యునైటెడ్ ఆరబ్  ఎమిరేట్స్  అధ్యక్షుడు మాననీయ షేక్  మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 13వ తేదీన అబూదభీలో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అధ్యక్షుడు మాననీయ షేక్  మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. 2024 ఫిబ్రవరి 14వ తేదీన వరల్డ్ గవర్నమెట్ సమిట్ 2024లో ప్రసంగించాలన్న ఆహ్వానాన్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.   

గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఏఇని సందర్శించడం ఇది ఏడో సారి అన్న విషయం ఉభయ నాయకులు గుర్తు చేశారు. 2023 డిసెంబరు ఒకటో తేదీన దుబాయ్ లో జరిగిన యుఎన్ఎఫ్ సిసిసి కాప్28 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీ యుఏఇ సందర్శించారు. ఆ సమావేశం సందర్భంగా కూడా అధ్యక్షుడు మాననీయ షేక్  మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ను ఆయన కలిశారు. ‘‘కార్యాచరణకు కాప్’’ పేరిట కాప్ 28ని మార్గదర్శకం చేసినందుకు, ‘‘యుఏఇ ఏకాభిప్రాయం’’ సాధించినందుకు ప్రధానమంత్రి ఆయనను అభినందించారు. ‘‘వాతావరణ ఆర్థిక సహాయం పరివర్తన’’ పేరిట జరిగిన కాప్ 28 అధ్యక్ష సమావేశంలో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. అలాగే శిఖరాగ్రం సందర్భంగా యుఏఇ అధ్యక్షునితో కలిసి ‘‘గ్రీన్  క్రెడిట్స్  ప్రోగ్రామ్’’పై ఒక కార్యక్రమాన్ని ఉమ్మడిగా నిర్వహించారు.

గత ఎనిమిది సంవత్సరాల కాలంలో అధ్యక్షుడు మాననీయ షేక్  మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ నాలుగు సార్లు భారతదేశాన్ని సందర్శించడాన్ని కూడా నాయకులు గుర్తు చేసుకున్నారు. ఇటీలవే 2024 జనవరి 9, 10 తేదీల్లో 10వ వైబ్రెంట్ గుజరాత్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఆయన భారత్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కలిసి పలు పెట్టుబడి ఒప్పందాల మార్పిడిని వీక్షించారు. 

2017 సంవత్సరంలో అధ్యక్షుడు మాననీయ షేక్  మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ భారత పర్యటన సందర్భంగా భారత-యుఏఇ ద్వైపాక్షిక బంధం స్థాయిని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్న తర్వాత పురోగతిపై ఉభయ నాయకులు చర్చించారు. విభిన్న రంగాల్లో ఏర్పడిన పురోగతి పట్ల వారు సంతృప్తి ప్రకటించడంతో పాటు గత కొద్ది సంవత్సరాల కాలంలో ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యం విశేషంగా విస్తరించిన విషయం గుర్తు చేసుకున్నారు. అధ్యక్షుడు మాననీయ షేక్  మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ దిగువన పొందుపరిచిన అంగీకారాల మార్పిడిని వీక్షించారు. 

I.    ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం
II.    భారత-మధ్యప్రాచ్య-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఇఇసి) అంతర్ ప్రభుత్వ వ్యవస్థ అంగీకారం 
III.    డిజిటల్ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో సహకారంపై ఎంఓయు 
IV.    విద్యుత్ ఇంటర్ కనెక్షన్, వాణిజ్యంపై ఎంఓయు 
V.    గుజరాత్  లోని లోధాల్  లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ లో సహకారంపై ఎంఓయు
VI.    యుఏఇకి చెందిన నేషనల్ లైబ్రరీ అండ్ ఆర్కైవ్స్, నేషనల్  ఆర్కైవ్స్ ఇండియా మద్య సహకార అవగాహన
VII.    ఇన్ స్టంట్  పేమెంట్  వేదికలు-యుపిఐ (ఇండియా), ఏఏఎన్ఐ (యుఏఇ) పరస్పర అనుసంధానత ఒప్పందం 
VIII.    దేశీయ డెబిట్/క్రెడిట్ కార్డులు-రుపే (ఇండియా), జైవాన్ (యుఏఇ) పరస్పర అనుసంధానత ఒప్పందం  

ఈ పర్యటనకు ముందే అబుదభీ పోర్ట్స్ కంపెనీతో రైట్స్, అబూదభీ పోర్ట్స్ కంపెనీతో గుజరాత్ మారిటైమ్ బోర్డ్  ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పోర్టు మౌలిక వసతుల నిర్మాణానికి, ఉభయ దేశాల మధ్య కనెక్టివిటీ మరింత పెంచడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయి. 

ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఇప్పటికే ఉన్న శక్తివంతమైన భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడానికి రెండు దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ఉభయ నాయకులు ధ్రువీకరించారు. 2022 మే 1వ తేదీన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) అమలులోకి వచ్చిన నాటి నుంచి భారత-యుఏఇ సంబంధాల్లో ఏర్పడిన బలమైన వృద్ధిని ఉభయులు ఆహ్వానించారు. ఫలితంగా 2022-23 భారత మూడో పెద్ద వాణిజ్య భాగస్వామిగాను, భారతదేశానికి రెండో పెద్ద ఎగుమతి గమ్యంగాను యుఏఇ మారింది.  2022-23లో ఉభయ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 85 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు విస్తరించగలమన్న ఆశాభావం ప్రకటించారు. యుఏఇ-ఇండియా సెపా కౌన్సిల్ (యుఐసిసి) లాంఛన ప్రాయంగా ప్రారంభం కావడాన్ని ఇద్దరు నాయకులు ఆమోదిస్తూ ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యంలో ఇది ఒక కీలక మైలురాయి అని ప్రకటించారు. 

విభిన్న రంగాల్లో పెట్టుబడుల ప్రోత్సాహానికి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కీలకంగా నిలుస్తుందని ఉభయ నాయకులు భావించారు. 2023లో భారతదేశంలోనాలుగో పెద్ద ఇన్వెస్టర్ గాను, ఏడో పెద్ద ఎఫ్ డిఐ దేశంగాను నిలిచింది. ఉభయ దేశాల మధ్య ప్రత్యేకమైన, లోతైన ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యంలో భాగంగా యుఏఇతో భారత్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

ప్రపంచ ఆర్థిక సుసంపన్నతను పెంచడానికి, ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకోగల వ్యవస్థ రూపొందించడానికి చక్కగా పని చేయగల, సమానతకు ప్రాధాన్యత ఇచ్చే బహుముఖీన వాణిజ్య వ్యవస్థ అవసరం అన్న విషయం ఉభయులు నొక్కి చెప్పారు.  అబూదభీలో 2024 ఫిబ్రవరి 26 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న డబ్ల్యుటిఓ మంత్రుల స్థాయి సదస్సు ఈ దిశగా కీలకమైన అడుగు వేస్తుందని; డబ్ల్యుటిఓ సభ్యదేశాల ప్రయోజనాలు కాపాడేందుకు అర్ధవంతమైన ఫలితం సాధిస్తుందని తద్వారా నిబంధనల ఆధారిత వ్యవస్థను పటిష్ఠం చేస్తుందన్న ఆశాభావం నాయకులు ప్రకటించారు. 

జెబెల్ అలీలో భారత్ మార్ట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని నాయకులు ఆహ్వానించారు.  వ్యూహాత్మక ప్రదేశంగా జెబెల్ అలీ పోర్టు సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు,  ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా విస్తరించడానికి వేదిక కాగలదన్న   ఆశాభావం వారు ప్రకటించారు. భారత్  మార్ట్  మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుందని, అంతర్జాతీయ కొనుగోలుదార్లకు సమర్థవంతమైన వేదిక అవుతుందని; మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యురేసియా ప్రాంతాల్లో వారి ఉత్పత్తులు ప్రమోట్ చేయడానికి కేంద్రంగా ఉంటుందని వారు ఆకాంక్షించారు. 

ఆర్థిక రంగంలో కూడా సహకారం మరింతగా పెరుగుతుండడాన్ని ఉభయ నాయకులు ప్రశంసించారు. నేషనల్ పేమెంట్స్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (ఎన్ పిసిఐ) చెందిన డిజిటల్  రుపే ప్రయోజనాలను సంపూర్ణంగా వినియోగించుకునేలా యుఏఇ సెంట్రల్ బ్యాంక్ తో కలిసి యుఏఇకి చెందిన దేశీయ కార్డు జేవాన్ ను ప్రవేశపెడుతున్నందుకు మాననీయ షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్  ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రన మోదీ అభినందించారు.  అలాగే నేషనల్ పేమెంట్స్ వేదికలు యుపిఐ (ఇండియా), ఆని (యుఏఇ) అనుసంధానతను వారు ఆహ్వానించారు. దీని వల్ల ఉభయ దేశాల మధ్య అంతరాయాలు లేకుండా సీమాంతర లావాదేవీలకు వీలు కలుగుతుంది.  

చమురు, గ్యాస్, పునరుత్పాదక వనరులు సహా ఇంధన రంగంలో ద్వైపాక్షిక భాగస్వామ్యం విస్తరించుకునే మార్గాల గురించి కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. అద్నాక్ గ్యాస్ కు  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మధ్య 1.2 ఎంఎంటిపిఏ, గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో (గెయిల్) 0.5 ఎంఎంటిపిఏ రెండు దీర్ఘకాలిక ఎల్ఎన్ జి సరఫరా ఒప్పందాలపై సంతకాలు జరగడాన్ని వారు అంగీకరించారు. ఇంధన భాగస్వామ్యంలో కొత్త శకం ఆరంభానికి ఇది సంకేతమని వారు అంగీకరించారు. ఇలాంటి మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఉభయ నాయకులు ప్రోత్సహించారు. అలాగే రెండు దేశాలు హైడ్రోజెన్, సోలార్ ఎనర్జీ, గ్రిడ్  కనెక్టివిటీ భాగస్వామ్యాన్ని విస్తరించుకునేందుకు అంగీకరించాయి. 

విద్యుత్ ఇంటర్ కనెక్షన్, ట్రేడ్ రంగంలో సహకారానికి సంతకాలు చేసిన అవగాహనా పత్రాన్ని కూడా ఉభయులు ధ్రువీకరించారు. ఇది కూడా ఉభయ దేశాల మధ్య ఇంధన రంగంలో సహకారం విస్తరణకు కొత్త శకాన్ని ఆవిష్కరిస్తుంది. సిఓపి 26లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక సూర్యుడు ఒక ప్రపంచం ఒక గ్రిడ్ (ఓసోవాగ్) చొరవ కింద హరిత గ్రిడ్  కు ఈ ప్రాజెక్టులు జీవం ఇస్తాయని భావిస్తున్నారు.  ఉభయ దేశాల మధ్య ఇంధన సహకారాన్ని ఈ ఎంఓయు మరింతగా ఉత్తేజితం చేస్తుందన్న విశ్వాసం వారు ప్రకటించారు. 

అబూదభీలో బిఏపిఎస్ దేవాలయం నిర్మాణానికి వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వడంతో పాటు ఉదారంగా భూమి కూడా కేటాయించినందుకు మాననీయ అధ్యక్షుడు షేక్  మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.  ఈ బిఏపిఎస్ దేవాలయం కూడా భారత-యుఏఇ స్నేహబంధాన్ని, లోతుగా పాతుకున్న సాంస్కృతిక బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చుతుందన్న విశ్వాసం ఉభయ వర్గాలు ప్రకటించాయి. అలాగే సామరస్యం, ఓర్పు, శాంతియుత సహజీవన సిద్ధాంతానికి యుఏఇ ప్రకటించిన అంతర్జాతీయ కట్టుబాటుకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు.  

రెండు దేశాలకు చెందిన జాతీయ ఆర్కైవ్స్ మధ్య సహకార ఒప్పందం గురించి, గుజరాత్ లోని లోథాల్ కు చెందిన నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ తో సహకార భాగస్వామ్యం గురించి వారు ప్రస్తావిస్తూ ఉభయ దేశాల మధ్య శతాబ్దాల కాలం నాటి బంధాన్ని పునరుద్ధరించడానికి, భాగస్వామ్య చరిత్ర సంపద సంరక్షణకు ఇది సహాయకారి అవుతుందని వారు అంగీకరించారు. 

మధ్య ప్రాచ్యంలోని తొలి ఐఐటి  అయిన అబూదభీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఎనర్జీ ట్రాన్సిషన్, సస్టెయినబులిటీపై మాస్టర్స్ ప్రోగ్రామ్ ప్రారంభించడాన్ని ఉభయ నాయకులు ప్రశంసించారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీలు, కృత్రిమ మేధ, స్థిర ఇంధనాల రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ విద్య, పరిశోధన రంగంలో సహకారానికి ఉమ్మడి కట్టుబాటును వారు పునరుద్ఘాటించారు. 

యుఏఇ-ఇండియా సాంస్కృతిక మండలి ఫోరమ్  ఏర్పాటులోను, రెండు దేశాల నుంచి మండలిలో సభ్యత్వ పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించారు. ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత లోతుగా పాతుకునేలా చేయడంలో  సాంస్కృతిక, విజ్ఞాన భాగస్వామ్యాన్ని కూడా వారు ధ్రువీకరించారు. 

ప్రాంతీయ అనుసంధానత మరింతగా విస్తరించడంలో యుఏఇ, ఇండియా తీసుకున్న చొరవను ప్రతిబింబించేలా, దాన్ని మరింత ముందుకు నడిపించేలా చేసేందుకు; తద్వారా  భారత-మధ్యప్రాచ్య-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంఇఇసి విషయంలో సహకారానికి  భారత, యుఏఇ మధ్య అంతర్  ప్రభుత్వ సహకార యంత్రాంగం ఏర్పాటును నాయకులు ఆహ్వానించారు. ఐఎంఇఇసి కింద డిజిటల్ వ్యవస్థ సహా లాజిస్టిక్స్ ప్లాట్ ఫారం అభివృద్ధి, విస్తరణకు; సాధారణ కార్గో, బల్క్ కంటైనర్లు, లిక్విడ్ బల్క్ కంటైనర్లకు ఇది సహాయకారి అవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన జి-20 నాయకుల శిఖరాగ్రం సదర్భంగా ప్రారంభించిన ఐఎంఇఇసి చొరవ కింద ఇది తొలి అంగీకారం అవుతుంది. 
డిజిటల్  మౌలిక వసతుల రంగంలో పెట్టుబడి సహకారాన్ని ఉమ్మడిగా అన్వేషించి, మదింపు చేసేందుకు కుదిరిన ఎంఓయును ఇద్దరు నాయకులు ఆహ్వానించారు. యుఏఇకి చెందిన పెట్టుబడుల మంత్రిత్వ శాఖ, భారత్  కు చెందిన ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ఎంఓయుపై సంతకాలు చేశాయి. యుఏఇ, భారతదేశానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య బంధం నిర్మాణానికి, శక్తివంతమైన ఉమ్మడి సహకారానికి అనుకూలమైన వాతావరణం కల్పనకు ఇది సహాయపడుతుంది. ఇండియాలో సూపర్ కంప్యూటర్ క్లస్టర్, డేటా సెంటర్ ప్రాజెక్టుల ఏర్పాటు అవకాశాల అన్వేషణ, మదింపు దీని లక్ష్యం. 

తనకు, భారత ప్రతినిధి వర్గానికి చక్కని ఆతిథ్యం ఇచ్చినందుకు మాననీయ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్  కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vande Bharat AC chair car fares much lower than those in China, Japan, France: Railway Minister Ashwini Vaishnaw

Media Coverage

Vande Bharat AC chair car fares much lower than those in China, Japan, France: Railway Minister Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఫెబ్రవరి 2026
February 12, 2026

Sustainable, Strong, and Global: India's 2026 Surge Under PM Modi's Transformative Leadership