




ॐ माता वैष्णो देवी दे चरने च मत्था टेकना जय माता दी,
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారూ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారూ జితేంద్ర సింగ్ గారూ వి. సోమన్న గారూ, ఉప ముఖ్యమంత్రి సురేంద్ర కుమార్ గారూ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునిల్ గారూ, నా పార్లమెంటు సహచరుడు జుగల్ కిషోర్ గారూ, ఇతర ప్రజా ప్రతినిధులూ, ప్రియమైన సోదరీసోదరులరా... వీరుడైన జోరావర్ సింగ్ నడయాడిన గడ్డ ఇది. ఈ నేలకు ప్రణమిల్లుతున్నాను.
మిత్రులారా,
భారత ఐక్యత, సంకల్ప శక్తిని చాటే భారీ వేడుక నేటి కార్యక్రమం. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ లోయ నేడు భారత రైల్వే వ్యవస్థతో అనుసంధానమైంది. ‘కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు’ అంటూ ఎప్పటినుంచో మనం భరతమాత గురించి చెప్తూ వస్తున్నాం. రైల్వే వ్యవస్థలోనూ అదిప్పుడు సాకారమైంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా- ఈ రైల్వే లైన్ ప్రాజెక్టులు కేవలం పేర్లు మాత్రమే కావు. జమ్మూ కాశ్మీర్ నవోత్తేజాన్ని చాటే అస్తిత్వాలివి. నవీన భారత శక్తి ప్రకటనలివి. కొద్దిసేపటి కిందటే చీనాబ్ వంతెన, అంజి వంతెనలను ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది. ఈరోజే జమ్మూ కాశ్మీర్కు రెండు కొత్త వందే భారత్ రైళ్లు వచ్చాయి. జమ్మూలో కొత్త వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశాం. రూ. 46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో నూతనోత్తేజాన్ని నింపుతాయి. ఓ కొత్త అభివృద్ధి శకంలోకి అడుగిడుతున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ హాజీ నేలకు ప్రణమిల్లుతున్నాను.
మిత్రులారా,
రైలు ప్రయాణం గురించి కలలు కంటూనే జమ్మూ కాశ్మీర్లో అనేక తరాలు గడిచిపోయాయి. నిన్న నేను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు చేసిన ఓ ప్రకటన చూశాను. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఆయన 7-8 తరగతి చదువుతున్నప్పటి నుంచి ఎదురుచూస్తున్నారట. లక్షలాది జమ్మూ కాశ్మీర్ ప్రజల కల నేడు నిజమైంది. మేము చేయాల్సిన మంచి పనులు ఇంకెన్నో ఉన్నాయన్నది కూడా నిజం.
మిత్రులారా,
మా ప్రభుత్వ అదృష్టమేమిటంటే- ఈ ప్రాజెక్టు మా హయాంలో వేగం పుంజుకుంది. మేమే దీన్ని పూర్తి చేశాం. మధ్యలో కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, మేం దృఢంగా నిలిచాం.
మిత్రులారా,
ప్రయాణాలలో ఇబ్బందులు, వాతావరణ సమస్యలు, పర్వతాల నుంచి నిరంతరం రాళ్ళు పడటం... ఇలా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, ఆ సవాలునే సవాలు చేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మనగలిగేలా నేడు జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దీనికి ఉదాహరణ. సోన్మార్గ్ సొరంగం కొన్ని నెలల కిందటే మొదలైంది. ఇంతకుముందే చీనాబ్, అంజి వంతెన ద్వారా నేను మీ ముందుకొచ్చాను. ఈ వంతెనపై నడుస్తున్న వేళ దేశ దృఢ సంకల్పం నా ఆలోచనల్లో మెదిలింది. మన ఇంజినీర్లు, కార్మికుల నైపుణ్యం, ధైర్యం ఇందులో కనిపించింది. చీనాబ్ వంతెన ప్రపంచం అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. ప్రజలు ఐఫిల్ టవర్ చూసేందుకు పారిస్ వెళ్తారు. ఈ వంతెన ఐఫిల్ టవర్ కన్నా ఎత్తైనది. ఇకపై ప్రజలు చీనాబ్ వంతెన గుండా కాశ్మీర్ను చూసేందుకు వెళ్తారు. అంతేకాదు, ఈ వంతెన కూడా ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది. అందరూ సెల్ఫీ పాయింట్ కి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటారు. మన అంజి వంతెన కూడా ఇంజినీరింగ్ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ. ఇది దేశంలో తొలి తీగల రైల్వే వంతెన. ఈ రెండు వంతెనలూ కేవలం ఇటుక, సిమెంట్, ఉక్కు, ఇనుముతోనే నిర్మించినవి కావు.. పిర్పంజాల్ అనే దుర్గమ పర్వతాలపై భారత శక్తికి సజీవ చిహ్నంగా నిలిచిన ఉదాహరణలవి. భారత ఉజ్జ్వల భవిష్యత్ గర్జన ఇది. అభివృద్ధి చెందిన భారత్ అనే మన స్వప్నం ఎంత పెద్దదో.. మన ధైర్యం, సామర్థ్యం కూడా అంతే ఉన్నతమైనవని ఇది నిరూపిస్తుంది. మన సదుద్దేశం, విస్తృతమైన కృషి మరో అత్యంత ముఖ్యమైన విషయం.
మిత్రులారా,
చీనాబ్, అంజి వంతెలు రెండూ జమ్మూ, కాశ్మీర్ ఇరు ప్రాంతాలకూ సంక్షేమ సాధనాలుగా నిలుస్తాయి. ఇవి పర్యాటకాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. జమ్మూ, కాశ్మీర్ మధ్య రైలు అనుసంధానం రెండు ప్రాంతాల వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఇది ఇక్కడి పరిశ్రమలకూ ఊతమిస్తుంది. ఇప్పుడు కాశ్మీర్ యాపిల్స్ దేశంలోని పెద్ద మార్కెట్లకు తక్కువ ఖర్చుతోనే సకాలంలో చేరుకుంటాయి. డ్రై ఫ్రూట్స్ అయినా, పష్మినా శాలువాలయినా.. ఇక్కడి హస్తకళలు ఇకపై దేశంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా చేరుకోగలవు. దీని వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం కూడా సులభతరమవుతుంది.
మిత్రులారా,
వార్తాపత్రికలో సంగల్డాన్కు చెందిన ఓ విద్యార్థి వ్యాఖ్యను నేను చదివాను. ఇప్పటి వరకు తమ ఊర్లో ఊరినుంచి బయటకు వెళ్లినవారు మాత్రమే రైలును చూశారట. ఆ గ్రామంలో చాలా మంది వీడియోలో మాత్రమే రైలును చూశారు. వారి కళ్లెదుట నిజంగా ఓ రైలు పరుగులు పెడుతోందని వారు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. రైళ్ల రాకపోకల సమయాలనూ చాలా మంది గుర్తు చేసుకుంటున్నట్టు నేను చదివాను. మరో బిడ్డ చాలా మంచి విషయం చెప్పింది – ఇకపై దారులు తెరిచే ఉంటాయా, మూతపడతాయా అన్నది వాతావరణమే నిర్ణయించదు. ఈ కొత్త రైలు సర్వీసు ప్రతి రుతువులోనూ ప్రజలకు సేవలందిస్తుంది.
మిత్రులారా,
జమ్మూ కాశ్మీర్ భరతమాతకు కిరీటం. అందమైన రత్నాలెన్నో ఈ కిరీటాన్ని అలంకరించాయి. ఇవే జమ్మూకాశ్మీర్ బలం. ఇక్కడి ప్రాచీన సంస్కృతి, ఇక్కడి సంప్రదాయాలు, ఇక్కడి ఆధ్యాత్మిక చేతన, ప్రకృతి సౌందర్యం, ఇక్కడి మూలికా ప్రపంచం, పూలూ పండ్లు సమృద్ధి, ఇక్కడి యువతలోనూ మీలోనూ ఉన్న ప్రతిభ... కిరీటంలో రత్నంలా ప్రకాశిస్తాయి.
మిత్రులారా,
నేను దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ను సందర్శిస్తున్న విషయం మీకు బాగా తెలుసు. లోపలి ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉండే అవకాశం నాకు లభించింది. ఇక్కడి స్థిరమమైన సామర్థ్యాన్ని నేను చూశాను, ఆస్వాదించాను. అందుకే నేను జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశ విద్య, సంస్కృతికి జమ్మూ కాశ్మీర్ గర్వకారణం. నేడు మన జమ్మూ కాశ్మీర్ ప్రపంచంలోని అతిపెద్ద విజ్ఞాన కేంద్రాలలో ఒకటిగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఇందులో జమ్మూ కాశ్మీర్ భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఎన్ఐటీ వంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయి. జమ్మూ, శ్రీనగర్లలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పరిశోధన కూడా విస్తరిస్తోంది.
మిత్రులారా,
చదువులతో పాటు వైద్యంలోనూ అపూర్వమైన కృషి ఇక్కడ జరుగుతోంది. కొన్నేళ్లలో రెండు రాష్ట్ర స్థాయి క్యాన్సర్ సంస్థలను స్థాపించాం. గత అయిదేళ్లలో ఇక్కడ ఏడు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాం. ఒక వైద్య కళాశాల ప్రారంభిస్తే, రోగులు మాత్రమే కాకుండా ఆ ప్రాంత యువత కూడా చాలా ప్రయోజనం పొందుతారని మీకు తెలుసు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 500 నుంచి 1300కు పెరిగింది. ఇప్పుడు రియాసి జిల్లాలో కూడా కొత్త వైద్య కళాశాల ప్రారంభం కాబోతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్- ఇది ఆధునిక ఆసుపత్రి మాత్రమే కాదు, మన దాతృత్వ సంస్కృతికీ ఉదాహరణ. దేశం నలుమూలల నుంచి మాతా వైష్ణోదేవి దర్శనానికి వచ్చిన ప్రజలే ఈ వైద్య కళాశాల నిర్మాణ వ్యయాన్ని సమకూర్చారు. ఈ పవిత్ర కార్యంపట్ల శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు, దాని చైర్మన్ మనోజ్ గారికి నా శుభాకాంక్షలు. ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని కూడా 300 పడకల నుంచి 500 పడకలకు పెంచుతున్నారు. కత్రాలోని మాతా వైష్ణో దేవి దర్శనానికి వచ్చే ప్రజలకూ ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
మిత్రులారా,
కేంద్రంలో బీజేపీ - ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఈ 11 ఏళ్లనూ పేదల సంక్షేమానికే అంకితం చేశాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్ల మంది పేదల ఇంటి కలను సాకారం చేశాం. ఉజ్వల యోజనతో 10 కోట్ల వంటిళ్లలో నుంచి పొగను పోగొట్టాం. మన అక్కాచెల్లెళ్లు, మన బిడ్డలకు ఇదెంతో ఉపయోగకరం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 50 కోట్ల మంది పేదలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స సదుపాయాన్ని అందించాం. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రతి ఒక్కరికీ తగినంత ఆహారాన్ని అందించింది. జన్ధన్ యోజన ద్వారా 50 కోట్లకు పైగా పేద ప్రజలకు మొదటిసారిగా బ్యాంకు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. చీకటిలో నివసిస్తున్న 2.5 కోట్ల కుటుంబాలకు సౌభాగ్య యోజన ద్వారా విద్యుత్ సౌకర్యం లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్ల టాయిలెట్లను నిర్మించడం ద్వారా ప్రజలకు బహిరంగ విసర్జన నుంచి విముక్తి కలిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారా 12 కోట్ల కొత్త ఇళ్లకు కుళాయి నీరు అందింది. ఇది మహిళలకు ఎంతో సౌలభ్యాన్ని అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 10 కోట్ల మంది చిన్న రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం లభించింది.
మిత్రులారా,
ప్రభుత్వం చేసిన ఇలాంటి అనేక ప్రయత్నాల ఫలితంగా గత 11 ఏళ్లలో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికంతో పోరాడి దాన్ని జయించారు. వారంతా మన సోదరీ సోదరులే. వారు పేదరికాన్ని అధిగమించారు. ఇప్పుడు వారు కొత్త మధ్యతరగతిలో భాగమయ్యారు. సామాజిక నిపుణులుగా చెప్పుకొనే వారు, గతంలోనూ భవిష్యత్తులోనూ రాజకీయాలే ప్రధానంగా ఉన్నవారు, దళితుల పేరిట రాజకీయ లాభాలు ఆర్జిస్తున్న వారు ఇంతకుముందే నేను ప్రస్తావించిన పథకాలను ఓసారి పరిశీలించండి. ఈ సౌకర్యాలను పొందిన వ్యక్తులెవరో, స్వాతంత్ర్యానంతరం 77 ఏళ్లపాటు ఈ ప్రాథమిక సౌకర్యాలను కోల్పోయిన వ్యక్తులెవరో తెలుస్తుంది. వీళ్ళు నా దళిత సోదరీ సోదరులు, గిరిజన సోదరీ సోదరులు, వెనుకబడిన వర్గాల సోదరీ సోదరులు, పర్వతాలలో నివసించే వాళ్ళు, అడవులలో జీవించే వాళ్ళు, జీవితం మొత్తం మురికివాడల్లోనే గడిపిన వాళ్ళు.. ఈ కుటుంబాల కోసమే మోదీ 11 ఏళ్లు వెచ్చించాడు. పేదలకు, కొత్త మధ్యతరగతికి జవసత్వాలందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఒక ర్యాంకు ఒక పింఛను, రూ. 12 లక్షల వరకు జీతాన్ని పన్ను రహితం చేయడం, ఇల్లు కొనడానికి ఆర్థిక సాయం, తక్కువ ధరలకే విమాన ప్రయాణానికి చేయూత... ప్రభుత్వం అన్ని విధాలుగా పేదలు, మధ్యతరగతి ప్రజలతో భుజం భుజం కలిపి నడుస్తోంది.
మిత్రులారా,
పేదరికం నుంచి బయటపడేలా చేయూతనివ్వడంతోపాటు నిజాయితీగా జీవిస్తూ, దేశం కోసం ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి కోసం, వారి సామర్థ్యాన్ని కూడా పెంచేలా స్వాతంత్రయానంతరం మొదటిసారిగా ఇంత కృషి జరిగింది. మేమీ ప్రయత్నం చేశాం.
Release ID: 2134533 PART-02 VETTED-BSR
మిత్రులారా,
మన యువతకు కొత్త ఉపాధి అవకాశాలు నిరంతరం మెరుగవుతున్నాయి. దీనికి ఒక ముఖ్యమైన మార్గం పర్యాటకం. పర్యాటకం ఉపాధిని అందిస్తుంది, పర్యాటకం ప్రజలను కలుపుతుంది. కానీ దురదృష్టవశాత్తూ, మన పొరుగు దేశం మానవాళికి, సామరస్యానికి, పర్యాటకానికి వ్యతిరేకం.. పేదల జీవనోపాధికి కూడా వ్యతిరేకం. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దాడి దీనికి ఒక ఉదాహరణ. పహల్గామ్లో మానవత్వం, కశ్మీరియత్ రెండింటిపైనా పాకిస్తాన్ దాడి చేసింది. భారత్లో అల్లర్లు సృష్టించడమే వారి ఉద్దేశం. కాశ్మీర్లోని కష్టపడి పనిచేసే ప్రజల సంపాదనను ఆపడమే వారి ఉద్దేశం. అందుకే పాకిస్తాన్ పర్యాటకులపై దాడి చేసింది. గత 4-5 సంవత్సరాలుగా నిరంతర అభివృద్ధి చెదుతున్న పర్యాటకంతో ప్రతి యేటా రికార్డు సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని పేదల కుటుంబాలను పోషించే పర్యాటకాన్ని పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. కొందరు గుర్రపు స్వారీ చేసేవారు, కొందరు పోర్టర్లు, కొందరు గైడ్లు, కొందరు గెస్ట్హౌస్ యజమానులు, కొందరు షాప్-ధాబా యజమానులు, వారందరి ఉపాధిని నాశనం చేయడమే పాకిస్తాన్ కుట్ర. ఉగ్రవాదులను సవాలు చేసిన యువకుడు ఆదిల్ కూడా పహల్గామ్లో కూలీ పని చేయడానికి వెళ్ళాడు, అతను తన కుటుంబ పోషణ కోసం ఆ పని చేస్తున్నాడు. ఉగ్రవాదులు ఆదిల్ను కూడా అన్యాయంగా చంపేశారు.
మిత్రులారా,
పాకిస్తాన్ కుట్రకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ ప్రజలు నిలబడిన తీరు, ఈసారి జమ్మూ కశ్మీర్ ప్రజలు చూపించిన పరాక్రమం ద్వారా, పాకిస్తాన్కు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచంలోని ఉగ్రవాదానికి బలమైన సందేశం ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ యువత ఇప్పుడు ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. లోయలోని పాఠశాలలను తగలబెట్టిన ఉగ్రవాదం ఇది. పాఠశాలలు.. భవనాలను మాత్రమే కాదు, రెండు తరాల భవిష్యత్తును తగలబెట్టింది. ఆసుపత్రులు నాశనమయ్యాయి. ఇది అనేక తరాలను నాశనం చేసింది. ఇక్కడి ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకోవచ్చు, ఇక్కడ ఎన్నికలూ నిర్వహించవచ్చు, అయితే ఉగ్రవాదం కారణంగా అది పెద్ద సవాలుగా మారింది.
మిత్రులారా,
ఏళ్ల తరబడి ఉగ్రవాదాన్ని భరించిన క్రమంలో, జమ్మూ కశ్మీర్ చాలా విధ్వంసాలను చూసింది. జమ్మూ కశ్మీర్ ప్రజలు కలలు కనడం మానేసి, ఉగ్రవాదాన్ని తమ విధిగా అంగీకరించారు. ఈ పరిస్థితి నుంచి జమ్మూ కశ్మీర్ను బయటకు తీసుకురావడం అవసరం, మేం దానిని సాధించాం. నేడు, జమ్మూ కశ్మీర్ యువత కొత్త కలలు కంటున్నారు.. అలాగే వాటిని సాకారం చేసుకుంటున్నారు. ఇప్పుడు స్థానికంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు సందడిగా ఉండటం చూసి కశ్మీర్ యువత సంతోషంగా ఉన్నారు. ఇక్కడి ప్రజలు జమ్మూ కశ్మీర్ను మళ్లీ సినిమా షూటింగ్లకు ప్రధాన కేంద్రంగా చూడాలనుకుంటున్నారు.. ఈ ప్రాంతం క్రీడా కేంద్రంగా మారాలని వారు కోరుకుంటున్నారు. మాతా ఖీర్ భవానీ ఉత్సవంలో కూడా మనం అదే భావాన్ని చూశాం. వేలాది మంది ప్రజలు మాతా ఆలయానికి చేరుకున్న విధానం.. కొత్త జమ్మూ కశ్మీర్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈద్ ఉత్సాహాన్ని కూడా మనం ప్రతిచోటా చూస్తున్నాం. జమ్మూ కశ్మీర్లో ఏర్పడిన అభివృద్ధి వాతావరణం పహల్గామ్ దాడితో ఏ మాత్రం వెనక్కి తగ్గదు. జమ్మూ కశ్మీర్లోని మీ అందరికీ, మీ అందరికీ నరేంద్ర మోదీ ఇస్తున్న హామీ ఏమిటంటే.. అభివృద్ధి ఇక్కడితో ఆగిపోనివ్వను. ఇక్కడి యువత తమ కలలను నెరవేర్చుకోవడానికి ఏదైనా అడ్డంకి వస్తే, ఆ అడ్డంకిని ఎదుర్కొనే మొదటి వ్యక్తి మోదీనే అవుతారు.
మిత్రులారా,
ఈరోజు జూన్ 6, ఒక నెల క్రితం.. సరిగ్గా ఒక నెల క్రితం, అంటే మే 6వ తేదీ రాత్రి, పాకిస్తాన్ ఉగ్రవాదులు అంతరించిపోయారని గుర్తుంచుకోండి. ఇక ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా, పాకిస్తాన్కు తన ఘోర పరాభవమే గుర్తుకొస్తుంది. భారత్ ఇలా నేరుగా పాకిస్తాన్లోకి వందల కిలోమీటర్లు వెళ్లి ఉగ్రవాదులపై దాడి చేస్తుందని పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు ఎప్పుడూ ఊహించలేదు. వారు సంవత్సరాల తరబడి కష్టపడి నిర్మించిన ఉగ్రవాదుల భవనాలు కొద్ది నిమిషాల్లోనే శిథిలాలుగా మారాయి. దీనిని చూసి నిరాశలో కూరుకుపోయిన పాకిస్తాన్ రెచ్చిపోయి.. జమ్మూ, పూంచ్, ఇతర జిల్లాల ప్రజలపై కూడా తన ఆక్రోశాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ ఇక్కడి ఇళ్లను నాశనం చేయడం, పిల్లలపై గుండ్లు విసరడం, పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయడం, దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలను కాల్చడం ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్ దాడులను మీరు ఎలా ప్రతిఘటించారో దేశంలోని ప్రతి పౌరుడు చూశాడు. అందుకే దేశంలోని ప్రతి పౌరుడు తమ కుటుంబాలతో సహా పూర్తి శక్తితో మీకు అండగా నిలుస్తున్నారు.
మిత్రులారా,
కొద్ది రోజుల క్రితం, సరిహద్దు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. దాడుల వల్ల ప్రభావితమైన 2 వేలకు పైగా కుటుంబాల బాధ మా సొంత బాధ కూడా. షెల్లింగ్ తర్వాత ఈ కుటుంబాలకు వారి ఇళ్లను మరమ్మతు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సహాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించింది. నేటి కార్యక్రమంలో, దీని గురించి కూడా మీకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను.
మిత్రులారా,
ఇప్పుడు, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 1 లక్ష అదనపు సహాయంగా అందిస్తున్నాం. అంటే మొదటి దఫా సహాయం తర్వాత ఇప్పుడు వారికి ఈ అదనపు మొత్తం లభిస్తుంది.
మిత్రులారా,
మా ప్రభుత్వం సరిహద్దులో నివసించే ప్రజలను దేశానికి ప్రథమ కాపలాదారులుగా భావిస్తుంది. గత దశాబ్దంలో, సరిహద్దు జిల్లాల్లో అభివృద్ధి, భద్రత కోసం ప్రభుత్వం అపూర్వమైన కృషి చేసింది. ఈ కాలంలో సుమారు పది వేల కొత్త బంకర్లు నిర్మించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏర్పడిన పరిస్థితిలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఈ బంకర్లు చాలా సహాయకరంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ డివిజన్ కోసం రెండు సరిహద్దు బెటాలియన్లను కొత్తగా ఏర్పాటు చేశామని మీకు తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది. రెండు ప్రత్యేక మహిళా బెటాలియన్లను ఏర్పాటు చేసే పని కూడా పూర్తయింది.
మిత్రులారా,
మన అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. కథువా-జమ్మూ హైవేను ఆరు వరుసల ఎక్స్ప్రెస్వేగా మారుస్తున్నాం, అఖ్నూర్-పూంచ్ హైవేను కూడా మరింత విస్తరిస్తున్నాం. వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద, సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీ లేని 400 గ్రామాలను.. 1800 కిలోమీటర్ల కొత్త రహదారులతో అనుసంధానిస్తున్నాం. దీని కోసం కూడా ప్రభుత్వం 4200 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.
మిత్రులారా,
ఈ రోజు నేను జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడి యువతకు, అలాగే జమ్మూ కశ్మీర్ గడ్డ నుంచి యావత్ దేశానికి కూడా ఒక ప్రత్యేక అభ్యర్థన చేస్తున్నాను. ఆపరేషన్ సిందూర్ స్వయం-సమృద్ధి గల భారత్ శక్తిని ఎలా ప్రదర్శించిందో మీరు చూశారు. నేడు ప్రపంచమంతా భారత రక్షణ రంగ వ్యవస్థ గురించి చర్చిస్తోంది. దీని వెనుక ఒకే ఒక కారణం ఉంది.. మన దళాలు 'మేక్ ఇన్ ఇండియా'పై విశ్వాసం ఉంచాయి. ఇప్పుడు ప్రతి భారతీయుడు కూడా మన దళాలు చేసిన పనిని పునరావృతం చేయాలి. ఈ సంవత్సరం బడ్జెట్లో, మేం మిషన్ మానుఫ్యాక్చర్ ప్రకటించాం. ఈ మిషన్ ద్వారా ప్రభుత్వం తయారీ రంగానికి కొత్త ప్రేరణనిచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ మిషన్లో భాగం కావాలని నేను జమ్మూ కశ్మీర్ యువతకు పిలుపునిస్తున్నాను. దేశానికి మీ ఆధునిక ఆలోచనలు అవసరం, దేశానికి మీ ఆవిష్కరణలు అవసరం. మీ ఆలోచనలు, మీ నైపుణ్యాలు దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థకు కొత్త మార్గాలను సూచిస్తాయి. గత పదేళ్లలో, భారత్ రక్షణరంగ పరికరాల ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణరంగ పరికరాల ఎగుమతిదారుల సరసన భారత్ను చేర్చడమే మా లక్ష్యం. ఈ లక్ష్యం వైపు మనం ఎంత వేగంగా ముందు సాగుతూ ఉంటే.. దేశంలో అంతేవేగంగా లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
మిత్రులారా,
మనం మరొక ప్రతిజ్ఞ చేయాలి.. ముందుగా భారత్లో తయారైన ఉత్పత్తులను మాత్రమే మనం కొనుగోలు చేయాలి. అంటే మన దేశ ప్రజల శ్రమ శక్తితో రూపొందిన ఉత్పత్తులనే మనం కొనుగోలు చేయాలి. ఇదే దేశభక్తి.. ఇదే దేశ సేవ. సరిహద్దులో మన దళాల గౌరవాన్ని పెంచాలి.. మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా గర్వాన్నీ పెంచాలి.
మిత్రులారా,
జమ్మూ కశ్మీర్ కోసం బంగారంలాంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురుచూస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర మద్దతుతో అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాయి. మనం ముందుకు సాగుతున్న శాంతి- శ్రేయస్సు మార్గాన్ని నిరంతరం బలోపేతం చేసుకోవాలి. మా వైష్ణో దేవి ఆశీర్వాదంతో, అభివృద్ధి చెందిన భారత్.. అభివృద్ధి చెందిన జమ్మూ కశ్మీర్ సంకల్పం త్వరలోనే నెరవేరాలి. ఈ ఆకాంక్షతోనే, పలు అభివృద్ధి పనులు, అద్భుతమైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్న శుభ సందర్భంలో నేను మరోసారి మీ అందరినీ అభినందిస్తున్నాను. మీ రెండు పిడికిళ్లను బిగించి.. మీ పూర్తి బలంతో నాతో పాటు చెప్పండి -
భారత్ మాతా కీ జై! ఈ నినాదం దేశంలోని ప్రతి మూలలోనూ ప్రతిధ్వనించాలి.
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
మీ అందరికీ చాలా ధన్యవాదాలు!