ఉత్తరప్రదేశ్ వృద్ధి పథానికి, భారత విమానయాన రంగ భవిష్యత్తుకు నోయిడా విమానాశ్రయ మొదటి దశ ప్రారంభోత్సవం కీలక ఘట్టం: పీఎం
దేశంలో అత్యధికంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిన యూపీ: పీఎం
విమానాశ్రయాలు కేవలం ప్రాథమిక వసతులు మాత్రమే కాదు.. అవి దేశ ప్రగతికి రెక్కలు: పీఎం
వికసిత్ భారత్ నిర్మాణానికి ఆధునిక మౌలిక సదుపాయాల రంగంలో మునుపెన్నడూ లేని పెట్టుబడులను పెడుతున్న ప్రభుత్వం: పీఎం

ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తపరుస్తూ.. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ అభియాన్‌లో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఈ విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేసి, నేడు తానే ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ భారీ విమానాశ్రయం పేరు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి ఉండటం మరో విశేషమని చెబుతూ.. "నన్ను ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిన ఈ రాష్ట్ర గుర్తింపు, ఇప్పుడు ఈ అద్భుతమైన విమానాశ్రయంతో ముడిపడి ఉంది" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

 

ఈ కొత్త విమానాశ్రయం వల్ల విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తూ.. ఆగ్రా, మథుర, అలీగఢ్, ఘజియాబాద్, మీరట్, ఎటావా, బులంద్‌షహర్, ఫరీదాబాద్ వంటి సువిశాల ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, యువతకు నూతన అవకాశాలను తీసుకువస్తుందని ఆయన స్పష్టం చెప్పారు. "ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు విమానాలు వెళ్తాయి. ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్ కు ప్రగతి చిహ్నంగా మారుతుంది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పశ్చిమ యూపీ వాసులకు శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

 

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో నెల రోజులుగా జరుగుతున్న యుద్ధం పట్ల యావత్ ప్రపంచం ఆందోళనలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. దీనివల్ల అనేక దేశాల్లో ఆహారం, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల వంటి నిత్యావసర వస్తువుల సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. భారత్ కూడా ఆ సంక్షోభ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోందన్నారు. “ఈ సంక్షోభ భారం సామాన్య కుటుంబాలు, రైతులపై పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

ప్రపంచ సంక్షోభ సమయాల్లోనూ భారత్ వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. కేవలం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే కొన్ని వారాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయని, ఇది నాలుగో ప్రధాన ప్రాజెక్టు అని వెల్లడించారు. "ఈ స్వల్ప కాలంలోనే నోయిడాలో ఒక భారీ సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. దేశంలోనే మొదటి ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలు ప్రారంభమైంది. మీరట్ మెట్రో విస్తరణ, నేడు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది" అని శ్రీ  నరేంద్ర మోదీ తెలిపారు.

 

యూపీ అభివృద్ధిలో ఈ అద్భుతమైన విజయాలకు ప్రస్తుత ప్రభుత్వమే కారణమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ సాంకేతిక రంగంలో భారతదేశాన్ని స్వావలంబన దేశంగా మారుతుందని.. మీరట్ మెట్రో, నమో భారత్ రైలు వేగవంతమైన, స్మార్ట్ అనుసంధానతను కల్పిస్తుందని.. జెవార్ విమానాశ్రయం ఉత్తర భారతదేశం మొత్తాన్ని ప్రపంచంతో అనుసంధానిస్తోందని వివరించారు. "నేడు ఈ ప్రభుత్వ హయాంలో నోయిడా నగరం యూపీ అభివృద్ధికి  శక్తిమంతమైన ఇంజిన్‌గా మారుతోంది" అని శ్రీ  నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

ఈ విమానాశ్రయ ప్రాజెక్టు చరిత్రను వివరిస్తూ, జెవార్ విమానాశ్రయానికి అటల్ బిహారీ వాజ్‌పేయి  2003లోనే ఆమోదం తెలిపారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేశాయని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, నిర్మాణాన్ని పూర్తి చేసి, నేడు కార్యకలాపాలను ప్రారంభించిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

 

ఈ ప్రాంతం లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ది చెందుతుందని, రెండు ప్రధాన సరకు రవాణా మార్గాలకు కేంద్రంగా మారుతోందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక రైల్వే మార్గాలు ఉత్తర భారతదేశానికి బెంగాల్, గుజరాత్ సముద్ర తీరాలతో అనుసంధానాన్ని పెంచాయని పేర్కొన్నారు. దాద్రి వద్ద ఈ రెండు కారిడార్లు కలుస్తాయని, దీనివల్ల ఇక్కడి రైతులు పండించే పంటలు, పరిశ్రమల ఉత్పత్తులు రహదారి, విమానయాన మార్గాల ద్వారా ప్రపంచంలోని ప్రతి చోటుకి వేగంగా చేరుకుంటాయని చెప్పారు. “ఇటువంటి సమగ్ర అనుసంధానత ఉత్తరప్రదేశ్‌ను ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణగా మారుస్తోంది” అని పీఎం మోదీ వివరించారు.

మారుతున్న ఈ ప్రాంత రూపురేఖల గురించి ప్రస్తావిస్తూ.. "నేడు యావత్ ప్రపంచాన్ని ఆహ్వానించటానికి నోయిడా సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతమంతా ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోంది" అని ప్రధానమంత్రి అన్నారు.

ఈ ప్రాజెక్టు సాకారానికి భూములను త్యాగం చేసిన రైతులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికున్న ప్రాముఖ్యతను వివరించారు. ఆధునిక అనుసంధానతను విస్తరించటం వల్ల పశ్చిమ యూపీలో ఆహార శుద్ధి రంగం మరింత పుంజుకుంటుందన్నారు. “ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు మరింత వేగంగా చేరుకుంటాయి” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ముడి చమురుపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించటంలో చెరకు రైతులు చేస్తున్న కృషిని ప్రధానమంత్రి అభినందించారు. చెరకు నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్ ప్రాముఖ్యతను వివరించారు. ఇథనాల్ ఉత్పత్తి పెరగకపోయినా, దాన్ని పెట్రోల్‌లో కలపకపోయినా.. ఏటా అదనంగా నాలుగున్నర కోట్ల బ్యారెళ్ల ముడి చమురును, అంటే దాదాపు 700 కోట్ల లీటర్లను భారత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని ప్రధానమంత్రి తెలిపారు. "ప్రపంచ సంక్షోభ సమయంలో మన రైతుల కష్టం దేశానికి భారీ ఉపశమనాన్ని కలిగించింది" అని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

 

ఇథనాల్ వినియోగం దేశానికే కాకుండా రైతన్నలకు కూడా ఎంతో మేలు చేసిందని, దీనివల్ల సుమారు రూ. 1.5 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని ప్రధాని వివరించారు. గతంలో చెరకు రైతులు తమ బకాయిల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ‘‘నేడు ప్రస్తుత ప్రభుత్వ కృషి వల్ల చెరకు రైతుల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

విమానాశ్రయాలు కేవలం సౌకర్యాలు మాత్రమే కాదని,  ప్రగతికి చోదక శక్తులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణను ఆయన ప్రస్తావించారు. నేడు దేశంలో 160కి పైగా విమానాశ్రయాలు ఉన్నాయని, విమాన ప్రయాణం కేవలం మహా నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు కూడా చేరుతోందని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం విమాన ప్రయాణాన్ని సామాన్య భారతీయుడికి అందుబాటులోకి తెచ్చింది’’ అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో విమానాశ్రయాల సంఖ్యను పదిహేడుకు పెంచినట్లు తెలిపారు.

 

ఉడాన్‌ పథకం ప్రభావాన్ని వివరిస్తూ.. విమానాశ్రయాలు నిర్మించడమే కాకుండా, విమాన ప్రయాణ ఛార్జీలు సాధారణ కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఉడాన్ పథకం కింద టిక్కెట్లు బుక్ చేసుకుని కోటి అరవై లక్షల మందికి పైగా పౌరులు తక్కువ ధరలకే విమాన ప్రయాణం చేశారని పేర్కొన్నారు. ‘‘ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 29,000 కోట్ల ఆమోదంతో ఉడాన్ పథకాన్ని మరింత విస్తరించింది. దీని కింద రాబోయే ఏళ్లలో చిన్న నగరాల్లో 100 కొత్త విమానాశ్రయాలు, 200 కొత్త హెలిప్యాడ్‌లు నిర్మితమవుతాయి. దీనివల్ల యూపీకి కూడా ఎంతో మేలు జరుగుతుంది’’. అని శ్రీ మోదీ అన్నారు.

 

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తున్న కొద్దీ కొత్త విమానాలకు డిమాండ్ కూడా పెరుగుతోందని, వివిధ విమానయాన సంస్థలు వందల కొద్దీ కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇస్తున్నాయని తెలిపారు. ఇది పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, నిర్వహణ నిపుణులతో సహా యువతకు అపారమైన అవకాశాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.  పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి ‘‘మా ప్రభుత్వం విమానయాన రంగంలో శిక్షణ సౌకర్యాలను కూడా విస్తరిస్తోంది’’ అని చెప్పారు.

 

భారత విమానయాన రంగంలో 85 శాతం ఇప్పటికీ నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర తనిఖీ (ఎంఆర్‌ఓ) సేవల కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఆర్‌ఓ రంగంలో కూడా దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, నేడు జేవార్‌లో ఒక ఎంఆర్‌ఓ కేంద్రానికి శంకుస్థాపన జరిగిందని చెప్పారు. ‘‘ఇది సిద్ధమైనప్పుడు భారత్, విదేశాల నుంచి వచ్చే విమానాలకు సేవలు అందిస్తుంది. దీనివల్ల దేశానికి ఆదాయాన్ని సమకూరుస్తుంది. మన డబ్బును మన దేశంలోనే ఉంచుతుంది. యువతకు అనేక ఉద్యోగాలను సృష్టిస్తుంది’’ అని ప్రకటించారు.

 

పౌరుల సౌకర్యాన్ని నిర్ధారించడం, వారి సమయాన్ని, డబ్బును ఆదా చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మెట్రో, వందే భారత్ వంటి ఆధునిక రైలు సేవల విస్తరణ గురించి మాట్లాడారు.‘‘ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలును ఇప్పటికే రెండున్నర కోట్లకు పైగా ప్రయాణికులు ఉపయోగించారు. గంటల సమయం పట్టే ప్రయాణం ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతోంది’’అని చెప్పారు.

 

వికసిత్ భారత్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాల రంగంలో మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న పెట్టుబడులను ప్రధానమంత్రి ప్రస్తావించారు. గత 11 ఏళ్లలో మౌలిక సదుపాయాల బడ్జెట్‌ను ఆరు రెట్లు పెంచినట్లు చెప్పారు. రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల కోసం రూ. 17 లక్షల కోట్లు ఖర్చు చేసి లక్ష కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించినట్లు తెలిపారు. 2014 కి ముందు 20,000 కిలోమీటర్లుగా ఉన్న రైల్వే విద్యుదీకరణ, నేడు 40,000 కిలోమీటర్లకు పైగా పెరిగిందని, బ్రాడ్ గేజ్ వ్యవస్థను దాదాపు 100 శాతం విద్యుదీకరించామని పేర్కొన్నారు. కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల రాజధానులను తొలిసారిగా రైలు వ్యవస్థతతో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు.గత దశాబ్ద కాలంలో ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగిందని అంతర్గత జలమార్గాల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ‘‘వికసిత్ భారత్ నిర్మాణానికి అవసరమైన ప్రతి రంగంలోనూ భారత్‌ అత్యంత వేగంగా పనిచేస్తోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

ప్రపంచ సవాళ్ల దృష్ట్యా సమష్టి కృషి, జాతీయ ఐక్యత అవసరమని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల వల్ల తలెత్తుతున్న సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై పార్లమెంటులోను, ముఖ్యమంత్రులతోనూ సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఈ సంక్షోభాన్ని ప్రశాంతంగా, ఓపికగా ఎదుర్కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే భారతీయుల గొప్ప బలం అని ఆయన పేర్కొన్నారు ‘‘భారతీయుల ప్రయోజనం, దేశ ప్రయోజనాలకు ఏది మంచిదో అదే భారత ప్రభుత్వ విధానం, వ్యూహం’’ అని ప్రధాని పునరుద్ఘాటించారు. దేశ సమైక్య ప్రయత్నాలకు అన్ని రాజకీయ పార్టీలు బలాన్ని ఇస్తాయని తాను పూర్తి విశ్వాసంతో ఉన్నానని చెబుతూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry

Media Coverage

National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising that knowledge can be gained only through devoted service to the Guru
May 12, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam emphasising that knowledge can be gained only through devoted service to the Guru.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

"यथा खात्वा खनित्रेण भूतले वारि विन्दति।

तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति॥"

The Subhashitam conveys, that just as one must dig deep into the earth with hard work and patience to obtain water, in the same way, knowledge can be gained only through devoted service to the Guru, with faith, dedication, discipline, and sincerity.

The Prime Minister posted on X:

"यथा खात्वा खनित्रेण भूतले वारि विन्दति।

तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति॥"