ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న (జనవరి 24న) గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ‘ఎన్‌సిసి’ కేడెట్లు, ‘ఎన్‌ఎస్‌ఎస్‌’ వలంటీర్లు, గిరిజన అతిథులు, శకట కళాకారులతో ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోగల తన నివాసంలో ముచ్చటించారు. దేశ ప్రధానిని ప్రత్యక్షంగా కలుసుకోవడంపై వారంతా ఎంతో సంతోషం ప్రకటించగా- “ఇది భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు.

   ముందుగా బీహార్‌లోని ముంగేర్ నుంచి వచ్చిన వారితో మాట్లాడిన ప్రధాని- ముంగేర్ గడ్డపై తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. యోగాకు నెలవుగా ఈ ప్రాంతం అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిందని, నేడు యావత్‌ ప్రపంచం యోగాను అనుసరిస్తున్నదని గుర్తు చేశారు.

 

   ప్రధానిని కలిసిన వారిలో ఒక మహిళ మాట్లాడుతూ- స్వచ్ఛ భారత్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి కార్యక్రమాలు దేశ ప్రగతికి తోడ్పడటమే గాక యువతను విశేషంగా ఆకర్షించాయని చెప్పారు. ప్రధానమంత్రి ఒక అయస్కాంతంలా అందర్నీ ఆకర్షిస్తున్నారని ఇటువంటి వ్యక్తిత్వంగల నాయకుడు జాతిని నడిపించడం దేశానికి ఎంతో గర్వకారణమని అభివర్ణించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు పరిశుభ్రత పరిరక్షణ సంకల్పం పూనితే, భారత్‌ సదా పరిశుభ్రంగానే ఉంటుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

   ఒడిషాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరొకరు- విజయానికి వాస్తవ నిర్వచనం ఏమిటని శ్రీ మోదీని వాకబు చేయగా... వైఫల్యాన్ని పట్టించుకోకపోవడమేనని ఆయన బదులిచ్చారు. వైఫల్యాన్ని అంగీకరించడమంటే విజయానికి శాశ్వతంగా దూరం కావడమేనంటూ- దాన్నుంచి పాఠం నేర్చినవారే శిఖరాగ్రానికి చేరగలరని స్పష్టీకరించారు. వైఫల్యంతో కుంగిపోరాదని, అలాంటి అనుభవం నుంచి ప్రత్యామ్నాయం అన్వేషించగల స్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పారు. అలా చేయగలిగితేనే అంతిమంగా ఉన్నత శిఖరాలు చేరగలమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

 

   మీకు ప్రేరణనిచ్చేది, మీలో పునరుత్తేజం నింపేది ఏమిటని మరొకరు ప్రశ్నించగా- “మీలాంటి యువతీయువకులను తరచూ కలుసుకోవడం నాకెంతో ఉత్తేజాన్ని, ప్రేరణను ఇస్తుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని రైతుల గురించి ఆలోచిస్తే- వారు నిత్యం ఎన్ని గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తారో తనకు అర్థమవుతుందన్నారు. అలాగే సైనికులను జ్ఞాపకం చేసుకుంటే- సరిహద్దుల వద్ద గంటలకొద్దీ కాపలా విధులు నిర్వర్తిస్తుండటం తనకు గుర్తుకొస్తుందని పేర్కొన్నారు. ఈ విధంగా దేశంలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతుంటారని, మనమంతా వారిని గమనిస్తూ ఆ తరహాలో జీవించడానికి యత్నించాలన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే విశ్రాంతి తీసుకునే హక్కు కూడా మనకు లేదనిపిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. కర్తవ్య నిర్వహణలో వారంతా అంకిత భావం ప్రదర్శిస్తున్న కారణంగానే దేశంలోని 140 కోట్ల మంది పౌరులు తనకూ బాధ్యతలు అప్పగించారని ఆయన పేర్కొన్నారు.

   నిత్యం తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు జీవితంలో ఎంతో ప్రయోజనకరమని ప్రధాని అన్నారు. లోగడ తాను ‘ఎన్‌సిసి’ కేడెట్‌గా ఉన్నానని, శిబిరాలలో పాల్గొనే వేళ ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తనకెంతో క్రమశిక్షణ నేర్పిందని గుర్తుచేసుకున్నారు. అలా ఉదయాన్నే నిద్రలేచే తన అలవాటును నేటికీ ఎంతో విలువైన ఆస్తిగా పరిగణిస్తానని చెప్పారు. దీనివల్ల  ప్రపంచం మేల్కొనడానికి ముందే తన పనుల్లో అధికశాతం పూర్తిచేసే అవకాశం లభిస్తుందన్నారు. యువతరం కూడా ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవడమేగాక జీవితాంతం కొనసాగించడం ఎంతో ఉపయోగకరమని ఉద్బోధించారు.

   మహనీయుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని, ఆ మేరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా ప్రతి గొప్ప వ్యక్తి జీవితం నుంచి విశిష్ట లక్షణాలను అలవరచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు మునుపటి గొప్ప నాయకుల జీవితాల నుంచి తాను నేర్చుకున్న పాఠాలను నేడు దేశ సేవకు అన్వయించడంలోని ప్రాముఖ్యాన్ని విశదీకరించారు.

 

   గణతంత్ర దినోత్సవ కార్యక్రమ సన్నాహాల సందర్భంగా ఇతరుల నుంచి నేర్చుకున్న అంశాలేమిటో తెలపాల్సిందిగా ఒక యువతిని ప్రధాని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ-  “స్నేహం పెంచుకోవడం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో సంభాషించడం, సమైక్య భారత్‌ నిర్మాణంలో ఏకీకృతం కావడం” అని బదులిచ్చారు. సంక్లిష్ట సమయాల్లో అన్ని రకాలుగా సర్దుకుపోవడం గురించి కూడా ఈ అనుభవం నేర్పిందన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ పండిట్ కుటుంబ యువతి ఒకరు మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా స్వతంత్రంగా జీవించడం ఎలాగో తనకు అలవడిందని చెప్పడంపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ ఇంటి పనులు చేయని తనకు, ఇక్కడ ప్రతి పనీ స్వయంగా చేసుకోవడం ఓ గణనీయ అనుభవమని ఆమె తెలిపారు. ఇంటికి తిరిగి వెళ్లాక తన చదువుతోపాటు ఇకపై ఇంటి పనులలో తల్లికి చేదోడువాదోడుగా ఉండాలని సంకల్పించినట్లు తెలిపారు.

   కుటుంబమంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు మాత్రమే కాదని, ఇక్కడి స్నేహితులు, సీనియర్లతో కూడిన ఉమ్మడి కుటుంబమని తనకు అర్థమైందంటూ ఒక యువకుడు తన అనుభవాన్ని పంచుకోగా, ప్రధానమంత్రి భావోద్వేగంతో కదిలిపోయారు. ఇది జీవితాంతం గుర్తుండిపోయే అమూల్యమైన పాఠమని ఆ యువకుడు పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ- “ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్” స్ఫూర్తిని స్వీకరించడం ఈ అనుభవంలోని ఒక ముఖ్యమైన పాఠమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

   గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎంపిక కావడం, కాకపోవడం గురించి శ్రీ మోదీ ప్రశ్నించగా-  ఎంపిక కావడం లేదా కాకపోవడంతో నిమిత్తం లేకుండా ఒక ప్రయత్నం చేయడమే ఓ కీలక విజయమని ఒకరు బదులిచ్చారు. దీని ప్రధాని స్పందిస్తూ- ఫలితంతో సంబంధం లేకుండా అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శనే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.

   కార్యక్రమ సన్నాహాల్లో భాగంగా ఒక నెలపాటు ఇక్కడ గడిపినవారు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరన్స్‌ ద్వారా సంభాషించగలిగారని ప్రధాని గుర్తు చేశారు. మనను ‘వికసిత భారత్‌’ వైపు నడిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ఇండియా కార్యక్రమాలే ఇందుకు దోహదం చేశాయని ఆయన స్పష్టం చేశారు. భారత్‌ తరహాలో అతి చౌకగా డేటా లభ్యమయ్యే దేశాలు ప్రపంచంలో కొన్ని మాత్రమేనన్నారు. కాబట్టే, నిరుపేదలు కూడా నేడు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా తమ ఆప్తులతో హాయిగా మాట్లాడగలుగుతున్నారని తెలిపారు. అలాగే మీలో ఎందరు ‘యుపిఐ’, డిజిటల్‌ చెల్లింపు సదుపాయాలను వాడుతున్నారంటూ ప్రశ్నించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ఇవాళ నవతరం జేబులో నగదుతో కాకుండా మొబైల్‌ ఫోన్‌తో బయటకు వెళ్తున్నదని చమత్కరించారు.

 

   ‘ఎన్‌సిసి’లో చేరకముందు, చేరిన తర్వాత అనుభవాల రీత్యా అంతకుముందు తెలియని, ఇప్పుడు తెలుసుకున్న విలువైన అంశాలేమిటని శ్రీ మోదీ ప్రశ్నించారు. దీనిపై ఒకరు బదులిస్తూ- సమయ పాలన-నిర్వహణ, నాయకత్వ లక్షణాలను అలవరచుకున్నామని తెలిపారు. మరొకరు జవాబిస్తూ- తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం ప్రజా సేవ అని చెప్పారు. అలాగే రక్తదాన శిబిరాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత వంటివి కూడా నేర్చుకున్నానని వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘మై భారత్‌’  లేదా ‘మేరా యువ భారత్’ వేదిక గురించి ప్రధాని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికిపైగా యువత ఈ వేదికలో నమోదైనట్లు గుర్తుచేశారు. అలాగే తనను కలిసిన బృందంలోని సభ్యులు చాలామంది ‘వికసిత భారత్‌’పై చర్చలు, క్విజ్, వ్యాస రచన, వక్తృత్వం వగైరా పోటీల్లో విశేష ప్రతిభను ప్రదర్శించారని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ‘మై  భారత్’ పోర్టల్‌లో త్వరగా పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీ మోదీ సూచించారు.

   మన దేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారత్‌’ రూపొందించడంపై భారత్‌తోపాటు భారతీయుల లక్ష్యాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఏదైనా సానుకూల సంకల్పం పూనితే, దాన్ని సాకారం చేయడం అసాధ్యమేమీ కాదని వ్యాఖ్యానించారు. “మన కర్తవ్య నిబద్ధతతో అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో మనం ఒక కీలక శక్తిగా మారగలం” అంటూ వారిలో ఉత్సాహం నింపారు.

   తల్లిని ఎంతగా ప్రేమిస్తారో.. భూమాతను కూడా అంతగా ప్రేమించేవారు మనలో ఎందరున్నారంటూ ప్రశ్నించిన శ్రీ మోదీ- అలాంటి వారంతా తల్లిపట్ల, భూమి తల్లి మీద గౌరవాదరాలకు ప్రతీక అయిన ‘అమ్మ పేరిట ఓ మొక్క’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఏదో ఒక మొక్కను నాటడమే కాకుండా అది పచ్చగా ఎదిగేలా నిరంతరం శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం తొలి లబ్ధిదారు భూమాతేనని ఆయన వ్యాఖ్యానించారు.

   అరుణాచల్ ప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తితో శ్రీ మోదీ మాట్లాడుతూ- భారత్‌లో  సూర్యుని తొలి కిరణం ప్రసరించేది ఈ గడ్డపైనేనని ఆ రాష్ట్రం విశిష్టతను వివరించారు. అలాగే అరుణాచల్ ప్రజలు “రామ్ రామ్” లేదా “నమస్తే” అని కాకుండా “జై హింద్” అంటూ పరస్పర అభివాదం చేసుకుంటారని గుర్తుచేశారు. అక్కడి ప్రజల వైవిధ్యం, కళ, ప్రకృతి సౌందర్యం, ప్రేమాభిమానాలను అందరూ చవిచూడాలని ప్రధాని అభిలషించారు. మిజోరం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అస్సాం, మేఘాలయ సహా యావత్‌ అష్టలక్ష్మి’ ప్రాంతాన్ని సందర్శించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య భారతంలో సందర్శనీయ విశేషాలు ఎన్నో ఉన్నాయని, అందుకు రెండుమూడు నెలలు కూడా సరిపోకపోవచ్చునని అభివర్ణించారు.

   అటుపైన ‘ఎన్‌ఎస్‌ఎస్‌’ బృందంతో మాట్లాడుతూ- ఈ యూనిట్ తమ ప్రాంతంలో చేపట్టిన కార్యకలాపాల్లో విస్తృత గుర్తింపు లభించినది ఏదని ప్రధానమంత్రి వాకబు చేశారు. దీనిపై జార్ఖండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరు బదులిస్తూ- వెదురు వస్తువుల తయారీలో పేరొందిన దుమ్కాలోని మహిరి సమాజానికి చేయూతనివ్వడం తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. కొన్ని సీజన్లలో మాత్రమే ఉత్పత్తులు అమ్ముడు కావడం ఆ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలుగా ఉందని వివరించారు. ఈ సమస్య పరిష్కారం దిశగా తమ యూనిట్ అటువంటి కళాకారులను గుర్తించి, అగరుబత్తి  తయారీ కర్మాగారాలతో అనుసంధానించిందని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి త్రిపుర రాజధాని అగర్తల అడవులలో లభించే అగరు కలప ప్రత్యేక, ఆహ్లాదకర సుగంధానికి ప్రసిద్ధి చెందినదని గుర్తుచేశారు. ఈ చెట్ల నుంచి సేకరించే నూనె అత్యంత విలువైనదేగాక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటిలో ఒకటని పేర్కొన్నారు. అరుదైన అగరు సుగంధమే ఆ కలపతో అగరుబత్తి తయారీ సంప్రదాయానికి దారితీసిందని ఆయన పేర్కొన్నారు.

 

   ఈ సందర్భంగా ‘జిఇఎం’ (ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్) పోర్టల్‌ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. స్థానిక చేతివృత్తులవారు, తయారీదారులు తమ ఉత్పత్తులను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా విద్యావంతులైన యువత వారికి తోడ్పాటునివ్వాలని ఆయన సూచించారు. ఆయా ఉత్పత్తులు, ధరల జాబితా ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వాటికి ఆర్డర్లు ఇచ్చే వీలుంటుందని, దీంతో లావాదేవీలు వేగం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లోని స్వయం సహాయ బృందాల (ఎస్‌హెచ్‌జి) నుంచి 3 కోట్ల మంది మహిళలను “లక్షాధికారి సోదరీమణులు”గా రూపుదిద్దాలనే తన దార్శనికతను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. ఈ మేరకు “లక్షాధికారి సోదరీమణుల” సంఖ్య ఇప్పటికే 1.3 కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బృందంలోని ఒకరు మాట్లాడుతూ- తన తల్లి కుట్టుపని నేర్చుకుందని, నవరాత్రి సమయంలో ధరించే సంప్రదాయ ‘చనియా’లు తయారు చేస్తుందని తెలిపారు. ఇవి నేడు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయని ఆయన అన్నారు. దీన్నొక స్ఫూర్తిదాయక ఉదాహరణగా పేర్కొంటూ “లక్షాధికారి సోదరీమణి” కార్యక్రమం వికసిత భారత్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

   నేపాల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మహిళ మాట్లాడుతూ- భారత్‌ను సందర్శించి, ప్రధానితో సమావేశం కావడం తనకెంతో ఉత్సాహమిచ్చిందని చెప్పడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తననెంతో ఆదరించి ఆతిథ్యమివ్వడంపై ఆమె ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మారిషస్‌ నుంచి వచ్చిన మరొకరు మాట్లాడుతూ- తాము అక్కడి నుంచి బయలుదేరే ముందు  భారత హైకమిషనర్ తమను కలిశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా భారత్‌ను “రెండో ఇల్లు”గా భావించి సందర్శించాల్సిందిగా సూచించారని తెలిపారు. అయితే, భారత్‌ వారి ‘రెండో నివాసం” మాత్రమే కాదని, వారి పూర్వికుల “తొలి నివాసం” కూడా అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, యువజన వ్యవహారాలు-క్రీడలు; కార్మిక-ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'

Media Coverage

PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over loss of lives in mishap in Tiruvallur district of Tamil Nadu
June 21, 2026

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Tiruvallur district of Tamil Nadu.

The Prime Minister conveyed his condolences to those who have lost their loved ones.

Shri Modi also prayed for the speedy recovery of the injured.

The Prime Minister’s Office posted on X;

“Deeply pained to hear about the loss of lives due to a mishap in Tiruvallur district of Tamil Nadu. My condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured: PM @narendramodi”