులు ప్రజలకు సౌకర్యాలను కల్పించడమే కాకుండా.. వాణిజ్యానికి, పర్యాటక రంగానికి ఊతమిస్తాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మెరుగైన రవాణా వ్యవస్థ వల్ల పెద్ద మార్కెట్లు రైతులకు అందుబాటులోకి వస్తాయని, తద్వారా వారు మరింతగా సశక్తులవుతారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ విప్లవాత్మక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఈ ప్రాజెక్టుల వల్ల రైతుల ఉత్పత్తులు సులభంగా ప్రధాన మార్కెట్లకు చేరుకుంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

 

కొన్ని దశాబ్దాలుగా కోక్రాఝర్, చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో కష్టనష్టాలను చవిచూశాయని ప్రధానమంత్రి అన్నారు. హింస, ఆయుధాల మోతలే ఇక్కడి కొండల్లో ఒకప్పుడు మార్మోగేవని శ్రీ మోదీ గుర్తు చేశారు. నేడు ఆ వాతావరణం పూర్తిగా మారిపోయిందన్నారు. ‘ఖమ్’, ‘సిఫుంగ్’ వంటి సంప్రదాయ వాయిద్యాల శ్రావ్యమైన ధ్వనులతో ఇక్కడి గాలిలో సామరస్యం వెల్లివిరుస్తోందన్నారు. శాంతి, సౌభాగ్యాలతో బోడోలాండ్, అస్సాం నేడు ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘శాంతి, వికాస పథంలో బోడోలాండ్ పయనం నేడు మొదలైంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

స్థానిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా.. బీటీఆర్ ప్రాంతంలో ఆరు కీలకమైన రోడ్డు ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. రైల్వే వర్క్‌షాప్‌ ఏర్పాటు సహా.. రైలు రవాణాను బలోపేతం చేయడానికి విశేష చర్యలు చేపడుతున్నట్టు శ్రీ మోదీ వెల్లడించారు. త్వరలో చేపట్టనున్న భూటాన్ రైల్వే లింకు, వివిధ స్టేషన్ల ఆధునికీకరణ ద్వారా ఈ ప్రాంతం ప్రధాన రవాణా కేంద్రంగా అవతరించబోతోందన్నారు. వందేభారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కోక్రాఝర్‌లో ఆగుతుండడం.. ఈ ప్రాంత స్థాయి పెరుగుతోందనడానికి నిదర్శనమన్నారు. ‘‘ఈ ప్రాజెక్టుల ద్వారా కోక్రాఝర్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా అవతరించబోతోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

అభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేస్తున్న హగ్రామ మొహిలరీ, హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బృందాలకు ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శాశ్వత స్థిరత్వానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అన్ని ప్రధాన సంస్థలనూ ఒకే వేదికపైకి తెచ్చిన ‘బోడో శాంతి ఒప్పందం’ ఒక మైలురాయి వంటి కీలక విజయమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకొనిపోవడమే తమ విధానమనీ, గతంలో ఉన్న రాజకీయ ధోరణికి ఇది భిన్నమైనదనీ అన్నారు. ‘‘అందరినీ ఏకం చేయడం ద్వారా శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు మేం అంకితభావంతో కృషి చేశాం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

మాట నిలబెట్టుకోవడం తమ ప్రభుత్వానికి అలవాటని శ్రీ మోదీ స్పష్టం చేశారు. 2003లో ఆరో షెడ్యూలు ప్రకారం బీటీసీ ఏర్పాటును శ్రీ మోదీ ఈ సందర్భంగా ఉదహరించారు. బోడోలాండ్ యూనివర్సిటీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ అంకితభావానికి నిదర్శనమన్నారు. ‘‘మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రతి వాగ్దానాన్నీ నిజాయితీగా నెరవేర్చడానికి కృషి చేసింది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

2020 బోడో ఒప్పందం ప్రకారం చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఒక్కొక్కటిగా తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ఇచ్చిన మాట మేరకు బోడో భాషకు సహ అధికార భాష హోదాను కల్పించిన విషయాన్ని శ్రీ మోదీ గుర్తుచేశారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు.. రూ. 1,500 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని అమలు చేశామని ఆయన వెల్లడించారు. దాదాపు 10,000 మంది మాజీ తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో భాగమవడం ఈ ప్రాంత అతిపెద్ద విజయమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘యువతను ప్రధాన స్రవంతిలో భాగం చేసే దిశగా ఇచ్చిన ప్రతి మాటనూ మేం నిలబెట్టుకుంటున్నాం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

బోడో సమాజ ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి తెలిపారు. బోడోల సాంప్రదాయక విశ్వాసమైన ‘బథౌ’కు అత్యున్నత గౌరవాన్ని కల్పించడమే కాకుండా.. జనగణనలో దానికి ప్రత్యేక గుర్తింపు కోడ్‌ను కేటాయించినట్టు ప్రధానమంత్రి మోదీ గుర్తుచేశారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న వివిధ ప్రాంతాల అభివృద్ధికి, వాటిని కాపాడుకునేందుకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. గిరిజనుల సాంస్కృతిక అస్తిత్వం దిశగా ఇలాంటి చర్యలు అత్యావశ్యకమని ప్రధానమంత్రి అన్నారు. ‘‘బోడో సమాజపు సంప్రదాయాలకు నేడు జాతీయ స్థాయిలో గౌరవం లభిస్తోంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.

అక్రమ ఆక్రమణదారుల నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో సాగుతున్న భారీ ఉద్యమం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అసలైన అస్సాం వాసులకు చట్టబద్ధమైన భూమి హక్కు పత్రాలను తమ ప్రభుత్వం విజయవంతంగా అందజేసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ కీలకమైన కార్యక్రమానికి గిరిజన సమాజం క్రియాశీలకంగా మద్దతునిచ్చిందంటూ అభినందించారు.

స్వయంసమృద్ధి గల రాష్ట్రంగా అస్సాంను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే.. అభివృద్ధి వేగాన్ని మరింత పెంచాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రజల నిరంతర ఆశీస్సులతో ‘వికసిత అస్సాం’ సంకల్పం కచ్చితంగా నెరవేరుతుందని శ్రీ మోదీ ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ విజయవంతం కావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలవాలన్న అస్సాం సంకల్పం తప్పక నెరవేరుతుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
1 year of Operation Sindoor: 'Defining moment in India's strategic journey'

Media Coverage

1 year of Operation Sindoor: 'Defining moment in India's strategic journey'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the valour and duty of the Indian Armed Forces
May 08, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that the courage and valour of the Indian Armed Forces in protecting the honour and dignity of the nation make every citizen proud. He noted that their spirit of sacrificing everything for Mother India is a source of inspiration for all.

The Prime Minister shared a Sanskrit verse-

“स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि |
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ||”

The verse conveys that When one becomes aware of one’s duty, there should be no hesitation or fear of any kind in the mind, because the struggle undertaken to protect religion and honour on the altar of justice is the most excellent and most glorious path to self-welfare for a warrior.