· గత దశాబ్దంలో వేగం పుంజుకున్న వారణాసి అభివృద్ధి: ప్రధాని
· మహిళా సాధికారత, ఆత్మ విశ్వాస పెంపు, సమాజ సంక్షేమానికి మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలేల జీవితాలు అంకితం: ప్రధానమంత్రి
· కాశీలోని వేలాది మంది జీవితాల్లో, నగర ముఖచిత్రంలో పరివర్తనకు మూలం బనాస్ డైరీ: శ్రీ మోదీ
· ఆరోగ్య రాజధానిగా కాశీ: ప్రధాని
· నగర మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలపై కాశీ సందర్శకుల ప్రశంసల జల్లు: ప్రధానమంత్రి
· వారసత్వం, అభివృద్ధి అనే రెండు చక్రాలకు సమాన ప్రాధాన్యంతో ప్రగతిపథంపై పరుగులు పెడుతున్న భారత రథం - ఈ దృక్పథానికి కాశీ అత్యద్భుత నమూనా: శ్రీ మోదీ
· అవకాశాలు సహా సామర్థ్యానికి, విజయాలకు ఉత్తరప్రదేశ్ ప్రతీక: ప్రధాని

నమ: పార్వతీపతయే, హర హర మహాదేవ్!

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌధురి, ఆశీస్సులు అందించడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ కుటుంబ సభ్యులందరికీ..

నా కాశీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో మీ అందరి ఆశీస్సులను సవినయంగా కోరుతున్నాను. మీ అవ్యాజమైన ప్రేమకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. కాశీ నాది, నేను కాశీకి చెందినవాడిని.

 

స్నేహితులారా,

రేపు పవిత్రమైన హనుమాన్ జన్మోత్సవం. సంకట మోచన మహారాజ్‌కు ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర కాశీ నగరంలో మీ అందరినీ ఈ రోజు ఇలా కలుసుకొనే అవకాశం లభించింది. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా అభివృద్ధి స్ఫూర్తిని చాటి చెప్పేందుకు కాశీ ప్రజలు ఇక్కడ హాజరయ్యారు.

స్నేహితులారా,

గత పదేళ్లలో, బెనారస్ గణనీయమైన వేగంతో అభివృద్ధి చెందింది. ఘనమైన వారసత్వాన్ని సంరక్షిస్తూనే ఆధునికతను స్వీకరించిన కాశీ ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులువేస్తోంది. ప్రాచీనతకు చిహ్నంగా నిలుస్తూనే పురోగతికి మార్గదర్శిగా మారుతోంది. పూర్వాంచల్ ఆర్థిక చిత్రపటంలో ముఖ్యమైన స్థానానికి చేరుకుంది. భగవాన్ మహాదేవుని నాయకత్వంలో నడిచిన ఇదే కాశీ ఇప్పుడు పూర్వాంచల్ ప్రాంత అభివృద్ధి రథాన్ని నడుపుతోంది.

స్నేహితులారా,

కొద్ది సేపటి క్రితమే, కాశీ, పూర్వాంచల్ ప్రాంతాలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి శంకుస్థాపన చేశాం. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రతి గ్రామంలో ఇంటింటికీ నల్లా నీరు అందించడం, విద్య, ఆరోగ్య, క్రీడా సౌకర్యాలను విస్తరించడం, ప్రతి ప్రాంతానికి, కుటుంబానికి, యువతకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యం. పూర్వాంచల్‌ను అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయి. కాశీలో ఉన్న ప్రతి వ్యక్తి వీటి వల్ల ప్రయోజనాన్నిపొందుతారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమైన నేపథ్యంలో బెనారస్, పూర్వాంచల్ ప్రజలకు శుభాకాంక్షలు.

స్నేహితులారా,

ఈ రోజు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతీబా ఫూలే జయంతి. మహాత్మా జ్యోతీబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే మహిళా సంక్షేమానికి, వారి సాధికారతకు, సామాజిక అభ్యున్నతికి తమ జీవితాలను అంకితం చేశారు. ఇప్పుడు వారి వారసత్వాన్ని మనం కొనసాగిస్తున్నాం. వారి లక్ష్యాన్ని, ఆదర్శాన్ని, మహిళా సాధికారత కోసం చేపట్టిన ఉద్యమాన్ని నూతన ప్రయోజనాల కోసం సరికొత్త ఉత్తేజంతో కొనసాగిస్తున్నాం.

 

స్నేహితులారా,

ఈ రోజు మీకు నేను మరో విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మహాత్మా ఫూలే లాంటి గొప్ప వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మార్గదర్శక సూత్రంతో దేశ సేవలో పాలుపంచుకుందాం. ఈ సమ్మిళిత స్ఫూర్తితో దేశం కోసం పనిచేద్దాం. దీనికి విరుద్ధంగా అధికారం కోసమే రాజకీయ క్రీడల్లో మునిగి తేలేవారు పరివార్‌ కా సాత్, పరివార్‌ కా వికాస్ మంత్రాన్ని పాటిస్తారు. ఈ రోజు, పూర్వాంచల్‌లో పశువులను పోషించే కుటుంబాలకు, ముఖ్యంగా సబ్‌కా సాత్, సబ్ కా వికాస్ సారాంశాన్ని స్వీకరించి కష్టపడి పనిచేస్తున్న సోదరీమణులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మహిళలు వారిపై నమ్మకాన్ని ఉంచితే ఏదైనా సాధించగలమని నిరూపించారు. ఈ నమ్మకమే చరిత్రను సృష్టిస్తుంది. ఇప్పుడు వారు మొత్తం పూర్వాంచల్‌కే ఆదర్శంగా నిలిచారు. కొంతసేపటి క్రితమే ఉత్తరప్రదేశ్‌లోని బనాస్ డెయిరీకి అనుబంధంగా పనిచేస్తున్న పాడిరైతులకు బోనస్ అందించాం. ఇది కేవలం బహుమతి కాదు. మీ అంకిత భావానికి దక్కిన ప్రతిఫలం. రూ.100 కోట్ల విలువైన ఈ బోనస్ మీ కృషికి, నిబద్ధతకు లభించిన గుర్తింపు.

స్నేహితులారా,

బనాస్ డెయిరీ కాశీలోని వేల కుటుంబాల పరిస్థితులను, భవిష్యత్తును మార్చింది. ఈ డెయిరీ మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్నిచ్చి మీ కలలకు రెక్కల్ని తొడిగింది. ఇక్కడ మనం గర్వపడాల్సిన అంశం ఏమిటంటే ఈ ప్రయత్నాల ద్వారా పూర్వాంచల్‌లో ఎంతో మంది మహిళలు లక్పతి దీదీలుగా మారారు. ఒకప్పుడు మనుగడ గురించి ఆందోళన చెందే పరిస్థితుల నుంచి సంక్షేమం దిశగా స్థిరమైన ప్రయాణం కొనసాగుతోంది. ఈ ప్రగతి బెనారస్‌లో, ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. గడచిన పదేళ్లలో దేశంలో పాల ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువగా 65 శాతం మేర పెరిగింది. ఈ ఘనత పశు సంవర్థక రంగంలో నిమగ్నమై ఉన్న మీలాంటి కోట్లాది రైతులకే చెందుతుంది. ఇది ఒక్కరోజులో సాధించిన విజయం కాదు. గత పదేళ్లుగా మన పాడి పరిశ్రమను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళుతున్నాం.

పాడి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల సౌకర్యాన్ని తీసుకొచ్చి, వారికిచ్చే రుణాల పరిమితిని పెంచి, రాయితీలను అందిస్తున్నాం. అలాంటి ప్రధాన ప్రయత్నాల్లో భాగంగా జంతువుల పట్ల కరుణ చూపించి గాలికుంటు వ్యాధి సోకకుండా ఉచితంగా టీకాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందించిన విషయం అందరికీ గుర్తుండిపోయింది. అదేవిధంగా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆశయంతో జంతువులకు కూడా ఉచితంగా టీకాలను అందించే ప్రభుత్వం ఇది.

దేశ వ్యాప్తంగా పాల సేకరణను వ్యవస్థీకృతం చేసే లక్ష్యంతో 20,000కు పైగా సహకార సంఘాలను పునరుద్ధరించాం. ఈ సంఘాల్లో లక్షల సంఖ్యలో కొత్త సభ్యులు చేరారు. పాడి పరిశ్రమలో ఉన్నవారందరినీ  ఏకం చేసి అభివృద్ధి వైపు నడిపించడమే దీని లక్ష్యం. దేశీయ ఆవుజాతుల పెంపకాన్ని, శాస్త్రీయమైన గర్భధారణ పద్ధతులను ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రయత్నాలను మద్ధతు అందించేలా రాష్ట్రీయ గోకుల్ మిషన్ కొనసాగుతోంది.

పశుపోషణలో నిమగ్నమైన మన సోదరసోదరీమణులను అభివృద్ధి దిశగా కొత్త మార్గంలో నడిపించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఆశాజనకమైన మార్కెట్‌, ఇతర అవకాశాలతో వారిని అనుసంధానిస్తున్నాం. ఈ లక్ష్యాన్ని బనాస్ డెయిరీకి చెందిన కాశీ కాంప్లెక్స్ పూర్వాంచల్ ప్రాంతంలో ముందుకు తీసుకెళుతోంది. ఈ ప్రాంతంలో గిర్ ఆవులను బనాస్ డెయిరీ పంపిణీ చేసింది. వాటి సంఖ్య స్థిరంగా పెరుగుతోందని నాకు తెలిసింది. అలాగే, బెనారస్‌లో పశువులకు దాణా అందించే వ్యవస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ  డెయిరీ పూర్వాంచల్ ప్రాంతంలో దాదాపుగా లక్ష మంది రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. తద్వారా పాడి రైతుల సమాజానికి సాధికారత కల్పిస్తోంది

 

స్నేహితులారా,

కొంత సేపటి క్రితమే ఇక్కడ ఉన్న చాలామంది వృద్ధులైన స్నేహితులకు ఆయుష్మాన్ వయో వందన కార్డులను పంపిణీ చేసే అవకాశం నాకు దక్కింది. వారి ముఖాల్లో నాకు కనిపించిన సంతృప్తి, ఈ పథకం సాధించిన విజయాన్ని సూచిస్తోంది. వైద్య సేవల అంశంలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనందరికీ తెలిసిందే. ఆరోగ్య సేవల్లో దశాబ్దం క్రితం వరకు పూర్వాంచల్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. నా కాశీ ఇప్పుడు ఆరోగ్య రాజధానిగా మారింది. ఒకప్పుడు ఢిల్లీ, ముంబయికే పరిమితమైన ప్రధాన ఆసుపత్రులు ఇప్పుడు మీ ఇంటికి సమీపంలోనే ఉన్నాయి. ప్రజలకు అవసరమైన సేవలు, సౌకర్యాలు వారికి చేరువలో ఉండటమే నిజమైన అభివృద్ధి.

స్నేహితులారా,

గడచిన పదేళ్లలో మేం ఆసుపత్రుల సంఖ్యను మాత్రమే కాకుండా.. రోగుల గౌరవాన్ని కూడా పెంచాం. నా పేద సోదరసోదరీమణులకు ఆయుష్మాన్ భారత్ యోజన ఓ వరం లాంటిది. ఈ పథకం ఆరోగ్యసేవలను అందించడంతో పాటు వారిలో స్థైర్యాన్ని నింపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్షల మంది, వారణాసిలో వేల మంది ఈ పథకం నుంచి ప్రయోజనం పొందుతున్నారు. దీని ద్వారా అందించే వైద్య సహాయం, శస్త్రచికిత్స, తక్షణం లభించే ఉపశమనం వ్యక్తి జీవితంలో నూతన ప్రారంభాన్ని సూచిస్తాయి. ఆయుష్మాన్ యోజన  ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని లక్షలాది కుటుంబాలకు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఎందుకంటే మీ ఆరోగ్యం ఇప్పుడు మా బాధ్యత అని ప్రభుత్వం ప్రకటించింది.

ఇంకా మిత్రులారా,
మీరు మూడోసారి మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మేము కూడా మీ అభిమానానికి వినయపూర్వక సేవకులుగా మా కర్తవ్యాన్ని గుర్తించాం. మీకు ఏమన్నా తిరిగి ఇవ్వాలన్న మనసుతో మావంతుగా అన్ని ప్రయత్నాలు చేశాం. సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సహాయం అందిస్తామని  హామీ ఇచ్చాం. ఆ నిబద్ధత ఫలితమే ఆయుష్మాన్ వయ వందన యోజన. కేవలం వృద్ధులకు వైద్య చికిత్స మాత్రమే కాదు -  వారికి తగిన గౌరవం కల్పించడమే ఈ పథకం అసలు ఉద్దేశం. ఇప్పుడు ప్రతి ఇంట్లో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత వైద్యం లభిస్తుంది. ఒక్క వారణాసిలోనే అత్యధికంగా 50 వేల వయ వందన కార్డులను వృద్ధులకు జారీ చేశారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు -  ఇది ఒక ప్రజా సేవకుడు నిజాయితీగా చేసిన సేవకు ఫలితం. ఇప్పుడు వైద్యం కోసం భూమిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు! ఇకపై వైద్యం కోసం అప్పులు చేయనవసరం కూడా లేదు! చికిత్స కోసం నిస్సహాయతతో గడప గడపకూ తిరగాల్సిన పరిస్థితీ ఇక లేదు. వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందకండి-ఆయుష్మాన్ కార్డు ద్వారా, ఇప్పుడు మీ చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది!

మిత్రులారా,

ఈ రోజు కాశీ మీదుగా వెళ్ళే ప్రతి ఒక్కరూ అక్కడి మౌలిక సదుపాయాలు,  సౌకర్యాల గురించి గొప్పగా మాట్లాడతారు. ప్రతిరోజూ లక్షలాది మంది కాశీని సందర్శిస్తుంటారు. బాబా విశ్వనాథుని ఆశీస్సులు పొందడానికి, గంగా మాత పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి వస్తారు. ప్రతి సందర్శకుడూ ఒకే మాట చెబుతున్నారు -  కాశీ ఎంతగా మారిపోయింది!

 

ఒక్కసారి ఊహించండి- కాశీలో రోడ్లు, రైల్వే, విమానాశ్రయాల పరిస్థితి పదేళ్ల క్రితం ఎలా ఉండేదో . కానీ ఈ రోజు నగరం పరిస్థితి ఎలా ఉంది? గతంలో చిన్న చిన్న పండుగల సమయంలో కూడా  ట్రాఫిక్ స్తంభించేది. ఉదాహరణకు - చునార్ నుంచి శివ్ పూర్ కు ప్రయాణిస్తున్న వారిని తీసుకోండి - వారు కాశీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది.  అంతులేని ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకుని, దుమ్ము, వేడిలో ఊపిరాడకుండా ఉండాల్సి వచ్చేది. నేడు ఫుల్వారియా ఫ్లైఓవర్ నిర్మించారు. దీంతో ఇప్పుడు దారి దగ్గరైపోయింది. సమయం ఆదా అవుతోంది. జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. అదేవిధంగా, జౌన్పూర్,  ఘాజీపూర్ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు ఒకప్పుడు వారణాసి మీదుగా ప్రయాణించాల్సి వచ్చేది. బలియా, మౌ, ఘాజీపూర్ జిల్లాలకు చెందిన ప్రజలు విమానాశ్రయానికి చేరుకోవడానికి నగరం మధ్యలో గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకు పోయేవారు. కానీ, ఇప్పుడు రింగ్ రోడ్డు పుణ్యమా అని ప్రజలు కేవలం నిమిషాల్లోనే ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణించవచ్చు.

మిత్రులారా,

గతంలో ఘాజీపూర్ కు వెళ్లాలంటే కొన్ని గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఘాజీపూర్, జౌన్పూర్, మీర్జాపూర్, అజంగఢ్ వంటి నగరాలను కలిపే రహదారులను గణనీయంగా విస్తరించారు. ఒకప్పుడు ట్రాఫిక్ జామ్ లు ఉన్న చోట నేడు అభివృద్ధి వేగాన్ని చూస్తున్నాం! గత దశాబ్దకాలంలో వారణాసి, పరిసర ప్రాంతాల అనుసంధానానికి సుమారు రూ.45,000 కోట్లు వెచ్చించారు. ఈ డబ్బు  కేవలం కాంక్రీట్ పై పెట్టిన ఖర్చు కాదు - అది నమ్మకంపై చేసిన వ్యయం. నేడు కాశీ, దాని చుట్టుపక్కల జిల్లాలన్నీ ఈ ఖర్చు తాలూకు ప్రయోజనాలను పొందుతున్నాయి.

మిత్రులారా,

కాశీలో మౌలిక సదుపాయాలపై ఈ ఖర్చు నేటికీ కొనసాగుతోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. మన లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విమానాశ్రయం విస్తరించేకొద్దీ,  దానిని అనుసంధానించే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇప్పుడు విమానాశ్రయానికి సమీపంలో ఆరు వరుసల భూగర్భ సొరంగం నిర్మించబోతున్నారు. నేడు భదోహి, ఘాజీపూర్, జౌన్పూర్లకు సంబంధించిన రోడ్డు ప్రాజెక్టుల పనులు కూడా ప్రారంభమయ్యాయి. భిఖారీపూర్, మండువాదిహ్ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ డిమాండ్ ఇప్పుడు నెరవేరుతున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నా. కాశీ నగరాన్ని సారనాథ్ తో కలిపేందుకు కొత్త వంతెనను నిర్మించనున్నారు. ఇది విమానాశ్రయం లేదా ఇతర జిల్లాల నుంచి సారనాథ్ చేరుకోవడానికి నగరం మీదుగా రద్దీలో వెళ్ళాల్సిన పరిస్థితిని తప్పిస్తుంది.
 

మిత్రులారా,

రాబోయే నెలల్లో, ఈ ప్రాజెక్టులు పూర్తయితే, కాశీలో ప్రయాణం ఎంతో సులభం అవుతుంది. ప్రయాణ సమయాలు తగ్గుతాయి, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయి. అంతేకాక, జీవనోపాధి లేదా వైద్య చికిత్స కోసం కాశీకి వచ్చేవారికి చాలా ఎక్కువ సౌలభ్యం ఉంటుంది. కాశీలో సిటీ రోప్ వే ట్రయల్ కూడా ప్రారంభమైంది. ఇలాంటి సదుపాయాన్ని అందించే ప్రపంచంలోని ఎంపిక చేసిన కొన్ని నగరాల సరసన ఇప్పుడు కాశీ కూడా చేరనుంది.

మిత్రులారా,

వారణాసిలో చేపట్టే ఏ అభివృద్ధి లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అయినా పూర్వాంచల్ మొత్తం యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాశీలోని యువతకు క్రీడల్లో రాణించడానికి స్థిరమైన అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. 2036లో భారత్ లో ఒలింపిక్స్ ను నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.  ఒలింపిక్స్ పతకాలు ఇంటికి తీసుకురావాలంటే కాశీ యువత ఇప్పటి నుంచే ఆ దిశగా సన్నాహాలు మొదలుపెట్టాలి. అందుకే నేడు కాశీలో కొత్త స్టేడియాలు నిర్మించి, మన యువ ప్రతిభావంతుల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అందులో ప్రస్తుతం వారణాసికి చెందిన వందలాదిమంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. సంసద్ క్రీడా పోటీల్లో పాల్గొన్న వారు కూడా ఇదే మైదానంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందారు.
 

మిత్రులారా,

ఈరోజు భారత్ - అభివృద్ధి, వారసత్వం - ఈ రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ సమతుల్యానికి కాశీ అత్యుత్తమ ఉదాహరణగా  నిలుస్తోంది. ఇక్కడ పవిత్ర గంగా నది ప్రవహిస్తోంది. ఆ గంగానదితో పాటు భారతీయ చైతన్యం కూడా ప్రవహిస్తోంది. భారత్ ఆత్మ దాని వైవిధ్యంలోఉంది. కాశీ ఆ ఆత్మను అత్యంత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. కాశీలోని ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేకమైన సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రతి వీధి భారత దేశ వైవిధ్య వర్ణాన్ని ఆవిష్కరిస్తుంది. కాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాలు ఈ ఐక్యతా బంధాలను మరింత బలోపేతం చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక  ఐక్యతా మాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఐక్యతా మాల్ భారత వైవిధ్యాన్ని ప్రతిఫలింపజేస్తుంది.  దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల ఉత్పత్తులు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి.

మిత్రులారా,

ఇటీవలి సంవత్సరాలలో, ఉత్తర ప్రదేశ్ తన ఆర్థిక ముఖచిత్రాన్ని, దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుంది. యూపీ ఇప్పుడు కేవలం సామర్ధ్యం ఉన్న భూమి మాత్రమే కాదు.  ఇది ఇప్పుడు సంకల్పానికి, శక్తికి, సాధనకు నిలయంగా మారుతోంది. ఈరోజు మేడ్ ఇన్ ఇండియా అనే పదం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. భారతదేశంలో తయారైన వస్తువులు ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్‌లుగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక స్థానిక ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ కూడా లభించింది. జీఐ ట్యాగ్ అనేది కేవలం లేబుల్ మాత్రమే కాదు. ఇది ఒక ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు, ధ్రువీకరణ   పత్రం. ఏదైనా ఉత్పత్తి ఒక నిర్దిష్ట ప్రదేశంతో ఏకీకృతమై ఉందని ఇది సూచిస్తుంది.  జీఐ ట్యాగ్ తో ఎక్కడికి వెళ్లినా ప్రపంచ మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయి.
 

మిత్రులారా,

నేడు జీఐ ట్యాగింగ్ లో ఉత్తరప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉంది.  ఇది మన కళకు, మన ఉత్పత్తులకు, మన కళానైపుణ్యానికి పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిబింబిస్తుంది. వారణాసి, దాని చుట్టుపక్కల జిల్లాలకు చెందిన 30కి పైగా ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించింది. వారణాసిలోని తబలా, షెహనాయ్ నుంచి వాల్ పెయింటింగ్స్, తండాయ్, రెడ్ స్టఫ్డ్ మిరపకాయలు (లాల్ భార్వా మిర్చ్), రెడ్ పేడా, త్రివర్ణ పతాకం బర్ఫీ వరకు ప్రతిదానికీ ఇప్పుడు జీఐ ట్యాగ్ ద్వారా కొత్త గుర్తింపు పత్రం లభించింది. ఈరోజే, రాష్ట్రం నలుమూలల నుంచి -  జౌన్పూర్ ఇమార్తి, మథుర సంఝీ కళ, బుందేల్ ఖండ్ లోని కతియా గోధుమలు, పిలిభిత్ వేణువులు, ప్రయాగ్ రాజ్ ముంజ్ క్రాఫ్ట్, బరేలీలోని జర్దోజీ, చిత్రకూట్ వుడ్ క్రాఫ్ట్, లఖింపూర్ ఖేరికి చెందిన తరు జర్దోజీ  - వంటి అనేక ఉత్పత్తులకు జీఐ ట్యాగ్లు లభించాయి. యూపీ నేల పరిమళం ఇకపై గాలిలో మాత్రమే ఉండదని ఇది సూచిస్తుంది- అది ఇప్పుడు సరిహద్దులను దాటుతోంది.

మిత్రులారా,

కాశీని కాపాడేవాడు భారత్ ఆత్మనూ కాపాడతాడు. కాశీకి సాధికారత కల్పిస్తూనే ఉండాలి. కాశీని అందంగా, చైతన్యవంతంగా, కలల మాదిరి ఉంచాలి. కాశీ పురాతన ప్రాభవాన్ని ఆధునిక రూపంతో కలిపే ప్రయత్నం నిరంతరం సాగాలి. ఈ సంకల్పంతో, మీరు చేతులెత్తి నాతో కలిసి మళ్లీ ఒక్కసారి చెప్పండి

నమః పార్వతీ పతయే, హర హర మహదేవ్.
మీ అందరికీ ధన్యవాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Bharat Innovates' Bridge Between India’s Talented Youth And European Expertise: PM Modi

Media Coverage

'Bharat Innovates' Bridge Between India’s Talented Youth And European Expertise: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the role of diversity in innovation and entrepreneurship
June 15, 2026

The Prime Minister, Shri Narendra Modi said that in the fields of innovation and entrepreneurship, every individual has a distinct way of thinking and a unique creative vision, and it is this diversity that gives rise to new possibilities. He noted that just as every source of water has a different taste, every talent possesses its own unique identity and contribution. The Prime Minister added that innovation and progress become possible through the convergence of diverse ideas and capabilities.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः।

जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥”

The Subhashitam conveys that in the field of innovation and enterprise, each person has a different way of thinking and a unique creative vision, and this diversity gives rise to new possibilities. Just as the taste of water differs from one source to another, every talent has its own distinct identity and contribution. It is through the combination of these different ideas and abilities that innovation and progress become possible.

The Prime Minister wrote on X;

“पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः।

जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥”