అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు: ప్రధానమంత్రి
విజ్ఞానం,ఆధ్యాత్మికత రెండూ మన దేశానికి బలం: ప్రధాన మంత్రి
చంద్రయాన్ మిషన్ విజయంతో దేశంలోని బాలలు, యువతలో సైన్స్ పై మరింత ఆసక్తి పెరిగింది. అంతరిక్షాన్ని అన్వేషించాలనే తపన ఉంది. ఇప్పుడు మీ చారిత్రాత్మక ప్రయాణం ఈ సంకల్పానికి మరింత శక్తిని ఇస్తుంది: ప్రధానమంత్రి
మనం గగన్‌యాన్ మిషన్‌ను ముందుకు తీసుకువెళ్లాలి. మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలి. భారతీయ వ్యోమగాములను చంద్రునిపైకి దించాలి: ప్రధానమంత్రి
నేడు నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను - ఇది భారతదేశ గగన్‌యాన్ మిషన్ విజయానికి మొదటి అధ్యాయం. మీ ఈ చారిత్రాత్మక ప్రయాణం కేవలం అంతరిక్షానికే పరిమితం కాదు, ఇది వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణానికి వేగాన్నీ కొత్త ఉత్తేజాన్నీ ఇస్తుంది: ప్రధానమంత్రి
అంతరిక్షంలో భారత్ ప్రపంచానికి కొత్త అవకాశాల ద్వారాలను తెరవబోతోంది: ప్రధానమంత్రి

భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సంభాషించారు. గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి  వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా ప్రస్తుతం మాతృభూమికి  అత్యంత దూరంలో ఉన్నప్పటికీ, ఆయన భారతీయులందరి హృదయాలకు అత్యంత చేరువలో ఉన్నారని ప్రధానమంత్రి అన్నారు.  శుభాంశు పేరు స్వయంగా శుభప్రదమైనదని, ఆయన ప్రయాణం కొత్త శకానికి నాంది పలికిందని  పేర్కొన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అయినప్పటికీ, 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు, ఉత్సాహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. శుభాంశుతో మాట్లాడుతున్న ఈ స్వరం యావత్ దేశపు సమష్టి ఉత్సాహం, గర్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అంతరిక్షంలో భారతదేశ జెండాను ఎగురవేసిన శుభాంశుకు  హృదయపూర్వక అభినందనలు,  శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాంశు ఆరోగ్య పరిస్థితి గురించి, అంతరిక్ష కేంద్రంలో అంతా బాగానే ఉందా అని అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని అభినందనలకు వ్యోమగామి శుభాంశు శుక్లా స్పందిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల తరపున శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనకు లభించిన ప్రేమ, ఆశీస్సులకు ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. కక్ష్యలో తాను గడిపిన సమయాన్ని లోతైన, నూతన అనుభవంగా వర్ణించారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణాన్ని మాత్రమే కాకుండా, భారతదేశం పురోగమిస్తున్న దిశను కూడా ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. భూమి నుంచి  కక్ష్య వరకు తాను చేసిన ప్రయాణం కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని శుభాంశు  శుక్లా  అన్నారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ, తాను ఎప్పుడూ వ్యోమగామి అవుతానని ఊహించలేదని, అయితే ప్రధానమంత్రి నాయకత్వంలో, నేటి భారతదేశం అటువంటి కలలను సాకారం చేయగలుగుతోందని అన్నారు. ఇది ఒక గొప్ప విజయం అని, అంతరిక్షంలో మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో  గర్వంగా ఉందని శుభాంశు అన్నారు.
 

ప్రధానమంత్రి మాట్లాడుతూ, శుభాంశు అంతరిక్షంలో దాదాపుగా గురుత్వాకర్షణ లేని చోట ఉన్నప్పటికీ, ఆయన ఎంత నిలకడగా ఉన్నారో ప్రతి భారతీయుడు చూడగలడని అన్నారు. భారతదేశం నుంచి  తీసుకెళ్లిన క్యారెట్ హల్వాను తన తోటి వ్యోమగాములతో పంచుకున్నారా అని ఆయన శుభాంశును అడిగారు. దీనికి శుక్లా సమాధానమిస్తూ, అంతరిక్ష కేంద్రానికి క్యారెట్ హల్వా, పెసర హల్వా, మామిడి రసం వంటి అనేక సంప్రదాయ భారతీయ వంటకాలను తీసుకెళ్ళినట్లు తెలిపారు. నాతో పాటు అంతరిక్ష యాత్రకు వచ్చిన నా మిత్రులకు  భారతదేశపు వంటకాలను  రుచి చూపించాలనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. వారందరూ కలిసి కూర్చుని ఆ వంటకాలను ఆస్వాదించారని, అవి వారికి చాలా బాగా నచ్చాయని శుభాంశు శుక్లా ప్రధానమంత్రికి తెలిపారు. తన తోటి వ్యోమగాములు ఆ రుచులను ఎంతగానో మెచ్చుకున్నారని, కొందరైతే భవిష్యత్తులో ఈ వంటకాలను భారత గడ్డపై ఆస్వాదించడానికి భారతదేశాన్ని సందర్శించాలనే  కోరిక కూడా వెలిబుచ్చారని ఆయన పేర్కొన్నారు.

శుభాంశు ఇప్పుడు భూమాతకు ప్రదక్షిణ చేసే అరుదైన గౌరవాన్ని పొందారని ప్రధానమంత్రి అన్నారు. ప్రదక్షిణ చేయడం శతాబ్దాలుగా భారతదేశంలో ఆచరిస్తున్న ఒక పూజనీయమైన సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శుభాంశు భూమిపై ఏ ప్రాంతం మీదుగా తిరుగుతున్నారో ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దానికి సమాధానమిస్తూ, ఆ క్షణంలో ప్రదేశం గురించి తన వద్ద కచ్చితమైన సమాచారం  లేదని, అయితే కొద్దిసేపటి క్రితం, కిటికీ ద్వారా చూసినప్పుడు తాము హవాయి మీదుగా వెడుతున్నట్టు గుర్తించామని  శుభాంశు శుక్లా చెప్పారు. తాము రోజుకు 16 కక్ష్యలు పూర్తి చేస్తామని, అంతరిక్షం నుంచి నుంచి 16 సూర్యోదయాలు,  16 సూర్యాస్తమయాలను చూస్తున్న  ఈ అనుభవం తనను నిరంతరం అబ్బురపరుస్తూనే  ఉందని ఆయన తెలిపారు. దాదాపు గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ, అంతరిక్ష నౌక లోపల ఆ వేగం తెలియడం లేదని ఆయన ప్రధానమంత్రికి తెలిపారు. అయితే, ఈ గొప్ప వేగం భారతదేశం నేడు ముందుకు సాగుతున్న వేగాన్ని ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
 

అంతరిక్షంలోకి ప్రవేశించి, దాని విస్తారతను చూసినప్పుడు తనను ఆకట్టుకున్న మొదటి విషయం భూమి దృశ్యం అని  శుక్లా తెలిపారు. అంతరిక్షం నుంచి దేశాల సరిహద్దులు గానీ,  ఎటువంటి స్పష్టమైన రేఖలు గానీ కనిపించవని, బాగా కనిపించింది భూమి సమగ్ర స్వరూపమేనని ఆయన చెప్పారు.

మ్యాప్ లను చూసినప్పుడు, మనం భారతదేశంతో సహా దేశాల పరిమాణాలను పోల్చుకుంటూ ఉంటామని, మూడు డైమెన్షన్ల ప్రపంచాన్ని కాగితంపై చూస్తామని, కానీ అంతరిక్షం నుంచి  చూసినప్పుడు, భారతదేశం నిజంగా గొప్పగా కనిపిస్తుందని, పరిమాణంలోనూ, స్ఫూర్తిలోనూ కూడా మహోన్నతంగా కనిపిస్తుందని శుభాంశు అన్నారు. తాను అనుభూతి చెందిన అన్నింటిలో ఐక్యత అనే భావన శక్తిమంతమైందని, ఇది భారతదేశ నాగరిక నినాదమైన "భిన్నత్వంలో ఏకత్వం"తో పూర్తిగా సరిపోతుందని అన్నారు. అంతరిక్షం నుంచి  భూమి అందరూ పంచుకునే ఒకే ఇంటిలా కనిపిస్తుందని, ఇది మానవజాతికి సహజంగా ఉన్న సామరస్యం, అనుబంధాలను గుర్తు చేస్తుందని ఆయన అన్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడు శుభాంశు  శుక్లా అని ప్రధాని పేర్కొంటూ, భూమిపై చేసిన  కఠినమైన సన్నాహాలకు, అంతరిక్ష కేంద్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. శూన్య గురుత్వాకర్షణ గురించి, ప్రయోగాల స్వభావం గురించి ముందుగానే తెలిసినప్పటికీ, కక్ష్యలోని వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉందని వ్యోమగామి సమాధానమిచ్చారు. సూక్ష్మ గురుత్వాకర్షణలో చిన్న పనులు కూడా ఊహించని విధంగా సంక్లిష్టంగా మారే విధంగా గురుత్వాకర్షణకు మానవ శరీరం అలవాటు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంభాషణ సమయంలో తన కాళ్లను కట్టుకోవలసి వచ్చిందని, లేకపోతే తాను తేలిపోతానని ఆయన చమత్కరించారు. అంతరిక్షంలో నీళ్లు తాగడం లేదా నిద్రపోవడం వంటి సాధారణ పనులు కూడా పెద్ద సవాళ్లుగా మారతాయని ఆయన అన్నారు. పైకప్పుపై, గోడలపై లేదా ఎక్కడైనా నిద్రపోవచ్చని శుభాంశు  వివరించారు. దిశ అనేది సాపేక్షంగా మారుతుందని, ఈ మారిన వాతావరణానికి అలవాటు పడటానికి ఒకటి లేదా రెండు రోజులు పడుతుందని అన్నారు. ఈ అనుభవాన్ని విజ్ఞానం,  అద్భుతాల అందమైన సామరస్యంగా ఆయన అభివర్ణించారు.
 

"సైన్స్, ఆధ్యాత్మికత భారత్ శక్తికి  రెండు స్తంభాలు" అనే ప్రధానమంత్రి అభిప్రాయంతో శుభాంశు శుక్లా పూర్తిగా ఏకీభవించారు. ధ్యానం,  ఏకాగ్రత ప్రయోజనం చేకూర్చాయా అని ప్రధానమంత్రి ప్రశ్నించగా, భారతదేశం ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతోందని, తన మిషన్ ఒక పెద్ద జాతీయ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని శుభాంశు   చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది భారతీయులు అంతరిక్షంలోకి వెళ్తారని, అందులో భాగంగా భారతదేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తుందని శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. అటువంటి వాతావరణంలో ఏకాగ్రత ప్రాముఖ్యతను వివరించారు. కఠినమైన శిక్షణ సమయంలోనైనా లేదా ప్రయోగం వంటి అధిక ఒత్తిడి గల సమయాలలోనైనా ఏకాగ్రత అంతర్గత ప్రశాంతతను,  స్పష్టతను కొనసాగించడంలో సహాయపడుతుందని ఆయన వివరించారు. అంతరిక్షంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనస్సును కేంద్రీకరించడం కీలకమని  శుక్లా అన్నారు. ఒక ప్రసిద్ధ భారతీయ సామెతను ఉటంకిస్తూ, "పరుగెత్తేటప్పుడు తినలేరు" అని ఆయన అన్నారు. దీని అర్థం, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి నిర్ణయాలు తీసుకోగలరు అని చెప్పారు. సైన్స్, ఏకాగ్రత రెండూ కలిసి సాధన చేస్తే, అటువంటి సవాలుతో కూడిన వాతావరణాలకు శారీరకంగా, మానసికంగా అలవాటు పడటానికి అవి ఎంతగానో సహాయపడతాయని  వివరించారు.

భవిష్యత్తులో వ్యవసాయ లేదా ఆరోగ్య రంగాలకు ప్రయోజనం చేకూర్చే ఏవైనా అంతరిక్ష ప్రయోగాలు జరుగుతున్నాయా అని ప్రధానమంత్రి అడిగారు. దీనికి శుక్లా సమాధానమిస్తూ, మొట్టమొదటిసారిగా, భారతీయ శాస్త్రవేత్తలు ఏడు ప్రత్యేకమైన ప్రయోగాలను రూపొందించారని, వాటిని తాను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లానని చెప్పారు.

ఆ రోజుకు షెడ్యూల్ చేసిన  మొదటి ప్రయోగం స్టెమ్ సెల్స్‌పై దృష్టి సారిస్తుందని శుక్లా తెలియజేశారు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల శరీరంలో కండరాల నష్టం జరుగుతుందని, కొన్ని సప్లిమెంట్లు ఈ నష్టాన్ని నిరోధించగలవా లేక  ఆలస్యం చేస్తాయా అనే అంశాన్నిఈ ప్రయోగం పరిశీలిస్తుందని ఆయన వివరించారు. ఈ అధ్యయనం ఫలితం భూమిపై వృద్ధాప్య సంబంధిత కండరాల క్షీణతను ఎదుర్కొంటున్న వృద్ధులకు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. మరొక ప్రయోగం సూక్ష్మఆల్గే ల  పెరుగుదలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. సూక్ష్మఆల్గేలు పరిమాణంలో చిన్నవి అయినప్పటికీ, అవి అత్యంత పోషకమైనవి అని ఆయన పేర్కొన్నారు. అంతరిక్షంలోని పరిశోధనల ఆధారంగా వాటిని పెద్ద పరిమాణంలో పెంచడానికి పద్ధతులను అభివృద్ధి చేయగలిగితే,  భూమిపై ఆహార భద్రతకు గణనీయంగా దోహదపడతాయని ఆయన అన్నారు. అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహించడం వల్ల కలిగే ఒక ప్రధాన ప్రయోజనం  జీవ ప్రక్రియలు వేగవంతం అవుతాయని, దీనివల్ల పరిశోధకులు భూమిపై కంటే చాలా వేగంగా ఫలితాలను పొందగలుగుతారని ఆయన చెప్పారు.

చంద్రయాన్ విజయం తర్వాత భారతదేశంలోని పిల్లలు, యువతలో విజ్ఞానశాస్త్రం పట్ల మరింత ఆసక్తి, అంతరిక్ష అన్వేషణ పట్ల తపన పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  శుక్లా చారిత్రాత్మక ప్రయాణం ఆ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని ఆయన అన్నారు. నేటి పిల్లలు ఆకాశం వైపు చూడటం మాత్రమే కాదని, తాము కూడా ఆకాశాన్ని చేరుకోగలమని ఇప్పుడు నమ్ముతున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఆలోచన,  ఆకాంక్షలే భారతదేశ భవిష్యత్ అంతరిక్ష మిషన్లకు నిజమైన పునాది అని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ యువతకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధానమంత్రి శుక్లాను అడిగారు.

శుక్లా ఇందుకు స్పందిస్తూ, దేశం సాహసోపేతమైన  ఆశావహ దిశలో పయనిస్తోందని అన్నారు.ఈ కలలను సాధించడానికి ప్రతి యువ భారతీయుడి భాగస్వామ్యం, నిబద్ధత అవసరం అని ఆయన స్పష్టం చేశారు.. విజయానికి ఒకటే మార్గం లేదని ప్రతి వ్యక్తి భిన్నమైన మార్గంలో నడవవచ్చని.  అయితే పట్టుదల అనేది ఉమ్మడి అంశం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రయత్నించడం ఎప్పుడూ ఆపవద్దని ఆయన యువతను కోరారు. ఎక్కడ ఉన్నా, ఏ మార్గాన్ని ఎంచుకున్నా, పట్టు వదలని ధోరణి త్వరగా లేదా ఆలస్యంగా అయినా విజయాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

శుక్లా సందేశం  భారత యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎప్పటిలాగే, తాను ఎప్పుడూ కొంత హోంవర్క్ ఇవ్వకుండా సంభాషణను ముగించనని ఆయన అన్నారు. భారతదేశం గగన్‌యాన్ మిషన్‌ను ముందుకు తీసుకువెళ్లాలని, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని,  భారతీయ వ్యోమగాములను చంద్రునిపైకి దించాలని ఆయన ఆకాంక్షించారు. శుక్లా అంతరిక్ష అనుభవాలు ఈ భవిష్యత్ మిషన్లకు అత్యంత విలువైనవి అని ప్రధాని చెప్పారు. శుక్లా ఈ మిషన్ సమయంలో తన అభ్యాసాలు,  నేర్చుకున్న విషయాలను శ్రద్ధగా  నమోదు చేస్తూ ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

శుక్లా మాట్లాడుతూ, తన శిక్షణ, ప్రస్తుత మిషన్ లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గ్రహించానని పేర్కొన్నారు. ఈ అనుభవం ద్వారా పొందిన పాఠాలు భవిష్యత్ లో భారత అంతరిక్ష మిషన్లకు అత్యంత విలువైనవిగా, ముఖ్యమైనవిగా రుజువు అవుతాయని ఆయన అన్నారు. తిరిగి వచ్చిన తర్వాత, మిషన్ అమలును వేగవంతం చేయడానికి ఈ ఆలోచనలను పూర్తి అంకితభావంతో తాను ఆచరణలో పెడతానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మిషన్‌లోని తన సహచరులు గగన్‌యాన్‌లో పాల్గొనే అవకాశాల గురించి అడిగారని, అది తనకు ప్రోత్సాహకరంగా అనిపించిందని  శుక్లా తెలిపారు.  వారికి తాను "త్వరలోనే" అని ఆశాభావంతో బదులిచ్చానని తెలిపారు. ఈ కల త్వరలో సాకారం అవుతుందని శుభాంశు  పునరుద్ఘాటించారు. దానిని వేగంగా సాధించడానికి తన నేర్చుకున్నవాటిని 100 శాతం అంకితభావంతో అమలు చేయడానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

శుభాంశు శుక్లా సందేశం భారతదేశ యువతకు స్ఫూర్తినిస్తుందని పేర్కొంటూ, మిషన్‌కు ముందు శుభాంశు, అతని కుటుంబాన్ని కలుసుకున్న జ్ఞాపకాలను శ్రీ మోదీ పంచుకున్నారు. వారు కూడా భావోద్వేగంతో, ఉత్సాహంతో నిండి ఉన్నారని ఆయన అన్నారు. శుభాంశుతో మాట్లాడటం ఆనందంగా ఉందని, ముఖ్యంగా గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తున్నప్పుడు ఆయన మోస్తున్న కఠినమైన బాధ్యతలను ప్రధాని అభినందించారు. ఇది భారతదేశ గగన్‌యాన్ మిషన్ విజయానికి మొదటి అధ్యాయం అని  చెప్పారు. శుభాంశు చారిత్రాత్మక ప్రయాణం కేవలం అంతరిక్షానికే పరిమితం కాదని, అది భారతదేశం వికసిత్ భారత్‌గా మారే దిశగా పురోగతిని వేగవంతం చేస్తుందని, బలోపేతం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. "భారతదేశం ప్రపంచం కోసం అంతరిక్షంలో కొత్త సరిహద్దులను తెరుస్తోంది. దేశం ఇకపై కేవలం ఎగరడమే కాదు, భవిష్యత్ ప్రయాణాల కోసం లాంచ్‌ప్యాడ్‌లను కూడా నిర్మిస్తుంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు. శుభాంశును స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా మాట్లాడమని ఆయన ఆహ్వానించారు. ప్రశ్నకు సమాధానంగా కాకుండా, ఆయన పంచుకోవాలనుకునే ఏ భావాలను అయినా వ్యక్తం చేయమని కోరారు. తాను, తనతో పాటు యావత్ దేశం వినడానికి ఆసక్తిగా ఉన్నామని ప్రధాని అన్నారు.

శుక్లా ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, తన శిక్షణ, అంతరిక్ష ప్రయాణం పొడవునా నేర్చుకున్న విషయాలను గుర్తుచేసుకున్నారు. తన వ్యక్తిగత విజయాన్ని అంగీకరించినప్పటికీ, ఈ మిషన్ దేశానికి ఒక గొప్ప సామూహిక విజయాన్ని సూచిస్తుందని ఆయన  చెప్పారు. ప్రతి పిల్లవాడిని,యువకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, తమకు మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం భారతదేశానికి మంచి భవిష్యత్తును నిర్మించడంలో తోడ్పడుతుందని ప్రోత్సహించారు. ఆ ఆకాశం మీకూ, నాకూ, దేశానికీ ఎప్పుడూ హద్దులు లేనిదేనని యువత ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని  శుక్లా కోరారు. ఇది వారికి దేశ భవిష్యత్తును ప్రకాశవంతం చేయడంలో మార్గనిర్దేశం చేస్తుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి తోనూ, ఆయన ద్వారా 140 కోట్ల మంది పౌరులతోనూ మాట్లాడే అవకాశం లభించినందుకు శుభాన్షు తన భావోద్వేగాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన హృదయాలను కదిలించే ఒక అంశాన్ని పంచుకున్నారు. తన  వెనుక కనిపిస్తున్న భారత జాతీయ పతాకం అంతకుముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లేదని,  తాను వచ్చిన తర్వాతే అది ఎగిరిందని, ఇది ఆ క్షణాన్ని చాలా అర్ధవంతంగా మార్చిందని అన్నారు.  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇప్పుడు భారతదేశం ఉండడం తనకు అమిత గర్వంగా ఉందని ఆయన అన్నారు.

శుక్లాకు, ఆయన తోటి వ్యోమగాములందరికీ వారి మిషన్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  శుభాంశు క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం ఎదురుచూస్తోందని, తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన కోరారు. భారతమాత గౌరవాన్ని నిలబెట్టాలని గ్రూప్ కెప్టెన్  శుక్లాను ప్రధానమంత్రి ప్రోత్సహించారు. 140 కోట్ల మంది పౌరుల తరపున ఆయనకు  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి చేసిన అపారమైన కృషికి,  అంకితభావానికి శుక్లాకు మరోసారి అభినందనలు తెలియచేస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From Health Access to Health Security: Ayushman Bharat is reshaping Indian public healthcare

Media Coverage

From Health Access to Health Security: Ayushman Bharat is reshaping Indian public healthcare
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlights the divine and benevolent grace of Goddess Brahmacharini
March 20, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit subhashitam today, highlighting the divine and benevolent grace of Goddess Brahmacharini.

The Prime Minister wrote on X:

"मां ब्रह्मचारिणी के चरणों में कोटि-कोटि नमन! देवी मां सभी भक्तों पर अपनी कृपा बनाए रखें।

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥"

The Goddess who holds a rosary and a water pot in her lotus-like hands—may that supremely exalted Goddess Brahmacharini be gracious to me.