ఓస్లోలో జరుగుతున్న మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో 2026 మే 19న ఫిన్లాండ్ ప్రధాని శ్రీ పెటెరి ఓర్పోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
డిజిటలైజేషన్, సుస్థిరతలో ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచిన నేపథ్యంలో పరిశ్రమ, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఇద్దరు నాయకులు స్పష్టం చేశారు. భవిష్యత్తు ఆర్థిక వృద్ధిని, ప్రగతిని నడిపించడంలో సుస్థిరత, డిజిటలైజేషన్ పోషించే కీలకపాత్రను వారు తెలియజేశారు. వ్యాపారం-పెట్టుబడులు, డిజిటలైజేషన్, ఏఐ, 5జీ/6జీ, క్వాంటమ్ టెక్నాలజీలు, అంతరిక్షం, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణ, విద్య, రవాణా, ప్రజల మధ్య సంబంధాల్లో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు.

అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో సాధించిన స్థిరమైన వృద్ధిని ఉభయ పక్షాలు స్వాగతించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలన్న వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే విస్తరించిన కార్యకలాపాలు, భాగస్వామ్యాల ద్వారా ఇరు మార్కెట్లలోనూ రెండు దేశాలకు చెందిన అగ్ర టెక్నాలజీ సంస్థల ఉనికి పెరగడాన్ని వారు స్వాగతించారు. ఫిన్లాండ్ టెక్నాలజీ రంగంలో వృద్ధికి, ఆవిష్కరణలకు భారతీయ నిపుణులు అందిస్తున్న గణనీయమైన సహకారాన్ని ఫిన్లాండ్ అభినందించింది. గుజరాత్లోని గాంధీనగర్లో 2026 సెప్టెంబరులో జరిగే ప్రపంచ పునర్వినియోగ ఆర్ధిక వేదికకు భారత్, ఫిన్లాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు.
ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఆత్మీయ, స్నేహపూర్వక, బహుముఖ సంబంధాలు భారత్, ఫిన్లాండ్ మధ్య ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, నార్డిక్ ప్రాంతంలో భారత్కు అత్యంత విలువైన భాగస్వామిగా ఫిన్లాండ్ ఉంది. భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం సాధించిన పురోగతి పట్ల నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే భారత్-ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం త్వరగా అమల్లోకి తీసుకురావడానికున్న ప్రాధాన్యాన్ని గుర్తించారు. ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై, అంతర్జాతీయ సంస్థల్లో సహకారాన్ని వృద్ధి చేయడంపై తమ ఆలోచనలను వారు పంచుకున్నారు.
Delighted to meet the Prime Minister of Finland, Mr. Petteri Orpo. This year has witnessed extensive engagements as far as India and Finland are concerned. PM Orpo himself had come to India for the AI Impact Summit. Our meeting today is aimed at giving new energy to bilateral… pic.twitter.com/8GvixngCVk
— Narendra Modi (@narendramodi) May 19, 2026
Oli ilo tavata Suomen pääministeri, herra Petteri Orpo. Tänä vuonna on nähty laajaa vuorovaikutusta Intian ja Suomen välillä. Pääministeri Orpo itse vieraili Intiassa AI Impact Summit -tapahtumassa. Tämänpäiväisen tapaamisemme tavoitteena on antaa uutta energiaa kahdenvälisiin… pic.twitter.com/2eEOYpCAZD
— Narendra Modi (@narendramodi) May 19, 2026


