#MannKiBaat: PM Modi shares an interesting conversation he had with Lata Mangeshkar Ji ahead of her birthday
Not only 'delivery in', think about 'delivery out' also. Share your joy with those in need: PM #MannKiBaat
On this Diwali, let us organise public programmes to honour our daughters, let us celebrate their achievements: PM Modi #MannKiBaat #BharatKiLaxmi
#MannKiBaat: e-cigarettes became a fashion statement, banned to protect youth from it's ill effects, says PM
It is a matter of great joy for India that the Pope will declare Sister Mariam Thresia a saint on October 13: PM during #MannKiBaat
Let us shun single-use plastic as a tribute to Mahatma Gandhi: PM Modi during #MannKiBaat

నా ప్రియమైన దేశ ప్రజలారా, 

నమస్కారం,

మిత్రులారా, దేశంలోని ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారి గురించి కూడా ఇవాళ్టి మన్ కీ బాత్ లో నేను మాట్లాడబోతున్నాను. మన దేశప్రజలందరి మనసుల్లోనూ వారి పట్ల ఎంతో గౌరవము, అభిమానము ఉన్నాయి. మన దేశంలో ఆమె పట్ల ఆప్యాయత, గౌరవము లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరేమో. వయసులో ఆవిడ మనందరి కన్నా ఎంతో పెద్దావిడ. దేశ చరిత్రలోని ఎన్నో మైలురాళ్ళకు, రకరకాల కాలాలకు ఆవిడ సాక్షి. మనం ఆవిడని దీదీ(అక్కయ్య) అంటాము – ఆమె "లతా దీదీ"(లత అక్కయ్య). ఈ సెప్టెంబర్ 28 నాటికి ఆవిడకి తొంభై ఏళ్ళు నిండాయి. విదేశీ ప్రయాణానికి వెళ్ళే ముందర నాకు దీదీతో మాట్లాడే అవకాశం లభించింది. ఒక చిన్న తమ్ముడు తన అక్కయ్యతో గారంగా మాట్లాడినట్లే ఆ సంభాషణ నడిచింది. ఇలాంటి వ్యక్తిగత సంభాషణల గురించి నేనెప్పుడూ మాట్లాడను కానీ ఇవాళ మీరు కూడా లతా దీదీ మాటలను, మా సంభాషణనూ వినాలని నేను కోరుకుంటున్నాను. ఈ వయసులో కూడా లతా దీదీ దేశంతో ముడిపడి ఉన్న ఎన్నో విషయాల పట్ల ఎంత ఉత్సుకతతో ఉన్నారో, తయారుగా ఉన్నారో మీరూ వినండి. భారతదేశ ప్రగతిలో, మారుతున్న భారతదేశంలో, నూతన శిఖరాలను అందుకుంటున్న భారతదేశంలోనే జీవన సంతోషం దాగి ఉంది మరి!

మోదీగారు: లతాదీదీ, నమస్కారం! నేను నరేంద్ర మోదీ ని మాట్లాడుతున్నాను.

లత గారు: నమస్కారం.

మోదీగారు: నేను ఫోన్ ఎందుకు చేసానంటే, ఈసారి మీ పుట్టినరోజునాడు..

లత గారు: ఆ.. చెప్పండి..

మోదీగారు: నేను విమాన ప్రయాణంలో ఉంటాను.

లత గారు: అలానా !

మోదీగారు: అందుకని బయల్దేరే ముందరే –

లత గారు: ఆ.. చెప్పండి..

మోదీగారు: మీకు అనేకానేక ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాను. మీ ఆరోగ్యం బాగుండాలి. మా అందరికీ మీ ఆశీస్సులు అందాలి. ఇదే నా ప్రార్థన. మీకు ప్రణామాలు తెలపాలనే అమెరికా వెళ్ళే ముందరే నేను మీకు ఫోన్ చేశాను.

లత గారు: మీ ఫోన్ వస్తుందని తెలిసి నేనెంతో ఆశ్చర్యపోయాను. మీరు ఎప్పుడు తిరిగివస్తారు?
మోదీగారు: 28వ తేదీ అర్థరాత్రి దాటాకా 29వ తేదీ తెల్లవారుఝామున. అప్పటికి మీ పుట్టినరోజు అయిపోతుంది.

లత గారు: ఓహో, అలానా. పుట్టినరోజు జరిపుకునేదేమీ లేదు. ఏదో ఇంట్లోనే..

మోదీగారు: చూడండి దీదీ, నాకు మీ..

లత గారు: మీ ఆశీర్వాదం దొరికితే..

మోదీగారు: అయ్యో, మీరు నా కన్నా పెద్దవారు కాబట్టి మీ ఆశీర్వాదాన్నే మేము కోరుకుంటున్నాం.
లత గారు: వయసులో పెద్దవారు చాలామందే ఉంటారు. కానీ ఎవరైతే తన పనుల వల్ల పెద్దవారౌతారో, వారి ఆశీర్వాదం లభించడం ఎంతో గొప్ప విషయం.

మోదీగారు: దీదీ మీరు వయసులోనూ పెద్దవారే. మీరు చేసిన పనుల వల్లా పెద్దవారే. మీరు సాధించిన సాఫల్యాలు ఎంతో సాధన వల్ల, తపస్సు వల్ల లభిస్తాయి.

లత గారు: అవునండీ, ఇదంతా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, శ్రోతల ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది. నా వల్ల జరిగినదేమీ లేదు.

మోదీగారు: జీవితంలో మీరు ఇంత సాధించిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులు అందించిన సంస్కారానికీ, వినమ్రతకీ ఎల్లప్పుడూ ప్రాముఖ్యతనివ్వడం మాకెంతో స్ఫూర్తిదాయకం. మీరు చూపే ఈ వినయమే మావంటి కొత్త తరాలవారికి, అందరికీ కూడా నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం. ఇది మా అందరికీ ఎంతో ప్రేరణాత్మకమైన సంగతి.

లత గారు: ఊ..

మోదీగారు: మీ తల్లిగారు గుజరాతీ అని మీరు గర్వంగా చెప్పినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది.

లత గారు: ఊ..

మోదీగారు: నేను ఎప్పుడు మీ వద్దకు వచ్చినా మీరు నాకు ఏదో ఒక గుజరాతీ వంటకాన్నే తినిపించారు.

లత గారు: ఔను. మీరేమిటనేది మీకు తెలీదు. కానీ నాకు తెలుసు. మీ రాక వల్ల భారతదేశం ముఖచిత్రమే మారిపోతోంది. అదే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది.

మోదీగారు: చాలు దీదీ. మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలి. యావత్ దేశానికీ మీ ఆశీర్వాదం కావాలి. మాలాంటివారు ఏదో ఒక మంచి చేస్తూ ఉండాలి. మీరు నాకెప్పుడూ ప్రేరణని అందిస్తూనే ఉన్నారు. మీ ఉత్తరాలు నాకు అందుతూ ఉంటాయి. మీరు ఎప్పుడూ పంపించే ఏవో ఒక బహుమతులు నాకు అందుతూ ఉంటాయి. ఈ ఆత్మీయత, ఒక కుటుంబంలాంటి అనుబంధం నాకెంతో ఆనందాన్ని ఇస్తాయి.

లత గారు: నేను మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టకూడదనుకుంటాను. ఎందుకంటే, మీరెంత బిజీగా ఉంటున్నారో, మీకు ఎంత పని ఉంటోందో నేను గమనిస్తున్నాను. ఎంతగానో ఆలోచించాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి మీ అమ్మగారి పాదాలంటి ఆశీర్వాదం తీసుకుని వచ్చాకా, నేను కూడా ఆవిడ వద్దకు ఎవరినో పంపించి, ఆవిడ ఆశీర్వాదాలను అందుకున్నాను.

మోదీగారు: అవును అమ్మకు గుర్తు ఉంది. నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పింది.

లత గారు: టెలీఫోన్ లో ఆవిడ నాకు ఆశీస్సులు అందించినప్పుడూ నాకు చాలా ఆనందం కలిగింది.

మోదీగారు: మీరు చూపిన ఈ అభిమానానికి అమ్మ చాలా ఆనందించింది.

లత గారు: అవును.

మోదీగారు: నా గురించి మీరిలా ఎప్పుడూ ఆదుర్దాపడుతున్నందుకు కృతజ్ఞతలు. మరోసారి మీకు అనేకానేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

లత గారు: అలాగే.

మోదీగారు: ఇటీవల ముంబై వచ్చినప్పుడు మిమ్మల్ని ముఖాముఖి కలవాలని చాలా అనుకున్నాను.

లత గారు: తప్పకుండా.. మరి రాలేదు..

మోదీగారు: సమయం లేక నేను రాలేకపోయాను.
కానీ త్వరలో నేను తప్పకుండా వస్తాను.

లత గారు: అలాగే.

మోదీగారు: మీ ఇంటికి వచ్చి , మీ చేతులతో చేసిన కొన్ని గుజరాతీ వంటకాలు తింటాను.

లత గారు: అలాగే తప్పకుండా. తప్పకుండా. ఇది నా అదృష్టంగా భావిస్తాను.

మోదీగారు: నమస్కారం దీదీ.

లత గారు: నమస్కారం.

మోదీగారు: మీకు అనేకానేక శుభాకాంక్షలు

లత గారు: అనేకానేక ప్రణామాలు.

మోదీగారు: నమస్కారం.

నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి తో పాటుగా ఇవాళ్టి నుంచీ పండుగల వాతావరణం మరోసారి కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో, కొత్త సంకల్పాలతో నిండిపోతుంది. పండుగల కాలం కదా! రాబోయే కొన్ని వారాల వరకూ దేశవ్యాప్తంగా పండుగల వెలుగు ఉంటుంది. మనందరమూ కూడా నవరాత్రి ఉత్సవాలు,గర్బా, దుర్గా పూజ, దసరా, దీపావళి, భగినీ హస్త భోజనం, ఛత్ పూజ, వంటి ఎన్నో పండుగలను జరుపుకుంటాము. రాబోయే పండుగలన్నింటీకీ, మీ అందరికీ నా తరఫున అనేకానేక శుభాకాంక్షలు. పండుగ సమయానికి కుటుంబసభ్యులందరూ కలుస్తారు. ఇళ్ళన్నీ   ఆనందంతో, కేరింతలతో నిండిపోయి ఉంటాయి. కానీ మీరు గమనించే ఉంటారు, మన చుట్టుపక్కల కూడా, ఈ పండుగల ఆనందాన్ని అందుకోలేనివారు చాలామంది ఉంటారు. దీనినే "దీపం క్రింద చీకటి" అంటారు. ఈ సామెత కేవలం అక్షరాలకే పరిమితం కాదు. ఇది మనందరికీ ఒక ఆదేశం. ఒక సాక్షాత్కారం. ఒక ప్రేరణ. ఆలోచించండి. ఒక పక్క కొన్ని ఇళ్ళు వెలుగులతో నిండి ఉంటే, మరో పక్క వారి ఎదురుగానే కొన్ని చుట్టుపక్కల ఇళ్ళల్లో చీకటి నిండి ఉంటుంది.

కొన్ని ఇళ్ళల్లో మిఠాయిలు పాడయిపోతూ ఉంటే, కొన్ని ఇళ్ళల్లో పిల్లలు మిఠాయిల కోసం తపిస్తారు. కొన్ని చోట్ల అలామారాల్లో బట్టలు పెట్టడానికి చోటే ఉండదు. కొన్నిచోట్ల శరీరాన్ని కప్పేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్నే కదా "దీపం క్రింద చీకటి" అంటారు? ఇదే "దీపం క్రింద చీకటి" అంటే! ఇలాంటి చీకట్లు తొలగినప్పుడే ఈ పండుగల నిజమైన ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. చీకటి తొలగి వెలుగు నిండాలి. ఆనందాలు లేని చోట మనం ఆనందాన్ని నింపాలి. ఇదే మన స్వభావం కావాలి. మన ఇళ్ళల్లోకి మిఠాయిలూ,  బట్టలు , బహుమతులు వచ్చినప్పుడు ఒక్క క్షణం వాటిని బయటకు పంచే మార్గాన్ని కూడా ఆలోచించాలి. కనీసం మన ఇళ్ళల్లో అధికంగా ఉన్న వస్తువులు, మనకు అవసరం లేని వస్తువులు అయినా తప్పకుండా పంచిపెట్టే అలవాటు చేసుకోవాలి. ఎన్నో పట్టణాల్లో, ఎన్నో ఎన్.జీ.వోలు యువ మిత్రుల స్టార్ట్ అప్స్ ఇటువంటి పనులు చేస్తున్నాయి. వాళ్ళు ప్రజల వద్ద నుండి బట్టలు, స్వీట్లు, భోజనం లాంటివి సమీకరించి అవసరార్థులను వెతికి వెతికి, వారికి ఈ వస్తువులన్నీ చేరుస్తారు. ఈ పనులన్నీ గుప్తంగా కూడా చేస్తారు. ఈసారి ఈ పందుగ సమయంలో పూర్తి అవగాహనతో, సంకల్పంతో ఈ " దీపం క్రింద చీకటిని " తొలగించగలమా? ఎన్నో పేద కుటుంబీకుల మొహాలపై మీరు పూయించే చిరునవ్వులు పండుగల్లో మీ ఆనందాన్ని రెండింతలు చెయ్యగలదు. మీ మోము మరింతగా మెరవగలదు. మీ ప్రమిద మరింత ప్రకాశవంతంగా మారగలదు. మీ దీపావళి మరింత వెలుగులను నింపగలదు. 

నా ప్రియమైన సోదర సోదరీమణులారా, దీపావళికి అదృష్టము, సమృధ్ది రూపాలలో లక్ష్మి ఇంటింటికీ వస్తుంది. సంప్రదాయపరంగా లక్ష్మిని స్వాగతిస్తారు. ఈసారి మనం కొత్త రకంగా లక్ష్మిని స్వాగతిద్దామా? మన సంస్కృతిలో ఆడపడుచులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. ఎందుకంటే ఆడపిల్ల అదృష్టాన్నీ, సమృధ్ధినీ తెస్తుంది. ఈసారి మనం మన సమాజంలో , పల్లెల్లో, పట్టణాల్లో ఆడబిడ్డలను గౌరవించే కార్యకమం ఏర్పాటు చేద్దామా? ఇటువంటి ఒక సార్వజనిక కార్యక్రామం ఏర్పాటు చేద్దామా? తమ కష్టంతో, పట్టుదలతో, ప్రతిభతో కుటుంబానికీ, సమాజానికీ, దేశానికీ పేరుని తీసుకువస్తున్న ఎందరో ఆడబిడ్డలు మన మధ్య ఉండే ఉంటారు. ఈ దీపావళికి అటువంటి లక్ష్ములను గౌరవించే ఈ కార్యక్రమం మనం చేయగలమా? అసాధారణమైన పనులు చేస్తున్న ఎందరో ఆడపడుచులూ, కోడళ్ళూ మన చుట్టూ ఉండే ఉంటారు. కొందరు నిరు పేద విద్యార్థులకు చదువు చెప్పే బాధ్యతను చేపడతారు. పరిశుభ్రత, ఆరోగ్యాలపై దృష్టి పెట్టి జాగురుకతని పంచే దిశలో కొందరుంటే; డాక్టర్లు, ఇంజనీర్లు గా మారి సమాజానికి సేవ చేసేవారు కొందరు, వకీలుగా మారి ఎవరికో న్యాయం చేసేందుకు పాటుపడేవారు కొందరు. మన సమాజం ఇటువంటి ఆడబిడ్డలను గుర్తించి, గౌరవించి, గర్వపడాలి. దేశవ్యాప్తంగా ఈ గౌరవ కార్యక్రమాలు జరగాలి. మనం మరో పనిని కూడా చేయగలం – ఈ ఆడబిడ్డల విజయాలను గురించి సోషల్ మీడియాలో షేర్ చేయండి, హేష్ టాగ్ #(Hashtag) ఉపయోగించిండి, #bharatkilaxmi (భారత లక్ష్మి) అని రాయండి. మనందరమూ కలిసి "సెల్ఫీ విత్ డాటర్" అనే మహా ఉద్యమాన్ని నడిపాము గుర్తుందా? అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు కూడా అలానే మనం "భారత లక్ష్మి" ఉద్యమాన్ని చేపడదాం. భారత లక్ష్మి ని ప్రోత్సహించడం అంటే దేశమూ, దేశ ప్రజల శ్రేయస్సు మార్గాలని మరింత బలోపేతం చేయడమే.
నా ప్రియమైన దేశప్రజలారా, మన్ కీ బాత్ వల్ల ఎంతో గొప్ప ప్రయోజనం ఉందని నేనింతకు మునుపు కూడా చెప్పాను. దీని వల్లనే ఎందరో పరిచిత, అపరిచిత వ్యక్తులతో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ మాట్లాడే అదృష్టం నాకు లభిస్తోంది. కొద్ది రోజుల క్రితం నాకు ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అలీనా తాయంగ్ అనే విద్యార్థిని నుంచి చాలా ఆసక్తికరమైన ఉత్తరం వచ్చింది. అందులో ఏం ఉందో , ఉత్తరాన్ని మీకు కూడా చదివి వినిపిస్తాను ..

"గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారూ,

నా పేరు అలీనా తాయంగ్.  అరుణాచల్ ప్రదేశ్ లోని రోయింగ్ నుంచి నేను రాస్తున్నాను. ఈసారి నా పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఎవరో నన్ను అడిగారు, నువ్వు  Exam Warriors  పుస్తకాన్ని చదివావా? అని. నేనా పుస్తకం చదవలేదని చెప్పాను కానీ వెళ్లి కొనుక్కుని , రెండు మూడుసార్లు చదివాను. ఆ తర్వాత నాకు చాలా మంచి జరిగింది. పరీక్షల ముందర గనుగ ఈ పుస్తకాన్ని చదివి ఉంటే ఇంకా ప్రయోజనం కలిగేది కదా అనుకున్నాను. ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు నాకు బాగా నచ్చాయి. కానీ ఇందులో విద్యార్థుల కోసం ఎన్నో చిట్కాలున్నాయి కానీ తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు ఎక్కువేమీ లేదు. ఈ పుస్తకాన్ని మరొకమారు ముద్రించే ఉద్దేశం ఉంటే గనుక కొత్త ఎడిషన్ లో తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు కూడా ఏవైనా చిట్కాలు, ఇంక వేరేమైనా విషయాలతో మొదలైనవి కలిపి ముద్రించండి"  అని ఉందా ఉత్తరంలో.

చూడండి, దేశ ప్రధాన సేవకుడికి పని అప్పగిస్తే, తప్పకుండా జరుగుతుందని నా యువ మిత్రులకి కూడా నమ్మకం ఉంది. నా చిన్నారి విద్యార్థి నేస్తం, ముందుగా నాకు ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు. Exam Warriors  రెండు,మూడుసార్లు చదివినందుకు ధన్యవాదాలు. చదివేటప్పుడు అందులో ఏమేమి పొరపాట్లు ఉన్నాయని అనిపించిందో చెప్పినందుకు కూడా అనేకానేక ధన్యవాదాలు. దీనితో పాటుగా నా చిన్నారి నేస్తం నాకు పని కూడా అప్పగించింది. నేను తప్పకుండా మీ ఆజ్ఞని పాటిస్తాను. కొత్త ముద్రణ జరిగే సమయానికి నాకు వీలైతే గనుక తప్పకుండా తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు కూడా ఏవైనా రాయడానికి ప్రయత్నిస్తాను. కానీ మీ అందరినీ నేనొకటి కోరతాను. నాకు మీరు సహాయం చేయగలరా? రోజువారీ జీవితంలో మీరు ఏమేమి భావాలను అనుభూతి చెందుతారో నాకు చెబుతారా? దేశంలోని విద్యార్థులందరినీ, తల్లిదండ్రులనీ , ఉపాధ్యాయులనూ నేను అభ్యర్థిస్తున్నాను – stress free exam తో ముడిపడి ఉన్న విషయాలను, మీ అనుభవాలనూ, మీ సూచనలను నాకు పంపించండి. నేను తప్పకుండా వాటిని చదువుతాను. చదివి, ఆలోచించి, వాటిల్లో ఏ సూచనలు నచ్చుతాయో వాటిని నా మాటల్లో, నా పధ్ధతిలో రాయడానికి ప్రయత్నిస్తాను.మీ సూచనలు ఎక్కువగా వస్తే గనుక నా కొత్త ఎడిషన్ విషయం ఖాయం అయిపోతుంది.  మీ ఆలోచనల కోసం ఎదురుచూస్తాను. అరుణాచల్ కు చెందిన చిన్నారి నేస్తం, అలీనా తాయంగ్ కి కృతజ్ఞతలు  తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, దేశ ప్రధాన మంత్రి తాలుకూ విస్తృత కార్యక్రమాలను గురించి వార్తా పత్రికలు, టీ.వీ మాధ్యమాల ద్వారా మీకు తెలుస్తూనే ఉంటుంది. తీరిక లేకుండా ఉండడం గురించి చర్చించుకుంటారు కూడానూ. కానీ నేనూ మీలాగనే ఒక సాధారణ వ్యక్తినని మీక్కూడా తెలుసు . ఒక సాధారణ పౌరుడిని. అందువల్ల ఒక సాధారణ జీవితంపై ఏ ప్రభావాలు ఎక్కువగా పడతాయో అలాంటి ప్రభావమే నా జీవితంలో నాపై కూడా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మీ మధ్య నుంచి వచ్చిన వ్యక్తినేగా! చూడండి, ఈసారి యూ.ఎస్ ఓపెన్ లో విజయాన్ని గురించి ఎన్ని చర్చలు జరిగాయో, అన్నే చర్చలు రన్నర్ అప్ గా నిలిచిన Daniil  Medvedev ప్రసంగం పై కూడా జరిగాయి. సోషల్ మీడియాలో బాగా తిరుగుతోందని నేను కూడా ఆ ప్రసంగాన్ని విన్నాను. మేచ్ కూడా చూశాను. ఇరవై మూడేళ్ళ Daniil  Medvedev నిరాడంబరత , అతడి పరిపక్వత అందరినీ ఆకట్టుకుంది. నేను మాత్రం ఎంతో ఆకర్షితుడనయ్యాను. ఈ ప్రసంగానికి కొద్ది సమయం మునుపే 19 సార్లు Grand Slam విజేత, టెన్నిస్ లెజెండ్ అయిన Rafael Nadal  చేతిలో పరాజయం పాలైయ్యాడు. ఈ స్థితిలో వేరెవరైనా ఉండి ఉంటే నిరాశగా, ఉదాసీనంగా మారిపోయి ఉండేవారు. కానీ Daniil  Medvedev మొహం వాడిపోలేదు. పైగా తన మాటలతో అందరి మొహాలపై చిరునవ్వులు తెప్పించాడు. అతడి వినమ్రత, సరళత, అతడిలో కనబడిన నిజమైన sportsman spirit చూసి అందరూ ముగ్ధులైపోయారు. అతడి మాటలను అక్కడి ప్రేక్షకులందరూ ఉత్తేజకరంగా స్వీకరించారు. విజేత Rafael Nadal ని కూడా Daniil ప్రశంసించాడు. లక్షల కొద్దీ యువ ఆటగాళ్ళకు Rafael Nadal  ఎలా ప్రేరణగా నిలిచాడో చెప్పాడు. అతడితో ఆడడం ఎంత కష్టమో కూడా చెప్పాడు Daniil . కఠినమైన పోటిలో ఓటమిని ఎదుర్కొని కూడా తన ప్రత్యర్థి నాడాల్ ని ప్రశంసించి నిజమైన sportsman spirit కి సజీవ ఉదాహరణగా నిలిచాడు Daniil . ఇంతేకాక, ఛాంపియన్ గా నిలిచిన నాడాల్ కూడా డేనీ ఆటని ఎంతో మెచ్చుకున్నాడు. ఒకే మేచ్ లో ఓటమినెదుర్కొన్న ఆటగాడి ఉత్సాహం, గెలుపొందిన ఆటగాడి వినమ్రత, రెండు చిత్రాలూ చూడతగ్గవి. ఒకవేళ మీరు Daniil  Medvedev ప్రసంగాన్ని విననివారికీ, ముఖ్యంగా యువతని తప్పకుండా ఆ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి వర్గం వారూ, ప్రతి వయసు వారూ తప్పక నేర్చుకోవాల్సినది ఉంది. గెలుపు – ఓటములకు విలువనివ్వకుండా, వాటిని అధిగమించిన క్షణాలు అవి. జీవితం గెలుస్తూనే ఉంటుంది. మన దగ్గర శాస్త్రాల్లో ఎంతో గొప్పగా ఈ విషయాన్ని చెప్పారు. మన పూర్వీకుల ఆలోచనవిధానం నిజంగా మెచ్చుకోదగినది. మన శాస్త్రాల్లో ఏమని ఉందంటే –

" విద్యయా వినయోపేతా హరతి
న చేతాంసీ కస్య మనుజస్య !
మణి కాంచన సంయోగ:
జన్యయతి లోకస్య లోచన ఆనందం "

అంటే, ఏ వ్యక్తిలో అయినా యోగ్యత, వినమ్రత ఒకేసారి ప్రవేశించినప్పుడు, అతడు ఎవరి మనసునైనా గెలవగలడు. నిజానికి, ఈ యువ ఆటగాడు ప్రపంచ ప్రజలందరి మనసులూ గెలిచేసాడు. 

నా ప్రియమైన దేశప్రజలారా, ముఖ్యంగా నా యువ మిత్రులారా, నేనిప్పుడు చెప్పబోయే విషయం, మీ మంచి కోరుతూ చెప్తున్నాను. వాగ్వివాదాలూ, పక్ష-విపక్షాలూ జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని విషయాలు ముందుకు వెళ్లకముందే ఆపేస్తే, చాలా మేలు జరుగుతుంది. బాగా చెయ్యి దాటిపోయిన విషయాలు, చాలా దూరం ప్రచారమైపోతాయి. అప్పటికి వాటిని ఆపడం కష్టమైపోతుంది. కానీ మొదట్లేనే మనం జాగ్రత్తపడి వాటిని ఆపేస్తే చాలా వరకూ కాపాడుకున్నట్లే అవుతుంది. అందువల్ల ఇవాళ ముఖ్యంగా నా యువ మిత్రులతో నేను కొన్ని విషయాలు తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను. తంబాకుని సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ దురలవాటుని మానుకోవడం కూడా చాలా కష్టం. తంబాకు సేవించేవారికి కేన్సర్, డయాబెటిస్, రక్తపోటు లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ ఇదే మాట చెప్తారు. తంబాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం మత్తుని కలిగిస్తుంది. చిన్న వయసులోనే ఈ అలవాటుకి బానిస అయితే మెదడు ఎదుగుదలపై కూడా దీని ప్రభావం పడుతుంది. కానీ ఇవాళ నేను మీతో మరో కొత్త సంగతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈమధ్య భారతదేశంలో ఈ-సిగరెట్టు పై నిషేధం విధించబడిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. మామూలు సిగరెట్టు కంటే భిన్నంగా ఉండే ఈ-సిగరెట్టు ఒక రకమైన ఎలక్ట్రానిక్ పరికరం. ఈ-సిగరెట్టు లో నికోటిన్ తో పాటూ ఒక ద్రవపదార్ధాన్ని వేడి చేయడం వల్ల ఒక రకమైన కెమికల్ పొగ ఉత్పన్నమౌతుంది. దాని ద్వారా నికోటిన్ ని సేవిస్తారు. మామూలు సిగరెట్టు వల్ల కలిగే నష్టాల గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ-సిగరెట్టు గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని పుట్టించారు. ఈ-సిగరెట్టు వల్ల ఏమీ ప్రమాదం లేదనే భ్రాంతి ప్రచారం చెయ్యబడింది. మిగతా సిగరెట్ల లాగ ఇందులోంచి దుర్గంధం వ్యాపించకుండా ఉండేందుకు ఇందులో సుగంధ రసాయనాలు కూడా కలిపేవారు. మనం చూస్తూ ఉంటాం, ఒక ఇంట్లో తండ్రి చైన్ స్మోకర్ అయితే కూడా, ఇంట్లోని మిగతా వ్యక్తులని సిగరెట్టు కాల్చకుండా ఆపుతూ ఉంటారు. పిల్లలకి సిగరెట్టు, బీడీ మొదలైన దురలవాట్లకు గురవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంలోని మరే ఇతర సభ్యుడికీ ఈ ధూమపాన దురలవాటు అవ్వకూడదనే చూస్తారు. ధూమపానం వల్ల, తంబాకు వల్ల శరీరానికి భారీ నష్టం జరుగుతుందని వారికి తెలుసు. ధూమపానం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఎలాంటి అపోహలు లేవు. దాని వల్ల నష్టం జరుగుతుంది. ఇది అమ్మేవారికి కూడా తెలుసు. సిగరెట్టు తాగేవారికీ తెలుసు. చూసేవారికీ తెలుసు. కానీ ఈ-సిగరెట్టు సంగతి పూర్తిగా భిన్నమైనది. ఇ-సిగరెట్టు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదు. దానివాల జరిగే ప్రమాదాల గురించి కూడా ప్రజలకి అసలేమీ తెలియదు. అందువల్ల అప్పుడప్పుడు కుతూహలం కారణంగా ఇంట్లోకి రహస్యంగా ఈ-సిగరెట్టు వచ్చి చేరుతోంది. అప్పుడప్పుడు, మేజిక్ చేస్తున్నాను అంటూ దీనిని పిల్లలు ఒకరికి ఒకరు చూపించుకుంటున్నారు కూడా.కుటుంబంలో తల్లిదండ్రుల ఎదురుగా కూడా కొందరు పిల్లలు ఇవాళ నేనొక మేజిక్ చూపిస్తున్నాను. నా నోట్లోంచి పొగ తెప్పిస్తున్నాను, నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నాను, దీపం వెలిగించకుండానే పొగతెప్పిస్తాను చూడండి, అంటూ ఏదో మేజిక్ షో చేస్తున్నట్లు చూపిస్తుంటే, కుటుంబసభ్యులు చప్పట్లు కూడా కొడుతున్నారు. వారికేమీ తెలియనే తెలియదు. కానీ ఒక్కసారి గనుక పిల్లలు ఈ దురలవాటులో పడితే, నెమ్మది నెమ్మదిగా వారు ఆ మత్తుకి అలవాటు పడిపోతారు. ఈ దురలవాటుకి బానిసైపోతారు. మన యువత తమకి తెలియకుండానే డబ్బుని వ్యర్థం చేసే మార్గంలో నడవడం మొదలుపెడతారు. నిజానికి ఈ-సిగరెట్టు లో ఎన్నో హానికరమైన రసాయనాలు కలుపుతారు. దాని వల్ల ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం పడుతుంది. మీకు తెలుసు , ఎవరైనా పొగ తాగుతుంటే వచ్చే వాసన వల్ల వారు సిగరెట్టు కాలుస్తున్నట్లు మనకు తెలిసిపోతుంది. వారి జేబులో సిగరెట్టు పేకెట్ లేకపోయినా వాసన వాల్ల తెలిసిపోతుంది. కానీ ఇ-సిగరెట్టు తో అలా కాదు. అందువల్ల, ఎందరో పిల్లలు, యువత, తెలిసీ తెలియక, ఫ్యాషన్ అనుకుంటూ చాలా గర్వంగా పుస్తకాల మధ్యన, ఆఫీసుల్లో, తమ జేబుల్లో, అప్పుడప్పుడూ చేతుల్లో కూడా ఈ-సిగరెట్టు తో తిరుగుతూ కనిపిస్తున్నారు. దానికి అలవాటు పడిపోతున్నారు. యువత అంటే మన దేశ భవిష్యత్తు. ఈ కొత్త రకం మత్తులో యువత చెడుదోవలో పడకుండా, దేశము, వారి జీవితాలూ నాశనమవకుండా ఉండాలని, కుటుంబాలలోని కలలు తుడిచిపెట్టుకుపోకూడదని, ఈ మత్తు రోగం, ఈ దురలవాటు సమాజంలో వేళ్లతో పాతుకుపోకూడదని ఈ-సిగరెట్టు పై నిషేధం విధించబడింది. 
నేను మీ అందరినీ కోరేదేమిటంటే తంబాకు వ్యసనాన్ని వదిలిపెట్టండి, ఈ-సిగరెట్టు గురించిన ప్రలోభాలకి గురికాకండి. రండి, మనందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మిద్దాం.

అవునూ, మీకు ఫిట్ ఇండియా గుర్తుందా? ఫిట్ ఇండియా అంటే పగలూ, సాయంత్రం రెండేసి గంటలు జిమ్ లోకి వెళ్ళి చేతులూ కాళ్ళూ ఆడించడం కాదు. పైన చెప్పిన దురలవాట్ల నుండి దూరంగా ఉండటమే ఫిట్ ఇండియా అంటే. నా మాటలు మీకు తప్పుగా అనిపించవు. మీరు నా మాటలని తప్పకుండా మంచిగానే తీసుకుంటారని నా నమ్మకం.

నా ప్రియమైన సోదర సోదరీమణులారా, తమ కోసం కాకుండా ఇతరుల కోసం తమ జీవితాలని త్యాగం చేసిన అసాధారణ వ్యక్తులను కన్న జన్మ భూమి, కర్మ భూమి మన భారతదేశం. ఇటువంటి దేశంలో పుట్టడం మనందరి అదృష్టం.

మన భారతదేశం, మన భారత మాత, ఎందరో రత్నాలను కన్న వసుంధర. ఎందరో రత్నాల్లాంటి అసాధారణ వ్యక్తులకు మన భారతదేశం జన్మ భూమి అయ్యింది. కర్మ భూమి అయ్యింది. వారంతా కూడా తమ తమ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఒకరిని అక్టోబర్ 13వ తేదీన వాటికన్ సిటీ లో సన్మానించబోతున్నారు. ఇది భారతీయులందరూ ఎంతో గర్వించదగ్గ విషయం. పోప్ ఫ్రాంసిస్ రాబోయే అక్టోబర్ 13వ తేదీన మరియం ట్రేసియా ని సన్యాసినిగా గౌరవంగా ప్రకటించబోతున్నారు. సిస్టర్ మరియం ట్రేసియా తన ఏభై ఏళ్ల పరిమిత జీవనకాలంలో మానవత్వం కోసం, మానవుల మేలు కోరి చేసిన మంచి పనులు యావత్ ప్రపంచానికే ఒక ఉదాహరణ. సమాజ సేవ, విద్యారంగాలలో ఆవిడకి అద్భుతమైన ఆసక్తి ఉంది. ఆవిడ ఎన్నో పాఠశాలలూ, హాస్టళ్ళూ, అనాథశరణాలయాలూ నిర్మించారు. తన జీవిత పర్యంతం ఆవిడ ఇదే ఉద్యమం మీద దృష్టి నిలిపారు. సిస్టర్ ట్రేసియా ఏ పని చేసినా శ్రధ్ధతో, పట్టుదలతో, పూర్తి సమర్పణాభావంతో పూర్తి చేశారు. ఆవిడ Congregation of the Sisters of the Holy Family ని స్థాపించారు. అది ఇవాళ కూడా ఆవిడ జీవితాదర్శాలను, మిషన్ నీ ముందుకు నడిపిస్తోంది. నేను మరొక సారి సిస్టర్ మరియం ట్రేసియాకు శ్రధ్ధాంజలిని సమర్పిస్తున్నాను. భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా మన క్రైస్తవ సోదర సోదరిమణులకు, ఈ గుర్తింపు సందర్భంగా అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు మనం గాంధీజీ 150 వ జన్మదినం జరుపుకోవడం భారతదేశమే కాక యావత్ ప్రపంచం గర్వించదగ్గ విషయం. 130కోట్ల దేశప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందాలని సంకల్పించారు. పర్యావరణని సంరక్షించే మార్గంలో, యావత్ ప్రపంచంలో భారతదేశం తీసుకున్న మార్గదర్శకత్వాన్ని చూసి ఎన్నో దేశాలు భారతదేశం పై తమ దృష్టిని సారించాయి. అక్టొబర్ రెండు నుంచీ జరగబోయే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందే ఉద్యమంలో మీరంతా పాలుపంచుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. పలుచోట్ల ప్రజలు తమ తమ పధ్ధతులలో ఈ ఉద్యమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మన దేశానికి చెందిన ఒక యువకుడు ఒక చిత్రమైన పెద్ద ఉద్యమాన్ని నడిపించాడు. అతడి పని నా దృష్టికి వచ్చింది. అతడు చేసే ఈ కొత్త ప్రయోగం గురించి నేను అతనితో ఫోన్ లో మాట్లాడి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అతడి మాటలు దేశంలోని మిగతా ప్రజలకి కూడా పనికి వస్తాయేమో! 

శ్రీ రిపుదమన్ బెవ్లి గారు ఒక చిత్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన  Plogging  చేస్తారు. Plogging అన్న పదం వినడం నాకూ మొదటిసారి. విదేశాలలో ఈ పదం ఉపయోగిస్తారేమో కానీ భారతదేశంలో  రిపుదమన్ బెవ్లి గారు దీనిని ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. రండి, ఆయనతో కాసేపు మాట్లాడదాం –

మోదీ గారు: హలో రిపుదమన్ గారూ, నమస్కారం! నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నాను.

రిపుదమన్: ధన్యవాదాలు సార్.

మోదీ గారు: రిపుదమన్ గారూ, మీరు Plogging పేరుతో అంకిత భావంతో పని చేస్తున్నారు. 

రిపుదమన్: అవును సార్.

మోదీ గారు:అందువల్ల , నేను స్వయంగా ఫోన్ చేసి మిమ్మల్ని వివరాలు అడుగుదామని నా మనసులో కుతూహలం కలిగింది. 

రిపుదమన్: చెప్పండి సర్

మోదీ గారు: మీ మనసులోకి ఈ ఆలోచన ఎలా వచ్చింది?

రిపుదమన్: అవును సర్

మోదీ గారు: ఈ పదం, ఈ పధ్ధతి మీ మనసులోకి ఎలా వచ్చింది?

రిపుదమన్: సర్, ఇవాళ యువతకు అంతా కూల్ గా కావాలి. వారికి ఏదైనా ఆసక్తికరంగా ఉండాలి. నేను మోటివేట్ అయ్యాను కానీ యువతని మోటివేట్ చెయ్యడానికి ఏదైనా ఆసక్తికరంగా ఉండాలి. 130కోట్ల భారతీయులని ఈ ఉద్యమంలో జోడించాలంటే ఏదైనా కూల్ గా, ఆసక్తికరంగా చెయ్యాలనుకున్నాను. నేను స్వయంగా ఒక రన్నర్ ని. పొద్దుటే మేము పరిగెడుతుంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. జనం తక్కువగా ఉంటారు. రోడ్లపై చెత్తాచెదారం, ప్లాస్టిక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదంతా చూసి ఫిర్యాదు చెయ్యడం, తిట్టుకోవడం కాకుండా ఏదైనా చెయ్యాలని నేను అనుకున్నాను. మా రన్నింగ్ గ్రూప్ సాయంతో ఢిల్లీలో ఇది మొదలుపెట్టాను. తర్వాత యావత్ భారతాదేశానికీ దీనిని పరిచయం చేసాను. ప్రతి చోట నుంచీ ఎన్నో ప్రశంసలు లభించాయి.

మోదీ గారు: మీరు ఎగ్జాక్ట్ గా ఏం చేసేవారు? కాస్త నాకు అర్థం అయ్యేలా , మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా దేశప్రజలకు కూడా తెలిసేలా వివరించండి. 

రిపుదమన్: సర్, మేము ‘Run & Clean-up Movement’ ని మొదలుపెట్టాము. మా రన్నింగ్ గ్రూప్స్ కి, వారి వర్క్ అవుట్ అయిపోయాకా, కూల్ డౌన్ ఏక్టివిటీ సమయంలో చెత్తను ఎత్తే పనిని చేపట్టాలని కోరాము. మీఅంతట మీరే ప్లాస్టిక్ ఏరడం మొదలుపెట్టండి. రన్నింగ్ తో పాటూ క్లీనింగ్ కూడా అయిపోతుంది. దీనివల్ల తెలియకుండానే ఎంతో వ్యాయామం కలిసివస్తోంది. దీని వల్ల మీరు కేవలం రన్నింగే కాకుండా, squats చేస్తున్నారు, deep squats చేస్తున్నారు, lunges చేస్తున్నారు , forward bent చేస్తున్నారు, దీనివల్ల ఇది ఒక  holistic work out  అయిపోయింది | గత ఏడాది ఎన్నో  fitness పత్రికలలో భారతదేశంలో  Top fitness trend అంటూ మా పనిని nominate చేశారు.

మోదీ గారు: ఇందుకు గానీ మీకు నా అభినందనలు

రిపుదమన్: ధన్యవాదాలు సర్

మోదీ గారు: ఇప్పుడు సెప్టెంబర్ 5 నుండీ మీరు కొచ్చిన్ నుండి ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారా?
రిపుదమన్: అవును సర్. ఈ మిషన్ పేరు " ‘R|Elan Run to make  India Litter Free’ . ఎలాగైతే మీరు అక్టోబర్ 2న ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇవ్వాలన్నారో, అలానే చెత్త నుంచి విముక్తి లభిస్తే ప్లాస్తిక్ నుంచి కూడా విముక్తి లభిస్తుందని నాకు నమ్మకం ఉంది .  ఇది ఒక వ్యక్తిగత బాధ్యతగా మారుతుందని నేను నమ్ముతున్నాను. నేను ఏభై పట్టణాలలో , వెయ్యి కిలోమీటర్ల దూరం పరిగెడుతూ క్లీనింగ్ చేస్తున్నాను. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్లీనప్ డ్రైవ్ అవుతుందని అందరూ అంటున్నారు. దీనితో పాటుగా మేము సోషల్ మీడియాలో #(Hashtag) ని ఉపయోగించాము. #PlasticUpvaas అని పెట్టి, అక్కడ ప్రజలు తమ జీవితంలో ప్లాస్టిక్ నే కాకుండా సింగిల్ యూజ్ చేసే ఏ వస్తువునైనా తమ జీవితాలలోంచి తీసేస్తాము అని  చెప్పవలసిందిగా ప్రజలని కోరుతున్నాము. 

మోదీ గారు: అద్భుతం! అయితే సెప్టెంబర్ 5న మీరు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టినప్పటి నుంచీ మీ అనుభవాలేమిటి?

రిపుదమన్: ఇప్పటివరకూ అయితే చక్కని అనుభవాలు ఎదురైయ్యాయి. గత రెండేళ్ళలో కూడా యావత్ భారతదేశంలో మేము 300 Plogging drives చేశాము. మేము కొచ్చిన్ లో మొదలుపెట్టాకా రన్నింగ్ గ్రూప్స్ జాయిన్ అయ్యాయి. అక్కడ ఉన్న స్థానిక క్లీనప్ గ్రూప్స్ ని నేను మాతో కలుపుకున్నాను. కొచ్చిన్ తర్వాత మధురై, కోయంబత్తూర్, సేలం లలో తిరిగాము. ఇప్పుడే మేము ఉడుపీ లో పూర్తిచేసాము. అక్కడ ఒక పాఠశాల వారు మమ్మల్ని ఆహ్వానించారు. మూడు నుంచీ ఆరవ తరగతి వరకూ చదివే చిన్న చిన్న పిల్లలకు ఒక వర్క్ షాప్ ఇవ్వమని ఒక ఆరగంట సేపు ఉండమని ఆహ్వానించారు. అరగంట వర్క్ షాప్ మూడు గంటల Plogging drive అయ్యింది. పిల్లలు ఎంత enthusiastic   గా ఉన్నారంటే that they wanted to do this and they wanted to take it back . తల్లిదండ్రులకూ, చుట్టుపక్కలవారికీ, తోటివారి  కి చెప్పాలని పిల్లలకి అనిపించడమే అతి పెద్ద motivation.  అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

మోదీ గారు: రిపూ గారూ, ఇది పరిశ్రమ కాదు ఒక సాధన. మీరు నిజంగా ఒక సాధన్ చేస్తున్నారు.

రిపుదమన్: అవును సర్

మోదీ గారు: నా తరఫున అనేక అధన్యవాదాలు. మీరు దేశప్రజలతో మూడు మాటలు చెప్పాలి అని అడిగితే, ఏం చెప్తారు? 

రిపుదమన్: చెత్త రహిత భారతదేశం కోసం నేను మూడు స్టెప్స్ చెప్పాలనుకుంటున్నాను. 

1 . చెత్తను చెత్త కుండీలో మాత్రమే వెయ్యండి.
2 .ఎదైనా సరే బయట చెత్త కనిపిస్తే దానిని తీసి చెత్త కుండీలో వెయ్యండి.
3. చెత్త కుండీ కనిపించకపోతే మీ బండిలో, మీతో మీ ఇంటికి తీసుకువెళ్ళి, 
తడి చెత్త, పొడి చెత్తలను విడదీసి, మీ ఇంట్లోని చెత్తడబ్బాలో వెయ్యండి. పొద్దుట మున్సిపాలిటి చెత్తబండి వచ్చినప్పుడు వారికి ఇచ్చివేయండి.
ఈ మూడు స్టెప్స్ అందరూ పాటిస్తే మనం చెత్త రహిత భారతదేశాన్ని చూడగలము.

మోదీ గారు: చూడండి రిపూ గారూ, ఎంతో సరళమైన పదాలలో, సాధారణ పౌరుడు కూడా అర్థమయ్యే భాషలో వారు పాటించే విధంగా, గాంధీ గారి కలలనే మీతో పాటుగా నడిపిస్తున్నారు. ఇంతేకాక గాంధీగారిలాగనే, విషయాన్ని సరళమైన పదాలతో చెప్పే పధ్ధతిని కూడా మీరు అలవరుచుకున్నారు.

రిపుదమన్: ధన్యవాదాలు.

మోదీ గారు: అందుకనే మీరు ప్రశంసనీయులు. మీతో మాట్లాడితే నాకు చాలా బాగుంది. మీరు ఎంతో వినూత్న పధ్ధతిలో , ముఖ్యంగా యువతకు నచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నేను మీకు అనేక అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా, ఈసారి గాంధీ జయంతి సందర్భంగా క్రీడా మంత్రాలయం కూడా ‘Fit India Plogging Run’  ప్రారంభించబోతోంది.అక్టోబర్  2న యావత్ భారతదేశంలో రెండు కిలోమీటర్ల ప్లాగింగ్ జరగబోతోంది. ఈ కార్యక్రమం ఎలా జరగాలి, ఈ కార్యక్రమంలో ఏం చేస్తాము అనేది రిపుదమన్ గారి అనుభవాల నుండి మనం తెలుసుకున్నాము.అక్టోబర్  2 నుండి మొదలవబోయే ఈ ఉద్యమంలో మనందరం రెందు కిలోమీటర్ల జాగింగ్ తో పాటూ, దారిలో ఎదురయ్యే ప్లాస్టిక్ ని కూడా జమ చెయ్యాలి. దీనివల్ల మనం మన ఆరోగ్యంతో పాటూ, పుడమితల్లి ఆరోగ్యాన్ని కూడా రక్షించినవాళ్లం అవుతాము. ఈ ఉద్యమం వల్ల ప్రజలలో ఫిట్నెస్ తో పాటూ పరిశుభ్రత పై కూడా అవగాహన పెరుగుతోంది. 130 కోట్ల దేశప్రజలందరూ ఈ ఉద్యమం దిశగా తలో అడుగూ వేస్తే , సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందే దిశగా మన భారతదేశం 130 కోట్ల అడుగులు ముందుకు వెళ్తుంది.

రిపుదమన్ గారూ, మరోసారి మీకు అనేకానేక ధన్యవాదాలు. మీకూ, మీ జట్టు కీ, ఈ సృజనాత్మక ప్రయోగానికీ, నా తరఫున అనేకానేక అభినందనలు. ధన్యవాదాలు.

నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్  2 కోసం యావత్ భారతదేశంలో, ప్రపంచంలో సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ  మేము గాంధీ 150 ని కర్తవ్యపథం వైపు నడిపించాలని అనుకుంటున్నాము. దేశహితం కోసం మన జీవితాలలో మార్పులు చేసుకుంటూ ముందుకి నడుద్దాం. ఒకసారి ముందుగా గుర్తుచెయ్యాలనుకుంటున్నాను. రాబోయే మన్ కీ బాత్ లో దీని గురించి విస్తారంగా వివరిస్తాను కానీ ఈసారి నేను కొంచెం ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు తయారుగా ఉంటారని.
మీకు గుర్తుందా? అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి అని మీకు గుర్తుండే ఉంటుంది. "ఏక్ భారత్, స్రేష్ఠ భారత్" అనేది మనందరి కల. ఇందుకోసమే ప్రతి ఏడాదీ అక్టోబర్ 31 న మనం యావత్ దేశంలో "రన్ ఫర్ యూనిటీ" పేరుతో దేశ సమైక్యత కోసం పరుగు ని నిర్వహిస్తున్నాం. ప్రజలు అందరూ , వృధ్ధులు, స్కూల్ ,కాలేజీలలో అందరూ, భారతదేశంలోని లక్షల పల్లెల్లో ప్రజలు కూడా ఆరోజున దేశ సమైక్యత కోసం పరుగుపెట్టాలి. మీరు ఇప్పటి నుందే తయారీ మొదలుపెట్టండి. ఇంకా సమయం ఉంది. దీని గురించి వివరంగా తర్వాత చెప్తాను. కొందరు ప్రాక్టీస్ మొదలుపెట్టచ్చు, ప్రణాళికలు తయారుచేసుకోవచ్చు.

మీకు గుర్తుందే ఉంటుంది, ఆగస్టు 15న ఎర్ర కోట బురుజు నుండి నేను చెప్పాను, 2022 వరకూ మీరు భారతదేశంలోని ఏవైనా పదిహేను యాత్రా ప్రదేశాలకు వెళ్లమని చెప్పాను. వీలైతే ఒకటి, రెందు రాత్రులు ఉండేలాగ ప్రయత్నించమని చెప్పాను.  భారతదేశాన్ని మీరు చూడండి. అర్థం చేసుకోండి. అనుభూతి చెందండి. మన వద్ద ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయో, దీపావళి పండుగ సమయంలో సెలవులు వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా వెకేషన్ కి వెళ్తారని నేను మళ్ళీ చెప్తున్నాను. భారతదేశంలోని ఏవైనా పదిహేను యాత్రా ప్రదేశాలకు తప్పక వెళ్లమని చెప్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, మొన్ననే సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకున్నాం. ప్రపంచంలోని కొన్ని సంస్థలు పర్యాటక రంగంలో రేంకింగ్ లు కూడా ఇస్తాయి. మన భారతదేశం ట్రావెల్ అండ్ టూరిజమ్ కాంపిటీటివ్ ఇండెక్స్ లో ఎంతో ప్రగతి సాధించిందని తెలుసుకుంటే మీరంతా సంతోషపడతారు. ఇదంతా మీ అందరి సహకారం వల్లనే జరిగింది. ముఖ్యంగా మీరు పర్యటన ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నందు వల్లే ఇది జరిగింది. ఇందులో పరిశుభ్రత ఉద్యమం సహకారం కూడా ఎంతో ఉంది. ఈ మార్పు ఎమ్త ఉందో చెప్పనా మీకు? మీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది. ఇవాళ మన ర్యాంకు 34. ఐదేళ్లక్రితం మన ర్యాంక్ 65. అంటే మనం చాలా పెద్ద జంప్ నే చేశాము. మనం గనుక ఇంక ప్రయత్నం చేస్తే, స్వాతంత్రం వచ్చిన 75 వసంతాల లోపే మనం టూరిజంలో ప్రపంచంలోని ప్రముఖ స్థానాల్లో మనకంటూ స్థానాన్ని సంపాదించుకోగలము.

నా ప్రియమైన దేశ ప్రజలారా, మీ అందరికీ మరోసారి వైవిధ్యాలతో నిండిన భారతదేశంలోని వేరు వేరు పండుగల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. దీపావళి సంబరాలలో టపాసులు కాల్చేప్పుడు , అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఎవరికీ నష్టం కలగకుండా, వ్యక్తులకు హాని జరగకుండా జాగ్రత్త పడండి. ఇందుకోసం మీరు వ్యక్తపరచవలసిన అభ్యంతరాలను నిశ్చితంగా వ్యక్తపరచండి. ఆనందమూ ఉండాలి. సంతోషమూ ఉండాలి. ఉత్సాహమూ ఉండాలి. మన పండుగలు సామూహిక  సంస్కారాన్ని , పరిమళాలను కూడా పంచుతాయి. సామూహిక జీవితమే ఒక కొత్త సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆ కొత్త శక్తే సాధనకు స్థానం. అదే పండుగ. రండి, కలసిమెలసి ఉత్సాహంతో, ఆశలతో, కొత్త కలలతో, కొత్త సంకల్పాలతో మనం పండుగలను జరుపుకుందాం.

మరోసారి అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s growth: by the numbers, for the numbers, of the numbers

Media Coverage

India’s growth: by the numbers, for the numbers, of the numbers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to Visit Gujarat and Maharashtra on 8th September
September 07, 2026
PM to Lay Foundation Stones, Inaugurate and Dedicate to the Nation Development Projects Worth More Than ₹35,000 Crore in Vadodara
PM to Dedicate Three Key Sections of Western Dedicated Freight Corridor to the Nation, Marking Completion of the Project
PM to Lay Foundation Stone for three Railway Projects and three Highway Projects
PM to Inaugurate Global Fintech Fest 2026 in Mumbai
Theme of GFF 2026: “Potential to Impact: Agentic AI, Tokenisation, Quantum - Trusted, Connected, Global Systems for Inclusive Finance”

Prime Minister Shri Narendra Modi will visit Gujarat and Maharashtra on 8th September 2026. At around 12 noon, Prime Minister will lay the foundation stones, inaugurate and dedicate to the nation various development projects worth more than ₹35,000 crore in Vadodara. He will also address the gathering on the occasion.

At around 5:45 PM, Prime Minister will inaugurate Global Fintech Fest (GFF) 2026 in Mumbai and address the gathering as well.

PM in Vadodara

Prime Minister will dedicate to the nation three important sections of the Western Dedicated Freight Corridor (WDFC), covering 326 route kilometres and developed at a cost of more than ₹20,700 crore. These include the New Sanand (N)- New Makarpura, New Umbergaon-New Saphale and New Saphale- New JNPT sections.

The direct connectivity of Jawaharlal Nehru Port Authority (JNPA) will facilitate faster movement of EXIM cargo, strengthen connectivity between industrial centres and ports, reduce logistics costs and help decongest Mumbai’s railway network.

With the commissioning of these sections, the Dedicated Freight Corridor (DFC) network will stand fully operational across its entire length. The dedicated freight infrastructure will further strengthen the country’s logistics ecosystem by improving multimodal connectivity, reducing transit time and facilitating seamless movement of cargo across different regions.

Prime Minister will also flag off freight train services from New Sanand (North), New Makarpura, New Umbergaon and New JNPT, Mumbai. In addition, he will flag off a new passenger train service between Tanda Road and Vadodara (Pratapnagar).

Prime Minister will dedicate to the nation the Jobat–Tanda Road new rail line, developed as part of the Chhota Udepur–Dhar project. The new rail line will connect remote and tribal areas of Alirajpur with the national rail network.

Prime Minister will lay the foundation stone for three railway projects spanning 329 kilometres and costing more than ₹9,700 crore. These include the Vadodara-Ratlam third and fourth lines, Miyagam Karjan-Choranda–Malsar gauge conversion and the Vishwamitri-Dabhoi doubling project. The projects will enhance passenger and freight capacity, ease congestion and strengthen connectivity between Gujarat and Madhya Pradesh.

Prime Minister will lay the foundation stone for three National Highway projects costing around ₹1,780 crore. These include six-laning of the Kamrej-Chalthan section of NH-48; construction of additional structures, including major bridges over the Tapi and Narmada, on the Vadodara-Surat section of NH-48; and grade-separated structures at Abhava, Mindhola and Khajod junctions on NH-53.

Prime Minister will also lay the foundation stone for and inaugurate various Government of Gujarat projects worth around ₹2,600 crore. Major projects for which the foundation stone will be laid include Vadodara Urban Development Authority Ring Road Phase II and a 110 MW floating solar project at Kadana Dam, construction of new office of Vadodara Municipal Corporation, among others. Projects to be inaugurated include housing projects under the Pradhan Mantri Awas Yojana (PMAY) and a water-supply project for 11 villages in eastern Vadodara, among others.

PM in Mumbai

Prime Minister will inaugurate Global Fintech Fest (GFF) 2026, one of the world’s largest and most influential annual fintech conferences.

The seventh edition of the Global Fintech Fest is being held from 8th to 11th September 2026 in Mumbai. Since 2020, GFF has emerged as an international thought leadership platform bringing together policymakers, regulators, central banks, financial institutions, fintechs, technology companies, investors, academia and other global stakeholders to deliberate on shaping the future of finance.

The theme of GFF 2026 is “Potential to Impact: Agentic AI, Tokenisation, Quantum - Trusted, Connected, Global Systems for Inclusive Finance.”

GFF 2026 has been designed as a convergence point for policy, regulation, technology, capital and industry on a common platform. It seeks to build on India’s leadership in digital payments and financial inclusion and move from potential to impact. The discussions will focus on how Agentic AI, programmable finance, quantum technologies and other critical and emerging technologies can create trusted, inclusive and measurable outcomes for citizens, enterprises and economies globally.