నివారణ, సమగ్ర ఆరోగ్య లక్ష్యంపై నేడు భారత్ పనిచేస్తోంది: పీఎం
గడచిన కొన్నేళ్లుగా దేశంలో బలోపేతమైన ఆరోగ్య మౌలిక వసతులు, వందలాది జిల్లాల్లో ప్రారంభమైన వైద్య కళాశాలలు
ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య మందిరాల ద్వారా ప్రతి గ్రామానికి చేరువైన ఆరోగ్య సేవలు: పీఎం
మన యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి: పీఎం
వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మన విద్యా వ్యవస్థను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలి
ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ, నమూనా ఆధారిత తయారీపై మన దృష్టిని పెంపొందించాలి: పీఎం
ఆవిష్కరణాధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకెళుతున్న భారత్: పీఎం

బడ్జెట్ అనంతర వెబినార్లలో భాగంగా ‘‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’’ అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన నాలుగో వెబినార్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడంలో విద్య, నైపుణ్యం, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి లాంటి రంగాలు ప్రధాన వాహనాలుగా పనిచేస్తాయని శ్రీ మోదీ వివరించారు. బడ్జెట్ ప్రకటనలను సమర్థంగా అమలు చేయడంపై చర్చిస్తున్న నిపుణులు, విధాన రూపకర్తలకు స్వాగతం పలికారు. ‘‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ఒక అంశానికి మాత్రమే పరిమితం కాదు. అది ఈ బడ్జెట్‌లో ప్రధాన లక్ష్యం, ప్రభుత్వ సంకల్పం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

నివారణ, సమగ్ర ఆరోగ్య లక్ష్యాన్ని ప్రధానమంత్రి తెలియజేశారు. వేగంగా బలోపేతమవుతున్న ఆరోగ్య మౌలిక వసతులు, యోగా, ఆయుర్వేదానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణ గురించి వివరించారు. వందలాది జిల్లాల్లో వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయని ప్రధాని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం, ఆరోగ్య మందిరాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలు పొందే పరిధి పెరిగిందన్నారు. అభివృద్ధి చెందుతున్న ‘కేర్ ఎకానమీ’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయంగా సంరక్షణ సేవలు అందించేవారికి పెరుగుతున్న డిమాండు నేపథ్యంలో యువతకు కొత్త శిక్షణ నమూనాలు అభివృద్ధి చేయాలని నిపుణులను శ్రీ మోదీ కోరారు. ‘‘కొత్త శిక్షణ నమూనాలను అభివృద్ధి చేయడానికి, భాగస్వామ్యాలకు సూచనలివ్వాలని ఈ వెబినార్‌కు హాజరైన ఆరోగ్య రంగ ప్రతినిధులను కోరుతున్నాను. ఫలితంగా దేశంలో నైపుణ్య శిక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

 

ఆరోగ్య రంగంలో డిజిటల్ మార్పు గురించి, మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకున్న టెలి-మెడిసన్ సేవల విజయాన్ని ప్రధాని చర్చించారు. ఈ వృద్ధిని అంగీకరిస్తూనే.. వినియోగదారులకు అందించే సేవలను మరింత సరళీకరించాల్సిన, సమాజంలో మరింత అవగాహనను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘టెలి-మెడిసిన్ సేవలను మరింత సులభతరం చేయాల్సిన, అవగాహనను పెంపొందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

మారుతున్న భారతీయ యువత ఆలోచనా ధోరణే దేశానికి గొప్ప బలమని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ స్ఫూర్తిని విద్యా వ్యవస్థ అందుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధి, పరిశ్రమతో విద్యారంగాన్ని అనుసంధానించేందుకు దేశంలో నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని శ్రీ మోదీ తెలిపారు. మార్కెట్ డిమాండ్లు, వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉండే, ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ రంగాల్లో పాఠ్య ప్రణాళికకు అవసరమైన పునాదిని నూతన విద్యా విధానం అందిస్తుంది. ‘‘మన విద్యా వ్యవస్థను వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మనం వేగవంతం చెయ్యాలి’’ అని శ్రీ మోదీ చెప్పారు.

విద్య, ఉపాధి, పరిశ్రమ మధ్య సంబంధాన్ని ప్రధానమంత్రి చర్చిస్తూ, ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగానికి అందిస్తున్న ప్రోత్సాహం గురించి వివరించారు. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ ప్రయాణిస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థులకు వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేసేలా తమ క్యాంపస్‌లను పారిశ్రామిక సహకారానికి, పరిశోధనాధారిత విద్యకు కేంద్రాలుగా మార్చాలని విద్యా సంస్థలకు పిలుపునిచ్చారు. ‘‘పారిశ్రామిక సహకారానికి, పరిశోధనాధారిత విద్యకు కేంద్రాలుగా క్యాంపస్‌లను అభివృద్ధి చేయడంపై కచ్చితంగా మేధోమథనం జరపాలని ఈ వెబినార్ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను’’ అని శ్రీ మోదీ తెలిపారు.

స్టెమ్ రంగాల్లో మహిళల సంఖ్య పెరగడం పట్ల ప్రధానమంత్రి గర్వం వ్యక్తం చేశారు. అలాగే అత్యాధునిక సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఆవిష్కరణలు, ప్రయోగాలు చేపట్టేలా యువ పరిశోధకులను ప్రోత్సహించే విస్తృతమైన పరిశోధనా రంగానికి శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ‘‘ప్రయోగానికి, కొత్త ఆలోచనలపై పనిచేయడానికి పూర్తి అవకాశాన్ని పొందేలా యువ పరిశోధకులకు పరిశోధన వ్యవస్థను మనం రూపొందించాలి’’ అని తెలిపారు.

 

జాతీయ శక్తికి ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన యువతే వెన్నెముక అంటూ క్రీడల గురించి ప్రధానమంత్రి వివరించారు. ‘ఖేలో ఇండియా’ ప్రభావం గురించి వివరించారు. చిన్న పట్టణాలు, ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం, క్రీడా సంస్థలను వృత్తిపరమైనవిగా తయారు చేయడం, రానున్న కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ బిడ్ తదితర కార్యక్రమాలకు క్రీడాకారులు సన్నద్ధమయ్యేలా వారికి అందించే నిర్మాణాత్మక ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం గురించి కూడా తెలియజేశారు. ‘‘ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే యువ క్రీడాకారులను గుర్తించి, తీర్చిదిద్దాలి. అప్పుడే అంతర్జాతీయ పోటీల్లో భారత పతాకం రెపరెపలాడుతుంది’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.

పర్యాటక, సంస్కృతి ఆధారిత ఉపాధి శక్తి గురించి ప్రధానమంత్రి వివరించారు. సంప్రదాయక ప్రదేశాలను దాటి కొత్త పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా సిటీ బ్రాండింగ్ మెరుగుపడుతుందని, సమగ్రాభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. నైపుణ్యాలు, అనుసంధానం, సమాజ భాగస్వామ్యంతో కూడిన సమగ్ర విధానంపై దృష్టి సారించాలని సంబంధిత నిపుణులను శ్రీ మోదీ కోరారు. ‘‘ఇప్పుడు దేశంలో నూతన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై మేం దృష్టి సారించాం’’ అని ప్రధాని తెలియజేశారు.

‘‘శిక్షణ పొందిన గైడ్లు, ఆతిథ్య నైపుణ్యాలు, డిజిటల్ అనుసంధానం, సమాజ భాగస్వామ్యమే పర్యాటక రంగానికి ప్రధాన ఆధారాలు. వీటితో పాటు పారిశుద్ధ్యం, సుస్థిర పద్ధతులను పాటించడం అవసరం. ప్రపంచ గమ్యస్థానంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడానికి మనం సమష్టిగా కృషి చేస్తున్న నేపథ్యంలో పర్యాటకం, సంబంధిత రంగాలకు సంబంధించి మీరిచ్చే సూచనలు చాలా కీలకం’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

దేశ పురోగతిని వేగవంతం చేయడానికి సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయానికున్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఈ చర్చలు భవిష్యత్తు కోసం బలమైన ప్రణాళికను అందిస్తాయని, అభివృద్ధి చెందిన భారత్‌ పునాదిని మరింత పటిష్టం చేస్తాయనే విశ్వాసాన్ని తన ముగింపు వ్యాఖ్యల్లో వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రయత్నాలతో అభివృద్ధి చెందిన భారత్ పునాది మరింత బలోపేతమవుతుంది’’ అని పీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules

Media Coverage

Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu and his family in Hyderabad
May 10, 2026

The Prime Minister, Shri Narendra Modi met the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, and his family at his residence in Hyderabad today.

The Prime Minister said that it is always a delight to meet Shri Chandrababu Naidu and his family and exchange views on a wide range of subjects and diverse topics.

The Prime Minister wrote on X;

“In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.

@ncbn”