ఈ నెల 17న మాల్దాలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన పలు రైలు, రహదారి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపన
హౌరా-గౌహతి (కామాఖ్య) మధ్య తొలి దేశీయ వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
పూర్తి ఏసీ సౌకర్యం గల వందే భారత్ స్లీపర్ రైలుతో ఆధునిక, సౌకర్యవంతమైన, చౌకగానే సుదూర ప్రయాణానుభవం
సింగూర్, హుగ్లీలో రూ. 830 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన
బాలాగఢ్‌లో విస్తరించిన పోర్ట్ గేట్ వ్యవస్థకు శంకుస్థాపన: అంతర్గత జలరవాణా, ప్రాంతీయ అనుసంధానం బలోపేతం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 17-18 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.

జనవరి 17వ తేదీన మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు మాల్దాను సందర్శించి, మాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌లో హౌరా- గౌహతి (కామాఖ్య) మధ్య నడిచే దేశీయ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సుమారు 1:45 గంటలకు ప్రధానమంత్రి మాల్దాలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన పలు రైలు, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.

ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో సుమారు రూ. 830 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు.

మాల్దాలో ప్రధానమంత్రి కార్యక్రమాలు

ప్రధానమంత్రి మాల్దాను సందర్శించి... పశ్చిమ బెంగాల్, ఈశాన్య ప్రాంత కనెక్టివిటీని బలోపేతం చేయడం, అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ఉద్దేశించిన రూ. 3,250 కోట్ల విలువైన పలు రైలు, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

ప్రధానమంత్రి మాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌ను సందర్శిస్తారు. అక్కడ నుంచి హౌరా-గౌహతి (కామాఖ్య) మధ్య భారత తొలి వందే భారత్ స్లీపర్ రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఆధునిక భారత్‌లో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి అభివృద్ధి చేసిన పూర్తి స్థాయి ఎయిర్ కండిషన్ కలిగిన వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు చౌకలోనే విమాన ప్రయాణం లాంటి అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇది సుదూర ప్రయాణాలను వేగంగా, సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. హౌరా-గౌహతి (కామాఖ్య) మార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 2.5 గంటలు గణనీయంగా తగ్గించడం ద్వారా ఈ రైలు ఆధ్యాత్మిక పర్యటనలు, పర్యాటక రంగాలకు కొత్త ఊపునిస్తుంది.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిలో బలూర్‌ఘాట్-హిలి మధ్య కొత్త రైలు మార్గం, న్యూ జల్‌పాయ్‌గురిలో అత్యాధునిక సరుకు రవాణా నిర్వహణ సౌకర్యాలు, సిలిగురి లోకో షెడ్ ఆధునీకరణ, జల్‌పాయ్‌గురి జిల్లాలో వందే భారత్ రైలు నిర్వహణ సౌకర్యాల ఆధునీకరణలు భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రయాణికుల, సరుకు రవాణా కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు ఉత్తర బెంగాల్‌లో సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయి.

న్యూ కూచ్‌బెహార్–బామన్‌హాట్, న్యూ కూచ్‌బెహార్–బాక్సిర్‌హాట్ మధ్య రైలు మార్గాల విద్యుదీకరణను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దీనివల్ల వేగవంతమైన, పరిశుభ్రమైన, మరింత ఇంధన సామర్థ్యం గల రైలు కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయి.

4 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. న్యూ జల్పైగురి- నాగర్‌కోయిల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... న్యూ జల్పైగురి-తిరుచిరాపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... అలీపుర్‌దువార్-ఎస్ఎంవీటీ బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... అలీపుర్‌దువార్ - ముంబయి (పన్వేల్) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దీనిలో భాగంగా ఉన్నాయి. ఇది చౌకలోనే నమ్మదగిన సుదూర ప్రాంత రైలు కనెక్టివిటీని పెంచుతుంది. ఈ సేవలు సాధారణ పౌరులు, విద్యార్థులు, వలస కార్మికులు, వ్యాపారుల రవాణా అవసరాలకు మద్దతునిస్తాయి. అదే సమయంలో అంతర్-రాష్ట్ర ఆర్థిక, సామాజిక సంబంధాలనూ బలోపేతం చేస్తాయి.

ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో కూడిన రెండు కొత్త రైలు సర్వీసులు రాధికాపూర్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్, బలూర్‌ఘాట్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లనూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ రైళ్లు ఈ ప్రాంత యువతకు, విద్యార్థులకు, ఐటీ నిపుణులకు బెంగళూరు వంటి ప్రధాన ఐటీ, ఉపాధి కేంద్ర నగరాలకు ప్రత్యక్ష, సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

జాతీయ రహదారి-31డిలోని ధూప్‌గురి–ఫలకాటా విభాగాన్ని పునరుద్ధరించి, నాలుగు వరుసలుగా విస్తరించే కీలక రహదారి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ఉత్తర బెంగాల్‌లో ప్రాంతీయ రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రయాణికుల, సరుకు రవాణానూ సులభతరం చేస్తుంది.

ఈ ప్రాజెక్టులు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో, మెరుగైన కనెక్టివిటీని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతాలను దేశాభివృద్ధికి కీలక చోదకాలుగా బలోపేతం చేస్తాయి.

హుగ్లీలో ప్రధానమంత్రి కార్యక్రమాలు

హుగ్లీలోని సింగూర్‌లో రూ. 830 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు.

బాలాగఢ్‌లో అంతర్గత జలరవాణా (ఐడబ్ల్యూటీ) టెర్మినల్, రహదారి పైవంతెనతో విస్తరించిన పోర్ట్ గేట్ వ్యవస్థకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

సుమారు 900 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బాలాగఢ్‌ను... సంవత్సరానికి సుమారు 2.7 మిలియన్ టన్నుల (ఎంపీటీఏ) సామర్థ్యంతో ఒక ఆధునిక కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నారు. కంటైనర్ల ద్వారా రవాణా చేసే సరుకుల కోసం ఒకటి, పొడిగా ఉండే భారీ సరుకుల కోసం మరొకటి చొప్పున... రెండు ప్రత్యేక కార్గో హ్యాండ్లింగ్ జెట్టీల నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది.

రద్దీగా ఉండే పట్టణ కారిడార్ల నుంచి భారీ సరుకు రవాణాను మళ్లించడం ద్వారా సరుకు తరలింపు సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడం బాలాగఢ్ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. కోల్‌కతా నగరంలో వాహన రద్దీని, కాలుష్యాన్నీ తగ్గిస్తుంది. నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. మెరుగైన మల్టీమోడల్ కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యంతో ప్రాంతీయ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ ఉత్పత్తిదారులకు సరసమైన ఖర్చుతో మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది. సరుకు రవాణా, టెర్మినల్ కార్యకలాపాలు... రవాణా సేవలు... నిర్వహణ, అనుబంధ కార్యకలాపాల్లో ఉద్యోగాల కల్పన ద్వారా స్థానిక సమాజాలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

కోల్‌కతాలో అత్యాధునిక ఎలక్ట్రిక్ కాటమరాన్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ దేశీయ జల రవాణా కోసం దేశీయంగా నిర్మించిన 6 ఎలక్ట్రిక్ కాటమరాన్‌లలో ఇది ఒకటి. అధునాతన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌లు, లిథియం-టైటనేట్ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన 50 మంది ప్రయాణికుల సామర్థ్యం గల హైబ్రిడ్ ఎలక్ట్రిక్ అల్యూమినియం కాటమరాన్... పూర్తి ఎలక్ట్రిక్ జీరో-ఎమిషన్ మోడ్‌లోనూ, మరింత మన్నిక కోసం హైబ్రిడ్ మోడ్‌లోనూ పనిచేయగలదు. ఈ నౌక హుగ్లీ నది వెంబడి పట్టణ నదీ రవాణా, పర్యావరణ సంబంధిత-పర్యాటకం, మారుమూల ప్రాంతాల ప్రయాణికుల కనెక్టివిటీకి మద్దతునిస్తుంది.

జయరాంబతి–బరోగోపినాథ్‌పూర్–మాయనాపూర్ కొత్త రైలు మార్గాన్నీ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ మార్గం తార్కేశ్వర్–బిష్ణుపూర్ కొత్త రైలు మార్గం ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన భాగం. కొత్త రైలు మార్గంతో పాటు మాయనాపూర్-జయరాంబతి మధ్య బరోగోపినాథ్‌పూర్‌లో హాల్ట్‌తో కూడిన కొత్త రైలు సర్వీస్‌నూ ప్రారంభిస్తారు. ఇది బాంకురా జిల్లా నివాసితులకు ప్రత్యక్ష రైలు అనుసంధానాన్ని అందిస్తుంది. తద్వారా రోజువారీ ప్రయాణికులకు, విద్యార్థులకు, యాత్రికులకు ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా, సౌకర్యవంతంగా మారుస్తుంది.

మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వాటిలో కోల్‌కతా (హౌరా) - ఆనంద్ విహార్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... కోల్‌కతా (సీల్దా) - బనారస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్... కోల్‌కతా (సంత్రాగచ్చి) - తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's Q4 GDP growth seen at 7.3%; CNBC-TV18 poll pegs FY26 at 7.5%

Media Coverage

India's Q4 GDP growth seen at 7.3%; CNBC-TV18 poll pegs FY26 at 7.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
June 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, June 28th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.