భారతీయ రైల్వే ఆధునికీకరణ దిశగా నేడు మరో కీలక అడుగు.. దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభిస్తున్నాం: ప్రధానమంత్రి
కాళీ మాత ప్రాంతాన్ని అమ్మ కామాఖ్య ప్రాంతంతో అనుసంధానించే దేశంలోనే తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలు ఇది. రాబోయే రోజుల్లో ఈ ఆధునిక రైలు సేవలు దేశమంతటా విస్తరించనున్నాయి. ఈ రైలును ప్రారంభించిన సందర్భంగా బెంగాల్‌, అస్సాం, దేశ ప్రజలందరికీ నా అభినందనలు: ప్రధానమంత్రి
ఈ రోజు బెంగాల్‌కు మరో నాలుగు ఆధునిక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు లభించాయి. అవి న్యూ జల్‌పాయ్‌గురి –నాగర్‌కోయిల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, న్యూ జల్‌పాయ్‌గురి –తిరుచ్చిరాపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, అలీపుర్ద్వార్–బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, అలీపుర్ద్వార్–ముంబై అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ . వీటితో బెంగాల్, ముఖ్యంగా ఉత్తర బెంగాల్ ప్రాంతానికి దక్షిణ, పశ్చిమ భారత దేశంతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది: ప్రధానమంత్రి
మాల్దా వేదికగా పశ్చిమ బెంగాల్ పురోగతిని వేగవంతం చేసే ఉద్యమానికి మరింత ఊపొచ్చిందని పేర్కొన్నారు

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో రూ. 3,250 కోట్ల విలువైన అనేక రైలు, రహదారి మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేసి, అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని శ్రీ మోదీ ప్రసంగించారు. మాల్దా వేదికగా పశ్చిమ బెంగాల్ పురోగతిని వేగవంతం చేసే ఉద్యమానికి మరింత ఊపొచ్చిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను ఇప్పుడే ప్రారంభించి, ప్రజలకు అంకితం చేసినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ కోసం కొత్త రైలు సేవలను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలకు కూడా తోడ్పడతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన కొత్త రైలు నిర్వహణ సదుపాయాలు బెంగాల్ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తాయని పేర్కొన్నారు.

 

బెంగాల్ పవిత్ర భూమి నుంచి భారతీయ రైల్వే ఆధునీకరణ దిశగా మరో కీలక అడుగు పడిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. నేటి నుంచి భారత్‌లో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైలు పౌరుల సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, ఆనందదాయకంగా మారుస్తుందని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశంలో రైళ్లు ఎలా ఉండాలనే దార్శనికతకు ఈ వందే భారత్ స్లీపర్ రైలు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే మాల్దా స్టేషన్‌లో కొంతమంది ప్రయాణికులతో తాను సంభాషించానని, ఈ రైలులో ప్రయాణించడం అసాధారణ అనుభూతిని ఇస్తోందంటూ వారందరూ వెల్లడించారని ప్రధానమంత్రి తెలిపారు. ఒకప్పుడు ప్రజలు విదేశీ రైళ్ల చిత్రాలను చూసి, అలాంటి రైళ్లు భారత్‌లో కూడా ఉంటే బాగుండునని కోరుకునేవారని, ఆ కల ఇప్పుడు సాకారమవుతోందని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఇటీవలి రోజుల్లో భారతీయ రైల్వేలో వస్తున్న విప్లవాత్మక మార్పులను విదేశీ పర్యాటకులు వీడియోలు తీస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వందే భారత్ రైలు ‘మేడ్ ఇన్ ఇండియా’ అని, భారతీయుల కృషి, అంకిత భావంతో నిర్మించిందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని తొలి వందే భారత్ స్లీపర్ రైలు కాళీ మాత భూమిని  కామాఖ్య తల్లి భూమితో అనుసంధానిస్తోందని శ్రీ మోదీ తెలిపారు. రాబోయే కాలంలో ఈ ఆధునిక రైలు సేవలు దేశమంతటా విస్తరిస్తాయని పేర్కొంటూ.. ఈ ఆధునిక స్లీపర్ రైలును పొందినందుకు బెంగాల్‌, అస్సాం, దేశ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

భారతీయ రైల్వేలో విస్తృతమైన మార్పులు జరుగుతున్నాయని, రైలు మార్గాల విద్యుదీకరణతో పాటు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు పశ్చిమ బెంగాల్‌ సహా దేశవ్యాప్తంగా 150కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. దీనితో పాటు ఆధునిక, హై స్పీడ్‌ రైళ్ల సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, ఇది బెంగాల్‌లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. బెంగాల్‌కు మరో నాలుగు ఆధునిక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు లభించాయని ఆయన ప్రకటించారు. అవి న్యూ జల్‌పాయ్‌గురి–నాగర్‌కోయిల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌, న్యూ జల్‌పాయ్‌గురి –తిరుచిరాపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌, అలీపుర్దువార్–బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, అలీపుర్దువార్–ముంబై అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ రైళ్లు బెంగాల్‌, ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌ ప్రాంతాన్ని దక్షిణ, పశ్చిమ భారతదేశంతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంగాసాగర్, దక్షిణేశ్వర్, కాళీఘాట్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తులకు, అలాగే తమిళనాడు, మహారాష్ట్రకు ప్రయాణించే వారికి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు.

 

‘‘భారతీయ రైల్వేలు కేవలం ఆధునికీకరణ వైపు పయనించడమే కాకుండా, స్వయం సమృద్ధిని కూడా సాధిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు. దేశపు రైలు ఇంజన్లు, కోచ్‌లు, మెట్రో కోచ్‌లు భారత సాంకేతిక పరిజ్ఞానానికి చిహ్నాలుగా మారుతున్నాయని ఆయన తెలిపారు. నేడు భారత్‌... అమెరికా, యూరప్ దేశాల కంటే ఎక్కువ రైలు ఇంజన్లను తయారు చేస్తోందని, ప్రయాణికుల రైళ్లు, మెట్రో రైలు కోచ్‌లను అనేక దేశాలకు ఎగుమతి చేస్తోందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు.

దేశాన్ని అనుసంధానించడం ఒక ప్రాధాన్యత అని, దూరాలను తగ్గించడం ఒక లక్ష్యం అని చెబుతూ, నేటి కార్యక్రమం దీనికి స్పష్టమైన నిదర్శనమని శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.  కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ సీవీ ఆనంద బోస్, కేంద్ర మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ షంతన్ ఠాకూర్, శ్రీ సుకాంత మజుందార్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం...

ప్రధానమంత్రి మాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి, అక్కడ నుంచి హౌరా-గౌహతి (కామాఖ్య) మధ్య భారత తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అలాగే గౌహతి (కామాఖ్య)–హౌరా వందే భారత్ స్లీపర్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఆధునిక భారత్‌లో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి అభివృద్ధి చేసిన పూర్తి స్థాయి ఎయిర్ కండిషన్ కలిగిన వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు తక్కువ ధరల్లో విమాన ప్రయాణం లాంటి అనుభవాన్ని అందించనుంది. ఇది సుదూర ప్రయాణాలను వేగంగా, సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. హౌరా-గౌహతి (కామాఖ్య) మార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 2.5 గంటలు గణనీయంగా తగ్గించడం ద్వారా ఈ రైలు ఆధ్యాత్మిక పర్యటనలు, పర్యాటక రంగాలకు కొత్త ఊపునివ్వనుంది. 

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో బలూర్‌ఘాట్-హిలీ మధ్య కొత్త రైలు మార్గం, న్యూ జల్‌పాయ్‌గురిలో అత్యాధునిక సరుకు రవాణా నిర్వహణ సౌకర్యాలు, సిలిగురి లోకో షెడ్ ఆధునీకరణ, జల్‌పాయ్‌గురి జిల్లాలో వందే భారత్ రైలు నిర్వహణ సౌకర్యాల ఆధునీకరణలు భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రయాణికుల, సరుకు రవాణా కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు ఉత్తర బెంగాల్‌లో సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలనూ సృష్టించనున్నాయి.

 

న్యూ కూచ్‌బెహార్–బామన్‌హాట్, న్యూ కూచ్‌బెహార్–బాక్సిర్‌హాట్ మధ్య రైలు మార్గాల విద్యుదీకరణను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీనివల్ల వేగవంతమైన, పరిశుభ్రమైన, మరింత ఇంధన సామర్థ్యం గల రైలు కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి.

4 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. న్యూ జల్‌పాయ్‌గురి- నాగర్‌కోయిల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... న్యూ జల్‌పాయ్‌గురి-తిరుచిరాపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... అలీపుర్‌దువార్-ఎస్ఎంవీటీ బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. అలీపుర్‌దువార్-ముంబయి (పన్వేల్) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దీనిలో భాగంగా ఉన్నాయి. ఇది ఆర్థికంగా సౌకర్యవంతమైన, నమ్మదగిన సుదూర ప్రాంత రైలు అనుసంధానాన్ని పెంచుతుంది. ఈ సేవలు సాధారణ పౌరులు, విద్యార్థులు, వలస కార్మికులు, వ్యాపారుల రవాణా అవసరాలకు మద్దతునిస్తాయి. అదే సమయంలో అంతర్-రాష్ట్ర ఆర్థిక, సామాజిక సంబంధాలనూ బలోపేతం చేస్తాయి.

 

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ఉన్న రెండు కొత్త రైళ్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. రాధికాపూర్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్, బలూర్‌ఘాట్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లనూ ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ రైళ్లు స్థానిక యువతకు, విద్యార్థులకు, ఐటీ నిపుణులకు బెంగళూరు వంటి ప్రధాన ఐటీ, ఉపాధి కేంద్ర నగరాలకు ప్రత్యక్ష, సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

జాతీయ రహదారి-31డిలోని ధూప్‌గురి–ఫలకాటా విభాగాన్ని పునరుద్ధరించి, నాలుగు వరుసలుగా విస్తరించే కీలక రహదారి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ఉత్తర బెంగాల్‌లో ప్రాంతీయ రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రయాణికుల, సరుకు రవాణాలను సులభతరం చేస్తుంది.

ఈ ప్రాజెక్టులు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో, మెరుగైన అనుసంధానాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతాలను దేశాభివృద్ధికి కీలక చోదకాలుగా బలోపేతం చేస్తాయి.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's strong growth outlook intact despite global volatility: Govt

Media Coverage

India's strong growth outlook intact despite global volatility: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over mishap in Coimbatore
April 17, 2026

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep anguish over the mishap in Coimbatore, Tamil Nadu.

Shri Modi said that he is distressed to hear about the incident and extended his heartfelt condolences to those who have lost their loved ones. He also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Distressed to hear about the mishap in Coimbatore, Tamil Nadu. I extend my heartfelt condolences to those who have lost their loved ones in the mishap. Prayers for the speedy recovery of those injured: PM @narendramodi”