షెడ్యూల్డు భారతీయ విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ పరంగా చేయూతనివ్వడం లక్ష్యంగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీలు) రూ.10,000 కోట్లకు మించకుండా ఏకమొత్తంగా బడ్జెట్ సాయాన్ని అందించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ గ్రాంట్ల ద్వారా.. చమురు మార్కెటింగ్ సంస్థలకు వడ్డీ లేని ముందస్తు నిధుల రూపంలో ఈ బడ్జెట్ సహాయం లభిస్తుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇంధన ధరల్లో నెలకొన్న అసాధారణమైన అనిశ్చితి నేపథ్యంలో, ధరల అస్థిరత కొనసాగుతున్న వేళ.. విమానయాన సంస్థలకు స్థిరమైన ధరల్లో ఏటీఎఫ్‌ను సరఫరా చేసేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఈ సహాయాన్ని అందిస్తారు.

 

ఆమోదించిన ధరల స్థిరీకరణ నిధిలో కీలకమైన అంశాలు:

 

(i) చమురు మార్కెటింగ్ కంపెనీలకు వడ్డీ లేని ముందస్తు నిధులు

షెడ్యూల్డు భారతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ కోసం సాయమందించేలా.. చమురు మార్కెటింగ్ సంస్థలకు రూ. 10,000 కోట్ల వరకు వడ్డీ లేని ముందస్తు నిధుల రూపంలో ఏకమొత్తంగా బడ్జెట్ సాయాన్ని అందిస్తారు. ఆమోదిత విధానం మేరకు నిర్ణయించిన ప్రామాణిక ధర కన్నా ప్రస్తుత దిగుమతి ధర పెరిగిన సమయాల్లో.. అంతర్జాతీయంగా పెరిగిన ఏటీఎఫ్ ధరల వల్ల ఓఎంసీలకు వచ్చే నష్టాలను ఈ నిధి ద్వారా భర్తీ చేస్తారు.

 

(ii) తిరిగి రాబట్టుకోవడం, ధరల వ్యత్యాసాన్ని గుర్తించే విధానం

 

అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు తగ్గినప్పుడు ఆ వ్యత్యాసం మొత్తాన్ని చమురు మార్కెటింగ్ సంస్థల నుంచి తిరిగి తీసుకుని భారత సంచిత నిధిలో జమచేస్తారు. అందించిన మొత్తం ఆర్థికసాయం పూర్తిగా తిరిగి వచ్చి, సర్దుబాటు అయ్యేంత వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుంది.

(iii) దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాల పరిధి

దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించాలనుకుంటున్న అన్ని షెడ్యూల్డు భారతీయ విమానయాన సంస్థలకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

 

(iv) స్థిరమైన ఏటీఎఫ్ ధర కోసం ఏర్పాటు

దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు నిర్దిష్ట ధరలను నిర్ణయించడం ద్వారా.. ఇంధన వ్యయానికి సంబంధించి మరింత మెరుగ్గా ముందస్తు అంచనాలకు ఈ యంత్రాంగం అవకాశాన్నిస్తుంది. తద్వారా ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం నుంచి విమానయాన సంస్థలకు రక్షణ లభిస్తుంది.

 

(v) చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఏటీఎఫ్ సరఫరా చేసే ప్రత్యేక హక్కులు

భాగస్వామ్య భారతీయ విమానయాన సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం ద్వారా ఈ విధానం అమలవుతుంది. దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పెట్రోలియం - సహజ వాయు మంత్రిత్వ శాఖలు సంతకాలు చేస్తాయి. ఈ ఏకమొత్తం ఏర్పాటు ప్రకారం.. భాగస్వామ్య విమానయాన సంస్థలు మూడేళ్ల వరకు ఓఎంసీల నుంచి మాత్రమే ఏటీఎఫ్‌ను కొనుగోలు చేయాలి. అయితే ఇది వార్షిక సమీక్షకు లోబడి, లేదా ముందస్తుగా ఇచ్చిన నిధి పూర్తిగా రీకవరీ అయ్యేంత వరకు (ఏది ముందయితే అది) వర్తిస్తుంది.

 

(vi) పర్యవేక్షణ, ఆడిట్

 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పెట్రోలియం - సహజ వాయు మంత్రిత్వ శాఖ, వ్యయ విభాగాల ప్రతినిధులతో కూడిన పర్యవేక్షణ కమిటీ.. ఈ పథకం అమలు, క్లెయిముల ధ్రువీకరణ, సమన్వయం, సర్దుబాటు ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది. ఆడిటింగ్‌కు లోబడి అన్ని క్లెయిమ్‌లు, రీకవరీలు జరుగుతాయి.

 

(vii) ధర స్థిరీకరణ సహాయ వ్యవధి

ఏటీఎఫ్ ధర స్థిరీకరణ సాయం 36 నెలల కాలం అమల్లో ఉంటుంది. ఇందులో వార్షిక సమీక్ష జరుగుతుంది. లేదా ముందస్తు నిధులు పూర్తిగా రీకవరీ/ సర్దుబాటు అయ్యే వరకు అమల్లో ఉంటుంది. పై రెండు అంశాల్లో ఏది ముందుగా పూర్తయితే దానిని అమలుకు ప్రాతిపదికగా పరిగణిస్తారు. ఈ కాలపరిమితిలోగా నిధులు పూర్తిగా సర్దుబాటు చేయని పక్షంలో.. సంబంధిత ఆధీకృత సంస్థ ఆమోదంతో, 36 నెలలకు మించి కూడా ఈ ప్రతిపాదనను పొడిగించవచ్చు.

 

ఆశిస్తున్న ఫలితాలు:

 

ప్రతిపాదిత విధానం భారతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల విషయంలో స్థిరత్వాన్ని మెరుగుపరచడంతోపాటు ముందస్తు అంచనాలను అందిస్తుంది. దాంతో మెరుగైన కార్యాచరణ, ఆర్థిక ప్రణాళికకు వీలు కల్పిస్తుంది.

  • ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం వేళ.. అస్థిర, అధిక ఏటీఎఫ్ ధరల వల్ల కలిగే నష్టాల నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలను కాపాడుతుంది.

  • దేశీయ, అంతర్జాతీయ వైమానిక అనుసంధానాన్ని నిలబెట్టి, కొనసాగేలా చేయడం ద్వారా.. విమాన సేవలు అంతరాయం లేకుండా కొనసాగేలా ఈ చర్య ద్వారా సాధ్యపడుతుంది.

  • ఇది ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని ప్రయాణికులపై పడకుండా తగ్గిస్తుంది. తద్వారా చార్జీలు పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.

  • మారుమూల, ప్రాంతీయ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అంతరాయం లేకుండా విమాన ప్రయాణానికి దోహదపడడం ద్వారా.. సమతౌల్యంతో కూడిన ప్రాంతీయాభివృద్ధిని, సమ్మిళిత వృద్ధిని ఈ విధానం ప్రోత్సహిస్తుంది.

ముఖ్య ప్రయోజనాలు:

  • అంతరాయం లేకుండా విమాన సేవలు కొనసాగడం ద్వారా.. విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, క్షేత్రస్థాయి నిర్వహణ సంస్థలు, నిర్వహణ - రిపేర్ల వ్యవస్థ, ప్రయాణ సంస్థలు, ఆతిథ్య - వస్తు రవాణా రంగాల్లో ఉద్యోగాలకు ప్రమాదం ఉండదు.

  • అంతరాయం లేకుండా విమానయాన అనుసంధానం వల్ల ప్రయాణికుల రాకపోకలకు, అత్యధిక విలువ కలిగిన వస్తు రవాణాకు, వ్యాపారులూ, పర్యాటకుల ప్రయాణాలకు ఆటంకాలు ఉండవు. దాంతో అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుంది.

  • పర్యాటకం, ఆతిథ్యం, వాణిజ్యం, ఎగుమతులు, ప్రాంతీయాభివృద్ధి, పెట్టుబడులతోపాటు పరోక్షంగా మరిన్ని అంశాల్లోనూ ప్రభుత్వ చర్య సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

  • ఉడాన్ పథకం కింద ప్రారంభించిన విమానాశ్రయాలు సహా.. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన విమానాశ్రయ మౌలిక సదుపాయాలను గరిష్టంగా వినియోగించుకోవడానికి ఇది సహాయపడుతుంది.

  • దేశీయ, అంతర్జాతీయ అనుసంధానాన్ని కాపాడడం ద్వారా.. అంతర్జాతీయ మార్కెట్లతో భారత్ అనుసంధానాన్ని బలోపేతం చేసి, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.

నేపథ్యం:

  • పశ్చిమాసియా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏటీఎఫ్ ధరల్లో మునుపెన్నడూ లేనంత అస్థిరత వల్ల విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమైంది.

  • పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు అసాధారణంగా పెరిగాయి. 2026 మార్చిలో లీటరుకు రూ. 60.50గా ఉన్న ఏటీఎఫ్ ధర.. 2026 మే నాటికి లీటరుకు రూ. 142కు, అంటే దాదాపు 2.5 రెట్లు పెరిగింది. సాధారణంగా ఒక విమానయాన సంస్థ మొత్తం కార్యాచరణ వ్యయంలో ఏటీఎఫ్ వాటానే దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. అందువల్ల ఏటీఎఫ్ ధరల్లో నెలకొన్న ఈ తీవ్రమైన అనిశ్చితి.. విమానయాన సంస్థల ఆర్థిక స్థితిగతులపై విపరీతమైన వ్యయ ఒత్తిడిని పెంచింది.

  • విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో ఏటీఎఫ్ వాటా దాదాపు 40 శాతం. ఇంధన ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్న సమయాల్లో మొత్తం నిర్వహణ వ్యయంలో ఇది 60 శాతం వరకు కూడా ఉండొచ్చు.

  • దేశీయ కార్యకలాపాల కోసం ఏటీఎఫ్ ధరలపై గరిష్ట పరిమితిని విధించగా.. అంతర్జాతీయ కార్యకలాపాల కోసం మాత్రం దిగుమతి ధరల వద్దే భారతీయ విమానయాన సంస్థలు ఏటీఎఫ్‌ను కొనుగోలు చేస్తున్నాయి. విమానయాన సంస్థలకు ఇది భారంగా మారింది.

  • ఏటీఎఫ్ ధరలపై పరిమితి విధించడమన్నది తాత్కాలిక చర్య మాత్రమే. ఓఎంసీలకు దీర్ఘకాలంలో ఇది ఆచరణయోగ్యం కాదు. ఏటీఎఫ్ ధరలపై పరిమితులను విధించడం వల్ల.. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఏటీఎఫ్ ధరల్లో అస్థిరత, అసాధారణ పెరుగుదలతో చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

  • భారత విమానయాన సంస్థలకు పాకిస్థాన్ గగనతలాన్ని మూసేయడం వల్ల ఐరోపా, ఉత్తర అమెరికా, మధ్య ఆసియాకు విమాన ప్రయాణ మార్గాల దూరం పెరిగింది. దీంతో ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చులు పెరిగాయి.

  • సుదూర ప్రాంతాల ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గింది. పలు అంతర్జాతీయ మార్గాల్లో విమానయాన సంస్థలు తమ సేవలను తగ్గించుకున్నాయి లేదా నిలిపేశాయి.   

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How ODOP is helping Pratapgarh turn its amla into a bigger business

Media Coverage

How ODOP is helping Pratapgarh turn its amla into a bigger business
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 సెప్టెంబర్ 2026
September 01, 2026

#ModiHaiTohMumkinHai: Economy, Diplomacy and Atmanirbhar Milestones in One Social-Media Sweep